Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశవాణి లో 2017 మార్చి నెల 26వ తేదీ న ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ ( మనసులో మాట) కార్యక్రమం పూర్తి పాఠం


ప్రియమైన నా దేశ వాసులారా, మీ అందరికీ నా నమస్కారం. దేశం నలుమూలలా ఎక్కువ శాతం కుటుంబాలు వారి పిల్లల పరీక్షలలో నిమగ్నమై ఉండి ఉంటారు. పరీక్షలు అయిపోయిన వారి కుటుంబాలలో కాస్త ఉపశమనభరిత వాతావరణం, పరీక్షలు జరిగే కుటుంబాలలో కాస్తంత ఒత్తిడితో కూడిన వాతావరణం ఉండి ఉంటాయి. ఇటువంటి సమయంలో నేనొక్కటే చెప్పగలను , క్రితం సారి ‘మనసులో మాట’ లో నేను విద్యార్థులతో ఏ ఏమాటలైతే చెప్పానో, వాటిని మళ్ళీ వినండి. పరీక్షల సమయంలో మీకవి చాలా పనికి వస్తాయి.

ఇవాళ మార్చి 26. ఈ రోజు బంగ్లాదేశ్ స్వతంత్ర దినోత్సవం. అన్యాయానికి వ్యతిరేకంగా జరిగిన ఒక చరిత్రాత్మక యుధ్ధంలో బంగ-బంధు నాయకత్వంలో బంగ్లాదేశ్ మునుపెన్నడూ లేని విజయాన్ని సాధించింది. ఇలాంటి ప్రత్యేకమైన రోజున స్వతంత్ర బంగ్లాదేశ్ సోదర పౌరులకూ, సోదరీమణులకు స్వతంత్ర దినోత్సవం సందర్భంగా అనేకానేక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, బంగ్లాదేశ్ ఇంకా అభివృధ్ధి పథంలోకి ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాను. బంగ్లాదేశ్ కు ఒక బలమైన తోడుగా, ఒక మంచిమిత్రదేశంగా, మీతో చేయీ చేయీ కలిపి ఈ యావత్ ప్రాంతంలో శాంతి భద్రతలను కాపాడి, మీరు అభివృధ్ధి దిశగా అడుగులు వెయ్యడానికి భారతదేశం పూర్తి సహకారాన్ని అందిస్తూనే ఉంటుంది.

మన రవీంద్రనాథ్ టాగూర్ జ్ఞాపకాలు మన రెండుదేశాలకూ భాగస్వామ్య వారసత్వమవ్వడంమనకెంతో గర్వకారణం. ఎందుకంటే బంగ్లాదేశ్జాతీయగీతం మన గురుదేవులు రవీంద్రనాథ్టాగూర్ రచన. రబీంద్రనాథ్ టాగూర్ గురించి ఒక ఆసక్తికరమైన సంగతి ఏమిటంటే, 1913లో నోబెల్ పురస్కారాన్ని అందుకున్న మెట్టమొదటి వ్యక్తి ఆయన. అంతే కాదు, ఆంగ్లేయులు ఆయనకు‘Knighthood’ బిరుదును ఇచ్చారు కూడా. 1919లో జలియన్ వాలా బాగ్ లో  ఆంగ్లేయులు మారణహోమాన్ని సృష్టించినప్పుడు వారికి వ్యతిరేకంగా గళమెత్తిన మహామనుషులలో రబీంద్రనాథ్ టాగూర్ కూడా ఒకరు. ఈ సంఘటనే ఒక పన్నెండేళ్ల బాలుడి మనసుపై బలమైన ప్రభావాన్ని చూపిన సమయం. ఆడుతూ పాడుతూ గడపాల్సిన బాల్యంలో ఈ జలియన్ వాలా బాగ్ మారణహోమం ఆ పిల్లవాడి జీవితానికి ఒక ప్రేరణను ఇచ్చింది. 1919లో  పన్నెండేళ్ళున్న ఆ చిన్న భగతే మనందరికీ ప్రియమై, ప్రేరణగా నిలచిన అమరవీరుడు భగత్ సింగ్. ఇవాళ్టికి మూడు రోజుల క్రితం మార్చి నెల 23వ తేదీన భగత్ సింగ్ నూ, అతడి మరో ఇద్దరు మిత్రులు సుఖ్ దేవ్, రాజ్ గురూ లనూ ఆంగ్లేయులు ఉరికంబానికి ఎక్కించారు. ఆ సంఘటన భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురూ ముగ్గురికీ మృత్యుభయం లేకుండా, భారత మాతకు సేవ చేసుకున్న సంతోషాన్ని మిగిల్చిందన్న సంగతి మనందరికీ తెలుసు. వారు ముగ్గురూ భారత మాతకు స్వతంత్య్రాన్ని అందివ్వడం కోసం జీవితం పట్ల తమకున్న కలలన్నీ అంకితం చేశారు. ఇవాళ్టికి కూడా ఈ ముగ్గురు వీరులూ మనకెంతో ప్రేరణను అందిస్తారు. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురూ ల ప్రాణ సమర్పణల గాథను మనం అక్షరాల్లో పెట్టలేము కూడా. యావత్ బ్రిటిష్ సామ్రాజ్యం ఈ ముగ్గురికీ భయపడేది.

