Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎఐఐఎంఎస్ లో వివిధ ఆరోగ్య సంరక్షణ పథకాల ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం

ఎఐఐఎంఎస్ లో వివిధ ఆరోగ్య సంరక్షణ పథకాల ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం

ఎఐఐఎంఎస్ లో వివిధ ఆరోగ్య సంరక్షణ పథకాల ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం

ఎఐఐఎంఎస్ లో వివిధ ఆరోగ్య సంరక్షణ పథకాల ప్రారంభ కార్యక్రమం లో ప్రధాన మంత్రి ప్రసంగం


వేదిక‌పై ఆసీనులైన నా మంత్రివర్గ స‌హ‌చ‌రులు శ్రీ జె.పి. న‌డ్డా, శ్రీ అశ్విని  చౌబే జీ, అనుప్రియ ప‌టేల్ గారు, ఇంకా ర‌ణ‌దీప్ గులేరియా గారు, శ్రీ ఐ.ఎస్. ఝా, డాక్ట‌ర్ రాజేశ్ శ‌ర్మ మరియు ఇతర ప్ర‌ముఖులారా,

ఢిల్లీ ప్ర‌జ‌లు, చికిత్స ల కోసం ఢిల్లీ కి వ‌చ్చే వారు, ఒక ర‌కంగా మీ అంద‌రికీ చికిత్స ల విధానం లో ఇది ఒక ప్ర‌త్యేక‌మైన రోజు.  పేద‌లు, సామాన్య మాన‌వులు, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి కి చెందిన వారు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు క‌ష్టాల నుండి బ‌య‌ట‌ప‌డేందుకు, వివిధ వ్యాధుల‌తో పోరాడేందుకు స‌హాయాన్ని అందించేందుకు కొన్ని స్తంభాలను మ‌నం నిర్మించాము.   సుమారు 1700 కోట్ల రూపాయల విలువైన ఒక ప్రాజెక్టును మ‌నం కొద్ది క్ష‌ణాల క్రిత‌మే ప్రారంభించుకున్నాము.  త‌ద్వారా ఢిల్లీ లోని రెండు ప్ర‌ధాన ఆస్ప‌త్రులైనటువంటి ఎఐఐఎంఎస్ ఇంకా స‌ఫ్ దర్ జంగ్ ఆసుపత్రులలో నూతనంగా 1800 పడకలను జతపరచడమైంది.  

మిత్రులారా,
 
ఎఐఐఎంఎస్ పై పెరుగుతున్న ఒత్తిడి ని ప‌రిగ‌ణ‌న‌ లోకి తీసుకొని ఢిల్లీ లో దానికి అనుబంధంగా ప‌ని చేస్తున్న అన్ని ప్రాంగ‌ణాలలో విస్తరణ కార్య‌క్ర‌మాలను చేప‌ట్టాము.  నేడు, 300 కోట్ల రూపాయ‌ల‌కు పైగా వ్య‌యంతో నిర్మాణం అవుతున్నటువంటి నేశనల్ సెంటర్ ఫర్ ఏజింగ్ కు కూడా పునాదిరాయి వేయడమైంది.  ఈ కేంద్రం 200 ప‌డ‌క‌లతో ఉంటుంది.  వ‌చ్చే ఏడాదిన్నర, రెండు సంవ‌త్స‌రాల కాలంలో దీనిని పూర్తి చేసి వినియోగం లోకి తీసుకు వ‌చ్చే ప్ర‌య‌త్నం చేస్తాము.  అందులో వ‌యో వృద్ధుల కోసం ఎన్నో స‌దుపాయాలు ఉంటాయి.  వ‌య‌స్సు పైబ‌డుతున్న కొద్దీ వ‌చ్చే స‌మ‌స్య‌ లకు స‌రైన చికిత్స విధానాలను అందుబాటులోకి తేవ‌డం కోసం ప‌రిశోధ‌న‌లు నిర్వ‌హించేందుకు అందులో వ‌యోవృద్ధుల‌కు వ‌చ్చే వ్యాధుల ప‌రిశోధ‌న కేంద్రం కూడా ఏర్పాట‌వుతుంది.  ఇది కాకుండా స‌ఫ్ దర్ జంగ్ ఆసుపత్రి లో 1300 కోట్ల‌కు పైగా వ్య‌యంతో వ‌స‌తుల‌ను ఆధునికీక‌రిస్తున్నాము.  ఇందులో భాగంగా ఎమ‌ర్జెన్సీ బ్లాక్ లో ఒక సూప‌ర్ స్పెశాలిటీ సేవల విభాగాన్ని కూడా దేశ ప్రజలకు అంకితం చేశాము.  ఫ‌లితంగా మెడిక‌ల్ ఎమ‌ర్జెన్సీ ల కోసం 500 అద‌న‌పు ప‌డ‌క‌లను స‌మ‌కూర్చ‌డంతో స‌ఫ్ దర్ జంగ్ ఆసుపత్రి దేశం లోనే అతి పెద్ద ఎమ‌ర్జెన్సీ చికిత్సల కేంద్రాన్ని కలిగివున్న ఆసుపత్రి గా మారింది.

మిత్రులారా,

ఈ రోజు ప్రారంభించిన 5 ప్రాజెక్టులలో ప‌వ‌ర్ గ్రిడ్ రిలాక్సేశన్ హౌస్ కూడా ఉంది.  ఇది ప్ర‌భుత్వ రంగం పట్ల మరియు సంఘం పట్ల వారి యొక్క బాధ్యతకు ఒక చ‌క్క‌ని ఉదాహరణ.  ఇది రోగులకే కాకుండా రోగుల సంర‌క్ష‌ణ‌ కు పాటుపడుతున్న వారికి కూడా ఒక పెద్ద ఊరట.

