Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

‘‘ట్రాన్స్‌ఫార్మింగ్ అర్బ‌న్ ల్యాండ్ స్కేప్’’ అంశంపై ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌లోని లఖ్ నవూ లో జ‌రిగిన కార్య‌క్ర‌మంలో ప్ర‌ధాన మంత్రి శ్రీ‌ న‌రేంద్ర మోదీ ప్ర‌సంగం


దేశం లోని వివిధ ప్రాంతాల‌ నుండి విచ్చేసిన సోద‌ర‌, సోద‌రీమ‌ణులారా,

అన్నింటి కంటే ముందు, ఉత్త‌ర్ ప్ర‌దేశ్ కు చెందిన పార్ల‌మెంట్ స‌భ్యుడిగా ఉన్న నేను మీ అంద‌రికీ ఇక్క‌డ సాదర స్వాగ‌తం ప‌లుకుతున్నాను.  ఈ చరిత్రాత్మక న‌గ‌రం యొక్క ల‌ఖ‌న‌వీ పారంపరిక రీతి ఆతిథ్యాన్ని అందుకొని మీరు ఆనందించి వుంటారని నేను నమ్ముతున్నాను.  మిత్రులారా, ఒక బృందం గా ఈ మార్పుల‌న్నింటినీ ఆమోదించి వాటిని క్షేత్ర‌ స్థాయి లో అమ‌లు చేశారు.  మీరు ఒక న‌గ‌రానికి మేయ‌ర్ కావ‌చ్చు లేదా క‌మిష‌న‌ర్ లేదా సిఇఒ కావ‌చ్చు.  మీరు న‌వ‌ త‌రం, న‌వ‌ భార‌తం, న‌వ‌ శ‌కం ఆశ‌లకు ఆకాంక్ష‌ల‌కు ప్ర‌తిబింబంగా నిలచిన భార‌తీయ న‌గ‌రాల‌కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్నారు.  మీరు గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా కోట్లాది మంది భార‌తీయ‌ల క‌ల‌ల‌ను పండించడానికి మాతో భుజం భుజం కలిపి ప‌నిచేస్తున్నారు.  

కొద్దిసేప‌టి క్రితమే ఇక్క‌డ ఏర్పాటు చేసిన‌ ప్రదర్శనను సంద‌ర్శించే అవ‌కాశం నాకు లభించింది.  దేశ‌ వ్యాప్తంగా అమ‌లవుతున్న వివిధ ప్రాజెక్టులను గురించి నాకు తెలియజేశారు.  కొన్ని న‌గ‌రాలు స్మార్ట్ సిటీ మిశన్ లో భాగంగా అద్భుతంగా ప‌నిచేస్తున్నాయి. వాటికి పుర‌స్కారాలూ ల‌భించాయి.  దీనికి తోడు, కొంద‌రు సోద‌రులకు, సోద‌రీమ‌ణులకు, కుమార్తెల‌కు వారి కొత్త ఇంటి తాళాల‌ను అంద‌జేయ‌డం జ‌రిగింది.  ఆ తాళాలను అందుకొనే స‌మ‌యం లో వారి ముఖాల‌లో క‌నిపించిన కాంతి, ఉజ్వ‌ల భ‌విష్య‌త్తు కు సంబంధించి వారిలో క‌నిపించిన ఆశ.. ఇవ‌న్నీ మా అంద‌రికీ ఒక గొప్ప ప్రేర‌ణ‌ గా నిలుస్తాయి. 

నేను వేదిక‌ మీదకు రావ‌డానికి ముందుగా ప‌లువురు ల‌బ్ధిదారుల‌తో మాట్లాడే అవ‌కాశం నాకు చిక్కిం.  గృహ‌ వ‌స‌తి లేని వారి జీవితాలలో, నిరుపేద‌ల జీవితాల‌లో మార్పును తీసుకు వ‌చ్చే అవ‌కాశం రావ‌డం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది.
 రివార్డు అందుకున్న న‌గ‌రాల‌కు, కొత్త ఇళ్లు పొందిన పౌరులకు, కుటుంబాల‌కు నేను అభినంద‌న‌లను, శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తున్నాను.  ఈ సంద‌ర్భంగా మీరు ఒక అంశాన్ని గ‌మ‌నించి వుంటారు, నేను అవార్డులను అంద‌జేస్తున్న‌ప్పుడు వాటిని 
స్వీకరించడానికి వచ్చిన‌ వారిలో ఇద్ద‌రు మేయ‌ర్లు మాత్ర‌మే పురుషులు; మిగిలిన వారంతా మ‌హిళ‌లు.  మ‌న సోద‌రీమ‌ణులు ఈ ల‌క్ష్యాన్ని ఎంత గొప్ప సంక‌ల్ప‌ బ‌లంతో సాధించారో చూడండి.  వారంద‌రినీ ఒకసారి గ‌ట్టి చ‌ప్ప‌ట్ల‌ తో 
అభినందించండి.

మిత్రులారా,

ఇళ్లు లేని నిరుపేద‌ల‌కు ప‌క్కా గృహాలను క‌ల్పించే మిశన్ కావ‌చ్చు, 100 స్మార్ట్ సిటీల ల‌క్ష్యం కావ‌చ్చు, లేదా 500 అమృత్ సిటీల మిశన్ కావ‌చ్చు..  కార్య‌క్ర‌మం ఏ దైనా  కోట్లాది మంది ప్ర‌జ‌ల జీవితాల‌ను సుల‌భ‌త‌రం, సౌక‌ర్య‌వంతం, సుర‌క్షితం 
చేయ‌డ‌మ‌నే మా సంక‌ల్పం మాత్రం  గ‌త మూడు సంవ‌త్స‌రాలుగా మ‌రింత దృఢ‌తరమౌతోంది.  ఇవాళ కూడా ఉత్త‌ర ప్ర‌దేశ్‌ లోని ప‌లు న‌గ‌రాల‌ను స్మార్ట్ సిటీలు గా మార్చేందుకు సంబంధించిన ప‌లు కార్య‌క్ర‌మాల శంకుస్థాప‌న‌ లు ఇక్క‌డ‌ చేశాం.  స్మార్ట్ సిటీ మిశన్ లో భాగంగా దేశ‌వ్యాప్తంగా ఇప్ప‌టికే 7,000 కోట్ల రూపాయ‌ల విలువ‌ గ‌ల ప‌నులు పూర్తి అయ్యాయ‌ని, మ‌రో 52,000 కోట్ల రూపాయ‌ల విలువైన ప‌నులు శ‌ర‌వేగంతో సాగుతున్నాయ‌ని నాకు చెప్పారు.

