పిఎంఇండియా
వ్యవసాయం, వ్యవసాయ సంబంధిత రంగాల్లో సహకారం కోసం వివిధ దేశాలతో భారతదేశం కుదుర్చుకున్న అవగాహన పూర్వక ఒప్పందాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు.
వ్యవసాయ క్షేత్రాలలో దిగుబడిని పెంచే సాగు పద్ధతులతో పాటు, సాగు సంబంధిత సాంకేతిక విజ్ఞానాలను అభివృద్ధి చేయడంలో తోడ్పడే జెనెటిక్ రిసోర్సెస్ పరస్పర మార్పిడి ద్వారా, శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణుల పర్యటనల ద్వారా విజ్ఞాన మార్పిడికి, సామర్థ్యాల పెంపుదలకు ఈ ఎంఓయూ మార్గం వేస్తుంది. ఈ విధంగా సమకూర్చుకున్న సాంకేతిక విజ్ఞానాన్ని, ప్రావీణ్యాన్ని అవసరాన్ని బట్టి దేశమంతటా అమలులోకి తెస్తారు. ఈ ఎంఓయూ అమలుకు అయ్యే వ్యయాన్ని సంబంధిత విభాగానికి జరిపిన నిధుల కేటాయింపు నుంచి సర్దుబాటు చేస్తారు.
పూర్వ రంగం
1961 సభా వ్యవహారాల నియమావళిని అనుసరించి విదేశాలతో జరిపిన సంప్రదింపులు, ఒప్పందాలు, ఒడంబడికలు, ఇంకా ఇతరత్రా ముఖ్యమైన వ్యవహారాలను ఆమోదముద్ర కోసం కేంద్ర మంత్రిమండలి దృష్టికి నివేదించవలసి ఉంటుంది.
పైన పేర్కొన్న నియమావళి పరిధిలోని 12వ నిబంధన కింద కొన్ని కేసులకు సంబంధించి ముందస్తు అనుమతిని ఇదివరకే పొందడం జరిగింది. అయితే ఆ తరువాత దీనికి కావలసిన మంత్రివర్గ ఆమోదం తీసుకోవడం సాధ్యపడలేదు; కాబట్టి 13 దేశాలతో.. నెదర్లాండ్స్, నేపాల్, సైప్రస్, ఇజ్రాయిల్, బంగ్లాదేశ్, కంబోడియా, టాంజానియా, సురినామ్, జాంబియా, సిరియా, భూటాన్, చిలీ, మారిషస్.. లతో సంతకాలు జరిగిన ఎమ్ఓయూ లకు తాజాగా ఆమోదం తెలిపారు.