Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ఝార్ ఖండ్ లోని రాంచీ లో ఆయుష్మాన్ భార‌త్ – పిఎంజెఎవై ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఝార్ ఖండ్ లోని రాంచీ లో ఆయుష్మాన్ భార‌త్ – పిఎంజెఎవై  ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఝార్ ఖండ్ లోని రాంచీ లో ఆయుష్మాన్ భార‌త్ – పిఎంజెఎవై  ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం

ఝార్ ఖండ్ లోని రాంచీ లో ఆయుష్మాన్ భార‌త్ – పిఎంజెఎవై  ప్రారంభోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగం


ఝార్ ఖండ్ గ‌వ‌ర్న‌ర్ శ్రీమ‌తి ద్రౌప‌ది ముర్ము గారు, ఉత్సాహవంతుడు మరియు లోకప్రియ ముఖ్య‌మంత్రి శ్రీ ర‌ఘుబర్ దాస్, నా మంత్రిమండ‌లి స‌హ‌చ‌రుడు శ్రీ జ‌గ‌త్ ప్ర‌సాద్ న‌డ్డా గారు, నా మంత్రిమండ‌లి స‌హ‌చ‌రుడు, భూమి పుత్రుడు శ్రీ సుద‌ర్శ‌న్ భ‌ర‌త్ గారు, కేంద్ర ప్ర‌భుత్వం లో నా స‌హ‌చ‌రుడు శ్రీ జ‌యంత్ సిన్హా గారు, నీతి ఆయోగ్ స‌భ్యుడు డాక్ట‌ర్ వి.కె.పాల్, రాష్ట్ర ప్ర‌భుత్వం లో మంత్రి శ్రీ రామ‌చంద్ర చంద్ర‌వంశీ గారు, పార్ల‌మెంట్ లో నా స‌హ‌చ‌రుడు శ్రీ రాం త‌హ‌ల్ చౌధరీ గారు, శాసనసభ్యుడు శ్రీ రాం కుమార్ ప‌హ‌న్ గారు, ఇక్కడకు విచ్చేసినటువంటి మననీయులందరు మరియు పెద్ద సంఖ్య లో ఇక్కడకు తరలివచ్చిన ఝార్ ఖండ్ కు చెందిన నా ప్రియతమ సోద‌రీమణులు, సోద‌రులారా,

మిత్రులారా,

ఈ రోజు న మ‌నం అంద‌రం ఒక ప్ర‌త్యేక‌మైన సంద‌ర్భానికి సాక్షులుగా వున్నాం. ఇది భ‌విష్య‌త్తు లో మాన‌వాళి కి ఎంతో గొప్ప సేవ‌లను అందించేదిగా నిరూపణ కానుంది. ఈ రోజున నేను ఇక్క‌డ‌కు వ‌చ్చింది ఝార్ ఖండ్ అభివృద్ధి కి దోహ‌దం చేయ‌డానికే కాదు, మ‌న రుషులు క‌న్న‌ పురాత‌న క‌ల‌లను నెర‌వేర్చ‌డానికి కూడా. అంతే కాదు భార‌త‌దేశం లోని ప్ర‌తి కుటుంబం స్వప్నాన్ని సాకారం చేయడానికి వ‌చ్చాను. ‘స‌ర్వే భ‌వంతు సుఖిన‌: స‌ర్వే సంతు నిరామ‌య‌:’. యుగాల నాటి ఈ సంకల్పాన్ని ఈ శ‌తాబ్దం లో మనం నెర‌వేర్చవలసి వుంది. మరి మనం దీనికి ఒక విలువైనటువంటి ఆరంభాన్ని ఇస్తున్నాం.

బిర్సా ముండా గారు పుట్టిన గడ్డ ఇది. ఈ నేల మీద పేద‌ల‌ కు నాణ్య‌మైన వైద్య సౌక‌ర్యాల‌ ను, చికిత్స‌ ను అందించ‌డానికి వేస్తున్న ప్ర‌ధాన‌మైన అడుగు ఇది.

ఈ రోజు న యావత్తు దేశం రాంచీ ని గ‌మ‌నిస్తోంది. దేశం లోని 4 వంద‌ల జిల్లాల్లో ఇటువంటి కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది. అక్క‌డ‌ నుంచి ప్ర‌తి ఒక్క‌రు రాంచీ లో ఏర్పాటు చేసిన ఈ ఘ‌న‌మైన కార్య‌క్ర‌మాన్ని చూస్తున్నారు. ఆ త‌రువాత వారంతా ఈ కార్య‌క్ర‌మాన్ని త‌మ త‌మ జిల్లాల్లో ముందుకు తీసుకుపోతారు.

ఇక్క‌డ రెండు వైద్య క‌ళాశాల‌ల్ని ప్రారంభించే అవ‌కాశం ఈ రోజున నాకు ల‌భించింది. స్వాతంత్ర్యం వ‌చ్చిన త‌రువాత ఇక్క‌డ‌ ఈ డెబ్భయి సంవత్సరాలలో 350 మంది విద్యార్థుల‌ కోసం 3 వైద్య క‌ళాశాల‌లు మాత్ర‌మే వుండేవ‌ని, అయితే ఈ నాలుగు సంవత్సరాలలో 12 వంద‌ల మంది విద్యార్థుల కోసం 8 వైద్య క‌ళాశాల‌లు ఏర్పాటు చేసుకున్నామ‌ని మ‌న ముఖ్య‌మంత్రి నాకు చెప్పారు. ఈ నాలుగేళ్ల‌ లో క‌ని విని ఎరుగ‌ని రీతి లో భారీ స్థాయి లో ప‌నులు జ‌రిగాయ‌న‌డానికి ఇంత‌కంటే మంచి ఉదాహ‌ర‌ణ మ‌రొక‌టి వుండ‌ద‌ని అనుకుంటున్నాను.

