Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

కృషి ఉన్నతి మేళా లో ప్రసంగించిన ప్రధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు న్యూ ఢిల్లీ లో పూసా కేంపస్ యొక్క ఐఎఆర్ఐ మేళా గ్రౌండ్ లో ఏర్పాటైన కృషి ఉన్నతి మేళా ను సందర్శించారు. ఆయన థీమ్ పెవిలియన్ ను మరియు జైవిక్ మేళా కుంభ్ ను తిలకించారు. 25 కృషి విజ్ఞాన్ కేంద్రాలకు శంకుస్థాపన చేశారు. సేంద్రియ ఉత్పత్తుల కోసం ఒక ఇ- మార్కెటింగ్ పోర్టల్ ను కూడా ఆయన ప్రారంభించారు. కృషి కర్మణ్ అవార్డులను మరియు పండిత్ దీన్ దయాళ్ ఉపాధ్యాయ కృషి ప్రోత్సాహన్ పురస్కారాలను ఆయన ప్రదానం చేశారు.

సభికులను ఉద్దేశించి ప్రధాన మంత్రి ప్రసంగిస్తూ, ఇలాంటి ఉన్నతి మేళాలు న్యూ ఇండియా కు బాట పరచడంలో ఒక కీలక పాత్రను పోషిస్తాయని తెలిపారు. న్యూ ఇండియా యొక్క కాపలాదారులైన ఇరువురితో.. వ్యవసాయదారులు మరియు శాస్త్రవేత్తలతో.. ఏక కాలంలో మాట్లాడే అవకాశం తనకు ఈ రోజున దక్కిందని ఆయన చెప్పారు. వ్యవసాయంలో మార్పు తేవడం కోసం రైతులు మరియు శాస్త్రవేత్తలు కలసి పని చేయాలని ఆయన సూచించారు.

సమీక్షా కాలంలో వ్యవసాయం లో తాను సాధించిన సాఫల్యాలకుగాను పురస్కారాన్ని అందుకొన్న మేఘాలయ రాష్ట్రాన్ని గురించి ప్రధాన మంత్రి ప్రత్యేకంగా ప్రస్తావించారు.

స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుండి వ్యవసాయంలో మన రైతులు సాధించిన విజయాలకుగాను వారు చేసిన కఠిన శ్రమను మరియు వారు అందించిన స్ఫూర్తిని ప్రధాన మంత్రి ప్రశంసించారు. ఆహార ధాన్యాలు, కాయ ధాన్యాలు, పండ్లు మరియు కాయగూరలు ఇంకా పాలు ఇవాళ రికార్డు స్థాయిలో ఉత్పత్తి అవుతున్నాయని ఆయన అన్నారు. ప్రస్తుతం వ్యవసాయంలో ముఖ్యమైన సవాళ్లు పొంచి ఉన్నాయని, ఇవి రైతు యొక్క ఆదాయాన్ని తగ్గించివేయగలవని, అంతే కాక అతడికి వ్యయాన్ని మరియు నష్టాలను పెంచుతాయని ఆయన అన్నారు. ఈ సవాళ్ల ను అధిగమించేందుకు ఒక సమగ్రమైన విధానంతో ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఆయన చెప్పారు. రైతుల ఆదాయాలను రెట్టింపు చేయడం, మరియు రైతుల జీవితాలను సులభతరం చేయడమే ధ్యేయమని ఆయన స్పష్టంచేశారు.

ఈ దృఢ సంకల్పం దిశగా పురోగమించడాన్ని గురించి ప్రధాన మంత్రి వివరిస్తూ, ఇంతవరకు 11 కోట్లకు పైగా భూమి స్వస్థత కార్డులు పంపిణీ అయిన సంగతిని తెలిపారు. యూరియా కు 100 శాతం వేప పూత పూయడం ఉత్పాదకతను పెంచడంతో పాటు ఎరువుపై పెట్టే ఖర్చును తగ్గించడానికి కూడా దారి తీసినట్లు చెప్పారు.

ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన ద్వారా ప్రీమియమ్ లను తగ్గించడం జరిగిందని, బీమా పై ఉన్నటువంటి పరిమితిని తొలగించడమైందని, రైతులకు ఇచ్చిన క్లెయిము సొమ్ములు పెరిగాయని ఆయన వివరించారు. ప్రధాన మంత్రి కృషి సించాయీ యోజన ప్రతి ఒక్క వ్యవసాయ క్షేత్రానికి నీటి లభ్యత కు ఉద్దేశించిన పథకం అని ఆయన తెలిపారు. పెండింగు పడ్డ సేద్యపు నీటి పారుదల పతకాలను పూర్తి చేయడం కోసం 80,000 కోట్ల రూపాయలను వెచ్చించడం జరుగుతోందని వెల్లడించారు.

వ్యవసాయ క్షేత్రం నుండి విపణి వరకు సరఫరా గొలుసు ను పటిష్టపరచేందుకు మరియు ఆధునిక వ్యవసాయ మౌలిక సదుపాయాల నిర్మాణానికి కిసాన్ సంపద యోజన తోడ్పడుతోందని ప్రధాన మంత్రి తెలిపారు. ఫలాలు మరియు కాయగూరలు, ప్రత్యేకించి టొమాటో, ఉల్లిగడ్డలు ఇంకా బంగాళాదుంపలను పండించే రైతులకు ఇటీవల బడ్జెటు లో ప్రకటించిన ఆపరేశన్ గ్రీన్స్ లాభదాయకంగా ఉంటుందని ఆయన వివరించారు.

