పిఎంఇండియా
శ్రేష్ఠులైన
అధ్యక్షులు శ్రీ శీ జిన్పింగ్,
అధ్యక్షులు శ్రీ జాకబ్ జుమ,
అధ్యక్షులు శ్రీ మైఖేల్ టెమెర్,
అధ్యక్షులు శ్రీ వ్లాదిమీర్ పుతిన్,
ఈ శిఖర సమ్మేళనానికి సాదరంగా ఆహ్వానించినందుకు మరియు ఈ సమ్మేళనాన్ని ఉత్తమమైన రీతిలో నిర్వహిస్తున్నందుకుగాను అధ్యక్షుల వారు శ్రీ శీ కి తొలుత ధన్యవాదాలు తెలియజేస్తూ నా ఈ ప్రసంగాన్ని ప్రారంభిస్తున్నాను. మా మధ్య పరిమిత స్థాయి సమావేశం సందర్భంగా జరిగినప్పటి సంభాషణ ఫలప్రదంగా ముగిసింది. అది మా ఇరువురి దృష్టి కోణాలను, పరస్పర అవగాహనను సుసంపన్నం చేసింది. దశాబ్ద కాలానికి పైగా మనుగడ కొనసాగిస్తూ వచ్చిన బ్రిక్స్, సహకారానికి సంబంధించి ఓ బలమైన వేదికను నిర్మించింది. అనిశ్చితి వైపు మళ్లుతున్న ప్రపంచంలో పురోగతికి, స్థిరత్వానికి మనం పాటుపడుతున్నాం. వ్యాపారం, ఆర్థిక వ్యవహారాలు మన సహకారానికి పునాదులు వేయగా, మన కృషి సాంకేతిక విజ్ఞానం, సంస్కృతి, సంప్రదాయాలు, వ్యవసాయం, పర్యావరణం, శక్తి, క్రీడలు, ఇంకా ఐసిటి వంటి విభిన్నమైన రంగాలలో విస్తరిస్తోంది. బ్రిక్స్ దేశాలలో మౌలిక సదుపాయాలకు, సుస్థిర అభివృద్ధికి అవసరమైన వనరులను సమీకరించాలని ఇచ్చిన లక్ష్యాన్ని నెరవేర్చడంలో భాగంగా న్యూ డివెలప్మెంట్ బ్యాంక్ (ఎన్డిబి) రుణ వితరణను మొదలుపెట్టింది. అదే సమయంలో కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ పూర్తి స్థాయి లో పని చేసేందుకు తగిన చర్యలను మన కేంద్ర బ్యాంకులు చేపట్టాయి. ఈ మైలు రాళ్ళ మనం ఆధారంగా మనం పురోగతి పథంలో మరింత ముందుకు పయనించవలసివుంది. ఈ మన ప్రస్థానంలో మన దేశ ప్రజలను కేంద్ర బిందువుగా చేసుకోవడం ముఖ్యం. గతం సంవత్సరం నుండి మన మధ్య జరుగుతున్న సంభాషణలలో ప్రజలకు, ప్రజలకు మధ్య సంబంధాలను చైనా ప్రధానంగా ఎంచి వాటిని ముందుకు తీసుకుపోవడం గమనించి నేను సంతోషిస్తున్నాను. ఈ తరహా కలివిడితనం మన మధ్య సంబంధాలను పటిష్టపరచడమే గాక, మన అవగాహనను మరింత ప్రగాఢం చేస్తుంది కూడాను.
