Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భ‌వ‌న్‌ లో సిటి గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ (సిజిడి) 9వ బిడ్డింగ్ రౌండ్ లో భాగం గా సిజిడి ప్రాజెక్టు ల‌కు శంకుస్థాప‌న సంద‌ర్భం గా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగం


వేదిక‌ ను అలంకరించిన నా మంత్రివర్గ స‌హ‌చ‌రులు ధ‌ర్మేంద్ర ప్ర‌ధాన్ గారు, డాక్ట‌ర్ హ‌ర్ష‌వ‌ర్ధ‌న్ గారు, సాంకేతిక విజ్ఞానం స‌హాయం తో దేశం లోని వివిధ ప్రాంతాల‌ నుండి మ‌న‌ తో జతపరచబడిన వారు, బిడ్డింగ్ ప్ర‌క్రియ కై ఇక్క‌డకు తరలివచ్చిన పారిశ్రామిక వేత్త‌లు, ఈ రోజు న ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రైన ప్ర‌ముఖులు,

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

భార‌త‌దేశ ఉజ్వ‌ల భవిష్య‌త్తు కోసం, కీల‌క‌మైన ల‌క్ష్యాల‌ను ఈరోజుల్లో ఎంత‌టి ప‌ట్టుద‌ల‌ తో పూర్తి చేయ‌బ‌డుతున్నాయో మ‌న‌మంతా ప్ర‌స్తుతం చూస్తున్నాం.  భ‌విష్య‌త్తు త‌రం మౌలిక స‌దుపాయాల అభివృద్ధి దిశ‌ గా ఈ రోజు గొప్ప ముంద‌డుగు ప‌డిన రోజు గా చెప్పుకోవ‌చ్చు.  9 వ బిడ్డింగ్ రౌండ్‌ తో, దేశం లోని 129 జిల్లాల్లో సిటీ గ్యాస్ పంపిణీ నెట్‌వ‌ర్క్ ఏర్పాటు ప్రారంభ‌మౌతుంది.  దీని తో పాటు 10వ బిడ్డింగ్ ప్ర‌క్రియ కూడా ప్రారంభ‌ం అయింది.

ఈ ప‌నులు పూర్త‌ి అయితే వీటి ఫ‌లితాలు చెప్పుకోద‌గిన స్థాయి లో ఉంటాయి. అందువ‌ల్ల ఈ ప్రాజెక్టుల ప‌నుల ప్రారంభాన్ని కీల‌క‌మైన విష‌యం గా చెప్పుకోవ‌చ్చు. 10 వ బిడ్డింగ్ పూర్తి త‌రువాత ప‌నులు ప్రారంభ‌ం అయితే, దేశం లోని 400కు పైగా జిల్లాలు సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూశన్ నెట్ వ‌ర్క్ ప‌రిధి లోకి వ‌స్తాయి.  దీనివ‌ల్ల దాదాపు 70 శాతానికి పైగా ప్ర‌జ‌లు ప్ర‌యోజ‌నం  పొందుతార‌ని నా దృష్టి కి వ‌చ్చింది.  ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి దేశ అభివృద్ధి కి సంబంధించి ఇది ఎంతో కీల‌క‌మైంది.

మిత్రులారా,

2014 వ‌రకు దేశం లో కేవ‌లం 66 జిల్లాలు గ్యాస్ పంపిణీ నెట్‌వ‌ర్క్ లో సంధాన‌మై ఉన్నాయి.  అంత వ‌ర‌కు మాత్ర‌మే ఏర్పాటు ఉండేది.  కానీ ప్ర‌స్తుతం సిటి గ్యాస్ 174 జిల్లాల్లో అందుబాటు లోకి వ‌చ్చే  ఏర్పాట్లు జ‌రుగుతున్నాయి.  రాగ‌ల 2-3 సంవ‌త్స‌రాల‌ లో 400కు పైగా జిల్లాల‌కు ఇది చేరుతుంది.

