పిఎంఇండియా
జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్ (ఎన్సిబిసి) నుండి అందిన సలహాను అనుసరించి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి, ఇంకా కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్రానికి వర్తించే విధంగా కులాలను/తెగలను చేర్చడం/సవరించడం/తొలగించడం ద్వారా ఇతర వెనుకబడిన కులాల (ఒబిసిల) కేంద్ర జాబితాలో తగిన సవరణలను చేయాలనే ప్రతిపాదనకు కేంద్ర మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశానికి అధ్యక్షత వహించారు.
ఎన్ సి బి సి సిఫారసు చేసిన ప్రకారం ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి మొత్తం 35 మార్పులను, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి 86 కొత్త చేర్పులను నోటిఫై చేయనున్నారు. ఈ మార్పులు ప్రభుత్వ సర్వీసులలోను, ఉద్యోగాలలోను మరియు కేంద్ర ప్రభుత్వ విద్యా సంస్థలలోను ఇప్పటి విధానం ప్రకారం రిజర్వేషన్ తాలూకు ప్రయోజనాలను ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలలో ఆయా కులాలు/సమూహాలకు చెందిన వ్యక్తులు పొందేందుకు వీలు కల్పిస్తాయి. అంతేకాక వారు కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నడుస్తున్న, ప్రస్తుతం జాబితాలోని ఇతర వెనుకబడిన కులాలకు చెందిన వారికి అందుబాటులో ఉన్న వివిధ సంక్షేమ పథకాలకు, ఉపకార వేతనాలకు కూడా అర్హులు అవుతారు.
పూర్వరంగం:
సమానార్థక పదాలు, ఉప కులాలతో సహా మొత్తం 2401 ఎంట్రీలను ఇతర వెనుకబడిన కులాల కేంద్ర జాబితాలో చేర్చాలని కమిషన్ సిఫారసు చేసిన మీదట 24 రాష్ట్రాలు మరియు 6 కేంద్రపాలిత ప్రాంతాలలో నోటిఫై చేయడమైనది. అటువంటి కడపటి నోటిఫికేషన్ ను 26.05.2016న జారీ చేశారు. అప్పటి నుండి, ఆంధ్ర ప్రదేశ్ లోను, కొత్తగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం లోను ఇప్పుడు అమలులో ఉన్న ఒ బి సి ల జాబితాలో మరిన్ని కులాలు/సమూహాలను చేర్చాలంటూ, ఇంకా దిద్దుబాట్లు చేయాలంటూ అనేక సిఫారసులు ఎన్ సి బి సి నుండి అందాయి.
పౌరులలో ఏ వర్గాన్ని అయినా వెనుకబడిన కులాల జాబితాలో చేర్చాలంటూ వచ్చే అభ్యర్థనలను ఎన్ సి బి సి చట్టం, 1993 లోని సెక్షన్ 9 (”కమిషన్ విధులు”) లో భాగంగా ఎన్ సి బి సి కమిషన్ పరిశీలిస్తుంది; అంతేకాకుండా, అటువంటి జాబితాలలో ఏదైనా వెనుకబడిన తరగతిని ఎక్కువగా చేర్చారని గాని, లేదా తక్కువగా గాని చేర్చారని గాని వచ్చే ఫిర్యాదులను సహితం ఎన్ సి బి సి పరిశీలించి కేంద్ర ప్రభుత్వానికి తగిన సలహాలనిస్తుంది. కమిషన్ సలహాకు కేంద్ర ప్రభుత్వం సాధారణంగా కట్టుబడి ఉండాలని కూడా చట్టం స్పష్టంగా నిర్దేశిస్తున్నది.