పిఎంఇండియా
త్వరలో వేలం నిర్వహించనున్న పలు రకాల స్పెక్ట్రమ్ బ్యాండ్లకు స్పెక్ట్రమ్ వాడకం చార్జీ (ఎస్యుసి) రేట్లను కేంద్ర మంత్రిమండలి ఆమోదించింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు. ఈ నిర్ణయంతో టెలికమ్యూనికేషన్ ల విభాగం స్పెక్ట్రమ్ వేలానికి సంబంధించి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటీసును జారీ చేయడానికి మార్గం సుగమం అయింది.
మంత్రిమండలి తీసుకున్న నిర్ణయం ప్రకారం స్పెక్ట్రమ్ వాడకం చార్జీలను ఈ కింద సూచించిన విధంగా నిర్దేశించనున్నారు:
(1) త్వరలో 700, 800, 900, 1800, 2100, 2300 మరియు 2500 మెగా హెర్ట్ జ్ బ్యాండ్ లకు నిర్వహించనున్న వేలంలో సేకరించే స్పెక్ట్రమ్ కు వైర్ లైన్ సేవల నుండి లభించే ఆదాయాన్ని మినహాయించి అడ్జస్టెడ్ గ్రాస్ రెవెన్యూ (ఎ జి ఆర్)లో 3 శాతం రేటును వసూలు చేయవలసివుంటుంది.
(2) ఒక ఆపరేటర్ కు ఇచ్చిన అన్ని రకాల స్పెక్ట్రమ్ (పాలనాపరంగా కేటాయించింది గాని, లేదా వేలం ద్వారా గాని, లేదా ట్రేడింగ్ ద్వారా సమకూరినది గాని) యొక్క, ఇంకా.. 2010 సంవత్సర వేలంలో పొందిన బి డబ్ల్యు ఎ స్పెక్ట్రమ్ తో సహా ఎస్ యు సి రేట్ల వెయిటెడ్ ఏవరేజ్ ను లెక్కగట్టి-వైర్ లైన్ సేవల ఆదాయాన్ని మినహాయించి- ఎ జి ఆర్ లో కనీసం 3 శాతం ఉండేటట్లుగా ఎస్ యు సి ని వసూలు చేయవలసివుంటుంది. మొత్తం స్పెక్ట్రమ్ హోల్డింగ్లను వర్తించే ఎస్ యు సి రేటుతో భాగించి, వెయిటెడ్ ఏవరేజ్ ను తేల్చాలి. ఈ వెయిటెడ్ ఏవరేజ్ ను ఆపరేటర్ వారీగా ప్రతి సర్వీస్ ఏరియాకు నిర్ధరించవలసివుంటుంది.
(3) 2015-16 సంవత్సరానికి పూర్వం సేకరించిన/కేటాయించిన 2300 మెగా హెర్ట్ జ్/2500 మెగా హెర్ట్ జ్ స్పెక్ట్రమ్ బ్యాండ్లను మినహాయించి, త్వరలో జరగనున్న వేలంలో సేకరించే స్పెక్ట్రమ్ లను పరిగణనలోకి తీసుకుని లెక్కగట్టగా వచ్చే వెయిటెడ్ ఏవరేజ్ ఆధారంగా 2015-16 సంవత్సరానికి సంబంధించి ఆపరేటర్లు చెల్లించే ఎస్ యు సి మొత్తాన్ని నిర్ణయిస్తారు. ఈ మొత్తాన్ని ఆపరేటర్లు చెల్లించవలసిన ఎస్ యు సి కనీస మొత్తంగా ఎంచుతారు. అంతే కాక, సర్వీస్ ప్రొవైడర్ ఎ జి ఆర్ లో కనుక తగ్గింపు ఉన్న పక్షంలో తదనుగుణంగా ఎస్ యు సి కనీస మొత్తాన్ని కూడా తగ్గించివేయడం జరుగుతుంది.
ఇది చట్టానికి అనుగుణంగా సులభమైన, పారదర్శకమైన, ఫ్లాట్ యాడ్ వాలరెమ్ ఎస్ యు సి వ్యవస్థకు మరలేందుకు వీలు కల్పిస్తుంది. ప్రభుత్వానికి ఆదాయాన్ని వెల్లడి చేయని విధంగా దొంగ లెక్కలకు పాల్పడడాన్ని ఇది అడ్డుకోగలదు కూడా.