Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ద్వితీయ ఆయుర్వేద దినోత్స‌వం సంద‌ర్భంగా అఖిల భార‌త ఆయుర్వేద సంస్థ‌ను దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం

ద్వితీయ ఆయుర్వేద దినోత్స‌వం సంద‌ర్భంగా అఖిల భార‌త ఆయుర్వేద సంస్థ‌ను దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం

ద్వితీయ ఆయుర్వేద దినోత్స‌వం సంద‌ర్భంగా అఖిల భార‌త ఆయుర్వేద సంస్థ‌ను దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం

ద్వితీయ ఆయుర్వేద దినోత్స‌వం సంద‌ర్భంగా అఖిల భార‌త ఆయుర్వేద సంస్థ‌ను దేశ ప్రజలకు అంకితం చేసిన సందర్భంగా ప్ర‌ధాన‌ మంత్రి ప్ర‌సంగ పాఠం


ఆయుర్వేద ప్రేమికులు, ఇక్క‌డ స‌మావేశ‌మైన ప్ర‌ముఖులు, జాతి యావ‌త్తుకు ధ‌న్వంత‌రి జ‌యంతి మరియు ఆయుర్వేద దినోత్స‌వ శుభాకాంక్ష‌లు.

వాస్త‌వానికి దీపావ‌ళి వేడుక‌లు కూడా ప్రారంభ‌మ‌య్యాయి. ఈ ప‌ర్వ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని దేశ‌ వాసులంద‌రికీ, ప్ర‌పంచ‌వ్యాప్తంగా భిన్న దేశాల్లో జీవ‌న‌ యాత్రను సాగిస్తున్న భార‌తీయ సంత‌తి ప్ర‌జ‌లంద‌రికీ ఈ దీపావ‌ళి ఆనందాన్ని, సంప‌దను తీసుకురావాల‌ని ఆకాంక్షిస్తూ శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను.

దేశంలోని ఆయుర్వేద క‌ళాశాల‌ల‌న్నింటిలోనూ సాంకేతిక ప‌రిజ్ఞానం స‌హాయంతో ఈ కార్య‌క్ర‌మం ప్ర‌సారం చేస్తున్నార‌ని నాకు తెలిసింది. వారంద‌రికీ ఇదే నా ఆహ్వానం. దేశంలో తొలి అఖిల భార‌త ఆయుర్వేద వైద్య సంస్థ ఏర్పాటు సంద‌ర్భంగా మీ అంద‌రినీ నేను అభినందిస్తున్నాను.

ప్ర‌తిష్టాత్మ‌క‌మైన ఈ సంస్థ‌ను ఏర్పాటు చేసినందుకు, ధ‌న్వంత‌రి జ‌యంతిని ఆయుర్వేద దినోత్స‌వంగా నిర్వ‌హిస్తున్నందుకు ఆయుష్ మంత్రిత్వ శాఖ‌కు, మంత్రిత్వ శాఖ‌తో అనుబంధం ఉన్న ప్ర‌ముఖులంద‌రికీ నా ధ‌న్య‌వాదాలు.

మిత్రులారా,

గ‌త చ‌రిత్ర‌, చారిత్ర‌క వైభ‌వం, సుసంప‌న్న‌మైన సాంప్ర‌దాయాలను గురించి తెలుసుకొని, ఆ వైభ‌వానికి గ‌ర్వ‌ప‌డ‌ని ఏ దేశం అయినా ఎన్ని ప్ర‌య‌త్నాలు చేసినా పురోగ‌మించ‌లేదు. చారిత్ర‌క వైభ‌వాన్ని మ‌రిచిపోయి పురోగ‌మించిన దేశాలు త‌మ గుర్తింపును కోల్పోతాయి.

మిత్రులారా,

మ‌నం భార‌త చ‌రిత్ర‌ను ఒక సారి అవ‌లోకిస్తే ఒక‌ప్పుడు మ‌న దేశం సుసంప‌న్న‌మైంది, శ‌క్తివంత‌మైందని మ‌న‌కు తెలుస్తుంది. మేధ‌స్సు, జ్ఞాన సంప‌న్న‌త‌ను ఆస‌రా చేసుకుని భార‌త‌దేశంతో పోటీ ప‌డ‌డం సాధ్యం కాద‌ని ఇత‌ర దేశాలు గుర్తించాయి. అందుకే వారు భిన్న‌మైన మార్గాన్ని ఎంచుకొన్నారు. మ‌న‌కు గ‌ల అత్యుత్త‌మ వ్య‌వ‌స్థ‌ల‌ను ధ్వంసం చేయ‌డం ఒక్క‌టే మార్గ‌మ‌ని వారు భావించారు. వారు స్వంత విజ‌యాలు సాధించే క‌న్నా మ‌న విజ‌యాల‌ను తుడిచిపెట్టే ప్ర‌య‌త్నం చేశారు.

అందుకే వ‌ల‌స‌ పాల‌న కాలంలో మ‌న సంప్ర‌దాయాలు, రుషులు, రైతులు, శాస్త్రవేత్త‌లు, మేధస్సు, యోగ‌, ఆయుర్వేద.. వీటన్నింటినీ అప‌హాస్యం చేశారు. మ‌నలోని బ‌లాబ‌లాల‌ను దెబ్బ తీయ‌డం కోసం వారు చేసిన ప్ర‌య‌త్నాల ఫ‌లితంగా మ‌న ప్ర‌జ‌లు త‌మ‌పై న‌మ్మ‌కాన్ని కోల్పోవ‌డం ప్రారంభ‌మ‌యింది.

బానిస‌త్వం నుండి విముక్తి ని పొందిన త‌రువాత అప్ప‌టికి మిగిలి ఉన్న వైభ‌వాన్ని ప‌రిర‌క్షించుకొని ఆధునిక కాలానికి అనుగుణంగా మ‌లుచుకోవాల‌ని భావించినా దాన్ని ప్రాధాన్య‌ాల్లో పెట్ట‌క‌పోవ‌డం దుర‌దృష్ట‌క‌రం. ఈ కార‌ణంగా ఆ వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ వాటి మానానికి వ‌దలి వేశారు.