ఇవి ప్రాధాన్య‌ం లేని గ‌ణాంకాలు కాదు.  గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్య‌వ‌స్థ దిశ‌ గా మ‌న న‌గ‌రాలు ఎంత‌టి గ‌ట్టి చ‌ర్య‌లు చేప‌ట్టాయో ఇది తెలియ జేస్తోంది.  2014లో 25 ల‌క్ష‌ల ఇళ్ల‌ కు గొట్టపుమార్గం ద్వారా గ్యాస్ స‌ర‌ఫ‌రా ఏర్పాటు ఉండేది.  గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల‌లో ఇది దాదాపు రెండు రెట్లు పెరిగింది.  ఈ న‌గ‌రాల‌లో ప‌నులు ప్రారంభ‌మైన త‌రువాత ఈ సంఖ్య రెండు కోట్ల‌ కు మించనుంది.  అలాగే, 2014లో దేశం లో 947 సిఎన్‌జి స్టేశన్ లు ఉండేవి.  ఇంకొక విష‌యాన్ని కూడా మ‌రచిపోవ‌ద్దు.  25 సంవ‌త్స‌రాల క్రితమే  ఢిల్లీ, ముంబయి, సూర‌త్ న‌గ‌రాల‌కు సిఎన్‌జి స్టేశన్ లు వ‌చ్చాయి.  దేశం లో ఏర్పాటైన సిఎన్‌జి స్టేశన్ ల సంఖ్య 2014 నాటి కి 947 కు చేరుకున్నాయి.  అంటే స‌గటు న సంవ‌త్స‌రాని కి 40 స్టేశన్ లు ఏర్పాట‌య్యాయి. ఇప్పుడు వీటి సంఖ్య సుమారు 1470 కి పైగా పెరిగాయి.  ఒక అంచ‌నా ప్ర‌కారం, రాగ‌ల ద‌శాబ్దం ముగిసే నాటికి సిఎన్‌జి స్టేశన్ ల సంఖ్య 10 వేలు దాటుతాయి.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

కేంద్ర ప్ర‌భుత్వ నిరంత‌ర‌ శ్ర‌మ ఫ‌లితం గా సిటి గ్యాస్ పంపిణీ నెట్‌ వ‌ర్క్ రేటు గ‌తం తో పోల్చిన‌పుడు, దేశం లో శ‌ర‌వేగం తో అభివృద్ధి చెందుతోంది.  పంపిణీ, నిల్వ‌ కేంద్రాలు, ఈ రంగానికి సంబంధించి న ఇత‌ర స‌మ‌స్య‌ ల‌ను ఒక‌దాని వెంట మరొక‌టి గా ప‌రిష్క‌రించ‌డానికి మేం కృషి చేశాం.  ‘రిఫార్మ్‌, పెర్‌ఫార్మ్‌, ట్రాన్స్‌ఫార్మ్’ అనేవి ఈ రంగాని కి వ‌ర్తించే క‌చ్చిత‌మైన ఉదాహ‌ర‌ణ‌లు గా చెప్పుకోవ‌చ్చు.  ఈ దిశ‌ గా తీసుకున్న చ‌ర్య‌లు, గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌ లో  ప్ర‌భుత్వం తీసుకువ‌చ్చిన సంస్క‌ర‌ణ‌లు ఈ రంగం ప‌నితీరు ను మెరుగుప‌రచాయి.  మ‌నం ప‌రివ‌ర్త‌న శ‌కం లో ఉన్నాం.

మిత్రులారా,

మ‌న దేశం 2022 వ సంవత్సరానికల్లా స్వాతంత్ర్యం సాధించి 75 సంవ‌త్స‌రాలు పూర్తి చేసుకుంటుంది.  మ‌న దేశాన్ని గొప్ప‌ భార‌త‌దేశాన్ని, న్యూ ఇండియా ను, ఆధునిక సాంకేతిక విజ్ఞానం తో అనుబంధం కలిగిన దేశం గా, కాలం చెల్లిన వ్య‌వ‌స్థ‌ ల‌ను వ‌దలించుకున్న‌దేశం గా నిలిపేందుకు  భార‌త‌దేశం లోని 130 కోట్ల‌ మంది ప్ర‌జ‌లు గ‌ట్టి కృషి చేస్తున్నారు.  ఈ దార్శ‌నిక‌త‌ తో ఇంధ‌న రంగాన్ని చైత‌న్య‌వంతం చేయ‌డం జ‌రుగుతోంది.

