Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

గుజ‌రాత్ లోని కేవ‌డియా లో జ‌రిగిన జ‌న స‌భ లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


మీ రెండు చేతుల ను పైకి ఎత్తి ప‌ట్టుకొని నాతో పాటు ప‌ల‌కండి..
న‌ర్మ‌దే.. న‌ర్మ‌దే .. న‌ర్మ‌దే..
స‌ర్వ‌దే .. న‌ర్మ‌దే .. న‌ర్మ‌దే .. న‌ర్మ‌దే..

గుజరాత్ గవర్నర్ శ్రీ ఆచార్య దేవ్ వ్రత్ గారు;  గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ విజయ్ భాయీ రూపాణీ, గుజ‌రాత్ ఉప ముఖ్య‌మంత్రి శ్రీ నితిన్ భాయీ;  పెద్ద సంఖ్య లో ఇక్క‌డ కు త‌రలి వ‌చ్చిన నా సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రుల తో పాటు వేదిక ను అలంక‌రించిన ప్ర‌ముఖులారా,      

నేను ఒకప్పుడు ఫోటోగ్ర‌ఫీ ని నేర్చుకోసాగాను. ఫొటో లు తీసుకోవ‌డం నాకు నచ్చేది.  కాల‌క్ర‌మం లో నేను ఫోటోలు తీయడం ఆగిపోయింది కానీ ఈ రోజు న నేను ఇక్క‌డ కూర్చొని ఉన్నాను.. ఇప్పుడు కొన్ని ఫోటోల ను తీసుకోవాలి అనే కోరిక నాకు క‌లిగింది.  నా ద‌గ్గ‌ర కామెరా లేదే అని బాధ‌ప‌డుతున్నాను.  మీది నుండి నేను చూస్తున్న‌ దృశ్యం ఎలా ఉందీ అంటే క్రింది భాగం లో ఒక ప్రజా వాహిని (జన సాగర్) ఉన్నట్లుగాను, వెనుక‌ భాగం లో ఒక జ‌ల వాహిని (జల్ సాగర్) ఉన్న‌ట్లుగాను తోస్తున్న‌ది; మ‌రి కామెరాలు ధరించి ఇప్ప‌టికే మా యొక్క చిత్రాల ను అనేకం తీసిన వారి ని కూడా- మీరు ఇక మీ కోణాన్ని మ‌రొక‌ వైపునకు తిప్పి, జ‌న్ సాగర్ మ‌రియు జ‌ల్ సాగర్.. ఈ రెండు ఏ విధం గా క‌ల‌సిపోతున్న‌ాయో క్లిక్‌ చేయండి- అంటూ అభ్యర్థిస్తాను.  బహుశా ఛాయాచిత్ర జ‌గ‌త్తు లో చాలా అరుదు గా క‌నిపించేట‌టువంటిది అటువంటి స‌న్నివేశం. ఈ ప్ర‌దేశాన్ని ఎంపిక చేయ‌డం లో గల ఇక్క‌డి ప‌రిపాల‌కుల సౌంద‌ర్య దృష్టి ని కూడాను నేను అభినందిస్తాను.  

ఈ రోజు న మాత నర్మ‌ద ను సంద‌ర్శించే అవ‌కాశం తో పాటు, ప్రార్థ‌న‌ల లో పాలు పంచుకొనే అవ‌కాశం నాకు ద‌క్కింది.  ఈ మ‌హ‌ద్భాగ్యాని కి గాను  మీ అంద‌రి కి నేను ధ‌న్య‌వాదాలు తెలియజేస్తున్నాను.  అలాగే, న‌మామి దేవి న‌ర్మ‌ద ఉత్సవం లో పాలు పంచుకోండి అంటూ న‌న్ను ఆహ్వానించినందుకు గుజ‌రాత్ ప్ర‌భుత్వాని కి ఇవే ధ‌న్య‌వాదాలు.  ఈ పండుగ కు హాజ‌రైన గుజ‌రాత్ ప్ర‌జ‌లంద‌రి కి కూడాను నేను అభినంద‌న‌లు తెలియజేస్తున్నాను.  అలాగే ఈ ప‌థ‌కం యొక్క లాభాలు ప్ర‌జ‌ల కు, గుజ‌రాత్ తో పాటు, మ‌ధ్య ప్ర‌దేశ్‌, మ‌హారాష్ట్ర, రాజ‌స్థాన్ ఈ నాలుగు రాష్ట్రాల రైతుల కు అందుతాయని నేను చెప్ప‌ద‌లుస్తున్నాను.
 
మిత్రులారా,

మ‌న సంస్కృతి లో- ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించినప్పుడే అభివృద్ధి చోటు చేసుకొంటుంది- అని ఎల్లప్పటి కీ నమ్ముతూ వచ్చాము.  ప్ర‌కృతి ని మ‌నము ఆరాధిస్తాము;  ప్ర‌కృతి మ‌న కు విలువైన వస్తువుల వలె ఉంది.  ప‌ర్యావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షిస్తూ అభివృద్ధి ని ఏ విధం గా సాధించుకోవ‌చ్చో ప్ర‌స్తుతం కేవ‌డియా ను చూస్తే ఇట్టే తెలిసిపోతుంది.

