Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఆకాశవాణి లో 2017 మే 28వ తేదీ నాడు ప్రధాన మంత్రి ‘మన్ కీ బాత్’ (మనసులో మాట) కార్యక్రమం పూర్తి పాఠం ప్రియమైన నా దేశ ప్రజలారా, నమస్కారం.


ఈ ఏడాది వేసవిని మనం మర్చిపోలేము.. కానీ వర్షాకాలం కోసమైతే ఎదురు చూస్తున్నాం. మీతో నేను మాట్లాడుతున్న ఈ రోజు నుంచే పవిత్రమైన రంజాన్ నెల మొదలైంది. పవిత్రమైన రంజాన్ నెల మొదలైన సందర్భంగా భారత దేశంలోని, యావత్ ప్రపంచం లోని ప్రజలకూ, ప్రత్యేకంగా ముస్లిమ్ సమాజానికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. రంజాన్ నెలలో ప్రార్థనకూ, ఆధ్యాత్మికతకూ, దాతృత్వానికీ చాలా ప్రత్యేకత ఇస్తారు. మన భారతీయులందరూ గర్వించదగ్గ సంప్రదాయాన్ని మన పూర్వీకులు మనకు ఏర్పరచడం నిజంగా మన అదృష్టం.

ప్రపంచంలోని అన్ని సంప్రదాయాలూ మన దేశంలో ఉన్నందుకు మన నూట పాతిక కోట్ల మంది దేశవాసులందరం గర్వపడాలి. మన దేశంలో ఆస్తికులూ ఉన్నారు, నాస్తికులూ ఉన్నారు. విగ్రహారాధనను సమర్ధించేవారూ ఉన్నారు, విగ్రహారాధనని వ్యతిరేకించేవారూ ఉన్నారు. ఇటువంటి సిధ్ధాంతాలూ, ఇటువంటి పూజాపధ్ధతులూ, ఇటువంటి సంప్రదాయమూ, మనందరికీ కలిసికట్టుగా ఉండగలిగే కళను జీర్ణించుకునేలా చేశాయి. ధర్మమైనా, సంప్రదాయమైనా, సిధ్ధాంతమైనా, ఆచారమైనా మనకు ఒకే సందేశాన్ని అందిస్తాయి – అవే శాంతి, ఏకత్వం, సద్భావన. ఈ శాంతి, ఏకత్వం, సద్భావనల మార్గం ముందుకు వెళ్ళడానికి పవిత్రమైన ఈ రంజాన్ నెల సహకరిస్తుంది. నేను మరో సారి అందరికీ అభినందనలు తెలుపుకుంటున్నాను. క్రితంసారి ‘‘మనసులో మాట’’ చెప్తున్నప్పుడు నేను ఒక పదాన్ని వాడాను, ముఖ్యంగా యువతతో అన్నాను.. మీ కంఫర్ట్ జోన్ నుండి బయటకు వచ్చి ఏదైనా కొత్తగా చెయ్యమని; కొత్త అనుభవాలను చవిచూడమని. జీవితంలో కాస్తంత రిస్క్ తీసుకుని, కష్టాలను ఎదుర్కోవడానికి ఇదే సరైన వయసనీ చెప్పాను. దానికి చాలామంది ప్రజలు ప్రతిస్పందించడం ఇవ్వడం నాకు చాలా సంతోషాన్నిచ్చింది. వ్యక్తిగతంగా తమ తమ విషయాలు చెప్పడానికి అందరూ ఉత్సాహాన్ని కనబరిచారు. అన్నింటినీ నేను చదవలేకపోయాను, ప్రతి ఒక్కరి సందేశాన్నీ నేను కనీసం వినలేకపోయాను. అన్ని ఎక్కువ సందేశాలు వచ్చాయి. కానీ నేను సంక్షిప్తంగా చూసినంతవరకూ గమనించిందేమిటంటే, కొందరు సంగీతాన్ని నేర్చుకునే ప్రయత్నం చేశారు, కొందరు కొత్త వాయిద్యాలను నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, కొందరు యూట్యూబ్ సహాయంతో కొత్త విషయాలు నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నారు, కొత్త భాష నేర్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కొందరు వంట నేర్చుకుంటున్నారు, కొందరు నాట్యం నేర్చుకుంటున్నారు, కొందరు నటన నేర్చుకుంటున్నారు, కొందరైతే కవితలు రాయడం మొదలుపెట్టామని కూడా రాశారు. ప్రకృతి గురించి తెలుసుకుని, జీవించి, అర్థం చేసుకొనే దిశగా ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు చాలా ఆనందం కలిగింది. ఒక ఫోన్ కాల్ ని మీకు కూడా వినిపించాలనుకుంటున్నాను.. అదేమిటంటే,

‘‘నేను దీక్షా కాత్యాల్ ని మాట్లాడుతున్నాను. నాకున్న చదివే అలవాటు మొత్తం పోయింది. అందుకని ఈ సెలవుల్లో నేను మళ్ళీ చదవాలని నిర్ణయించుకున్నాను. సాతంత్ర్య పోరాటం గురించి నేను చదవడం మొదలుపెట్టినప్పుడు నాకు అర్ధమైంది.. భారతదేశానికి స్వాతంత్ర్యాన్ని అందివ్వడానికి ఎంత పోరాటం చెయ్యాల్సి వచ్చిందో, ఎన్ని బలిదానాలు ఇవ్వాల్సివచ్చిందో, ఎందరు స్వాతంత్ర్య సమర యోధులు జైళ్ళలో ఏళ్లకు ఏళ్ళు గడిపారో. చిన్న వయస్సులోనే ఎంతో సాధించిన కీర్తిశేషుడు భగత్ సింగ్ వల్ల నేనెంతో ప్రభావితురాలినయ్యాను. అందువల్ల ఈ విషయం గురించి యువతరానికి మీరు సందేశాన్ని ఇవ్వవలసిందని కోరుతున్నాను’’.