దేశం లో పెరిగిన ఆర్థిక కార్య‌కలాపాలు ఇంధ‌న రంగం లో డిమాండు ను గ‌ణ‌నీయంగా పెంచ‌డం వ‌ల్ల ఇది అవ‌స‌రం.  ఇంధ‌న రంగం లో డిమాండు ను తీర్చ‌డం తో పాటు మ‌నం ప‌రిశుభ్ర‌మైన ఇంధనాన్ని స‌ర‌ఫ‌రా చేయ‌డానికి మ‌న నిబ‌ద్ధ‌త‌ ను మ‌నం మ‌న‌స్సు లో ఉంచుకోవాలి.  ప‌ర్యావ‌ర‌ణానికి ఎక్కువ హాని క‌లిగించ‌కుండానే అభివృద్ధి చోటుచేసుకోగ‌ల‌ద‌ని మనం ప్ర‌పంచాని కి చూపించ‌వ‌ల‌సి ఉంది.  ఇటువంటి ప‌రిస్థితుల‌లో, మ‌న దేశ ఇంధ‌న అవ‌స‌రాల‌ను తీర్చ‌డానికి మ‌రింత స‌హ‌జ‌వాయువు అవ‌స‌రం.

వ‌చ్చే ద‌శాబ్దం చివ‌రి కల్లా దేశం లో 2.5 రెట్లు స‌హ‌జ‌వాయువు వినియోగాన్ని పెంచేందుకు మ‌నం కృషి చేస్తున్నాం.  అందువ‌ల్ల గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు సంబంధించిన అన్నికోణాల‌ పై ప్ర‌భుత్వం దృష్టిపెడుతోంది.  గ్యాస్ ఆధారిత మౌలిక స‌దుపాయాల రంగాన్ని బ‌లోపేతం చేసేందుకు మేం ఎల్‌ఎన్‌జి టర్మిన‌ల్స్ ను పెంచ‌డానికి కృషి చేస్తున్నాం.  దేశ‌వ్యాప్త గ్యాస్‌ గ్రిడ్ ఏర్పాటు ప‌నులు, సిటి గ్యాస్ పంపిణీ ప‌నులు జ‌రుగుతున్నాయి.  ద్ర‌వ‌రూప స‌హ‌జ వాయువు దిగుమ‌తి సామ‌ర్ధ్యాన్ని పెంచ‌డానికి, పాత టర్మిన‌ల్స్ ను ఆధునికీకరించ‌డం జ‌రుగుతోంది.  కొత్త‌ ఎల్‌ఎన్‌జి టర్మిన‌ల్స్ కూడా నిర్మించ‌నున్నాం.

త‌మిళ‌ నాడు లోని ఎన్నౌర్‌ లో, ఒడిశా లోని ధామ్రా లో ఎల్‌ఎన్‌జి టర్మిన‌ల్స్ ప‌ని తుది ద‌శ‌ కు చేర‌కుంది.  ఇలాగే దేశం లో గ‌రిష్ఠ జిల్లా ల‌కు స‌హ‌జ‌వాయువు ను స‌ర‌ఫ‌రా చేసేందుకు జాతీయ గ్యాస్ గ్రిడ్‌ ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతోంది.

దీని ప్ర‌కారం జ‌గ‌దీశ్ పుర్‌, హల్దియా, బొకారో- ధామ్రా గొట్టపుమార్గం ప్రాజెక్టు ల ప‌నులు కొన‌సాగుతున్నాయి.  అలాగే  గ్యాస్‌ గ్రిడ్‌ తో ఈశాన్య ప్రాంతాల‌ను సంధానించడానికి, ఈ ప్రాజెక్టు ను బరౌని నుండి గువాహాటీ వ‌ర‌కు విస్త‌రించనున్నాం.  ఈ ప్రాజెక్టు ల‌పై సుమారు 13,000 కోట్ల రూపాయ‌లు ఖ‌ర్చు చేయ‌డం జ‌రుగుతుంది.  ఈ ప్రాజెక్టు గోర‌ఖ్‌పుర్‌, బ‌రౌని, సింద్రీ ఎరువుల క‌ర్మాగారాల‌ కు కొత్త ఊపిరులను ఊద‌నుంది.  సిక్కిమ్ తో స‌హా ఈశాన్య‌ రాష్ట్రాల‌ను గ్యాస్ గ్రిడ్‌ తో సంధించడానికి, ఇంధ్ర‌ధ‌నుష్ పేరు తో సంయుక్త రంగం లో సుమారు 9,200 కోట్ల రూపాయ‌లకు పైగా వ్య‌యం తో గ్యాస్ గ్రిడ్ ఏర్పాటు కానుంది.