మిత్రులారా,
 
స‌రైన స‌మ‌యంలో చికిత్స మాన‌వుల ప్రాణాల‌ను కాపాడ‌డం లో అత్యంత కీల‌క‌మైనటువంటి పాత్ర ను పోషిస్తుంది.  కానీ చాలా సంద‌ర్భాలలో ఢిల్లీ లో వాహనాల రాకపోకలు రోగుల పాలిట శాపంగా మారుతున్నాయి.  గ‌తం లో రోగుల‌ను ఎఐఐఎంఎస్ కేంప‌స్‌ కు, దానికి అనుబంధంగా ఉన్న వివిధ కేంద్రాల‌కు మ‌ధ్య త‌ర‌లించ‌డం ఒక పెద్ద స‌మ‌స్య‌ గా ఉండేది.  ఎఐఐఎంఎస్‌ కు, జయ్ ప్ర‌కాశ్ ట్రామా సెంట‌ర్ కు మ‌ధ్య ఈ స‌మ‌స్య‌ల‌ను ప‌రిష్క‌రించ‌డం జ‌రిగింది.  ఒక కిలోమీట‌రు పొడ‌వున నిర్మించిన భూగ‌ర్భ సొరంగ మార్గాన్ని ప్రారంభించే అవ‌కాశం కొద్ది రోజుల క్రిత‌మే నాకు చిక్కింది.  రోగుల, వారి బంధువుల, వైద్యుల, అత్యవసర ఔష‌ధాల, వైద్య‌ ప‌రిక‌రాల త‌ర‌లింపు ఎటువంటి అడ్డంకులు లేకుండా సాగేటట్టు ఈ సొరంగ మార్గం  ఉప‌యోగ‌ప‌డగలదు.

మిత్రులారా, 

త్వ‌రిత‌ గ‌తిన, అమిత వేగంగా అభివృద్ధి చెందుతున్న భార‌తదేశం వంటి దేశానికి తక్కువ ఖరీదు ఉండేటటువంటి, సుర‌క్షిత‌మైన, ఆధునికమైన వైద్య వ‌స‌తులు అంద‌రికీ అందుబాటులో ఉండే ప్ర‌దేశాల‌కు విస్త‌రించవలసిన అతి పెద్ద బాధ్యత మ‌న అంద‌రి మీద ఉన్న సంగతి మీకు అంద‌రికీ తెలుసును.  గత నాలుగు సంవ‌త్స‌రాలలో ప్ర‌భుత్వ ఆరోగ్య సంర‌క్షణ సేవ‌ల‌కు కొత్త దిశ ను ఇవ్వ‌డం జ‌రిగింది.  పేద‌లకు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి వ‌ర్గాల‌కు కూడా నాణ్య‌మైన ఆరోగ్య సంర‌క్షణ స‌దుపాయాలను వారు భ‌రించగలిగిన ధ‌ర‌లలో అందుబాటు లోకి తీసుకురావ‌డానికి విధాన‌ప‌రంగా ప‌లు చ‌ర్య‌లు తీసుకున్నాము.  కేంద్ర‌ ప్ర‌భుత్వం దేశ‌వ్యాప్తంగా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌తో క‌లసి ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు ఆధునిక మౌలిక వ‌స‌తులను అందుబాటు లోకి తీసుకువస్తోంది.  కేంద్ర‌ ప్ర‌భుత్వం అవిశ్రాంతంగా చేసిన ఈ ప్ర‌య‌త్నం వ‌ల్ల ఆసుపత్రుల ద్వారా వ్య‌వ‌స్థీకృత వైద్య‌ సేవల ప‌రిమాణం చాలా పెరిగింది.  గ‌ర్భిణులు, బాలల ఆరోగ్య నిరంతర ప‌ర్య‌వేక్షణ, కొత్త గా 5 టీకా మందులను ప్ర‌వేశ‌పెట్ట‌డంతో బాలింత మరణాల, శిశు మ‌ర‌ణాల సంఖ్య గ‌ణ‌నీయంగా త‌గ్గింది.   

అన్ని ప్ర‌ధాన న‌గ‌రాల చుట్టుప‌క్కల ఆరోగ్య మౌలిక వ‌స‌తుల క‌ల్ప‌న‌ కు ప్ర‌భుత్వం గ‌ట్టిగా కృషి చేస్తోంది.  రెండో అంచె నగరాలకు, మూడో అంచె న‌గ‌రాల‌కు కూడా ఇదే త‌ర‌హా సేవ‌లను విస్త‌రిస్తున్నాము.  రెండు స్థాయిలలో ప్ర‌భుత్వం ఈ దిశ‌గా కృషి చేస్తోంది.  ప్ర‌స్తుతం ప‌ని చేస్తున్న ఆసుపత్రుల‌కు ఆధునిక వ‌స‌తులను క‌ల్పించ‌డం ఒక‌టైతే దేశం లోని మారుమూల ప్రాంతాల‌కు కూడా ఆధునిక వైద్య సేవ‌లను అందుబాటులోకి తీసుకురావ‌డం రెండోది.

మిత్రులారా,

గత నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో మంజూరైన ఎఐఐఎంఎస్ ల సంఖ్య దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 70 సంవ‌త్స‌రాల కాలంలో మంజూరైన వాటి  క‌న్నా ఎన్నో రెట్లు అధికంగా ఉంది.  మొత్తం 13 ఎఐఐఎంఎస్ లు మంజూరు కాగా వాటిలో ఎనిమిదింటి ప‌నులు ఇప్ప‌టికే ప్రారంభం అయ్యాయి.  ఇది కాకుండా దేశం లోని భిన్న ప్రాంతాలలో 15 వైద్య క‌ళాశాల‌ల్లో సూప‌ర్ స్పెశాలిటి ఆసుపత్రుల నిర్మాణం పురోగ‌మిస్తోంది.

