Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యాయ వ్య‌వ‌స్థ మౌలిక సౌక‌ర్యాలకు ప్రోత్సాహం 


న్యాయ‌ వ్య‌వ‌స్థ మౌలిక స‌దుపాయాల‌ను అభివృద్ది చేయ‌డానికి ఉద్దేశించిన కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కం (సిఎస్ ఎస్‌) ప‌న్నెండో పంచ‌వ‌ర్ష ప్ర‌ణాళిక అనంతరం కూడా కొన‌సాగడానికి వీలుగా ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశ‌మైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. అంటే, 1-4-2017 నుండి 31-3-2020 వ‌ర‌కు యుద్ధ ప్రాతిప‌దిక‌న ఈ ప‌ని చేయ‌డం జ‌రుగుతుంది. రూ.3,320 కోట్ల నిధుల అంచ‌నాతో నేష‌న‌ల్ మిష‌న్ ఫ‌ర్ జ‌స్టిస్ డెలివ‌రీ అండ్ లీగ‌ల్ రిఫార్మ్ స్ ద్వారా మిషన్ మోడ్ లో ఈ పనిని చేస్తారు.

ఆన్ లైన్ ప‌ర్య‌వేక్షక వ్య‌వ‌స్థ‌ను ఏర్పాటు చేయ‌డానికి కూడా మంత్రివర్గం ఆమోదం తెలిపింది. దీనికి న్యాయ‌ శాఖ జియోటాగింగ్ చేస్తుంది. త‌ద్వారా పురోగ‌తి పైన స‌మాచార సేక‌ర‌ణ‌, నిర్మాణంలో ఉన్న నివాస స‌ముదాయాలు, కోర్టు హాళ్లు పూర్తి కావ‌డం పైనా, ఇంకా భ‌విష్యత్తు కార్య‌క్ర‌మాలు, మెరుగైన రీతిలో ఆస్తుల నిర్వ‌హ‌ణ పైన పర్య‌వేక్ష‌ణ జ‌రుగుతుంది. అంతే కాదు ఈ ప‌థ‌కంలో భాగంగా దేశ‌వ్యాప్తంగా భ‌విష్య‌త్ లో నిర్మించ‌బోయే కోర్టు హాల్స్ మరియు నివాస భవన స‌ముదాయాల‌ కోసం నియ‌మ నిబంధ‌న‌ల రూప‌క‌ల్ప‌న జ‌రుగుతుంది.

ప‌థ‌కం వ‌ల్ల చేకూరే ప్ర‌యోజ‌నాలు:

ఈ ప‌థ‌కం వ‌ల్ల దేశ‌వ్యాప్తంగా కోర్టుల అందుబాటు పెరగుతుంది. అంతే కాదు దేశ‌వ్యాప్తంగా ప‌ని చేసే జిల్లా/స‌బార్డినేట్ కోర్టుల న్యాయ‌మూర్తులు, న్యాయ అధికారుల కోసం నివాస స‌ముదాయాలు పెరుగుతాయి. జిల్లా, స‌బ్ జిల్లా, తాలూకా, త‌హ‌శీల్‌, గ్రామ‌ పంచాయతీ, గ్రామ స్థాయి ల‌లో ఈ ప‌ని జ‌రుగుతుంది. దేశం లోని ప్ర‌తి పౌరునికి ప్ర‌యోజ‌నం జ‌రిగేలా న్యాయ‌ వ్య‌వ‌స్థ నిర్వ‌హ‌ణ‌ను, సామ‌ర్థ్యాన్ని మెరుగు ప‌ర‌చ‌డానికి ఈ ప‌ని ఉప‌యోగ‌ప‌డుతుంది.

ఆర్ధిక సహాయం:

కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కం (సిఎస్ ఎస్ ) కింద ఆయా రాష్ట్ర ప్రభుత్వాల‌కు, కేంద్ర పాలిత ప్రాంతాల‌కు కేంద్ర సహాయాన్ని సమకూర్చుతారు. న్యాయ‌ వ్య‌వ‌స్థ మౌలిక స‌దుపాయాలను మెరుగుప‌ర‌చ‌డానికి ఈ ప‌థ‌కాన్ని ఉప‌యోగిస్తారు. కోర్టు హాళ్ల‌ను నిర్మించ‌డం జ‌రుగుతుంది. జిల్లా మరియు స‌బార్డినేట్ కోర్టుల న్యాయ‌మూర్తులు / న్యాయ అధికారుల‌ కోసం నివాస స‌ముదాయాల‌ను నిర్మించడానికి ఈ ప‌థ‌కం ఉప‌యోగ‌ప‌డుతుంది. కేంద్రం, రాష్ట్రాల మ‌ధ్య నిధుల పంపిణీ 60:40 నిష్ప‌త్తిలో ఉంటుంది. అయితే ఈ నిబంధ‌న ఈశాన్య ప్రాంతం మ‌రియు హిమాల‌య ప్రాంత రాష్ట్రాల‌కు వ‌ర్తించ‌దు. ఈశాన్య, హిమాల‌య ప్రాంత రాష్ట్రాల‌కు సంబంధించి నిధుల పంపిణీ 90:10 నిష్ప‌త్తిలో ఉంటుంది. కేంద్ర పాలిత ప్రాంతాలలో 100 శాతం కేంద్ర‌మే భ‌రిస్తుంది. ఈ ప‌థ‌కం వ‌ల్ల దేశ వ్యాప్తంగా కొన‌సాగుతున్న‌ 3,000 కోర్టు హాళ్ల నిర్మాణం పూర్త‌ి అవుతుంది. అలాగే జిల్లా మరియు స‌బార్డినేట్ కోర్టులలోప‌ని చేసే న్యాయ అధికారుల‌ కోసం దేశ‌వ్యాప్తంగా కొన‌సాగుతున్న 1,800 నివాస భవన స‌ముదాయాల నిర్మాణం పూర్త‌ి అవుతుంది.

ప‌థ‌కం యొక్క ప‌ర్య‌వేక్ష‌ణ

ఆన్ లైన్ ప‌ర్య‌వేక్ష‌క వ్య‌వ‌స్థ‌ను న్యాయ‌ విభాగం ఏర్పాటు చేస్తుంది. దీని ద్వారా పురోగ‌తి పైన స‌మాచార సేక‌ర‌ణ జ‌ర‌గుతుంది. కోర్టు హాళ్ల, నివాస భవన స‌ముదాయాల నిర్మాణ ప‌నిని ప‌ర్య‌వేక్షిస్తారు. ఆస్తుల‌ను మెరుగ్గా నిర్వ‌హించడం జ‌రుగుతుంది.

ఆయా రాష్ట్రాల్లో ప్ర‌ధాన కార్య‌ద‌ర్శులు, పిడ‌బ్ల్యుడి అధికారుల‌తో క‌లిసి ప‌ర్య‌వేక్ష‌ణ సంఘం క్ర‌మం త‌ప్ప‌కుండా స‌మావేశాల‌ను నిర్వ‌హిస్తుంది. తద్వారా నిర్మాణాలు వేగంగా కొన‌సాగుతాయి. అంతే కాదు కేంద్రం విడుద‌ల చేసిన నిధుల‌ను ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాలు ఎటువంటి జాప్యం లేకుండా పిడ‌బ్ల్యుడి కి విడుద‌ల చేస్తున్న‌దీ, లేనిదీ ఈ క‌మిటీ ప‌ర్య‌వేక్షిస్తుంది.

పూర్వ రంగం:

ఆయా రాష్ట్రాల‌కు కావ‌ల‌సిన వ‌న‌రుల‌ను కేంద్ర ప్ర‌భుత్వ‌మే కేంద్ర ప్రాయోజిత ప‌థ‌కం (సిసి ఎస్‌) ద్వారా అందిస్తుంది. ఈ ప‌థ‌కం 1993-94 నుండి అమ‌లవుతోంది. న్యాయ‌ వ్య‌వ‌స్థ మౌలిక స‌దుపాయాల‌ను మెరుగుప‌ర‌చ‌డానికి ఈ ప‌థ‌కాన్ని త‌యారు చేశారు. ఈ పథకంలో భాగంగా ఆయా రాష్ట్ర ప్ర‌భుత్వాల‌కు, కేంద్ర‌పాలిత ప్రాంతాల‌కు కేంద్ర సాయాన్ని అందించ‌డం జ‌రుగుతుంది. జిల్లా మ‌రియు స‌బార్డినేట్ కోర్టుల‌లో ప‌ని చేసే న్యాయ అధికారులు, న్యాయ‌మూర్తుల‌కు నివాస స‌ముదాయాలు, కోర్టు హాళ్ల నిర్మాణం కోసం ఈ ప‌థ‌కాన్ని రూపొందించారు.