పిఎంఇండియా
శ్రేష్ఠుడైన ప్రధాని శ్రీ మాల్ కమ్ టర్న్ బుల్,
ప్రసార మాధ్యమాల సభ్యులు,
ఎక్స్ లెన్సీ,
భారతదేశంలో మీరు మొదటిసారిగా పర్యటిస్తున్న సందర్భంగా మీకు స్వాగతం పలకడం నాకు చాలా సంతోషాన్నిస్తోంది. కిందటి నెలే, మనం బార్డర్ – గావస్కర్ ట్రాఫి ఉద్వేగభరితంగా ముగియడాన్ని వీక్షించాం. 2014లో ఆస్ట్రేలియా పార్లమెంటులో నేను ఇచ్చిన ఉపన్యాసంలో విశిష్ఠులైన శ్రీ బ్రాడ్ మేన్ మరియు శ్రీ తెందుల్కర్ లను గురించి ప్రస్తావించాను. ఈ రోజు భారతదేశంలో శ్రీ విరాట్ కోహ్లీ మరియు ఆస్ట్రేలియాలో శ్రీ స్టీవెన్ స్మిత్ లు క్రికెట్ లో యువ సేనలను తీర్చిదిద్దుతున్నారు. శ్రీ స్టీవెన్ స్మిత్ బ్యాటింగ్ తరహాలోనే మీ భారతదేశ సందర్శన కూడా సఫలం అవుతుందని నేను ఆశిస్తున్నాను.
ఎక్స్ లెన్సీ,
జి-20 సమావేశాలను పురస్కరించుకొని మనం జరిపిన సమావేశాలు నాకు ఇప్పటికీ స్పష్టంగా గుర్తుకొస్తున్నాయి. అవి ఒక బలమైన సంకల్పాన్ని ప్రతిబింబించాయనే చెప్పాలి. మరీ ముఖ్యంగా, మన బంధం మరింత పటిష్ఠం అయ్యేందుకు మీరు కనబరచిన ఆసక్తిని నేను ప్రశంసిస్తున్నాను. మన సహకారాత్మక ప్రస్థానం సవ్యమైన బాటలో సాగుతోంది. మీ నేతృత్వంలో మన సంబంధం సరికొత్త మైలు రాళ్ళను అందుకొంది. ఇప్పుడు మీ పర్యటన మన వ్యూహాత్మక భాగస్వామ్యంలో నూతన ప్రాథమ్యాలను నిర్వచించుకొనేందుకు ఒక అవకాశాన్ని ప్రసాదిస్తోంది.
ఎక్స్ లెన్సీ,
హిందూ మహా సముద్ర జలాలు ముడివేసుకొన్న మన చరిత్రలను స్ఫురణకు తెస్తున్నాయి. అవి పెనవేసుకొన్న మన భవితవ్యాలకు ఒక సూచికగా కూడా ఉన్నాయి. మన రెండు దేశాలలో ప్రజాస్వామిక విలువలు, నియమాలు, చట్ట సూత్రాలు ఒకదానితో మరొకటి సరిపోలుతూ ఉన్నాయి. మన బంధాలలో ఇమిడివున్న అవకాశాల విస్తృత పరిధి భారతదేశంలోని 1.25 బిలియన్ ప్రజల ఆర్థిక సమృద్ధి తాలూకూ ప్రగాఢ వాంఛతో పాటు, ఆస్ట్రేలియా యొక్క బలాలు, సామర్థ్యాలను కూడా చాటిచెబుతోంది.
మిత్రులారా,
ఈ రోజు మనం జరిపిన చర్చలలో ద్వైపాక్షిక సంబంధాలను గురించి ప్రధాని, నేను సమగ్రంగా సమీక్షించాం. మన భాగస్వామ్యాన్ని మరింతగా బలోపేతం చేయడం కోసం ముందుచూపుతో కూడిన నిర్ణయాలనెన్నింటినో మేం తీసుకున్నాం. వీటిలో- కాంప్రిహెన్సివ్ ఎకనామిక్ కో ఆపరేషన్ అగ్రిమెంట్ కు సంబంధించిన తదుపరి విడత సంప్రదింపులను త్వరలో జరుపుకోవాలన్న నిర్ణయం కూడా- ఒకటిగా ఉంది. అయితే, మన నిర్ణయాలు డిఆర్ఎస్ సమీక్ష వ్యవస్థకు లోబడినవి కావన్న అంశమే నాకు కొంత ఊరటనిస్తోందని చెప్పాలి.