రైతుల సంక్షేమానికి సంబంధించినటువంటి పలు నమూనా చట్టాలను రూపొందించినట్లు, వాటిని అమలుపరచవలసిందిగా రాష్ట్రాలకు విజ్ఞప్తి చేసినట్లు ఆయన చెప్పారు.

రైతులు ఆధునికమైన విత్తనాలు, తగినంత విద్యుత్తు సరఫరా, ఇంకా సులభంగా మార్కెట్ అందుబాటు.. వీటన్నింటినీ పొందేటట్లు చూసే దిశగా ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ప్రధాన మంత్రి వెల్లడించారు.

నోటిఫై చేసిన అన్ని పంటలకు, వ్యయానికి కనీసం ఒకటిన్నర రెట్ల మేరకు ఎమ్ఎస్ పి ఉండాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందని ఆయన చెప్పారు. ఇందుకుగాను.. శ్రమ, యంత్ర పరికరాల కిరాయి, విత్తనాలు మరియు ఎరువులకైన ఖర్చులు, రాష్ట్ర ప్రభుత్వానికి ఇచ్చే ఆదాయం, వర్కింగ్ కేపిటల్ పై చెల్లించే వడ్డీ, మరియు కౌలుకు తీసుకున్న పొలం యొక్క అద్దె వంటివి.. వ్యయంలో కలపడం జరుగుతుందన్నారు.

వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణల కోవలో సమగ్రమైన చర్యలను చేపడుతున్నట్లు ప్రధాన మంత్రి చెప్పారు. గ్రామీణ రిటైల్ బజారులను టోకు విపణులతో మరియు ప్రపంచ విపణులతో సంధానించడం ముఖ్యం; ఇటీవల కేంద్ర బడ్జెటు లో, గ్రామీణ రిటైల్ వ్యవసాయ విపణుల ఆలోచన చేయడం జరిగింది అని ఆయన వివరించారు. 22,000 రూరల్ హాత్ లకు అవసరమైన మౌలిక సదుపాయాలను కల్పించి ఎపిఎమ్ సి తో మరియు e-NAM (ఇ- ఎన్ఎఎమ్) ప్లాట్ ఫారమ్ తో సమన్వయపరచడం జరుగుతుందని తెలిపారు.

రైతు ఉత్పాదక సంస్థల ప్రాముఖ్యం గురించి కూడా ప్రధాన మంత్రి నొక్కిచెప్పారు. రైతు ఉత్పత్తి సంస్థలకు సహకార సంఘాల కోవలోనే ఆదాయపు పన్ను సంబంధిత మినహాయింపును ఇవ్వడం జరుగుతుందని ఆయన తెలిపారు. సేంద్రియ ఉత్పత్తులకు ఒక ఇ- మార్కెటింగ్ పోర్టల్ ను ప్రవేశపెట్టడం తో పాటు వ్యవసాయ మార్కెటింగ్ సంస్కరణలో ఒక నూతన అధ్యాయాన్ని ఈ కార్యక్రమంలో భాగంగా జోడిస్తున్నట్లు ఆయన వివరించారు.

హరిత విప్లవం మరియు శ్వేత విప్లవం లతోపాటు, మనం సేంద్రియ విప్లవం, జల విప్లవం, నీలి విప్లవం, ఇంకా మధుర విప్లవం ల వంటి వాటి పై శ్రద్ధ వహించాలని ఆయన చెప్పారు.

కృషి విజ్ఞాన్ కేంద్రాలు (కెవికె లు) ఈ విషయంలో కీలకమైన పాత్రను పోషించగలుగుతాయని ఆయన అన్నారు.

తేనెటీగలు రైతులకు ఏ విధంగా అదనపు ఆదాయ వనరును అందించే ఒక ముఖ్య మార్గం కాగలవో ప్రధాన మంత్రి వివరించారు. ఇదే తీరున, ఆయన సౌర ఆధారిత సేద్యం తాలూకు ప్రయోజనాల గురించి కూడా చెప్పుకొచ్చారు. గత మూడు సంవత్సరాలలో దాదాపు 2.75 లక్షల సౌర శక్తి ఆధారిత పంపులు రైతులకు అందాయని ఆయన అన్నారు. జీవ వ్యర్థాల నుండి కంపోస్టు, బయో గ్యాస్ మున్నగు వాటిని పొందేందుకు ఉద్దేశించినటువంటి గో- బర్ ధన్ యోజన ను గురించి కూడా ప్రధాన మంత్రి వివరించారు.

పంట కోతల అనంతరం మిగిలిన పదార్థాన్ని మండించివేయడం వల్ల హానికరమైన ప్రభావాలు ఉంటాయని, అదే పంట కోతల తాలూకు అవశేషాన్ని యంత్రాలను ఉపయోగించి తిరిగి నేలలోకే చేర్చివేసినప్పుడు అది లాభసాటిగా ఉండగలదని ప్రధాన మంత్రి చెప్పారు.

తగినంత వ్యవసాయ పరపతి లభ్యం అయ్యేటట్టు చూడటానికి ప్రభుత్వం కసరత్తు చేస్తోందని ప్రధాన మంత్రి అన్నారు.

ఇలాంటి కార్యక్రమాలను మారుమూల ప్రాంతాలలో సైతం నిర్వహించాలని ప్రధాన మంత్రి అన్నారు. ఈ తరహా కార్యక్రమాలు ప్రసరించే ప్రభావాన్ని విశ్లేషించాలని కూడా ఆయన పిలుపునిచ్చారు.

***