పిఎంఇండియా
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
భారత్ మాతాకీ జై!
ఆంధ్రప్రదేశ్ గవర్నర్ శ్రీ అబ్దుల్ నజీర్, గోవా గవర్నర్-ఈ నేల ముద్దుబిడ్డ శ్రీ అశోక్ గజపతి రాజు గారు, రాష్ట్ర ముఖ్యమంత్రి-నా మిత్రుడు శ్రీ చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి సోదరుడు శ్రీ పవన్ కల్యాణ్, కేంద్ర మంత్రిమండలిలో నా యువ సహచరులు-సోదరులైన శ్రీ రామ్మోహన్ నాయుడు, శ్రీ చంద్రశేఖర్ పెమ్మసాని, శ్రీ భూపతి రాజు శ్రీనివాస వర్మ, రాష్ట్ర మంత్రి-సోదరుడు శ్రీ నారా లోకేష్, ఇతర ప్రజాప్రతినిధులు, సోదరీసోదరులారా…
మీకందరికీ నమస్కారం!
మిత్రులారా!
ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి, ‘స్వర్ణాంధ్ర’ లక్ష్య సాధన దిశగా ప్రస్థానంలో ఈ రోజుకు నా దృష్టిలో ఎంతో ప్రాధాన్యం ఉంది. ఎందుకంటే- ప్రస్తుత శుభ మాసంలో, ఈ పవిత్ర ఉత్తరాంధ్ర గడ్డమీద పాదం మోపే అవకాశం నాకు లభించడం నిజంగా నా అదృష్టం. ముందుగా శ్రీ వరాహ లక్ష్మీ నరసింహ స్వామి వారి పాదాలకు ప్రణమిల్లుతూ, శ్రీ కూర్మనాథ స్వామికి, పైడితల్లి అమ్మవారికి పుష్పాంజలి అర్పిస్తున్నాను.
మిత్రులారా!
నేడిక్కడ సుమారు రూ.18 వేల కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభం, జాతికి అంకితం, శంకుస్థాపన చేశాను. భోగాపురం విమానాశ్రయంతో పాటు ఈ ప్రాజెక్టులన్నీ ఆంధ్రప్రదేశ్ రహదారి సంధానంలో ఎంతగానో దోహదం చేస్తాయి. వీటిలో ఇంధన భద్రత సంబంధిత ప్రాజెక్టులు కూడా ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఎంత వేగంగా ప్రగితి పథంలో దూసుకెళ్తున్నదో ఈ అభివృద్ధి పనులన్నీ స్పష్టం చేస్తాయి. ఈ ప్రాజెక్టులన్నీ సొంతమవుతున్న నేపథ్యంలో మీకందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు.
మిత్రులారా!
ఇవాళ్టి ఈ కార్యక్రమం ఓ కొత్త చరిత్రకు నాంది పలికి, సరికొత్త రికార్డును సృష్టించేదిగా నిలిచింది. ఈ మేరకు ఇటు అభివృద్ధిలో కొత్త రికార్డులు నమోదవుతుండగా, అటు ‘థింసా’ నృత్య ప్రదర్శనతో వినూత్న సాంస్కృతిక రికార్డును నెలకొల్పారు. ఏకకాలంలో సాధించిన ఈ రెండు విభిన్న రంగాల ఘనత కచ్చితంగా చంద్రబాబు గారి ప్రత్యేకత. ఒకవైపు ఆకాశాన్నంటే విమానాశ్రయ నిర్మాణం, మరోవైపు ఇక్కడి గిరిజన సోదరీమణుల ‘థింసా’ నృత్యం ప్రపంచ రికార్డు… ఆయన దార్శనికతను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను.
ఈ ప్రాంతంలోని 13 వేల మందికిపైగా గిరి పుత్రికలైన అక్కచెల్లెళ్లు ఉత్సాహం, క్రమశిక్షణ, తమ సంస్కృతిపై నిండు గౌరవంతో తమ నాట్య విన్యాసాన్ని ప్రదర్శించిన తీరు నిజంగా అత్యద్భుతం. ఈ ప్రదర్శన ద్వారా దేశ వైవిధ్యమే కాకుండా తరతరాలుగా కాపాడుకుంటూ వస్తున్న గిరిజన వారసత్వం కూడా ప్రతిబింబించింది. ఈ ప్రదర్శనలో భాగస్వాములైన అందరికీ… ముఖ్యంగా గిరిపుత్రికలైన నా సోదరీమణులకు అభినందనలు తెలుపుతున్నాను.