ఈ రోజు న ఉద‌యం నుండి అనేక ప్ర‌దేశాల ను సంద‌ర్శించే అవ‌కాశం నాకు చిక్కింది.  మ‌రి ప్ర‌తి చోటా ప్ర‌కృతి మ‌రియు ప్ర‌గ‌తి.. ఈ రెంటి అద్భుత‌మైన మేళ‌నాన్ని నేను గ‌మ‌నించాను.  ఒక‌ పక్క సర్ దార్ స‌రోవ‌ర్ ఆన‌క‌ట్ట మ‌రియు విద్యుత్తు ఉత్పాద‌న సామగ్రి ఉంది.  మ‌రొక పక్క‌ ఏక్‌తా న‌ర్స‌రీ, బ‌ట్టర్ ఫ్ల‌య్ గార్డెన్‌, కేక్‌ ట‌స్ గార్డెన్ ల వంటి ఇకో-టూరిజ‌మ్ కు సంబంధించిన అతి సుంద‌ర‌మైనటువంటి ఏర్పాట్లు కూడా ఉన్నాయి.  వీట‌న్నిటి న‌డుమ, భవ్యమైనటువంటి స‌ర్‌ దార్‌ వల్లభ్ భాయ్ ప‌టేల్ యొక్క భ‌వ్య విగ్ర‌హం మ‌న‌ల ను ఆశీర్వ‌దిస్తుండటాన్ని చూడవచ్చును.  నేను అనుకొంటున్నాను- అది ఏమిటంటే కేవ‌డియా పురోగ‌తి, ప్ర‌కృతి, ప‌ర్యావ‌ర‌ణం మ‌రియు ప‌ర్య‌ట‌న.. వీట‌న్నిటి అద్భుత‌మైన క‌ల‌యిక తో అల‌రారుతూంది- అని. మరి అది మ‌న‌ అంద‌రి కి ఒక గొప్ప ప్రేర‌ణ వంటిది సుమా.

ఈ రోజు న సృజ‌న కు ఆద్యుడైన విశ్వ‌క‌ర్మ గారి జ‌యంతి కూడా.  ఒక ‘న్యూ ఇండియా’ను ఆవిష్క‌రించే దిశ గా ప‌య‌నించాల‌న్న మ‌న సంక‌ల్పం లో విశ్వ‌క‌ర్మ గారికి ఉన్నటువంటి సృజ‌న‌శీలత్వం మ‌రియు గొప్ప లక్ష్యాల ను సాధించాలన్న ఇఛ్చా శ‌క్తి సైతం చాలా ముఖ్యం. విశ్వ‌క‌ర్మ గారు వారి యొక్క దీవెన‌ల ను భార‌త‌దేశం పై వ‌ర్షించాల‌ని మ‌నమంతా ప్రార్థ‌న చేద్దాము.

ఈ రోజు న, మీతో నేను మాట్లాడుతూ ఉన్న వేళ‌ లో, ప్ర‌పంచం లో కెల్లా అతి ఎత్త‌యిన స‌ర్ దార్ స‌హబ్ యొక్క విగ్ర‌హం మ‌రి అలాగే స‌ర్ దార్ స‌రోవ‌ర్ ఆన‌క‌ట్ట.. ఈ రెండూ కూడా ఇచ్ఛా శ‌క్తి కి సంకేతాలు గా నిల‌చివున్నాయి.

ఆయ‌న ఇచ్చే ప్రేర‌ణ తో మ‌నం ప్ర‌తి ఒక్క సంక‌ల్పాన్ని నెర‌వేర్చుకొంటామని, మరి అదే మాదిరి గా ‘న్యూ ఇండియా’తో ముడిప‌డినటువంటి ప్ర‌తి ఒక్క ల‌క్ష్యాన్ని సాధించుకొంటామ‌ని నేను న‌మ్ముతున్నాను.

నేటి ఈ సంద‌ర్భం కూడాను చాలా ఉద్వేగ‌భ‌రిత‌ం అయిన‌టువంటిది.  స‌ర్ దార్ ప‌టేల్ క‌న్నటువంటి క‌ల ద‌శాబ్దాల అనంత‌రం నెర‌వేరుతోంది. అదీనూ స‌ర్ దార్ సాహ‌బ్ భ‌వ్యమైన విగ్ర‌హం స‌మ‌క్షం లోనే జ‌రుగుతోంది.

మ‌నం మొట్టమొదటి సారి గా స‌ర్ దార్‌ స‌రోవ‌ర్ ఆన‌క‌ట్ట పూర్తి గా నిండ‌టాన్ని చూశాము. ఒకానొక కాలమంటూ ఉండేది.. 122 మీట‌ర్ల ల‌క్ష్యాన్ని స‌మీపించ‌డమే ఒక గొప్ప కార్య‌సాధ‌న గా భావించినటువంటి కాలం.  అయితే నేటి కి, 5 సంవ‌త్స‌రాల కాలం లోపలే, స‌ర్ దార్ స‌రోవ‌ర్ 138 మీట‌ర్ల దాకా నిండ‌టం అబ్బురప‌ర‌చేదే కాక ఎంతమాత్రం మ‌ర‌చిపోలేనటువంటి సంగతి కూడాను.
 
మిత్రులారా,

మనలను నేటి స్థితి కి తీసుకు రావడం కోసం ల‌క్ష‌లాది ప్ర‌జ‌లు వారి యొక్క తోడ్పాటు ను అందించారు.  ఈ కృషి లో చాలా వ‌ర‌కు అత్యంత సాధార‌ణ‌మైన పౌరుల‌ కు చెందిన‌టువంటిది.  సాధువులు, రుషులు కూడా ఒక ముఖ్య పాత్ర ను పోషించారు.  అనేక సామాజిక సంస్థ‌ లు సైతం త‌లో చేయి ని వేశాయి.  స‌ర్ దార్ స‌రోవ‌ర్ ప్రోజెక్టు కు తోడ్ప‌డ్డ ఆ యొక్క ల‌క్ష‌లాది నేస్తాల కు కృత‌జ్ఞ‌త ను వ్య‌క్తం చేసే సుదిన‌మే ఈ దినం.  ఆ కోవ కు చెందిన ప్ర‌తి ఒక్క వ్య‌క్తి కి నేను ప్ర‌ణామం చేస్తున్నాను.