మన దేశ చరిత్ర గురించి, మన స్వాతంత్ర సమర యోధుల గురించి , దేశం కోసం తమ ప్రాణాలర్పించిన వీరుల గురించి తెలుసుకోవడానికి మన యువతరం ఆసక్తి చూపడం నాకు చాలా సంతోషాన్ని కలిగించింది. లెక్కకు మించిన మహా పురుషులు వారి యౌవనాన్ని జైళ్ళలో కోల్పోయారు. ఎందరో యువకులు ఉరితీయబడ్డారు. వారంతా ఎన్నో బాధలు పడ్డారు కాబట్టే ఇవాళ మనం స్వాతంత్ర్య భారతావనిలో ఊపిరి పీల్చుకోగలుగుతున్నాము. స్వాతంత్ర్య పోరాటంలో ఏయే మహాపురుషులైతే జైళ్ళలో గడిపారో వారంతా చదవడం, రాయడం మొదలైన చాలా పెద్ద పని చేశారు. వారందరి రచనలూ కూడా భారత దేశస్వాతంత్రానికి చాలా శక్తినిచ్చాయన్న సంగతి మనకు తెలుసు.

చాలా ఏళ్ళ క్రితం నేను అండమాన్- నికోబార్ కు సెల్యులార్ జైల్ చూడ్డానికి వెళ్ళాను. ఇవాళ వీర్ సావర్ కర్ గారి జయంతి. ఆయన జైల్లో ‘మాజీ జన్మఠే’ అనే పుస్తకాన్ని రాశారు. కవితలు రాసే వారు. గోడలపై రాసే వారు. ఆయనను చిన్న చీకటి గదిలో బంధించారు. స్వాతంత్ర్య ప్రేమికులు ఎలాంటి యాతనలు అనుభవించారో ! సావర్కర్ గారి ‘మాజీ జన్మఠే’ పుస్తకాన్ని నేను చదివినప్పుడు, నాకు సెల్యులర్ జైల్ చూడాలనే ఆసక్తి కలిగింది. అక్కడొక light & sound show కూడా జరుగుతుంది. అది చాలా ప్రేరణాత్మకంగా ఉంటుంది. స్వాతంత్ర్యం కోసం అండమాన్ జైల్లోని ఇదే సెల్యూలర్ జైల్ లో కాలాపానీ శిక్షను అనుభవిస్తూ వారి యౌవనాన్ని కోల్పోయిన వారు భారతదేశంలోని ప్రతి రాష్ట్రానికి చెందిన వారు, ప్రతి భాషను మాట్లాడే వారు ఉన్నారు. ప్రతి భాష మాట్లాడే వారూ , ప్రతి ప్రాంతానికి చెందిన వారూ, ప్రతి తరానికీ చెందిన ప్రజలు యాతనలను అనుభవించారు.

ఇవాళ వీర సావర్ కర్ గారి జయంతి. మనకు లభించిన స్వాతంత్ర్యం కోసం ప్రజలు ఎటువంటి యాతనలను అనుభవించారో, ఎన్నెన్ని కష్టాలు పడ్డారో, సెల్యులర్ జైల్ కు వెళ్ళి చూస్తే, కాలాపానీ అని ఎందుకంటారో, అక్కడికి వెళ్ళాకే తెలుస్తుందని నేను దేశ యువతరానికి తప్పకుండా చెప్పదలుచుకున్నాను. మీరు కూడా వీలైతే, ఒక రకంగా మన స్వాతంత్ర్య పోరాటానికి సంబంధించిన ఈ తీర్థ క్షేత్రానికి తప్పకుండా వెళ్లండి.