మిత్రులారా,

ఈ రంగం లో పెట్టుబ‌డులు పెడుతున్న వారి ప్ర‌యోజ‌నాల‌ను కూడా ర‌క్షించ‌డం జ‌రుగుతోంది.  దేశీయ గ్యాస్ విపణి ధ‌ర‌ ల‌ను ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ గ్యాస్ మార్కెట్‌ తో సంధానం చేయ‌డం జ‌రిగింది.  దేశీయం గా గ్యాస్ ఉత్ప‌త్తి ని పెంచేందుకు వీలు గా కంపెనీ ల‌కు మార్కెటింగ్‌ కు, ధ‌ర‌ లకు సంబంధించిన స్వేచ్ఛ ను ఇవ్వ‌డం జ‌రుగుతోంది.

గ్యాస్ గ్రిడ్ నిర్వ‌హ‌ణ‌ కు, గ్యాస్ ధ‌ర‌ ల‌ను గ‌మ‌నించ‌డానికి ఒక స్వ‌తంత్రమైన, పార‌ద‌ర్శ‌క వ్య‌వ‌స్థ‌ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  అలాగే, దేశం లో స్వేచ్ఛా గ్యాస్ విపణి ని ఏర్పాటు చేయ‌డానికి, ఈ రంగం లో పార‌ద‌ర్శ‌క‌త్వాన్ని నెల‌కొల్ప‌డానికి, గ్యాస్ ట్రేడింగ్ ఎక్స్ చేంజ్ ని అభివృద్ధి చేయ‌డానికి ప్ర‌భుత్వం ప‌నిచేస్తోంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

ఈ సాంకేతికమైన, గణాంకాల పరమైన కోణాల తో చూస్తే ఈ ప్రాజెక్టులు, పనులు అన్నీ దేశం పైన సానుకూల ప్రభావాన్ని చూపుతాయి. సామాజికంగాను, ఆర్థికంగాను, పర్యావరణం పరంగాను కూడా ఈ ప్రాజెక్టులు స్పష్టమైన మార్పులు తీసుకువస్తాయి.

మిత్రులారా,
 
ఏ రంగం లో అయినా ఒక కొత్త వ్యవస్థ ఆవిష్కారమయితే దానికి అనుబంధం గా కొన్ని వ్యవస్థ లు ఏర్పాటు కాక తప్పవు.  ఉదాహరణ కు ఒక ప్రాంతం లో ఒక ఆసుపత్రి ని నిర్మించినట్టయితే దానికి అనుబంధం గా ఆ ప్రాంతం లో మెడికల్ స్టోర్ లు, రెస్టోరెంట్ లు, టీ స్టాల్స్, ధర్మశాల లు, చిన్న హోటళ్లు వంటివి ఏర్పాటవుతాయి.  చివరకు ఒక ఆటో స్టాండు, ఒక టాక్సీ స్టాండు లు కూడా వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది.  అవన్నీ వేటికి అవే స్వతంత్రం గా పని చేసే వ్యవస్థ లే అయినా వాటి మనుగడ కు  ఆసుపత్రే ఆధారభూతం అవుతుంది.