వ‌ల‌స‌ పాల‌న కాలంలో మ‌న బ‌లాల‌న్నింటినీ నాశ‌నం చేసే ప్ర‌యత్నం జ‌రిగింది. స్వాతంత్ర్యం త‌రువాత కూడా మ‌నం దాన్నే కొన‌సాగించాం. ఒక‌ ర‌కంగా చెప్పాలంటే మ‌న చారిత్ర‌క వైభ‌వాన్ని మ‌న‌మే తిర‌స్క‌రించాం. ఈ కార‌ణాల వ‌ల్ల‌నే మ‌న ముత్త‌వ్వ‌లు ఒక‌ప్పుడు ఉప‌యోగించిన స‌మాచారం, ప‌రిజ్ఞానం అంతటి మీద ఇత‌ర దేశాలు పేటెంట్లు పొందాయి. మ‌నం వారి చేతుల్లో బొమ్మ‌లుగా మారిపోయాం. ఈ రోజున ఆ వైభ‌వం అంతా మ‌రొక‌రి మేధోసంప‌త్తి హ‌క్కుగా మారిపోయింది. ఆ ప‌రిస్థితిని మార్చేందుకు గ‌త మూడు సంవ‌త్స‌రాల కాలంలో ప‌లు ప్ర‌య‌త్నాలు చేసినందుకు నేనెంతో గ‌ర్విస్తున్నాను. ఆ మ‌హోన్న‌త‌మైన సాంస్కృతిక ప్ర‌తిష్టను నేటి ప్ర‌జ‌ల మ‌న‌సుల్లో మ‌రోసారి నాటుకునేలా చేసేందుకు కృషి జ‌రుగుతోంది.

ఈ రోజు మ‌నం ఆయుర్వేద దినోత్స‌వం, జూన్ 21వ తేదీన అంత‌ర్జాతీయ యోగ దినోత్స‌వం జ‌రుపుకొంటున్న సంద‌ర్భంగా ప్ర‌జ‌లు వారి సాంస్కృతిక వార‌స‌త్వం ప‌ట్ల గ‌ర్వ‌ప‌డుతున్నారు. భిన్న దేశాల‌కు చెందిన ప్ర‌జ‌లు యోగ చేయ‌డాన్ని ఛాయాచిత్రాల ద్వారా చూస్తుంటే ల‌క్ష‌లాది మంది యోగ అనే భార‌తీయ సంస్కృతితో అనుసంధానం అవుతున్నార‌నే భావం మ‌న‌కు క‌లుగుతోంది. ప్ర‌తి ఒక్క యుగంలో విల‌సిల్లిన చారిత్ర‌క వైభ‌వం కాలానుగుణంగా కొత్త రూపం సంత‌రించుకుంటూ ప‌రివ‌ర్త‌న చెందుతూ ఉంటుంది. ఒక‌ప్ప‌టి భార‌త సాంస్కృతిక వైభ‌వం యోగ కూడా ప్ర‌పంచ మాన‌వాళి యావ‌త్తుకు విస్త‌రించ‌డం ప్రారంభ‌మ‌యింది. గ‌త మూడు సంవ‌త్స‌రాల కాలంలో జ‌రిగిన కృషి ఫ‌లిత‌మే ఈ ప‌రివ‌ర్త‌న‌. ఇందులో ఆయుష్ మంత్రిత్వ శాఖ కీల‌క పాత్ర పోషించింది.

మిత్రులారా,

ఆయుర్వేద ఒక వైద్య‌ప్ర‌క్రియ మాత్ర‌మే కాదు. దాని ప‌రిధి విస్తృత‌మైంది. సామాజిక ఆరోగ్యం, ప్ర‌జారోగ్యం, ప‌ర్యావ‌ర‌ణ స్వ‌స్థ‌త.. అన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. దీనిని గుర్తించిన ప్ర‌భుత్వం ఆయుర్వేద‌, యోగ‌, ప్ర‌జారోగ్య సంర‌క్ష‌ణ‌తో ముడిప‌డి ఉన్న ఇత‌ర ఆయుష్ వ్య‌వ‌స్థ‌ల‌న్నింటినీ సంఘ‌టితం చేయ‌డంపై దృష్టి సారించింది. ప్ర‌భుత్వం నిర్దేశించుకున్న నాలుగు ప్రాధాన్య‌తాంశాల్లో ఆయుష్‌ను కూడా చేర్చింది. ప్ర‌త్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయ‌డంతో పాటు జాతీయ ఆరోగ్య విధానం రూప‌క‌ల్ప‌న స‌మ‌యంలో ఇత‌ర ఆరోగ్య సేవ‌ల‌తో ఆయుష్ వ్య‌వ‌స్థ‌ను సంఘ‌టితం చేయ‌డానికి నిబంధ‌న‌లు కూడా సిద్దం చేసింది.

మిత్రులారా,

ఆయుష్ వ్య‌వ‌స్థ‌ను ఇత‌ర ఆరోగ్య సేవ‌ల‌తో అనుసంధానం చేయ‌డం అనేది ఇంత‌కు ముందు వ‌లె ఫైళ్ల‌కే ప‌రిమితం కాకూడ‌ద‌ని, అది స‌మ‌ర్థ‌వంతంగా అమ‌లు జ‌ర‌గాల‌ని ప్ర‌భుత్వం గ‌ట్టిగా విశ్వ‌సిస్తోంది. ఈ దిశ‌గా ఆయుష్ మంత్రిత్వ శాఖ ప‌లు చ‌ర్య‌లు తీసుకోవడం మొదలుపెట్టింది. జాతీయ ఆరోగ్య సంర‌క్ష‌ణ ప‌థ‌కం, జాతీయ ఆయుష్ ప్ర‌చారోద్య‌మం, మ‌ధుమేహ ప్ర‌చారోద్య‌మం, ఆయుష్ గ్రామాల అభివృద్ధి వంటి చ‌ర్య‌ల‌పై శ్రీ శ్రీ‌పాద్ నాయ‌క్‌ తో చ‌ర్చించాం.

మిత్రులారా,

దేశంలో ఆయుర్వేదం విస్త‌రించాలంటే ప్ర‌తి ఒక్క జిల్లాలో అన్ని వ‌స‌తుల‌తో కూడిన ఆయుర్వేద ఆస్ప‌త్రుల ఏర్పాటు త‌ప్ప‌నిస‌రి. ఆయుష్ మంత్రిత్వ శాఖ ఈ దిశ‌గా వేగంగా ముందుకు క‌దలింది. మూడేళ్ల కాలంలో 65కి పైగా ఆయుష్ ఆస్ప‌త్రులు ఏర్పాటు చేసింది.