ప్రియమైన నా దేశ ప్రజలారా, జూన్ 5 నెలలో ఒకటో సోమవారం. మామూలుగా అయితే ఏ ప్రత్యేకతా లేదు. కానీ, జూన్ 5 ఒక విశేషమైన రోజు. ఎందుకంటే ఆ రోజును మనం ప్రపంచ పర్యావరణ దినోత్సవంగా జరుపుకుంటాము. ఈ ఏడాది ఐక్య రాజ్య సమితి ఈ సంవత్సరానికి పెట్టిన ఇతివృత్తం ఏమిటంటే connecting people to nature. మరొక మాటలో చెప్పాలంటే back to basics. ప్రకృతితో అనుసంధానం అవ్వడమంటే ఏమిటి ? నా దృష్టిలో దీనికి అర్థం మనతో మనం కలవడం. మనతో మనం కనెక్ట్ అవ్వడం. ప్రకృతితో కనక్టవ్వడమంటే, బెటర్ ప్లానెట్ ని పెంపొందించడం. ఈ సంగతిని మహాత్మ గాంధీ గారి కన్నా బాగా ఎవరు చెప్పగలరు ? మహాత్మ గాంధీ గారు చాలా సార్లు చెప్పే వారు “one must care about a world one will not see” అని. అంటే, మనం చూడని ప్రపంచాన్ని గురించి కూడా ఆలోచించాలి, జాగ్రత్త తీసుకోవాలి. మీరూ గమనించే ఉంటారు, ప్రకృతి లోని శక్తి ఏమిటంటే బాగా అలసిపోయి వచ్చినప్పుడు ఒక గ్లాసు నీళ్ళు మొహంపై చల్లుకుంటే ఎంతో తాజాదనం వచ్చేస్తుంది. బాగా అలసిపోయి వచ్చినప్పుడు గది కిటికీలు తెరిచి, తలుపులు తెరిచి, తాజా గాలిని పీల్చుకున్నప్పుడు కొత్త చైతన్యం వస్తుంది. ఏ పంచభూతాలతో ఐతే శరీరం నిర్మితమౌతుందో, ఆ పంచభూతాల స్పర్శ కలిగినప్పుడు మన శరీరంలో ఒక కొత్త ఉత్తేజం ఉత్పన్నమౌతుంది, ఒక కొత్త శక్తి కనబడుతుంది. ఇది మనకందరికీ అనుభవంలోనిదే. కానీ మనం దీనిని పట్టించుకోము. మనం దీనిని ఒక దారానికి కట్టి ఉంచము. ఒక సూత్రంతో బంధించము. మీరు ఇకపై తప్పక గమనించండి, మీకు ప్రకృతి పరమైన స్పర్శ కలిగినప్పుడు మీలో ఒక కొత్త చైతన్యం జాగృతమౌతుంది. అందువల్ల జూన్ 5న ప్రకృతితో ముడిపడాలనే ప్రపంచ ప్రయత్నం మన సొంత ప్రయత్నం కూడా అవ్వాలి. మన పూర్వీకులు పర్యావరణను కాపాడిన ఫలితం మనకు ఇప్పుడు లభిస్తోంది. మనం గనుక ఇప్పుడు కాపాడితే, రాబోయే తరాలకు లాభం చేకూరుతుంది. వేదాలు పృథ్వి, పర్యావరణాలను శక్తి మూలాలుగా కొలిచాయి. మన వేదాల్లో ఈ వర్ణన లభిస్తుంది. ఒకరకంగా చెప్పాలంటే అథర్వణ వేదం మొత్తం పర్యావరణకు చెందిన దిశానిర్దేశ గ్రంథం. ఇది వేల సంవత్సరాలకు పూర్వమే రాయబడింది. ‘‘మాతా భూమి: పుత్రో అహం పృథివ్యా:’’ అని చెప్పబడింది. మనలోని స్వచ్ఛతకు కారణం పృథ్వి అని వేదాలు చెప్పాయి. అవని మన తల్లి, మనం ఆమె బిడ్డలము. బుధ్ధ భగవానుడిని తలుచుకున్నప్పుడు వెలికివచ్చే విషయం ఏమిటంటే, బుద్ధ భగవానుడి జన్మ, ఆయన జ్ఞాన ప్రాప్తి, ఆయన మహాపరినిర్వాణము మూడూ ఒక చెట్టు కింద జరిగాయి. మన దేశంలో కూడా ఎన్నో పండుగలూ, ఎన్నో పూజా పధ్ధతులూ; చదువుకున్నవారైనా, చదువురానివారైనా, పట్టణవాసులైనా, పల్లెవాసులైనా, ఆదివాసీలైనా, అందరికీ ప్రకృతి పూజ, ప్రకృతి పట్ల ప్రేమ సహజంగానే వారి సామాజిక జీవితంలో భాగమే. కానీ మనం ఈ విషయాన్ని ఆధునిక నిర్వచనాలతో, ఆధునిక ఆలోచనలతో జోడించాల్సిన అవసరం ఉంది.

ఈమధ్య నాకు రాష్ట్రాల నుండి కబుర్లు అందుతున్నాయి. ఏమంటే, దాదాపు అన్ని రాష్ట్రాల్లోనూ వర్షాలు మొదలౌతూనే, పెద్ద ఎత్తున మొక్కలు నాటే కార్యక్రమం ఆరంభమవుతుంది. కోట్ల సంఖ్యలో మొక్కలు నాటుతారు. పాఠశాల పిల్లలను కూడా కలుపుకుంటారు. సమాజ సేవా సంఘాలు, ప్రభుత్వేతర సంస్థలు కలుస్తాయి. ప్రభుత్వం స్వయంగా చొరవ తీసుకుంటుంది. మనం కూడా ఈ ఏడాది వర్షాకాలంలో మొక్కలు నాటే పనిని ప్రోత్సహిద్దాం.

సహకరిద్దాం.

