Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

థాయ్‌లాండ్‌లో ఆదిత్య బిర్లా సంస్థ‌ల స్వ‌ర్ణోత్స‌వాలకు హాజరైన ప్ర‌ధాన‌ మంత్రి   


థాయ్‌లాండ్‌ లో ఆదిత్య బిర్లా సంస్థ‌ల కార్యకలాపాలు ప్రారంభమై 50 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఇవాళ బ్యాంకాక్‌లో నిర్వహించిన స్వర్ణోత్సవాలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ హాజరయ్యారు. థాయ్‌లాండ్‌లో తమ సంస్థల స్వర్ణోత్సవాల్లో పాల్గొన్నందుకు ప్రధానమంత్రికి ఆదిత్య బిర్లా గ్రూప్ చైర్మన్ కుమార మంగళం బిర్లా కృతజ్ఞతలు తెలిపారు. పలువురు ప్రభుత్వాధికారులు, పారిశ్రామిక రంగ ప్రముఖులు పాల్గొన్న ఈ సమావేశంలో ప్రధానమంత్రి ప్రసంగించారు. అనేకమందికి అవకాశాలు కల్పించడంతోపాటు వారి సౌభాగ్యానికి తోడ్పడటంలో ఆదిత్య బిర్లా గ్రూప్ కృషి ప్రశంసనీయమని ఆయన అభినందించారు. బలమైన భారత-థాయ్‌లాండ్‌ సాంస్కృతిక బంధాలను ప్రస్తావిస్తూ- సంస్కృతి, వాణిజ్యాలు ప్రపంచాన్ని  సన్నిహితం చేసి, సమైక్యపరచగల సహజ శక్తులని పేర్కొన్నారు.

భారతదేశంలో పరివర్తనాత్మక మార్పులు

  భారత ప్రభుత్వం గడచిన ఐదేళ్లలో సాధించిన అనేక విజయాలను ప్రధానమంత్రి ఈ సందర్భంగా ఆహూతులతో పంచుకున్నారు. నలిగిపోయి, పాతబడిన పద్ధతులకు స్వస్తిచెప్పి, ఉద్యమస్థాయిలో పనిచేయడం ద్వారా పరివర్తనాత్మక మార్పులు సాధ్యమయ్యాయని ఆయన వివరించారు. ఒకనాడు అసాధ్యంగా భావించినవాటిని నేడు సుసాధ్యం చేశామని, అందువల్ల భారతదేశంలో పాదం మోపే అత్యుత్తమ తరుణం ఇదేనని ప్రకటించారు. వాణిజ్య సౌలభ్యంపై ప్రపంచబ్యాంకు ప్రకటించే వాణిజ్య సౌలభ్య ర్యాంకులలో భారతదేశం ఐదేళ్లలో 79 స్థానాలు ఎగువకు దూసుకెళ్లిందని ప్రధానమంత్రి ప్రత్యేకంగా వివరించారు. ఈ మేరకు 2014లో 142వ స్థానంలో ఉన్న భారత్ 2019కల్లా 63వ స్థానాన్ని కైవసం చేసుకున్నదని వివరించారు. వ్యాపార, వాణిజ్య పర్యావరణం మెరుగుదిశగా సంస్కరణలు చేపట్టడంలో ప్రభుత్వ చిత్తశుద్ధికి ఇదే నిదర్శనమని పేర్కొన్నారు. అలాగే ప్రపంచ ఆర్థిక వేదిక ప్రకటించే ‘ప్రయాణ-పర్యాటక పోటీతత్వ సూచీ’పరంగా 2013లో భారత్ 65వ స్థానంలో ఉండగా 2019కల్లా 34వ ర్యాంకుకు దూసుకెళ్లిందని గుర్తుచేశారు. మెరుగైన రోడ్లు, అనుసంధానం, పరిశుభ్రత, సుస్థిర  శాంతిభద్రతలు, వసతులు, సదుపాయాల కల్పన తదితరాల కారణంగా విదేశీ పర్యాటకుల రాక 50 శాతం మేర పెరిగిందని వివరించారు. ‘ఆదా చేయడం ఆర్జనతో సమానం… ఇంధన పొదుపు ఉత్పాదనతో సమానం’ అన్న సత్యానికి అనుగుణంగా ప్రత్యక్ష లబ్ధి బదిలీ పథకంతో సామర్థ్యం మెరుగుపరచడంతోపాటు దుర్వినియోగాన్ని అరికట్టినట్లు తెలిపారు. తద్వారా ఇప్పటివరకూ 20 బిలియన్ డాలర్ల మేర ఆదా అయిందని పేర్కొన్నారు. అంతేకాకుండా ఇంధన పొదుపు దిశగా ఎల్ఈడీ దీపాల పంపిణీద్వారా కర్బన ఉద్గారాలను గణనీయంగా తగ్గించినట్లు తెలిపారు.