అఖిల భార‌త వైద్య‌శాస్త్రాల అధ్య‌య‌న సంస్థ (ఎయిమ్స్) త‌ర‌హాలోనే అఖిల భార‌త ఆయుర్వేద సంస్థను ఏర్పాటు చేయ‌డం కూడా ఈ ప్ర‌య‌త్నాల్లో భాగ‌మే. ప్రారంభ‌ ద‌శ‌లో రోజూ 750 మందికి పైగా రోగులు ఈ సంస్థ‌ను చికిత్స కోసం సంద‌ర్శిస్తున్నారు. రానున్న కాలంలో ఈ రోగుల సంఖ్య రెట్టింపు అవుతుంద‌ని అంచ‌నా. సాధార‌ణంగా ఏ కార్య‌క్ర‌మానికైనా ప‌రిమాణం విస్త‌రించాల‌న్న ల‌క్ష్యం నిర్దేశిస్తాం. కానీ రోగుల సంఖ్య పెర‌గాల‌ని నేను అనుకోవ‌డంలేదు. అందుకే ప్ర‌జ‌లు ఇక్క‌డ‌కు రావ‌ల‌సిన అవ‌స‌రం లేని ఆరోగ్య‌వంత‌మైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డాల‌ని నేను ఆకాంక్షిస్తున్నాను. ఈ సంస్థ‌ను ఆధునిక మౌలిక వ‌స‌తుల‌తో ఏర్పాటు చేశారు. ఎన్నో తీవ్ర రుగ్మ‌త‌ల‌కు ఆయుర్వేద చికిత్స‌లు అందించేందుకు ఈ మౌలిక వ‌స‌తులు స‌హాయ‌కారిగా ఉంటాయి. ఈ ఆయుర్వేద సంస్థ ఏర్పాటుతో ఆయుర్వేద జ్ఞానానికి మ‌రోసారి స‌మున్న‌త స్థానం ల‌భించ‌డంతో పాటు కొత్త ఉత్తేజం ల‌భిస్తుంద‌ని నేను భావిస్తున్నాను.

ఈ ఆయుర్వేద సంస్థ ఎయిమ్స్, భార‌త ఆరోగ్య ప‌రిశోధ‌నా మండ‌లి, మ‌రికొన్ని అంత‌ర్జాతీయ సంస్థ‌ల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం మ‌రింత ప్రోత్సాహ‌క‌ర‌మైన అంశం. ఈ అఖిల భార‌త ఆయుర్వేద సంస్థ భిన్న విభాగాల స‌మాహారంగా నిలిచి స‌మ‌గ్ర ఆరోగ్య సేవ‌లందించే కేంద్రంగా నిలుస్తుంద‌ని నేను ఆశిస్తున్నాను.

మిత్రులారా,

ఎన్నో గుణాలు ఉన్నటువంటి ఆయుర్వేదం అత్య‌ధిక ప్ర‌యోజ‌న‌క‌రం. ప్ర‌పంచం ఈ రోజు ఆరోగ్యంగానే కాదు.. సుసంప‌న్నంగా కూడా ఉండాల‌ని కోరుకుంటోంది. ఆయుర్వేద‌, యోగ లు మాత్ర‌మే ఈ ప్ర‌యోజ‌నాన్ని అందించ‌గ‌లుగుతాయి. ప్ర‌పంచ‌వ్యాప్తంగా అన్ని దేశాల్లో ఈ రోజు త‌మ “జాతి మూలాల్లోకి తిరిగి వెళ్లాలి”, “ప్ర‌కృతిలోకి తిరిగి వెళ్లాలి” అనే ఒక ప్ర‌గాఢ‌మైన కోరిక ఏర్ప‌డింది. రోజురోజుకూ అధిక సంఖ్య‌లో ప్ర‌జ‌లు ఆ భావంలోకి వెళ్తున్నారు. ప్ర‌కృతితో నేరుగా సంబంధం ఉన్న వ్య‌వ‌స్థ‌ల ప‌ట్ల ప్ర‌జ‌లు ఆక‌ర్షితుల‌వుతున్నారు. ఇలాంటి వాతావ‌ర‌ణంలో ఒక్క ఆయుర్వేదం మాత్ర‌మే అదుకు సానుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని ఏర్పాటు చేయ‌గ‌లుగుతుంది. అందుకే నేటి అవ‌స‌రాల‌కు దీటుగా ఆయుర్వేద వినియోగాన్ని పెంచాల్సిన అవ‌స‌రం ఉంది.

ఆయుర్వేదం చ‌దువుకున్న వారిలో ఎంత మంది నూటికి నూరు శాతం ఈ శాస్త్రానికి క‌ట్టుబ‌డి ఉన్నారు ? వారు ఒక ఆస్ప‌త్రి లేదా ఒపిడి ప్రారంభించిన‌ప్పుడు ఒక రోగి వ‌చ్చి తాను తిరిగి విధుల‌కు హాజ‌రు కావ‌డానికి వీలుగా త్వ‌ర‌గా స్వ‌స్థ‌త క‌లిగించాల‌ని కోరితే ఆ రోగికి ఒక సూదిమందుతో కూడిన అల్లోప‌తి ఔష‌ధం ఇవ్వాల‌నే ఆయుర్వేద వైద్యులు భావిస్తారు. కాని పైకి మాత్రం మ‌న‌కు “ఆయుర్వేద ఆరోగ్య కేంద్రం” అనే బోర్డు క‌నిపిస్తుంది. అంటే ఆయుర్వేదం ప‌ట్ల నూరు శాతం క‌ట్టుబాటు లేద‌నే సంకేత‌మే అది ఇస్తోంది. ఆయుర్వేద వైద్య‌ విధానం స‌మ‌ర్థ‌త‌పై ప్ర‌జ‌ల్లో న‌మ్మ‌కం పున‌రుద్ధ‌రించాలంటే తొలుత ఆయుర్వేదంపై నూరు శాతం అంకితభావం ఏర్ప‌డాలి. తొలుత మ‌నం వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌కం పెట్టాలి. మ‌న చిన్న‌త‌నంలో ఒక ఛలోక్తి ని వినే ఉంటాం. ఒక వ్య‌క్తి ఆహారం తీసుకొనేందుకు స‌మీపంలోని ఒక అల్పాహార శాఖ‌కు వెళ్లాడ‌ట‌. కాని అక్క‌డ ఆ హోట‌ల్ య‌జ‌మాని క‌నిపించ‌లేదు. మీ య‌జ‌మాని ఏడి అని ప‌నివాడిని అడిగితే ఆహారం కోసం ద‌గ్గ‌ర‌ లోని హోట‌ల్‌కి వెళ్లాడ‌ని చెప్పాడ‌ట‌. అలాంటి వాతావ‌ర‌ణంలో ఎవ‌రు అత‌ని హోట‌ల్‌కు వ‌స్తారు ? అందుకే మిత్రులారా, ఆయుర్వేదంతో అనుబంధం క‌లిగిన శాస్త్రవేత్త‌లంద‌రూ ఆయుర్వేద వైద్య‌సేవ‌ల‌ను విస్త‌రించేందుకు కృషి చేయాలి. ఎక్క‌డెక్క‌డ ఆయుర్వేదం స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తుందో కూడా ఆలోచించాలి. ఆయుర్వేదం స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేసే విభాగాల్లో క్రీడారంగం ఒక‌టి. ఇటీవ‌ల కాలంలో ఫిజియోథెర‌పిస్టుల డిమాండు బాగా పెరిగింది. ప్ర‌తి ఒక్క ఆట‌గాడికి ఒక వ్య‌క్తిగ‌త ఫిజియోథెర‌పిస్టు ఉంటున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో ప్ర‌ఖ్యాతి చెందిన ఈ ఆట‌గాళ్లు నొప్పి నివారణి ఔష‌ధాల‌కు తెలియ‌కుండానే అల‌వాటు ప‌డిపోతున్నారు. నొప్పుల నివార‌ణ‌లో ఆయుర్వేద‌, యోగ స‌మ‌ర్థ‌వంతంగా ప‌ని చేస్తాయ‌ని మ‌నంద‌రికీ తెలిసిందే. ఆయుర్వేద‌, యోగా ఆధారిత ఫిజియో థెర‌పీల వ‌ల్ల నిషిద్ధ ఔష‌ధాలు వినియోగించిన‌ప్పుడు ఎదుర‌య్యే రిస్క్ ఉండ‌దు.