మిత్రులారా,

ఈ రోజు న కేవ‌డియా లో పెల్లుబుకుతున్న ఉత్సాహం గుజ‌రాత్ అంతటా తొణికిస‌లాడుతోంది.  ఈ రోజున మురుగునీటి కాలువ‌ల ను, కుంటల ను, చెరువుల ను, న‌దుల ను శుభ్ర‌ప‌ర‌చే ప‌ని జ‌రుగుతోంది.  రానున్న రోజుల లో ఒక పెద్ద స్థాయి లో మొక్క‌ల ను నాటే ఉద్య‌మాన్ని కూడా చేప‌ట్టేందుకు ప్రణాళిక ఉంది.  ఇది త‌ప్ప‌కుండా హ‌ర్ష‌ణీయ‌మైనటువంటి మ‌రియు అభినంద‌నీయ‌మైన‌టువంటి ప‌ని అవుతుంది.  ఈ స్ఫూర్తి తో జ‌ల్-జీవ‌న్ మిశ‌న్ ముందంజ వేయ‌నుంది.  మ‌రి దేశం లో జ‌ల సంర‌క్ష‌ణ ఉద్య‌మం స‌ఫ‌లం కానున్నది.  మ‌నం గుజ‌రాత్ లో ఫ‌ల‌ప్ర‌ద‌మైన ప్ర‌యోగాల ను, ప్ర‌జ‌ల కు ప్రాతినిధ్యం ఉన్న ప్ర‌యోగాల ను, మ‌రి అలాగే జ‌న భాగ‌స్వామ్యాని కి సంబంధించినటువంటి అనేక ముఖ్య‌మైన కార్యాల ను ముందుకు తీసుకుపోవ‌ల‌సివుంది.  గుజ‌రాత్ లోని గ్రామాల లో ప్రజల భాగస్వామ్యం తో ఆ త‌ర‌హా ఉద్య‌మాల తో పెనవేసుకుపోయినటువంటి నేస్తాల ను వారి యొక్క అనుభ‌వాల ను దేశం లోని అన్ని ప్రాంతాల తోనూ పంచుకోండంటూ వారి కి నేను విజ్ఞప్తి చేస్తున్నాను.

మిత్రులారా,

సౌరాష్ట్ర లో మ‌రియు క‌చ్ఛ్ లో వారాల త‌ర‌బ‌డి నీరు చేరుకోలేని ప్రాంతాల కు ప్ర‌స్తుతం మాత న‌ర్మ‌ద త‌న దీవెన‌ల ను అందిస్తోంది.  ద‌శాబ్దాల క్రితం గుజ‌రాత్ లో జ‌ల యుద్ధాల వేళ తుపాకి గుండ్లను కురిపించిన రోజు లు ఉన్నాయి. త్రాగునీటి ఏర్పాట్ల కోసం సోద‌రీమ‌ణులు మ‌రియు పుత్రిక‌లు ఐదేసి, ప‌దేసి కిలో మీట‌ర్లు న‌డచివెళ్లి తిరిగి ఇంటికి చేరుకోవల‌సిన కాలమంటూ ఉండేది.  వేస‌వి రావడం తోనే సౌరాష్ట్ర ప్ర‌జ‌లు మ‌రియు ఉత్త‌ర గుజ‌రాత్ వాసులు వారి యొక్క ప‌శుగ‌ణాన్ని వెంటబెట్టుకొని నీటి తో నిండిన ప్రాంతాల కోసం వెతుకుతూ వంద‌ల కిలో మీట‌ర్ల కొద్దీ ప్ర‌యాణించ‌వ‌ల‌సి వ‌చ్చేది.  వారు వారి ఇళ్ళ ను, పొలాల‌ ను, ప‌ల్లెల ను వ‌ద‌లి వెళ్ళ‌క త‌ప్పేది కాదు.  నాకు జ్ఞాప‌కాని కి వ‌స్తోంది.. 2000వ సంవ‌త్స‌రం ఎండ కాలం లో ఎటువంటి ప‌రిస్థితి త‌లెత్తింది అంటే జాం న‌గ‌ర్ కు మ‌రియు సూర్య న‌గ‌ర్ కు నీటి ని అందించ‌డం కోసం రాజ్ కోట్ మొట్ట‌మొద‌టిసారి ప్ర‌త్యేక‌ంగా ఓ నీటి రైలు ను పంప‌వ‌ల‌సి వ‌చ్చింది.  

మిత్రులారా,

ఈ రోజు న మనం గ‌తించిన కాలాన్ని గురించి ఆలోచిస్తే, ప్ర‌స్తుతం గుజ‌రాత్ చాలా దూరం ప్ర‌యాణించిన‌ట్లు అనిపిస్తుంది.  మీకు గ‌ర్వం గా ఉందా  లేక లేదా ?  మీరు సంతోషం గా ఉన్నారా ?  మీరు ఎప్పుడ‌యితే ఇక్క‌డ బాధ్య‌త ను నాకు ఇచ్చారో, మా ఎదుట నిల‌చిన జోడు స‌వాళ్ళు ఏమిటి అంటే, సేద్య‌పు నీరు, త్రాగు నీరు, ఇంకా విద్యుత్తు ల కోసం ఉద్దేశించిన‌టువంటి ఆన‌కట్ట ప‌నుల ను వేగ‌వంతం చేయ‌డం.  ఒక ప‌క్క న‌ర్మ‌ద కాలువ నెట్ వ‌ర్క్ ను కూడా విస్త‌రించ‌వ‌ల‌సి ఉండింది;  ప్ర‌త్యామ్నాయ నీటిపారుద‌ల వ్య‌వ‌స్థ ను కూడా పెంపొందింప చేయ‌వ‌ల‌సి ఉండింది.  ఒక్క‌సారి ఊహించండి 2001వ సంవ‌త్స‌రం వ‌చ్చే సరికి, కేవ‌లం 150 కిలో మీట‌ర్ల మేర ప్ర‌ధాన కాలువ ప‌నుల నే పూర్తి చేయ‌గ‌లిగాం.  సాగు నీటి పారుద‌ల వ్య‌వ‌స్థ‌, మ‌రియు కాలువ‌ల నెట్ వ‌ర్క్ ప‌నులు అసంపూర్తి గా ఉండి, ప్ర‌తిష్టంభ‌న నెల‌కొంది.  అయిన‌ప్ప‌టికీ, మీరు అందరూ.. గుజ‌రాత్ ప్ర‌జానీకం ఎన్నటి కి ధైర్యాన్ని కోల్పోనేలేదు.

