Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఎఫ్ఐసిసిఐ 90వ వార్షిక సాధార‌ణ స‌మావేశం ప్రారంభ స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు ఎఫ్ఐసిసిఐ 90వ వార్షిక సాధార‌ణ స‌మావేశం తాలూకు ప్రారంభ స‌భ‌ను ఉద్దేశించి ప్ర‌సంగించారు.

1927వ సంవ‌త్స‌రంలో ఎఫ్ఐసిసిఐ ని స్థాపించిన‌ప్ప‌టి కాలంలో భార‌తీయ పారిశ్రామిక రంగం అప్ప‌టి బ్రిటిషు ప్ర‌భుత్వం నియ‌మించిన సైమ‌న్ క‌మిష‌న్ కు వ్య‌తిరేకంగా ఒక్క‌టైన‌ట్లు ఆయ‌న ఈ సంద‌ర్భంగా గుర్తు చేశారు. ఆ కాలంలో దేశ హితాన్ని భార‌తీయ పారిశ్రామిక రంగం దృష్టిలో పెట్టుకొని, భార‌తీయ స‌మాజం లోని అన్ని ఇత‌ర వ‌ర్గాల‌ను ఒక ద‌గ్గ‌ర‌కు చేర్చిన‌ట్లు ఆయ‌న చెప్పారు.

దేశానికి సంబంధించినంత వ‌ర‌కు త‌మ బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చ‌డం కోసం దేశ ప్ర‌జ‌లు ముందుకు వ‌స్తున్న ప్ర‌స్తుత త‌రుణంలో కూడా ఈ విధ‌మైన వాతావ‌ర‌ణమే నెల‌కొంద‌ని ప్ర‌ధాన మంత్రి పేర్కొన్నారు. అవినీతి మ‌రియు న‌ల్ల‌ధ‌నం వంటి అంత‌ర్గ‌త స‌మ‌స్య‌ల బారి నుండి దేశాన్ని కాపాడాల‌న్న‌దే ప్ర‌జ‌ల ఆశ మ‌రియు ఆకాంక్ష అని ఆయ‌న చెప్పారు. రాజ‌కీయ ప‌క్షాలు, ప‌రిశ్ర‌మ‌కు చెందిన మండ‌లులు దేశ అవ‌స‌రాల‌ను మ‌రియు ప్ర‌జ‌ల భావ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకొని, త‌ద‌నుగుణంగా ప‌ని చేయాల‌ని ఆయ‌న చెప్పారు.

స్వాతంత్య్ర అనంత‌ర కాలంలో ఎంతో సాధించిన‌ప్ప‌టికీ, అనేక స‌వాళ్ళు కూడా త‌లెత్తాయ‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఒక వ్య‌వ‌స్థ ఏర్పాటైన‌ప్ప‌టికీ బ్యాంకు ఖాతాలు, గ్యాస్ క‌నెక్ష‌న్లు, ఉప‌కార వేత‌నాలు, పెన్ష‌న్ల వంటి వాటి కోసం పేద‌లు ఇప్ప‌టికీ సంఘ‌ర్ష‌ించవ‌ల‌సి వ‌స్తోంద‌ని ఆయ‌న అన్నారు. ఈ సంఘ‌ర్ష‌ణ‌ను స‌మాప్తం చేసి, ఒక సచేతనమైనటువంటి మ‌రియు పార‌ద‌ర్శ‌కమైనటువంటి వ్య‌వ‌స్థ‌ను నిర్మించ‌డం కోసం కేంద్ర ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు. ‘జ‌న్ ధ‌న్ యోజ‌న’ దీనికి ఒక ఉదాహ‌ర‌ణగా చెబుతూ, ‘‘జీవన సారళ్యాన్ని’’ పెంచ‌డం పైన కేంద్ర ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ వ‌హిస్తోంద‌ని ఆయ‌న తెలిపారు. ప్ర‌ధాన మంత్రి ఆవాస్ యోజ‌న‌, స్వ‌చ్ఛ‌భార‌త్ అభియాన్ లో భాగంగా మ‌రుగుదొడ్ల నిర్మాణం, ఉజ్జ్వ‌ల యోజ‌న ల‌ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. తాను వ‌చ్చింది పేద‌రికంలో నుండేన‌ంటూ, పేద‌ల యొక్క‌ మ‌రియు దేశం యొక్క అవ‌స‌రాల‌ను తీర్చ‌డం కోసం ప‌ని చేయ‌వ‌ల‌సి ఉంద‌ని తాను గ్ర‌హించినట్లు ఆయ‌న చెప్పుకొన్నారు. న‌వ పారిశ్రామికుల‌కు పూచీక‌త్తు లేకుండా రుణాల‌ను అందించ‌డం కోసం ప్ర‌వేశ‌పెట్టిన ‘ముద్ర యోజ‌న‌’ను కూడా ఆయ‌న త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు.