సోదరీమణులు మరియు సోదరులారా,

ఆయుష్మాన్ భార‌త్ తీర్మానం మేర‌కు ప్రారంభ‌మైన ప్ర‌ధాన మంత్రి జ‌న ఆరోగ్య యోజ‌న‌ (పిఎంజెఎవై) ని ఈ రోజు నుంచి అమ‌లు లోకి తీసుకు వస్తున్నాం. దీని ని గురించి తెలిసిన‌ వారు అంద‌రూ వారి ఊహ‌ల‌ కు అనుగుణంగా దీని కి పేరు పెడుతున్నారు. కొంత‌ మంది దీన్ని ‘మోదీ కేర్’ అంటున్నారు. మ‌రి కొంద‌రు దీనిని పేద‌ల‌కు అనుకూల‌మైన ప‌థ‌కం అంటున్నారు. ప్ర‌జ‌లు దీనిని త‌లో ర‌కం గా పిలుచుకుంటున్నారు. కానీ నాకు మాత్రం ఇది మ‌న దేశ పేద ప్ర‌జ‌ల‌కు సేవ చేయ‌డానికి ల‌భించిన ఉన్న‌త‌ అవ‌కాశం. పేద‌ల‌కు సేవ చేయ‌డానికి ఇంత‌కంటే గొప్ప ప‌థ‌కం గాని, కార్య‌క్ర‌మం గాని మ‌రొక‌టి వుంటుంద‌ని నేను అనుకోవ‌డం లేదు.

ఇది ప్ర‌పంచం లోకెల్లా అతి పెద్ద కార్య‌క్ర‌మం. అర్హులైన‌ వారంద‌రికీ ఒక్కొక్క‌రికి 5 ల‌క్ష‌ల రూపాయ‌ల విలువైన ఆరోగ్య సేవ‌లు ల‌భిస్తాయి. దీని ద్వారా దేశంలోని 50 కోట్ల కు పైగా సోదరీమ‌ణులు మరియు సోదరులు లబ్ధి ని పొందుతారు. ఇంత భారీ ప్రభుత్వ ప‌థ‌కం ప్రపంచం లో మ‌రే దేశం లో అమ‌లు కావ‌డం లేదు.

ఈ ప‌థకం ద్వారా ప్ర‌యోజ‌నం పొందే ల‌బ్ధిదారుల సంఖ్య‌ ను చెప్ప‌డం ఇప్పుడు క‌ష్టం. యూరోపియ‌న్ యూనియ‌న్ లోని 27- 28 దేశాల జ‌నాభా ఎంత ఉంటుందో అంత మంది ఆయుష్మాన్ భారత్ ల‌బ్ధిదారులు అయి ఉంటారు.

అమెరికా, కెన‌డా, మెక్సికో ల మొత్తం జ‌నాభా ఎంత ఉంటుందో అంత మంది ‘ఆయుష్మాన్ భారత్’ కార్య‌క్ర‌మం ద్వారా ఆరోగ్య సేవ‌ల‌ను పొందుతారు.

ప్ర‌పంచం లోనే ఆదర‌ణ ఎక్కువ‌గా వున్న ఆరోగ్య ప‌త్రిక ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కాన్ని ప్ర‌శంస‌లతో ముంచెత్తుతోంద‌ని మ‌న ఆరోగ్య‌ శాఖ మంత్రి న‌డ్డా గారు అంటున్నారు. ఆ ప‌త్రిక ఈ ప‌థ‌కాన్ని ఒక గేమ్ చేంజ‌ర్ లాంటి విశిష్ట ప‌థ‌క‌ం అంటూ ప్ర‌శంసించింది.

ఈ విష‌యం లో నేను ఒక‌టి న‌మ్ముతున్నాను.. స‌మీప భ‌విష్య‌త్తు లో వైద్య‌ రంగం లో సంబంధం వున్న వారు, లేదా ఆరోగ్య రంగ ప‌థ‌కాల గురించి ఆలోచించే వారు, ఆర్ధిక‌శాస్త్రం లేదా ఆధునిక చికిత్స‌ ప‌ద్ధ‌తుల‌ తో అనుబంధం వున్న‌ వారు, లేదా సామాన్య ప్రజల జీవితాల్లో పరివర్తన ను గురించి ఆలోచించే సామాజిక వేత్త‌లు, వైద్య శాస్త్రవేత్తలు, ఆర్థికవేత్తలు ఆయుష్మాన్ భార‌త్ ప‌థ‌కం తీరు లోనే ఆలోచ‌న‌లు చేస్తారు; అధ్య‌య‌నాలు చేస్తారు. అంతే కాదు స‌మీప భ‌విష్య‌త్తు లో గాని, ఆ త‌రువాత గాని దీని మీద ఆధార‌ప‌డి ప్ర‌పంచానికి కావలసిన భావి న‌మూనాల‌ను రూపొందిస్తారు.

ఈ ప్రణాళిక కు ఓ ఆకృతి ని ఇవ్వడానికి జట్టు గా పనిచేసిన నా స్నేహితులందరూ సాధించిన ఫ‌లితం త‌క్కువ‌దేమీ కాదు.. దీనిని ప్ర‌క‌టించిన‌ప్ప‌టి నుంచి అమ‌లు చేసేంత‌వ‌ర‌కూ కేవ‌లం 6 నెల‌ల వ్య‌వ‌ధి లో ఇంత గొప్ప ప‌ని ని అమలు లోకి తెచ్చారు. సుప‌రిపాల‌న ను గురించి మాట్లాడే వారు ఒక విష‌యాన్ని గ్ర‌హించాలి. ఒక జ‌ట్టు గా ఏర్ప‌డిన తరువాత ఒక దార్శ‌నిక‌త‌ తో ప‌ని చేస్తూ మార్గ సూచీ ని త‌యారు చేసుకొని నిర్ణీత కాల‌ం లో ప‌ని చేసి 13 వేల ఆసుప‌త్రుల‌ను, 50 కోట్ల మందికి సంధానించ‌డం.. అది కూడా 6 నెల‌ల్లోనే .. చాలా గొప్ప విష‌యం.

కాబ‌ట్టే 125 కోట్ల మంది భార‌తీయుల ముందు బ‌హిరంగం గానే నా మొత్తం బృందాన్ని హృద‌య‌పూర్వ‌కంగా అభినందిస్తున్నాను. ఈ జ‌ట్టు ఇక ముందు మ‌రింత ఉత్సాహంగా, అంకిత‌భావం తో ప‌ని చేస్తుంద‌ని న‌మ్ముతున్నాను. ఎందుకంటే గ‌తంలో ప్ర‌ధాన మంత్రులు వీరి ని వేధించే వారు. ఇప్పుడు వీరికి 50 కోట్ల మంది పేద ప్ర‌జ‌ల ఆశీస్సు లు ల‌భిస్తున్నాయి. 50 కోట్ల మంది పేద ప్ర‌జ‌ల ఆశీస్సుల‌తో గ్రామాల్లోని ఎఎస్ హెచ్ ఎ (‘ఆశా’) ఉద్యోగులు సైతం ఉల్లాసంగా ప‌ని చేస్తూ ఈ ప‌థ‌కాన్ని విజ‌య‌వంతం చేస్తార‌ని భావిస్తున్నాను.