ఈ రోజు న‌, గుజ‌రాత్ లో సాగునీటి ప‌థ‌కాల యొక్క ఒక విస్తృతమైనటువంటి నెట్ వ‌ర్క్ రూపుదిద్దుకొంది.  గ‌డ‌చిన 17-18 సంవ‌త్స‌రాల కాలం లో దాదాపు గా రెట్టింపు భూమి ని సేద్య పరిధి లోకి తీసుకురావడం జరిగింది.
 
సోద‌రీమ‌ణులు మ‌రియు సోద‌రులారా,

బిందు సేద్యం క్రింద కు, సూక్ష్మ సేద్యం క్రింద‌ కు వ‌చ్చిన విస్తీర్ణం 2001వ సంవ‌త్స‌రం లో కేవలం 14 వేల హెక్టేర్లు గా ఉండ‌గా, దాని తాలూకు ల‌బ్ధి ని సుమారు 8000 రైతు కుటుంబాలు మాత్రమే పొంద‌గ‌లగడాన్ని మీరు ఊహించుకోగ‌ల‌రు.  ‘ఒక్కొక్క నీటి చుక్క‌ కు మ‌రింత పంట‌’ ప్ర‌చార ఉద్య‌మం తోను, నీటి ని ఆదా చేయ‌డం అనే ప్ర‌చార ఉద్య‌మం తోను, సూక్ష్మ సేద్యం మ‌రియు బిందువు లపై ఆధారపడ్డ సేద్యం తోను ఈ రోజు న మ‌నం అదే సూక్ష్మ సేద్యం ప‌రిధి లోకి ర‌మార‌మి 19 ల‌క్ష‌ల హెక్టేర్ల భూమి ని తీసుకు రాగ‌లిగాము.  దీని తాలూకు ప్ర‌యోజ‌నాల‌ ను దాదాపు గా 12 ల‌క్ష‌ల రైతు కుటుంబాలు పొందుతూ ఉన్నాయి.  ఇది మీ స‌హ‌కారం లేకుండా సాధ్యం అయ్యేదే కాదు.  ఇది గుజ‌రాత్ లోని ప‌ల్లెల లో ఉన్న రైతుల సూక్ష్మ‌గ్రాహ్యత యొక్క అండ లేకుండా సాధ్య‌ప‌డేదే కాదు.  న‌వీన విజ్ఞాన శాస్త్రం మ‌రియు సాంకేతిక విజ్ఞానం ఈ రెంటి ని గుజ‌రాత్ రైతులు స్వీక‌రించిన ప‌ర్య‌వ‌సానం గా మ‌నము అటువంటి ఒక పెద్ద స్వ‌ప్నాన్ని సాకారం చేసుకోగ‌లిగాము.  ప్ర‌తి ఒక్క నీటి చుక్క కు మ‌రింత ఎక్కువ పంట అనే ఉద్య‌మం గుజ‌రాత్ లోని ప్ర‌తి ఒక్క పొలాని కి చేరువ కాగ‌లిగింది.  ఈ మ‌ధ్యే ఐఐఎమ్ అహ‌మ‌దాబాద్ ఈ విష‌యం లో ఒక అధ్య‌య‌నాన్ని నిర్వ‌హించింది.  దీని ని గురించి మీకు మ‌రియు దేశ ప్ర‌జ‌ల కు నేను చెప్ప‌ద‌లుస్తున్నాను.

ఈ అధ్య‌య‌నం గుజ‌రాత్ లో సూక్ష్మ సేద్యం ద్వారా 50 శాతం వ‌ర‌కు నీటి ని ఆదా చేయ‌డ‌మైంద‌ని వెల్ల‌డించింది.  ఎరువుల వినియోగం 25శాతం మేర త‌గ్గింది.  శ్రామికుల పై అయ్యే వ్య‌యం 40 శాతం మేర దిగివచ్చింది.  మ‌రి విద్యుత్తు విష‌యం లో సైతం అద‌న‌పు ఆదా సాధ్య‌మైంది.  పైపెచ్చు, ఒక పక్క‌ ఆదా కు తోడు గా మ‌రొక పక్క‌ పంట దిగుబ‌డి లో 30 శాతం వ‌ర‌కు పెరుగుద‌ల కూడా ఉంది.  అంతేకాక ప్ర‌తి ఒక్క రైతు కుటుంబం యొక్క ఆదాయం లో ఒక్కొక్క హెక్టేరు కు సుమారు ప‌దిహేనున్న‌ర వేల రూపాయ‌ల వృద్ధి కూడా ఉంది.  