నా ప్రియమైన దేశప్రజలారా, జూన్ 21 ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా సుపరిచితమైన రోజు. ప్రపంచ యోగా దినోత్సవం రూపంలో యావత్ ప్రపంచం ఈ రోజును జరుపుకుంటుంది. జూన్ 21 ప్రపంచ యోగా దినోత్సవం గా అచిర కాలంలోనే మూలమూలలకూ వ్యాపించి, ప్రజలను దగ్గరచేస్తోంది. ఒకవైపున ఎన్నో విచ్ఛిన్నకర శక్తులు ప్రపంచంలో తమ వికృత రూపాల్ని ప్రదర్శిస్తున్న సమయంలో, భారతదేశం ప్రపంచానికి ఇచ్చిన ఒక గొప్ప వరం యోగా. యోగా ద్వారా యావత్ ప్రపంచాన్ని ఒక సూత్రంతో ముడిపెట్టగలిగాం. మనసును ,బుధ్ధిని, శరీరాన్నీ, ఆత్మనీ ఎలాగైతే కలుపుతుందో, అలాగే ఈ రోజు యోగా ప్రపంచాన్ని దగ్గరచేస్తొంది. ఇవాళ మన జీవన శైలి వల్ల, హడావుడి వల్ల, పెరుగుతున్న బాధ్యతల వల్లా ఒత్తిడి లేని జీవితాన్ని జీవించడం కష్టతరమైపోతోంది. పిన్న వయస్కుల్లో కూడా ఈ పరిస్థితిని మనం గమనిస్తున్నాం. ఏవో ఒక మందులు వేసుకుని రోజుని గడిపేస్తున్నాం. ఇలాంటి సమయంలో ఒత్తిడి రహిత జీవితం జీవించడానికి యోగా ఎంతో ముఖ్యమైన పాత్ర పోషిస్తుంది. వెల్ నెస్, ఫిట్ నెస్.. రెండిటికీ సంబంధించిన పూచీని యోగా ఇస్తుంది. యోగా వ్యాయామం మాత్రమే కాదు. మనసును ,బుధ్ధిని, శరీరాన్నీ, ఆలోచనల ద్వారా, ఆచారం ద్వారా ఆరోగ్యం కోసం ఒక అంతర్గత ప్రయాణం. ఆ అంతర్గత యాత్రను అనుభూతి చెందాలంటే, అది యోగా ద్వారానే సాధ్యం. రెండు రోజుల క్రితమే యోగా దినోత్సవాన్ని దృష్టిలో పెట్టుకుని నేను ప్రపంచం లోని అన్ని ప్రభుత్వాలకూ, అందరు నేతలకూ ఉత్తరాలు రాశాను.

క్రితం సంవత్సరమే నేను యోగాకు సంబంధించిన కొన్ని పోటీలను ప్రకటించాను. కొన్ని బహుమతులను ప్రకటించాను. నెమ్మది నెమ్మదిగా ఆ దిశగా పనులు ముందుకు సాగుతాయి. నాకొక సలహా వచ్చింది. ఆ మౌలికమైన సలహాను ఇచ్చిన వారిని నేనెంతో అభినందిస్తున్నాను. చాలా ఆసక్తికరమైన సలహా అది. వారేమన్నారంటే ఇది మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం. ఈసారి మూడవ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా ఒకే కుటుంబానికి చెందిన మూడు తరాల వారు, ఒకేసారి యోగాసనాలను చేసేలాగ పిలుపునివ్వవలసిందిగా నన్ను కోరారు. అమ్మమ్మ,తాతయ్య ఆయినా సరే, నానమ్మ, తాతయ్య అయినా సరే, తల్లితండ్రులైనా సరే, కొడుకులు,కూతుళ్ళైనా సరే, ఒక మూడు తరాల వాళ్ళు కలిసి యోగాసనాలు వేస్తూ ఆ ఫోటోలను అప్ లోడ్ చెయ్యండి. నిన్న, నేడు, రేపటి ఈ సుందరమైన సంయోగం యోగాకు ఒక కొత్త కొలమానాన్ని అందిస్తుంది. ఈ సలహాను ఇచ్చిన వారికి నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. మనం ఎలాగైతే ’ సెల్ఫీ విత్ డాటర్ ’ అనే విధానం ద్వారా మంచి ఆసక్తికరమైన అనుభవాన్ని సంపాదించామో అలాగన్న మాట. యోగాసనాలు వేస్తున్న ఈ మూడు తరాల వారి ఫోటోలు తప్పకుండా దేశానికీ, ప్రపంచానికీ కూడా ప్రశంసలను అందిస్తాయి. మూడు తరాల వారు ఎక్కడ యోగా చేసినా సరే, వారు కలిసి యోగాసనాలు చేస్తున్న ఫోటోలను నాకు మీరు తప్పకుండా నరేంద్ర మోదీ యాప్ కూ, my gov కూ పంపించండి. నిన్న,నేడు, రేపటి ఈ చిత్రాలు ఒక ఆహ్లాదకరమైన రేపటి భరోసాను అందిస్తాయి. అంతర్జాతీయ యోగా దినోత్సవానికి ఇంకా మన వద్ద మూడు వారాల సమయం ఉంది. నేను మీ అందరినీ ఆహ్వానిస్తున్నాను. ఇవాళ్టి నుండి ఆచరణను మొదలుపెట్టండి. నేను కూడా జూన్ 1 నుండీ ట్విటర్ లో రోజూ యోగా సంబంధమైన విషయాలు పోస్ట్ చేస్తూఉంటాను. వరుసగా జూన్ 21 వరకూ పోస్ట్ చేస్తూ, మీకు షేర్ చేస్తూనే ఉంటాను. మీరు కూడా మూడు వారాల పాటు వరుసగా యోగా గురించిన విషయాలను ప్రచారం చెయ్యండి. ప్రసారం చెయ్యండి. ప్రజలను కలుపుకుంటూ వెళ్ళండి. ఒక రకంగా దీనిని preventive health care ఉద్యమమనే అనాలి. నేను మీ అందరినీ ఈ ఉద్యమంలో పాలుపంచుకోవాల్సిందిగా ఆహ్వానిస్తున్నాను.