ఉరి శిక్ష పడి వారు జైలులో ఉన్నప్పటికీ, వారితో ఎలా మెలగాలో అనే చింత బ్రిటిష్ వారికి ఉండేది. అందుకే ఎవ్వరూ చెయ్యని విధంగా మార్చి నెల 24వ తేదీన ఉరి శిక్షను అమలుపరచాల్సి ఉండగా, మార్చి నెల 23వ తేదీ నాడే శిక్ష అమలుపరచారు.  అంతే కాక వారి మృతదేహాలను దొంగతనంగా ఇవాళ్టి పంజాబ్ ప్రాంతానికి తీసుకువచ్చి దహనం చేయించారు. చాలా ఏళ్ళ క్రితం ఆ ప్రాంతానికి నేను మొదటిసారి వెళ్ళినప్పుడు ఒకరకమైన ప్రకంపనలు నా శరీరంలో కలిగాయి. ఎప్పుడైనా అవకాశం లభిస్తే, పంజాబ్ కు వెళ్ళి భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురూ ల మాతృమూర్తులు, ఇంకా బటుకేశ్వర్ దత్ సమాధులను దర్శించవలసిందిగా దేశ యువతకు నేను సూచిస్తున్నాను.

ఆ సమయంలోనే స్వాతంత్ర్యం కోసం పిలుపు, దాని తీవ్రత, దాని పరిమాణం పెరుగుతూ ఉంది. ఒకవైపు భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురూ ల వంటి వీరులు సాయుధ విప్లవానికై యువకులను ప్రేరేపించారు. ఇవాళ్టికి సరిగ్గా వందేళ్ల పూర్వం 1917 ఏప్రిల్ 10వ తేదీ నాడు మహాత్మా గాంధీ చంపారణ్ సత్యాగ్రహం చేశారు. ఇది చంపారణ్ సత్యాగ్రహ శతాబ్ది సంవత్సరం. భారత స్వాతంత్ర్య పోరాటంలో గాంధేయ వాదం, గాంధీ గారి వ్యవహార శైలి మొదటిసారి చంపారణ్ సమయంలోనే తెలిసింది. ముఖ్యంగా పోరాటం తాలూకూ విధి విధానాల పరంగా స్వాతంత్ర్యం కోసం సల్సిన పోరాటం ప్రయాణం మొత్తంలో ఈ సంఘటన ఒక మైలురాయి. ఈ సమయంలోనే జరిగిన చంపారణ్ సత్యాగ్రహం, ఖేడా సత్యాగ్రహం, అహ్మదాబాద్ లోని మిల్లు కార్మికుల సమ్మె.. వీటన్నింటిలో మహాత్మా గాంధీ గారి ఆలోచనలూ, వ్యవహార శైలి తాలూకూ బలమైన ప్రభావం కనబడుతుంది. 1915 లో గాంధీ గారు విదేశాల నుండి తిరిగివచ్చారు. 1917లో బిహార్ లోని ఒక చిన్న గ్రామానికి వెళ్ళి ఆయన దేశానికి ఒక కొత్త ప్రేరణనిచ్చారు. ఇవాళ మన మనసుల్లో ఉన్నమహాత్మా గాంధీ గారి రూపం ఆధారంగా మనం చంపారణ్ సత్యాగ్రహం యొక్క ప్రభావాన్నిఅంచనా వెయ్యలేము. ఊహించండి.. 1915 లో భారతదేశానికి తిరిగివచ్చిన ఒక మనిషి జరిపిన కేవలం రెండేళ్ళ కార్యకలాపాలు. అంతకు ముందు దేశం ఆయనను ఎరుగదు. ఆయన ప్రభావం దేశంపై లేదు. అదే ఆరంభం. ఆ సమయంలో ఆయన ఎన్ని ఇబ్బందులను ఎదుర్కోవాల్సివచ్చిందో, ఎంత కష్టపడాల్సివచ్చిందో మనం ఊహించవచ్చు. జన సమీకరణ కౌశల్యం, భారతీయ సమాజం నాడి తెలుసుకునే శక్తి, తన ప్రవర్తనతో బ్రిటిష్ సామ్రాజ్యంలోని నిరుపేద వ్యక్తులు, నిరక్షరాస్యులను, పోరాటం కోసం ఒకటి చేయడం, ప్రేరేపించడం, పోరాటం కోసం బరి లోకి దింపడం, మొదలైన మహాత్మా గాంధీ గారి అద్భుత శక్తులను చూపించింది చంపారణ్ సత్యాగ్రహమే. అందువల్లే మనం గాంధీ గారి విశ్వరూపాన్ని దర్శించగలిగాం. ఒక వందేళ్ల క్రితం జరిగిన చంపారణ్ సత్యాగ్రహ సమయంలోని గాంధీ గారి గురించి తెలుసుకుంటే, సాధారణ జీవితాన్ని మొదలుపెట్టే ఏ వ్యక్తికైనా చంపారణ్ సత్యాగ్రహం ఎంతో తెలుసుకోవలసిన అంశమే. సాధారణ జీవితాన్ని ఎలా మొదలుపెట్టాలో, స్వయంగా ఎంత పరిశ్రమించాలో, గాంధీ గారు అదెలా చేశారో ఆయన నుండి నేర్చుకోవచ్చు. రాజేంద్ర బాబు గారు, ఆచార్య కృపలానీ గారి లాంటి మనం విన్న పెద్ద పెద్ద దిగ్గజ నేతలనందరినీ అదే సమయంలో గాంధీ గారు పల్లెపల్లెకూ పంపారు. ప్రజలతో కలసి, ప్రజలు చేసే పనిలో దానికి స్వాతంత్ర్య పోరాటపు రంగునద్దటం ఎలాగో నేర్పించారు. గాంధీ గారి ఈ విధి విధానాలను ఆంగ్లేయులు అర్థం చేసుకోలేకపోయారు. పోరాటాలు , ఆలోచనలూ రెండూ ఒకేసారి నడిచాయి. గాంధీ గారు దీనిని ఒకే నాణానికి రెండు ముఖాలుగా చేశారు. ఒకటి పోరాటమూ, రెండవది ఆలోచన. ఒక వైపున జైళ్ళు నింపుతూ ఉండడం, రెండవ వైపున వ్యూహాత్మక కార్యకలాపాలలో నిమగ్నమవడం. ఒకఅద్భుతమైన సంతులత గాంధి గారి కార్యశైలిలో ఉంది.