ఈ మిశన్ ప్ర‌ధానోద్దేశ్యం న‌గ‌రాల‌లోని పేద‌లు, దిగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారు, మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌ల జీవితాలను సుల‌భ‌త‌రం చేయ‌డం.  అలాగే వారికి మెరుగైన పౌర స‌దుపాయాలను క‌ల్పించ‌డం.  న‌గ‌రానికి సంబంధించిన అన్ని వ్య‌వ‌స్థ‌ల‌ను నిర్వ‌హించ‌డానికి స్మార్ట్ సిటీ ల‌లో స‌మీకృత ఉమ్మ‌డి కేంద్రాల‌ను ఏర్పాటు చేయ‌డం జ‌రుగుతుంది.  అన్ని కార్య‌క‌లాపాల‌ను ఇక్క‌డ నుండి ప‌ర్య‌వేక్షించ‌డానికి వీలు క‌లుగుతుంది.  ఇవి ఆయా న‌గ‌రాల ఆత్మ‌ వంటివి.

మిత్రులారా,

స్మార్ట్ సిటీ మిశన్ లో ఎంపిక అయిన 100 న‌గ‌రాల‌లో 11 న‌గ‌రాల‌లో ఇప్ప‌టికే స‌మీకృత క‌మాండ్‌, కంట్రోల్ వ్య‌వ‌స్థ‌లు ప‌నిచేయ‌డం మొదలైంది.  మ‌రో 50 న‌గ‌రాల‌లో ఈ వ్య‌వ‌స్థ‌ ప‌నులు పూర్తి చేయ‌డానికి కృషి జ‌రుగుతోంది. ఈ దిశ‌గా చేస్తున్న కృషి స‌త్ఫ‌లితాల‌ను ఇస్తోంది.  ఈ వ్య‌వ‌స్థ‌ వ‌ల్ల గుజ‌రాత్‌ లోని రాజ్‌కోట్ సిటీ లో ప‌రిస్థితి లో మార్పు వ‌చ్చింద‌ని, దీనివ‌ల్ల గ‌త ఆరు నెల‌ల్లో అక్క‌డ నేరాల రేటు చెప్పుకోద‌గిన స్థాయిలో త‌గ్గిందని నాకు చెప్పారు.  సిసిటివి ల ద్వారా ప‌ర్య‌వేక్ష‌ణ‌ తో ప‌బ్లిక్ ప్ర‌దేశాల్లో చెత్త ను కాల్చ‌డం, చెత్త‌ ప‌డేసే ధోర‌ణి కూడా త‌గ్గింద‌ట‌.  దీనితో భోపాల్‌ లో ఆస్తి ప‌న్ను వ‌సూళ్లు పెరిగాయి.  అహమదాబాద్‌ లో బిఎస్‌టిఎస్ కారిడోర్‌, బ‌స్సు ల‌లో ఉచిత వై-ఫై క‌ల్పించ‌డంతో ఎంతో 
మంది ఎదుగుద‌లకు అవ‌కాశం లభించింది.  విశాఖ‌ప‌ట్నం లో బ‌స్సుల‌ను సిసిటివి, జిపిఎస్ ల ద్వారా  ఆన్‌ లైన్‌ లో గ‌మ‌నిస్తున్నారు.  పుణే లో 125 చోట్ల అత్య‌వ‌స‌ర అలారమ్ గంట‌ల‌ను అమ‌ర్చారు.  కేవ‌లం ఒక బ‌ట‌న్ ను నొక్క‌ి స‌మీప పోలీస్ స్టేశన్‌ ను అప్ర‌మ‌త్తం చేయ‌వ‌చ్చును.  ఇవాళ ఇలాంటివి ఎన్నో అందుబాటు లోకి వ‌చ్చాయి.  ఇలాంటి సౌక‌ర్యాల‌ను, వాటి ప్ర‌యోజ‌నాల‌ను త్వ‌ర‌లోనే మీరు స్మార్ట్ సిటీ మిశన్ లో భాగంగా ఆగ్రా, కాన్ పుర్‌, అల‌హాబాద్ , అలీగఢ్, వారాణసీ, ఝాన్సీ, బ‌రేలి, శహ‌్ రాన్‌పుర్‌, మొరాదాబాద్, అలాగే మ‌న ల‌ఖ్ నవూ న‌గ‌రం లోనూ పొంద‌నున్నారు.

సోద‌ర సోద‌రీ మ‌ణులారా,

భార‌త‌దేశ న‌గ‌రాల ముఖ‌చిత్రాన్ని మార్చే మా మిశన్‌ కు ఈ న‌గ‌రం తో అత్యంత స‌న్నిహిత సంబంధం ఉంది.  ల‌ఖ్ నవూ న‌గ‌రం శ్రీ‌మాన్ అట‌ల్ బిహారీ వాజ్‌పేయీ గారి కార్య‌క్షేత్రం.  వారు న‌గ‌ర జీవితానికి నూత‌న దిశను నిర్దేశించారు.  సుదీర్ఘ‌ కాలం వారికి ఇది పార్ల‌మెంట‌రీ నియోజ‌క‌వ‌ర్గంగా ఉండింది.  పూర్వ ప్ర‌ధాని వాజ్‌పేయీ గారు మ‌నకు అంద‌రికీ స్ఫూర్తి. 

ప్ర‌స్తుతం అట‌ల్‌ గారి ఆరోగ్యం స‌రిగా లేదు.  వారు త్వ‌ర‌గా కోలుకోవాల‌ని దేశం మొత్తం ప్రార్థిస్తోంది.  అట‌ల్‌ గారు ప్రారంభించిన ప్రాజెక్టు ను మ‌రింత వేగంతో నూత‌న శిఖ‌రాల‌కు తీసుకువెళ్లేందుకు ప్ర‌భుత్వం, కోట్లాది మంది ప్ర‌జ‌లు క‌లిసి ముందుకు సాగుతున్నారు.

మిత్రులారా,

న‌గ‌ర‌ జీవితం లో సంస్క‌ర‌ణ‌లను తీసుకు వ‌చ్చేందుకు ఒక ప్ర‌యోగ‌శాల‌ గా అట‌ల్‌ గారు ల‌ఖ్ నవూ ను అభివృద్ధి చేశారు.  ఇవాళ‌, మ‌నం  చూస్తున్న ఫ్లైఓవ‌ర్లు, బ‌యో టెక్నాల‌జీ పార్కు, సైంటిఫిక్ క‌న్వెన్ష‌న్ సెంట‌ర్లు, ల‌ఖ్ నవూ ప‌రిస‌రాల్లో ఉన్న వేలాది గ్రామాల‌కు రోడ్డు అనుసంధాన‌ం వంటివ‌న్నీ అట‌ల్‌ గారు ల‌ఖ్ నవూ పార్ల‌మెంట్ స‌భ్యునిగా ఉన్న‌ప్పుడు వారి దార్శ‌నిక‌త నుండి రూపుదిద్దుకున్న‌వే.  మెట్రో రైల్ సేవ‌లు ఇవాళ చాలా న‌గ‌రాల్లో అందుబాటు లోకి వ‌చ్చాయి.  ఇక మ‌రో ప‌న్నెండు న‌గ‌రాల‌లో మెట్రో సేవ‌లు అందుబాటు లోకి రానున్నాయి.  ల‌ఖ్ నవూ లో కూడా మెట్రో సేవ‌ల‌ను విస్త‌రించే ప‌నులు జ‌రుగుతున్నాయి.  దేశం లోనే తొలిసారిగా ఢిల్లీ లో మెట్రో ప‌నుల‌ను అమ‌లు చేశారు.  ఇది న‌గ‌ర ర‌వాణా రంగం లో భారీ మార్పును తీసుకు వ‌చ్చింది.  ఇది కూడా అట‌ల్ బిహారీ వాజ్‌ పేయీ గారే చేశారు. ఇవాళ ఢిల్లీ మెట్రో విజ‌యం దేశ‌వ్యాప్తంగా పున‌రావృత్తం అవుతోంది.

