Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

నాన్ యాంగ్ టెక్న‌లాజిక‌ల్ యూనివ‌ర్సిటీ ని సంద‌ర్శించిన ప్రధాన మంత్రి


సింగ‌పూర్ లోని నాన్ యాంగ్ టెక్న‌లాజిక‌ల్ యూనివర్సిటీ ని ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ ఈ రోజు సంద‌ర్శించారు.

విద్యార్థుల‌తో సంభాష‌ణ సంద‌ర్భంగా వారు అడిగిన‌ ప్ర‌శ్న‌ల‌కు ఆయన స‌మాధానాలిచ్చారు.

21వ శ‌తాబ్దంలో ఆసియా కు ఎదుర‌వుతున్న స‌వాళ్ళను గురించి ప్ర‌శ్నించ‌గా, 21వ శ‌తాబ్దాన్ని ఆసియా యొక్క శ‌తాబ్దం అని త‌ర‌చుగా పేర్కొంటున్నార‌ని ప్ర‌ధాన మంత్రి గుర్తుకు తెచ్చారు. మ‌న ప‌ట్ల మ‌నకు న‌మ్మ‌కం ఉండ‌డం అత్యంత అవ‌స‌ర‌ం, ఈసారి మ‌న వంతు వ‌చ్చింద‌ని గ్ర‌హించాల‌ని ఆయ‌న చెప్పారు. సంద‌ర్భానికి త‌గిన‌ట్లుగా మనం ఎదిగి ఆ నాయ‌క‌త్వ బాధ్యతను తీసుకోవాల‌ని ప్ర‌ధాన మంత్రి తెలిపారు.

చైనా లో అధ్య‌క్షులు శ్రీ శీ జిన్‌పింగ్ తో తాను ఇటీవ‌ల స‌మావేశ‌మైన సంగ‌తి ని ప్ర‌ధాన మంత్రి ప్ర‌స్తావించారు. అధ్య‌క్షుల‌ వారు శ్రీ శీ కి తాను ఒక ప‌త్రాన్ని ఇచ్చాన‌ని, అందులో గ‌డ‌చిన 2000 సంవ‌త్స‌రాల‌లోను 1600 సంవ‌త్స‌రాల పాటు ప్ర‌పంచ జిడిపి లో భార‌త‌దేశం మరియు చైనా ల ఉమ్మ‌డి వాటా 50 శాతాన్ని మించిపోయిన సంగ‌తి లిఖించి ఉంద‌ని ఆయ‌న తెలిపారు. పైపెచ్చు, దీనిని ఎటువంటి సంఘ‌ర్ష‌ణ కు తావు లేకుండా సాధించడం జరిగిందని ఆయ‌న వివ‌రించారు. ఎటువంటి ఘ‌ర్ష‌ణ‌కు తావు లేకుండా సంధానాన్ని పెంపొందించుకోవ‌డం పైన మ‌నం శ్ర‌ద్ధ వ‌హించి తీరాలి అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

సుప‌రిపాల‌న‌లో అంత‌రిక్ష సంబంధిత సాంకేతిక విజ్ఞానానికి ఒక కీల‌క‌మైన పాత్ర‌ ఉంది అని ప్ర‌ధాన మంత్రి చెప్పారు. ఇది సామాన్య మాన‌వుడి జీవితాన్ని ఎంత‌గానో మెరుగుప‌ర‌చ గ‌లుగుతుంద‌ని ఆయన అన్నారు. మ‌న అభివృద్ధి సంబంధ అవ‌స్థాప‌న‌ ను స‌రైన రీతిలో కొలవడంలో- అది మ‌న‌కు మ‌రిన్ని విద్యా సంస్థ‌లు కావచ్చు; లేదా ఉత్త‌మ‌మైన ర‌హ‌దారులు కావచ్చు, లేదా అద‌న‌పు ఆసుప‌త్రులు కావచ్చు – అంత‌రిక్ష సాంకేతిక‌ విజ్ఞానం మ‌నకు స‌హాయ‌కారి అవుతుంది అని ప్ర‌ధాన మంత్రి అన్నారు. సంప్రదాయానికి మ‌రియు ప్ర‌పంచీక‌ర‌ణ‌ కు మధ్య స‌మ‌తుల్య‌త పై అడిగిన ఒక ప్ర‌శ్న‌కు ఆయ‌న జ‌వాబిస్తూ, నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లు, నైతిక‌త ల‌తో పాటు మాన‌వీయ విలువ‌ల కార‌ణంగానే మాన‌వాళి కొన్ని యుగాల త‌ర‌బ‌డి పురోగ‌మించింద‌ని ప్ర‌ధాన మంత్రి అన్నారు. సాంకేతిక విజ్ఞానం మాన‌వ సృజ‌నాత్మ‌క‌త‌కు దోహ‌ద ప‌డుతోంద‌ని ఆయ‌న చెప్పారు. వివిధ సామాజిక వేదిక‌లు ల‌క్ష‌లాది మందికి స్వ‌రాన్ని ఇచ్చాయ‌ని ఆయ‌న తెలిపారు.

నాలుగో పారిశ్రామిక విప్ల‌వం కాలంలో అభివృద్ధి ఫ‌లాలు అంద‌రికీ అందేట‌ట్లు చూడ‌డాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి మాట్లాడుతూ, హ‌ఠాత్ ప‌రిణామానికి అర్థం వినాశం కాదు అని తెలిపారు. ప్ర‌జ‌ల‌కు సాధికార‌త‌ ను సాంకేతిక‌ విజ్ఞానం ప్ర‌సాదిస్తుంద‌ని, మ‌రి సాంకేతిక విజ్ఞానం చోద‌క శక్తిగా ఉండేటటువంటి స‌మాజం సామాజిక అవ‌రోధాల‌ను ఛేదించగలదని ఆయ‌న అన్నారు. సాంకేతిక విజ్ఞానం త‌క్కువ ఖ‌ర్చు తోను, వినియోగ‌దారుల ప‌ట్ల స్నేహ‌శీలంగాను ఉండి తీరాలి అని ఆయ‌న వివ‌రించారు. ప్ర‌జ‌లు ఒక‌ప్పుడు కంప్యూట‌ర్ లు అంటే భ‌య‌ప‌డే వారు అని ఆయ‌న గుర్తుకు తెచ్చారు. అయితే, మ‌న జీవితాలు మార్పు చెంద‌డానికి కంప్యూట‌ర్ లు స‌హాయం చేశాయ‌ని ఆయ‌న అన్నారు.

***