క్రీడా రంగంలో వ‌లెనే భ‌ద్ర‌తా ద‌ళాల‌కు కూడా యోగ‌, ఆయుర్వేదం ఎంతో ముఖ్యం. అత్యంత సంక్లిష్టత‌ల‌ను ఎదుర్కొంటూ మ‌న సైనికులు దేశానికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తున్నారు. కొన్ని సంద‌ర్భాల్లో వారిని కొండ‌లు, ఎడారులు, స‌ముద్ర‌మ‌ధ్యంలోని ప్రాంతాల‌, ద‌ట్ట‌మైన అడ‌వుల్లోకి కూడా భిన్న వాతావ‌ర‌ణ ప‌రిస్థితులు, భిన్న సంద‌ర్భాల్లో పంపిస్తూ ఉంటాం. అలాంటి సంద‌ర్బాల్లో ఆయుర్వేద‌, యోగ ప‌లు వ్యాధుల నుండి వారికి ర‌క్ష‌ణ క‌ల్పిస్తాయి. ఆయుర్వేద‌, యోగ‌తో మాన‌సిక ఒత్తిడిని కూడా తేలిగ్గా అధిగ‌మించ‌వ‌చ్చు. మ‌న శ‌రీరం లోని వ్యాధినిరోధ‌క వ్య‌వ‌స్థ‌ను యోగ‌, ఆయుర్వేద ప‌టిష్ఠం చేయ‌గ‌లుగుతాయి. ఏకాగ్ర‌త‌ను కూడా పెంచుతాయి.

ఆయుర్వేద వైద్య‌విద్య నాణ్య‌త‌పై కూడా దృష్టి కేంద్రీక‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. పంచ‌క‌ర్మ థెర‌పిస్టు, ఆయుర్వేద డైటీషియ‌న్‌, పెరాలిసిస్ అన‌లిస్ట్, ఆయుర్వేద ఫార్మ‌సిస్ట్ వంటి అనుబంధ విభాగాల‌ను కూడా అభివృద్ధి చేయాలి. ఆయుర్వేద వైద్య విద్య‌లో భాగంగా భిన్న స్థాయిల్లో బోధించే పాఠ్యాంశాల‌ను కూడా ప‌రిశీలించి ప్ర‌క్షాళ‌నం చేయాల్సిన అవ‌స‌రం ఉంద‌ని నా సూచ‌న‌. ఆయుర్వేద వైద్యం, స‌ర్జ‌రీలో బాచిల‌ర్ డిగ్రీ (బిఎఎంఎస్‌) పొందిన విద్యార్థి ప్ర‌కృతి, ఆయుర్వేద ఆహారం, ఆయుర్వేద ఫార్మ‌సీని కూడా నేర్చుకుంటాడు. ఐదు సంవ‌త్స‌రాల విద్యాభ్యాసం పూర్తి చేసి ప‌ట్టా పొందిన త‌ర్వాత అత‌ను సొంతంగా ప్రాక్టీస్ అయినా పెట్ట‌వ‌చ్చు లేదా మ‌రింత ఉన్న‌త విద్య అభ్య‌సించేందుకు వెళ్ల‌వ‌చ్చు.

మిత్రులారా,

ఉత్తీర్ణత పొందిన ప్ర‌తి స్థాయిలో ఆ విద్యార్థి ఒక స‌ర్టిఫికెట్ ను పొందే విధంగా బిఎఎమ్ ఎస్ కోర్సును డిజైన్ చేయ‌డం సాధ్య‌మా అన్న‌ది ఆలోచించాలి. దాని వ‌ల్ల రెండు ప్ర‌యోజ‌నాలు ఉంటాయి. విద్యార్థులు ప్రాక్టీస్ చేసుకొంటూనే ఉన్న‌త విద్య అభ్య‌సించ‌వ‌చ్చు లేదా ఏదైనా ద‌శ‌లో ఏ కార‌ణం చేత అయినా విద్యాభ్యాసాన్ని వ‌దిలిపెట్టిన వారు తాము అభ్యాసం చేసిన స్థాయి వ‌ర‌కు స‌ర్టిఫికెట్ పొంద‌గ‌లుగుతారు. దీని వ‌ల్ల పూర్తిగా ఐదు సంవ‌త్స‌రాలు విద్య‌భ్యాసం చేసిన వారు మెరుగైన ఉపాధి పొంద‌డం సాధ్య‌మ‌వుతుంది. స్పాల్డింగ్ రీహాబిలిటేష‌న్ ఆసుపత్రి, హార్వ‌ర్డ్ మెడిక‌ల్ స్కూల్‌ లతో స‌హ‌కార ఒప్పందం కుదుర్చుకున్న‌ట్టు ఇప్పుడే శ్రీ శ్రీ‌పాద్ నాయ‌క్ నాకు చెప్పారు. ఇది నిజంగా నాకు ఆనందం క‌లిగించింది. ఉభ‌య వ‌ర్గాల‌ను నేను అభినందిస్తున్నాను. క్రీడారంగంలో వినియోగించ‌ద‌గిన ఔష‌ధాలు, రీహాబిలిటేష‌న్ మెడిసిన్ ల వంటివి అభివృద్ధి చేసేందుకు, నొప్పి నివారణి ఆయుర్వేద చికిత్స అవ‌కాశాలు అధ్య‌య‌నం చేసేందుకు ఈ స‌హ‌కార భాగ‌స్వామ్యం స‌హాయ‌కారిగా ఉంటుంద‌ని నేను ఆశిస్తున్నాను.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా,