మిత్రులారా, 

న్యూ ఇండియా లో తక్కువ ఖర్చుతో కూడినటువంటి అత్యుత్తమ స‌దుపాయాల‌తో త‌గినంత మంది వైద్యులు, ప‌డ‌క‌లు గల ఆరోగ్య సంర‌క్షణ వ్య‌వ‌స్థ అభివృద్ధి చెందుతోంది.  ఈ ల‌క్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొని వైద్య‌ విద్య‌ లో కొత్త అవ‌కాశాలను కూడా అందుబాటు లోకి తీసుకువస్తున్నాము.  దేశం లోని 58 జిల్లా వైద్య ఆసుపత్రుల స్థాయి ని పెంచే ప్ర‌య‌త్నం కూడా మా ప్ర‌భుత్వం చేప‌ట్టింది.  దేశం లో 24 కొత్త వైద్య క‌ళాశాలల ఏర్పాటు కు ఈ ఏడాది బ‌డ్జెటు లో కేటాయింపులు జ‌రిగాయి.  ప్ర‌తి మూడు లోక్ సభ నియోజ‌క‌వ‌ర్గాల‌కు క‌నీసం ఒక వైద్య క‌ళాశాల ఉండేలా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకుంది.  గత నాలుగు సంవ‌త్స‌రాల కాలంలో దేశ వ్యాప్తంగా భిన్న క‌ళాశాల‌ల్లో 25 వేల కొత్త అండ‌ర్ గ్రాడ్యుయేట్, పోస్ట్ గ్రాడ్యుయేట్ సీట్లు అద‌నంగా జోడించడమైంది.  వైద్య క‌ళాశాల‌ల్లో ప్ర‌వేశాల విధానాన్ని కూడా ప్ర‌భుత్వం స‌ర‌ళతరం చేసింది.

మిత్రులారా, 

మా ప్ర‌భుత్వం దృష్టి కేవ‌లం ఆసుపత్రుల ఏర్పాటు, రోగాలు, మెరుగైన వైద్య స‌దుపాయాల‌కే ప‌రిమితం కాదు.  దేశం లోని ప్ర‌తి ఒక్క‌రికీ మెరుగైన వైద్య సేవ‌లను అందించ‌డం, అనారోగ్యానికి హేతువుల‌ను త‌గ్గించ‌డం ల‌క్ష్యంగా జాతీయ ఆరోగ్య విధానాన్ని ప్ర‌భుత్వం ఆవిష్క‌రించింది.  ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను ఆరోగ్య మంత్రిత్వ శాఖ ప‌రిధి కే ప‌రిమితం చేయ‌కుండా గ్రామీణాభివృద్ధి శాఖ, పారిశుధ్యం/మంచినీటి వ‌స‌తుల క‌ల్పన శాఖ, మ‌హిళా/బాల వికాస శాఖ‌ల‌ను కూడా ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ తో అనుసంధానం చేశాము.  దీనికి తోడు ఆరోగ్య శాఖ‌కు సాంప్ర‌దాయక ఆరోగ్య సేవల, ఆయుష్ మంత్రిత్వ శాఖల మ‌ద్ద‌తు కూడా ల‌భిస్తోంది. పేద‌రికానికి, రోగాల‌కు సంబంధం ఉన్న దృష్ట్యా ఆ దిశ‌గా కూడా ప్ర‌భుత్వం విధానాలను రూపొందించింది.  అన్ని కార్య‌క్ర‌మాలను స‌క్ర‌మంగా అమ‌లు చేసేందుకు ఎంతో కృషి జ‌రుగుతోంది.  రోగాల నివారణ అంటే ఒక ర‌కంగా పేద‌రికాన్ని అదుపు లోకి తీసుకురావ‌డం గా కూడా ప‌రిగ‌ణించాలి.  ఈ దిశ‌గా అవిశ్రాంతంగా కృషి జ‌రుగుతోంది.  స్వ‌చ్ఛ్ భార‌త్ అభియాన్ లో భాగంగా మ‌రుగుదొడ్ల నిర్మాణం, ఇంద్ర‌ధ‌నుష్ లో భాగంగా మారుమూల ప్రాంతాల‌కు టీకా మందులను చేర‌వేయ‌డం వంటి కార్య‌క్ర‌మాల‌తో పాటు జాతీయ పోష‌కాహార ప‌థ‌కం, ఆయుష్మాన్ భార‌త్ వంటి ప‌థ‌కాల ద్వారా పేద‌ల‌పై వైద్య ఖ‌ర్చుల భారం త‌గ్గుతోంది.  ఇప్ప‌టివ‌ర‌కు ఎన్న‌డూ ప్ర‌భుత్వం నివార‌ణాత్మక, అందుబాటు ధరల ఆరోగ్య సంర‌క్ష‌ణ‌పై ఇంత తీవ్ర స్థాయిలో శ్ర‌ద్ధ పెట్ట‌లేదు.
 ఆయుష్మాన్ భార‌త్ పేరిట చేప‌ట్టిన జాతీయ ఆరోగ్య సంర‌క్షణ కార్య‌క్ర‌మం కూడా ఈ దిశ‌గా ఒక కీల‌క‌మైన అనుసంధానంగా ఉప‌యోగ‌ప‌డుతుంది.  ఈ ప‌థ‌కం లో భాగంగా దేశంలోని ప్ర‌తి ఒక్క మేజ‌ర్ పంచాయ‌తీలో సుమారు 1.5 ల‌క్షల ఆరోగ్యం మరియు వెల్ నెస్ కేంద్రాలను ఏర్పాటుచేయడం జ‌రుగుతోంది.  భ‌విష్య‌త్తులో ఈ కేంద్రాలు వ్యాధుల‌ను గుర్తించి చికిత్స ను అందించేందుకు టెస్టింగ్, ట్రీట్ మెంట్ వ‌స‌తులను సైతం క‌లిగివుంటాయి.  ప‌ట్ట‌ణాలలో, గ్రామీణ ప్రాంతాలలో నివ‌సిస్తున్న ప్ర‌జ‌లు దీని వ‌ల్ల అధిక ప్రయోజనాన్ని పొందుతారు.  తీవ్ర అనారోగ్యాల విష‌యంలో పేద, దిగువ మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌కు గ‌రిష్ఠంగా 5 ల‌క్షల రూపాయల వ‌ర‌కు ఉచిత వైద్య చికిత్స‌లను అందించే దిశ‌గా కూడా కృషి జ‌రుగుతోంది.  ఈ విషయమై ప్రైవేటు ఆస్ప‌త్రుల‌తో చ‌ర్చిస్తున్నాము.  విశాల దృక్ప‌థంతో చెప్పాలంటే ఇందుకు సంబంధించిన భిన్న అంశాల‌పై దీనితో సంబంధం ఉన్న ప‌లు వ‌ర్గాలు అంగీకారానికి వ‌చ్చాయి.  త్వ‌ర‌లోనే ప్ర‌భుత్వం ప్ర‌పంచంలోకెల్లా అతి పెద్ద‌దైన ఆరోగ్య బీమా ప‌థ‌కంతో మీ ముందుకు రానుంది.

