Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

దేశ‌వ్యాప్తంగా ఉన్న స్వ‌యం స‌హాయ‌క బృందాల సభ్యుల‌ను ఉద్దేశించి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా సంభాషించిన ప్ర‌ధాన మంత్రి


ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ దేశ‌వ్యాప్తంగా ఉన్న‌టువంటి స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌భ్యురాళ్లతోను, దీన్ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న ల‌బ్ధిదారుల తోను వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా ఈ రోజు సంభాషించారు. వివిధ స్వ‌యం స‌హాయ‌క బృందాల కు ప్రాతినిధ్యం వ‌హిస్తున్న ఒక‌ కోటి మంది కి పైగా మ‌హిళ‌లను ఉద్దేశించి ఈ కార్య‌క్ర‌మం సాగింది. వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల లబ్ధిదారుల‌తో ప్ర‌ధాన మంత్రి వీడియో కాన్ఫ‌రెన్స్ మాధ్య‌మం ద్వారా జ‌రుపుతున్న సమావేశాల ప‌రంప‌ర‌ లో ఇది తోమ్మిదో ముఖాముఖి స‌మావేశం.

వివిధ రాష్ట్రాల స్వ‌యం స‌హాయ‌క బృందాల మ‌హిళ‌ల‌తో సంభాష‌ణ జ‌ర‌ప‌డం ప‌ట్ల ప్ర‌ధాన మంత్రి సంతోషాన్ని వ్య‌క్తం చేస్తూ, ప్ర‌తి ఒక్క స‌భ్యురాలు సంక‌ల్పం యొక్క, స‌మ‌ష్టి ప్ర‌య‌త్నాల యొక్క మ‌రియు న‌వ పారిశ్రామిక‌త్వం యొక్క ప్రేర‌ణాత్మ‌క ఉదాహ‌ర‌ణ గా నిలుస్తున్నార‌న్నారు. మ‌హిళ‌లు క‌ష్టించి ప‌ని చేస్తుంటార‌ని, విషమ ప‌రిస్థితుల‌లో స్వావ‌లంబ‌న కు ఆవ‌శ్య‌క‌మైన అపార అంత‌ర్గ శ‌క్తి ని వారు క‌లిగివుంటార‌ని, మ‌రి వారికి ప‌ని చేసేందుకు త‌గ్గ అవ‌కాశాలు ఉంటే చాలునని ఆయ‌న అన్నారు. ప‌లు రంగాలు, ప్ర‌త్యేకించి వ్య‌వ‌సాయం, ఇంకా పాడి వంటి వాటిని మ‌హిళ‌ల తోడ్పాటు లేకుండా ఊహించడం అసాధ్య‌ం అని కూడా ఆయ‌న చెప్పారు. దేశ‌మంత‌టా ఇదే మహిళ‌ల సాధికారిత తాలూకు యథార్థ‌ స్ఫూర్తి అని ఆయ‌న పేర్కొన్నారు.

దీన్ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న- నేశ‌న‌ల్ రూర‌ల్ లైవ్‌లీహుడ్ మిశ‌న్ ను అన్ని రాష్ట్రాల‌లో ప్రారంభించిన‌ట్లు శ్రీ న‌రేంద్ర మోదీ త‌న సంభాష‌ణ క్ర‌మం లో తెలిపారు. 2.5 ల‌క్ష‌ల గ్రామ పంచాయ‌తీల‌ లోని కోట్లాది పేద కుటుంబాలకు చేరువ కావడం, ఇంకా వారికి నిల‌క‌డ‌త‌నం తో కూడిన‌టువంటి జీవ‌నోపాధి అవ‌కాశాల‌ను స‌మ‌కూర్చ‌డం ఈ ప‌థ‌కం ధ్యేయాలు అని ఆయ‌న స్పష్టంచేశారు. ఈ ప‌థ‌కం విజయవంతంగా అమ‌లు అవుతున్నందుకు రాష్ట్రాలను మ‌రియు అధికారుల‌ను ఆయ‌న అభినందించారు.

స్వ‌యం స‌హాయ‌క బృందాలు (ఎస్‌హెచ్‌జి లు ) గురించి ప్ర‌ధాన మంత్రి చెబుతూ, పేద‌ల ఆర్థిక, సామాజిక అభ్యున్న‌తి లో, ప్ర‌త్యేకించి సంఘం లోని గ్రామీణ ప్రాంతాల‌కు చెందిన మ‌హిళ‌ల అభ్యున్న‌తి లో స్వ‌యం స‌హాయ‌క బృందాలు ఒక అతి ముఖ్య‌మైన పాత్ర‌ను పోషిస్తాయ‌న్నారు. ఎస్‌హెచ్‌జి ల సంఖ్య 2011-14 సంవ‌త్స‌రాల మ‌ధ్య కాలంతో పోల్చి చూస్తే గ‌డ‌చిన నాలుగు సంవ‌త్స‌రాల‌లో నాలుగింత‌లు అయినట్లు, ప‌ల్లె ప్రాంతాల‌లో న‌వ పారిశ్రామికుల‌ను సృష్టించ‌డ‌ంతో పాటు ఉద్యోగాల‌ను కూడా ఇవి క‌ల్పిస్తున్నాయ‌ని ఆయ‌న చెప్పారు. 2011 మ‌రియు 2014 సంవ‌త్స‌రాల మ‌ధ్య గ‌ల మూడేళ్ళలో కేవ‌లం 5 ల‌క్ష‌ల స్వ‌యం స‌హాయ‌క బృందాలు ఏర్ప‌డి 52 ల‌క్ష‌ల కుటుంబాలకు ప్రాతినిధ్యం వహించగా 2014వ సంవ‌త్స‌రం నుండి అద‌నంగా 20 ల‌క్ష‌ల స్వ‌యం స‌హాయ‌క బృందాలు ఏర్ప‌డి 2.25 కోట్ల కుటుంబాల‌కు ప్రాతినిధ్యం వ‌హించాయని వివరించారు.