మిత్రులారా,
మన సమాజాలు సమృద్ధి పథంలో పురోగమించాలంటే విద్యకు, నూతన ఆవిష్కారాలకు పెద్ద పీట వేయాల్సిందేనని భారతదేశం, ఆస్ట్రేలియా లు గ్రహించాయి. కాబట్టి, మన బంధం తాలూకూ అత్యంత ముఖ్యమైన అంశాలలో విద్య మరియు పరిశోధన రంగంలో పరస్పరం సహకరించుకోవాలనేది ఒకటిగా స్థానం సంపాదించుకోవడం ఆశ్చర్యమేమీ లేదు. నానో టెక్నాలజీ, బయో టెక్నాలజీలకు సంబంధించి తెరి- డియాకిన్ పరిశోధన కేంద్రాన్ని ప్రధాని, నేను కలసి కొద్దిసేపటి క్రితమే ప్రారంభించాము. ఈ కేంద్రం మన రెండు దేశాల మధ్య అత్యాధునిక శాస్త్ర విజ్ఞాన, సాంకేతిక విజ్ఞాన సంబంధిత సహకారానికి ఒక చక్కని ఉదాహరణగా లెక్కకు వస్తుంది. సుమారు 100 మిలియన్ డాలర్లతో కూడిన ఆస్ట్రేలియా- ఇండియా పరిశోధన నిధి నానో-టెక్నాలజీ, స్మార్ట్ సిటీస్, మౌలిక సదుపాయాల కల్పన, వ్యవసాయం మరియు వ్యాధుల నియంత్రణ వంటి రంగాలలో సమన్వయపూర్వక పరిశోధన పథకాలపైన తన దృష్టిని కేంద్రీకరించింది. విటమిన్ ఎ తో సమృద్ధమైన అరటి పండ్లను కలసి అభివృద్ధిపరచే ప్రక్రియ క్షేత్ర స్థాయి పరీక్షల దశకు చేరుకుంది. పప్పు ధాన్యాలలో మరింత పోషకాహార విలువలు కలిగిన రకాలను ఆవిష్కరించడంలో మన శాస్త్రవేత్తలు భుజం భుజం కలిపి పని చేస్తున్నారు. మన వ్యవసాయదారులతో పాటు లక్షలాది ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచగలిగిన తుది ఫలితాలను సాధించడంలో మన మధ్య విశిష్టమైన శాస్త్ర విజ్ఞాన సంబంధ సహకారం నెలకొందనడానికి ఈ రెండు విషయాలు ఉదాహరణలు మాత్రమే. ప్రధాని వెంట వచ్చిన వృత్తి విద్యా శిక్షణ సంస్థల అధిపతులు మరియు ఉప కులపతులతో కూడిన భారీ ప్రతినిధి వర్గానికి సైతం ఇదే నా సాదర స్వాగతం. ఈ పర్యటనలో భాగంగా సంస్థకు- సంస్థకు మధ్య కుదిరిన ఒప్పందాల సంఖ్య అధికంగా ఉంది. ద్వైపాక్షిక విద్యారంగ సహకారంలో విద్యార్థి బృందాలు, ఇటు నుండి అటు- అటు నుండి ఇటు రాకపోకలు జరపడం కీలకమవుతుంది. 60,000కు పైగా భారతీయ విద్యార్థులకు ఆస్ట్రేలియా ఆశ్రయమిస్తోంది. విద్యార్జన నిమిత్తం భారతదేశానికి విచ్చేస్తున్న ఆస్ట్రేలియా విద్యార్థుల సంఖ్య కూడా అంతకంతకు పెరుగుతోంది. భారతదేశ యువతీయువకుల ఆకాక్షంలకు దీటుగా ఇండియాలో ప్రపంచ శ్రేణి సంస్థలను నిర్మించాలనేది మా ప్రభుత్వ ధ్యేయాలలో ఒకటిగా ఉంది. ఈ లక్ష్యాన్ని సాధించడంలో ఆస్ట్రేలియాకు చెందిన విశ్వవిద్యాలయాలు ఏవిధంగా వాటి తోడ్పాటును అందించవచ్చో ప్రధాని శ్రీ టర్న్ బుల్ తో నేను చర్చించాను.
మిత్రులారా,
మన ఆర్థికవృద్ధి మరియు సమృద్ధి పర్యావరణం పట్ల స్నేహపూరితంగా ఉండాలని ప్రధాని, నేను గట్టిగా కోరుకుంటున్నాం. నవీకరణ యోగ్య శక్తి సహా ఇతర రూపాలలో శక్తి ఉత్పాదన వేగవంతం చేసుకొనే దిశగా మా ఇరువురి మధ్య సంభాషణలు సాగడంతో మాకు చాలా ఆనందంగా ఉంది. అంతర్జాతీయ సౌర కూటమి (ఇంటర్ నేషనల్ సోలార్ అలయెన్స్- ఐఎస్ఎ)లో ఆస్ట్రేలియా చేరాలని నిర్ణయించుకున్నందుకు కూడా ప్రధానికి నేను ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. ఇదే కాదు, ఆస్ట్రేలియా పార్లమెంటులో ఒక చట్టాన్ని ఆమోదించడం ద్వారా భారతదేశానికి యురేనియం ఎగుమతి చేసేందుకు కూడా ఆస్ట్రేలియా ప్రస్తుతం ముందుకు వచ్చింది.
