Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

న్యూ ఢిల్లీ లోని విజ్ఞాన్ భవన్ లో సిపిఎస్ఇ కోంక్లేవ్ 2018 సందర్భంగా ప్రధాన మంత్రి ఉపన్యాసం పాఠం


నా సహచరుడు భారీ పరిశ్రమలు, ప్రభుత్వ రంగ సంస్థల శాఖ మంత్రి శ్రీ అనంత్ గీతే, సహాయ మంత్రి శ్రీ బాబుల్ సుప్రియో, నా సహచరులు శ్రీ పి.కె. మిశ్రా, శ్రీ పి.కె. సిన్హా, దేశం లోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల సీనియర్ అధికారులు, ఇతర ప్రముఖులు, సోదరీమణులు మరియు సోదరులారా,

అనంత్ గీతే గారు పాడలేరు, కానీ బాబుల్ గారు పాడగలరు. ప్రభుత్వ రంగ పరిశ్రమలు అనే చిన్న ప్రపంచంలో ఇది కొత్త ప్రారంభం. మీ అందరినీ సిపిఎస్ఇ సదస్సు కు ఆహ్వానిస్తున్నాను. మీ అందరికీ అభినందనలు. మీ అందరి శ్రమను, మీ లోని ఉత్సాహాన్ని, గత గంట లేదా గంటన్నర సమయంలో మీరు ఇక్కడ ఇచ్చిన ప్రెజెంటేశన్ లలోని స్పష్టత ను నేను స్పష్టంగా గమనించగలుగుతున్నాను. కార్పొరేట్ పాలన నుండి నవకల్పనలు, సాంకేతిక విజ్ఞ‌ానం, న్యూ ఇండియా ల వంటి అంశాలపై మీ అందరి దార్శనికతను, ఆలోచనలను గురించి తెలుసుకొనే అవకాశం చిక్కింది. గతంలో ఏ ప్రధాన మంత్రికి అయినా ఇలాంటి అవకాశం వచ్చిందో లేదో మరి నాకు తెలియదు.

చర్చలో పాల్గొన్న వారు, ప్రెజెంటేశన్ ను తయారుచేసిన బృందంతో కలిసి పని చేసిన వారందరినీ నేను అభినందిస్తున్నాను. వారు నా అభిప్రాయాలను కూడా తెలుసుకొని మరింత లోతుగా చర్చించి ఉండాల్సింది. వారికి సాంప్రదాయక ఆలోచన ధోరణి కన్న భిన్నంగా ఆలోచించే అవకాశం లభించి ఉండేది.

గత కొద్ది నెలలుగా మీరంతా సమగ్రమైన చర్చలలో పాల్గొన్నట్టు నాకు చెప్పారు. మీ మీ రంగాలలో మార్పు ను తీసుకురావడానికి మీరంతా ఎంతో పరిశోధన చేశారు. నా అభిప్రాయాలను కూడా మీరు తెలుసుకుని ఉంటే వాటిని కూడా మీ చర్చలలో పొందుపరచి మీ ఆలోచనలు, నా ఆలోచనల మధ్య సమతుల్యతను తీసుకువచ్చే అవకాశం లభించి వుండేది. ఏమైనా మీలో ప్రతి ఒక్కరు చర్చల ప్రక్రియలో గాని, చర్చలలో గాని ఏదో ఒక రకంగా పాల్గొని వుంటారు.

మీ చర్చల సమయంలో మీరు రోజువారీ ఎదుర్కొనే ఎన్నో సవాళ్ల ను గురించి చర్చించే వుంటారు. ఆ సమస్యలను అధిగమించేందుకు ప్రభుత్వం పట్టు వదలకుండా ప్రయత్నిస్తోంది. ప్రభుత్వ రంగ సంస్థలు మరింత బాగా పని చేసేందుకు వీలుగా ప్రభుత్వం గత నాలుగు సంవత్సరాల కాలంలో నిర్వహణపరంగా ఎంతో స్వేచ్ఛను ఇచ్చింది.