కొద్ది క్ష‌ణాల క్రిత‌మే నేను ఆయుర్వేద చికిత్స‌కు సంబంధించిన ప్రామాణిక ప‌ద‌జాలం, ప్రామాణిక మార్గ‌ద‌ర్శ‌కాల పోర్ట‌ల్‌ను ప్రారంభించాను. దీని వ‌ల్ల అధిక మొత్తంలో డేటా అందుబాటులోకి వ‌స్తుంది. ఆధునిక ఆయుర్వేద వైద్య విధానాలకు దీటుగా శాస్త్రీయ‌ గుర్తింపు పొంద‌డానికి ఈ డేటా ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఆయుష్ శాస్ర్తంలో ఇది ఒక మైలురాయిగా నిలుస్తుంది. దీని స‌హాయంతో ఆయుర్వేద‌కు సార్వ‌జ‌నీన ఆమోద‌నీయ‌త ల‌భిస్తుంది. అందుకే ఆయుర్వేద‌కు ప్రామాణిక ప‌ద‌జాలం, ప్రామాణిక మార్గ‌ద‌ర్శ‌కాలు అత్యంత అవ‌స‌రం. ఇలాంటి స‌దుపాయం లోపించిన‌ట్ట‌యితే ఆయుర్వేద వైద్య‌విధానాన్ని అల్లోప‌తిక్ ప్ర‌పంచం అణ‌చివేస్తుంది. మ‌న దేశంలో ఒకే వ్యాధిని భిన్న ప్రాంతాల్లో భిన్న ప‌దాల‌తో ఉచ్ఛ‌రిస్తూ ఉంటారు. అందుకే ప్రామాణిక ప‌ద‌జాలం లేక‌పోతే మ‌నం ప్ర‌పంచాన్ని స‌రైన బాట‌లో అందుకోలేం. ఈ కోణంలో నుండి చూసినా ఈ పోర్ట‌ల్ ఎంతో ఉప‌యోగ‌క‌రంగా ఉంటుంది. ఆయుర్వేద వైద్యంలో అనుస‌రించే విధానాలు నేటి కాలానికి సానుకూలం కాక‌పోవ‌డం వ‌ల్ల ఆయుర్వేదం ప్ర‌జ‌ల ఇళ్ల‌కు దూరం అయిపోయింద‌ని కేంద్ర‌ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసిన క‌మిష‌న్ ఒక‌టి ఒక‌ప్పుడు వ్యాఖ్య‌నించింది. అందుకే త్వ‌రితంగా వినియోగించుకొనేందుకు అందుబాటులో ఉండే అల్లోప‌తి వైద్య‌విధానాల వైపు స‌గ‌టు జీవి మొగ్గు చూపుతున్నాడు. అలాగే ఆయుర్వేద ఔష‌ధాలు త‌యారుచేసుకొనేందుకు అధిక స‌మ‌యం ప‌ట్ట‌డం, సుదీర్ఘ ప్ర‌క్రియ కావ‌డం కూడా వారు ఆయుర్వేదానికి దూరం కావ‌డానికి కార‌ణం. నేటి ఫాస్ట్ ఫూడ్ యుగంలో ఆయుర్వేద ఔష‌ధాల‌కు ఉప‌యోగించే పాత‌ కాలం నాటి ప్యాకేజింగ్ కూడా ప‌ని చేయ‌దు. ఆయుర్వేద ఔష‌ధాల ప్యాకేజింగ్ కొత్త‌గా ఉండి చికిత్స విధానాల్లో ప్రామాణిక‌త వ‌చ్చి సార్వ‌త్రిక ప‌ద‌జాలం కూడా అందుబాటులోకి వ‌చ్చిన‌ప్పుడు ఆయుర్వేద వ్య‌వ‌స్థ త్వ‌రిత గ‌తిన పురోగ‌తిని సాధిస్తుంది.

నేటి ప్ర‌పంచంలో ప్ర‌జ‌లు స‌త్వ‌ర ఫ‌లితాలు కోరుతున్నారు. ఆ వ్యామోహంలో వారు ఔష‌ధాల దుష్ర్ప‌భావాల గురించి ప‌ట్టించుకోవ‌డంలేదు. కాని ఈ ఆలోచ‌న ధోర‌ణి చాలా పొర‌పాటు. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకుని ఎలాంటి దుష్ర్ప‌భావాల‌కు తావు లేని త‌క్ష‌ణ ఫ‌లితాలు ఇచ్చే ఆయుర్వేద ఔష‌ధాల‌పై ప‌రిశోధ‌న జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. మ‌నం ఈ ధోర‌ణుల నుండే ఆలోచించి వాటిని నిర్మించాల్సిన అవ‌స‌రం ఉంది.

సోద‌ర‌ులు మరియు సోద‌రీమ‌ణులారా,

ఆయుష్ మంత్రిత్వ శాఖ ఆధ్వ‌ర్యంలో 600 ఆయుర్వేద ఔష‌ధాల‌కు ఫార్మ‌సీ ప్ర‌మాణాలు ప్ర‌చురించిన‌ట్టు నాకు తెలిసింది. ఆయుర్వేదానికి ఎంత ఎక్కువ ప్ర‌చారం ల‌భిస్తే అది అంత‌గా ప్ర‌జ‌ల్లోకి చొచ్చుకుపోతుంది. ఈ రోజు మూలికా ఔష‌ధాల‌కు విస్తార‌మైన విపణి ఉంది. ఇక్క‌డ కూడా భార‌తదేశం త‌న పూర్తి సామ‌ర్థ్యాల‌ను ఉప‌యోగించుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఉంది. మూలికా, ఔష‌ధ మొక్క‌లు ఆదాయ ఆర్జ‌న‌కు కీల‌కంగా మారుతున్నాయి. ఆయుర్వేద విధానంలో ఇలాంటి మొక్క‌లు అందించే భాగాల నుంచే ఔష‌ధాలు త‌యారుచేస్తారు. ఈ మొక్క‌లను పెంచ‌డానికి సార‌వంత‌మైన భూములు, అధిక‌మొత్తంలో నీరు కూడా అవ‌స‌రం లేదు. కొన్ని ఔష‌ధ మొక్క‌లైతే ఎలాంటి స‌దుపాయాలు కోర‌వు. ఇలాంటి మొక్క‌ల ప్రాధాన్యం తెలియ‌క వాటిని క‌లుపుమొక్క‌లుగా భావించి మ‌నం ఏరి పారవేస్తుంటాం. తెలియ‌నిత‌నంతో చేసే ఈ పొర‌పాట్ల‌ను ఎలా నివారించ‌వ‌చ్చున‌నేది కూడా మ‌నం ఆలోచించాల్సిన అవ‌స‌రం ఉంది.

