Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

చెర‌కు రైతుల తో సంభాషించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ 140 మందికి పైగా చెర‌కు రైతుల‌తో కూడిన ఒక బృందాన్ని న్యూ ఢిల్లీ లోని లోక్ క‌ళ్యాణ్ మార్గ్ లో ఈ రోజు క‌లుసుకొని, వారితో సంభాషించారు.

ఈ రైతులు ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌, ఉత్త‌రాఖండ్‌, పంజాబ్‌, మ‌హారాష్ట్ర మ‌రియు క‌ర్నాట‌క ల నుండి విచ్చేశారు.

2018-19 ఖ‌రీఫ్ సీజ‌న్ లో నోటిఫై చేసినటువంటి పంట‌ల‌కు వాటి ఉత్పాద‌క వ్య‌యం మీద 150 శాతం మేర‌కు క‌నీస మ‌ద్ద‌తు ధ‌ర ను అమ‌లు చేసేందుకు త్వ‌ర‌లో జ‌రుగ‌నున్న స‌మావేశంలో కేంద్ర మంత్రివ‌ర్గం ఆమోదం తెలుపుతుంద‌ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌క‌టించారు. ఈ చ‌ర్య రైతుల ఆదాయానికి ఒక గ‌ణ‌నీయ‌మైన వృద్ధి ని ఇవ్వ‌గలదు.

2018-19 శుగ‌ర్ సీజ‌న్ లో చెర‌కు కు న్యాయ‌మైన మ‌రియు గిట్టుబాటు ధ‌ర (ఎఫ్ఆర్‌పి)ని రాగ‌ల రెండు వారాల లోప‌ల ప్ర‌క‌టిస్తామ‌ని కూడా ఆయ‌న తెలిపారు. ఇది 2017-18 ధ‌ర క‌న్నా అధికంగా ఉంటుంద‌ని కూడా ఆయ‌న అన్నారు. ఇందులో చెర‌కు నుండి 9.5 శాతానికి మించిన రిక‌వ‌రీ ని సాధించే రైతుల‌కు ప్రోత్సాహ‌క రాశి ని సైతం ఇవ్వడం జరుగుతుంది.

చెర‌కు రైతుల బకాయిల‌ను తీర్చివేయ‌డం కోసం తీసుకొన్న వివిధ నిర్ణ‌యాలను గురించి రైతులకు ప్ర‌ధాన మంత్రి వెల్లడించారు. గ‌డ‌చిన వారం, ప‌ది రోజుల‌లో 4,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా బ‌కాయిల‌ను రైతుల‌కు చెల్లించడం జ‌రిగింది. ఇది ప్రభుత్వం ద్వారా అమలులోకి తీసుకువచ్చిన నూత‌న విధాన నియ‌మాల పర్యవసానమే. చెర‌కు రైతుల బ‌కాయిల‌ను చెల్లించేందుకు త‌గిన చ‌ర్య‌లు తీసుకోవాలని రాష్ట్ర ప్ర‌భుత్వాల‌ను అభ్య‌ర్ధించిన సంగ‌తి ని కూడా రైతులకు ప్రధాన మంత్రి వివ‌రించారు.

స్ప్రింక్ల‌ర్, ఇంకా డ్రిప్ ఇరిగేశన్, ఆధునిక సాగు మెల‌కువ‌లు, సౌర శ‌క్తితో న‌డిచే పంపుల‌ను ఉప‌యోగించాలంటూ రైతుల‌ను ప్ర‌ధాన మంత్రి ఉత్సాహపరిచారు. రైతులు వారి పొలాలలో శ‌క్తి వనరులను, ఇంకా అద‌న‌పు ఆదాయం కోసం సౌర ఫ‌ల‌కాల‌ను ఏర్పాటు చేసుకోవలసిందిగా ఆయన కోరారు. పంట‌ల‌కు విలువ‌ను జోడించేందుకు శ్ర‌ద్ధ తీసుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. వ్య‌వ‌సాయ క్షేత్ర వ్య‌ర్థాల‌ను స‌మంజ‌సంగా వినియోగించుకోవాలని, వాటిని పోష‌క వ‌న‌రుగాను, అద‌న‌పు ఆదాయ వ‌న‌రుగాను ఎంచాల‌ని కూడా ఆయ‌న విజ్ఞప్తి చేశారు. 2022 వ సంవ‌త్స‌రం క‌ల్లా ర‌సాయ‌నిక ఎరువుల వినియోగం లో 10 శాతం కోత ను సాధిస్తామన రైతులు లక్ష్యంగా నిర్దేశించుకోవాల‌ని ఆయ‌న చెప్పారు.