మిత్రులారా,

స్వాతంత్ర్యం అనంతరం జాతి నిర్మాణ ప్రక్రియ కు సహాయపడేలా దేశ ఆర్థిక వ్యవస్థ ను పటిష్ఠం చేయడంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఎంతో తోడ్పాటును అందించాయి. ఆ సమయంలో భిన్న రంగాలలో పెట్టుబడులు, నిధులు, సాంకేతిక పరిజ్ఞానం భారతదేశానికి అవసరం అయింది. వీటిని సమకూర్చుకోవడం అంత తేలికైన పని కాదు. ఆ సమయంలో దేశ అవసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ సంస్థలు ఎంతో సహాయంగా నిలిచాయి. అనేక మంచి బ్రాండ్ లు వచ్చాయి. విద్యుత్తు, ఆ రంగానికి అవసరమైన పరికరాల ఉత్పత్తి, డిజైనింగ్, ఉక్కు ఉత్పత్తి, ఆయిల్, ఖనిజాలు, బొగ్గు ల వంటి భిన్న రంగాలకు సేవలందించడంలో ప్రభుత్వ రంగ సంస్థలు ఆధిపత్య స్థానంలో ఉన్నాయి. ప్రైవేటు రంగం ఇంకా విస్తరించని ఆ రోజులలో ఆర్థికాభివృద్ధి ప్రక్రియను మీరే వేగవంతం చేశారు. నేటికి కూడా మీరు భారత ఆర్థిక వ్యవస్థ పటిష్ఠత లోనే కాకుండా పారిశ్రామిక కార్యకలాపాలకు ప్రేరణగా ఉన్నారు.

మిత్రులారా,

సాధారణంగా కంపెనీకి, వాటాదారులకు ఎంత లాభం ఆర్జించి పెట్టారనేది కొలమానంగా ప్రైవేటు కంపెనీ సిఇఒ పనితీరును మదింపు చేస్తారు. ప్రభుత్వ రంగ సంస్థలకు కూడా లాభం ప్రధానమే అయినప్పటికీ దానితో పాటుగా సమాజ సంక్షేమం కూడా పరిగణన లోకి తీసుకోవాలి.

మనని మనం పరిమితం చేసుకోవడానికి వీలు లేదు. సమాజం మొత్తాన్ని పరిగణన లోకి తీసుకోవాలి. మరో రకంగా చెప్పాలంటే పిఎస్ ఇ అనేది లాభాలతో పాటుగా ఆ సంస్థ సమాజానికి ప్రయోజనం చేకూర్చేది అయి ఉండాలి అంటూ వారు వాటాదారులకు లాభాలు ఆర్జించి పెట్టడమే కాదు, సమాజానికి కూడా లాభం చేయాలి. మనం సామాజిక ప్రయోజనాలను గురించి మాట్లాడుతూనే పిఎస్ఇ సిబ్బంది, అందరు అధికారులు చేసిన సేవను, త్యాగాలను మరచిపోకూడదు. మీరు భిన్న ప్రదేశాలలో క్లిష్టమైన ప్రాంతాలలో పని చేస్తున్నప్పుడు సరైన వసతులు లేక బోలెడు కష్టాలు పడి ఉంటారు. అవును, మీ నిబద్ధత ప్రశంసనీయం.

మీ సాహసాల ప్రభావం తోనే ప్రభుత్వం పెద్ద నిర్ణయాలను తీసుకోగలుగుతుంది. దేశం లోని ప్రతి ఒక్క గ్రామానికి విద్యుత్తు సదుపాయాన్ని అందించడం కావచ్చు; లేదా మాతృమూర్తులు, సోదరీమణులందరికీ ఎల్ పిజి కనెక్షన్ ను ఇవ్వడం కావచ్చు; అది మీ శ్రమ లేకుండా సాధ్యం కాదు. మీ ప్రెజెంటేశన్ లో ఆ పరిధిని, పని చేసిన కాలపరిమితిని కూడా గమనించాం.

