పిఎంఇండియా
ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గురువారం నాడు కేంద్ర ప్రభుత్వంలో పనిచేస్తున్న 80 మందికిపైగా అదనపు, సంయుక్త కార్యదర్శి స్థాయి అధికారులతో సమావేశమయ్యారు. ఇలాంటివి మొత్తం ఐదు నిర్వహించాలని నిర్ణయించిన నేపథ్యంలో ఇది రెండో అన్యోన్య సమావేశం కావడం గమనార్హం. పనితీరు ఆధారిత పరిపాలన, పాలనలో ఆవిష్కరణ, వ్యర్థాల నిర్వహణ, నదీ-పర్యావరణ కాలుష్యం, అడవులు, పారిశుధ్యం, వాతావరణ మార్పు, వ్యవసాయంలో విలువ జోడింపు, విద్య, నైపుణ్యాభివృద్ధి తదితర అంశాలపై ఈ సమావేశంలో తమ అనుభవాలను అధికారులు పరస్పరం పంచుకున్నారు. అధికారులు తమ అనుభవాలను వెల్లడించిన తర్వాత ప్రధానమంత్రి ప్రతిస్పందిస్తూ- కార్యాలయాల్లో ఫైళ్లకు పరిమితం కాకుండా క్షేత్రస్థాయికి వెళ్లి విధాన నిర్ణయాల ప్రభావం ఎలా ఉన్నదీ అర్థం చేసుకునేందుకు కృషి చేయాలని నొక్కిచెప్పారు. గుజరాత్లో 2001నాటి భూ కంపం అనంతరం సహాయ పునరావాస కార్యక్రమాల్లో అధికారులకు ఎదురైన అనుభవాలను ప్రధాని గుర్తు చేశారు.
అధికారులు తమ పనిని కేవలం అధికార విధుల్లో భాగంగా చూడరాదని, దేశంలో సుపరిపాలన కోసం పరివర్తన దిశగా పనిచేసేందుకు లభించిన సదవకాశంగా భావించాలని పిలుపునిచ్చారు. పాలన ప్రక్రియలను సరళం చేసేందుకు సాంకేతిక ఆవిష్కరణను వినియోగించుకోవాలని వారికి సూచించారు. దేశంలో అత్యంత వెనుకబడిన 100 జిల్లాలపై నిశితంగా దృష్టి సారించాలని, తద్వారా వివిధ అభివృద్ధి పారామితుల మేరకు వాటి ప్రగతిని జాతీయ సగటు స్థాయికి చేర్చాలని కోరారు.