Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ‌వ్యాప్తంగా ఉన్న ఉజ్జ్వ‌ల ల‌బ్దిదారుల‌తో మాట్లాడిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా దేశ‌ వ్యాప్తంగా ఉన్న‌టువంటి ఉజ్జ్వ‌ల ల‌బ్దిదారుల‌తో సంభాషించారు.

ఈ స‌మావేశం లో దేశం న‌లు మూల‌ల 600కు పైగా కేంద్రాల‌లో ఒక్కో కేంద్రం లో ముగ్గురు ఉజ్జ్వ‌ల ల‌బ్దిదారుల చొప్పున పాలుపంచుకొన్నారు.

వివిధ వేదిక‌ల ద్వారా.. Narendra Modi App, మరియు వివిధ టెలివిజ‌న్ న్యూస్ ఛాన‌ల్స్, ఇంకా సామాజిక మాధ్య‌మ వేదిక‌లు, ఇత‌ర‌త్రా మార్గాలలో.. ఈ స‌మావేశాన్ని 10 ల‌క్ష‌ల మంది తిల‌కించారని ఒక అంచనా.

సాంకేతిక విజ్ఞానం సహాయంతో ల‌బ్దిదారుల‌తో భేటీ అయ్యి వారితో మాట్లాడగలగడం, మరియు వారి అనుభ‌వాల‌ను తెలుసుకోగలగడం పట్ల ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేశారు. ఉజ్జ్వ‌ల ప‌థ‌కం పురోగ‌తికి ఒక సంకేతంగా నిలచిందరి ఆయ‌న అన్నారు. గణనీయమైన సాంఘిక ప‌రివ‌ర్త‌న‌కు ఈ ప‌థ‌కం చోద‌కంగా ఉంద‌ని, అంతే కాక, దేశం యొక్క స‌మ‌గ్ర అభివృద్ధి ని కూడా ఈ పథకం ప్ర‌భావితం చేస్తోంద‌ని ఆయ‌న చెప్పారు.

ఇంత‌వ‌ర‌కు ఉజ్జ్వ‌ల యోజ‌న ద్వారా దాదాపుగా 4 కోట్ల మంది మ‌హిళ‌లు గ్రామీణ ప్రాంతాల‌లో ఎల్‌పిజి క‌నెక్ష‌న్ లను అందుకొన్నారు. 1955 నుండి 2014 సంవ‌త్స‌రం మ‌ధ్య సుమారు ఆరు దశాబ్దాల కాలంలో జారీ అయిన 13 కోట్ల కనెక్షన్ లతో పోలిస్తే మొత్తం మీద, 2014 వ సంవ‌త్స‌రం మొదలుకొని గ‌త 4 సంవ‌త్స‌రాల‌లో దగ్గర దగ్గర 10 కోట్ల కొత్త ఎల్‌పిజి క‌నెక్ష‌న్ లు జారీ అయ్యాయి.

ప్ర‌ధాన మంత్రి త‌న సంభాష‌ణ ను మొద‌లు పెడుతూ, గృహిణుల జీవితాల‌ను స‌ర‌ళ‌త‌రం చేసేందుకు ఉన్న‌ ప్రాముఖ్యాన్ని చాటిచెప్ప‌డం కోసం 1933 లో శ్రీ మున్షీ ప్రేమ్‌చంద్ రాసిన ఒక క‌థ‌ ను ఉటంకించారు. ఉజ్జ్వ‌ల ప‌థ‌కం ప‌రిశుభ్ర ఇంధ‌నాన్ని స‌మ‌కూర్చుతూ, హానిక‌ర‌మైన పొగ బారి నుండి విముక్తిని ప్ర‌సాదించి, మెరుగైన ఆరోగ్య ఫ‌లితాలను అందించింద‌ని ఆయ‌న అన్నారు. ఇప్పుడిక వంట చేయ‌డం కోసం వెచ్చించే స‌మ‌యం త‌గ్గిన కార‌ణంగా అద‌న‌పు ఆదాయాన్ని ఆర్జించే ఒక గొప్ప అవ‌కాశాన్ని మహిళలు ద‌క్కించుకొన్నార‌ని ఆయ‌న చెప్పారు.

ఈ ప‌థ‌కంలో మ‌ధ్య‌వ‌ర్తులెవ్వరికీ స్థానం లేకుండా చూడ‌డంతో పాటు ల‌బ్దిదారుల‌ ఎంపిక పార‌ద‌ర్శ‌క‌మైన రీతిలో జ‌రిగేలా కేంద్ర ప్ర‌భుత్వం శ్ర‌ద్ధ వ‌హిస్తోంద‌ని ప్ర‌ధాన మంత్రి స్ప‌ష్టం చేశారు.

భార‌త‌దేశంలో ప్రస్తుతం 69 శాతం ప‌ల్లెలలో 100 శాతం ఎల్‌పిజి సౌకర్యం చోటు చేసుకొందని, 81 శాతం గ్రామాలు 75 శాతానికి మించి ఎల్‌పిజి విస్త‌ర‌ణ‌కు నోచుకొన్నాయని ఆయ‌న వివ‌రించారు.

వంట చేసేందుకు వెచ్చించే కాలాన్ని ఎల్‌పిజి క‌నెక్ష‌న్ ఏ మేర‌కు త‌గ్గించిందీ, అలాగే యావ‌త్తు కుటుంబం యొక్క జీవ‌న నాణ్య‌త‌ ను ఎల్‌పిజి క‌నెక్ష‌న్ ఏ విధంగా ఇనుమ‌డింపజేసిందీ ప్రధాన మంత్రి తో మాట్లాడిన ల‌బ్దిదారులు ఏకరువు పెట్టారు.

***