మిత్రులారా,

పాత దానిని మెరుగుప‌ర‌చ‌కుంటే కొత్త‌ది మ‌రింత మెరుగుగా ఉండ‌ద‌ని అట‌ల్‌ గారు అంటూ ఉండే వారు.  వారు ల‌ఖ్ నవూ పాత న‌గ‌రం గురించి, కొత్త న‌గ‌రం గురించి ప్ర‌స్తావించే సంద‌ర్భంలో ఈ మాట అన్నారు.  అదే ఇవాళ అమృత్‌ కు ప్రేర‌ణ . మ‌నం మాట్లాడుతున్న స్మార్ట్‌ సిటీ మిశన్ తో అట‌ల్ గారి పేరు ముడిప‌డి వుంది.  అమృత్ ప‌థ‌కం అంటే అట‌ల్ మిశన్ ఫ‌ర్ రిజూవినేశన్ అండ్ అర్బ‌న్ ట్రాన్స్‌ఫార్మేశన్.

ఇదే ఆలోచ‌న‌ తో ప‌లు న‌గ‌రాల్లో ద‌శాబ్దాలు గా ఉన్న పాత వ్య‌వ‌స్థ‌ ల‌ను మెరుగుప‌ర‌చ‌డం జ‌రుగుతోంది.  ఈ న‌గ‌రాల్లో మురుగునీటిపారుద‌ల వ్య‌వ‌స్థ‌లు, తాగునీటి సౌక‌ర్యాలు, వీధిదీపాలు వేయ‌డం లో సంస్క‌ర‌ణ‌లు తీసుకురావ‌డం జ‌రిగింది. పార్కులను, చెరువులను, కుంట‌ల‌ను అందంగా తీర్చిదిద్దే ప‌నుల‌పై శ్ర‌ద్ధ పెట్ట‌డం జ‌రుగుతోంది.

మిత్రులారా,

ఈ ప‌థ‌కం కింద న‌గ‌రాల‌లో నిలువ నీడ‌ లేని నా సోద‌ర సోద‌రీమ‌ణుల‌ కోసం అట‌ల్ బిహారీ వాజ్‌ పేయీ గారు  2001 వ సంవ‌త్స‌రం లో ప్రారంభించారు.  అట‌ల్ గారు వాల్మీకి- ఆంబేడ్ కర్ గృహ‌ కల్పన ప‌థ‌కాన్ని దేశ‌వ్యాప్తంగా ప్రారంభించారు. 2022 కల్లా భార‌త‌దేశం స్వాతంత్ర్యం సాధించి 75 సంవ‌త్స‌రాలు పూర్తి అయ్యే నాటికి దేశం లో ప్ర‌తి ఒక్క‌రికీ గృహ వ‌స‌తిని క‌ల్పించేందుకు ప్ర‌భుత్వం ప్ర‌య‌త్నిస్తోంది.  దేశం లో ఏ ఒక్క కుటుంబం కూడా స్వంత ఇల్లు లేకుండా ఉండే ప‌రిస్థితి ఉండ‌రాదు.
 
ఈ ల‌క్ష్యాన్ని దృష్టిలో పెట్టుకొనే గ‌త మూడు సంవ‌త్స‌రాల‌లో దేశ‌వ్యాప్తంగా 54 ల‌క్ష‌ల గృహాల‌ను మంజూరు చేయ‌డమైంది.  న‌గ‌రాల‌లో మాత్ర‌మే కాదు, గ్రామాల‌లో కూడా కోటి ఇళ్ల‌ను ప్ర‌జ‌ల‌కు అంద‌జేయ‌డం జ‌రిగింది.  ప్ర‌స్తుతం  నిర్మిస్తున్న ఇళ్ల‌ కు సౌభాగ్య ప‌థ‌కం కింద ఒక శౌచాలయాన్ని, విద్యుత్తు స‌దుపాయాన్ని క‌ల్పించ‌డం జ‌రుగుతోంది.  వాటికి ఉజాలా ప‌థ‌కం లో భాగంగా ఎల్ఇడి బ‌ల్బులు ఉంటాయి. అంటే  వాటికి పూర్తి స్థాయి ప్యాకేజ్ అందుతోంద‌న్న‌ మాట‌.  ఈ ఇళ్ల నిర్మాణానికి వ‌డ్డీ రాయితీని క‌ల్పించ‌డ‌మే కాకుండా  గ‌తంతో పోలిస్తే ఇళ్ల‌ విస్తీర్ణ‌మూ పెంచ‌డం 
జ‌రిగింది.

మిత్రులారా,

 ఇప్పుడు అంద‌జేస్తున్న ఇళ్లు  నిరుపేద‌ల‌కు కేవ‌లం నిలువ నీడ కోసం అందజేస్తున్న‌వి కాదు.  అవి మహిళా సాధికారిత‌ కు స‌జీవ తార్కాణాలు.  ప్ర‌ధాన‌ మంత్రి గృహ‌నిర్మాణ ప‌థ‌కం లో భాగంగా అంద‌జేస్తున్న ఇళ్ల‌ను త‌ల్లులు, సోద‌రీమ‌ణుల పేరుతో రిజిస్ట‌ర్ చేయ‌డం జ‌రుగుతుంది.  ఈ ప‌థ‌కం లో భాగంగా సుమారు 87 ల‌క్ష‌ల ఇళ్ల‌ను మ‌హిళ‌ల పేరు మీద లేదంటే మ‌హిళ‌ల పేర్ల‌తో క‌లిపి రిజిస్ట‌ర్ చేయ‌డం జ‌రిగింది.  లేకుంటే మ‌న‌కు ఎలాంటి సామాజిక వ్య‌వ‌స్థ ఉండేది. మీరు ఎక్క‌డికైనా వెళ్లండి, భూమి ఎవ‌రి పేరు మీద ఉంటుంది?  అది భ‌ర్త‌ పేరు మీదో లేక తండ్రి పేరు మీదో లేక కుమారుడి పేరు మీదో ఉంటుంది.  ఇళ్లు ఎవ‌రి పేరు మీద ఉంటాయి?  అవి భ‌ర్త పేరు మీదో లేక కుమారుడి పేరు మీదో ఉంటాయి. స్కూట‌ర్ కొంటే ఎవ‌రి పేరు మీద ఉంటోంది?  కుమారుడి 
పేరు మీద ఉంటోంది.  మ‌హిళ‌ల పేరు మీద ఒక్క‌టీ ఉండ‌డం లేదు.  మేం ఈ ప‌రిస్థితిని మార్చివేశాం.  ఇప్పుడు వీధిలో వెళ్లే వారు ఇంటి య‌జ‌మాని ఎవ‌రు అని కాక‌ ఈ ఇంటి య‌జ‌మానురాలు ఎవ‌రు అని అడుగుతారు.  ఇలా స‌మాజం ఆలోచ‌న‌ల‌లో మార్పు రానున్న‌ది.