మిత్రులారా!
ఇది మహనీయుడైన శ్రీ అల్లూరి సీతారామరాజు నడయాడిన నేల. గిరిజన ప్రయోజనాల పరిరక్షణకు ఆయన తన జీవితాన్ని అంకితం చేశారు. అలాంటి పావన భూమిలో నేడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సరికొత్త విమానాశ్రయం ప్రారంభమవుతోంది. ఇది ఆంధ్ర, ఉత్తరాంధ్ర ప్రాంతాల ప్రగతిని పరుగు పెట్టించే ‘రన్వే’ వంటిది. ఆంధ్ర యువత ఉజ్వల భవిష్యతకు ఒక ప్రయోగ వేదికలాంటిది. ఈ సందర్భంగా రాష్ట్ర, దేశ ప్రజలందరికీ నా హృదయపూర్వక అభినందనలు.
మిత్రులారా!
లోగడ విమానాశ్రయాలను నిర్మించిన సందర్భాల్లో వాటికి ఓ కుటుంబంలోని వారి పేర్లు పెట్టేవారు. ఆ సంప్రదాయాన్ని పూర్తిగా మారుస్తూ- అయోధ్య విమానాశ్రయానికి వాల్మీకి పేరును, పంజాబ్ విమానాశ్రయానికి సంత్ రవిదాస్ పేరును మేం జోడించాం.
అంతేకాదు, మిత్రులారా!
ఈ కొత్త విమానాశ్రయానికి శ్రీ అల్లూరి సీతారామరాజు పేరు పెట్టాలని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం నిర్ణయించింది. ఈ రాష్ట్రం, దేశం నుంచే కాకుండా ప్రపంచం నలుమూలల నుంచి ఈ విమానాశ్రయం ద్వారా ప్రయాణించే ప్రతి ఒక్కరికీ అల్లూరి సీతారామరాజు పేరు, ఆయన సేవాభావం దేశ సేవ దిశగా నేటి తరాలకు ఉత్తేజమిస్తాయి.
మిత్రులారా!
మన విమానయాన రంగం గత పుష్కర కాలంలో అద్భుత ప్రగతి సాధించింది. దేశవ్యాప్తంగా 2014 వరకు 74 విమానాశ్రయాలు మాత్రమే పనిచేసేవి కాగా, నేడు వాటి సంఖ్య 166కు పెరిగింది. విమాన ప్రయాణం ఒకనాడు పెద్ద నగరాలకే పరిమితం. కానీ, ఇవాళ ఎన్డీఏ ప్రభుత్వ హయాంలో చిన్న పట్టణాల్లోని సామాన్యులు కూడా విమానం ఎక్కుతున్నారు. పన్నెండేళ్లలో విమానాశ్రయాల సంఖ్య పెరగడమే కాకుండా, ‘ఉడాన్’ పథకం వల్ల పేద కుటుంబాలకూ విమానయాన అనుభూతి చేరువైంది. విమానంలో ప్రయాణించాలన్న వారి కలను సాకారం చేయడంలో ఈ పథకం పాత్ర కీలకం. కొద్ది రోజుల కిందటే ప్రభుత్వం రూ.29 వేల కోట్లతో ‘ఉడాన్ 2.0’ను ప్రారంభించింది.
మిత్రులారా!
విమానయాన రంగంలో దేశం మరో కీలక మలుపును చేరింది. ఈ మేరకు కొద్ది రోజుల కిందట కాశీలో ప్రారంభించిన ‘స్పోక్ ఎయిర్పోర్ట్ మోడల్’ నేడు పంజాబ్లోని అమృత్సర్కు విస్తరించింది. తద్వారా ఈ నగరం నుంచి 25కు పైగా అంతర్జాతీయ గమ్యాలకు విమాన సంధానం లభిస్తుంది. ఈ విజయానికిగాను ఆంధ్రప్రదేశ్ గడ్డపై నుంచి పంజాబ్ ప్రజలకు నా అభినందనలు తెలుపుతున్నాను.