వైద్యంలో ఉప‌యోగ‌ప‌డే ఔష‌ధి మొక్కల పెంప‌కం ద్వారా కూడా కొత్త ఉపాధి అవ‌కాశాలు క‌ల్పించ‌వ‌చ్చు. నైపుణ్యాల అభివృద్ధి మంత్రిత్వ శాఖ స‌హ కారంతో ఈ విభాగంలో రైతాంగం, విద్యార్థుల కోసం ఒక స్వ‌ల్ప‌కాలిక కోర్సును త‌యారుచేయాల‌ని నేను ఆయుష్‌ మంత్రిత్వ శాఖ‌ను కోరుతున్నాను. ఆయుర్వేదంలో స‌ముద్ర‌పు మొక్క‌ల వినియోగంపై ఏమైనా ప‌రిశోధ‌న జ‌రిగిందా ? భార‌తదేశానికి విస్తార‌మైన కోస్తా తీరం ఉంది. ఆయుర్వేద ఔష‌ధాల‌కు ఆ కోస్తాతీరం ఏమైనా ఉప‌యోగ‌క‌ర‌మేనా ? ఇందులో నేను నిపుణుడిని కాన‌న్న విష‌యం నాకు తెలుసు. కానీ ఈ అంశంపై ప‌రిశోధ‌న నిర్వ‌హించిన‌ట్ట‌యితే మ‌త్స్య‌కారుల జీవితాల్లో కూడా మ‌నం మార్పు తీసుకురాగ‌లుగుతాం. అలాగే కూర‌గాయ‌ల‌తో త‌యారుచేసే ఔష‌ధాల‌పై ప‌రిజ్ఞానాన్ని మ‌రింత ప‌రిపుష్టం చేసిన‌ట్ట‌యితే ఆ విభాగంలో ఆస‌క్తి గ‌ల వారి సంక్షేమం కూడా చూసిన‌ వారుగా నిలుస్తాం. ఒక రైతు సాంప్ర‌దాయకంగా వ్య‌వ‌సాయం చేసుకునే భూమికి అంచుల్లో ఉండే భూమిని వైద్య‌రంగానికి అవ‌స‌రం అయిన మొక్క‌ల పెంప‌కం కోసం వినియోగించుకొన్న‌ట్ట‌యితే అత‌ని ఆదాయాలు పెరుగుతాయి. 2022 సంవ‌త్స‌రం భార‌తదేశ 75వ స్వాతంత్ర్య‌దినోత్స‌వ వేడుక‌లు నిర్వ‌హించుకునే స‌మ‌యానికి రైతాంగం ఆదాయాలు రెట్టింపు చేయాల‌ని ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకొంది. ఆయుష్ మంత్రిత్వ శాఖ‌, వ్య‌వ‌సాయ మంత్రిత్వ శాఖలు ఈ దిశ‌గా ఆలోచించి వ్య‌వ‌సాయ భూముల చివ‌ర‌న ఉంటే గ‌ట్లు, భూముల్లో ఔష‌ధి మొక్క‌లు పెంచేలా వ్య‌వ‌సాయ‌దారుల‌ను చైత‌న్య‌వంతుల‌ను చేసిన‌ట్ట‌యితే రైతాంగానికి అద‌న‌పు ఆదాయం స‌మ‌కూర్చి పెట్ట‌డం సాధ్యం అవుతుంది.

మిత్రులారా,

అభివృద్ధి, విస్త‌ర‌ణ కోసం ఈ రంగంలో భారీ మొత్తంలో పెట్టుబ‌డులు అవ‌స‌రం. ఆరోగ్య సంర‌క్ష‌ణ రంగంలో నూరు శాతం ఎఫ్‌డిఐల‌ను ప్ర‌భుత్వం అనుమ‌తించింది. ఆరోగ్య‌ సంర‌క్ష‌ణ రంగంలోనే భాగం అయిన ఆయుర్వేద‌, యోగ‌లో కూడా ఎఫ్‌డిఐ ప్ర‌యోజ‌నాలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి జ‌ర‌గాల్సిన అవ‌స‌రం ఉంది. అల్లోప‌తిక్ ఆసుపత్రుల‌కు చేయూత ఇస్తున్న తీరు లోనే యోగ‌, ఆయుర్వేద విభాగాల‌కు కూడా చేయూత ఇచ్చేందుకు ముందుకు రావాల‌ని నేను కార్పొరేట్ కంపెనీలను, ప్రైవేటు రంగాన్ని కోరుతున్నాను.

మ‌న పూర్వీకులు ఎంతో క‌ష్ట‌న‌ష్టాల‌కు ఓర్చి మాన‌వాళి సంక్షేమం స్ఫూర్తితో వేలాది సంవ‌త్స‌రాల క్రితం ఈ విజ్ఞానాన్ని త‌యారు చేశార‌న్న విష‌యం మ‌నం మ‌రిచిపోకూడ‌దు. ప్ర‌యోగాలు, న‌వ్య‌త‌పై వారికి గ‌ల వ్యామోహమే యోగ‌, ఆయుర్వేదా లు సాధించిన అద్భుతాల‌కు జ‌న్మ‌నిచ్చింది. కాని న‌వ్య‌త‌ను ఎప్పుడైతే మ‌నం నిర్ల‌క్ష్యం చేయ‌డం మొద‌లుపెట్టామో అప్పుడే మ‌న జీవితాల్లో మార్పు ప్రారంభ‌మై సాంప్ర‌దాయక విధానాల ప్ర‌భావం క్షీణత ప్రారంభ‌మ‌యింది.

ఆ ప‌రిస్థితిని పూర్తిగా మార్చివేయాల్సిన స‌మ‌యం ఇది. ఈ రోజు ప్ర‌పంచం యావ‌త్తు ప‌రిపూర్ణ‌మైన ఆరోగ్య సంర‌క్ష‌ణ వ్య‌వ‌స్థ కోసం అన్వేషిస్తోంది. ప్ర‌పంచం మొత్తం ఆయుర్వేద‌, యోగ శ‌క్తిని గుర్తించి భార‌తదేశం వైపు ఎంతో ఆశ‌గా, ఆస‌క్తిగా ఎదురు చూస్తోంది. ఆయుర్వేద‌, యోగ‌లో భార‌తదేశం అనుభ‌వాలు మొత్తం ప్ర‌పంచ మాన‌వాళి సంక్షేమానికి ఉప‌యోగ‌ప‌డ‌తాయ‌నే విశ్వాసం వారికి ఉంది. ఈ త‌రుణంలో భార‌తదేశం స‌మ‌యం ఏ మాత్రం వృథా చేయ‌కూడ‌దు. గ‌ట్టి క‌ట్టుబాటుతో ముందుకు సాగి వారి న‌మ్మ‌కం స‌రైందేన‌ని నిరూపించాలి.