సత్యాగ్రహం అనే పదానికి అర్థం ఏమిటో, అసమ్మతి అంటే ఏమిటో, సహాయ నిరాకరణ అంటే ఏమిటో అంత పెద్ద సామ్రాజ్యానికి చూపెట్టారు. ఒక సంపూర్ణమైన అర్థాన్ని గాంధీ గారు మాటల ద్వారా కాక ఒక సఫలపూర్వకమైన ప్రయోగం ద్వారా చూపెట్టారు.

ఇవాళ దేశం చంపారణ్ సత్యాగ్రహం తాలూకు శతాబ్ది ఉత్సవాలు జరుపుకుంటున్న సమయంలో భారతదేశ సామాన్య పౌరుడి శక్తి ఎంత అపారమైందో తెలిపి, ఆ అసామాన్య శక్తిని స్వాతంత్ర్య ఉద్యమం వైపునకు నడిపినట్లే స్వరాజ్యం నుండి సురాజ్య ప్రయాణం, నూట పాతిక కోట్ల మంది ప్రజల సంకల్ప శక్తి వారి పరిశ్రమకు పరాకాష్ట. సర్వజన హితాయ – సర్వ జన సుఖాయ అనే మూల మంత్రాన్ని తీసుకుని, దేశం కోసం, సమాజం కోసం ఎంతో కొంత చెయ్యాలనే అఖండ ప్రయాసే స్వాతంత్ర్యం కోసం ప్రాణాలర్పించిన మహా పురుషుల కలలను సాకారం చేస్తుంది.

 ఇవాళ మనం ఇరవైఒకటవ శతాబ్దం వైపునకు అడుగులు వేస్తున్నప్పుడు, ఏ భారతీయుడు దేశం మారాలని అనుకోడు ? ఏ భారతీయుడు దేశంలో మార్పునకు భాగస్వామి అవ్వాలని కోరుకోడు ? మార్పును తేవాలనే నూట పాతిక కోట్ల మంది ప్రజల కోరిక, ప్రయత్నం ఇవే కొత్త భారతావనికి,  ఇండియాకు బలమైన పునాది. ‘న్యూ ఇండియా’ ఏ ప్రభుత్వ కార్యక్రమమూ కాదు. ఏ రాజకీయపక్షాల ఎన్నికల వాగ్దాన పత్రం  కాదు. ప్రాజెక్టూ కాదు. ‘న్యూ ఇండియా’  నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల ఆహ్వానం. నూట పాతిక కోట్ల మంది ప్రజలు కలసి ఏ భవ్య భారతాన్ని నిర్మించాలనుకుంటున్నారో ఆ భావమే ‘న్యూ ఇండియా’. నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల మనసుల్లో ఒక ఆశ ఉంది. ఒక కోరిక, ఒక సంకల్పం, ఒక ఉత్సాహం ఉన్నాయి.

ప్రియమైన నా దేశవాసులారా, మనం కాస్త మనసొంత జీవితాలలో నుండి బయటకు వచ్చి, కాస్త సానుభూతితో సమాజంలో జరుగుతున్న కార్యకలాపాలను చూస్తే, చుట్టుపక్కల ఏం జరుగుతోందో గమనించి, అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే లక్ష్యార్థులైన వ్యక్తులు నిస్వార్థ భావంతో, తమ సొంత బాధ్యతలనే కాకుండా సమాజం కోసం, దోపిడీకి గురయ్యే వార్తి కోసం, బాధితులు, వంచితుల కోసం, పేదల కోసం ఏదో ఒకటి చేస్తూ ఉండడం గమనిస్తే నిశ్చేష్టులౌతారు. అది కూడా ఒక తపస్సు లాగ, సాధన లాగ, ఒక మూగ సేవకుడి లాగ  వారి పనిని వారు చేసుకుపోతున్నారు. రోజూ ఆసుపత్రికి వెళ్ళి రోగులకు సేవ చేసేవారు చాలా మంది ఉన్నారు. రక్తదానం అంటే వెనువెంటనే పరుగు పెట్టే వారెందరో ఉన్నారు. అన్నార్తులకు భోజన సదుపాయాలను అందించే వారు ఎందరో ఉన్నారు. ఎందరో రత్నాల వంటి పుత్రులు ఉన్న భూమి మనది. ‘మానవ సేవే మాధవ సేవ’ అన్న సూత్రం మన రక్తంలో ఉంది. ఒక్కసారి దానికి సామూహికంగా, సంఘటిత రూపంగా చూస్తే ఇదెంత పెద్ద శక్తో తెలుస్తుంది. ‘న్యూ ఇండియా’ మాట వచ్చినప్పుడు, దాని గురించిన ఆలోచన , దాని గురించిన విమర్శ ఉండడం, విభిన్న దృష్టి కోణాల నుండి దానినిచూడడం స్వాభావికమే. ఇది ప్రజాస్వామ్యంలో అవసరం కూడా. కానీ నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజలు ఒకసారి సంకల్పిస్తే, వారి సంకల్పసిధ్ధి కోసం బాట ఎంచుకున్నట్లయితే, ఒక్కొక్క అడుగు ముందుకు వేసుకుంటూ నడిస్తే, నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల కల అయిన ‘‘న్యూ ఇండియా’’ మన కళ్ల ముందర సాకారమౌతుంది. ఇవన్నీ బడ్జెట్ సాయంతోనో, ప్రభుత్వ ప్రథకాల వల్లనో, ప్రభుత్వ ధనంతోనో జరగాలని లేదు. ప్రతి పౌరుడూ ట్రాఫిక్ నియమాలను పాటిస్తానని సంకల్పించాలి. తన బాధ్యతలను పూర్తి నిజాయితీతో నిర్వర్తిస్తానని సంకల్పించాలి, ప్రతి పౌరుడూ వారంలో ఒక రోజు తాను పెట్రోల్, డీజిల్ వాడనంటూ సంకల్పం చెప్పుకోవాలి. ఇవన్నీ మామూలు విషయాలే; కానీ మీరు దేశాన్నిఅప్పుడు చూడండి.. నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల స్వప్నం ‘న్యూ ఇండియా’ మన కళ్ల ముందర సాకారమౌతున్నట్లు కనబడుతుంది. చెప్పేదేమిటంటే, ప్రతి పౌరుడూ పౌర ధర్మాన్ని పాటించాలి. బాధ్యతలను నిర్వర్తించాలి. అప్పుడు దానంతట అదే న్యూఇండియాకు ఒక శుభారంభమౌతుంది.