శ్రేష్ఠులారా,
పరివర్తన దిశగా భారతదేశం సాగిస్తున్న సుదూర యాత్ర మా ప్రజలకు గర్వకారణంగా ఉంది. పేదరికాన్ని నిర్మూలించడం కోసం; ప్రజలకు ఆరోగ్యం, పారిశుధ్య, నైపుణ్యాలు, ఆహార భద్రత, పురుషులకు మరియు మహిళలకు సమానావకాశాలు, శక్తి, విద్య, నవకల్పన అందించడం కోసం మేము ఉద్యమ స్థాయిలో పని చేస్తున్నాం. గంగా నది శుద్ధి, నవీకరణ యోగ్య శక్తి, ‘డిజిటల్ ఇండియా’, ‘స్మార్ట్ సిటీస్’, అందరికీ గృహ వసతి కల్పన మరియు ‘స్కిల్ ఇండియా’ల వంటి జాతీయ కార్యక్రమాలు శుద్ధమైన, హరిత మరియు సమ్మిళిత అభివృద్ధికి ప్రాతిపదికలుగా ఉంటున్నాయి. అంతేకాకుండా ఈ కార్యక్రమాలు మా దేశంలోని 800 మిలియన్ యువతీయువకులలో దాగి ఉన్న సృజనాత్మక శక్తిని వినియోగించుకొంటున్నాయి కూడా. మహిళా సాధికారిత ప్రధానంగా మేము చేపడుతున్న కార్యక్రమాలు ఉత్పాదకతను ఇంతలంతలు చేసేవే కాక జాతి నిర్మాణంలో మహిళలకు పెద్ద పీట వేస్తున్నాయి. నల్లధనానికి మరియు అవినీతికి వ్యతిరేకంగా మేము పోరాటాన్ని తీవ్రం చేశాము. ముందు ముందు మా దేశం లోని అనుభవాలను బ్రిక్స్ సభ్యత్వ దేశాలు ప్రాతిపదికగా చేసుకొని, ఇరు పక్షాలకు విజయాన్ని చేకూర్చే ఫలితాలను పొందడం కోసం భాగస్వామ్యాన్ని మరింత పెంపొందించుకొనేందుకు అవకాశం ఉంది. మన పరస్పర సహకారాన్ని మెరుగుపరచుకోవడం కోసం నాకు కొన్ని ఆలోచనలు స్ఫురిస్తున్నాయి. వాటిలో ఒకటోది.. బ్రిక్స్ రేటింగ్ ఏజెన్సీని ఏర్పాటు చేసేందుకు మనం సమష్టి ప్రయత్నాలను చేపట్టాలని కిందటి సంవత్సరంలో అనుకున్నాం. అప్పటి నుండి ఆ తరహా ఏజెన్సీ ఏర్పాటు యొక్క సాధ్యాసాధ్యాలను గురించి ఒక నిపుణుల బృందం అధ్యయనం చేస్తూ వస్తోంది. దీనికి సంబంధించి ఒక మార్గ సూచి ని వీలైనంత త్వరగా సిద్ధం చేయాలని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. రెండోది.. కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ కు, ఐఎమ్ఎఫ్ కు మధ్య సహకారాన్ని ప్రోత్సహించేందుకు మన కేంద్ర బ్యాంకులు వాటి వాటి సామర్ధ్యాలను ఇప్పటికన్నా ఎక్కువగా బలపరచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. మూడోది.. మన దేశాలు అభివృద్ధి చెందాలంటే తక్కువ వ్యయమయ్యే, ఆధార పడదగినటువంటి మరియు స్థిరత్వంతో కూడుకొన్నటువంటి శక్తి అండదండలు ఎంతో కీలకం. మనకు అందుబాటులో ఉన్న అన్ని రకాల వనరులను సద్వినియోగపరచుకోవడానికి గాను జల, వాయు పరివర్తనలకు తట్టుకోగలిగిన అభివృద్ధి చోటు చేసుకోవాలి. నవీకరణ యోగ్య శక్తి ఉత్పాదనకు చాలా ప్రాధాన్యాన్ని ఇవ్వవలసివుంది. ఈ విషయాన్ని భారతదేశం గ్రహించి, ఫ్రాన్స్తో కలిసి ఒక ప్రధానమైన అంతర్జాతీయ కార్యక్రమాన్ని 2015, నవంబర్ లో ఆరంభించింది. అదే.. ఇంటర్ నేషనల్ సోలార్ అలయన్స్ (ఐఎస్ఎ) ఏర్పాటు. ఇది సౌర శక్తిని ఇతోధికంగా వినియోగించడం ద్వారా పరస్పర ప్రయోజనాలు పొందేందుకు 121 దేశాల సంకీర్ణాన్ని ఏర్పరుస్తుంది. సౌర శక్తిని, నవీకరణయోగ్య శక్తిని వినియోగించుకోవడాన్ని పెంపొందించుకొనేందుకు కావలసిన పరస్పర పూరకమైన నైపుణ్యాలు మరియు బలాలు మన 5 దేశాల వద్ద ఉన్నాయి. ఈ విధమైన సహకారానికి తోడ్పాటును ఇవ్వడానికి ఐఎస్ఎ తో ఒక సమర్థమైన లంకెను ఎన్డిబి సైతం నెలకొల్పగలదు. కాలుష్య రహిత శక్తి మరీ ముఖ్యంగా సౌర శక్తి పథకాల అమలుకు ఎన్డిబి వద్ద నుండి మరిన్ని నిధులు సమకూరుతాయని నేను ఆశిస్తున్నాను. నాలుగోది.. మన దేశాలు పెద్ద సంఖ్యలో యువ జనాభాను కలిగివున్న దేశాలు. మనం