పేద ప్ర‌జ‌ల జీవ‌న‌ప్ర‌మాణాల‌ను శ‌ర‌ వేగం తో ఉన్న‌త‌ స్థాయి కి తీసుకు వెళ్లేందుకు యోగి గారు చేస్తున్న కృషి కి, ఆయ‌న ప్ర‌భుత్వం చేస్తున్న కృషి కి అభినంద‌న‌లు.  గ‌త ప్ర‌భుత్వం లో ప‌రిస్థితులు ఎలా ఉండేవో నాకు కూడా తెలుసు.  2014 త‌రువాత యోగి గారు అధికారం లోకి రాక‌ ముందు ప‌రిస్థితులు ఎలా ఉండేవో నాకు బాగా తెలుసు.  నేను ఆనాటి ప‌రిస్థితులను ప్ర‌జ‌ల‌కు గుర్తు చేస్తున్నాను. పేద‌ల‌కు ఇళ్ల గురించి మేం ప‌దే ప‌దే లేఖ‌లు రాస్తూ వ‌చ్చాం.  వారిని క‌లిసే అవ‌కాశం ఎప్పుడు వ‌చ్చినా, సోద‌రా, మేం నిధులు ఇవ్వ‌డానికి సిద్ధంగా ఉన్నాం, ద‌య‌చేసి ఎంతో కొంత‌ చేయండి అని చెప్పే వాడిని.  మేం వారిని వేడుకోవ‌ల‌సి వ‌చ్చేది; అయినా ఆ నాటి ప్ర‌భుత్వాలు, ఆ మ‌నుషులు అలా ఉన్నారు.  వారు వారి ప‌ని సంస్కృతి ని మార్చుకోవ‌డానికి సిద్ధంగా లేరు.  వారి కార్యక్రమ పట్టికల్లా  
ఒక్కటే, వారి బంగ‌ళాల‌కు మ‌ర‌మ్మ‌తులు చేయించుకోవ‌డం; వాటిని అందంగా అలంక‌రించుకోవ‌డం.  ఇవ‌న్నీ పోగా స‌మ‌యం దొరికిన‌పుడు మాత్ర‌మే పేద‌ల‌కు ఇళ్ల నిర్మాణ ప‌నులను చేప‌ట్టే వారు.

ఇవాళ‌, నేను మీకు మ‌రో విష‌యం కూడా చెప్ప‌ద‌ల‌చాను.  ఉత్త‌ర్ ప్ర‌దేశ్ న‌న్ను పార్ల‌మెంటు స‌భ్యుడిగా ఎన్నుకున్నది.  అందుకు నేను ఈ విష‌యాన్ని తప్పక మీతో  చెప్పాలి.  ఇది మీ హ‌క్కు కూడా.  కొంద‌రు నా మీద  చేస్తున్న ఆరోప‌ణ‌లు వినే ఉంటారు.  ఆ ఆరోప‌ణ ఏమిటంటే నేను కాపలాదారు ను కాదు భాగ‌స్వామిని అన్నదే. 
 ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ కు చెందిన నా సోద‌రులు, సోద‌రీమ‌ణులారా, దేశ వాసులారా, ఆ ఆరోప‌ణ‌ల‌ను నేను బ‌హుమ‌తి గా స్వీక‌రిస్తాను. నేను భాగ‌స్వామి గా ఉన్నందుకు గ‌ర్విస్తున్నాను.  నేను ఈ దేశ పేద ప్ర‌జ‌ల బాధ‌ల‌లో భాగ‌స్వామి ని.  క‌ష్టించి ప‌ని చేసే కార్మిక శ‌క్తి లో నేను భాగ‌స్వామిని. వేధింపుల‌కు గురి అవుతున్న త‌ల్లుల వేద‌న‌ లో నేను భాగ‌స్వామి ని, అక్క‌డ ఇక్క‌డ క‌ట్టెలు ఏరుకు వ‌చ్చి క‌ట్టెపుల్ల‌ల‌తో వంట చేసి త‌మ ఆరోగ్యాన్ని క‌ళ్ల‌ను పాడుచేసుకుంటున్న పేద త‌ల్లులు, ఆవుపేడ‌తో పిడ‌క‌లను చేసి పొయ్యిని వెలిగించుకుంటున్న త‌ల్లుల క‌ష్టాల‌లో నేను భాగ‌స్వామి ని.  నేను ప్ర‌తి త‌ల్లి ఇబ్బందులు ప‌డ‌కుండా వంట‌చేసుకొనే విధంగా స్టౌ ను మార్చాల‌నుకున్నాను.  క‌రువులు, వ‌ర‌ద‌ల కార‌ణంగా పంట న‌ష్ట‌పోతున్న ప్ర‌తి రైతు బాధ‌ లో నేను భాగ‌స్వామి ని.  రైతులకు ఆర్థిక భ‌ద్ర‌త క‌ల్పించ‌డం లో నేను భాగ‌స్వామి ని.  దేశం కోసం, మ‌న‌ భ‌ద్ర‌త కోసం త‌మ ప్రాణాలను అర్పించ‌డానికి  ఎముక‌లు కొరికే చ‌లిలో కార్గిల్‌ లో, సియాచిన్‌లో, చ‌ర్మం మండిపోయే వేడిమి క‌లిగిన జైస‌ల్మేర్‌ లో, క‌ఛ్చ్ వంటి ప్రాంతాల్లో స‌ర్వ‌ స‌న్న‌ద్ధంగా ఉన్న అస‌మాన ధైర్య‌ సాహ‌సాలు గ‌ల మ‌న సైనికుల ఉత్సాహం లో నేను భాగ‌స్వామి ని.  ఇంట్లో అనారోగ్యం బారిన ప‌డిన కుటుంబ స‌భ్యుడి కోసం త‌మ భూమి ని అమ్ముకోవ‌ల‌సిన ప‌రిస్థితుల్లోకి నెట్ట‌బ‌డుతున్న పేద కుటుంబాల బాధ‌ల‌లో నేను భాగ‌స్వామి ని.  నేను వారి గురించి ఆలోచిస్తాను.  వారికి సేవ‌చేయ‌డానికి ప‌నిచేస్తాను.  ప్ర‌తి పేద‌వాడికి నిలువ నీడ క‌ల్పించేందుకు జ‌రిగే కృషిలో నేను భాగ‌స్వామి ని.  అప్పుడు మాత్ర‌మే పేద‌లు ఇళ్లు పొంద‌గ‌లుగుతారు.  వాళ్లు ఇంట్లో టాయిలెట్ సౌక‌ర్యాన్ని, మంచినీటిని, విద్యుత్తు సౌకర్యాన్ని పొంద‌గ‌లుగుతారు.  అలాగే వారు అందుబాటు ధరలలో ఔష‌ధాలను, చికిత్స ను పొంద‌గ‌లుగుతారు.  వారి పిల్ల‌ల‌కు మంచి విద్య అందడానికి అవ‌కాశం ఉంటుంది.   నైపుణ్యాలు క‌ల్పించేందుకు, ఉద్యోగాలు, యువ‌త‌ కు స్వ‌తంత్రోపాధి ని క‌ల్పించే చ‌ర్య‌ల‌న్నింటిలోనూ నేను భాగ‌స్వామి ని.  సాధార‌ణ చెప్పులను వేసుకొనే వ్య‌క్తి సైతం విమాన‌యానం చేసే  అవ‌కాశం ఉండేలా చూడాల‌న్న‌ది నా ఆకాంక్ష‌.

