Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రధాన మంత్రి ప్రసంగం


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేడు అస్సాం లోని గువాహాటీ లో జరిగిన ‘అడ్వాంటేజ్ అస్సాం- గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమిట్ 2018’ ప్రారంభ సదస్సు లో ప్రసంగించారు.

ప్రధాన మంత్రి ఈ శిఖర సమ్మేళనానికి విచ్చేసినటువంటి ప్రతినిధులకు స్వాగతం పలుకుతూ, కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న యాక్ట్ ఈస్ట్ పాలిసీ కి ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు గుండెకాయ వంటివి అన్నారు. ప్రజలకు- ప్రజలకు మధ్య సంబంధాలను, వ్యాపార సంబంధాలను పెంపొందించడం తో పాటు ఆసియాన్ సభ్యత్వ దేశాలతో ఇతర సంబంధాలను సైతం వర్ధిల్లేటట్లు చేయడాన్ని దృష్టిలో పెట్టుకొని యాక్ట్ ఈస్ట్ పాలిసీ రూపొందిందని ఆయన వివరించారు.

ఆసియాన్ కు, భారతదేశానికి మధ్య నెలకొన్న భాగస్వామ్యానికి 25 సంవత్సరాలు పూర్తి అయిన నేపథ్యంలో ఇటీవలే ఆసియాన్- ఇండియా కమెమరేటివ్ సమిట్ ను నిర్వహించుకొన్న సంగతిని ప్రధాన మంత్రి గుర్తుచేశారు. భారతదేశానికి, ఆసియాన్ దేశాలకు మధ్య బంధం వేల సంవత్సరాల నాటిది అని ఆయన చెప్పారు. 10 ఆసియాన్ దేశాల నేతలకు న్యూ ఢిల్లీ లో నిర్వహించిన గణతంత్ర దిన వేడుకలలో గౌరవ అతిథులుగా ఆతిథ్యం ఇవ్వడం భారతదేశానికి దక్కిన విశేషాధికారం అని ఆయన అన్నారు.

ఈశాన్య ప్రాంతంలో సమతులమైన మరియు శరవేగంతో కూడిన వృద్ధి చోటు చేసుకొన్నప్పుడు భారతదేశ వృద్ధి గాథ మరింత శక్తిని పుంజుకోగలుగుతుందని ప్రధాన మంత్రి స్పష్టంచేశారు. కేంద్ర ప్రభుత్వ పథకాలన్నీ కూడా ప్రజల జీవనంలో ఒక గుణాత్మకమైన మార్పును తీసుకురావడమే ప్రధానంగా రూపొందాయని ఆయన తెలిపారు. ధ్యేయమల్లా జీవనంలో సరళత్వాన్ని మెరుగుపరచడమే అని ఆయన పేర్కొన్నారు.

కేంద్ర బడ్జెటులో ప్రకటించిన ‘‘ఆయుష్మాన్ భారత్’’ పథకం ప్రపంచంలో ఉన్నటువంటి ఆ తరహా పథకాలన్నింటిలోకెల్లా అతి పెద్దది అని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ ఆరోగ్య సంరక్షణ పథకం సుమారు 45 నుండి 50 కోట్ల మంది ప్రజలకు ప్రయోజనాన్ని చేకూర్చగలదని ఆయన అన్నారు. పేదల ఆరోగ్య సంరక్షణ కోసం కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఇతర చర్యలను గురించి కూడా ఆయన ప్రస్తావించారు.

ఇన్ పుట్ వ్యయాలను తగ్గించడం, ఇంకా వ్యవసాయదారులకు వారి పంటలకు తగిన ధర దక్కేలా చూడడం ద్వారా వ్యవసాయదారుల ఆదాయాన్ని రెట్టింపు చేసే లక్ష్యం దిశగా కేంద్ర ప్రభుత్వం కృషి చేస్తోందని శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. వ్యవసాయదారుల సంక్షేమం కోసం కేంద్ర ప్రభుత్వం తీసుకొంటున్న ఇతర చర్యలను గురించి కూడా ఆయన ఈ సందర్భంగా వివరించారు.