మీ అందరూ నాకు ‘ప్రధాన సేవకుడి’ బాధ్యతను అప్పగించినప్పటి నుండీ, తరువాత ఎర్ర కోట నుండి నా మొదటి ప్రసంగం ఆగస్టు 15న, అక్కడి నుండి మొదటిసారి మాట్లాడే అవకాశం లభించినప్పుడూ కూడా నేను స్వచ్ఛత గురించిన విషయాలు మాట్లాడాను. అప్పటి నుండీ ఇప్పటివరకూ భారతదేశంలో రకరకాల ప్ర్రాంతాలలో నేను పర్యటించాను. అలా తిరిగినప్పుడల్లా నేను గమనించిందేమిటంటే, కొందరు చాలా సూక్ష్మంగా మోదీ ఏం చేస్తున్నారు ? మోదీ ఎక్కడికి వెళ్తున్నారు ? మోదీ ఏమేమి చేస్తున్నారు అనే దాన్ని బాగా ఫాలో అవుతున్నారు. ఎందుకంటే నాకు చాలా ఆసక్తికరమైన ఫోన్ కాల్ ఒకటి వచ్చింది. ఒకరకంగా చెప్పాలంటే, నేనసలు ఆ విధంగా ఊహించలేదనే చెప్పాలి. కానీ వారు ఈ విషయాన్ని గమనించినందుకు వారికి నేను ఋణపడిఉంటాను. ఈ ఫోన్ కాల్ వింటే అదేమిటో మీక్కుడా అర్థమౌతుంది..

“మోదీ గారూ, నమస్కారం! నేను ముంబయ్ నుంచి నైనాను మాట్లాడుతున్నాను. మోదీ గారూ, నేను టీవీ లోనూ, సోషల్ మీడియా లోనూ ఈమధ్య తరచూ చూస్తున్నదేమిటంటే మీరు వెళ్ళిన ప్రతి చోటా కూడా ప్రజలు శుచి- శుభ్రతల గురించి ప్రత్యేకమైన శ్రద్ధ తీసుకుంటున్నారు. ముంబయ్ అయినా, సూరత్ అయినా.. మీ ఆహ్వానంపై ప్రజలు గుంపులు గుంపులుగా పరిశుభ్రతను ఒక బృహత్కార్యం గా స్వీకరిస్తున్నారు. పెద్దలలో, పిల్లలలో కూడా పరిశుభ్రత పట్ల అవగాహన వచ్చింది. చాలా సార్లు రహదారుల మీద చెత్త పారేస్తున్న పెద్దవాళ్ళని కూడా వారు ఆపడం నేను గమనించాను. కాశీ ఘాట్ నుండి మీరు మొదలుపెట్టిన పరిశుభ్రత తాలూకూ ప్రచారం, మీ ప్రేరణతో ఒక ఉద్యమంగా మారింది.”