నేను నిజంగానే గ‌ర్వ‌ప‌డ‌తాను. నిజ‌మే నేను భాగ‌స్వామి ని. ఒక పేద త‌ల్లికి కుమారుడిగా నేను గ‌ర్వ‌ప‌డ‌తాను.  పేద‌రికం నాకు నిజాయతీని ఇచ్చింది. ధైర్యాన్ని ఇచ్చింది.  పేద‌రికం వ‌ల్ల క‌లిగిన క‌ష్టాలు ఎలా జీవించాలో నాకు నేర్పించాయి. పేద‌రికం కార‌ణంగా ఎదురైన క‌ష్టాల‌ను నేను భ‌రించాను.  పేద ప్ర‌జ‌ల బాధ‌లు, వారి జీవితాల‌ లోని విషాదాన్ని నేను అత్యంత స‌న్నిహితంగా చూశాను.  మ‌న‌ దేశంలో ఒక నానుడి ఉంది.. కాలి కి నొప్పి తెలియ‌ని వాడికి ఇత‌రుల క‌ష్టాలు ఏం తెలుస్తాయి అని.  బాధ‌ల‌ను ఎదుర్కొన్న‌ వారికి దాని గురించి తెలుస్తుంది.  ఆ స‌మ‌స్య‌ల‌కు ప‌రిష్కారం కూడా వారికి తెలుస్తుంది.
ఇంకా దీనికి ముందు కూడా న‌న్ను చాయ్ అమ్మే వ్య‌క్తి అంటూ ముద్ర‌ వేశారు.  చాయ్ అమ్మే వ్య‌క్తి దేశానికి ప్ర‌థమ సేవ‌కుడు ఎలా అవుతాడ‌ంటూ ప్ర‌శ్నించారు.  అయితే దీనిని నిర్ణ‌యించవలసింది ఇలాంటి మాట‌లు మాట్లాడే వారు కాదు.  ఈ దేశంలోని 125 కోట్ల మంది ప్ర‌జ‌లు.

మిత్రులారా,

ఈ భాగ‌స్వామ్యాన్ని అప‌హాస్యం చేసే వ్య‌క్తులు, వారి ఆలోచ‌న ధోర‌ణే ఇవాళ మ‌న న‌గ‌రాలు ఎదుర్కొంటున్న స‌మ‌స్య‌ల‌కు కార‌ణం.  ఆ ఆలోచ‌న ధోర‌ణి కి ప్ర‌తిబింబ‌మే ఈ స‌మ‌స్య‌లు.  మ‌న‌కు స్మార్ట్‌ సిటీ లకు త‌గిన ప్రేర‌ణ ఉంది. ఇందుకోసం ప‌నిచేయగ‌ల వారు మ‌న‌కు ఉన్నారు.  ఇవాళ త‌వ్వ‌కాల ద్వారా ప్రాచీన న‌గ‌రాల‌ను క‌నుగొంటున్నాం.  అవి మ‌న‌కు ఆద‌ర్శంగా నిలుస్తాయి.  మ‌న పూర్వీకులు న‌గ‌రాలకు రూప‌క‌ల్ప‌న చేయ‌డంలో  ఎంత‌ గొప్ప‌గా  వ్వ‌వ‌హ‌రించారో అవి తెలియ‌జేస్తున్నాయి. శ‌తాబ్దాల క్రిత‌మే వారు స్మార్ట్‌ న‌గ‌రాల‌కు రూప‌క‌ల్ప‌న చేసుకున్నారు.  అయితే అర్థ‌వంత‌మైన‌ ఆలోచ‌న‌లతో ముందుకు సాగ‌క‌ పోవ‌డం, రాజ‌కీయ సంకల్పం లేమి వ‌ల్ల పెద్ద న‌ష్టం జ‌రిగింది.

 మ‌న‌కు స్వాతంత్ర్యం సిద్ధించిన త‌ర్వాత దేశ నిర్మాణ బాధ్య‌తలు మ‌న‌ముందున్న‌ప్పుడు జ‌నాభా ఇంత పెద్ద సంఖ్య‌లో లేరు. ఆ స‌మ‌యంలో మ‌న  భ‌విష్య‌త్ అవ‌స‌రాల‌కు త‌గిన‌ట్టు న‌గ‌రాల‌ను అభివృద్ధి చేసుకోవ‌డానికి మ‌న‌కు ఎన్నో అవ‌కాశాలు ఉండేవి. 

మ‌నం ఇప్పుడు ఎదుర్కొంటున్న‌టువంటి ర‌క‌ ర‌కాల స‌మ‌స్య‌లు ఆనాడు లేవు. అయినా మ‌న న‌గ‌రాలు అర‌కొర అభివృద్ధి కే నోచుకొన్నాయి.  ఎలా ప‌డితే అలా విస్తరించుకోవ‌డానికి ప్ర‌జ‌ల‌కు అవ‌కాశం ఇచ్చారు.  నేను డ‌బ్బు సంపాదించుకోవాలి, కాబ‌ట్టి నీకు ఇష్ట‌మైంది  నువ్వు చేసుకో అన్న కోవ లో ప‌రిస్థితులు ఉండేవి.  ఈ ర‌కంగా జ‌నార‌ణ్యాలు అభివృద్ధి కావ‌డానికి వీలు క‌ల్పించారు.  ప్ర‌తి భార‌తీయ న‌గ‌రం దీని ఫ‌లితాన్ని అనుభ‌విస్తోంది.