మిత్రులారా!
వికసిత భారతావనికి రూపునివ్వడంలో మన ఆంధ్రప్రదేశ్ సదా ‘వృద్ధి చోదకం’గా నిలుస్తోంది. ఈ రాష్ట్ర ప్రగతి సంబంధిత కృషి ‘డబుల్ ఇంజిన్’ వేగంతో దూసుకెళ్లాలనే సత్సంకల్పంతో ఇక్కడి ప్రజల నుంచి ‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం’ పేరిట ఆశీర్వాదం కోరాను. ఆ మేరకు నేడు శ్రీ చంద్రబాబు నాయుడు, శ్రీ పవన్ కల్యాణ్ల నాయకత్వంలో ఎన్డీఏ బృందం యావత్ రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధి కోసం రెట్టింపు వేగంతో పనిచేస్తోంది.
మిత్రులారా!
మన దేశం ఇవాళ ‘నీలి (సముద్ర ఆధారిత) ఆర్థిక వ్యవస్థ‘ను నిరంతరం బలోపేతం చేస్తోంది. ఈ ప్రాంతం యావత్తూ ఒక ‘తీరప్రాంత ఆర్థిక కారిడార్’గా రూపొందాలన్నది మా లక్ష్యం. తదనుగుణంగా విశాఖపట్నం నుంచి కృష్ణపట్నం దాకా మన పాత ఓడరేవులన్నిటినీ ఆధునికీకరిస్తున్నాం. అంతేకాకుండా మూలాపేట, రామాయపట్నంలలో కూడా కొత్త ఓడరేవులను నిర్మిస్తున్నాం.
మిత్రులారా,
ఓడరేవుల అభివృద్ధితో పాటు ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా జాతీయ రహదారులు, ఎక్స్ప్రెస్వేల వ్యవస్థ రూపుదిద్దుకుంటోంది. విశాఖపట్నం-రాయ్పూర్ ఎక్స్ప్రెస్వే వంటి ప్రాజెక్టులు ఈ మొత్తం ప్రాంతానికి గొప్ప వేగాన్ని అందిస్తున్నాయి.
మిత్రులారా,
ఈ ప్రాంతం దేశంలోని ప్రధాన పారిశ్రామిక కేంద్రాలతో సులభంగా అనుసంధానమయ్యేలా నేడు ఆంధ్రప్రదేశ్లో సుమారు లక్ష కోట్ల రూపాయల విలువైన రైల్వే ప్రాజెక్టుల పనులు వేగంగా జరుగుతున్నాయి. రాష్ట్రంలోని మొత్తం రైల్వే వ్యవస్థ విద్యుదీకరణ పూర్తయింది. ఇక్కడ డెబ్బైకి పైగా రైల్వే స్టేషన్లను ఆధునీకరిస్తున్నారు.
మిత్రులారా,
నేడు ఈ ప్రాంత పురోగతిలో పీఎం గతి శక్తి జాతీయ మాస్టర్ ప్లాన్ కీలక పాత్ర పోషిస్తోంది. పీఎం గతి శక్తి ద్వారా ఈ ప్రాంతమంతటా రైలు, ఓడరేవు, విమానాశ్రయ వ్యవస్థలను ఏకం చేస్తున్నారు. ఈ ఆధునిక లాజిస్టిక్స్ వ్యవస్థ సిద్ధమైనప్పుడు పరిశ్రమలకు మెరుగైన రవాణా లభిస్తుంది. రైతులకు ప్రయోజనం చేకూరుతుంది. వ్యాపార సౌలభ్యం కూడా మరింత తేలికవుతుంది.