ఉమ్మడిగా చేపట్టే కార్యక్రమాలలో మన యువతీ యువకులను సాధ్యమైనంత వరకు భాగస్వాములను చేసుకోవలసిన అవసరం ఉంది. నైపుణ్యాల అభివృద్ధిలో మరియు ఉత్తమమైన పద్ధతులను ఒక దేశానికి మరొక దేశం ఇచ్చి పుచ్చుకోవడంలో మరింత ఎక్కువగా సహకరించుకోవడం ఈ దిశగా మంచి ఫలితాలను అందించగలదు. ఐదోది.. గత ఏడాది గోవా శిఖర సమ్మేళనంలో- మన నగరాల మధ్య సహకారాన్ని పెంచి పోషించుకోవాలన్న సందర్భంలో- మనం స్మార్ట్ సిటీస్, పట్టణీకరణ మరియు విపత్తుల నిర్వహణలపై మన ఆలోచనలను ఒకరికి మరొకరం తెలియజెప్పుకొన్నాం. ఈ దారిలో మనం మరింత ముందుకు సాగవలసిన ఆవశ్యకత ఉంది. ఆరోది.. ప్రపంచంలో తదుపరి తరం వృద్ధికి, పరివర్తనకు పునాదులుగా నిలిచేవి సాంకేతిక విజ్ఞానం మరియు నవకల్పనలే. పేదరికం మరియు అవినీతి లతో పోరాడటం లోను, సాంకేతిక విజ్ఞానం, డిజిటల్ రిసోర్సెస్ శక్తిమంతమైన ఆయుధాలు అని భారతదేశం అర్థం చేసుకొంది. నవకల్పన ఇంకా డిజిటల్ ఎకానమీల విషయంలో బ్రిక్స్ సభ్యత్వ దేశాల మధ్య ఒక బలమైన భాగస్వామ్యం ఏర్పడితే అది వృద్ధికి జోరును అందించడంతో పాటు, పారదర్శకత్వాన్ని ప్రోత్సహించి సుస్థిరమైన అభివృద్ధి లక్ష్యాల సాధనకు మద్దతివ్వగలుగుతుంది. బ్రిక్స్ సభ్యత్వ దేశాల ఆధ్వర్యంలో ప్రైవేట్ రంగంలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తల ప్రమేయంతో ఒక సమన్వయ పూర్వకమైన ప్రయోగాత్మక పథకాన్ని తీసుకురావడాన్ని గురించి పరిశీలించండని నేను సూచిస్తున్నాను. ఆఖరుగా.. నైపుణ్యాలు, ఆరోగ్యం, అవస్థాపన, తయారీ మరియు అనుసంధాన రంగాలలో బ్రిక్స్కు మరియు ఆఫ్రికన్ దేశాలకు మధ్య మరింత శ్రద్ధతో కూడిన కెపాసిటీ బిల్డింగ్ ఎంగేజ్మెంట్ ఏర్పడేందుకు భుజం భుజం కలిపి పని చేయడానికి భారతదేశం సంతోషంగా ముందుకు వస్తుంది.
శ్రేష్ఠులారా,
బ్రిక్స్ ఆవిర్భావానికి మరియు అది సుస్థిరం కావడానికి మన దేశాలలో రెండు తరాలకు చెందిన నాయకులు గత పదేళ్ళలో వారి సేవలను అందించారు. మనం విశ్వసనీయతను సంపాదించుకొన్నాం; ప్రభావాన్ని ప్రసరింపజేస్తూ, వృద్ధికి ఊతాన్నిచ్చాం. ఇప్పడు ఈ తదుపరి దశాబ్దం ఎంతో కీలకమైంది. మనం సమృద్ధిని, సుస్థిరమైన అభివృద్ధిని, స్థిరత్వాన్ని ఆకాంక్షిస్తున్నాం. ఈ పరివర్తన వైపు పయనించడంలో బ్రిక్స్ సభ్యత్వ దేశాల నేతృత్వానిది ముఖ్య పాత్ర. ఆయా రంగాలలో అమలు చేయవలసిన కార్యక్రమాలను బ్రిక్స్ పక్షాన మనం నిర్దేశించగలిగితే, ప్రపంచం దీనిని తన సువర్ణ దశాబ్ధంగా చెప్పుకోగలుగుతుంది. ఈ విషయంలో మన అభిప్రాయాలు మరికొన్నింటిని రేపు వర్ధమాన విపణులతో మనం నిర్వహించబోయే సంప్రదింపుల సందర్భంగా మీకు నేను వివరిస్తాను. నూతన శిఖరాలను అధిరోహించడానికి మనం కలసి చేస్తున్న ప్రయాణంలో అది బ్రిక్స్ కు సహాయపడుతుందని నేను నమ్ముతున్నాను. మీకందరికీ ఇవే నా ధన్యవాదాలు.
***
Here are highlights on my intervention at the BRICS Summit plenary session. https://t.co/DRFUwh8WCk
— Narendra Modi (@narendramodi) September 4, 2017
Talked about furthering cooperation in key areas like agriculture, energy, environment, climate change, sports & culture.
— Narendra Modi (@narendramodi) September 4, 2017
Shared details about India’s continuous efforts to eradicate poverty, ensure better healthcare, food security, sanitation & education.
— Narendra Modi (@narendramodi) September 4, 2017