మిత్రులారా,

ఒక త‌రం అంతా ఈ స‌మ‌స్య‌ల‌తో స‌త‌మ‌త‌ం అవుతూనే జీవితం సాగించవలసి వ‌చ్చింది.  కొన్ని సంద‌ర్భాల్లో రెండు మూడు త‌రాలు ఇలాగే సాగాయి.  త‌దుపరి త‌రాలు ఈ చేదు అనుభ‌వాలను చ‌విచూస్తున్నాయి.  నిపుణులు అంటున్న‌దేమిటంటే, 7.5 శాతం వృద్ధి తో ముందుకు వెళ్తున్న భార‌త‌దేశం రాగ‌ల సంవ‌త్స‌రాల‌లో ఇంత‌కంటే వేగంగా అభివృద్ధి ప‌థంలో దూసుకుపోతుంది అని.   దేశ జిడిపి కి 65 శాతం పైగా స‌మ‌కూరుస్తున్న ప్రాంతాన్ని, ఒక‌ ర‌కంగా దేశాభివృద్ధికి కీల‌క‌మైన దానిని మ‌నం అస్త‌వ్య‌స్తంగా ఉంచితే, దానివ‌ల్ల ఎలాంటి స‌మ‌స్య‌లు వ‌స్తాయో మ‌నం ఊహించ‌వ‌చ్చు.  అందువ‌ల్ల మ‌నం ఈ సౌక‌ర్యాల‌న్నీ ఒక క్ర‌మ‌ పద్ధ‌తిలో క‌ల్పించడం ఎంతైనా అవ‌స‌రం.

త‌ల‌ పై వేలాడుతున్న‌ట్టుండే క‌రెంటు తీగ‌లు, మురుగు నీటి తో పొంగి పొర్లే కాలువ‌లు, గంట‌ల‌ కొద్దీ వాహన రాకపోకల స్తంభన.. ఇలాంటివి 21 వ శ‌తాబ్ద‌పు భార‌త‌దేశాన్ని నిర్వ‌చించ‌లేవు. ఈ ర‌క‌మైన ఆలోచ‌న‌ తో మూడు సంవ‌త్స‌రాల క్రిత‌మే ఈ మిశన్‌ కు పునాదులు వేశాం.  ఇందుకోసం 100 న‌గ‌రాల‌ను  ఎంపిక చేసి వాటిని సుమారు 2 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌ల‌కు పైగా పెట్టుబ‌డి తో అభివృద్ధి చేయాల‌ని నిర్ణ‌యించాం.  న‌గ‌రం త‌న ఆత్మ‌ ను నిలుపుకొంటూనే కొత్త రూపు ను సంత‌రించుకునే విధంగా అభివృద్ధి ఉంటుంది.  ఇక్క‌డ ఆ న‌గ‌రం సంస్కృతే దానికి ఆభ‌రణంగా ఉంటుంది.  స్మార్ట్‌నెస్‌ దాని జీవితంగా ఉంటుంది.  మ‌నం ఇలాంటి స‌జీవ న‌గ‌రాల‌ను శ‌ర వేగంతో అభివృద్ధి చేసుకుంటున్నాం.

మిత్రులారా,

స్మార్ట్‌సిటీ అనేది కేవ‌లం ఒక ప్రాజెక్టు కాదు, అది ఒక ప్ర‌త్యేక సంక‌ల్పం.  ఆ సంక‌ల్పం మార్పు కోసం, ఆ సంక‌ల్పం ప‌రివ‌ర్త‌న ను సాధించేందుకు, ఆ సంకల్పం దేశాన్ని ప‌రివ‌ర్త‌న చెందించేందుకు. ఈ మిశన్ న్యూ ఇండియా కు ఎదుర‌య్యే స‌వాళ్ల‌ను దీటుగా ఎదుర్కోవ‌డానికి  మ‌న న‌గ‌రాల‌ను సిద్ధం చేస్తుంది.  ఇది  ప్ర‌పంచ‌ స్థాయి ప్ర‌మాణాల‌తో 21 వ‌శ‌తాబ్ద భార‌త‌దేశ‌పు తెలివైన న‌గ‌రాల‌ను నిర్మిస్తుంది.  ఇవి దేశ యువ‌జనుల ఆకాంక్ష‌ల‌ను ప్ర‌తిబింబించే విధంగా ఉంటాయి. ఏదైనా స‌రే కేవ‌లం బాగుండ‌డం కాదు, తిరుగు లేని రీతిలో బాగుండాల‌ని భావించే యువ‌త విధానాల‌కు అనుగుణంగా ఉంటాయి.  ఈ త‌రం ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా భ‌విష్య‌త్తు అవ‌స‌రాల మేర‌కు సౌక‌ర్యాలు క‌ల్పించ‌డం మా బాధ్య‌త‌.  ఇక్క‌డ ప్ర‌తి ఒక్క‌టి ఇ ఆధారితం.  ఇందులో 
ప్ర‌ముఖంగా ఐదు ‘ఇ ’ లను గురించి చెప్పుకోవ‌చ్చు.  అవే.. ఈజ్ ఆఫ్ లివింగ్‌, ఎడ్యుకేశన్‌, ఎంప్లాయ్ మెంట్‌, ఇకాన‌మీ, ఎన్ వైరన్ మెంట్‌ లు.
ఎప్పుడైనా నేను మీలాంటి వారితో, అంటే న‌గ‌రాల మేయ‌ర్లు, మునిసిప‌ల్ క‌మిష‌న‌ర్లు, సిఇఒ ల వంటి వారితో మాట్లాడిన‌పుడు, నాలో  కొత్త ఆశలు చిగురిస్తాయి. స్మార్ట్‌ సిటీ మిశన్ ప్ర‌ధానంగా ప్ర‌జ‌ల భాగ‌స్వామ్యం తో, వారి బాధ్య‌త‌ ల‌తో 
ముడిప‌డింది.  ఈ న‌గ‌రాల ప్ర‌జ‌లు త‌మ న‌గ‌రానికి ఎలాంటి ప‌థ‌కాలు కావాలో వారే నిర్ణ‌యించుకున్నారు.  స్మార్ట్ సిటీల దార్శ‌నిక‌త‌ కు వారి ఆలోచ‌న‌లే పునాది.  ఇవాళ అందుకు అనుగుణంగా ప‌నులను శ‌ర‌వేగంతో చేపట్ట‌డం జ‌రుగుతోంది.
 కొత్త సౌక‌ర్యాలను క‌ల్పించ‌డ‌మే కాదు, నిధుల‌కు  ప్ర‌త్యామ్నాయ ఏర్పాట్లూ జ‌రిగాయి.  పుణే, హైద‌రాబాద్‌, ఇందౌర్‌ లు మ్యునిసిప‌ల్ బాండ్ ల ద్వారా 500 కోట్ల రూపాయ‌లు స‌మ‌కూర్చుకున్నాయి.  త్వ‌ర‌లోనే ఇలాంటి ప్ర‌క్రియ ను ల‌ఖ్ నవూ లో, గాజియాబాద్‌ లో చేప‌ట్ట‌నున్నారు.  ఈ ఫైనాన్షియ‌ల్ బాండ్‌ లు ప్ర‌భుత్వాల‌పై భారాన్ని త‌గ్గిస్తాయి.  ఈ ర‌క‌మైన చొర‌వ ను తీసుకోవడానికి మిగిలిన న‌గ‌రాలూ ముందుకు రావాల‌ని నేను కోరుతున్నాను.