మిత్రులారా,
ఆంధ్రప్రదేశ్ ఎప్పుడూ భవిష్యత్తు ఆలోచనలు కలిగిన రాష్ట్రంగా ఉంది. సాఫ్ట్వేర్, ఐటీ, సాంకేతిక రంగాల్లో ఆంధ్ర యువత ప్రపంచవ్యాప్తంగా తమ ప్రత్యేక ముద్ర వేశారు. అందుకే ఇక్కడి అపారమైన నైపుణ్యాన్ని ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి శక్తితో అనుసంధానించాలని ప్రభుత్వం భావిస్తోంది. మన యువత ప్రతిభ ద్వారా ఆంధ్రప్రదేశ్, దేశం వీలైనంత ఎక్కువ ప్రయోజనం పొందాలి. ఇందుకోసం సెమీకండక్టర్ల వంటి భవిష్యత్తు సాంకేతిక పరిశ్రమలపై ప్రస్తుతం ప్రధానంగా దృష్టి పెట్టాం. విశాఖపట్నంలో కొత్త సెమీకండక్టర్ కేంద్రానికి శంకుస్థాపన చేయడం ఆ దిశగా వేసిన ఒక భారీ అడుగు. చంద్రబాబు నాయకత్వంలో మన ఆంధ్ర ఇప్పుడు సాఫ్ట్వేర్తో పాటు తయారీ రంగానికి కూడా అతిపెద్ద కేంద్రంగా మారుతుంది. ఇది ఆంధ్రప్రదేశ్లో భవిష్యత్తు ఉద్యోగాలను సృష్టిస్తుంది, టెక్ పరిశ్రమలకు నూతన వాతావరణాన్ని అందిస్తుంది.
మిత్రులారా,
ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ఎక్కడైనా సరే, కేవలం ఒక్క కర్మాగారం వల్ల మాత్రమే అభివృద్ధి రూపుదిద్దుకోదు. దానికి ఒక సమగ్ర మద్దతు వ్యవస్థ అవసరం. నేడు ఆంధ్రప్రదేశ్లో మేము అదే విధమైన అభివృద్ధి వ్యవస్థను నిర్మిస్తున్నాము. చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత స్థాయిలో రాత్రింబవళ్లు శ్రమిస్తున్నారు. ఆయన పడుతున్న ఈ కష్టం ఫలితంగానే నేడు ప్రపంచంలోని అనేక పెద్ద కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి ముందుకు వస్తున్నాయి.
మిత్రులారా,
సెమీకండక్టర్లతో పాటు కృత్రిమ మేధ మౌలిక వసతులు, డేటా సెంటర్ల అభివృద్ధి పనులు ఇక్కడ వేగంగా జరుగుతున్నాయి. గూగుల్ కూడా ఇక్కడ పదిహేను బిలియన్ డాలర్ల విలువైన ఎఐ, క్లౌడ్ మౌలిక వసతుల క్యాంపసును ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించింది. ఇంకా అనేక ఇతర అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కొత్త అవకాశాలను చూస్తున్నాయి. దీని ద్వారా దేశంలోని యువతతో పాటు ఆంధ్రప్రదేశ్ యువతకు భారీ ప్రయోజనం చేకూరుతోంది.
మిత్రులారా,
ఆంధ్రప్రదేశ్ పారిశ్రామిక ప్రగతి కేవలం డిజిటల్ సాంకేతికతకు మాత్రమే పరిమితం కాలేదు. నక్కపల్లిలో ఒక భారీ బల్క్ డ్రగ్/ఫార్మా పార్కు ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి మద్దతు ఇస్తోంది. దీనివల్ల ఆంధ్రప్రదేశ్ దేశంలోనే ఒక ప్రధాన ఫార్మా కేంద్రంగా కూడా అభివృద్ధి చెందుతుంది. హరిత ఇంధన రంగంలో ఒక్క రాయలసీమ ప్రాంతంలోనే అయిదు లక్షల కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులు వచ్చాయి. ఈ ప్రతి అవకాశాన్ని నిజం చేయడానికి మా ప్రభుత్వం (ఈ డబుల్ ఇంజిన్ ప్రభుత్వం) రాత్రింబవళ్లు కృషి చేస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రజలైన మీ అందరికీ ఈరోజు నేను మరోసారి హామీ ఇస్తున్నాను.