అలాగే ఒక నగరానికి గ్యాస్ వచ్చినట్టయితే దానికి సంబంధించిన అనుబంధ వ్యవస్థలన్నీ కూడా ఏర్పాటు కావడం తప్పనిసరి.  ఆయా నగరాల్లో గ్యాస్ ఆధారితగా నడిచే పెద్ద, చిన్న పరిశ్రమ లు భారీ సంఖ్య లో ఏర్పడతాయి.  గ్యాస్ గొట్టపు మార్గాలలో గృహస్థులకు అందుబాటు లోకి రావడం వల్ల వారి జీవనం సరళతరం అవుతుంది.  సిఎన్ జి, పిఎన్ జి గొట్టపు మార్గాల నెట్ వర్క్ లో ఎంతో మంది యువత కు ఉపాధి లభిస్తుంది.  ఆ నగరం లో తిరిగే ఆటోలు, టాక్సీలు, కార్లు కూడా ఆధునిక ప్రత్యామ్నాయ ఇంధనం తో నడుస్తాయి.  గ్యాస్ ఆధారిత మౌలిక వసతులను అభివృద్ధి చేసే స్కీము లలో లక్షలాది మంది కి ఉపాధి లభిస్తుంది.

తొమ్మిదో విడత బిడ్డింగ్ లో భాగం గా ప్రారంభమైన పనులు 3 లక్షల మంది యువత కు ప్రత్యక్ష ఉపాధి ని అందుబాటు లోకి తీసుకువస్తాయి.  ఇతర వ్యవస్థ లు కూడా ఏర్పడితే మరి కొన్ని లక్షల మంది కి కొత్త ఉపాధి అవకాశాలు అందుబాటు లోకి వస్తాయి.  తూర్పు, ఈశాన్య రాష్ట్రాలు ప్రత్యేకం గా లాభపడతాయి.  ఆ రకం గా గ్యాస్ ఆధారిత వ్యవస్థ లు పారిశ్రామిక ముఖచిత్రాన్నే కాకుండా ఆయా జిల్లాలలో ప్రజల జీవన శైలి లోనూ  మార్పు తీసుకువస్తాయి.  

రానున్న సంవత్సరాల్లో కనిపించే పరివర్తన ను మీరు అందరూ చూడగలుగుతారు; ఆ మార్పు లో భాగస్వాములు కూడా కాగలుగుతారు.  మన జీవిత కాలం లోనే ఇటువంటి మార్పు కనిపించడం మన అదృష్టం.  ఇంటి కి గ్యాస్ కనెక్షన్ పొందడానికి సిఫారసు లేఖల కోసం సగటు కుటుంబికులు పార్లమెంట్ సభ్యుల ఇళ్ల ముందు క్యూ కట్టిన రోజులు నాకు ఇప్పటికీ గుర్తున్నాయి.  అప్పటికీ ఇప్పటికీకి దేశం ఎన్నో అడుగులు ముందుకువేసింది.

ప్రజలు ప్రభుత్వ పని సంస్కృతి లో మార్పు నే కాదు, పథకాల అమలు లోనూ మార్పు ను కోరుతున్నారని 2014 లో నేను చెప్పింది పొరపాటు ఏమీ కాదు.  ఈ రోజు న ఈ రంగాని కి చెందిన మరో ఉదాహరణ కూడా మీకు నేను చెప్పాలనుకుంటున్నాను.  గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ ఆవిష్కరించాలని చెప్పడం మాట అటుంచితే 1955 నుండి దేశం లో గ్యాస్ కనెక్షన్ లు మంజూరు చేస్తున్నారని కూడా మనం మరచిపోకూడదు.  అప్పటి నుండి 2014 సంవత్సరం మధ్య కాలం లో- అంటే 60 సంవత్సరాల్లో- ఇచ్చిన గ్యాస్ కనెక్షన్ లు 13 కోట్లే.  వనరులు, ప్రజలు, కార్యాలయాలు, ఫైళ్లు, అధికారుల పని సంస్కృతి అన్నీ అలాగే ఉన్నాయి.  కానీ ఈ నాలుగు సంవత్సరాల కాలంలోనే 12 కోట్ల కొత్త కనెక్షన్ లను మంజూరు చేశారు. 