2022 కల్లా భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లవుతాయి. భగత్ సింగ్, సుఖ్ దేవ్, రాజ్ గురూ లను గుర్తు చేసుకుందాం. చంపారణ్ సత్యాగ్రహాన్నిగుర్తు చేసుకుందాం. మనం కూడా మన జీవితాలను క్రమబద్ధం చేసి, సంకల్పబద్ధులమై ‘‘స్వరాజ్యం నుండి సురాజ్యం’’ యాత్రలో భాగమవుదామా ? నేను మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను.. రండి !

ప్రియమైన నా దేశ వాసులారా, నేను మీకు నా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. గత కొద్ది నెలలలో మన దేశంలో ఎలాంటి వాతావరణం నెలకొందంటే, చాలా పెద్ద ఎత్తున ప్రజలు డిజిటల్ చెల్లింపులు, డిజి- ధన్ ఉద్యమంలో భాగస్వాములయ్యారు. నగదు రహిత వ్యవహారాలు ఎలా జరపాలన్న ఉత్సుకత పెరిగింది. నిరుపేదలు కూడా ఆ సంగతులు నేర్చుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. ప్రజలు కూడా నెమ్మదినెమ్మదిగా నగదు రహితంగా వ్యాపారాలు ఎలా చెయ్యాలో తెలుసుకుంటూ ముందుకు నడుస్తున్నారు. నోట్ల రద్దు తరువాత రకరకాల డిజిటల్ చెల్లింపుల  విధానాలలో చాలా వృద్ధిని చూడగలిగాం. భీమ్ యాప్ ను  ప్రారంభించి రెండు- రెండున్నర నెలలు మాత్రమే అవుతున్నా, దగ్గర దగ్గర ఒకటిన్నర కోట్ల మంది ప్రజలు ఈ యాప్ ను డౌన్ లోడ్ చేసుకున్నారు.

 నా దేశ ప్రజలారా, నల్ల ధనం, అవినీతి పట్ల జరుపుతున్న పోరాటాన్ని మనం ముందుకు నడిపించాల్సి ఉంది. నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజలు ఈ ఏడాది కాలంలో రెండున్నర వేల కోట్ల డిజిటల్ లావాదేవీలు జరపగలమని సంకల్పించగలరా ? మేము బడ్జెట్ లో ప్రకటించాం. నూట పాతిక కోట్ల మంది దేశ ప్రజల కోసం చేసే ఈ పనిని వారు తలిస్తే ఒక సంవత్సరం వరకు ఆగాల్సిన పని లేదు. ఆరు నెలల్లో పూర్తి చేసెయ్యగలరు. రెండున్నర వేల కోట్ల డిజిటల్ లావాదేవీలకు- బడిలో కట్టే రుసుం నగదు రూపంలో కాక డిజిటల్ గా చెల్లిద్దాం. రైళ్ళలో ప్రయాణించినా, విమానాల్లో ప్రయాణించినా డిజిటల్ చెల్లింపులు జరుపుదాం. మందులు కొనుగోలు చేసినా డిజిటల్ పేమెంట్ చేద్దాం. చవక బియ్యం వ్యాపారం చేసినా డిజిటల్ వ్యవస్థ ద్వారా చేద్దాం.  రోజువారీ జీవితంలో ఇవన్నీ మనం చేయచ్చు. దీని వల్ల మీరు దేశానికి ఎంత సేవ చేయగలరో మీరు ఊహించుకోలేరు. నల్ల ధనం, అవినీతి పట్ల జరిగే పోరాటంలో మీరొక వీర సైనికుడిగా మారగలరు. ప్రజలకు ఇవన్నీనేర్పించడం కోసం, ప్రజలను చైతన్యవంతులను చెయ్యడం కోసం గత కొద్ది రోజుల్లో  డిజి- ధన్ మేళా తాలూకూ ఎన్నో కార్యక్రమాలు జరిగాయి. యావద్దేశంలో ఇటువంటి వంద కార్యక్రమాలను జరపాలని సంకల్పించాం. 80- 85 కార్యక్రమాలు అయిపోయాయి. వాటిల్లో బహుమతి పథకాలు కూడా ఉన్నాయి. దగ్గర దగ్గర పన్నెండున్నర లక్షల మంది ప్రజలు వినియోగదారుల బహుమతులు అందుకున్నారు. వ్యాపారుల కొరకు ఏర్పాటు చేసిన బహుమతులను డెభ్భై వేల మంది అందుకున్నారు. ప్రతి ఒక్కరూ ఈ పనిని ముందుకు నడిపించాలనే సంకల్పించారు. ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి. ముందే నిశ్చయమైనట్లు ఏప్రిల్ 14న డాక్టర్ బాబా సాహెబ్ అంబేడ్కర్ జయంతి నాడు ఈ డిజి మేళా సమాప్తమౌతుంది. వంద రోజులు పూర్తి కాగానే ఒక పెద్ద చివరి కార్యక్రమం జరగనుంది. అతి పెద్ద డ్రా ఒకటి అందులో నిర్దేశించబడి ఉంది. డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి వరకూ ఇంకా మన వద్ద ఎంత సమయం మిగిలి ఉందో, అంతదాకా భీమ్ యాప్ ప్రచారం జరుగుతుందని నాకు నమ్మకం ఉంది. నగదు వాడకాన్ని తగ్గించానికీ, నోట్లతో వ్యవహారాలను తగ్గించడానికీ మన వంతు కృషి చేద్దాం.