మిత్రులారా,
 
ఈ ప‌థ‌కం పేద‌ల‌కు జీవితం ప్ర‌సాదించ‌డ‌మే కాదు, వైద్య రంగం లోని వారికి మున్నెన్న‌డూ క‌ని విని ఎరుగ‌ని అవ‌కాశాలను అందుబాటు లోకి తీసుకురావ‌డం ద్వారా ఒక కొత్త విప్ల‌వాన్ని సృష్టిస్తోంది.  ఈ ప‌థ‌కం స్ఫూర్తి తో గ్రామాలు, చిన్న ప‌ట్ట‌ణాల చుట్టుప‌క్కల ఉన్న ఆస్ప‌త్రులు భ‌విష్య‌త్తు లో విశాల‌మైన నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేసుకుంటాయి.  వైద్య ఖ‌ర్చుల భారం రోగులు కాకుండా మ‌రొక‌రు భ‌రించేందుకు సిద్ధంగా ఉన్నారంటే రోగులు త‌ప్ప‌కుండా చికిత్సల కోసం ఆసుపత్రుల‌కు రావ‌డం, కొత్త ఆసుపత్రులు విశాల‌మైన నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేసుకోవ‌డం స‌హ‌జ‌మే.  గ‌తం లో అనారోగ్యంతో ఉన్న వారు ఆసుపత్రుల‌ను సంద‌ర్శించే వారు కాదు.  అలాగే తమ ఫీజుకు హామీ ఉంటుంది గ‌నుక ఆస్ప‌త్రులు, వైద్యులు కూడా సేవ‌లు అందించేందుకు ముందుకు వ‌స్తారు.  ఒక‌ ర‌కంగా మ‌నం మానవ వ‌న‌రుల అభివృద్ధి, వైద్య చికిత్సల రంగం, మౌలిక వ‌స‌తుల అభివృద్ధి, ఆరోగ్యం ప‌ట్ల చైత‌న్య‌వంత‌మైన స‌మాజం దిశ‌గా ఒక కొత్త శ‌కం లోకి అడుగు పెడుతున్నాము.  ఈ రంగంలో ఉపాధి అవ‌కాశాలు త‌ప్ప‌నిస‌రిగా పెరుగుతాయి.  చాలా మంది ఒక వైద్యునితో క‌లసి ప‌ని చేయ‌డం మ‌నం చూస్తూనే ఉన్నాము.  ఆ ర‌కంగా చాలా మందికి ఉపాధి అవ‌కాశాలు ల‌భిస్తాయి. అంతే కాదు, పెద్ద న‌గ‌రాలలో ఆధునిక వైద్య సేవ‌లను విస్త‌రించవలసిన శ్రమ కూడా త‌ప్పుతుంది.  ప్ర‌జ‌లు వారి ఇళ్ల‌ కు చేరువ‌ లోనే ఈ కేంద్రాల నుండి వైద్య సేవ‌లను అందుకోగ‌లుగుతారు.  