మిత్రులారా,

ప్రస్తుత యుగానికి చెందిన సుసంపన్నమైన, మంచి చరిత్రను చూసి మనం సంతృప్తి చెందకూడదు. ప్రస్తుతం ఎదురవుతున్న సవాళ్లను ఎదుర్కొనేందుకు అవసరమైన మార్పులు కూడా చేసుకోవాలి. ఆర్థిక నిర్ణయాలను తీసుకోవడంలో ఆదర్శవాదం, ఆదర్శాలు మాత్రమే చాలవని నేను విశ్వసిస్తాను. ఆచరణాత్మకతను, వాస్తవికతను కూడా పరిగణన లోకి తీసుకోవాలి. 21వ శతాబ్దిలో ఏ రంగానికి అయినా నవ్యత, తెగింపు అనేవి మార్గదర్శక మంత్రాలు కావాలి.

ప్రభుత్వ రంగం కావచ్చు, ప్రైవేటు రంగం కావచ్చు.. విజయానికి ప్రత్యేక మంత్రాలు ఏవీ లేవు. ఒక విజయ మంత్రాన్ని గురించి నేను ఆలోచించినప్పుడు మూడు ‘ఇ’ (I) లు నా మదిలో మెదులుతాయి. ఇన్సెంటివ్ (ప్రోత్సాహకం), ఇమాజినేశన్ (ఊహాత్మకత), ఇన్ స్టిట్యూషనల్ బిల్డింగ్ (సంస్థాగత నిర్మాణం) అనేవే ఆ మూడు. వ్యాపారాల్లోనే కాదు, మానవ జీవితంలో కూడా మనిషి ప్రవర్తనలో మార్పు ను తీసుకురావడానికి ప్రోత్సాహకాలు ఎంతగానో ఉపయోగపడతాయని ఆర్థికవేత్తలు చెప్తూ ఉంటారు. మనిషి తన పూర్తి సామర్థ్యాలతో పని చేయాలంటే అతనిలో ప్రేరణ కల్పించేందుకు మనం ప్రయత్నిస్తాం. వాయిదా ధోరణులు, స్తబ్దత ల వంటివి మార్చాలంటే ప్రత్యేకమైన ప్రోత్సాహకాలతో ముందుకు రావలసి ఉంటుంది. ప్రోత్సాహకాలనేవి ఎప్పుడూ ఆర్థికమైనవే కావలసిన అవసరం లేదు. చక్కని పనితీరు ను కనబరచిన ఉద్యోగి ఫొటో ను బులెటిన్ బోర్డులో పెట్టడం, లేదా చైర్మన్ స్వయంగా అతని వెన్ను తట్టడం వంటి చర్యలు ఉద్యోగులను ప్రోత్సహించడంలో అద్భుతాలు చేస్తాయి.
బరోడా లో ఒక ఫార్మాస్యూటికల్ కంపెనీకి వెళ్లినప్పటి సంఘటన నాకు ఇంకా గుర్తుంది. ఏ ఉత్పత్తిని తయారుచేసినా దాని వివరణను ప్రచురించి దానికి పేరు పెట్టాలని ఉద్యోగులను కోరుతారు. ఇందుకోసం ఒక పోటీ ని కూడా పెడుతూ ఉంటారు. ఉద్యోగులు శాస్త్రవేత్తలు కాకపోయినప్పటికీ దానికి సరైన పేరు ను పెట్టడానికి ఆసక్తిగా ప్రయత్నిస్తారు. అందుకు తరువాత వారికి బహుమతి లభిస్తుంది. వారి పాత్ర కూడా శాస్త్రవేత్తల పాత్రతో సమానమైన ప్రాధాన్యాన్ని కలిగివుంటుంది. అందుకే ప్రోత్సాహకాలను అందించడం, వాటిని ఏ విధంగా అందించడం అనేవి ఆలోచించాలి. కుటుంబాలలో ఈ విషయాలను ఎలా ఆచరిస్తారో మీకు బాగా తెలుసు. అందరం ఒక్కటే అన్న భావంతో దీనిని ముందుకు తీసుకుపోవాలి.