మిత్రులారా,

ఆరోగ్య భ‌ద్ర‌త‌ ను క‌ల్పించే ఈ ప‌థ‌కాన్ని పేద‌ల‌కు అంకితం చేస్తూనే ఈ ప‌థ‌కం విజ‌యం సాధించాల‌ని భ‌గ‌వానుని ప్రార్థిస్తున్నాను. ఈ ప‌థ‌కం అంద‌రికీ మంచిదే. కానీ ఒక ఆసుప‌త్రి ప్రారంభం రోజు న ఇది రోగుల‌ తో పూర్తిగా నిండిపోవాల‌ని కోరుకుంటామా ? ఆ విధంగా ఎవ‌రూ కోరుకోరు. ఏ ఆసుప‌త్రి ప్రారంభానికి వెళ్లినా నేను అక్క‌డ కోరుకునేది ఏమిటంటే ఆ ఆసుప‌త్రి ఎప్ప‌టికీ ఖాళీగా వుండాల‌నే.

ఈ రోజున ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మాన్ని ప్రారంభిస్తూ నా దేశం లోని ఏ పేద‌వాడూ అనారోగ్యం పాలై ఆసుప‌త్రి కి వెళ్లి ఈ ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకోవాల‌ని నేను కోరుకోవ‌డంలేదు. అలాంటి దుర‌దృష్ట‌క‌ర ప‌రిస్థితులు ఎవ‌రికీ రాకూడ‌దు. అలాగే అంద‌రికీ ఆయురారోగ్యాలను ఇవ్వాల‌ంటూ దైవాన్ని ప్రార్థిస్తాను. ఎవ‌రికైనా అనుకోని ప‌రిస్థితుల్లో అనారోగ్యం వ‌స్తేనే అటువంటి వారికి ఆరోగ్య భ‌ద్ర‌త ను ఇవ్వ‌డానికి ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది.

దుర‌దృష్టం కొద్దీ ప్ర‌మాద‌క‌ర‌మైన రోగాల వ‌ల‌యం మ‌న జీవితం లోకి ప్ర‌వేశించినప్పుడు, దేశం లో ధ‌న‌వంతులు ఆరోగ్య సేవ‌ల‌ను పొందిన‌ట్టుగానే నా దేశం లోని పేద‌వారు కూడా అలాంటి సేవ‌ల‌నే పొంద‌డానికి ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది.

సోదరీమణులు మరియు సోదరులారా,

ఈ ప‌థ‌కాన్ని ఈ రోజు నుంచే అమ‌లు చేస్తున్నాం. ఏది ఏమైన‌ప్ప‌టికీ ఇది అతి పెద్ద కార్య‌క్ర‌మం కావ‌డం తో ముందుగా ప్ర‌యోగాత్మ‌కంగా దీనిని ఇప్ప‌టికే కొన్ని చోట్ల అమ‌లు చేసి చూశాం. వివిధ జిల్లాల్లో అమ‌లు చేసి.. సాంకేతిక‌త‌, ‘ఆరోగ్య మిత్ర‌’ లు స‌క్ర‌మంగా ప‌ని చేస్తున్నదీ లేనిదీ ప‌రిశీలించాం. ఇప్ప‌టికే ఉన్న ఆసుప‌త్రులను మార్చాలా లేక ఆధునీక‌రించాలా అనేది తెలుసుకోవ‌డానికి ప్ర‌యోగాత్మ‌క ప‌రిశీల‌న చేశాం. ఏ ఉద్దేశం తో ఈ ప‌థ‌కాన్ని ప్రారంభించామో ఆ ఉద్దేశం నెర‌వేరి ప్ర‌జ‌ల‌కు ఆరోగ్య హ‌క్కు క‌లుగుతుంద‌ని నేను న‌మ్ముతున్నాను. ఇది ఆరోగ్య భ‌ద్ర‌త సేవ‌ల రంగాన్ని మ‌రింత బ‌లోపేతం చేస్తుంది.

మిత్రులారా,

ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం తో మ‌రో ప్ర‌త్యేక సంద‌ర్భం కూడా ముడిప‌డి వుంది. బాబా సాహెబ్ ఆంబేడ్ కర్ జ‌యంతి సంద‌ర్భంగా ఏప్రిల్ 14వ తేదీ న ఛ‌త్తీస్ గ‌ఢ్ అడ‌వుల్లో ఈ ప‌థ‌కం మొద‌టి ద‌శ‌ ను, ఆరోగ్య కేంద్రాన్ని ప్రారంభించాను. రెండో ద‌శ‌ ను ప్రారంభిస్తున్న ఈ రోజు న.. మ‌రో రెండు రోజుల్లో వ‌చ్చే దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్ గారి జ‌యంతి రోజు న అంటే 25 సెప్టెంబ‌ర్ ను దృష్టి లో పెట్టుకొని నిర్ణ‌యించ‌డం జ‌రిగింది. అంతే కాదు ఈ రోజు జాతీయ క‌వి దినక‌ర్ జ‌యంతి కూడా ను. ఆయ‌న పేరు ను తలుచుకుంటే చాలు, ప్ర‌తి ఒక్క‌రి ని మేలుకొలిపిన క‌విత్వం జ్ఞ‌ప్తి కి వచ్చి దేదీప్య‌మాన‌మైన అనుభూతి క‌లుగుతుంది.

కాబ‌ట్టి ఈ రోజున మ‌నం ఈ ప‌థ‌కాన్ని దేశానికి అంకితం చేస్తున్నాం. వివ‌క్ష‌ను పార‌ద్రోల‌డానికి జీవితాంతం అవిశ్రాంత పోరాటం చేసిన మ‌హానుభావుల ఆశీర్వాదాల‌తో ఈ ప‌ని ని చేస్తున్నాం. ప్ర‌జ‌లు గ‌ర్వం గా త‌ల ఎత్తుకొని జీవించాల‌ని వారు త‌మ జీవితాంతం కృషి చేశారు.

అంద‌రికీ ఉన్న‌త ప్ర‌మాణాల వైద్యం ల‌భించాల‌నే ల‌క్ష్యం తో ఈ ప‌థ‌కాన్ని దేశాని కి అంకితం ఇవ్వ‌డం జ‌రుగుతోంది. ఉన్న‌త ఆరోగ్య సేవ‌లు కొంద‌రికి మాత్ర‌మే ప‌రిమితం కాకూడ‌దు.