మిత్రులారా,

ఏకం శ‌త విప్ర బ‌హుధా వ‌దంతి అనే నానుడి మ‌న‌కు ఉంది. ఉన్న‌ది ఒక్క‌టే అయినా రుషులు దాన్ని వివిధ పేర్ల‌తో ప్ర‌స్తావిస్తార‌ని దాని అర్ధం. అదే సూక్తి అన్ని వైద్య విధానాలు, ఫార్మాస్యూటిక‌ల్ విధానాల‌కు కూడా వ‌ర్తిస్తుంది. మ‌నం అన్ని ఆరోగ్య సంర‌క్ష‌ణ విధానాల‌ను గౌర‌విస్తాం, ప్ర‌తి ఒక్క‌రి పురోగ‌తిని కోరుకుంటాం. భార‌తదేశ ప్ర‌జాస్వామ్యం వ‌లెనే ప్ర‌తీ ఆరోగ్య‌వ్య‌వ‌స్థ‌కు కూడా ప్ర‌జాస్వామిక హ‌క్కు ఉంది. ప్ర‌తి ఒక్క ఆరోగ్య విధానానికి గౌర‌వాన్ని అందుకుని పురోగ‌మించే హ‌క్కు ఉంది. పేద‌ల‌కు అన్ని ర‌కాల వైద్య‌విధానాలు అందుబాటులో ఉంచాల‌న్న‌దే ప్ర‌భుత్వ ల‌క్ష్యం. పేద‌ల‌కు అన్ని ర‌కాల చికిత్స‌లు త‌క్కువ ధ‌ర‌ల‌కు అందుబాటులో ఉంచాల‌ని ఆకాంక్షిస్తోంది. ఆరోగ్య సంర‌క్ష‌ణ విధానంలో ప్ర‌భుత్వం -నివార‌ణీయ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌, త‌క్కువ ధ‌ర‌ల‌కే అంద‌రికీ అందుబాటులో ఆరోగ్య సంర‌క్ష‌ణ- అనే రెండు సూత్రాలు కీల‌కం.

నివార‌ణీయ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌లో భాగంగా సాధార‌ణ టీకామందుల కార్య‌క్ర‌మం కింద ఇప్ప‌టివ‌ర‌కు ఎలాంటి టీకామందులు వేయించుకోని బాల‌లంద‌రికీ 2020 నాటికి టీకా మందులు వేయించాల‌న్న ల‌క్ష్యంతో ఇంద్ర‌ధ‌నుష్ కార్య‌క్ర‌మం మేం చేప‌ట్టాం. 12 ర‌కాల వ్యాధుల‌కు సంబంధించిన టీకా మందులు అలాంటి బాల‌లంద‌రికీ ఇప్పించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. ఈ కార్య‌క్ర‌మం కింద రెండున్న‌ర కోట్ల మందికి పైగా బాల‌బాలిక‌లు, 70 ల‌క్ష‌ల మంది గ‌ర్భిణిల‌కు టీకాలు వేయించ‌డం జ‌రిగింది.

టీకా మందుల కార్య‌క్ర‌మంలో వేగం పెంచేందుకు ప్ర‌భుత్వం తీసుకున్న చ‌ర్య‌ల ఫ‌లితంగానే ఒక‌ప్పుడు ఏడాదికి ఒక శాతం వృద్ధిని సాధిస్తున్న టీకా మందుల కార్య‌క్ర‌మం మూడేళ్ల క్రితం మేం ఇంద్ర‌ధ‌నుష్ చేప‌ట్టిన త‌రువాత ఆరు శాతం వృద్ధి సాధిస్తోంది. ఈ నెల‌లోనే ఈ కార్య‌క్ర‌మంపై ప్ర‌భుత్వం మ‌రింత దృష్టి పెట్టింది. మ‌రింత ఉద్ధతి పెంచిన ఇంద్ర‌ధ‌నుష్ కార్య‌క్ర‌మం కింద ఇప్ప‌టి వ‌ర‌కు టీకా మందుల కార్య‌క్ర‌మంలో వెనుక‌బ‌డిన జిల్లాల‌పై అధికంగా ప్ర‌భుత్వం దృష్టి సారిస్తోంది. దేశ‌వ్యాప్తంగా 173 జిల్లాల్లో ప్ర‌తి నెలా వారం రోజుల పాటు నిరంత‌రాయంగా ఇంద్ర‌ధ‌నుష్ కింద టీకామందుల కార్య‌క్ర‌మం వ‌చ్చే ఏడాది వ‌ర‌కు కొన‌సాగుతుంది. 2018 నాటికి దేశంలో నూరు శాతం టీకా మందుల ల‌క్ష్యాన్ని ప్ర‌భుత్వం నిర్దేశించుకొంది.

మిత్రులారా,

గ‌తంలో ఆరోగ్య సంర‌క్ష‌ణ అనేది ఆరోగ్య మంత్రిత్వ శాఖ బాధ్య‌త అని ప్ర‌గాఢంగా విశ్వ‌సించే వారు. కానీ మా ఆలోచ‌న భిన్న‌మైంది. ఉద్ధతి పెంచిన ఇంద్ర‌ధ‌నుష్ కార్య‌క్ర‌మంలో ఇప్పుడు మేం12 మంత్రిత్వ శాఖ‌ల‌ను భాగ‌స్వాముల‌ను చేశాం. ఇందులో ర‌క్ష‌ణ శాఖ‌కు కూడా ప్రాతినిధ్యం ఉంది.