మిత్రులారా,

నాలుగు సంవ‌త్స‌రాల‌లో సామాన్య మానవుడు తక్కువ ఖర్చు అయ్యే ఆరోగ్య సంరక్షణ ప‌థ‌కాల ద్వారా ఏ మేర‌కు ప్ర‌యోజ‌నం పొందిందీ తెలుసుకోవడానికి దేశ‌వ్యాప్త ల‌బ్దిదారుల‌తో ఈ నెల మొదట్లో నేను మాట్లాడాను.  3 ల‌క్ష‌ల కేంద్రాల‌ నుండి సుమారు 30-40 ల‌క్ష‌ల మంది నాతో సంభాషించివుంటారనేది నా అంచనా.  వారితో మాట్లాడిన‌ త‌రువాత స్ప‌ష్ట‌ం అయిన సంగతి ఏమిటి అంటే పేద ప్ర‌జ‌లు, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారి యొక్క వైద్య బిల్లులు గ‌ణ‌నీయంగా త‌గ్గాయి అని.  మిత్రులారా, ఇందుకు కార‌ణాలు మీకు బాగా తెలుసు.  సుమారు 1100 అత్య‌వ‌స‌ర మందులను ప్ర‌భుత్వం ధ‌ర‌ల నియంత్ర‌ణ వ్య‌వ‌స్థ కిందకు తీసుకువచ్చింది.  ఇది ఆయా కుటుంబాలు మందుల‌పై పెట్టే ఖ‌ర్చును 10 వేల కోట్ల రూపాయ‌ల‌ వ‌ర‌కు త‌గ్గించింది.  ఒక సంవ‌త్స‌ర కాలంలో 10 వేల కోట్ల రూపాయ‌లకు పైగా ఖ‌ర్చు ను ఆదా చేసింది ఈ పథకం.  దేశ‌ వ్యాప్తంగా 3600 సార్వజనిక వైద్య కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డమైంది.  ఈ కేంద్రాల‌లో 700కు పైగా మందులు, శస్త్ర చికిత్స కు ఉప‌యోగించే 150 కి పైగా ఉప‌క‌ర‌ణాలు త‌క్కువ ధ‌ర‌ కు అందుబాటులోకి వ‌చ్చాయి.  సుమారు  70-80 ల‌క్ష‌ల మంది రోగులు అమృత్ స్టోర్ ల ద్వారా 50 శాతం త‌క్కువ ధ‌ర‌కు మందులను పొందే ప్ర‌యోజ‌నాన్ని అందుకున్నారు.  దీనికి తోడు స్టెంట్‌ల ధరలను, కీళ్ల మార్పిడి కి ఉప‌యోగించే ఉప‌క‌రణాల ధ‌ర‌లను త‌గ్గించ‌డం వ‌ల్ల దేశం లోని పేదలు, మ‌ధ్య త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు  సుమారు 5,500 కోట్ల రూపాయ‌లను ఆదా చేసుకోగ‌లిగారు.  వాటి ధ‌ర‌లను మూడింట ఒకటో వంతు కు త‌గ్గించ‌డం జ‌రిగింది.  అంతేకాదు జిఎస్‌టి అమ‌లు లోకి వ‌చ్చిన అనంతరం అనేక మందుల ధ‌ర‌లు త‌గ్గాయి.  దీనివ‌ల్ల ప్ర‌జ‌లు ఎంత‌గానో లాభ‌పడ్డారు.  దేశం లోని ప్ర‌తి  జిల్లాలో డ‌యాలిసిస్ కేంద్రాలను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.  ఈ కేంద్రాల‌లో పేద‌ల‌కు ఉచితంగా డ‌యాలిసిస్ సౌక‌ర్యం అందుబాటు లోకి వ‌చ్చింది.  ఇప్ప‌టి వ‌ర‌కు 2.5 ల‌క్ష‌ల మంది రోగులు దీనివ‌ల్ల ప్ర‌యోజ‌నాన్ని పొందారు.  ఇంత‌కు ముందు ఉచిత డ‌యాలిసిస్ కోసం పేద‌లు వంద లేదా రెండు వందల కిలోమీట‌ర్ల దూరం ప్ర‌యాణించవలసి వ‌చ్చేది.  ఇప్పుడు ఈ స‌దుపాయాన్ని వారు వారి స్వంత జిల్లా లోనే పొంద‌గ‌లుగుతున్నారు.  ఎంతో దూరం ప్ర‌యాణించి డ‌యాలిసిస్ చేయించుకోవ‌డం ఇబ్బందిక‌రం కనుక వారు పెద్ద మొత్తం ఖ‌ర్చు చేసి త‌మ‌కు దగ్గ‌ర‌ లో ఉన్న ఆస్ప‌త్రుల‌లో డ‌యాలిసిస్ చేయించుకోవ‌డానికి ముందుకు వ‌చ్చే వారు.  కానీ ఇప్పుడు స్వంత జిల్లా లోనే అందుబాటు లోకి వ‌చ్చిన డ‌యాలిసిస్ కేంద్రాల‌ వ‌ల్ల వారు 1500 రూపాయల నుండి 2000 రూపాయల వ‌ర‌కు ఆదా చేసుకోగ‌లుగుతున్నారు.  ఈ ప‌థ‌కం లో భాగంగా ఇప్ప‌టివ‌ర‌కు 25 ల‌క్ష‌ల ఉచిత డ‌యాలిసిస్ సెష‌న్ లు పూర్తి చేయ‌డం జ‌రిగింది.  దీనికి తోడు యోగా, వ్యాధులు ద‌రి చేర‌కుండా చూసే ఆరోగ్య‌ ర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ‌గా త‌న ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది. ఇదివరకు యోగుల‌ను చూసి ప్ర‌జ‌లు ఎగతాళి చేసే వారు.  కానీ ఇప్పుడు యోగా ప్ర‌పంచ‌వ్యాప్తంగా త‌నదైన‌ ప్ర‌త్యేక‌త‌ను చాటుకుంటోంది.  యోగా భోగప్రియుడిని యోగి లాగా మారుస్తుంద‌ని నేను వాదించలేను కానీ, అది త‌ప్ప‌క అత‌డిని అనారోగ్యం బారిన ప‌డ‌కుండా కాపాడగ‌ల‌దు.  ప్ర‌స్తుతం  యోగా అనేది ప్ర‌పంచంలో ఒక ప్ర‌జా ఉద్య‌మంగా మారింది.  కొద్దిరోజుల క్రితం అంత‌ర్జాతీయ యోగా దినోత్స‌వాన్ని జ‌రుపుకోవ‌డం మనం చూశాము.  ఎఐఐఎంఎస్ లోనూ యోగా పైన ఎంతో అవ‌గాహ‌న ఉంద‌న్న విష‌యాన్ని నేను ఇదివ‌ర‌కే ప్ర‌స్తావించాను.  నా వైద్య మిత్రులంతా యోగా  చేస్తున్నారు.  ఇది నాకు ఎంతో సంతోషం క‌లిగించింది.

మిత్రులారా,

ప్ర‌తి పౌరుడికి ఆరోగ్య‌సేవ‌లను అందించాల‌న్న‌ది ప్ర‌భుత్వం యొక్క ల‌క్ష్యం.  కానీ వైద్య‌ రంగం లోని మీ అంద‌రి స‌హ‌కారం, మ‌ద్ద‌తు లేకుండా ఇది సాధ్యం కాదు.  దేశం న్యూ ఇండియా దిశ‌ గా పురోగ‌మిస్తున్న విధంగానే ఆరోగ్య రంగంతో  సంబంధం ఉన్న ప్ర‌జ‌లు కూడా కొన్ని సంక‌ల్పాలు చెప్పుకోవ‌ల‌సి ఉంది.  నేను వైద్యుడినో లేదా వైద్య వృత్తి లోని వ్య‌క్తి నో అయివుంటే 2022 కల్లా, అంటే దేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవ‌త్స‌రాలు అయ్యే నాటికి, వాటిని సాధించే విధంగా ల‌క్ష్యాల‌ను నిర్ణ‌యించుకోవాలి.  ఇలాంటి వాతావ‌ర‌ణాన్ని దేశంలో నెల‌కొల్పాలి.  2025 కల్లా దేశాన్ని క్షయ వ్యాధి ర‌హిత దేశంగా చేసేందుకు ప్ర‌భుత్వం కృషి చేస్తోంది.  టిబి పేషెంట్ ల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని వారికి నెల‌కు 500 రూపాయ‌లు స‌హాయం అందించ‌డం జ‌రుగుతోంది.