బ్యాంకింగ్ వ్య‌వ‌స్థను ప‌టిష్టప‌రచేందుకు కేంద్ర ప్ర‌భుత్వం పాటుప‌డుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఎన్‌పిఎ ల స‌మ‌స్య ప్ర‌స్తుత ప్ర‌భుత్వానికి ఒక వార‌స‌త్వంగా అందిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఫైనాన్షియ‌ల్ రెగ్యులేష‌న్ అండ్ డిపాజిట్ ఇన్శ్యూరెన్స్ (ఎఫ్ఆర్‌డిఐ) బిల్లును గురించి ప్ర‌స్తుతం వ‌దంతులను చెలామణీ లోకి తీసుకువ‌స్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఖాతాదారుల ప్ర‌యోజ‌నాల‌ను ప‌రిర‌క్షించ‌డానికి ప్ర‌భుత్వం కృషి చేస్తోంద‌ని, అయితే దీనికి పూర్తి భిన్నంగా వ‌దంతుల‌ను వ్యాప్తి లోకి తీసుకువ‌స్తున్నార‌ని ఆయ‌న అన్నారు. ఇటువంటి అంశాల‌లో చైత‌న్యాన్ని ర‌గిలించ‌వ‌ల‌సిన బాధ్య‌త ఎఫ్ఐసిసిఐ వంటి సంస్థ‌లకు ఉంద‌ని ఆయ‌న అన్నారు. అలాగే జిఎస్‌టి ని మ‌రింత స‌మ‌ర్ధంగా అమ‌ల‌య్యేట‌ట్లు చూడ‌డంలో ఎఫ్ఐసిసిఐ త‌న వంతు పాత్ర‌ను పోషించాల్సి ఉంద‌ని ఆయ‌న చెప్పారు. జిఎస్‌టి కై వ్యాపార సంస్థలు గ‌రిష్ఠ స్థాయిలో న‌మోదు అయ్యేలా చూడ‌డం కోసం ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తున్న‌ట్లు ఆయ‌న వివ‌రించారు. వ్య‌వ‌స్థ ఎంత ఎక్కువగా సాంప్ర‌దాయ‌క ప‌రిధిలోకి వ‌స్తే అంత ఎక్కువ‌గా పేద‌ల‌కు అది లాభం చేకూర్చగలుగుతుందని ఆయ‌న అన్నారు. ఇది బ్యాంకుల నుండి ప‌ర‌ప‌తి సుల‌భంగా అందుబాటులోకి వ‌చ్చేలాగా మ‌రియు లాజిస్టిక్స్ వ్య‌యం త‌గ్గే విధంగా తోడ్ప‌డుతుంద‌ని, త‌ద్వారా వ్యాపారాలలో స్ప‌ర్ధాత్మ‌క‌త ఇనుమ‌డిస్తుంద‌ని తెలిపారు. చిన్న వ్యాపార‌స్తుల‌లో పెద్ద ఎత్తున జాగృతిని రగిలించేందుకు ఎఫ్ఐసిసిఐ వ‌ద్ద ఏదైనా ప్ర‌ణాళిక ఉండాలని నేను ఆశిస్తున్నాను అని ఆయ‌న పేర్కొన్నారు. భ‌వ‌న నిర్మాత‌లు సామాన్యుడిని దోచుకోవ‌డం వంటి అంశాల‌పై అవ‌స‌ర‌మైన‌ప్పుడు ఎఫ్ఐసిసిఐ త‌న ఆందోళ‌న‌ స్వరాన్ని ఎలుగెత్తాల‌ని కూడా ఆయ‌న సూచించారు.

యూరియా, వ‌స్త్రాలు, పౌర విమాన‌యానం మ‌రియు ఆరోగ్యం వంటి రంగాల‌లో తీసుకున్న విధాన నిర్ణ‌యాల‌ను గురించి ప్ర‌ధాన మంత్రి ఏక‌రువు పెట్టి, వాటి ద్వారా సాధించిన ప్ర‌యోజ‌నాల‌ను వివ‌రించారు. ర‌క్ష‌ణ‌, నిర్మాణం, ఫూడ్- ప్రాసెసింగ్ త‌దిత‌ర రంగాల‌లో ప్ర‌వేశ‌పెట్టిన సంస్క‌ర‌ణ‌ల‌ను గురించి కూడా ఆయ‌న ప్ర‌స్తావించారు. ప్ర‌పంచ బ్యాంకు విడుద‌ల చేసే ‘‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌‘‘ స్థానాల‌లో.. ఈ చ‌ర్య‌ల‌న్నింటి ఫ‌లితంగా.. భార‌త‌దేశం యొక్క స్థానం 142 నుండి 100 కు మెరుగుప‌డిన‌ట్లు ఆయ‌న చెప్పారు. ఆర్థిక వ్య‌వ‌స్థ ఆరోగ్యంగా ఉన్న‌దని సంకేతాలను వెలువరిస్తున్నటువంటి మరికొన్ని సూచిక‌ల‌ను కూడా ఆయ‌న త‌న ప్ర‌సంగంలో ప్ర‌స్తావించారు. ప్ర‌భుత్వం చేప‌డుతున్న చ‌ర్య‌లు ఉద్యోగ క‌ల్ప‌న‌లో సైతం కీల‌క పాత్ర‌ను పోషిస్తున్న‌ట్లు ఆయ‌న చెప్పారు.

ఫూడ్- ప్రాసెసింగ్‌, స్టార్ట్- అప్ లు, ఆర్టిఫీషియ‌ల్ ఇంటెలిజెన్స్‌, సౌర‌ శ‌క్తి, ఆరోగ్య సంర‌క్ష‌ణ త‌దిత‌ర రంగాల‌లో ఎఫ్ఐసిసిఐ ఒక కీల‌క పాత్ర‌ను పోషించ‌వ‌ల‌సి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. ఎమ్ఎస్ఎమ్ఇ రంగానికి సూచ‌న‌లు స‌ల‌హాలు అందించే స‌చివుని వ‌లె ప‌ని చేయాలని ఎఫ్ఐసిసిఐ కి ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

*****