మీ మాటలు నిజమే. నేనెక్కడెక్కడికి వెళ్ళినా ప్రభుత్వ యంత్రాంగం పరిశుభ్రతా కార్యక్రమాన్ని చేపడుతుంది. కానీ ఈమధ్య సమాజంలో కూడా పరిశుభ్రత ఒక ఉత్సవంగా మారింది. నేను వెళ్ళడానికి ఐదురోజుల ముందు, ఏడు రోజుల ముందు, పది రోజుల ముందు, చాలా పెద్ద ఎత్తున పరిశుభ్రతా కార్యక్రమాలు జరుగుతాయి. ప్రసార మాధ్యమాలు కూడా దానికి ఎంతో ప్రాధాన్యాన్ని ఇస్తున్నాయి. కొద్ది రోజుల క్రితం నేను గుజరాత్ లోని కచ్ఛ్ ప్రాంతానికి వెళ్ళాను. అక్కడ పరిశుభ్రత ను గురించి చాలా పెద్ద కార్యక్రమమే జరిగింది. నేనది గమనించలేదు కానీ ఇంతకు ముందు చెప్పిన ఫోన్ కాల్ వచ్చిన తరువాత ఆలోచిస్తే, ఆ సంగతి నిజమేననిపించింది. దేశం ఈ విషయాలన్నీ ఎంత శ్రధ్ధగా గమనిస్తోందో తెలుసుకున్నాక, ఈ విషయాన్ని గమనించాక, నాకెంత ఆనందం కలుగుతోందో మీరు ఊహించగలరు. నా ప్రయాణాలకు కూడా పరిశుభ్రత జోడైందన్న విషయం తెలుసుకోవడం కన్నా ఆనందం మరొకటేముంటుంది నాకు ? ప్రధాన మంత్రిని ఆహ్వానించడానికి జరిగే ఇతర సన్నాహాలు ఎలాగూ జరుగుతాయి. కానీ, వాటన్నింటికన్నా పరిశుభ్రత పాటించడమనే సంగతికే ఎక్కువ ప్రాధాన్యం లభిస్తోంది. తనకు తానుగా పరిశుభ్రతను ప్రేమించడమనేది ఎవరికైనా ఆనందదాయకమే. స్ఫూర్తిదాయకమే. ఈ పరిశుభ్రతా కార్యక్రమాన్ని ప్రోత్సహించేవారందరికీ కూడా నేను అభినందనలు తెలుపుకుంటున్నాను. ఎవరో నాకొక సలహా ఇచ్చారు. నిజానికా సలహా చాలా తమాషాగా ఉంది. అది నేను చెయ్యగలనో లేదో కూడా నాకు తెలీదు. మోదీ గారూ, మీరు మీ పర్యటనను నిర్ణయించుకునేప్పుడు ఏ రకమైన పర్యటన కోరినా, వాళ్ళతో “బాబూ, నన్ను పిలవాలంటే మీ పరిశుభ్రత స్థాయి ఎంత ఉంటుంది ? ఎన్ని టన్నుల చెత్తా చెదారాన్ని మీరు నాకు బహుమనంగా ఇవ్వగలరు ? దాని ఆధారంగా నేను నా పర్యటనను నిర్ణయించుకుంటాను అని చెప్పండి..” అన్నారు. ఉపాయం బాగానే ఉంది కానీ నేనూ ఆలోచించుకోవాలి. కానీ ఇలాంటి ఒక ఉద్యమం తయారవ్వాలి. ఏవేవో వస్తువులు బహుమతిగా ఇచ్చే కన్నా ఇన్ని టన్నుల చెత్తచెదారాన్ని శుభ్రపరిచి బహుమానంగా ఇవ్వడమనేది చాలా మంచి విషయం. ఇలా చెయ్యడం ద్వారా ఎంతో మందిని రోగాల బారి నుండి కాపాడినవారమౌతాము. అది మానవత్వాన్ని ఎంతగానో పెంచే పని. ఒక్క విషయం మాత్రం నేను చెప్పదలచుకున్నాను. ఈ చెత్తా చెదారం ఏదైతే ఉందో అది వృథా కాదు. అది సంపద. ఒక వనరు. దీనిని కేవలం పనికిరాని చెత్తగానే మాత్రం చూడకండి. ఒక్కసారి ఈ చెత్తచెదారాన్ని కూడా మనం సంపదలా భావించడం మొదలుపెడితే వ్యర్థాల నిర్వహణ తాలూకూ ఎన్నో కొత్త కొత్త పధ్దతులు మనకు తెలుస్తాయి. స్టార్ట్- అప్ లో చేరిన యువకులు కూడా కొత్త కొత్త పథకాలతో ముందుకు వస్తారు. కొత్త కొత్త పరికరాలను తీసుకుని రండి. రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో, పట్టణాలలోని ప్రజాపతినిధుల సహాయంతో వ్యర్థాల నిర్వహణ గురించిన ఒక గొప్ప కార్యక్రమాన్ని మొదలు పెట్టాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవం నాడు, దేశంలోని దాదాపు 4వేల పట్టణాలలోని ఘన వ్యర్థాలు, ద్రవ రూప వ్యర్థాలను సమీకరించడానికి ఉపయోగపడే సాధనాలు లభించబోతున్నాయి. రెండు రకాల చెత్త డబ్బాలు లభ్యమౌతాయి. ఒకటి ఆకుపచ్చ రంగు డబ్బా, మరొకటి నీలం రంగు డబ్బా. తడి చెత్త, పొడి చెత్త .. ఇలా రెండు రకాల వ్యర్థాలు బయటకు వస్తాయి. మనం క్రమశిక్షణ ను పాటించి, ఈ 4వేల పట్టణాల్లో పెట్టబోయే రెండు రకాల చెత్త డబ్బాలలో పొడి చెత్తని నీలం డబ్బాలో, తడి చెత్తని ఆకుపచ్చ డబ్బాలో వేద్దాం. వంటింట్లోంచి వచ్చే కూరగాయల తొక్కలు, మిగిలిపోయిన ఆహార పదార్థాలైనా, కోడిగుడ్డు పెంకులైనా, రాలిపోయిన మొక్కల,చెట్ల ఆకులైనా కూడా తడి చెత్త క్రిందకు వస్తాయి. అవన్నీ ఆకుపచ్చ డబ్బాలో వెయ్యండి. ఇవన్నీ పొలాల్లోకి బాగా పనికివస్తాయి. పొలాలు పచ్చగా ఉంటాయని గుర్తు పెట్టుకుంటే, ఆకుపచ్చ చెత్తడబ్బాలో ఏమేమి వెయ్యాలో గుర్తు ఉంటుంది. రెండవ రకం చెత్త డబ్బా చిత్తుకాగితాలు, అట్టపెట్టెలు, ఇనుము, గాజు, బట్టలు, ప్లాస్టిక్, పాలిథీన్, విరిగిపోయిన డబ్బాలు, రబ్బరు, మెటల్ మొదలైన ఎన్నో రకాలు పొడిచెత్త విభాగంలోకి వస్తాయి. వీటిని యంత్రాలలో వేసి రీసైకిల్ చేయాల్సి ఉంటుంది. మనం ఒక సంస్కృతిని ప్రారంభించగలమన్న నమ్మకం నాకు ఉంది. ప్రతి సారీ పరిశుభ్రత వైపునకు కొత్త అడుగులు వేసుకుంటూ వెళ్ళాలి మనం. అప్పుడే పరిశుభ్రత గురించి గాంధీ గారు కన్న కలలను మనం నిజం చెయ్యగలం. ఇవాళ నేను గర్వంగా ఒక విషయం గురించి చెప్పదలుచుకున్నాను. ఒక్క మనిషి అయినా సరే, గట్టిగా నిర్ణయించుకుంటే, ఎంత పెద్ద ప్రజా ఉద్యమాన్ని అయినా నడిపించగలడు. పరిశుభ్రత తాలూకూ పని అలాంటిదే. గత కొద్ది రోజుల్లో మీరు వినే ఉంటారు.. ముంబయ్ లో చెత్త ప్రదేశంగా చెప్పుకునే వర్సోవా బీచ్ ఇవాళ ఒక పరిశుభ్రమైన, సుందరమైన వర్సోవా బీచ్ గా మారిపోయింది. ఇది ఒక్కసారిగా జరగలేదు. దాదాపు వరుసగా ఎనభై- తొంభై వారాల పాటు నగరవాసులు కష్టపడి ఈ వర్సోవా బీచ్ రూపురేఖలను మార్చివేశారు. వేల టన్నుల కొద్దీ చెత్తా చెదారం ఆ ప్రాంతం నుండి తొలగించబడిన తరువాత ఇవాళ వర్సోవా బీచ్ శుభ్రంగా, అందంగా మారింది. దీని పూర్తి బాధ్యతను Versova Residence Volunteer (VRV) తీసుకుంది. శ్రీ అఫ్రోజ్ షా అనే ఒకాయన అక్టోబర్ 2015 నుండీ ఈ పనిలో నిమగ్నమయ్యారు. నెమ్మది నెమ్మదిగా ఆ కార్యక్రమం పెద్దదై, ప్రజా ఉద్యమంగా మారింది. ఈ పని చేసినందుకు గానూ అఫ్రోజ్ షా గారికి United Nations Environment Programme (UNEP) వారు పెద్ద అవార్డ్ ను ఇచ్చారు . Champions of The Earth Award అనే ఆ అవార్డ్ ను పొందిన మొదటి భారతీయుడు ఆయన అయ్యారు. అఫ్రోజ్ షా గారిని నేను అభినందిస్తూ, ఈ ఉద్యమానికి కూడా నా అభినందనలు తెలియజేస్తున్నాను. ఒక లోక సంగ్రహుడిగా ఆయన ఎలాగైతే ఆ మొత్తం ప్రాంతంలోని ప్రజలను జత చేసుకుంటూ, దానిని ఒక ప్రజా ఉద్యమంగా మార్చారో అదెంతో ప్రేరణాత్మకమైన ఉదాహరణ.