మిత్రులారా, 

ఇత‌ర దేశాలు త‌మ దేశాల‌ను టిబి ర‌హిత దేశాలుగా మార్చేందుకు 2030 వ సంవత్సరాన్ని గ‌డువుగా నిర్ణ‌యించుకున్నాయి.  మ‌నం మ‌న సంక‌ల్పాల‌ను వీలైనంత త్వ‌ర‌గా పూర్తి చేయాలి.  ప్ర‌పంచం 2030 వ సంవత్సరానికల్లా టిబి నుండి విముక్తం కావాల‌నుకుంటే, మ‌నం ఈ ల‌క్ష్యాన్ని 2025 వ సంవత్సరం నాటికే సాధించాల‌ని అనుకుంటున్నాము.  భారతదేశం ఈ ల‌క్ష్యాన్ని సాధిస్తుందా లేదా అని ప్ర‌పంచం మొత్తం మ‌న‌ వైపు ఆస‌క్తిగా చూస్తోంది.  నాకు ఈ దేశ వైద్య‌ రంగంపైన సంపూర్ణమైన విశ్వాసం ఉంది.  ఈ రంగం పూర్తి సంక‌ల్ప నిష్ఠ‌ తో ఈ స‌వాలును ఎదుర్కొంటుంద‌ని, దేశానికి పేరును తీసుకువస్తుంద‌ని నేను భావిస్తున్నాను.  ఈ నేప‌థ్యంలో బాలింత మ‌ర‌ణాల రేటు, శిశు మ‌ర‌ణాల రేటు కూడా ముఖ్య‌మైంది.  నేను ఇంత‌కు ముందే చెప్పిన‌ట్టుగా గ‌త నాలుగు సంవ‌త్స‌రాల‌లో దేశంలో ప్ర‌సూతి మ‌ర‌ణాల రేటును, శిశు మ‌ర‌ణాల రేటును త‌గ్గించే విష‌యంలో గ‌ణ‌నీయ‌మైన ప్ర‌గ‌తి ని సాధించాము.  ఈ దిశ‌గా మనం మరింత కృషి చేయ‌వ‌ల‌సి ఉంది.  ప్ర‌ధాన‌ మంత్రి సుర‌క్షిత మాతృత్వ అభియాన్‌, ప్ర‌ధాన‌ మంత్రి మాతృ వంద‌న యోజ‌న‌, జాతీయ పౌష్టికాహార ప‌థ‌కం ల యొక్క నిర్దేశిత ల‌క్ష్యాల‌ను సాధించేందుకు కార్యక్ర‌మాలు చురుకుగా సాగుతున్నాయి.  ఈ ల‌క్ష్యాల‌ను జీవిత ల‌క్ష్యాలుగా చేసుకొని మ‌నం ప‌నులు సాగించాలి.  ఈ కార్య‌క్ర‌మాల ద్వారా నిర్దేశిత ఫ‌లితాలను సాధించుకోవడానికి ఒక ప్ర‌జా ఉద్య‌మంలా ప్ర‌జ‌ల‌ను గ‌రిష్ఠ‌ స్థాయిలో భాగ‌స్వాముల‌ను చేయాలి.  ఈ విశ్వాసంతో ముందుకు సాగాలి.

