Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

జాతీయ పోలీసు స్మారకాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి; సుభాష్ చంద్రబోస్ పేరిట పురస్కారం ఏర్పాటు ప్రకటన

జాతీయ పోలీసు స్మారకాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి;
సుభాష్ చంద్రబోస్ పేరిట పురస్కారం ఏర్పాటు ప్రకటన

జాతీయ పోలీసు స్మారకాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి;
సుభాష్ చంద్రబోస్ పేరిట పురస్కారం ఏర్పాటు ప్రకటన

జాతీయ పోలీసు స్మారకాన్ని జాతికి అంకితం చేసిన ప్రధానమంత్రి;
సుభాష్ చంద్రబోస్ పేరిట పురస్కారం ఏర్పాటు ప్రకటన


నేడు పోలీసు సంస్మరణ దినం సందర్భంగా జాతీయ పోలీసు స్మారకాన్ని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ జాతికి అంకితం చేశారు. విపత్తు నిర్వహణ కార్యకలాపాల్లో విశేష అంకితభావం చూపే పోలీసు, అర్థసైనిక బలగాల (పారా మిలిటరీ) సిబ్బందిని సత్కరించే దిశగా నేతాజీ సుభాష్ చంద్రబోస్ పేరిట పురస్కారాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రకటించారు. ప్రకృతి విపత్తులు సంభవించినప్పుడు ప్రజల ప్రాణరక్షణకు వారు చూపే ధైర్యసాహసాలు ప్రాతిపదికగా ఏటా ఈ పురస్కారానికి అర్హులను ఎంపిక చేస్తారు. అంతకుముందు జాతీయ పోలీసు స్మారకంవద్ద శ్రీ నరేంద్ర మోదీ పుష్పగుచ్ఛం ఉంచి అమరవీరులకు శ్రద్ధాంజలి ఘటించారు. కొన్ని దశాబ్దాల కిందటి హాట్ స్ప్రింగ్స్ ఉదంతానికి ప్రత్యక్ష సాక్షులైన ఆనాటి ముగ్గురు సాహసులను సత్కరించారు. ఈ కార్యక్రమాల్లో భాగంగా జాతీయ పోలీసు స్మారక ప్రదర్శనశాలను ప్రారంభించి, అక్కడి సందర్శకుల పుస్తకంలో సంతకం చేశారు.

దేశమాత సేవలో ప్రాణాలర్పించిన పోలీసుల అసమాన ధైర్యసాహసాలు, త్యాగనిరతిని ప్రధానమంత్రి తన ప్రసంగంలో కొనియాడుతూ వారికి వందనం సమర్పించారు. ఆ మేరకు లద్దాఖ్‌లోని హాట్ స్ప్రింగ్స్ ప్రాంతంలో వీరోచితంగా పోరాడుతూ ఆత్మత్యాగం చేసిన పోలీసు సిబ్బంది ధైర్యసాహసాలను గుర్తుచేశారు. వారి కుటుంబాలకు, వారసులకు గౌరవాభివందనం చేశారు. జాతీయ పోలీసు స్మారకాన్ని జాతికి అంకితం చేయడంపై ప్రధానమంత్రి హర్షం వ్యక్తం చేశారు. ఈ స్మారకంలోని కేంద్రక భాగం శిల్పనిర్మాణ శైలి పోలీసు బలగాల సామర్థ్యం, ధైర్యం, సేవాతత్పరతలను ప్రతిబింబిస్తుందని ఆయన చెప్పారు. జాతీయ పోలీసు స్మారకంతో ముడిపడిన ప్రతి వస్తువూ పౌరులకు స్ఫూర్తినిస్తుందని, దీంతోపాటు పోలీసు, అర్థ సైనిక బలగాల ధైర్యసాహసాల గురించి వివరిస్తుందని పేర్కొన్నారు. సైనిక, అర్థసైనిక, పోలీసు బలగాల నిరంతర అప్రమత్తత, ఎనలేని త్యాగాలవల్లే జాతి యావత్తూ నేడు శాంతి, భద్రత, సౌభాగ్యాలను అనుభవించే అవకాశం లభించిందని స్పష్టం చేశారు. అదే సమయంలో దేశంలో ఎక్కడ విపత్తులు సంభవించినా జాతీయ, రాష్ట్రస్థాయి విపత్తు ప్రతిస్పందన బలగాలు అందిస్తున్న సేవలను, వారి త్యాగాలను కూడా ప్రధానమంత్రి గుర్తుచేశారు.

జాతీయ పోలీసు స్మారకం గురించి ప్రధానమంత్రి ప్రస్తావిస్తూ- ఈ స్మారకం నిర్మాణానికి ఎన్డీఏ ప్రభుత్వం అగ్ర ప్రాధాన్యమిచ్చి నిర్దేశిత వ్యవధిలోనే పూర్తి చేయగలిగిందని వివరించారు. జాతి నిర్మాణంలో కీలక పాత్ర పోషించినవారిని గౌరవించడంలో ప్రభుత్వ దార్శనికతను ఈ స్మారకం గుర్తుచేస్తున్నదని ఆయన పేర్కొన్నారు. ప్రస్తుత ప్రపంచంలో సాంకేతికతకుగల ప్రాధాన్యాన్ని వివరిస్తూ- పోలీసు బలగాలు తమ దైనందిన విధులలో ఆధునిక సాంకేతికతను, ఆవిష్కరణలను మేళవించాలని ప్రధానమంత్రి పిలుపునిచ్చారు. పోలీసు బలగాల ఆధునికీకరణ పథకం (MPF)గురించి ఈ సందర్భంగా ప్రధానమంత్రి ప్రస్తావించారు. దీనికింద ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని, సమాచార ఆదానప్రదాన వ్యవస్థలను, ఆధునిక ఆయుధాలను సమకూర్చడంద్వారా పోలీసు బలగాల ఆధునికీకరణ లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తున్నదని చెప్పారు.

పోలీసులు-సమాజం మధ్య అనుబంధం బలోపేతం కావడంలో పోలీసు బలగాలు ప్రధాన పాత్ర పోషించాల్సి ఉందని ప్రధానమంత్రి స్పష్టం చేశారు. ఈ దిశగా పోలీసు స్టేషన్లను పౌరసన్నిహితం చేయాలని పోలీసు బలగాలకు సూచించారు. జాతీయ పోలీసు స్మారకం కేంద్రక శిల్ప నిర్మాణంతోపాటు పరాక్రమ కుడ్యం (గోడ) తదితరాలతో కూడి ఉంటుందని తెలిపారు. విధి నిర్వహణలో ప్రాణాలు పణంగా పెట్టిన సాహసుల పేర్లు ఈ గోడపై చిరకాలం నిలుస్తాయని చెప్పారు. అత్యంత ఆధునిక పరిజ్ఞానంతో ఏర్పాటైన ప్రదర్శనశాలను అమరులైన పోలీసు సిబ్బందికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు.

***