పిఎంఇండియా
అంతర్జాతీయ శక్తి సంస్థ – సముద్ర శక్తి వ్యవస్థల (ఇంటర్ నేషనల్ ఎనర్జీ ఏజెన్సీ – ఓషన్ ఎనర్జీ సిస్టమ్స్.. ఐఈఏ-ఓఈఎస్)లో భారతదేశానికి సభ్యత్వం ఇచ్చేందుకు ఉద్దేశించిన అమలు ఒప్పందం (ఐఏ)పై జరిగిన సంతకాలకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ వ్యవస్థలో సభ్యత్వాన్ని భారత భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని ‘అర్త్ సిస్టమ్ సైన్స్ ఆర్గనైజేషన్ – నేషనల్ ఇన్
స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఈఎస్ఎస్ఓ-ఎన్ఐఓటీ)’ పర్యవేక్షిస్తుంది.
ఐఈఏ-ఓఈఎస్ లో సభ్యత్వం తీసుకోవటం ద్వారా ప్రపంచ వ్యాప్తంగా లభ్యమయ్యే అధునాతన పరిశోధన, అభివృద్ధి (ఆర్ అండ్ డి) బృందాలతో పాటు ఆధునిక సాంకేతిక విజ్ఞానాలు భారత్ కు అందుబాటులోకి వస్తాయి. ప్రొటోకాల్ పరీక్షలను అభివృద్ధి చేయడంలో భారత్ ఇతర దేశాలతో కలసి పనిచేయగలుగుతుంది. ఇది భారతీయ మూలరూప వ్యవస్థలను (ప్రోటోటైప్స్) అంతర్జాతీయ అవసరాలు, నియమ నిబంధనలకు అనుగుణంగా పరీక్షించడంలో తోడ్సడగలదు. సభ్య దేశాల సంస్థల ఉమ్మడి సహకారంతో కొత్త కార్యక్రమాలను ఇండియా చేపట్టవచ్చు. ప్రత్యేక లక్ష్యాలతో కూడిన తన సొంత పరిశోధక ప్రాజెక్టులను భారత్ ఇతర దేశాలతో కలసి చేపట్టవచ్చు కూడా.
పూర్వ రంగం:
అతి పెద్ద కోస్తా తీర ప్రాంతం ఉండటం, తీర ప్రాంతాల్లో విద్యుత్ కొరత కారణంగా.. సముద్రంలోని పునరుత్పత్తి శక్తిని గుర్తించటం, వెలికితీయటంలో చాలా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. సముద్రంలో మార్పుల కారణంగా కూడా.. ఈ సాంకేతికతను వినియోగించటం ఓ సవాల్గా మారింది. భారత్ విషయానికొస్తే.. సముద్ర శక్తిని వెలికితీసే క్రమంలో అనుసరించాల్సిన సాంకేతిక ఆచరణ సాధ్యతపై కూడా దృష్టి పెట్టాల్సి ఉంటుంది. ఉష్ణమండల దేశాల్లో సముద్ర ఉష్ణోగ్రతలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి.. భారత్ వంటి దేశాలకు ఓషియన్ థర్మల్ ఎనర్జీ కన్వర్షన్ (ఓటీఈసీ) విధానం ఉపయోగకరంగా ఉంటుంది. భారత భూ శాస్త్ర మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలోని నేషనల్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ ఓషియన్ టెక్నాలజీ (ఎన్ఐఓటీ) అనేది సముద్ర శక్తి, ఉప్పు నీటి (సముద్ర జలం) నిర్లవణీకరణ లపై పనిచేస్తున్న సంస్థ.
ఐఈఏ అనేది వివిధ ప్రభుత్వాలను సమన్వయం చేసే వ్యవస్థ. ఇది ప్రత్యామ్నాయ శక్తి వనరుల వినియోగాన్ని పెంచేందుకు సహాయపడుతుంది. శాస్త్రీయ శక్తి పాలసీలు, అంతర్జాతీయ శక్తి సాంకేతిక సహకార, 29 సభ్య దేశాల మధ్య శక్తి పాలసీ సలహా బోర్డుగా వ్యవహరిస్తుంది. 2001లో ప్రారంభించిన ఓఈఎస్ కూడా ప్రభుత్వాల మధ్య సమన్వయం కుదుర్చటంతో పాటు ఐఈఏ సూచించిన నిబంధనలకు అనుగుణంగా పనిచేస్తుంది. అంతర్జాతీయంగా వివిధ దేశాల పరస్పర సహకారం కారణంగా.. సముద్రంలో అందుబాటులో ఉండే పునరుత్పత్తి శక్తిపై పరిశోధన, అభివృద్ధి, కొత్త సాంకేతికతను వినియోగించటంతోపాటు ఉప్పు నీటి నుంచి లవణాలను వెలికితీయటం వంటి ఇతర ఉపయోగాలకు ఈ ఒప్పందం చాలా కీలకం కానుంది.