ప్రియమైన నా దేశ వాసులారా, ‘మనసులో మాట’ కోసం ప్రతిసారి నేను సలహాలు అడిగినప్పుడల్లా అనేక రకాలైన సలహాలు రావడం నాకు ఆనందకరం. కానీ స్వచ్ఛత విషయంలో మాత్రం ప్రతి సారీ విన్నపాలు ఉంటూనే ఉంటున్నాయి. పదకొండవ తరగతి చదువుతున్న గాయత్రి అనే అమ్మాయి దెహ్ రా దూన్ నుండి ఫోన్ చేసి ఒక సందేశాన్ని పంపించింది. “గౌరవనీయులైన ప్రధానాధ్యాపకులు గారూ, ప్రధాన మంత్రి గారూ, మీకు నా గౌరవపూర్వక నమస్కారాలు. అన్నింటికన్నా ముందుగా ఈ ఎన్నికలలో మీరు అత్యధిక ఓట్లతో గెలిచినందుకు అనేకమైన శుభాకాంక్షలు. మీతో నా మనసులో మాట చెప్పాలని అనుకుంటున్నాను. పరిశుభ్రత ఎంత అవసరమో ప్రజలకు తెలియజేయాలని నేను అనుకుంటున్నాను. ప్రజలు చాలా చెత్తాచెదారాన్ని వేస్తూ కలుషితం చేసే ఒక నది మీదుగా నేను రోజూ ప్రయాణిస్తాను. ఆ నది రిస్పనా వంతెన మీదుగా మా ఇంటి దాకా వస్తుంది. ఈ నది కోసం మేము బస్తీలకు వెళ్ళి ఊరేగింపులు చేశాం. ప్రజలతో మాట్లాడాం. కానీ, దానివల్ల ఏమీ ప్రయోజనం కలగలేదు. నేను మీతో చెప్పాలనుకున్నదేమిటంటే, మీరు ఒక బృందాన్ని పంపి, లేదా వార్తాపత్రికల ద్వారా ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురావాలని కోరుకుంటున్నాను. ధన్యవాదాలు” అని ఆ సందేశంలో ఉంది.

చూడండి సోదర సోదరీమణులారా, పదకొండవ తరగతి చదువుతున్న ఒక బిడ్డ ఎంత బాధపడుతోందో. ఆ నది లోని చెత్తాచెదారాన్ని చూసి ఆమెకు ఎంత కోపం వస్తోందో చూడండి. దీన్ని నేను శుభసూచకంగా గుర్తిస్తున్నాను. నూట పాతిక కోట్ల మంది ప్రజల మనసుల్లో అపరిశుభ్రత పట్ల కోపం కలగాలనే నేను కోరుకుంటున్నాను. ఒకసారి కోపం మొదలైతే, అసంతృప్తి మొదలైతే, రోషం కలిగితే మనమే అపరిశుభ్రత పట్ల ఏదో ఒకటి చెయ్యడానికి పూనుకుంటాం. గాయత్రి స్వయంగా తన కోపాన్ని తెలియచెయ్యడం మంచి విషయం. నాకు సలహాను కూడా చెప్తూ, తన ప్రయత్నాలన్నీ విఫలమయ్యాయని చెప్పింది. శుభ్రత ఉద్యమం మొదలైనప్పటి నుండీ ప్రజలందరూ అప్రమత్తమయ్యారు. ప్రతి ఒక్కరూ అందులో వారి ప్రయత్నాలను జోడించుకుంటూ ముందుకువెళ్తున్నారు. అదొక ఉద్యమంగా రూపు దిద్దుకుంది. అపరిశుభ్రత పట్ల ద్వేషం కూడా పెరుగుతోంది.  అప్రమత్తంగా ఉన్నా, సక్రియ భాగస్వామిగా ఉన్నా, ఉద్యమంగా ఉన్నా, వాటికి మహత్యం ఎంతైనా ఉంటుంది. కానీ పరిశుభ్రత ఎప్పుడూ ఉద్యమం కన్నా కూడా, ఒక అలవాటుతో ముడిపడి ఉంటుంది. ఈ ఉద్యమం అలవాట్లను మార్చే ఉద్యమం. ఈ ఉద్యమం పరిశుభ్రత అలవాట్లను పెంపొందించే ఉద్యమం. ఉద్యమం సామూహికంగా జరుగుతుంది. కష్టమైనా పనే.. కానీ, చెయ్యాల్సిందే. దేశ నవతరంలో, బాలల్లో, విద్యార్థినీ విద్యార్థులలో, యువతీయువకులలో మేల్కొన్న ఈ భావన దానంతట అదే ఒక మంచి పరిణామాన్నిసూచిస్తోందని నేను నమ్ముతున్నాను. ఈ రోజు ‘మనసులో మాట’లో గాయత్రి చెప్పిన మాటలు వింటున్న వారందరూ, గాయత్రి సందేశం మనందరికీ సందేశంగా మారాలని దేశ ప్రజలందరినీ నేను కోరుకుంటున్నాను.