మిత్రులారా,

న‌ర్మ‌ద జ‌లాలు క‌చ్ఛ్ ప్రాంతాని కి చేరుకొన్నప్పుడు ఈ జలాలు క‌చ్ఛ్ ప్రాంతాని కి వ‌ర‌ ప్రదాయిని కానున్నాయ‌ని కొంత మంది నా తో చెప్ప‌డం నాకు జ్ఞ‌ాపకానికి వస్తోంది. ఇవాళ న‌ర్మ‌ద జ‌లాలు ఒక్క క‌చ్ఛ్ ప్రాంతానికే కాక సౌరాష్ట్ర‌ కు, అలాగే గుజ‌రాత్ లోని చాలా భాగాని కి వ‌ర‌ దాయిని గా మారాయి. న‌ర్మ‌ద జ‌లాలు కేవ‌లం నీరు మాత్రమే కాదు, ఈ జ‌లాలు భూమి ని తాకిన వెంట‌నే అవి ఆ భూమి ని బంగారం గా మార్చి వేస్తాయి. న‌ర్మ‌ద జ‌లాల వ‌ల్ల నీటి పారుద‌ల సౌక‌ర్యం మెరుగుప‌డ‌డ‌మే కాకుండా కుళాయి నీటి శాతం గ‌త రెండు ద‌శాబ్దాల‌ లో దాదాపు మూడు రెట్లు పెరిగింది. 2001వ సంవత్సరం లో గుజ‌రాత్‌ లోని గృహాల‌ లో 26 శాతం మంది కి మాత్ర‌మే కుళాయి నీరు అందుబాటు లో ఉండేది. నల్లా ల ద్వారా నీటి ని స‌ర‌ఫ‌రా చేయ‌డం ప్రారంభించిన‌ప్ప‌టి నుండి 2001వ సంవత్సరం వ‌ర‌కు- అంటే 5 ద‌శాబ్దాల కాలం లో- గుజ‌రాత్ లోని 26 శాతం ఇళ్ల‌ కు మాత్ర‌మే కుళాయి ద్వారా నీటి ని స‌ర‌ఫ‌రా చేస్తున్నారు. కానీ ప్రస్తుతం ప్ర‌భుత్వం చేస్తున్న కృషి, గుజ‌రాత్ ప్ర‌భుత్వం చేప‌ట్టిన ప‌థ‌కాల కార‌ణం గా గుజ‌రాత్‌ లో 78 శాతం ఇళ్ల‌ కు కుళాయి ల ద్వారా నీరు అందుతోంది. మ‌నం ఈ స్ఫూర్తి తో దేశ వ్యాప్తం గా ప్ర‌తి ఇంటి కి నీటి ని అందించే ల‌క్ష్యాన్ని సాధించాలి.

సోదరీమణులు మరియు సోద‌రులారా,

ఇవాళ ‘సౌని’ యోజ‌న‌, సుజ‌లాం- సుఫ‌లాం యోజ‌న‌ ల వంటి ప‌థ‌కాల ద్వారా గుజ‌రాత్ లోని గ్రామాలు, న‌గ‌రాలు వాట‌ర్ నెట్ వ‌ర్క్ తో వేగం గా సంధానం అవుతున్నాయి. ముందుగా నేను గుజ‌రాత్ పూర్వ ముఖ్య‌మంత్రి ఆనందీబెన్ ప‌టేల్‌ గారి ని, గుజరాత్ ప్ర‌స్తుత ముఖ్య‌మంత్రి రూపాణీ గారి ని, అలాగే ప్ర‌తి ఇంటి కి, ప్ర‌తి పొలాని కి నీటి ని అందించేందుకు విజ‌య‌వంతం గా కృషి చేసిన గ‌త ప్ర‌భుత్వాల‌ ను అభినందిస్తున్నాను.

మిత్రులారా,

నీటి పారుద‌ల స‌దుపాయాల వ‌ల్ల గుజరాత్ రైతు లు ఎంత‌గానో ప్ర‌యోజ‌నం పొందారు. అంతకు ముందు రైతులు సంప్ర‌దాయ పంట‌ల ను మాత్ర‌మే పండించే వారు. కానీ నీటి పారుద‌ల స‌దుపాయాలు అందుబాటు లోకి వ‌చ్చిన త‌రువాత రైతు లు వాణిజ్య‌ పంట‌ల ను పండిస్తున్నారు. పండ్ల‌ తోట‌ల ప‌ట్ల ఆసక్తి ని క‌న‌బ‌రుస్తున్నారు. ఇటీవ‌ల జ‌రిపిన మ‌రొక అధ్య‌య‌నం ప్ర‌కారం, రైతుల‌ లో వ‌చ్చిన ఈ మార్పు కార‌ణం గా ఎన్నో రైతు కుటుంబాల ఆదాయం పెరిగిన‌ట్టు తెలిసింది.

సోదరీమణులు మరియు సోద‌రులారా,

2022 నాటికి గుజ‌రాత్ తో స‌హా దేశంలోని అన్ని రైతు కుటుంబాల రాబ‌డి ని రెట్టింపు చేసే దిశ‌ గా ప‌లు విధాలు గా, ఎన్నో ప్ర‌య‌త్నాలు జ‌రుగుతున్నాయి. కొత్త ప్ర‌భుత్వం ఏర్ప‌డిన త‌రువాత ఈ దిశ గా గ‌త 100 నెల‌ల్లో చర్య‌ల ను చేప‌ట్ట‌డం జ‌రిగింది. ప్ర‌ధాన‌ మంత్రి కిసాన్ స‌మ్మాన్ నిధి ప్ర‌యోజ‌నాన్ని ప్ర‌స్తుతం గుజ‌రాత్ లోని ప్ర‌తి రైతు కుటుంబాని కి అందించ‌డం జ‌రిగింది.