సోదరీమణులు మరియు సోదరులారా,

దేశం లోని ఆరోగ్య రంగాన్ని ప‌రిశీలిస్తే ఒక వ్య‌క్తి చికిత్స కోసం 100 రూపాయ‌లు ఖ‌ర్చు చేస్తే ఆ ఖ‌ర్చు లో 60 రూపాయ‌లు ఆ వ్య‌క్తి కుటుంబం గాని, లేదా ఆ వ్య‌క్తి గాని భ‌రించవలసి వుంటుంది. వారి పొదుపు డ‌బ్బు వైద్యాని కి ఖ‌ర్చ‌యిపోతుంది. ఏదో ఒక రోగం కార‌ణం గా త‌మ ఆదాయం లోని అధిక‌ భాగం వైద్య ఖ‌ర్చుల‌ కోసం వెచ్చించడం వ‌ల్ల ప్ర‌తి ఏడాది ల‌క్ష‌లాది కుటుంబాలు తిరిగి పేద‌రికం లోకి కూరుకుపోయే దు:స్థితి దాపురిస్తోంది. ఈ దు:స్థితి ని తొల‌గించే బాధ్య‌త‌ ను మేం స్వీక‌రించాం.

సోదరీమణులు మరియు సోదరులారా,

దేశానికి స్వాతంత్ర్యంవ‌చ్చిన‌ప్ప‌టినుంచీ మ‌నం గ‌రీబీ హ‌ఠావో నినాదాన్ని వింటూనే వ‌చ్చాం. గ‌త 30,40, 50 సంవ‌త్స‌రాలుగా పేద ప్ర‌జ‌ల‌ ను మోసం చేస్తున్న‌ వారు పేద‌ల పేరు మీద మురికి రాజ‌కీయాల‌ ను చేయ‌డం ఆపివేసి పేద‌ల సాధికారిత‌ కోసం కృషి చేసి వుంటే భార‌త‌దేశం ఈ ప‌రిస్థితుల్లో వుండేది కాదు. పేద‌ల‌కు సంబంధించి వారి లో త‌ప్పుడు అభిప్రాయం వుండేది. పేద‌లు నిత్యం ఏదో ఒక‌టి డిమాండ్ చేస్తూనే వుంటార‌ని వారు త‌ల‌పోశారు. పేద‌ల‌ కు ఉచితంగా వ‌స్తువుల‌ను ఇస్తే స‌రిపోతుంద‌ని వారు ఆలోచించారు. ఇది వారు చేసిన ప్రాథమిక‌మైన త‌ప్పు. పేద‌ల‌కు ఆత్మాభిమానం ఉంటుంద‌ని, గౌర‌వ మ‌ర్యాద‌లు ఉంటాయ‌ని వారు ఏనాడూ భావించ‌లేదు.

నేను పేద‌రికం లో జీవించాను. నాకు తెలుసు.. నిరుపేద‌ల ఆత్మాభిమానం, గౌర‌వ‌మ‌ర్యాద‌లు ఎలా వుంటాయో. ఈ ఆత్మాభిమాన భావాలు అనేవి పేద‌రికాన్ని పార‌ద్రోల‌డానికి కావలసిన శ‌క్తి ని ఇస్తాయి. పేద‌ల‌కు ఉన్న ఆత్మాభిమాన భావాల‌ను అర్థం చేసుకోవ‌డానికి గ‌తంలో ఎలాంటి ప్ర‌య‌త్నం జ‌ర‌గ‌లేదు. త‌మ క‌ల‌లను పండించుకోవ‌డానికి ఏం చేయాలో చెప్తూ పేద‌వాళ్లు వెలిబుచ్చే ఆకాంక్ష‌లను మ‌న నేత‌లు అర్థం చేసుకోలేక‌పోయారు. అందుకే ప్రతి ఎన్నిక‌ల‌కు ముందు రాజ‌కీయం గా ల‌బ్ధి ని పొంద‌డానికిగాను పేద‌ల‌కు భిక్షం వేసే రాజ‌కీయాల్లో మునిగి తేలారు. ఈ మోసాన్ని ప్ర‌తిసారి అనుస‌రించారు.

దీనికి మరో వైపు, మేం సమ‌స్య‌కు ఉన్న మూల‌ కార‌ణాన్ని గుర్తించాం. పేద‌రికాన్ని తొల‌గించ‌డానికి ప్ర‌స్తుతం మ‌న దేశం చాలా వేగంగా అడుగులు వేస్తోంది. ఈ మ‌ధ్య‌నే ఒక అంత‌ర్జాతీయ సంస్థ ఇచ్చిన నివేదిక ఇదే విష‌యాన్ని స్ప‌ష్టం చేస్తోంది. గ‌త 2-3 సంవ‌త్స‌రాల్లో భారతదేశం లో 5 కోట్ల కుటుంబాలు పేద‌రికాన్నుంచి బయట‌ప‌డ్డాయ‌ని ఆ నివేదిక‌లో పేర్కొంది.

సోదరీమణులు మరియు సోదరులారా,

పేద‌ల‌కు సాధికారితను కల్పించడం పైన మేం దృష్టి పెట్ట‌డంవ‌ల్ల‌నే ఇది సాధ్య‌మైంది. ఒక పేద వ్య‌క్తి కి నివ‌సించ‌డానికి ఇల్లు ల‌భించిందంటే అత‌ని ఆలోచ‌న‌ల్లో మార్పు వ‌స్తుంది. ఒక పేద త‌ల్లి కి గ్యాస్ క‌నెక్ష‌న్ ల‌భించిందంటే ఆమె లో ఆత్మ‌విశ్వాసం తొణిక‌స‌లాడుతుంది. అంద‌రి తో సమాన‌ం అనే భావ‌న ఆమెలో క‌లుగుతుంది.

త‌మ‌కంటూ ఒక బ్యాంకు ఖాతా ఉందంటే పేద‌వాళ్లు గౌర‌వ‌ప్ర‌దంగా భావిస్తారు. అంతే కాదు ఆ ఖాతా లో డ‌బ్బు దాచుకోవాల‌ని నిర్ణ‌యిస్తారు. టీకాలు పూర్తయితే పేద‌వాళ్లు సాధికారిత వైపు అడుగులు వేస్తారు. అంతే కాదు పోష‌ణ్ మిశన్ ద్వారా ప్ర‌యోజ‌నాలను పొందుతారు.