మిత్రులారా,
మన భవిష్యత్తు ఇండో- పసిఫిక్ ప్రాంతంలోని శాంతితోను, సుస్థిరతతోను గట్టిగా ముడివేసుకొని ఉందని ప్రధాని, నేను గ్రహించాం. అందువల్ల భద్రమైన, నియమాలపై ఆధారపడిన ఇండో- పసిఫిక్ ఏర్పడాలన్న అవసరం ఉందని మేము అంగీకారానికి వచ్చాం. ప్రస్తుత ప్రపంచంలో ఉగ్రవాదం మరియు సైబర్ సెక్యూరిటీ వంటి సవాళ్ళు మన ప్రాంత సరిహద్దులను మించి విస్తరించాయన్న సంగతి మాకు ఎరుకే. ఈ కారణం చేత, వీటి విషయంలో ప్రపంచవ్యాప్త వ్యూహాన్ని, ప్రపంచవ్యాప్త పరిష్కార మార్గాలను అనుసరించవలసివుంది. నిజానికి, ప్రాంతీయ అంశాల పట్ల, ప్రపంచ స్థాయి అంశాల పట్ల ప్రధానికి ఉన్న అవగాహన, అంతర్ దృష్టి మన రెండు దేశాలను బాధిస్తున్న అంశాల విషయంలో మనం చేయి చేయి కలిపి ముందుకు వెళ్లేందుకు ఒక కొత్త దిశను ఆవిష్కరిస్తోంది. రక్షణ రంగంలోను, భద్రత రంగంలోను మన సహకారం నూతన శిఖరాలను అందుకొంది. మన సముద్ర సంబంధి విన్యాసాలు, మార్పిడి కార్యక్రమాలు ఫలప్రదమయ్యాయి. ఉగ్రవాదానికి ఎదురొడ్డి నిలిచే అంశాలలో, దేశాంతర నేరాలను ఛేదించే అంశాలలో మన ద్వైపాక్షిక యంత్రాంగాలు చక్కగా పని చేస్తున్నాయి. ఈ పర్యటన సందర్భంగా భద్రత సంబంధ సహకారానికి ఉద్దేశించిన ఒక ఎమ్ఒయు కొలిక్కి రావడం నాకు మరీ ముఖ్యంగా ఆనందాన్నిస్తోంది. మన ప్రాంతంలో శాంతి, సమృద్ధి, సమతుల్యత లకు సంబంధించి సుదృఢమైన ప్రాంతీయ సంస్థలు ఏర్పడవలసిన అవసరం ఎంతైనా ఉందని కూడా మేం ఒక అభిప్రాయానికి వచ్చాం. అందుకే మేం ఈస్ట్ ఏషియా సమిట్ సభ్యత్వ దేశాలతో, ఇండియన్ ఓషన్ రిమ్ కంట్రీస్ సభ్యత్వ దేశాలతో కలసి మన ఉమ్మడి ప్రయోజనాలను సాధించుకొనేందుకు మరింత ఉత్సాహంగా ముందడుగు వేస్తాం.
మిత్రులారా,
మన రెండు సమాజాల మధ్య ఉన్న సంబంధం మన భాగస్వామ్యం యొక్క బలానికొక ప్రధానమైన అంశంగా ఉంది. దాదాపు 5 లక్షల మంది భారతీయ మూలాలు కలిగినవారు ఆస్ట్రేలియాలో నివస్తున్నారు. వారి సౌభాగ్యం, చైతన్యశీలమైన సంస్కృతి మన భాగస్వామ్యాన్ని సుసంపన్నం చేస్తున్నాయి. “కాన్ ఫ్లుయెన్స్” పేరిట గత సంవత్సరం ఆస్ట్రేలియా లోని అనేక నగరాలలో నిర్వహించిన ఫెస్టివల్ ఆఫ్ ఇండియా దిగ్విజయాన్ని సాధించింది. ఈ ఉత్సవానికి ఆస్ట్రేలియా ప్రభుత్వం వెన్నుదన్నుగా నిలచినందుకు ప్రధానికి నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
ఎక్స్ లెన్సీ,
ఇటీవలి కాలంలో మన ద్వైపాక్షిక సంబంధాల బాటలో భారతదేశం, ఆస్ట్రేలియా లు పెద్ద పెద్ద అడుగులు వేశాయి. రానున్న కాలంలో మన రెండు దేశాలు మరిన్ని అవకాశాలను చేజిక్కించుకుంటాయనిపిస్తోంది. మన మధ్య నెలకొన్న బలమైన ఎంతో కీలకమైన భాగస్వామ్యం మన సమాజాల భద్రతకు, అభ్యున్నతికి ముఖ్యమైందేనని భావించవచ్చు. అయితే, ఇది మన ప్రాంతంలో శాంతికి, సుస్థిరతకు, భద్రతకు దారితీసే ప్రధానమైన అంశం కూడా అవుతోంది. ఈ మాటలతో, ఎక్స్ లెన్సీ, మిమ్మల్ని భారతదేశంలోకి మరొక్కమారు నన్ను సాదరంగా ఆహ్వానించనివ్వండి. మీ పర్యటన సఫలమవ్వాలని నేను కోరుకుంటున్నాను.
మీకు నా ధన్యవాదాలు.
ఎన్నెన్నో ధన్యవాదాలు.
****