మిత్రులారా,

ఈ న‌గ‌రాల‌ను స్మార్ట్‌ గా తీర్చిదిద్ద‌డంతో పాటు, వాటి వ్య‌వ‌స్థ‌ల‌ను సాంకేతిక విజ్ఞానం తో అనుసంధానం చేయ‌డం ద్వారా ఇక్క‌డ సుల‌భ‌త‌ర‌మైన జీవ‌నానికి పూచీ ప‌డ‌డం జ‌రుగుతోంది.  సామాన్యుడు క్యూ లైన్ లలో నిల‌బ‌డ‌కుండా వివిధ సౌక‌ర్యాలు ఆన్‌ లైన్ ద్వారా పొందే ఏర్పాటు జ‌ర‌గ‌డం మీరు చూసే వుంటారు.  ఈ క్యూ లైన్ లే అవినీతి కి మూల కార‌ణం.  ఇవాళ మీరు బిల్లు చెల్లించాలంటే, దేని కోస‌మైనా ద‌ర‌ఖాస్తు చేసుకోవాలంటే, మీకు ఏదైనా స‌ర్టిఫికెట్ కావాలంటే, లేదా ఉపకార వేతనం, పింఛన్, భవిష్య నిధి వంటి సేవ‌లు అన్నీ ఆన్‌ లైన్‌ లో అందుబాటు లోకి వ‌చ్చాయి.  అంటే, ఇవాళ పాల‌న‌ కూడా స్మార్ట్ అయింది.  ఇది పార‌ద‌ర్శ‌క‌త‌ కు పూచీ ప‌డుతోంది.  ఫ‌లితంగా ఎంతో మేరకు అవినీతి త‌గ్గ‌డానికి దోహ‌ద‌ప‌డుతుంది.

మిత్రులారా,
 
చురుకైన , భ‌ద్ర‌మైన‌, సుస్థిర‌మైన, పార‌ద‌ర్శ‌క‌త‌తో కూడిన వ్య‌వ‌స్థ‌లు దేశం లోని కోట్లాది మంది ప్ర‌జ‌ల జీవ‌నంలో మార్పులు తీసుకు వ‌స్తున్నాయి.  ఇలా అభివృద్ధి చేయ‌బడుతున్న వ్య‌వ‌స్థ‌లు ప్ర‌తి ఒక్క‌రి కోసం.  ఇందులో ఎక్కు వ‌, త‌క్కువ‌, అనిగాని కులాలు, వ‌ర్గాల వంటి స‌రిహ‌ద్దులు ఏవీ లేవు.  ఇక్క‌డ ఉన్న‌ది అభివృద్ధి ఒక్క‌టే.  ఇదే ఇందులోని సూత్రం.  ఇందులో ర‌హ‌స్యం గాని, వివ‌క్ష‌ గాని లేదు.  ఇది అంతా ప్ర‌జ‌లు ,ఆయా రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలు, స్థానిక సంస్థ‌ల భాగ‌స్వామ్యం తో మాత్ర‌మే సాధ్య‌పడుతుంది.  స‌బ్‌ కా సాథ్‌, స‌బ్‌కా వికాస్ (అంద‌రితో కలసి అందరి అభివృద్ధి)  .. ఈ స్ఫూర్తితో మాత్ర‌మే భార‌త‌దేశం న్యూ ఇండియా నిర్మాణ సంక‌ల్పాన్ని సాకారం చేసుకోగ‌ల‌దు.

నేను ఈ రోజు యోగి గారి తో మాట్లాడుతున్న‌ప్పుడు వారు నాకు ఒక మంచి విష‌యాన్ని గురించి తెలిపారు.  చూడండి, అలాంటివి ఎన్నో ఉన్నాయి.  మ‌నం మ‌న ప్ర‌జ‌ల‌ను విశ్వ‌సిస్తే, మ‌నం అద్భుత‌మైన ఫ‌లితాలు సాధించ‌వ‌చ్చు.  కానీ దుర‌దృష్ట‌మేమిటంటే గతంలో పాలించిన రాజకీయ నాయ‌కులకు వోట్ల స‌మ‌యంలో మాత్ర‌మే ప్ర‌జ‌లు గుర్తుకు వ‌చ్చే వారు.  మనం నిజాయతీ గా పౌరుల శ‌క్తి ని, వారి మంచిత‌నాన్ని అంచ‌నా వేసిన‌ట్ట‌యితే మ‌నం ఎంత‌టి అద్భుతమైన ఫ‌లితాలను సాధించ‌ వచ్చో యోగి గారు ఇప్పుడే చెప్పారు.  ఒక‌ సారి ఆగ‌స్టు 15  వ‌ తేదీ ప్ర‌సంగంలో నేను, మీరు ఎంతో సంపాదిస్తున్న‌ప్పుడు ఇక వంట‌గ్యాస్ 
స‌బ్సిడీ కోసం చూడ‌డ‌ం ఎందుక‌ని ఎర్ర‌ కోట‌ మీది నుండి పిలుపునిచ్చాను.  ఇది మీకు గుర్తుండే వుంటుంది.. మ‌న‌ దేశంలో స‌బ్సిడీ తో రాజ‌కీయాలు బాగా ముడిప‌డి ఉంటాయి.  ఎవ‌రూ దీనిని గురించి మాట్లాడ‌డానికి సాహ‌సించ‌రు. కానీ మేం దాన్ని ప్ర‌స్తావించాం.  సుమారు 1.25 కోట్ల కుటుంబాలు వంట‌గ్యాస్ స‌బ్సిడీ ని వ‌దులుకున్నాయని తెలిసి దేశం గ‌ర్వించాలి.