ఈ మ‌ధ్య‌నే ముగిసిన ఆసియా క్రీడ‌లను మీరు చూసే వుంటారు. ఆసియా క్రీడ‌ల్లో విజేత‌లు ఎవ‌ర‌నుకుంటున్నారు? బంగారు ప‌త‌కాలు సాధించింది ఎవ‌రు? భార‌త‌దేశానికి కీర్తి ప్ర‌తిష్ట‌లు తెచ్చిన క్రీడాకారులు ఎవ‌రు? ఈ ఆసియా క్రీడల్లో విజ‌యాలు సాధించిన క్రీడాకారుల్లో ఎక్కువ‌ మంది చిన్న గ్రామాల‌ నుంచి, పేద కుటుంబాల నుంచి వ‌చ్చిన‌ వారే. వారు త‌మ చిన్న‌ప్పుడు పౌష్టికాహార లోపం తో ఇబ్బందులు ప‌డ్డారు. కానీ అవ‌కాశం రాగానే వారు త‌మ స‌త్తా ను చాటి దేశానికి కీర్తి ప్ర‌తిష్ట‌లు సంపాదించిపెట్టారు.

పేద‌ల‌కు ఆ శ‌క్తి ఉంది. దానిని మ‌నం గుర్తించాలి. అందుకే మా ప‌థ‌కాల‌న్నింటినీ పేద‌ల సాధికారిత‌ కోసం రూపొందించాం. మ‌న దేశం లో మ‌రొక మార్పు క‌నిపిస్తోంది. గ‌తం లో వోటు బ్యాంకు రాజ‌కీయాల‌ను ఆధారం చేసుకొని చ‌ట్టాలను తయారు చేశారు. వ‌ర్గాన్ని, మ‌తాన్ని, ప్రాంతాల‌ను దృష్టిలో పెట్టుకొని రాజ‌కీయంగా ల‌బ్ధి ని పొంద‌డమే ప‌ర‌మావ‌ధి గా వాటి ని రూపొందించుకున్నారు. ఎన్నిక‌ల్లో గెల‌వ‌డానికి సాయం చేసేటట్టు వాటి ని త‌యారు చేసుకున్నారు. వాటి వ‌ల్ల కొంత మేర‌కు ప్రాంతీయ అభివృద్ధి, సామాజిక మార్పు ఉండేది. ఆయా వ‌ర్గాల ఆందోళ‌న‌ ను తొల‌గించ‌డానికి అవి ప‌నికొచ్చేవి. అంతే కాదు ప్ర‌భుత్వ నిధుల‌ను ఉప‌యోగించి స‌మాజాన్ని బ‌లోపేతం చేసే బదులు రాజ‌కీయ పక్షాల‌ను బ‌లోపేతం చేశారు. ప్ర‌భుత్వ ఖ‌జానా ను అడ్డు అదుపు లేకుండా దోచేశారు.

మేం ఆ మార్గాన్ని అనుస‌రించ‌డం లేదు. ఇక ముందు మ‌న దేశం లో ఆ విధానం ఉండ‌కూడ‌దని మేం కోరుకుంటున్నాం. మేం చెప్తున్న విధానం ‘స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్‌’. ఆయుష్మాన్ భారత్ ప‌థ‌కం ఏదో ఒక వ‌ర్గాన్ని, ఒక కులాన్ని, ఒక మ‌తాన్ని లేదా వ‌ర్గ వివ‌క్ష‌ను ఆధారం చేసుకొని రూపొందించిన ప‌థ‌కం కాదు. ‘స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్’ అనే విధానం కుల, మ‌త‌, ప్రాంత, వ‌ర్గ వివ‌క్ష‌ల‌ను చూడ‌దు. మీరు నాస్తికులా, ఆస్తికులా అని చూడ‌దు. ఒక వ్య‌క్తి వెళ్తున్న‌ది గుడి కా, మ‌సీదు కా, చ‌ర్చి కా, గురుద్వారా కా అనేది అప్ర‌స్తుతం. ఆయుష్మాన్ భార‌త్ ద్వారా ప్ర‌తి ఒక్క‌రు ప్రయోజనాన్ని పొందుతారు. ఇదే ‘స‌బ్ కా సాథ్, స‌బ్ కా వికాస్‌’.

మిత్రులారా,

ఆయుష్మాన్ భార‌త్ చాలా పెద్ద ప‌థ‌కం. దీని ద్వారా 13 వంద‌ల‌కు పైగా వ్యాధుల‌ కు చికిత్స ల‌భిస్తుంది. కేన్స‌ర్‌, హృద్రోగం, మూత్రపిండ వ్యాధి, కాలేయ వ్యాధి, మ‌ధుమేహం మొద‌లైన వ్యాధుల‌కు చికిత్సను ఈ ప‌థ‌కం ద్వారా పొంద‌వ‌చ్చును. 1300 వ్యాధుల‌ కు చికిత్స‌ ప్ర‌భుత్వ ఆసుప‌త్రుల్లోనే కాదు, ప్రైవేటు ఆసుప‌త్రుల్లో కూడా ల‌భిస్తుంది.

ఆసుప‌త్రి లో చేర‌డానికి ముందు పరీక్షల కోసం, మందుల కోసం చేసిన వ్య‌యాన్ని కూడా ఆసుప‌త్రి లో చేరి పొందే చికిత్స‌ తో పాటు దాదాపు 5 ల‌క్ష‌ల రూపాయ‌ల‌ దాకా ప్ర‌భుత్వ‌మే చెల్లిస్తుంది. ఎవ‌రైనా ఇప్ప‌టికే అనారోగ్యం తో ఉంటే ఈ ప‌థ‌కాన్ని ఉప‌యోగించుకొని త‌న మందులకు ఖర్చు పెట్టుకోవ‌చ్చు.

