Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కాగితాల వినియోగానికి ఇక తావు ఉండని విధంగా సర్వోన్నత న్యాయస్థానంలో ‘డిజిటల్ ఫైలింగ్’ ప్రారంభమైన సందర్భంలో ఏర్పాటైన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి

కాగితాల వినియోగానికి ఇక తావు ఉండని విధంగా సర్వోన్నత న్యాయస్థానంలో ‘డిజిటల్ ఫైలింగ్’ ప్రారంభమైన సందర్భంలో ఏర్పాటైన కార్యక్రమానికి హాజరైన ప్రధాన మంత్రి


ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు సర్వోన్నత న్యాయస్థానం వెబ్ సైట్ లో ఇంటిగ్రేటెడ్ కేస్ మేనేజ్ మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ను అప్ లోడ్ చేశారు. ఇది సుప్రీం కోర్టు లో డిజిటల్ ఫైలింగ్ పద్ధతికి బాటవేస్తుంది. దీనితో కాగితం వినియోగాన్ని మానే దిశగా సర్వోన్నత న్యాయస్థానం ఒక ముందడుగును వేసినట్లయింది.

భారతదేశ ప్రధాన న్యాయమూర్తి శ్రీ జస్టిస్ జె. ఎస్. ఖేహర్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఈ సంవత్సరం ఏప్రిల్ 2వ తేదీన జరిగిన అలహాబాద్ హై కోర్టు నూట యాభై సంవత్సరాల ఉత్సవాలను గుర్తుకు తెచ్చుకొన్నారు. ఆ రోజున ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ మాట్లాడుతూ, న్యాయస్థానాల్లో పనులను సులభతరం చేసేందుకుగాను సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశపెట్టాలని నొక్కిచెప్పారని శ్రీ ఖేహర్ అన్నారు. డిజిటిల్ ఫైలింగ్ దరఖాస్తు ప్రయోజనాలను గురించి భారతదేశ ప్రధాన న్యాయమూర్తి వివరిస్తూ, ఈ తరహా సేవ ద్వారా న్యాయ వ్యవస్థలో సాంకేతిక విజ్ఞానాన్ని ప్రవేశపెట్టే దిశగా ఒక పెద్ద అడుగు వేసినట్లు అయిందని పేర్కొన్నారు.

ఈ తరహా సేవను గురించి శ్రీ జస్టిస్ ఖాన్ విల్కర్ వివరణ ఇస్తూ ‘సబ్ కా సాథ్, సబ్ కా వికాస్’ కు ఈ కొత్త చర్య ఒక దృశ్య రూపమని అభివర్ణించారు.

కేంద్ర చట్ట & న్యాయ శాఖ మంత్రి శ్రీ రవి శంకర్ ప్రసాద్ సర్వోన్నత న్యాయ స్థానం డిజిటల్ నవకల్పన వైపు మళ్లడం ప్రశంసనీయమన్నారు.

ఈ సందర్భంగా ప్రధాన మంత్రి మాట్లాడుతూ ఆహ్వానితులకు బుద్ధ పూర్ణిమ అభినందనలు తెలిపారు. ఈ రోజున, అంటే మే నెల 10వ తేదీ 1857వ సంవత్సరంలో ఒకటో స్వాతంత్ర్య సంగ్రామం మొదలైందని ఆయన శ్రోతలతో అన్నారు.

భారతదేశ ప్రధాన న్యాయమూర్తి ఏప్రిల్ 2వ తేదీన అలహాబాద్ లో మాట్లాడుతూ, సెలవు రోజుల్లో కనీసం కొన్ని రోజులలోనైనా ఉన్నత స్థాయి న్యాయాధికారులు కేసుల విచారణను చేపట్టాలంటూ విజ్ఞప్తి చేసిన సంగతిని ప్రధాన మంత్రి జ్ఞాపకానికి తెచ్చుకున్నారు. ఆ విజ్ఞప్తి ప్రేరణనిచ్చేదిగా ఉందని, ఈ విషయంలో సర్వోన్నత న్యాయస్థానం నుండి, ఉన్నత న్యాయస్థానాల నుండి చాలా ప్రోత్సాహకరమైనటువంటి కబుర్లు తన దగ్గరకు వచ్చాయని ప్రధాన మంత్రి చెప్పారు. ఈ విధమైన స్ఫూర్తి ఒక సానుకూలమైనటువంటి మార్పును, ఒక బాధ్యతను కూడా వెంటబెట్టుకు తీసుకువచ్చినట్లు ఆయన చెప్పారు. ఇది సామాన్య ప్రజలలో విశ్వాసాన్ని రగుల్కొలుపుతుందని, ‘న్యూ ఇండియా’కు ఇటువంటి విశ్వాస భావన కీలకమని ఆయన అన్నారు.