కొద్ది రోజుల క్రితం చిన్న రైతులు, చిన్న దుకాణాల య‌జమానులు, చిన్న వ్యాపారుల కోసం ఒక పెన్ష‌న్ ప‌థ‌కాన్ని ప్రారంభించ‌డం జ‌రిగింది. దీని ప్ర‌యోజ‌నాల‌ ను గుజ‌రాత్ లోని రైతుల కు, దేశ రైతు కుటుంబాల‌ కు అందించ‌డం జ‌రుగుతుంది.

మిత్రులారా,

జ‌ల‌మార్గ ర‌వాణా కు సంబంధించి ఒక స‌మగ్ర వ్య‌వ‌స్థ‌ ను రైతుల కోసం, వ్యాపారుల‌ కోసం, గుజ‌రాత్‌ లోని ఇత‌ర ప్ర‌జ‌ల కోసం రూపొందించడం జ‌రుగుతుంది. ఘోఘా- ద‌హేజ్ రో- రో ఫెర్రి స‌ర్వీసు ను ప్రారంభించే అదృష్టం నాకు లభించింది. ఇప్ప‌టి వ‌ర‌కు 1.25 ల‌క్ష‌ల‌ మంది ప్ర‌యాణికులు ఈ ఫెర్రి స‌దుపాయాన్ని వినియోగించుకొన్న‌ట్టు నా దృష్టి కి వ‌చ్చింది. దీని ద్వారా 70 వేల వాహ‌నాల‌ ను కూడా ర‌వాణా చేశారు. గ‌తం లో మీరు 350 కిలోమీట‌ర్ల దూరం రోడ్డు మార్గం లో ప్ర‌యాణించి వెళ్లవలసి వుండేది. కానీ ప్ర‌స్తుతం మీరు స‌ముద్ర మార్గం లో కేవ‌లం 31 కిలోమీట‌ర్లు ప్ర‌యాణిస్తే చాలు. 350 కిలోమీట‌ర్ల ప్ర‌యాణాని కి మరియు 31 కిలోమీట‌ర్ల ప్ర‌యాణాని కి మ‌ధ్య వ్య‌త్యాసాన్ని మీరు గ‌మ‌నించండి. ఈ స‌దుపాయం ప్ర‌జ‌ల‌ కు సౌక‌ర్య‌వంతం గా ఉంది. వారి యొక్క విలువైన స‌మ‌యాన్ని ఆదా చేస్తున్న‌ది. ప‌ర్యావ‌ర‌ణం ప‌రిర‌క్షింప‌బ‌డుతున్నది. ఆర్థికం గా కూడాను క‌లిసి వ‌స్తుంది.

మిత్రులారా,

ఇటువంటి స‌ర్వీసు ను ముంబయి నుండి హ‌జారియా కు ప్ర‌తిపాదించ‌డం జ‌రిగింది. గుజ‌రాత్ ప్ర‌భుత్వం దీని కి రాజ్యాంగ‌ప‌ర‌మైన ఆమోదం తెలిపింది. ఇందుకు సంబంధించిన ప‌నులు త్వ‌ర‌లోనే ప్రారంభ‌ం అవుతాయి. రో-రో ఫెర్రి వంటి ప్రాజెక్టు ల వ‌ల్ల గుజ‌రాత్‌ లో జ‌ల ప‌ర్యాట‌కం జోరు అందుకోనుంది.

మిత్రులారా,

ప‌ర్యాట‌కం ప్ర‌స్తావ‌న వ‌స్తే, స్టాట్యూ ఆఫ్ యూనిటీ యొక్క చ‌ర్చ రావ‌డం స‌హ‌జం. దీని వ‌ల్ల కేవడియా, గుజ‌రాత్ ల పేర్లు ప్ర‌పంచ ప‌ర్యాట‌క చిత్ర‌ ప‌టం లో ప్ర‌ముఖం గా చోటు ను సంపాదించుకొన్నాయి. ఇది కేవ‌లం 11 మాసాల క్రితం ప్రారంభాని కి నోచుకొంది. ప‌ట్టుమ‌ని సంవ‌త్స‌రం కూడా కాలేదు; ఈ 11 నెల‌ల్లో సుమారు 23 ల‌క్ష‌ల‌ మంది ప‌ర్యాట‌కులు ప్ర‌పంచం న‌లు మూల‌ ల నుండి, దేశం న‌లు మూల ల నుండి వ‌చ్చి స‌ర్ దార్ ప‌టేల్ యొక్క స్టాట్యూ ఆఫ్ యూనిటీ ని సంద‌ర్శించారు.
స‌గ‌టు న ప్ర‌తి రోజూ 8,500 మంది ఇక్క‌డ కు వ‌స్తున్నారు. గ‌త నెల‌ లో జ‌న్మాష్ట‌మి రోజు న సుమారు 34 వేల మంది ప‌ర్యాట‌కులు ఈ ప్రాంతాన్ని సంద‌ర్శించారని నా దృష్టి కి వచ్చింది. అమెరికా కు చెందిన స్టాట్యూ ఆఫ్ లిబ‌ర్టీ ని రోజూ 10 వేల‌ మంది సంద‌ర్శిస్తారు. అది 133 సంవ‌త్స‌రాల నాటిది. కానీ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆవిష్క‌ర‌ణ‌ జరిగి 11 నెల‌లు మాత్రమే అయింది. అయినప్పటి కి ఎంత ఘ‌న విజ‌యాన్ని సాధించిందో చూడండి.. రోజు కు ఈ స్టాట్యూ ను 8500 మంది సంద‌ర్శిస్తున్నారు. ప‌ట్టుమ‌ని 11 మాసాల లో 23 ల‌క్ష‌ల‌ మంది దీని ని సంద‌ర్శించ‌డ‌ం అంటే అది ఒక మహాద్భుతం.

