పిఎంఇండియా
ఏప్రిల్ 13, 2026న ఉదయం 11 గంటల సమయంలో న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో జాతీయ స్థాయి ‘నారీ శక్తి వందన్’ సమ్మేళనంలో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తారు.
ఈ కార్యక్రమంలో వివిధ రంగాలకు చెందిన ప్రముఖులు, ఉన్నత శిఖరాలను అధిరోహించిన మహిళలు పాల్గొంటారు. ప్రభుత్వం, విద్యారంగం, శాస్త్ర సాంకేతిక, క్రీడలు, వ్యాపార రంగం, మీడియా, సామాజిక సేవ, సాంస్కృతిక రంగాల ప్రతినిధులు ఈ సమ్మేళనానికి విచ్చేయనున్నారు.
శాసనసభల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచే దిశగా సెప్టెంబర్ 2023లో ‘నారీ శక్తి వందన్ అధినియం‘ను పార్లమెంట్ ఆమోదించి చరిత్రాత్మక ముందడుగు వేసింది. లోక్సభ, రాష్ట్ర శాసనసభల్లో మహిళలకు మూడో వంతు సీట్ల రిజర్వేషన్ను ఈ చట్టం కల్పిస్తుంది. దేశవ్యాప్తంగా మహిళా రిజర్వేషన్ల అమలుపై దృష్టి సారిస్తూ ఏప్రిల్ 16న పార్లమెంట్ సమావేశం జరగనుంది.
భారత అభివృద్ధి పథాన్ని నిర్దేశించటంలో మహిళల భాగస్వామ్యాన్ని మరింత పటిష్ఠం చేసే లక్ష్యంతో ఈ సమ్మేళనం జరుగుతుంది. పంచాయతీ నుంచి పార్లమెంటు వరకు అన్ని స్థాయుల్లో పెరుగుతున్న మహిళా నాయకత్వాన్ని ఇది తెలియజేస్తుంది. నిర్ణయాధికార ప్రక్రియల్లో మహిళల ప్రాతినిధ్యాన్ని పెంచాల్సిన ఆవశ్యకతను ఈ సమ్మేళనం స్పష్టం చేస్తుంది.
వికసిత్ భారత్-2047 లక్ష్య సాధనలో మహిళల పాత్రను ఈ సమ్మేళనం తెలియజేస్తుంది. వికసిత్ భారత్-2047 దార్శనికతలో మహిళా నేతృత్వంలోని అభివృద్ధే లక్ష్యంగా కొనసాగిస్తున్న ప్రభుత్వ నిబద్ధతకు ప్రతిబింబంగా ఈ కార్యక్రమం నిలుస్తుంది.
***