భారతదేశం: పెట్టుబడులకు ఆకర్షణీయ గమ్యం

  ప్రపంచంలో అత్యంత ప్రజా సన్నిహిత పన్ను వ్యవస్థలకు భారత్ నెలవని ప్రధానమంత్రి పేర్కొన్నారు. ఈ మేరకు మధ్యతరగతిపై పన్నుభారం తగ్గింపు, కార్పొరేట్ పన్ను శాతంలో కోతసహా వేధింపులకు తావులేని పన్నుల పరోక్ష అంచనాలకు శ్రీకారం చుట్టడంవంటి ఇటీవలి చర్యలను ప్రముఖంగా ప్రస్తావించారు. వస్తుసేవల పన్ను విధానం ప్రవేశపెట్టడంద్వారా ఆర్థిక ఏకీకరణ స్వప్నం సాకారమైందని ఆయన చెప్పారు. ఈ వ్యవస్థను మరింత ప్రజా సన్నిహితం చేయడానికి ప్రభుత్వం చిత్తశుద్ధితో కృషిచేస్తున్నదని తెలిపారు. ఈ చర్యలన్నిటివల్ల పెట్టుబడులకు అత్యంత ఆకర్షణీయ గమ్యాలలో ఒకటిగా భారత్ రూపొందినట్లు చెప్పారు. విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు సంబంధించి ‘వాణిజ్యం-అభివృద్ధిపై ఐక్యరాజ్య సమితి విభాగం-అంక్టాడ్’ ప్రకటించిన 10 అగ్రదేశాల జాబితాలో భారత్ స్థానం దక్కించుకోవడమే ఇందుకు నిదర్శనమని పేర్కొన్నారు.

థాయ్‌లాండ్‌ 4.0తో పరిపూరకం

  భారతదేశాన్ని 5 లక్షల కోట్ల డాలర్ల ఆర్థిక వ్యవస్థ రూపొందించే స్వప్నం గురించి ప్రధానమంత్రి ప్రస్తావించారు. ఈ మేరకు 2014నాటికి 2 లక్షల కోట్ల డాలర్ల స్థాయిలో ఉన్న ఆర్థిక వ్యవస్థ 2019కల్లా 3 లక్షల కోట్ల డాలర్ల స్థాయికి దూసుకెళ్లడాన్ని గుర్తుచేశారు. అలాగే థాయ్‌లాండ్‌ను విలువ ఆధారిత ఆర్థిక వ్యవస్థగా రూపాంతరం చెందించే ‘థాయ్‌లాండ్‌ 4.0’ చొరవ గురించి ఆయన మాట్లాడారు. భారత్ నిర్దేశించుకున్న డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్వచ్ఛ భారత్, స్మార్ట్ సిటీలు, జలజీవన్ కార్యక్రమం వంటి ప్రాథమ్యాలతో ఇది సరిపోలడమేగాక పరిపూరకం కాగలదని చెప్పారు. అంతేకాకుండా ఫలవంతం కాగల భాగస్వామ్యాలకు గణనీయ అవకాశాలు కల్పించగలదని వివరించారు. రెండుదేశాల భౌగోళిక సాన్నిహిత్యాన్ని, సంస్కృతీ సార్వజనీనతను, సద్భావనను సద్వినియోగం చేసుకుంటూ వాణిజ్య భాగస్వామ్యాలను మరింత ముందుకు తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు.

థాయ్‌లాండ్‌లో ఆదిత్య బిర్లా గ్రూప్

  భారత ఆర్థిక వ్యవస్థ అధికారికంగా ప్రపంచానికి అందుబాటులోకి రావడానికి 22 ఏళ్లముందు శ్రీ ఆదిత్య విక్రమ్ బిర్లా థాయ్‌లాండ్‌లో నూలువడికే యంత్రాగారాన్ని ప్రారంభించి పథ నిర్దేశకుడిగా నిలిచారు. ఇవాళ ఈ గ్రూప్ పరిశ్రమలు థాయ్‌లాండ్‌ అంతటా విస్తరించి 1.1 బిలియన్ల విలువైన వైవిధ్య వ్యాపారాలతో అతిపెద్ద పారిశ్రామిక సామ్రాజ్యాలలో ఒకటిగా సంస్థ రూపొందింది. ఈ మేరకు థాయ్‌లాండ్‌లో జౌళి, కార్బన్ బ్లాకులు, రసాయనాలు వంటి విభిన్న రంగాలలో 9 అత్యాధునిక కర్మాగారాలతో తన విస్తరించడం ద్వారా ఆదిత్య బిర్లా గ్రూప్ తన ఉనికిని ఘనంగా చాటుకుంటోంది.