సోదరీమణులు మరియు సోద‌రులారా,

స‌ర్ దార్‌ ప‌టేల్ స్టాట్యూ ఆఫ్ యూనిటీ ఆదివాసీ సోద‌రీమ‌ణుల‌ కు, ఆదివాసీ సోదరుల కు, ఇక్క‌డి యువ‌త‌ కు చ‌క్క‌టి ఉపాధి అవ‌కాశాల ను క‌ల్పిస్తున్న‌ది. స‌మీప భ‌విష్య‌త్తు లో ఇక్క‌డ రోడ్డు స‌దుపాయం, ఇత‌ర ప‌ర్యాట‌క సంబంధ ప్రాజెక్టు లు పూర్త‌ి అయ్యాయంటే ఉపాధి అవ‌కాశాలు మ‌రింత‌ గా పెరుగుతాయి. ఈ ప్రాజెక్టు ల అమ‌లు లో పురోగతి ని స‌మీక్షించేందుకు ఇవాళ నా స‌మ‌యాన్ని చాలా వ‌ర‌కు వినియోగించాను. అందువ‌ల్లే నేను ఇక్క‌డ కు చేరుకోవ‌డానికి ఆల‌స్య‌ం అయింది. వాహనాల రాకపోకల తాలూకు అడ్డంకులు ఏమీ లేవు. అత్యంత వేగం గా, నాలుగు గంట‌ల‌ లో ఇక్క‌డ కు రాగ‌లిగాను. అయినా అన్ని ప‌నులూ పూర్తి గా చూడ‌లేక‌పోయాను. ఇక్క‌డ ప‌నులు ఎక్కువ‌ గా ఉ న్నాయి. భ‌విష్య‌త్తు లో ఇక్క‌డ కు ప‌ర్యాట‌కులు వ‌చ్చిన‌ట్ట‌యితే మూడు నాలుగు రోజుల పాటు ఇక్కడే ఉండిపోవాల‌ని అనిపిస్తుంది. పండ్లు, కాయగూరలు, పూల సాగు, పాలు ఉత్ప‌త్తి చేసే ఆదివాసీల‌ కు ఇక్క‌డ పెద్ద బజారు అందుబాటు లో ఉంది.

ఇక్క‌డ మ‌నం మ‌న‌సు లో ఉంచుకోవ‌ల‌సింది ఈ ప్రాంతాన్ని ప్లాస్టిక్ ర‌హిత ప్ర‌దేశం గా తీర్చిదిద్ద‌డం అనే సంగతి ని. ఒక‌ సారి వాడి పారేసే ప్లాస్టిక్ నుండి యావత్తు దేశం విముక్తి ని పొందాల‌న్న సంక‌ల్పం తో ఉంది. మీరు అంద‌రూ కూడాను ప‌రిశుభ్ర‌త ప్ర‌య‌త్నాల‌ లో భాగం గా ఈ ప‌ని లో ఉన్నార‌ని నేను భావిస్తున్నాను. అంతే కాదు, మ‌న నీరు, మ‌న అడ‌వులు, మ‌న భూమి.. వీటన్నింటి ని ప్లాస్టిక్ ర‌హితం గా తీర్చిదిద్ద‌ుకోవడం అవ‌స‌రం. ఇందుకు మనం గ‌ట్టి కృషి ని చేయాలి. దేశం లో ప్ర‌తి ఒక్కరు ఇందుకు సంక‌ల్పం చెప్పుకొని దాని కి క‌ట్టుబ‌డి ఉండాలి.

మిత్రులారా,

నేను ముందుగానే చెప్పిన‌ట్టు, సెప్టెంబ‌ర్‌17వ తేదీ ని విశ్వ‌క‌ర్మ దినం గా జ‌రుపుకొంటాము. అలాగే సెప్టెంబ‌ర్ 17వ తేదీ న మ‌రొక ముఖ్య‌మైన రోజు కూడా ఉంది. స‌ర్ దార్ ప‌టేల్‌ సాహబ్ చ‌రిత్ర పుట‌ లో దాని కి ఎంతో ప్రత్యేక‌త ఉంది. అది భార‌త‌దేశ ఐక్య‌త‌ కు సంబంధించిన రోజు. 1948 వ సంవత్సరం సెప్టెంబ‌ర్ 17వ తేదీ చ‌రిత్ర‌ లో సువ‌ర్ణాక్ష‌రాల‌ తో లిఖించ‌బ‌డినటువంటి రోజు. ఆ రోజు ను హైద‌రాబాద్ విముక్తి దినం గా పాటిస్తారు. 1948వ సంవత్సరం సెప్టెంబ‌ర్ 17వ తేదీ న హైద‌రాబాద్‌ ను భారతదేశం లో విలీనం చేయ‌డం జ‌రిగింది. ఇవాళ హైద‌రాబాద్ దేశ ప్ర‌గ‌తి లో, అభివృద్ధి లో కీల‌క పాత్ర ను పోషిస్తోంది.

ఆలోచించండి.. స‌ర్ దార్ వ‌ల్ల‌భ్‌ భాయ్ దార్శ‌నిక‌త‌ తో వ్య‌వ‌హ‌రించ‌కుండా ఉంటే ఏమ‌య్యేదో. స‌ర్ దార్ వ‌ల్ల‌భ్ భాయ్‌ ప‌టేల్ ఈ ప‌ని ని సాధించ‌కుండా ఉంటే భార‌త‌దేశ చిత్ర‌ ప‌టం ఇప్పుడు ఎలా ఉండేదో ఊహించండి. అప్పుడు భార‌త‌దేశ స‌మ‌స్య‌ లు ఇంకా ఎక్కువ‌ గా ఉండేవి.