ప్రియమైన నా దేశవాసులారా, ‘మనసులో మాట’ కార్యక్రమాన్ని మొదలుపెట్టిన దగ్గర నుండి చాలా మంది ఒకే విషయం పై నాకు అనేక సూచనలు అందించారు. అది ఆహారం వ్యర్థమవడం గురించి. మనకు తెలుసు మనం ఇంట్లో భోజనం చేసినా, సామూహిక విందు భోజనాల్లో కూడా అవసరానికి మించి మన కంచంలో ఆహారం వేసేసుకుంటాం. కనబడినవన్నీ కంచంలో వేసేసుకుని తరువాత తినడానికి ఇబ్బంది పడతాం. కంచంలో వేసుకున్న వాటిలో సగం కూడా కడుపులో వేసుకోలేక, అక్కడే వదిలేసి వచ్చేస్తాం. ఈ ఎంగిలి పదార్థాలను వదిలెయ్యడం వల్ల మనం ఎంత నష్టం చేస్తున్నామో మీరు ఎప్పుడైనా ఆలోచించారా ? ఇలా ఎంగిలి చేసి వదలకుండా ఉంటే, ఎందరు పేదల కడుపులు నిండగలవో ఎప్పుడైనా ఆలోచించారా ? ఇది అర్థమయ్యేలా తెలపాల్సిన విషయం కాదు. మన ఇళ్ళల్లో చిన్న పిల్లలకు వడ్డించినప్పుడు  “ఎంత తినగలవో అంతే తిను నాయనా” అని అమ్మ చెప్తుంది. ఏదో ఒక ప్రయత్నం జరుగుతూనే ఉంటుంది. కానీ ఈ విషయం పట్ల ఉదాసీనంగా ఉండడం సమాజ ద్రోహమే అవుతుంది. పేదల పట్ల అన్యాయమే. మరో సంగతి ఏమిటంటే, ఒకవేళ మిగిలితే కుటుంబానికి కూడా ఆర్థిక లాభమే కదా. సమాజపరంగా మంచి విషయమే. కానీ ఇదెలాంటి విషయమంటే, కుటుంబానికి కూడా మంచిదే. ఈ విషయమై ఎక్కువ చెప్పదలుచుకోలేదు కానీ అప్రమత్తత పెరగాలని మాత్రం కోరుకుంటున్నాను. ఇలాంటి విషయాల్లో ఉద్యమించే కొందరు యువకులను నేను ఎరుగుదును.  వారు కొన్ని మొబైల్ యాప్ లను తయారు చేశారు. ఎక్కడెక్కడైతే ఇటువంటి ఆహారం మిగిలిపోయిందని వారిని పిలుస్తారో, అక్కడికి వెళ్ళి ఆ ఆహారాన్ని ఒక చోట చేర్చి దానిని సద్వినియోగపరుస్తూ, కష్టపడతారు. ఇది మన దేశంలోని యువకులే చేస్తారు. మన దేశంలోని ప్రతి రాష్ట్రంలో ఎక్కడో ఒకచోట ఇలాంటి వారు మీకు కనబడతారు. వాళ్ల జీవితాలు కూడా మనకు ఎంగిలి వదలకూడదనీ, ఎంత తినగలమో అంతే తీసుకోవాలని తెలుపుతూ, స్ఫూర్తిని అందిస్తాయి.