కార్పొరేట్ ప్రముఖులతో ఇటీవ‌ల తాను జ‌రిపిన మాటామంతీని గురించి ప్ర‌ధాన మంత్రి రైతుల‌కు వివ‌రించారు. రైతుల ఆదాయంలో పెంపుదలకు వీలుగా పంటలకు విలువ జోడింపు, గిడ్డంగులు, నిల్వ స‌దుపాయాల క‌ల్ప‌న‌, మెరుగైన నాణ్య‌త కలిగిన విత్త‌నాలు, ఇంకా మార్కెట్ లింకేజీ లు వంటి వాటి లో ప్రైవేటు రంగం మ‌రిన్ని పెట్టుబ‌డులు పెట్టాల‌ని తాను కోరానని ఆయ‌న తెలిపారు.

ప్ర‌ధాన మంత్రి తన సంభాషణ క్రమంలో, 2014-15 మ‌రియు 2015-16 సంవ‌త్స‌రాల‌లో 21,000 కోట్ల రూపాయ‌ల‌కు పైగా విలువైన బ‌కాయిల‌తో స‌తమ‌త‌మైన చెర‌కు రైతుల యొక్క భారాన్ని తగ్గించేందుకు కేంద్ర ప్ర‌భుత్వం చ‌ర్య‌లు చేప‌ట్టిన విష‌యాన్ని గుర్తు చేశారు. చెర‌కు మిల్లుల ద్వారా రైతుల‌కు ఈ చెల్లింపులు జ‌రిగే విధంగా ఏర్పాటు చేయడమైంది.

రైతులు ప్ర‌ధాన మంత్రి కి ధ‌న్య‌వాదాలు తెలిపారు. చెర‌కు పై దిగుమ‌తి సుంకాన్ని 50 శాతం నుండి 100 శాతానికి పెంచ‌డం, రైతుల‌కు చెల్లింపులు జ‌రిపేందుకు చక్కెర మిల్లుల‌కు ఒక్కొక్క క్వింటాలు కు 5.50 రూపాయ‌ల పెర్‌ఫార్మెన్స్ బేస్‌డ్‌ గ్రాంటు ను కల్పించడం (ఇది 1540 కోట్ల రూపాయల వరకు ఉంటుంది) స‌హా కేంద్ర ప్ర‌భుత్వం ఇటీవ‌ల కాలంలో చేప‌ట్టిన వివిధ చ‌ర్య‌లను వారు మెచ్చుకొన్నారు. రైతుల‌కు చెల్లింపులు జ‌రిపేందుకు గాను మిల్లుల యొక్క 30 లక్షల మెట్రిక్ టన్నుల మిగులు నిల్వ‌పై 1175 కోట్ల రూపాయ‌ల మేర‌కు ఇంటరెస్ట్ సబ్ వెన్శన్ రూపేణా మద్దతు ను ఇవ్వడానికి కేంద్ర ప్ర‌భుత్వం జోక్యం చేసుకోవడాన్ని కూడా రైతులు ప్ర‌స్తావించారు.

చ‌క్కెర ప‌రిశ్ర‌మ‌ లో స్థిర‌త్వాన్ని తీసుకురావడం కోసమని- ఒక దీర్ఘ‌కాలిక ప‌రిష్కార మార్గం రూపంలో- పెట్రోలు లో ఇథెనాల్ ను 10 శాతం వరకు క‌లప‌డం తాలూకు కేంద్ర ప్ర‌భుత్వపు దృష్టికోణాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి విపులీకరించారు.

***