తరువాత నేను ప్రస్తావించింది ఊహాత్మకత. పిఎస్ఇలు ఏర్పాటైన నాటి నుండి దానిని భిన్న ధోరణులలో పరిగణన లోకి తీసుకొన్నారు. విజయవంతమైన పలు ప్రైవేటు కంపెనీలు రెండు దశాబ్దాల కన్నా నిలదొక్కుకోలేకపోవచ్చు. అందుకు ఎన్నో కారణాలు ఉంటాయి. భవిష్యత్తుకు అవసరమైన ప్రత్యేకించి సాంకేతిక విజ్ఞానపరమైన మార్పులను చేయలేకపోవడం ప్రధాన కారణం. ఇక్కడే నాయకత్వం లోని ఊహాజనీనత పరిగణన లోకి వస్తుంది. నేను చాలా కాలం అహమదాబాద్ లో నివసించాను. మిల్లులకు చెందిన పెద్ద పొగ గొట్టాలు అంతటా కనపడేవి. కొత్త సాంకేతిక విజ్ఞానం లేకపోవడమే ఇందుకు కారణం. కానీ ఈ రోజున ఒక్క గొట్టం నుండి కూడా పొగ ఉండదు. ఎందుకు ? ఇమాజినేషన్ లోపించడమే కారణం. కాలం చెల్లిపోయిన వస్తువులతో గడిపే అలవాటు ఉంది. ఎవరైతే మార్పులకు అనుగుణంగా వారిని వారు మార్చుకోరో, లేదా దీర్ఘకాలిక ఆలోచన ధోరణిని అలవరచుకోరో, లేదా నిర్ణయాలను తీసుకోరో- అలాంటి చోట్ల స్తబ్ధత నెలకొంటుంది. క్రమక్రమంగా అది వినాశానికి దారి తీస్తుంది. ఈ రోజు భిన్నత్వం అనేది అత్యంత అవసరం అయిపోయింది.

వ్యవస్థీకృత నిర్మాణం నాయకత్వానికి ప్రధానమైన సవాలు. రాజకీయ నాయకత్వాన్ని గురించి నేను మాట్లాడడంలేదు. ఇక్కడకు వచ్చిన వారిలో ప్రతి ఒక్కరూ వారి రంగాలలో నాయకత్వం వహిస్తున్న వారే. మొత్తం కార్యక్షేత్రం అంతటికీ వారి నాయకత్వం విస్తరించాలి. ఒక సరైన వ్యవస్థ చుట్టూ ఒక బృందాన్ని నియమించాలి. వ్యక్తి ప్రాధాన్యంతో ఏర్పడిన వ్యవస్థలు దీర్ఘకాలం మనలేవు.

మిత్రులారా,

ఈ రోజు వరకు మనం పిఎస్ఇలను నవరత్నాలుగా వర్గీకరిస్తూ వస్తున్నాం. వాటికి నవభారత రత్నాలుగా నామకరణం చేయాల్సిన సమయం ఆసన్నం అయింది. నవభారత రత్నాలు కావడానికి అవసరమైన సాంకేతిక, ప్రక్రియాపరమైన మార్పులు చేయడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ?

5 పి ఫార్ములా అనుసరించడం ద్వారా నవభారత నిర్మాణంలో మీరు భాగస్వాములు కావచ్చునని నేను గట్టిగా నమ్ముతున్నాను. ఆ 5పిలు -పెర్ఫార్మెన్స్ (పనితీరు), ప్రాసెస్ (విధానం), పర్సోన (వ్యక్తిగతసమాచారం), ప్రొక్యూర్ మెంట్ (సేకరణ), ప్రిపేర్ (సంసిద్ధం కావడం).