చూడండి, మార్పునకు ఇవే దారులుంటాయి. ఎవరైతే శరీరం, ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహిస్తారో వారెప్పుడూ చెప్తారు “కడుపులో కొంచెం ఖాళీ ఉంచండి, కంచంలో కొంచెం ఖాళీ ఉంచండి”. ఆరోగ్యం విషయం కాబట్టి ఏప్రిల్ 7వ తారీఖు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఐక్యరాజ్యసమితి 2030 వరకూ యూనివర్సల్ హెల్త్ కవరేజ్ అంటే ‘‘అందరికీ ఆరోగ్యం’’ అనే లక్ష్యాన్ని నిర్ణయించారు. ఈసారి ఐక్యరాజ్యసమితి ఏప్రిల్ 7వ తారీఖు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా డిప్రెషన్ మీద దృష్టి పెట్టాయి. ఈసారి వారి ప్రధానాంశం డిప్రెషన్. మనకి కూడా డిప్రెషన్ అనే పదం తెలుసు. కానీ అర్థం తెలుసుకోవాలంటే కొందరు దాన్ని కుంగుబాటు అంటారు. ఒక అంచనా ప్రకారం ప్రపంచంలో 35 కోట్ల పైబడి ప్రజలు మానసికంగా డిప్రెషన్ తో బాధ పడుతున్నారు. ప్రమాదం ఏమిటంటే, మన చుట్టుపక్కల ఉన్న వారిలో కూడా మనం ఈ సంగతి గమనించం. బాహాటంగా ఈ సంగతి మాట్లాడడానికి కూడా మనం ఇష్టపడం. డిప్రెషన్ కు గురైన వ్యక్తి కూడా దాని గురించి మాట్లాడడు. ఎందుకంటే, ఆ వ్యక్తి కూడా దాని గురించి చర్చించడానికి సిగ్గుపడతాడు. డిప్రెషన్ నుండి విముక్తి లభించదని భావించద్దని నేను దేశ ప్రజలతో చెప్పాలనుకుంటున్నాను. ఒక మానసిక వాతావరణాన్ని ఏర్పరచినప్పుడే విముక్తి లభించడం ప్రారంభమౌతుంది. మొదటి మంత్రం ఏమిటంటే, సప్రెషన్ బదులుగా ఎక్స్ ప్రెషన్ అవసరం. అంటే డిప్రెషన్ ను అణచివేయకుండా దానిని బయటకు తెలియపరచడం. మీ మిత్రుల వద్ద, తల్లితండ్రుల వద్ద, అన్నదమ్ముల మధ్యా, ఉపాధ్యాయులతో మీకు ఏమనిపిస్తోందో మనసు విప్పి చెప్పండి. వసతిగృహ‌ంలో నివసించే పిల్లలకు అప్పుడప్పుడు ఒంటరితనం వల్ల ఎంతో ఇబ్బంది కలుగుతుంది. మన దేశంలో సౌభాగ్యమేమిటంటే, మనం ఉమ్మడి కుటుంబాలలో పెరిగి పెద్దవాళ్లం అయ్యాం. పెద్ద పెద్ద కుటుంబాలలో కలసిమెలసి ఉంటాం కాబట్టి డిప్రెషన్ కు ఆస్కారం ఉండదు. కానీ, నేను కొందరు తల్లితండ్రులకు చెప్పాలనుకుంటున్నాను- మీరు ఎప్పుడైనా గమనిస్తే, ఒకోసారి మీ పిల్లలు లేదా ఇతర కుటుంబ సభ్యులు, ఇంతకు ముందు మీతో కలసి భోజనం చేసే వారు ఇప్పుడు హఠాత్తుగా ‘తరువాత తింటాను’ అని టేబుల్ దగ్గరకు రారు. ఇంట్లో అందరూ బయటకు వెళ్తూంటే, నేను రానని ఒంటరిగానే ఉండడానికి ఇష్టపడుతుంటే, ఎందుకలా చేస్తున్నారో గమనించారా ? అవి డిప్రెషన్ వైపు మొదటి అడుగులు అని మీరు నమ్మండి. ఒకవేళ వారు సమూహం వైపునకు కాక ఒంటరితనం వైపునకు అడుగులు వేస్తూ ఉంటే ప్రయత్నపూర్వకంగా అలా జరగకుండా చూడండి. వారితో మనసు విప్పి ఎవరైతే మాట్లాడతారో వారి మధ్యన ఉండే అవకాశాన్ని వాళ్లకు ఇవ్వండి. నవ్వుతూ, సంతోషంగా ఉండే మాటలు మాట్లాడుతూ మాట్లాడుతూ వాళ్ళను తమ అభిప్రాయాలను వ్యక్తపరచడానికి ప్రేరేపించండి. వాళ్ల మనసులో ఎక్కడ ఏ నిరాశ ఉందో, దానిని బయటకు తియ్యండి. ఇదే ఉత్తమమైన ఉపాయం. ఈ డిప్రెషన్ శారీరిక, మానసిక రోగాలకు కారణమవుతుంది. ఎలాగైతే మధుమేహం అన్నిరకాల రోగాలకూ మూలమౌతుందో, అలానే డిప్రెషన్ కూడా నిలబడడానికీ, పోరాడడానికీ, సాహసించడానికీ, నిర్ణయాలు తీసుకోవడానికీ ఉన్నమన మొత్తం సామర్థ్యాలనీ ధ్వంసం చేసేస్తుంది.  మీ మిత్రులు ,మీ కుటుంబం, మీ పరిసరాలు, మీ వాతావరణం.. అన్నీ కలసి డిప్రెషన్ లోకి వెళ్ళకుండా మిమ్మల్ని ఆపగలవు. ఒకవేళ అందులోకి వెళ్ళి ఉంటే బయటకు కూడా తీసుకురాగలవు. మరో విధానం కూడా ఉంది.. ఒకవేళ మీవాళ్ల మధ్యన మీరు మనసు విప్పి మీ అభిప్రాయాలు వ్యక్తం చేయలేకపోతే, ఒక పని చెయ్యండి.. మీ చుట్టుపక్కల ఎక్కడైనా సేవాభావంతో పని చేస్తున్న వారి వద్దకి వెళ్ళి, వారికి సహాయం చెయ్యండి. మనసు పెట్టి సహాయం చెయ్యండి. వారి కష్ట సుఖాలను పంచుకోండి. అప్పుడు మీరు గమనించండి.. మీలోని బాధంతా అదృశ్యమైపోతుంది. ఎదుటి వారి దు:ఖాన్నిమీరు అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, సేవాభావంతో చేస్తే, మీలో ఒక కొత్త ఆత్మవిశ్వాసం ఉత్పన్నమౌతుంది. ఇతరులను కలసినప్పుడు, ఎవరికైనా సేవ చేసినప్పుడు, నిస్వార్థంగా సేవ చేసినప్పుడు, మీరు మీ మనసులోని బరువును సులువుగా తేలిక పరచుకోగలరు.