సాంకేతిక పరిజ్ఞానాన్ని ఇదివరలో తరచుగా హార్డ్ వేర్ తో సమానమైందిగా ఎంచే వారని, ఈ కారణంగా ప్రజల ఆలోచనా విధానంలో ఒక మార్పును తీసుకురావడం చాలా ముఖ్యమని ప్రధాన మంత్రి అన్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఒక సంస్థలో ఉమ్మడిగా మాత్రమే అనుసరించవచ్చునని ఆయన చెప్పారు. కాగిత రహిత కార్యక్రమాలు పర్యావరణాన్ని పరిరక్షిస్తాయని, ఈ కారణంగా ఇటువంటి చొరవలు భవిష్యత్ తరాల కోసం అందించే ఒక గొప్ప సేవ అని అనిపించుకొంటాయని ఆయన చెప్పారు.

సాంకేతిక విజ్ఞానం ప్రయోజనాలను గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఇటీవల నిర్వహించిన ‘‘హాకథాన్’’ ను గురించి ప్రస్తావించారు. హాకథాన్ లో భారత ప్రభుత్వంలోని వివిధ మంత్రిత్వ శాఖల పరిధిలో 400 సమస్యలను గుర్తించడం జరిగింది. వాటిని పరిష్కరించడం కోసం భారతదేశ విశ్వవిద్యాలయాల నుండి 42,000 మంది విద్యార్థులు 36 గంటలు వెచ్చించారని వెల్లడించారు. ఈ కసరత్తు యొక్క ఫలితాలలో చాలా వాటిని ఆయా మంత్రిత్వ శాఖలు స్వీకరించి అమలు పరుస్తున్నాయని ఆయన అన్నారు.

‘సమాచార సాంకేతిక విజ్ఞానం’ మరియు ‘‘భారతీయ ప్రతిభ’’.. ఈ రెండూ కలిసి ‘రేపటి భారతాన్ని” సృష్టించగలవన్న విశ్వాసాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు.

సాంకేతిక విజ్ఞానం ఇతివృత్తం గురించి ఆయన మరింత వివరంగా చెప్పుకొస్తూ, ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్ తీసుకువచ్చే చిక్కులను, అవకాశాలను గురించి తెలియజేశారు.

ఇటీవలి కాలంలో పేద ప్రజలను ఆదుకోవడానికి వివిధ రంగాలకు చెందిన వ్యక్తులు ముందుకు వచ్చిన పలు సందర్భాలను ప్రధాన మంత్రి ఏకరువు పెట్టారు. ఈ సందర్భంగా ఎల్ పిజి సబ్సిడీని వదులుకోవాలని కోరుతూ ‘‘గివ్ ఇట్ అప్’’ పేరుతో చేపట్టిన ఉద్యమం విజయవంతం కావడాన్ని ఆయన గుర్తు చేశారు. అదే విధంగా, పేద గర్భిణీలకు ప్రతి నెలా 9వ తేదీన ఉచితంగా వైద్యసహాయం అందించడానికి దేశ వ్యాప్తంగా వైద్యులు చేపట్టిన కార్యక్రమాన్ని కూడా గుర్తుచేశారు. అదే రీతిలో పేదలకు, అవసరం ఉన్న వారికి ఎలాంటి ఖర్చు లేకుండా న్యాయ సహాయాన్ని అందించడానికి ముందుకు రావలసిందిగా న్యాయవాదులకు ప్రధాన మంత్రి విజ్ఞప్తి చేశారు.

శ్రీ జస్టిస్ దీపక్ మిశ్రా, శ్రీ జస్టిస్ జె. చెలమేశ్వర్ లు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.