మిత్రులారా, 

నిజాయితీ తోను, పార‌ద‌ర్శ‌క‌త్వంతోను కూడినటువంటి వాతావ‌ర‌ణం కార‌ణంగా దేశ నిర్మాణం కోసం త‌మ వంతు స‌హ‌కారాన్ని అందించ‌డానికి ఎంతో మంది ముందుకు వ‌స్తున్నారు.  పన్నులుగా తాము చెల్లించే ప్ర‌తి పైసా దేశ సంక్షేమం కోసం ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని వారు విశ్వ‌సిస్తున్నారు.  ఈ విశ్వాసానికి సంబంధించిన ఫ‌లితాల‌ను మ‌నం స‌మాజం లోని ప్ర‌తి స్థాయిలో చూడ‌గ‌లుగుతున్నాము.  మీకు గుర్తుండే వుంటుంది, గ్యాస్ స‌బ్సిడీ ని  వ‌దులుకోగ‌లిగిన శ‌క్తి క‌లిగిన వారు మీలో ఎవ‌రైనా ఉంటే వ‌దులుకోండ‌ని నేను ఎర్ర‌ కోట‌ నుండి ప్ర‌జ‌ల‌కు పిలుపునిచ్చాను.  ఆ పిలుపున‌కు ఎంత గొప్ప స్పంద‌న వ‌చ్చిందంటే, ఒక కోటి ఇరవై అయిదు ల‌క్ష‌ల కుటుంబాలు గ్యాస్ స‌బ్సిడీ ని వ‌దులుకున్నాయి.  లేకుంటే మ‌న దేశంలో  ప్ర‌జ‌లు ఏదీ వ‌దులుకోవ‌డానికి  పెద్ద‌గా ఆస‌క్తి చూప‌రు.  ఇది స‌హ‌జ‌సిద్ధ‌మైన స్వ‌భావం.  మీరు విమానంలో ప్ర‌యాణిస్తున్నారని అనుకుందాం.  మీ ప‌క్క‌ సీటు ఖాళీగా ఉంది.  విమానం బ‌య‌లుదేర‌డానికి సిద్దంగా ఉంది.  అయినా ప‌క్క‌సీటు వారు ఎవ‌రూ రాలేద‌ని అనుకోండి, అప్పుడు మీరు మీ మొబైల్ ఫోన్‌, లేదా మీ పుస్త‌కం  ఇలా ఏదో ఒక మీ వ‌స్తువును ఆ ప‌క్క సీటులో ఉంచడానికి ప్ర‌య‌త్నిస్తారు.  నిజానికి ఆ సీటు మీది కాక‌పోయినా ఈ ప‌ని చేస్తారు.  ఒక వేళ ఎవ‌రైనా ప్ర‌యాణికుడు వ‌చ్చి కూర్చోడానికి ప్రయ‌త్నిస్తే మీ సీటును కోల్పోయిన‌ట్టు బాధ‌ప‌డ‌తారు.  ప‌క్క‌ వాళ్ల సీటు ను వ‌దులుకోవ‌డం మీకు ఇష్ట‌ం ఉండ‌దు.  ఇటువంటి స్వ‌భావం క‌లిగిన వారు 25 కోట్ల కుటుంబాల వారు ఉన్నారు.  వారిలో ఒక కోటి ఇరవై అయిదు ల‌క్ష‌ల కుటుంబాలు నేను ఇచ్చిన పిలుపునకు బదులుగా గ్యాస్ స‌బ్సిడీని వదులుకున్నాయి.  దీనిని బ‌ట్టి మ‌న దేశ బ‌లాన్ని  మాన‌సిక స్థితి ని అంచ‌నా వేయ‌వ‌చ్చు.  నేను మ‌రో విష‌యాన్ని కూడా మీతో పంచుకోవాల‌ని అనుకుంటున్నాను.  సీనియ‌ర్ సిటిజ‌న్ లు ప్ర‌యాణ టికెట్ల‌పై రాయితీ ని పొందుతుంటారు.  కొద్ది రోజుల కిందట ఇందుకు సంబంధించి నేను ఒక ప్ర‌క‌ట‌న చేద్దామ‌నుకున్నాను.  అయితే ఇంత‌లో రైల్వే అధికారులు ‘‘ సీనియ‌ర్ సిటిజ‌న్ లు ఎవ‌రైనా రాయితీ ని వ‌దులుకోవ‌డానికి సంసిద్ధ‌త తెల‌పాల‌నుకుంటే’’ అలా చేయడానికి అనువుగా రైల్వే రిజ‌ర్వేష‌న్ దర‌ఖాస్తు లో కొన్ని మాటలను చేర్చారు.  ఈ మాటలను రైల్వే రిజ‌ర్వేష‌న్ ఫారం లో చేర్చ‌డం ద్వారా గ‌త 8-9 నెల‌ల్లో 42 ల‌క్ష‌ల మంది సీనియ‌ర్ సిటిజ‌న్ లు ప్ర‌యాణ స‌మయంలో వారి యొక్క స‌బ్సిడీని వ‌దులుకున్నార‌న్న విష‌యం తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు.

ఇది మ‌న దేశ బ‌లం.  ఇది మ‌న దేశంలో ఉన్న స్థితి.  నేను ఒక‌సారి మ‌న దేశం లోని వైద్యుల‌కు ఒక పిలుపును ఇస్తూ, ప్ర‌తి నెలా 9 వ తేదీన గ‌ర్భిణుల‌కు ప‌రీక్ష‌లను నిర్వ‌హించి వారికి త‌గిన సూచ‌న‌లను ఇచ్చేందుకు ముందుకు రావ‌ల‌సిందిగా కోరాను.  దీనికి స్పందించి వేలాది వైద్యులు వారి సేవ‌లను అందించేందుకు ముందుకు రావ‌డం ఎంతో సంతోషం క‌లిగించే విష‌యం.  పేద గ‌ర్భిణుల‌కు ప్ర‌తి నెలా 9 వ‌తేదీన ఉచిత సేవ‌లను అందిస్తామ‌ని ఎంతో మంది త‌మ ఆస్ప‌త్రుల వెలుప‌ల బోర్డులు పెట్టారు.  ఇందువ‌ల్ల కోట్లాది సోద‌రీమ‌ణులు ల‌బ్ధి పొందారు.  నా వైద్య మిత్రులు మ‌రింత‌ మంది ఒక్క‌టిగా ముందుకు వ‌చ్చి దేశం ముందున్న స‌వాళ్ల‌ను ఎదుర్కోవ‌డానికి దేశాన్ని రెండు అడుగులు ముందుకు తీసుకుపోవ‌డానికి సిద్దం కావ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైనా ఉంది.  ప్ర‌ధాన‌మంత్రి సుర‌క్షిత మాతృత్వ అభియాన్ లో భాగంగా ఒక కోటీ ఇర‌వై ఐదు ల‌క్ష‌ల మంది గ‌ర్భిణుల‌కు వైద్య‌సేవ‌లను అందించ‌డం జరిగింది.  ఈ దిశ‌గా వైద్య రంగం లోని వారు, వైద్యులు అందించిన స‌హ‌కారానికి నా కృత‌జ్ఞ‌త‌లు.  దీనిని మ‌రింత ముందుకు తీసుకుపోవాల‌ని నేను కోరుకుంటున్నాను.