పైపెచ్చు, ఇప్ప‌టికే చేసిన స‌క్ర‌మ‌మైన ఏర్పాట్ల కార‌ణం గా దేశ‌వ్యాప్తం గా గ‌ల ఈ ప‌థ‌కం ల‌బ్ధిదారులు ఈ ప‌థ‌కం ప్ర‌యోజ‌నాల‌న్నింటిని ఉప‌యోగించుకోవ‌చ్చు. మేం అన్ని ర‌కాల ఏర్పాట్ల‌ ను చేశాం. కాబ‌ట్టి మీరు చికిత్స కోసం ఒక‌ చోటు నుంచి మ‌రో చోటు కు ప‌రుగెత్తవాలసిన అవ‌స‌రం లేదు. సాంకేతిక‌త ద్వారా అన్ని ప‌నులను పూర్తి చేయ‌డానికి వీలుగా సకల జాగ్ర‌త్త‌లు తీసుకున్నాం. ఈ ప‌థ‌కం ల‌బ్ధిదారులలో ఎవ‌రైనా స‌రే దీని అవ‌స‌ర‌ం ఉన్న‌ వారు త‌ప్ప‌కుండా ఉప‌యోగించుకునేలా ప్ర‌య‌త్నాలు చేస్తున్నాం.

ఈ ప‌థ‌కం కోసం మీరు మీ పేరు ను నమోదు చేసుకోవలసిన అవ‌స‌రం లేదు. మీకు ఇ- కార్డు (E-card) ఉంటే చాలు. మీకు సంబంధించిన స‌మాచార‌ం అంతా ఇ- కార్డు లోనే ఉంటుంది. ప‌త్రాల త‌నిఖీ పేరు తో మిమ్మ‌ల్ని ఇబ్బంది పెట్ట‌డం ఉండ‌దు.

అంతే కాదు, మీరంద‌రూ ఈ టెలిఫోన్ నంబ‌రు ను గుర్తు పెట్టుకోవాలి. అన్ని పేద కుటుంబాల‌ కు నేను ఈ విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.. ఈ ఒక్క టెలిఫోన్ నంబ‌రు ను మీరు గుర్తు పెట్టుకోండి.. ఇది 14555. ఈ నంబరు కు ఫోన్ చేసి మీ పేరు, మీ కుటుంబ స‌భ్యుల పేరులు ఈ ప‌థ‌కం లో వున్నాయో లేవో తెలుసుకోండి. అంతే కాదు, మీకు ల‌భించే సౌక‌ర్యాల ను గురించి కూడా తెలుసుకోవ‌చ్చు. మీకు ద‌గ్గ‌ర‌ లో అందుబాటు లో ఉండే ఉమ్మ‌డి సేవ కేంద్రాన్ని (కామన్ సర్వీస్ సెంటర్) గురించి తెలుసుకోవ‌చ్చు. ఈ రోజు న దేశం లో 3 ల‌క్ష‌ల ఉమ్మ‌డి సేవా కేంద్రాలు ఉన్నాయి. ఉమ్మ‌డి సేవా కేంద్రాన్ని చేరుకోవ‌డానికి ఎవ‌రైనా స‌రే 2-3 కిలోమీట‌ర్ల‌ క‌న్నా ఎక్కువ దూరం ప్ర‌యాణం చేయవలసిన అవ‌స‌రం లేదు. మీరు ఈ కేంద్రాల‌కు వెళ్లి స‌మాచారం తెలుసుకోవ‌చ్చు.

మిత్రులారా,

అంతే కాదు ఈ సౌక‌ర్యాల‌ తో పాటు మీకు సాయం చేయ‌డానికి మ‌రో రెండు స‌హాయ వ్య‌వ‌స్థ‌లు ఉన్నాయి. మీ గ్రామానికి చెందిన ఆషా, ఎఎన్ ఎమ్ సోద‌రీమ‌ణులు మొద‌టి వ్య‌వస్థ‌ అయితే.. రెండో వ్య‌వ‌స్థ‌ కు చెందిన వారు ప్ర‌ధాన మంత్రి ఆరోగ్య మిత్ర‌ లు. ఈ ఆరోగ్య మిత్ర‌ లు ప్ర‌తి ఆసుప‌త్రిలో మీకు సేవ‌లను అందించ‌గ‌ల‌రు. వీరి స‌హాయాన్ని తీసుకొని మీరు ఈ ప‌థ‌కం లోని ప్ర‌యోజ‌నాల‌న్నింటినీ పొంద‌గ‌ల‌రు. ఆసుప‌త్రి లో చేర‌క‌ ముందు నుంచి చికిత్స త‌రువాత అయ్యే ఖ‌ర్చుల‌ వ‌ర‌కు మీకు అన్ని విధాలా ఆర్ధిక సహాయం ల‌భించేలా చూస్తారు. ఆరోగ్య మిత్ర‌ లు ఈ దేశాన్ని ఆరోగ్య‌వంతంగా త‌యారు చేయ‌డానికి అంకిత‌మైన విభాగం. వారు మీకు స‌రైన స‌మాచారాన్ని అందిస్తారు.

మిత్రులారా,

ఒకే దేశం, ఒకే చికిత్స అనే భావ‌న‌ ను నిజమైన అర్థంలో బ‌లోపేతం చేసే కార్య‌క్ర‌మం ఆయుష్మాన్ భార‌త్. ఈ ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం లో చేరిన‌ రాష్ట్రానికి చెందిన ప్ర‌జ‌లు ఏవైనా కార‌ణాల‌ రీత్యా వేరే రాష్ట్రం లో ఉన్న‌ప్పుడు ఏదైనా అత్య‌వ‌స‌ర ప‌రిస్థితి త‌లెత్తితే ఆ వేరే రాష్ట్రం లో చికిత్స తీసుకోవ‌చ్చు.

ఇంత‌వ‌ర‌కు 13వేల ఆసుప‌త్రులు ఈ కార్య‌క్ర‌మం లో చేరాయి. స‌మీప భ‌విష్య‌త్తు లో మ‌రికొన్ని ఆసుప‌త్రులు ఇందులో చేరుతాయి. అంతే కాదు చ‌క్క‌టి సేవ‌లను అందించే ఆసుప‌త్రులు, ముఖ్యంగా గ్రామీణ ప్రాంత ఆసుప‌త్రులకు ప్ర‌భుత్వం నుంచి ప్రోత్సాహ‌క బ‌హుమతులు కూడా ఉంటాయి.

సోదరీమణులు మరియు సోదరులారా,

ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం ఉద్దేశం ఆర్థిక సహాయాన్ని అందించ‌డం మాత్ర‌మే కాదు. మీ ఇంటికి ద‌గ్గ‌ర‌ లోనే ఉత్త‌మ చికిత్స సౌక‌ర్యాల‌ను అందించగ‌లిగే వ్య‌వ‌స్థ‌ ను అభివృద్ధి చేయ‌డం కూడా ఈ కార్య‌క్ర‌మం ఉద్దేశం.