ప్రజలకు తక్కువ వ్యయంతో కూడిన గృహ‌ వసతి కల్పన కోసం చర్యలు తీసుకొన్నామని ప్రధాన మంత్రి చెప్పారు. ఎల్ ఇడి బల్బులను పంపిణీ చేయడం కోసం ఉజ్జ్వల యోజనను తీసుకువచ్చామని, ఈ పథకం ద్వారా కుటుంబాల విద్యుత్తు బిల్లులలో చెప్పుకోదగ్గ ఆదా సాధ్యపడుతోందని ఆయన వివరించారు. పునర్ వ్యవస్థీకరించిన నేషనల్ బ్యాంబూ మిషన్ ప్రత్యేకించి ఈశాన్య ప్రాంతానికి గణనీయమైన ప్రాముఖ్యం కలిగిన కార్యక్రమమని ఆయన అన్నారు.

కేంద్ర ప్రభుత్వం లోని పాలన యంత్రాంగ స్వరూపాలను పునర్ వ్యవస్థీకరించిన కారణంగా ప్రాజెక్టుల అమలు బాగా వేగవంతం అయినట్లు ప్రధాన మంత్రి వివరించారు.

ముద్ర యోజన లో భాగంగా నవ పారిశ్రామికవేత్తలకు పూచీకత్తు లేని రుణాలను అందించేందుకు తీసుకొన్న చర్యలను గురించి ప్రధాన మంత్రి ఏకరువు పెట్టారు. ఎమ్ఎస్ఎమ్ఇ లకు పన్ను రాయితీ ఇచ్చేందుకు కేంద్ర బడ్జెటులో చేపట్టిన చర్యలను ఆయన ప్రస్తావించారు.

అవినీతిని మరియు నల్లధనాన్ని నిరోధించేందుకు కేంద్ర ప్రభుత్వం నిబద్ధురాలై ఉందని ప్రధాన మంత్రి పునరుద్ఘాటించారు. గత మూడు సంవత్సరాలలో కేంద్ర ప్రభుత్వం అనేక పరివర్తనాత్మక ఆర్థిక సంస్కరణలను అమలుచేసిందని, ఈ సంస్కరణలు వ్యాపార ప్రక్రియలను సులభతరంగా మార్చాయని ఆయన చెప్పారు. ఈ సంస్కరణల ఫలితంగా, ప్రపంచ బ్యాంకు యొక్క డూయింగ్ బిజినెస్ రిపోర్టు లో భారతదేశం 42 మెట్లు పైకి ఎగబాకి 190 దేశాలలో ప్రస్తుతం 100వ స్థానంలో నిలచిందని ఆయన అన్నారు.

అస్సామ్ కు చెందిన గొప్ప సంగీత విద్వాంసుడు శ్రీ భూపేన్ హజారికా ను గురించి ప్రధాన మంత్రి ఉదాహరిస్తూ, మన స్వాతంత్ర్య సమర యోధులు కన్న కలలను మరియు వారి దార్శనికతను సాకారం చేయడంతో పాటు 2022 కల్లా ఒక న్యూ ఇండియా ను ఆవిష్కరించడం కూడా మన అందరి బాధ్యత అన్నారు.

ఈశాన్య ప్రాంతంలో ఒక కొత్త రవాణా సంబంధ మౌలిక సదుపాయాల వ్యవస్థ ను నిర్మించేందుకు చేసిన కృషిని గురించి ప్రధాన మంత్రి ఈ సందర్భంగా చెప్పుకొచ్చారు.

అస్సాం లో వ్యాపారానికి, అభివృద్ధికి అనుకూలించే వాతావరణాన్ని అస్సాం ముఖ్యమంత్రి శ్రీ సర్బానంద సోనోవాల్ ఆవిష్కరిస్తున్నారంటూ ఆయనను ప్రధాన మంత్రి అభినందించారు.

***