దేశ‌మంతటా స్వ‌యం స‌హాయ‌క బృందాల‌ను ప్రోత్స‌హించ‌డం కోసం ప్ర‌భుత్వం శిక్ష‌ణ ను, ఆర్థిక స‌హాయాన్ని ఇవ్వడమే కాకుండా మ‌రియు అవ‌కాశాల‌ను కూడా అందిస్తోంది. మ‌హిళా కిసాన్ స‌శ‌క్తీక‌ర‌ణ్ ప‌రియోజ‌న లో భాగంగా 33 ల‌క్ష‌ల మందికి పైగా రైతు మహిళల‌కు శిక్ష‌ణ కల్పించడమైంది. ప్ర‌స్తుతం గ్రామీణ భార‌తావ‌ని లో సుమారు 5 కోట్ల మంది మ‌హిళ‌ల క్రియాశీల భాగ‌స్వామ్యమున్న 45 ల‌క్ష‌ల స్వ‌యం స‌హాయ‌క బృందాలు పనిచేస్తున్నాయి.

‘దీన్ ద‌యాళ్ అంత్యోద‌య యోజ‌న’ ద్వారా ప‌ల్లె ప్రాంత యువ‌తీయువ‌కుల‌ లో నైపుణ్యాల‌ను అభివృద్ధి చేయ‌డంపై ప్ర‌త్యేక శ్ర‌ద్ధ వ‌హించ‌డం జ‌రుగుతోంద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. చ‌క్క‌ని జీవ‌నాన్ని అపేక్షిస్తున్న యువత ఆకాంక్ష ను నెరవేర్చే దిశగా ఉద్యోగం తో పాటు స్వ‌తంత్రోపాధి ని దృష్టి లో పెట్టుకొని శిక్ష‌ణ ను ఇవ్వ‌డం జ‌రుగుతోంది. 600 గ్రామీణ స్వ‌తంత్రోపాధి శిక్ష‌ణ సంస్థ ల ద్వారా దాదాపు 28 ల‌క్ష‌ల మంది యువ‌తీ యువ‌కులకు నైపుణ్యాల అభివృద్ధి సంబంధిత శిక్ష‌ణ ను ఇవ్వడమైంది. దాదాపు 19 ల‌క్ష‌ల మందికి ఉద్యోగాలు వచ్చాయి.

విలువ జోడింపు యొక్క ప్రాముఖ్య‌త‌ను గురించి, ఇంకా విలువ సంబంధిత శృంఖ‌లాన్ని ఏర్పాటు చేయ‌డాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి త‌న సంభాష‌ణ క్ర‌మంలో చెప్పుకొచ్చారు. స్వ‌యం స‌హాయ‌క బృందాలు వాటి ఉత్ప‌త్తుల‌ను విక్ర‌యించ‌డానికి గ‌వ‌ర్న‌మెంట్ ఇ-మార్కెట్ ప్లేస్ (GeM)లో న‌మోదు కావాల‌ంటూ ఆయ‌న విజ్ఞ‌ప్తి చేశారు.

స్వ‌యం స‌హాయ‌క బృందాల స‌భ్యులు వారి అనుభ‌వాల‌ను, ఎస్‌హెచ్‌జి ల‌తో ముడిప‌డ్డ వారి సాఫ‌ల్య గాథ‌ల‌ను ప్ర‌ధాన మంత్రి స‌మ‌క్షంలో వెల్ల‌డించారు. పేద మ‌హిళలు వారి యొక్క ఆత్మ విశ్వాసం తో, బ‌లంతో ప్ర‌తికూల ప‌రిస్థితుల‌న్నింటికీ ఎదురొడ్డి జరిపిన పోరాటానికి గాను వారిని ప్ర‌ధాన మంత్రి అభినందించారు. మ‌హిళా లబ్ధిదారులు సైతం స్వ‌యం స‌హాయ‌క బృందాలు వారి జీవితాల‌లో ఏ విధ‌మైన స‌కారాత్మ‌క‌ ప‌రివ‌ర్త‌న‌ను తీసుకువ‌చ్చిందీ ఈ సందర్భంగా వివ‌రించారు. లబ్ధిదారులు వారి విజ‌య గాథ‌ల‌ను ఛాయాచిత్రాల‌ తో స‌హా, అలాగే వారి ఆలోచ‌న‌ల‌ను కూడా న‌రేంద్ర మోదీ యాప్ (Narendra Modi App) ద్వారా పంపించాల‌ని ప్రధాన మంత్రి కోరారు.