మిత్రులారా,

ఈ రోజున 10 వెల్ నెస్ సెంటర్ లను ప్రారంభించ‌డం జ‌రిగింది. వీటితో క‌లుపుకొని ఝార్ ఖండ్ లో ఇటువంటి కేంద్రాలు 40 ఉన్నాయి. దేశ‌ వ్యాప్తం గా ఇటువంటి కేంద్రాలు 2000 – 2500 వ‌ర‌కు వున్నాయి. రాబోయే నాలుగు సంవ‌త్స‌రాల్లో 1.5 ల‌క్ష‌ల‌ వెల్ నెస్ సెంటర్ లను ఏర్పాటు చేసుకోవాల‌ని ఒక ల‌క్ష్యాన్ని పెట్టుకున్నాం.

సోదరీమణులు మరియు సోదరులారా,

ఆయుష్మాన్ భార‌త్ కార్య‌క్ర‌మం లో వెల్ నెస్ సెంటర్ లు ప్ర‌ధాన‌మైన‌వి. సాధార‌ణ వ్యాధుల‌కు ఇక్క‌డ చికిత్స ల‌భిస్తుంది. మందులు అందుబాటులో ఉంటాయి. అంతే కాదు ఇక్క‌డ అనేక ఉచిత ప‌రీక్ష‌లను నిర్వ‌హించ‌డానికి సౌక‌ర్యాలు ఉంటాయి. వీటి ద్వారా ప్ర‌మాద‌క‌ర జ‌బ్బుల‌ను ముందే ప‌సిగ‌ట్ట‌డం జ‌రుగుతుంది.

మిత్రులారా,

ఈ ప‌థ‌కం ముక్క‌లు ముక్కలు గా కాకుండా స‌మ్ర‌గంగా ఉండేలా మా ప్ర‌భుత్వం ప‌ని చేస్తోంది. ప్ర‌తి నిర్ణ‌యం, ప్ర‌తి చ‌ట్టం ఒక‌దాని తో మ‌రొక‌టి అనుసంధాన‌మై ఉంటుంది. అంద‌రికీ అందుబాటు లో ఆరోగ్య భ‌ద్ర‌త‌, నివార‌ణ‌ప‌ర‌మైన ఆరోగ్య భ‌ద్ర‌త ఈ రెండింటి పైనా మా ప్ర‌భుత్వం దృష్టిపెట్టింది. యోగా, స్వ‌చ్ఛ్ భార‌త్ ఉద్య‌మం, బ‌హిరంగ మ‌ల విస‌ర్జ‌న ర‌హిత గ్రామాలు మొద‌లైన కార్య‌క్ర‌మాల ద్వారా ప్ర‌మాదక‌ర వ్యాధుల‌ను నిర్మాలించ‌డానికి మా ప్ర‌భుత్వం కృషి చేస్తోంది. స్వ‌చ్ఛ్ భార‌త్ ఉద్య‌మం కార‌ణం గానే దేశంలో 3 ల‌క్ష‌ల మంది చిన్నారుల జీవితాల‌ను కాపాడ‌గ‌లిగే స్థాయి కి మ‌నం చేరుకున్నామ‌ని ఈ మ‌ధ్య‌నే వ‌చ్చిన నివేదిక‌ ను మీరు చ‌దివే ఉంటారు. ఈ గ‌ణాంకాలు అప్పుడే పుట్టిన శిశువుల‌కు గాని లేదా గ‌ర్భిణీల‌కు సంబంధించిన‌వి గాని అయి ఉండ‌వ‌చ్చు.. ఏమైతేనేం దేశాన్ని ఆరోగ్య భార‌త్ గా త‌యారు చేయ‌డానికి మ‌నం ముందుకు అడుగులు వేస్తున్నాం.

ప్ర‌భుత్వం పోష‌ణ్ మిశన్ వంటి ప‌థ‌కాల‌ను ఆరంభించింది. ఇటువంటి కార్య‌క్ర‌మాల‌ ద్వారా పిల్ల‌ల శ‌రీరం ఎదుగుతున్న క్ర‌మంలో వారు పోషకాహార లేమి బారి న ప‌డ‌కుండా చూడ‌వ‌చ్చు. అదే స‌మ‌యం లో ఆరోగ్య‌ రంగం లో మాన‌వ‌ వ‌న‌రుల‌ను పెంచ‌డానికి అవిశ్రాంత కృషి ని కొన‌సాగిస్తున్నాం. ఒక అంచ‌నా ప్ర‌కారం రాబోయే 3 సంవ‌త్స‌రాల్లో ఆయుష్మాన్ భార‌త్ కార‌ణం గా దేశం లో 2500 ఉన్న‌త నాణ్య‌త‌ గ‌ల ఆధునిక ఆసుప‌త్రులు అందుబాటు లోకి వ‌స్తాయి. వీటిని రెండో అంచె, మూడో అంచె న‌గ‌రాల లోను, చిన్న చిన్న ప‌ట్ట‌ణాల లోను ప్రారంభించ‌డం జ‌రుగుతుంది. దీని ఫ‌లితంగా ఉపాధి అవ‌కాశాలు పెరుగుతాయి. మ‌ధ్యత‌ర‌గ‌తి కుటుంబాల వారికి నూత‌న ఉద్యోగాలు ల‌భిస్తాయి.

అంతే కాదు సాంకేతిక నిపుణులు, కాల్ సెంట‌ర్ ఉద్యోగాలు, నిర్వ‌హ‌ణ‌, మందుల ఉత్ప‌త్తి, ప‌రిక‌రాల త‌యారీ, వైద్య సేవ‌లు ఇలా ప‌లు రూపాలలో ఉద్యోగ అవ‌కాశాలు పెరుగుతాయి. శిక్ష‌ణ పొందిన వైద్యుల‌కు, పారా మెడిక‌ల్ సిబ్బంది కి భారీ గా డిమాండ్ పెరుగుతుంది. అదే స‌మ‌యం లో వైద్య‌ రంగానికి సంబంధించిన స్టార్ట్- అప్ కంపెనీ ల‌కు నూత‌న అవ‌కాశాలు ల‌భిస్తాయి. వైద్యులు, న‌ర్సులు, ఆసుప‌త్రి నిర్వ‌హ‌ణ‌ కు సంబంధించిన సిబ్బంది మొద‌లైన‌ ల‌క్ష‌లాది మందికి ఈ కార్య‌క్ర‌మం లో భాగ‌స్వామ్యం పొందే అవ‌కాశం ల‌భిస్తుంది. కాబ‌ట్టి దేశం లో మ‌ధ్య‌త‌ర‌గ‌తి, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల‌ కోసం మ‌హ‌త్త‌ర‌మైన అవ‌కాశం ఎదురు చూస్తోంది.

