పిఎంఇండియా
కొత్త, పునరుత్పాదక ఇంధన రంగంలో భారతదేశం, ఇండొనేషియా లు కుదుర్చుకున్న ఒక అవగాహనపూర్వక ఒప్పందానికి (ఎంఓయూ) కేంద్ర మంత్రివర్గం ఆమోదముద్ర వేసింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. కిందటి నెలలో ఉప రాష్ట్రపతి శ్రీ ఎమ్. హమీద్ అన్సారీ ఇండొనేషియాలో పర్యటించినపుడు జకార్తాలో ఈ ఎంఓయూపై సంతకాలు జరిగాయి.
కొత్త, పునరుత్పాదక ఇంధన రంగంలో పరస్పర సమాన ప్రయోజనాలు, ఇచ్చిపుచ్చుకోవడం ప్రాతిపదికలుగా కలిగి ఉండే సాంకేతిక ద్వైపాక్షిక సహకారాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో ఓ సంస్థాగత స్వరూపానికి పునాదిని వేయడమే ఈ ఎంఓయూ ధ్యేయం. భారత్, ఇండొనేషియాలు ఒకదానికి మరొకటి సహకరించుకోవలసిన అంశాలలో.. శాస్త్ర- సాంకేతిక సమాచారంతో పాటు డాటాను సైతం మార్పిడి చేసుకోవడం, కెపాసిటీ బిల్డింగ్, వాణిజ్యేతర ప్రాతిపదికన సాంకేతిక పరిజ్ఞానం బదలాయింపు, ఇరు దేశాలకు ఆసక్తి ఉన్న విషయాలలో సంయుక్త పరిశోధనలను, లేదా సాంకేతిక ప్రాజెక్టులను కొనసాగించడం, విధానపరమైన చర్చలను చేపడుతూ ఉండటం, పెట్టుబడులను పెంచడం/ ప్రోత్సహించడం వంటివి ఉంటాయి. ఇవే కాకుండా ఇంకా ఉభయ దేశాలకు అంగీకార యోగ్యమైన వేరే రంగాలలోనూ సహకరించుకోవడంపైన ఇరు పక్షాలు దృష్టి సారిస్తాయి.