మిత్రులారా,
నేడు ఆంధ్రప్రదేశ్లో ప్రతి రంగంలోనూ పనులు జరుగుతున్న వేగాన్ని మీరు ఒక విషయం ద్వారా అర్థం చేసుకోవచ్చు. గత 3 పర్యటనల్లోనే నేను ఇక్కడ రెండు లక్షల కోట్ల రూపాయల విలువైన ప్రాజెక్టులను ప్రారంభించాను. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రయాణంలో ‘ఉత్తరాంధ్ర’ కూడా సాధికారత సాధిస్తుండటం నాకు ఎంతో సంతోషాన్ని కలిగిస్తోంది. విశాఖపట్నం ఆర్థిక ప్రాంతాన్ని (వీఈఆర్) దేశంలోనే అత్యంత ప్రధాన పారిశ్రామిక కేంద్రంగా అభివృద్ధి చేస్తున్నాము.వీఈఆర్ ఆసియాలోనే ఒక ప్రముఖ ఆర్థిక కేంద్రంగా మారాలన్నది మా లక్ష్యం. ఈ విమానాశ్రయం నుంచి సెమీకండక్టర్ కేంద్రం వరకు ప్రతి ఒక్కటి ఈ లక్ష్య సాధనలో భాగమే.
మిత్రులారా,
‘పెట్టుబడుల ద్వారా ఉద్యోగాలు’ ఇదే మా ప్రభుత్వ మంత్రం. అందుకే ప్రభుత్వం తన వైపు నుంచి పెట్టుబడులను పెంచడమే కాకుండా, ప్రైవేటు రంగాన్ని కూడా పెట్టుబడులు పెట్టేలా ప్రోత్సహిస్తోంది. పెట్టుబడులు పెరిగినప్పుడు ఉత్పత్తి పెరుగుతుంది. ఉత్పత్తి పెరిగినప్పుడు ఎగుమతులు పెరుగుతాయి. ఎగుమతులు పెరిగినప్పుడు కొత్త ఉద్యోగావకాశాలు లభిస్తాయి. ఉద్యోగాలు పెరిగినప్పుడు ప్రజల ఆదాయం పెరిగి, కుటుంబాల జీవన ప్రమాణాలు మెరుగవుతాయనే విషయం మీకు తెలుసు. సరిగ్గా ఈ ప్రక్రియే ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో నిజమవుతుండటం మనం చూస్తున్నాం.
మిత్రులారా,
నేడు ఇక్కడ ప్రారంభించిన, శంకుస్థాపన చేసిన ప్రాజెక్టులన్నీ ‘స్వర్ణాంధ్ర’, ‘వికసిత్ భారత్’ సంకల్పాలను నెరవేర్చడంలో అపారమైన సహకారాన్ని అందిస్తాయని నాకు పూర్తి నమ్మకం ఉంది. చంద్రబాబు గారి నాయకత్వంలో వికసిత్ భారత్ కలను నిజం చేయడానికి ఆంధ్రప్రదేశ్ ఒక గొప్ప శక్తి వనరుగా మారుతోంది. ఈ అన్ని ప్రాజెక్టుల సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలకు నేను మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను.
చాలా ధన్యవాదాలు.
భారత్ మాతాకీ జై.
భారత్ మాతాకీ జై.
భారత్ మాతాకీ జై.
చాలా ధన్యవాదాలు.
****
Speaking at a programme in Bhogapuram, Andhra Pradesh. Today's projects across aviation, clean energy, semiconductors and connectivity will contribute to the state's development.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
https://t.co/FYHq8N02n3
अल्लूरी सीताराम राजू जी ने जिस धरती पर आदिवासी हितों के लिए अपना जीवन समर्पित किया... आज उसी धरती पर आंध्र प्रदेश के एक नए airport की शुरुआत हो रही है।
— PMO India (@PMOIndia) August 1, 2026
ये airport आंध्र और उत्तर आंध्र की growth का runway है।
ये आंध्र के युवाओं के बेहतर भविष्य का launchpad है: PM @narendramodi
आज देश blue economy को लगातार मजबूत कर रहा है।
— PMO India (@PMOIndia) August 1, 2026
हमारा vision है कि ये पूरा क्षेत्र Coastal Economic Corridor के रूप में विकसित हो।
इसी लक्ष्य के साथ, विशाखापट्टनम से कृष्णापट्टनम तक... हमारे पुराने ports को आधुनिक रूप दिया जा रहा है।
इसके अलावा मुलापेटा और रामायापट्टनम में, हम…
हमारे talented युवाओं की प्रतिभा का लाभ आंध्र प्रदेश और देश को ज्यादा से ज्यादा मिले, ये आवश्यक है।
— PMO India (@PMOIndia) August 1, 2026
इसके लिए हमारा focus अब semiconductor जैसी futuristic tech industry पर है।
विशाखापट्टनम में नए semiconductor plant का शिलान्यास... इसी दिशा में एक बड़ा कदम है: PM @narendramodi
Delighted to receive the exquisitely handcrafted Bobbili Ekanda Veena in Bhogapuram.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