నేను దానికోసం ఎర్ర‌ కోట నుండి పిలుపునిచ్చాను.  రైల్వేలు వాటి రిజ‌ర్వేశన్ ఫారమ్ లో ఒక కాల‌మ్‌ ను పెట్టాయి.  దీనికి పెద్ద ప్ర‌చార‌మూ ఇవ్వ‌లేదు.  సీనియ‌ర్ సిటిజ‌న్ లు ప్ర‌యాణ టికెట్ల‌ లో రాయితీ ని పొందుతుంటారు.  దీనికి ఆదాయంతో సంబంధం లేదు.  సీనియ‌ర్ సిటిజన్ లకు ఆ రాయితీ వ‌ర్తిస్తుంటుంది.  మీకు త‌గిన ఆదాయం ఉండి, ప్ర‌యాణ రాయితీ ని వ‌దులుకోద‌ల‌చుకుంటే టిక్‌ పెట్టండి అంటూ ఆ కాల‌మ్‌ లో పేర్కొనడమైంది.  అంతే, అతి త‌క్కువ స‌మ‌యం లోనే ఎలాంటి ప్ర‌చారం లేకుండా, ఏ రాజ‌కీయ‌ నాయ‌కుడి నుండీ పిలుపు లేకుండా సుమారు 40 ల‌క్ష‌ల మందికి పైగా సీనియ‌ర్ సిటిజ‌న్ లు వారి రైలు ప్ర‌యాణ స‌బ్సిడీ ని వ‌దులుకున్నారని తెలియ‌జేయ‌డానికి సంతోషిస్తున్నాను.  ఇది చిన్న విష‌యం ఏమీ కాదు.

ఈ రోజున యోగి గారు నాతో చెప్పారు.. గ‌తంలో ఉత్త‌ర్ ప్ర‌దేశ్‌ లో ఇళ్లు పొందిన‌ వారిలో కొంద‌రి ఆర్థిక ప‌రిస్థితులు కొంత‌వర‌కు మెరుగ‌ప‌డ్డాయ‌ని.  కొంద‌రి పిల్ల‌లు న‌గ‌రాల‌లో జీవ‌నోపాధి కి వెళ్ల‌డంతో వారూ  న‌గ‌రాల‌లో స్థిర‌ప‌డ్డార‌ని. ఉత్త‌ర్  ప్రదేశ్ ప్ర‌భుత్వం అలాంటి వారికి ఒక విజ్ఞ‌ప్తి చేసిన‌ట్టు చెప్పారు.  ఇప్ప‌టికే ప్ర‌భుత్వం కేటాయించిన ఇల్లు ఉండి, వారి ప‌రిస్థితి మెరుగయ్యుంటే, ప్ర‌భుత్వం ఇచ్చిన ఇంటిని తిరిగి ప్ర‌భుత్వానికి అప్ప‌గించవలసిందిగా వారిని కోరిన‌ట్టు చెప్పారు. ఇది చిన్న విష‌యం ఏమీ కాదు.

మ‌న‌ దేశం లో ఒక‌ ర‌క‌మైన ఆలోచ‌న ఉండేది.  అంద‌రూ దొంగ‌లేన‌ని, అందరూ ఒకే రీతిలో వ్య‌వ‌హ‌రిస్తార‌ని.  ఇలాంటి ఆలోచ‌న‌కే తావు లేదు.  మ‌నం మ‌న దేశ ప్ర‌జ‌ల‌ను విశ్వ‌సించాలి.  మ‌న దేశ ప్ర‌జ‌లు ఎంతో స‌మ‌ర్ధుల‌ని, వారు దేశాన్ని స‌మ‌ర్ధంగా 
నిర్వ‌హించ‌గ‌ల‌రని మ‌నం విశ్వ‌సించాలి.

ప్ర‌జ‌లు ఇప్ప‌డు దేశాన్ని మార్చేందుకు ముందుకు వ‌స్తున్నారు.  ఒక నిజాయతీ తో కూడినటువంటి వాతావ‌ర‌ణం ఏర్ప‌డుతోంది.  గ‌తం తో పోల్చి చూసిన‌పుడు ప‌న్నులు క‌ట్ట‌డానికి  ఇప్పుడు చాలా మంది ముందుకు వ‌స్తున్నారు. న‌గ‌రాల‌లో క‌ల్పిస్తున్న సౌక‌ర్యాలు చూస్తే ప్ర‌జ‌లు ప‌న్నులు కట్ట‌డానికి ముందుకు వ‌స్తారు.  తాము చెల్లించే ప్ర‌తి పైసా స‌ద్వినియోగం అవుతుంద‌న్న విశ్వాసం వారికి ఉంది.  తాము చెల్లించే సొమ్ము ను రాజ‌కీయ‌ నాయ‌కుల బంగ‌ళాల‌పై ఖ‌ర్చు పెట్ట‌బోర‌న్న న‌మ్మ‌కం వారికి ఉంది.

ఇందుకు మ‌రో సారి మీ అంద‌రికీ నేను ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. మీ కృషికి అభినంద‌న‌లు.  వ‌చ్చే సారి మ‌రిన్ని న‌గ‌రాలు ప్రాతినిధ్యం వ‌హిస్తాయ‌ని ఆశిస్తున్నాను.  కొత్త వారు ముందుకు వ‌స్తార‌ని ఆశిస్తున్నారు.  కొత్త న‌గ‌రాల‌కు త‌గిన 
సామ‌ర్ధ్యాలు ఉన్నాయి.  మీరు క‌ల్పించాల్సింది స‌మ‌ర్ధ నాయ‌క‌త్వం.  మీరు ఒక న‌గ‌రానికి క‌మిశన‌ర్ లేదా మేయ‌ర్ లేదా సిఇఒ కావ‌చ్చు.. మీరు  మీ ముందు బృహ‌త్ ల‌క్ష్యాన్ని ఉంచుకోండి.  మీకు అవార్డులు అందించేందుకూ నేను ముందున్నాను. 

మిమ్మ‌ల్ని గౌర‌వించుకొనే అవ‌కాశాన్ని నాకు ఇవ్వండి.  మిమ్మ‌ల్ని గౌర‌వించుకొనే అవకాశాన్ని ప్రసాదించవలసిందిగా భార‌త‌దేశ ప్ర‌జ‌లంద‌రికీ విజ్ఞప్తి చేస్తున్నాను.
 త‌మ కార్య‌సాధ‌న‌ లో విజ‌యాన్ని సాధించిన వారంద‌రికీ మ‌రో సారి నా శుభాకాంక్ష‌లను తెలియ‌జేస్తున్నాను.  విజ‌యాన్ని సాధించ‌డానికి ప్ర‌య‌త్నిస్తున్న వారంద‌రికీ కూడా నా శుభాకాంక్ష‌లు తెలియ‌జేసుకొంటున్నాను.

అనేకానేక ధ‌న్య‌వాదాలు.

**