అలాగే, మనసును ఆరోగ్యంగా ఉంచుకోవడానికి యోగా కూడా ఒక చక్కని మార్గం. ఒత్తిడికి దూరంగా, మానసిక శ్రమకు దూరంగా, ప్రసన్న చిత్తంతో జీవన ప్రయాణాన్ని గడపడానికి యోగా చాలా సహాయం చేస్తుంది. జూన్ 21వ తేదీన మూడవ అంతర్జాతీయ యోగా దినం. కొన్ని లక్షల మంది సమక్షం లో సామూహిక యోగా దినాన్ని జరుపుకోవడానికి మీరు కూడా ఇప్పటి నుండే సమాయత్తమవ్వండి. మీ మనసులో ఈ మూడవ అంతర్జాతీయ యోగా దినం గురించి ఏవైనా సలహాలు ఉంటే, మీరు మీ మీ సలహాలను మీ మొబైల్ యాప్ ద్వారా నాకు పంపండి, మార్గాలను సూచించండి. యోగా కు సంబంధించి ఎన్ని గీతాలు, కావ్యాత్మక రచనలు మీరు తయారు చెయ్యగలరో చెయ్యండి. అవి ప్రజలకు సులభంగా అర్థమౌతాయి.

ఆరోగ్యం గురించి ఎలాగూ ఎక్కువ చర్చ వచ్చింది కాబట్టి తల్లులకూ, సోదరీమణులకూ నేను ఈ వేళ ముఖ్యంగా ఒక సంగతిని చెప్పదలుచుకున్నాను. గత కొద్ది రోజులలో భారత ప్రభుత్వం ఒక పెద్దముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. మన దేశంలో ఉన్న ఉద్యోగినుల సంఖ్య రోజు రోజుకూ పెరుగుతోంది. పని చేసే వర్గంలో వారి భాగస్వామ్యం పెరుగుతూండడం స్వాగతించాల్సిన విషయం. దానితో పాటే మహిళలకు ప్రత్యేకమైన బాధ్యతలు కూడా ఉన్నాయి. కుటుంబ బాధ్యతలే కాకుండా ఆర్థికపరమైన బాధ్యతలలో కూడా వారు పాలుపంచుకోవాల్సి ఉంటోంది. దానివల్ల అప్పుడప్పుడు లేదా ఇంకా అప్పుడే పుట్టిన పిల్లలకు అన్యాయం జరుగుతోంది. అందువల్ల భారత ప్రభుత్వం ఒక పెద్ద నిర్ణయం తీసుకుంది. ఈ పని వర్గం మహిళలు ఎవరైతే ఉన్నారో వారందరికీ గర్భిణీలుగా ఉన్న సమయంలో, ప్రసవ సమయంలో, ఇంతకు ముందు ఇచ్చే 12 వారాల ప్రసూతి సెలవును ఇప్పుడు 26 వారాలకు పెంచాము. ఈ విషయంలో ప్రపంచంలో రెండు మూడు దేశాలే మనకంటే ముందున్నాయి. ఈ సోదరీమణులందరి కోసమని భారతదేశం ఎంతో ప్రాముఖ్యమైన నిర్ణయాన్ని తీసుకుంది. దాని ముఖ్యోద్దేశం నవజాత శిశువు సంరక్షణ, భారత భావి పౌరుడికి తాను జన్మనెత్తిన ప్రారంభ సమయంలో సరైన సంరక్షణ అందాలని, తల్లి ప్రేమ నిండుగా పొందాలని, అప్పుడే ఈ పిల్లలు పెరిగి పెద్దయి దేశానికి మంచి శక్తిగా మారతారు. అప్పుడు తల్లుల ఆరోగ్యం కూడా బాగుంటుందని ఇలాంటి ప్రాముఖ్యమైన నిర్ణయం తీసుకున్నాం. ఫార్మల్ సెక్టార్ లో పనిచేసే దాదాపు 18 లక్షల మంది మహిళలకు దీని వల్ల లాభం చేకూరుతుంది.

ప్రియమైన నా దేశ వాసులారా, ఏప్రిల్ 5వ తేదీన శ్రీరామ నవమి పర్వదినం. ఏప్రిల్ 9వ తేదీన మహావీర్ జయంతి. ఏప్రిల్ 14న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ జయంతి. ఈ మహాపురుషుల జయంతులన్నీ మనకు ఎంతో ప్రేరణను ఇస్తూ ఉండాలి. ‘న్యూ ఇండియా’ కోసం సంకల్పించే శక్తిని ఇవ్వాలి. రెండు రోజుల తరువాత చైత్ర శుక్ల పాడ్యమి. కొత్త సంవత్సరం మొదటి పాడ్యమి. ఈ కొత్త సంవత్సర సందర్భంగా మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. వసంత ఋతువు తరువాత మన రైతులందరి శ్రమకు ఫలితం లభించి, పంటలు చేతికి వచ్చే సమయమిది.  మన దేశంలో వివిధ ప్రాంతాలలో ఈ కొత్త సంవత్సరాన్నివేరు వేరు పేర్లతో జరుపుకొంటుంటారు. కొత్త సంవత్సర ప్రవేశ వేళ మహారాష్ట్రలో ‘‘గుడీ పడ్వా’’, ఆంధ్ర, కర్ణాటకల్లో ‘ఉగాది’గా, సింధీల “చేటీ-చాంద్”, కశ్మీరీ “నవ్ రేహ్”, అవధ్ ప్రాంతంలో సంవత్సర పూజ, బిహార్ లోని మిధిల లో “జుడ్ శీతల్”, మగధ లో “సతువానీ” పండుగలు జరుగుతాయి.  భారతదేశం ఇన్ని లెక్కపెట్టలేనన్ని వైవిధ్యాలతో కూడుకున్న దేశం. నూతన సంవత్సరం సందర్భంగా మీ అందరికీ కూడా నా తరఫున చాలా అభినందనలు. అనేకానేక ధన్యవాదాలు.

                                                                        ***