సోద‌రులు మరియు సోద‌రీమ‌ణులారా ,

నివార‌ణీయ ఆరోగ్య సంర‌క్ష‌ణ‌కు మ‌రో మార్గం స్వ‌చ్ఛ‌త‌. పారిశుధ్యాన్ని ప్ర‌భుత్వం ఒక ప్ర‌జా ఉద్య‌మంగా మార్చింది. మూడు సంవ‌త్స‌రాల కాల‌ వ్య‌వ‌ధిలో ప్ర‌భుత్వం ఐదు కోట్ల మ‌రుగుదొడ్లు నిర్మించింది. స్వ‌చ్ఛ‌త ప‌ట్ల ప్ర‌జ‌ల ఆలోచ‌నా ధోర‌ణిలో వ‌చ్చిన మార్పు ఒక ఉదాహ‌ర‌ణ‌గా చూప‌ద‌గింది. కొంత‌మంది ప్ర‌జ‌లు మ‌రుగుదొడ్డిని ఇప్పుడు త‌మ “గౌర‌వం కాపాడే ఇల్లు”గాను, “ఆత్మ‌గౌర‌వానికి ప్ర‌తీక”‌గాను భావిస్తున్నారు. కొద్ది రోజుల క్రితం యూనిసెఫ్ ప్ర‌చురించిన ఒక‌నివేదిక మీరు చ‌దివే ఉంటారు. ఒక గ్రామంలోని ఒక వ్య‌క్తి త‌న ఇంటిలో మ‌రుగుదొడ్డి నిర్మించుకున్న‌ట్ట‌యితే ఆరోగ్య‌ వ్య‌యాల‌పై ఏడాదికి 50 వేల రూపాయ‌లు ఆదా చేసిన‌ట్టేన‌ని ఆ నివేదిక పేర్కొంది. ఒక మ‌రుగుదొడ్డి నిర్మించుకొన్నందుకు ఒక పేద‌వానికి 50 వేల రూపాయ‌లు ఆదా అయిందంటే అది ఎంత పెద్ద మొత్త‌మో మీరు ఆలోచించ‌వ‌చ్చు.

అందుబాటు ధ‌ర‌ల్లో ఆరోగ్య సంర‌క్ష‌ణ‌ను క‌ల్పించాల‌న్న ఒక స‌మ‌గ్ర దృక్ప‌థంతో నివార‌ణీయ ఆరోగ్య సంర‌క్ష‌ణను ప్ర‌భుత్వం ప్రోత్స‌హిస్తోంది. వైద్య‌క‌ళాశాల‌ల్లో విద్యార్థులు ఉన్న‌త విద్యను అభ్య‌సించేందుకు వీలుగా ప్ర‌భుత్వం పిజి వైద్య కోర్సుల్లో సీట్ల‌ను పెంచింది. ఇది నేరుగా యువ‌త‌కు ప్ర‌యోజ‌న‌క‌ర‌మే కాకుండా పేద‌లంద‌రికీ అర్హులైన వైద్యులు అందుబాటులోకి రావ‌డం కూడా రెండో ప్ర‌యోజ‌నం. దేశ‌వ్యాప్తంగా ప్ర‌జ‌లంద‌రికీ నాణ్య‌మైన వైద్య‌సేవ‌లు అందుబాటులోకి తేవాల‌న్న ల‌క్ష్యంతో వివిధ రాష్ట్రాలలో ప్ర‌భుత్వం ‘ఎయిమ్స్’ లను ఏర్పాటు చేస్తోంది. స్టెంట్ల ధ‌ర‌ల్లో కూడా భారీ కోత ప‌డింది. స్టెంట్ల ధ‌ర‌లు 50 వేల రూపాయ‌ల నుండి ల‌క్ష‌, రెండు ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు కొన్ని ర‌కాల స్టెంట్ల‌యితే రెండున్న‌ర ల‌క్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు కూడా ధ‌ర ప‌లికేవి. మ‌ధ్య‌త‌ర‌గ‌తికి చెందిన ఒక వ్య‌క్తి హృద్రోగానికి గురై స్టెంట్ ను వేసుకోవాల్సి వ‌స్తే వాటి ధ‌ర‌లు భ‌రించ‌లేని స్థాయిలో ఉన్నందు వ‌ల్ల ఇంటినే హామీగా పెట్టి అప్పు చేయాల్సిన ప‌రిస్థితి ఉండేది. ప్ర‌భుత్వం స్టెంట్ల త‌యారీదారుల‌తో చ‌ర్చించి అవి ఎందుకు అంత ప్రియంగా ఉన్న‌ది తెలుసుకుంది. వారితో చ‌ర్చించిన అనంత‌రం ధ‌ర‌లు 30 నుంచి 40 శాతం మేర‌కు త‌గ్గాయి. ఈ రోజుల్లో చాలా మంది వ‌యోవృద్ధుల‌కు మోకాలి ఆప‌రేష‌న్‌, మోకాలి చిప్ప మార్పిడి అవ‌స‌రం అవుతోంది. ప్ర‌భుత్వం చొర‌వ తీసుకుని వాటి ధ‌ర‌లు కూడా దిగువ‌కు తెచ్చింది. జ‌న్ ఔష‌ధి దుకాణాల ద్వారా పేద‌ల‌కు త‌క్కువ ధ‌ర‌ల‌కే ఔష‌ధాలు అందుబాటులోకి తెచ్చేందుకు కృషి చేశాం. ఆస్ప‌త్రుల్లో కూడా జ‌న్ ఔష‌ధి స్టోర్లు తెరిపించాం. గ‌తంలో 12 రూపాయ‌ల ధ‌ర ప‌లికిన అత్యుత్త‌మ ఔష‌ధం కూడా ఇప్పుడు రూపాయిన్న‌ర‌కే అందుబాటులో ఉంది.

మిత్రులారా,

సుమారు 24 దేశాల్లోని మ‌న రాయ‌బార కార్యాల‌యాలు ఈ ఏడాది ఆయుర్వేద దినోత్స‌వాన్ని నిర్వ‌హిస్తున్న‌ట్టు నాకు చెప్పారు. గ‌త 30 సంవ‌త్స‌రాల కాలంలో ఐటి విప్ల‌వం ప్ర‌పంచం యావ‌త్తును ఆవ‌రించింది. ఇప్పుడు ఆయుర్వేద సార‌థ్యంలో అదే త‌ర‌హాలో ఆరోగ్య విప్ల‌వం రావాలి. ఈ ప‌విత్ర దినాన “మేం ఆయుర్వేదం పాటిస్తాం, మేం ఆయుర్వేదాన్ని స‌జీవంగా నిలుపుతాం, మేం ఆయుర్వేదం కోసం జీవిస్తాం” అనే ప్ర‌తిజ్ఞ మ‌నంద‌రం చేయాలి.

మిత్రులారా,

ఆయుర్వేద దినోత్స‌వం సంద‌ర్భంగా అఖిల భార‌త ఆయుర్వేద వైద్య సంస్థ త‌ర‌ఫున మీ అంద‌రికీ శుభాకాంక్ష‌లు తెలుపుతూ నేను ఈ ప్ర‌సంగాన్ని ముగిస్తున్నాను. మ‌రోసారి మీ అంద‌రికీ నా శుభాకాంక్ష‌లు.

మీ అంద‌రికీ ధ‌న్య‌వాదాలు.

***