The Veena has a special place in India’s musical traditions. It embodies the skills of Andhra Pradesh’s artisans. My compliments to them for preserving the culture of the state. pic.twitter.com/31KoBnap4t
Congratulations to my sisters and brothers of Andhra Pradesh for the inauguration of the Alluri Sitarama Raju International Airport in Bhogapuram.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
The naming of this airport is also in line with our emphasis of recognising the contribution of inspiring personalities from our… pic.twitter.com/EaDjUCPjuj
The NDA Government at the Centre and in Andhra Pradesh are working with remarkable speed for the state’s progress. We are focusing on the Blue Economy, port development, industrial growth and more. pic.twitter.com/ClHW26dZWN
— Narendra Modi (@narendramodi) August 1, 2026
Under the leadership of my friend Shri Chandrababu Naidu Garu, Andhra Pradesh is thinking of the future and working towards it with great vigour. The state is working hard in sectors such as semiconductors, IT and innovation. This will benefit the youth of the state.@ncbn pic.twitter.com/qpSAad8efD
— Narendra Modi (@narendramodi) August 1, 2026
భోగాపురంలోని అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రారంభించడం ఎంతో ఆనందంగా ఉంది. ఇది అనుసంధానాన్ని బలోపేతం చేసి, ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని వేగవంతం చేసే ఒక చారిత్రాత్మక ప్రాజెక్టు.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ఈ విమానాశ్రయం అత్యాధునిక మౌలిక సదుపాయాలు మరియు అత్యాధునిక సాంకేతికతలను సమన్వయం చేసి,… pic.twitter.com/wUzXWVNPwe
భోగాపురంలో అత్యంత నైపుణ్యంతో హస్త కళతో రూపొందించిన బొబ్బిలి ఏకాండ వీణను అందుకోవడం ఎంతో ఆనందంగా ఉంది.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
భారతీయ సంగీత సంప్రదాయాల్లో వీణకు ఒక విశిష్ట స్థానం ఉంది. ఈ వీణ ఆంధ్రప్రదేశ్ కళాకారుల అపూర్వ నైపుణ్యానికి ప్రతీక. రాష్ట్ర సంస్కృతిని పరిరక్షిస్తున్న వారికి నా అభినందనలు. pic.twitter.com/mZETGke291
భోగాపురంలో అల్లూరి సీతారామ రాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభమైన సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన నా సోదరీ సోదరులందరికీ హృదయపూర్వక అభినందనలు.
— Narendra Modi (@narendramodi) August 1, 2026
ఈ విమానాశ్రయానికి అల్లూరి సీతారామ రాజు పేరు పెట్టడం కూడా, మన ఘన చరిత్రలో స్ఫూర్తిదాయకమైన మహనీయుల సేవలను గుర్తించి గౌరవించాలనే మా… pic.twitter.com/bR0S60GVA1
కేంద్రంలోనూ, ఆంధ్రప్రదేశ్లోనూ పాలిస్తున్న ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర ప్రగతి కోసం విశేష వేగంతో పనిచేస్తోంది. బ్లూ ఎకానమీ, నౌకాశ్రయాల అభివృద్ధి, పారిశ్రామిక వృద్ధి తదితర రంగాలపై మేము ప్రత్యేక దృష్టి సారిస్తున్నాం. pic.twitter.com/6Hx6ejqpkx
— Narendra Modi (@narendramodi) August 1, 2026
నా మిత్రుడు శ్రీ చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని గొప్ప ఉత్సాహంతో ముందుకు సాగుతోంది. సెమీకండక్టర్లు, ఐటీ, ఆవిష్కరణలు వంటి రంగాల్లో రాష్ట్రం ఎంతో కృషి చేస్తోంది. దీనివల్ల రాష్ట్ర యువతకు విశేష ప్రయోజనం చేకూరుతుంది.@ncbn pic.twitter.com/zMpc1laK83
— Narendra Modi (@narendramodi) August 1, 2026