Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ దినోత్స‌వ కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


చార్ట‌ర్డ్ అకౌంటెంట్స్ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌మోదీ న్యూ ఢిల్లీ లో ఈ రోజు భారీ సందోహాన్ని ఉద్దేశించి ప్ర‌సంగించారు.

 

వ‌స్తువులు, సేవ‌ల ప‌న్ను (జిఎస్ టి) ప్ర‌వేశ‌పెట్టిన తొలి రోజు కూడా అయిన ఈ రోజున, దేశ‌వ్యాప్తంగా భిన్న ప్రాంతాల్లో ఒకేసారి ప్ర‌త్య‌క్షంగా వీక్షించిన వారిని ఉద్దేశించి మాట్లాడుతూ, చార్ట‌ర్డ్ అకౌంటెంట్లు దేశ ఆర్థిక స్వ‌స్థ‌త‌కు, స‌మాజ సంక్షేమానికి వైద్యులు అని ప్ర‌ధాన మంత్రి అభివర్ణించారు.  వారు ఆర్థిక ప్ర‌పంచానికి రుషులు, బోధ‌కులు అని కూడా ఆయన పోల్చారు. ఆర్థిక వ్య‌వ‌హారాల్లో ఉత్తమమైన నైపుణ్యాల‌ు కలిగినవారని ప్ర‌పంచ‌ వ్యాప్తంగా వారు పేరు ప్ర‌ఖ్యాతులు గ‌డించారని ఆయ‌న అన్నారు.

 

స‌మాజంలోని కొద్ది మంది అవినీతికి ఒడిగట్టడం మొదలుపెడితే దేశాభివృద్ధిపై తీవ్ర ప్రభావం పడుతుంద‌ని ఆవేద‌న వ్యక్తం చేస్తూ, ఎలాంటి వెనుక‌బాటు నుండైనా కోలుకోగ‌ల శ‌క్తి దేశానికి ఉంద‌ని ప్ర‌ధాన మంత్రి చెప్పారు.

 

అవినీతికి పాల్ప‌డుతున్న శక్తులను చ‌ట్టం చ‌ట్రంలో ఇరికించేందుకు, న‌ల్ల‌ధ‌నంపై పోరాడటానికి కేంద్ర‌ ప్ర‌భుత్వం గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా నోట్ల చట్టబద్ధత రద్దు తో స‌హా  తీసుకున్న ప‌లు చ‌ర్య‌ల‌ను గురించి ఆయ‌న ఈ సందర్భంగా గుర్తు చేశారు.

 

నోట్ల చట్టబద్ధత రద్దు అనంత‌రం సమాచార తనిఖీ పరిధి కిందకు మూడు ల‌క్ష‌ల వ‌ర‌కు కంపెనీల‌ు వచ్చాయని ప్ర‌ధాని చెప్పారు.  చ‌ట్టాల ఉల్లంఘ‌నకు పాల్పడినట్లు గుర్తించిన ల‌క్ష కంపెనీలను రిజిస్టర్ ఆఫ్ కంపెనీస్ నుండి తొలగించడం జరిగిందని ఆయ‌న వివ‌రించారు.  దేశప్రజల మేలు కోసం కేంద్ర‌ ప్ర‌భుత్వం సాహసోపేత‌ నిర్ణ‌యాలు తీసుకుంద‌ని ఆయ‌న పున‌రుద్ఘాటించారు.

 

చార్ట‌ర్డ్ అకౌంటెంట్లు ఆత్మావ‌లోక‌నం చేసుకుని అవినీతి విధానాల‌ను, అవినీతికి పాల్ప‌డే వారిని త‌మ స‌మాజం నుంచి దూరం చేయాల‌ని ప్ర‌ధాన మంత్రి పిలుపు ఇచ్చారు.  రిట‌ర్నులు దాఖ‌లు చేసే స‌మ‌యంలో ప్ర‌జ‌ల ఆదాయ ప్ర‌క‌ట‌న‌ల గ‌ణాంకాల‌ను ఉటంకిస్తూ, క్ల‌యింట్ల‌కు స‌ల‌హా ఇచ్చే స‌మ‌యంలో జాతి ప్ర‌యోజ‌నాలే ప్ర‌ధానంగా భావించాల‌ని ఆయ‌న చార్ట‌ర్డ్ అకౌంటెంట్ల‌కు సూచించారు.  ఎంద‌రో న్యాయ‌వాదులు, వృత్తి నిపుణులు స్వాతంత్రోద్య‌మంలో కీల‌కమైన పాత్రను పోషించిన సంగతిని ప్ర‌ధానమంత్రి గుర్తు చేస్తూ, చార్ట‌ర్డ్ అకౌంటెంట్లు కూడా వారి బాట‌లో ప‌య‌నించాల‌ని, జిఎస్ టితో స‌హా స‌రికొత్త స‌మీకృత ఆర్థిక  శ‌కంలో దేశం అడుగు పెడుతున్న ఈ స‌మ‌యంలో నిజాయ‌తీగా వ్య‌వ‌హ‌రించాల‌ని క్ల‌యింట్ల‌కు సూచించాల‌ని ఆయ‌న వారిని కోరారు.  చార్ట‌ర్డ్ అకౌంటెంట్ల స‌ర్టిఫికేష‌న్ ను జాతి యావ‌త్తు విశ్వ‌సిస్తుందంటూ ఆ న‌మ్మ‌కం, విశ్వాసం రెండూ వ‌మ్ము కాకుండా చూడాల‌ని ఆయ‌న ఉద్బోధించారు.  ప‌న్ను చెల్లింపుదారులు చెల్లిస్తున్న పన్ను ఏ ర‌కంగా స‌మాజ సంక్షేమంలో, దేశాభివృద్ధిలో కీలకపాత్రను పోషిస్తోందో ఆయ‌న వివరించారు.

 

భార‌త 75వ స్వాతంత్ర్య దినోత్స‌వ సంవ‌త్స‌రం 2022 నాటికి తాము సాధించాల్సిన  ల‌క్ష్యాలేమిటో సిద్ధం చేసుకోవాల‌ని చార్ట‌ర్డ్ అకౌంటెంట్ల‌కు ప్రధాన మంత్రి సూచించారు.   ప్ర‌పంచంలోని నాలుగు భారీ ఆడిటింగ్ సంస్థ‌ల గురించి ప్ర‌స్తావిస్తూ ఆ త‌రువాతి నాలుగు భారీ ఆడిటింగ్ సంస్థ‌ల ఏర్పాటుకు కృషి చేయాల్సిందిగా చార్ట‌ర్డ్ అకౌంటెంట్లను కోరారు.

 

చాణ‌క్యుని మాట‌ల‌ను ఉదాహరిస్తూ, ఈ అవ‌కాశాన్ని జార‌విడుచుకోవ‌ద్ద‌ని, జాతి నిర్మాణ స్ర‌వంతిలో భాగ‌స్వాములు కావాల‌ంటూ చార్ట‌ర్డ్ అకౌంటెంట్ల‌కు ప్ర‌ధాన మంత్రి పిలుపునిచ్చారు.

 

***