దేశంలో ఒకటో అంచె, రెండో అంచె న‌గ‌రాల లోను, ప‌ట్ట‌ణాల్లోను, గ్రామాల్లోను ఆరోగ్య‌ రంగ మౌలిక స‌దుపాయాల‌ ను బ‌లోపేతం చేయ‌డానికిగాను ప్ర‌భుత్వం అవిశ్రాంతంగా కృషి చేస్తోంది. దేశ‌ వ్యాప్తంగా గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో 14 నూతన‌ ఎఐఐఎంఎస్ ల‌ను నెల‌కొల్ప‌డానికిగాను ఆమోదం ఇవ్వ‌డం జ‌రిగింది. ప్ర‌ధాన మంత్రి స్వ‌ాస్థ్య సుర‌క్ష యోజ‌న లో భాగంగా ప్ర‌తి రాష్ట్రంలో ఒక ఎఐఐఎంఎస్ ను ఏర్పాటు చేయ‌డానికిగాను ప్ర‌య‌త్నాలు ప్రారంభ‌మ‌య్యాయి. అలాగే దేశ‌మంతటా 82 నూత‌న ప్ర‌భుత్వ వైద్య క‌ళాశాల‌లను నిర్మిస్తున్నాం. ప్ర‌తి మూడు లేదా నాలుగు పార్ల‌మెంటు నియోజ‌క‌వ‌ర్గాల‌కుగాను ఒక వైద్య క‌ళాశాల ఉండేటట్టు ప్ర‌భుత్వం ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకుంటోంది.

ఈ ప‌ని లో భాగంగా ఈ రోజున రెండు వైద్య క‌ళాశాల‌ల నిర్మాణానికిగాను పునాది రాయి ని వేయ‌డం జ‌రిగింది. 600 కోట్ల‌ రూపాయలకు పైగా ఖ‌ర్చు పెట్టి వీటి ని నిర్మించ‌డం జ‌రుగుతుంది. కొడెర్మా మరియు, చాయ్ బాసా ద‌గ్గ‌ర నిర్మించే ఈ వైద్య క‌ళాశాల‌ల‌కు అనుబంధంగా 400 ప‌డ‌క‌ల ఆసుప్ర‌తిని నిర్మించ‌డం జ‌రుగుతుంది.

సోదరీమణులు మరియు సోదరులారా,

గ‌త నాలుగు సంవ‌త్స‌రాల్లో దేశం లోని వైద్య క‌ళాశాల‌ల్లో కొత్త‌గా 25 వేల పూర్వ స్నాతక, స్నాతకోత్తర సీట్ల‌ ను చేర్చ‌డం జ‌రిగింది. రాబోయే నాలుగైదు సంవ‌త్స‌రాల్లో ఒక ల‌క్ష మంది వైద్యులు కొత్త‌గా త‌యార‌య్యేలా మా ప్ర‌భుత్వం ల‌క్ష్యం గా పెట్టుకొని సామ‌ర్థ్యాన్ని పెంచుతోంది. భ‌విష్య‌త్తు ను దృష్టిలో పెట్టుకొని మౌలిక స‌దుపాయాల‌ క‌ల్ప‌న‌ కు, మాన‌వ‌ వ‌న‌రుల త‌యారీ కి ప్రాధాన్య‌ాన్ని ఇస్తున్నాం.

మిత్రులారా,

దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ్ గారు చెప్తుండే వారు.. ‘విద్య‌ వలెనే వైద్యం మీద పెట్టే ఖ‌ర్చు కూడా పెట్టుబ‌డి వంటిదే’ అని. దేశం, స‌మాజం అభివృద్ధి చెందాలంటే ఉత్త‌మ నాణ్య‌త‌ గ‌ల విద్య‌, నైపుణ్యాలు ఉండాలి. అదే విధంగా దేశానికి సాధికారిత ఉండాలంటే ఆరోగ్య‌క‌ర‌మైన పౌరులు ఉండాలి.

మిత్రులారా,

ఈ ప‌థ‌కం తో భాగ‌స్వామ్యం ఉన్న‌ వారంద‌రి స‌హాయ స‌హ‌కారాల‌తో మ‌నం విజ‌యాన్ని సాధిస్తామ‌నే న‌మ్మ‌కం నాకు ఉంది. ఆరోగ్య మిత్ర‌ లు, ఆశా వ‌ర్క‌ర్ లు, ఎఎన్ ఎం సోద‌రీమ‌ణులు, వైద్యులు, న‌ర్సులు, కార్మికులు, సేవ‌లను అందించే వారు మొద‌లైన అంద‌రి సాయం తో మనం ఈ ప‌థ‌కాన్ని సఫలం చేసుకొని, ఆరోగ్య‌వంత‌మైన జాతి ని నిర్మించుకోగలం. న్యూ ఇండియా ఆరోగ్య‌వంతంగాను, సాధికారిత‌ తోను రూపొంది మీరంతా ఆరోగ్యంగా ఉండాలి.

ఈ ఆకాంక్ష‌ తో ఈ ప్ర‌ధాన మంత్రి జ‌న్ ఆరోగ్య యోజ‌న‌ ను రాంచీ గ‌డ్డ మీద‌ నుంచి, భ‌గ‌వాన్ బిర్సా ముండా నేల మీద‌ నుంచి 125 కోట్ల మంది భార‌తీయుల‌కు అంకితం చేస్తున్నాను.

అనేకానేక ధన్యవాదాలు.

భార‌త్ మాతా కీ జయ్,

భార‌త్ మాతా కీ జయ్,

భార‌త్ మాతా కీ జయ్

నేను ఆయుష్మాన్ అంటాను; మీరు భార‌త్ అనండి.

ఆయుష్మాన్ – భార‌త్‌,

ఆయుష్మాన్ – భార‌త్‌,

ఆయుష్మాన్ – భార‌త్‌,

ఆయుష్మాన్ – భార‌త్‌,

ఆయుష్మాన్ – భార‌త్‌.

మీకు బహుథా ధన్యవాదాలు.