మిత్రులారా,

మీ సంస్థల నిర్వహణ, ఆర్థిక పనితీరు కోసం మీరందరూ బెంచ్ మార్కులను పెంచుకుంటూ ఉండాలి. మీ రంగాలలో అత్యుత్తమ ప్రతిభ ను కనబరుస్తున్న కంపెనీలతో పోటీ పడేందుకు మీరందరూ సమాయత్తం కావాలి. రానున్న కొద్ది సంవత్సరాలలో భారత్ 5 ట్రిలియన్ డాలర్ ఆర్థిక వ్యవస్థగా మారుతుందని ఈ రోజుల్లో చెప్తూ వస్తున్నారు. జిడిపి వృద్ధి రేటు ను మెరుగుపరచడం ద్వారా ఈ లక్ష్యాన్ని సాధించడంలో భారత ప్రభుత్వ రంగ సంస్థలు కీలకమైనటువంటి పాత్ర ను పోషించాలి.

మిత్రులారా,

2017-18 సంవత్సరంలో పిఎస్ యుల నికర విలువ జోడింపు 5 శాతం మేరకు ఉందని నాకు చెప్పారు. దీనిని రెట్టింపు చేయవలసిన అవసరం ఉంది. ప్రత్యక్ష పన్నులు, పరోక్ష పన్నుల తరువాత మూడో ప్రధాన ఆదాయ వనరుగా పిఎస్ యులను తయారు చేసేందుకు మీ అందరి ఉమ్మడి కృషి అవసరం.
“ఉద్యోగ్ సంపన్నమ్ సాముపైతి లక్ష్మి” అనే సామెత ఒకటుంది. పారిశ్రామికవేత్తల దగ్గరకే లక్ష్మి చేరుతుందని దాని అర్ధం. దేశ సంక్షేమం కోసం పిఎస్ యులు సుసంపన్నం కావడం చాలా అవసరం.
ఈ రోజు ప్రభుత్వ నిర్వహణ లోని అన్ని పిఎస్ ఇల ఈక్విటీపై రాబడి 11 శాతం ఉంది. ప్రైవేటు రంగం కన్నా ఇది చాలా తక్కువ, ఒక వ్యాపార సంస్థకు ఏ మాత్రం చాలనిది. నా దృష్టిలో అయితే అది చాలా తక్కువే. సరి అయినటువంటి నిర్ణయాలను తీసుకొని, నిర్ణయాత్మక వ్యూహాలను అనుసరించడం ద్వారా దానిని పెంచే ప్రయత్నం చేయాలని సిపిఎస్ ఇ యాజమాన్యాలను నేను కోరుతున్నాను.

అలాగే రెండో పి ప్రాసెస్. విధానాలు పారదర్శకంగా, బాధ్యతాయుతంగా, ప్రపంచ శ్రేణికి దీటుగా వస్తుసేవలు అందించగల విధంగా ఉండాలి.

న్యూ ఇండియా లో వచ్చే 5-10 సంవత్సరాల కాలంలో ప్రపంచ ప్రమాణాలకు దీటుగా భారత పిఎస్ యులు ఎలా ఎదగాలన్నది మనకు మనం వేసుకోవలసిన ప్రశ్న. మరిన్ని ఉపాధి అవకాశాలను అందుబాటులోకి తేవడానికి వీలుగా పిఎస్ యులు మరింత నవ్య ధోరణులను అవలంబించడం, జిడిపిని పెంచడానికి దీటుగా తమను తాము పునర్ నిర్వచించుకోవడం, పన్ను రాబడులను పెంచే విధానాలను అనుసరించడం అవశ్యం. ఈ అంశాలను గురించి ఆలోచించవలసిన అవసరం ఉందని నేను నమ్ముతున్నాను.

ప్రభుత్వ రంగ సంస్థలు పోటీ సామర్థ్యాలను పెంచుకోవడం ప్రస్తుత ప్రపంచీకరణ కాలంలో చాలా అవసరం. విద్యుత్తు, పరమాణు శక్తి, సౌర ఆధారితమైన శక్తి విభాగాలలో పలు యూరోపియన్ దేశాల ప్రభుత్వ రంగ సంస్థలు ఎంతో బాగా పని చేస్తున్నాయన్న సంగతిని మీరు చూసే ఉంటారు. వాటి పని నమూనాల నుండి మనం నేర్చుకోవలసింది ఎంతో ఉంది.