60 సంవత్సరాల కాలం లో 13 కోట్ల కనెక్షన్ లు ఇవ్వగా కేవలం నాలుగు సంవత్సరాలలో 12 కోట్ల కనెక్షన్ లు ఇచ్చారు.  పని లో వేగం గతం లో వలెనే సాగితే రెండు తరాల తరువాత కూడా ప్రయోజనాలు కుటుంబాలకు అందేవి కావు.  గృహ రంగం లో గ్యాస్ కవరేజి 2014 కు ముందు 55 శాతం ఉంటే ఇప్పుడు అది 90 శాతానికి పెరిగింది.  ఉజ్వల యోజన ఇందులో కీలక పాత్ర పోషించిందనడం లో సందేహం లేదు.  2016 మే ఒకటో తేదీ న ఈ పథకం ప్రారంభమైన తరువాత ఇప్పటి వరకు దాని కింద 6 కోట్ల మంది మహిళలకు ఉచిత గ్యాస్ కనెక్షన్ లు అందాయి.  గ్రామాల్లో ప్రజల జీవన విధానాన్ని ఆ పథకం ఎంతగానో మార్చింది.  

బిడ్డింగ్ ప్రక్రియ, కార్యక్రమానికి శంకుస్థాపన వంటి ప్రయత్నాల తో పాటు కొన్ని దశాబ్దాలు గా వంటచెరకు తో పని చేస్తూ అపరిమితం గా పొగ పీల్చిన మహిళల గురించి కూడా మనం ఆలోచించాలి.  మహిళలు వారి ఆరోగ్యాన్ని పణం గా పెట్టి కుటుంబం మొత్తానికి ఆహారాన్ని అందించారు.  ఈ మహిళ లకు గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ అర్ధం తెలియకపోవచ్చు, కానీ దాని వల్ల వారి జీవితాల్లో తప్పనిసరి గా పరివర్తన వచ్చింది.

సోదరులు మరియు సోదరీమణులారా,

కొద్ది సేపటి క్రితమే నేను పర్యావరణాన్ని గురించి మాట్లాడాను.  మనం ఇప్పుడు పురోగమిస్తున్న గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ పర్యావరణం పైన ఎంతో పెద్ద సానుకూల ప్రభావాన్ని చూపుతుంది.  వేల సంఖ్య లో కొత్త సిఎన్ జి స్టేశన్ లు రావడం వల్ల పరిశ్రమ లకు నిరంతరాయంగా గ్యాస్ సరఫరా జరుగుతుంది.  దేశం లోని అనేక జిల్లా లకు టాక్సీలు, ఆటోలు, కార్ల వంటి రవాణా సాధనాలకు తగినంత సిఎన్ జి అందుబాటు లోకి వస్తుంది.  ఫలితం గా కాలుష్యం గణనీయం గా తగ్గుతుంది.  సిఒపి 21 కి భారతదేశం ఇచ్చిన హామీ మరింత బలోపేతం అవుతుంది.  ప్రపంచ పర్యావరణానికి కూడా భారతదేశం అందించే వాటా పెరుగుతుంది. ప్రపంచానికే నాయకత్వం వహించే స్థాయి కి భారతదేశం విరజిమ్ముతున్న వెలుగు లు ప్రకాశిస్తాయి. 

మిత్రులారా,

స్వచ్ఛ ఇంధనాన్ని అందించేందుకు ప్రభుత్వం చేస్తున్న కృషి అపారమైంది, విస్తారమైందీనూ.  వ్యవసాయ వ్యర్థాలు, బయోమాస్ ను కూడా కంప్రెస్ డ్ బయోగ్యాస్ గా మార్చే పథకాన్ని కూడా ప్రభుత్వం చేపట్టింది.  ఈ స్కీము కింద వచ్చే అయిదు సంవత్సరాల కాలం లో దేశం లో 5 వేల కంప్రెస్ డ్ బయోగ్యాస్ ప్లాంటు లు ఏర్పాటు అవుతాయి. 

వ్యవసాయ వ్యర్థాలు, చెత్త చెదారాన్ని భారీ పరిమాణం లో తగులబెట్టడాన్ని నివారించడమే కాదు రైతుల ఆదాయం కూడా పెరుగుతుంది.  10 వేల కోట్ల రూపాయల వ్యయం తో దేశం లో 12 ఆధునిక బయో రిఫైనరీ లు ఏర్పాటు అవుతున్నాయి.  ఇథెనాల్ కలిపిన ఇంధనాల సరఫరాకు అనుకూలం గా ప్రభుత్వం చేపట్టిన విధానపరమైన సంస్కరణ ల కారణంగా ఇథెనాల్ మిశ్రమం రికార్డు స్థాయి లో పెరిగింది.