సోదర సోదరీమణులారా, ఇవాళ మరో ఆనందాన్ని కూడా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. ‘‘స్వచ్ఛ భారత్ ఉద్యమానికి సంబంధించి జమ్ము & కశ్మీర్ లోని రియాసీ బ్లాక్ గురించి. రియాసీ బ్లాక్ ఆరుబయలు ప్రదేశాలలో మల మూత్ర విసర్జన రహితం (open defecation free .. ODF) అయ్యిందని నాతో చెప్పారు. రియాసీ బ్లాక్ లోని ప్రజలందరికీ, అక్కడి పాలకులకూ కూడా జమ్ము & కశ్మీర్ ఒక మంచి ఉదాహరణను అందించింది. అక్కడి ప్రజలకు నేను అభినందనలు తెలుపుతున్నాను. ఈ మొత్తం ఉద్యమాన్ని ఎక్కువ భాగం నడిపించింది జమ్ము & కశ్మీర్ లోని ఆ ప్రాంతానికి చెందిన మహిళలేనట. ఈ విషయంలో అవగాహనను పెంచడానికి వారు స్వయంగా దివిటీ యాత్రలు కూడా చేశారట. ఇంటింటికీ, ప్రతి సందులోకీ వెళ్ళి ప్రజలను ఉత్తేజపరిచారట. ఆ తల్లులకూ, సోదరీమణులందరికీ జమ్ము & కశ్మీర్ గడ్డపై ఒక బ్లాక్ ని open defecation free చేసి ఒక శుభారంభాన్ని చేసినందుకు గానూ నా హృదయపూర్వక అభినందనలు తెలియచేస్తున్నాను.

ప్రియమైన నా దేశప్రజలారా, గత పదిహేను నుంచీ నెల రోజులుగా వరుసగా వార్తాపత్రికలలోనూ, టివీ చానల్స్ లోనూ, సోషల్ మీడియాలోనూ, మూడేళ్ళు పూర్తిచేసుకున్న సందర్భంగా ప్రజలు ప్రభుత్వపు లెక్కాపద్దులు చూస్తున్నారు. మూడేళ్ల క్రితం మీరు నాకు ‘ప్రధాన సేవకుడి’ బాధ్యతను అప్పగించారు. ఎన్నో సర్వేక్షణలూ, అభిప్రాయ సేకరణలు జరిగాయి. ఈ ప్రక్రియలన్నింటినీ నేను ఆరోగ్యకరమైన సూచనలుగా స్వీకరిస్తాను. ప్రతి పరీక్షలోనూ ఈ మూడేళ్ల కాలాన్నీ జోడించి పరీక్షించారు. సమాజంలో ప్రతి విభాగానికి చెందినవారూ దానిని విశ్లేషించారు. ప్రజాస్వామ్యంలో ఒక ఉత్తమమైన ప్రక్రియ ఉంది. ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాలు జవాబుదారీగా ఉండాలన్న విషయాన్ని నేను స్పష్టంగా నమ్ముతాను. ప్రజలకు తమ పని గురించిన లెక్కా పద్దులు ప్రభుత్వం చూపెట్టి తీరాలి. కొన్ని చోట్ల అభినందనలను అందించారు, కొన్ని చోట్ల మద్దతునిచ్చారు, కొన్ని చోట్ల లోపాలను ఎత్తి చూపారు. సమయం వెచ్చించి మా పనిని గురించి లోతుగా విశ్లేషించిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. కీలకమైన, ముఖ్యమైన ఫీడ్ బ్యాక్ అందించిన వారందరికీ కూడా నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. లోటుపాట్లూ, లోపాలూ వెలుగులోకి వస్తేనే వాటిని సరిచేసుకునే అవకాశం లభిస్తుంది. విషయం మంచిదైనా, కొంచెమే మంచిదైనా, చెడ్డదైనా, ఏదైనా దాని నుండే పాఠం నేర్చుకొని, నేర్చుకొన్న దాని సాయంతోనే ముందుకు నడవాలి. నిర్మాణాత్మకమైన విమర్శ ప్రజాస్వామ్యానికి బలాన్నిస్తుంది. ఒక అప్రమత్త దేశానికి , ఒక చైతన్యవంతమైన దేశానికి ఈ మథనం అవసరమే.