గ్రామ‌ స్వ‌రాజ్య అభియాన్‌ లో ఇందుకు సంబంధించిన సేవాశ‌క్తి ప్ర‌స్తావ‌న చేయ‌డం జ‌రిగింది.  మేము ఇందుకు ఒక కార్య‌క్ర‌మాన్ని ఏర్పాటు చేశాము.  కొన్ని విష‌యాలను మ‌న టివి ఛాన‌ళ్లు చూప‌వు.  ప‌త్రిక‌ల‌లో వార్త‌లు రావు.  మేము గ్రామ‌ స్వ‌రాజ్ అభియాన్ ను నిర్వ‌హించాము.  కొన్ని ప్ర‌మాణాల‌ను ప్రాతిప‌దిక‌గా తీసుకొని 17 గ్రామాల‌ను ఎంపిక చేసి, వాటికి 7 ల‌క్ష్యాల‌ను కేటాయించాము.  ఈ గ్రామాలు ఈ 7 ల‌క్ష్యాల‌ను నూరు శాతం పూర్తిగా సాధించాలి.  అందులో ఒక‌టి టీకాలు వేయించే కార్య‌క్ర‌మం.  అంటే దేశంలో టీకా కార్యక్ర‌మం స్థాయి పెంచేందుకు వివిధ రంగాల‌కు చెందిన ప్ర‌జ‌ల‌ను దీనితో అనుసంధానం చేయ‌డం జ‌రుగుతోంది.  ఇది ఎంతో మెచ్చుకోద‌గింది.  మీ స‌హ‌కారం కార‌ణంగానే వాక్సినేశన్ రేటు 6 శాతం పెరిగింది.  6 శాతం అనేది త‌క్కువ‌గా క‌నిపించ‌వ‌చ్చు కానీ, ఇంత‌కు ముందు ఇది ప‌ట్టుమ‌ని ఒక్క‌శాతం కూడా లేదు.  మా చిత్త‌శుద్ధి కార‌ణంగా దేశం వంద శాతం ఇమ్యునైజేశన్ ను సాధించే దిశ‌గా మ‌రింత ముందుకు సాగిపోతోంది.  

ఆరోగ్యవంత‌మైన కుటుంబాల‌తో న్యూ ఇండియా ను నిర్మించాల‌న్న ల‌క్ష్య సాధ‌న‌ లో దేశం లోని ప్ర‌తి గ‌ర్భిణి, ప్ర‌తి శిశువుకు టీకా మందు ను ఇప్పించాల‌న్న సంకల్పం కీల‌క పాత్ర పోషించ‌నుంది.

మిత్రులారా,

ఆరోగ్వవంత‌మైన కుటుంబం వ‌ల్ల ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం, ఆరోగ్య‌వంత‌మైన స‌మాజం వ‌ల్ల ఆరోగ్య‌వంత‌మైన దేశం ఏర్ప‌డ‌తాయి.  మ‌న‌మంద‌రం, ప్ర‌త్యేకించి మీరు ఈ దేశాన్ని ఆరోగ్య‌వంతంగా ఉంచ‌డంలో కీల‌క‌ పాత్ర వ‌హిస్తారు.  అందుకే దేశ నిర్మాణం లో మీరు కీల‌క‌ పాత్ర ను చేప‌ట్టాల‌ని రాష్ట్ర‌ప‌తి పేర్కొన్నారు. రండి,  ప్ర‌భుత్వం తో పాటుగా మనం ముందుకు వ‌చ్చి 
‘సర్వేభవంతు సుఖిన: 
సర్వేసంతునిరామయ:
సర్వేభద్రాణిపశ్యంతు
మాకశ్చిత్ దు:ఖభాగ్భవేత్’
అనే సంకల్పాన్ని సాధించుకొనేందుకు కదులుదాము.  ఈ ప్రపంచాన్ని, ఇందులోని ప్రజలను వ్యాధిరహితంగా చేసి, ఒక ‘న్యూ ఇండియా’ను నిర్మించే దిశ‌గా ముందుకు సాగుదాము.  ఢిల్లీ ప్ర‌జ‌ల‌కు, దేశ ప్ర‌జ‌ల‌కు అన్నిరకాల స‌దుపాయాలను క‌ల్పించినందుకు ఈ విభాగాన్ని నేను అభినందిస్తున్నాను.  నిర్ణీత కాల‌ వ్య‌వ‌ధిలో వారి యొక్క ల‌క్ష్యాల‌ను పూర్తి చేయ‌డానికి వారు వారి వంతు కృషి చేశారు.  పూర్తి చేయ‌గ‌లిగిన ప‌నినే ప్రారంభించవలసిందిగా నేను వారిని కోరాను.  ఒక‌ప్పుడు ఎలాంటి ప‌రిస్థితులు ఉండేవంటే, ప‌విత్ర‌మైన పార్ల‌మెంటు వేదిక‌గా చేసిన హామీల‌కూ దిక్కు ఉండేది కాదు.  రైల్వే బ‌డ్జెటు స‌మ‌యం లో ఇలాంటివి చూసే వాళ్లము.  30,40,50 సంవ‌త్స‌రాల‌లో రైల్వే రంగంలో కేవ‌లం ప్ర‌క‌ట‌న‌ల‌కే ప‌రిమిత‌మైన 1500 వ‌ర‌కు అంశాలను రైల్వే బ‌డ్జెటులో నేను గుర్తించ‌గ‌లిగాను.  నేను వాటిని గురించి ప్ర‌శ్నిస్తే అవి క‌నీసం కాగితం మీద కూడా క‌నిపించ‌లేదు.  ఇక వాటిని అమ‌లుచేసేదెక్క‌డ‌ ?  మేము మా మార్గం నుండి ప‌క్క‌కు పోద‌ల‌చుకోలేదు.  మేము సాధించిన వాటి గురించి చెప్పుకోవ‌డానికి మేము ఇక్క‌డకు రాలేదు.  దేశంలో గ‌ణ‌నీయ‌మైన మార్పును తీసుకురావ‌డానికి మేము చెప్పుకొన్న సంక‌ల్పాన్ని నెర‌వేర్చేందుకు, అలాగే మీ స‌హ‌కారాన్ని కోరేందుకు వ‌చ్చాము.  దేశ ప్ర‌జ‌ల ఆశ‌లు ఆకాంక్ష‌లను నెర‌వేర్చేందుకు మేము మీ స‌హ‌కారంతో మా ప్ర‌యాణాన్ని ప్రారంభించాము.  మిత్రులారా, మీరు మాకు స‌హ‌క‌రిస్తార‌ని నేను నమ్ముతున్నాను.

అనేకానేక ధ‌న్య‌వాదాలు.

**