2014 సంవత్సరానికల్లా దేశం లో 40 కోట్ల లీటర్ల ఇంధనం లో ఇథెనాల్ ను కలిపే వారు.  ఇప్పుడు అది నాలుగు రెట్లు పెరిగింది.  ఇథె నాల్ మిశ్రమాన్ని 10 శాతానికి పెంచాలన్నది ప్రభుత్వ లక్ష్యం.  వచ్చే సంవత్సరానికల్లా  2104 తో పోల్చితే ఇథెనాల్ మిశ్రమం 8 రెట్లు పెరగనుంది.

స్వచ్ఛ ఇంధనాల నుండి స్వచ్ఛ పర్యావరణం దిశ గా అడుగులు వేస్తున్న ప్రభుత్వం ఆటోమొబైల్ రంగం లో బిఎస్-4 ప్రమాణాల నుండి ఒక్కసారి గా బిఎస్-6 ప్రమాణాలకు అడుగు వేసింది.  టెలికం రంగం లో ఇప్పటికే 2జి నుండి 4జి కి, 4జి నుండి 5జి కి మాత్రమే పరివర్తన చోటు చేసుకోగా ఆటోమొబైల్ రంగం లో మాత్రం ఒక్క ఉదుటున బిఎస్-4 నుంచి బిఎస్-6 కి అడుగు పడింది.  అలాగే ఎల్ఇడి బల్బు ల ధర లు తగ్గడం తో పాటు 32 కోట్ల ఎల్ఇడి బల్బు ల పంపిణీ వల్ల  కార్బన్ డైఆక్సైడ్ వ్యర్థాలు 3 కోట్ల టన్నుల మేరకు తగ్గాయి.

2022 నాటికి దేశం లో 175 గీగా వాట్ ల నవీకరణయోగ్య ఇంధనం ఉత్పత్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యం గా నిర్దేశించుకుంది.  ఇందులో 100 గీగా వాట్ లు పూర్తి గా సౌర శక్తి ఆధారం గానే జరుగుతుంది.  వచ్చే నాలుగు సంవత్సరాల కాలం లో రైతు లకు 28 లక్షల సోలార్ పంపులను అందించే కృషి ముమ్మరం గా సాగుతోంది.  గ్యాస్ ఆధారిత మౌలిక వసతుల పెంపు నకు కూడా ప్రభుత్వం చేస్తున్న కృషి వల్ల అంతర్జాతీయ సమాజానికి భారతదేశం ప్రకటించిన కట్టుబాట్లు సాకారం అవుతాయి. 

2030 నాటి కి భారతదేశం వాతావరణం లో కాలుష్యం తీవ్రత ను 33 నుండి 35 శాతాని కి తగ్గిస్తుంది.  అలాగే 40 శాతం ఇంధనాలు సంప్రదాయేతర వనరుల ద్వారా మాత్రమే ఉత్పత్తి చేయాలన్న కట్టుబాటు ను కూడా నెరవేర్చగలుగుతుంది.

సోదరులు మరియు సోదరీమణులారా,

గ్యాస్ ఆధారిత ఆర్థిక వ్యవస్థ, స్వచ్ఛ ఇంధనాలకు నిర్దేశించుకున్న లక్ష్యాల సాధనకు భారతదేశం కట్టుబడి ఉంది.  ఈ కట్టుబాటు మన కోసం మాత్రమే కాదు, యావత్తు మానవాళి, భవిష్యత్తు తరాల సంక్షేమం లో కూడా కీలకమే.  ఆ కట్టుబాటు లను సాకారం చేయడం మన అందరి బాధ్యత. 

మీ అందరి తో పాటు గా సిటి గ్యాస్ పంపిణీ వ్యవస్థ ఏర్పాటు పనులు మొదలైన ఇతర నగరాల ప్రజలు, పదో బిడ్డింగ్ ప్రక్రియ లోని సంస్థల ప్రతినిధులు అందరికీ మరోసారి అభినందనలు తెలియచేస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తాను. 

అనేకానేక ధన్యవాదాలు.

**