ప్రియమైన నా దేశ ప్రజలారా, నేను కూడా మీలాగే ఒక సాధారణ పౌరుడిని. ఒక సాధారణ పౌరుడిగా మంచి, చెడు ప్రతి విషయం ప్రభావం ఒక సాధారణ పౌరుడి మనసుపై ప్రభావం పడినట్లే నా మనసుపై కూడా పడుతుంది. ‘మనసులో మాట’ కార్యక్రమాన్ని కొందరు ఒకవైపు సంభాషణ గానే చూస్తారు. కొందరు రాజకీయదృష్టితో వ్యాఖ్యలు చేస్తారు. కానీ, ఇంత ఎక్కువ అనుభవంతో నాకేమనిపిస్తుందంటే, నేను మనసులో మాట మొదలుపెట్టినప్పుడు ఈ కార్యక్రమం నన్ను భారతదేశంలో ప్రతి కుటుంబంలోనూ ఒక సభ్యుడిగా మార్చేస్తుందని నేనే అనుకోలేదు. ఒక్కొక్క సారి నేను ఇంట్లో కుటుంబ సభ్యుల మధ్య కూర్చుని ఇంటి విషయాలు మాట్లాడుతున్నట్లు నాకనిపిస్తుంది. ఇదే విషయాన్ని ఎన్నో కుటుంబాల వారు నాకు రాశారు. నేను చెప్పినట్లుగానే ఒక సాధారణ పౌరుడిగా నా మనసులో ఏర్పడిన ప్రభావాన్ని రెండురోజుల క్రితమే రాష్ట్రపతి భవన్ లో గౌరవనీయులు రాష్ట్రపతి గారు, ఉపరాష్ట్రపతి గారూ, స్పీకర్ గారూ కలిసి ‘మనసులో మాట’ తాలూకూ ఒక విశ్లేషణా పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఒక వ్యక్తిగానూ, ఒక సాధారణ పౌరుడిగానూ ఈ సంఘటన నా ఉత్సాహాన్నెంతో పెంచింది. అంత పెద్ద స్థానంలో కూర్చుని ఉన్నా కూడా సమయం వెచ్చించి ‘మనసులో మాట’కు ఇంతటి ప్రాముఖ్యాన్నిచ్చినందుకు గానూ గౌరవనీయులు రాష్ట్రపతి గారికీ, ఉప రాష్ట్రపతి గారికీ, స్పీకర్ గారికీ నేను ఋణపడి ఉంటాను. ఒక విధంగా ‘మనసులో మాట’ కార్యక్రమానికే ఒక కొత్త కోణాన్ని అందించారు. మా మిత్రులు కొందరు ఈ ‘మనసులో మాట’ పుస్తకంపై పని చేస్తున్నప్పుడు నాతో కూడా అప్పుడప్పుడు చర్చించారు. కొంత కాలం క్రితం ఈ మాట చర్చకు వచ్చినప్పుడు నేను ఆశ్చర్యపడ్డాను. అబు ధాబీ లో నివసించే ఒక ఆర్టిస్ట్ అక్బర్ సాహెబ్ పేరుతో పరిచితుడు. ‘మనసులో మాట’ కార్యక్రమంలో చర్చించిన విషయాలకు ఆయన తన కళ ద్వారా బొమ్మ లు వేసిస్తానని స్వయంగా ప్రస్తావించారు. ఒక్క రూపాయి కూడా తీసుకోకుండా అక్బర్ గారి మనసులో మాటలకు కళారూపాన్ని అందించి తన ప్రేమను తెలిపారు. నేను అక్బర్ గారికి ఋణపడి ఉంటాను.

ప్రియమైన నా దేశప్రజలారా, ఈసారి మనం కలుసుకునే సరికి దేశం నలుమూలలా వర్షాలు పడుతూ ఉంటాయి. వాతావరణం మారి ఉంటుంది. పరీక్షా ఫలితాలు వచ్చేసి ఉంటాయి. కొత్త మలుపులోంచి విద్యాజీవితం మొదలౌతూ ఉంటుంది. వర్షాలు పడుతూనే- ఒక కొత్త ఉత్సాహం, కొత్త సుగంధం, ఒక కొత్త పరిమళం మొదలౌతాయి. రండి, మనందరం ఈ వాతావరణంలో ప్రకృతి ని ప్రేమిస్తూ ముందుకు నడుద్దాం. నా తరఫున మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు, ధన్యవాదాలు.

*****