సోదరీమణులు మరియు సోద‌రులారా,

స‌ర్ దార్ వ‌ల్ల‌భ్‌ భాయ్‌ ప‌టేల్ స్వ‌ప్న‌ం అయినటువంటి ‘ఏక్‌ భార‌త్‌, శ్రేష్ఠ్ భార‌త్‌’ను సాకారం చేయ‌డాన్ని ఇవాళ భార‌త‌దేశం చూస్తున్న‌ది. స్వాతంత్ర్య సముపార్జన అనంత‌రం పూర్తి కాకుండా విడిచిపెట్ట‌బ‌డిన ల‌క్ష్యాల‌ ను పూర్తి చేసేందుకు ఇవాళ భార‌త‌దేశం ప్ర‌య‌త్నిస్తున్న‌ది.

జ‌మ్ము- కశ్మీర్‌, ల‌ద్దాఖ్ ప్ర‌జ‌లు గ‌త 70 సంవ‌త్స‌రాలు గా వివ‌క్ష కు గురి అయ్యారు. ఫ‌లితం గా హింస‌, అసంపూర్ణ ఆశ‌ లు, ఆకాంక్ష‌ల తోయావత్తు భార‌త‌దేశం ఇబ్బందులు ప‌డింది.

స‌ర్ దార్ వ‌ల్ల‌భ్‌ భాయ్‌ ప‌టేల్ స్ఫూర్తి తో భార‌త‌దేశం ఒక కీల‌క నిర్ణ‌యాన్ని తీసుకొన్నది. ద‌శాబ్దాల త‌ర‌బ‌డి ఉన్న స‌మ‌స్య‌ కు ప‌రిష్కారాన్ని సాధించేందుకు నూత‌న ప‌థం లో ముందుకు పోవాల‌ని నిర్ణ‌యించింది.
ల‌ద్దాఖ్ లోని, జ‌మ్ము- కశ్మీర్‌ లోని కార్గిల్‌ కు చెందిన ల‌క్ష‌లాది మంది మిత్రుల స‌హ‌కారం తో నూత‌న అభివృద్ధి ప‌థం లో ముందుకు సాగ‌ గ‌ల‌మ‌ని, ప్ర‌జ‌ల విశ్వాసాన్ని పొంద‌ గ‌ల‌మ‌ని భావిస్తున్నాను.

భార‌త‌దేశ ఐక్య‌త‌ కు, భార‌త‌దేశం అన్ని రంగాల‌ లో రాణించేలా చేయ‌డానికి ఈ మీ సేవ‌కుడు పూర్తి గా నిబ‌ద్ధుడై ఉన్నాడు. మేం గ‌త వంద రోజుల‌ లో ఈ చిత్త‌శుద్ధి ని బ‌లోపేతం చేశాము. గ‌డ‌చిన 100 రోజుల‌ లో ఒక దాని వెంట మరొక‌టి గా మేము ప్ర‌ధానమైన నిర్ణ‌యాల ను ఎన్నింటినో తీసుకొన్నాము. రైతు ల సంక్షేమాని కి సంబంధించిన ప‌రిష్కారాల ద‌గ్గ‌ర‌ నుండి మౌలిక స‌దుపాయాల క‌ల్ప‌న‌, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ కు సంబంధించి పలు చ‌ర్య‌ల ను తీసుకొన్నాము.

ఎన్నిక‌ల కాలం లో కూడా నేను మీకు చెప్పాను.. ఇప్పుడు కూడా ఇంకొక సారి చెప్తున్నాను. మ‌న కొత్త ప్ర‌భుత్వం ఇంత‌కు ముందు కన్నా వేగం గా ప‌ని చేస్తుంది. ఇంత‌కు ముందు కన్నా మ‌రింత పెద్దవైన ల‌క్ష్యాల‌ ను నెర‌వేరుస్తున్న‌ది.

స‌ర్ దార్‌ వ‌ల్ల‌భ్‌ భాయ్‌ ప‌టేల్ స్ఫూర్తి ని సాకారం చేస్తున్నందుకు మ‌రో సారి యావ‌త్తు గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌ ను నేను అభినందిస్తున్నాను. ఈ కార్య‌క్ర‌మం లో న‌న్ను భాగ‌స్వామి ని చేసినందుకు నా ధ‌న్య‌వాదాల ను తెలియజేస్తున్నాను. మీ అంద‌రి కి, గుజ‌రాత్ ప్ర‌జ‌ల‌ కు, దేశ ప్ర‌జ‌లంద‌రి కి, అలాగే ప్ర‌పంచ వ్యాప్తం గా త‌మ ఆశీస్సుల ను అందించిన వారు అంద‌రి కి ఈ న‌ర్మ‌ద న‌దీమ‌త‌ల్లి సాక్షి గా వంద‌నాలు స‌మ‌ర్పించుకొంటున్నాను. నేను శిర‌స్సు ను ను వంచి న‌ర్మ‌ద మాత‌ కు కృత‌జ్ఞ‌త‌లు తెలుపుకొంటున్నాను.

మరొక్క మారు మీ రెండు చేతు లను పైకెత్తి పట్టుకొని నా తో పాటు ప‌ల‌కండి ‘న‌ర్మ‌దే’ అని. ఈ నినాదం క‌చ్ఛ్ వ‌ర‌కు వినపడాలి.

‘న‌ర్మ‌దే.. న‌ర్మ‌దే.. న‌ర్మ‌దే..’

భార‌త్ మాతా కీ జయ్

భార‌త్ మాతా కీ జయ్.

అనేకానేక ధ‌న్య‌వాదాలు.

**