మిత్రులారా,

ప్రపంచ వ్యాపార వాతావరణంలో మార్పులకు దీటుగా నిర్ణయాలు తీసుకోవడంలో వేగాన్ని పెంచుకోవలసిన అవసరం ఎంతైనా ఉంది. రిస్క్ తీసుకోవడంలో నిరాసక్తత వల్లనే ప్రభుత్వ రంగ పరిశ్రమలు ఇబ్బందులను ఎదుర్కొన్న సందర్భాలు గతంలో ఎన్నో ఉన్నాయి. ఇలాంటి వాతావరణంలో నిర్ణయాలు తీసుకొనే ధోరణులలో ప్రతి స్థాయిలో మార్పు తీసుకురాక తప్పని పరిస్థతి ఏర్పడింది. ఇక్కడే తదుపరి “పి” పర్సోన కీలకంగా నిలుస్తుంది.

సరైన ప్రతిభా సంపద ఉన్నప్పుడే మెరుగైన నిర్ణయాలు తీసుకోవడం సాధ్యం అవుతుంది. సరైన ప్రతిభ ను గుర్తించి ముందుకు తీసుకుపోవలసిన అవసరం ఉంది.

నిర్ణయాలలో స్వేచ్ఛ, మంచి ప్రతిభ, సాంకేతిక విజ్ఞానం అనే మూడు అంశాలు ఉంటే పురోగమనం సాధ్యమే. సాంకేతిక విజ్ఞానం రంగంలో నవ్యతను పెంచడానికి టెక్-అప్ ఇండియా మిశన్ కు ప్రాధాన్యం ఇస్తున్నట్టు నాకు చెప్పారు, మీ ప్రెజెంటేశన్ లలో కూడా సూచించారు. అది చాలా ప్రశంసనీయమైన అంశం. ఈ కృషిలో మీరు విజయం సాధించాలని నేను ఆకాంక్షిస్తున్నాను.

వస్తు సేకరణ విధానం కూడా అత్యంత కీలకం. మిత్రులారా, సేకరణ విధానాలను మార్చుకోవడం దేశ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలను బలోపేతం చేస్తుంది. ఈ సందర్భంగా ఒక వాస్తవాన్ని మీకు తెలియచేయాలనుకొంటున్నాను. 2016 సంవత్సరంలో పిఎస్ యుల వస్తు సేకరణ 1,30,000 కోట్ల రూపాయలు ఉంది. అందులో ఎంఎస్ఎంఇ రంగానికి దక్కింది 25,000 వేల కోట్ల రూపాయలే. దేశానికి చెందిన సూక్ష్మ, చిన్న తరహా పరిశ్రమల నుండి మరిన్ని వస్తువులను సేకరించేందుకు వీలుగా ఒక విధాన వ్యవస్థను మీరు సిద్ధం చేయలేరా ? దేశం లోని వెనుకబడిన ప్రాంతాలలో ఉన్న పరిశ్రమలను చేయి పట్టి నడిపించడంలో మీరు ప్రత్యేక సహాయం అందించగల స్థితిలో ఉన్నారు.
గవర్నమెంట్ ఇ-మార్కెట్ పోర్టల్ ను గురించి మీకు అందరికీ తెలిసే ఉంటుంది. మీ ప్రెజెంటేశన్ ఒక దానిలో కూడా ఈ ప్రస్తావన ఉంది. ఎంఎస్ఎంఇ రంగానికి కొత్త శక్తిని అందించిన చక్కని వ్యవస్థ అది. దీని ద్వారా అతి తక్కువ కాలంలో ఆన్ లైన్ లో 6,500 కోట్ల రూపాయల వ్యాపారం జరిగింది. మీరు ఈ వేదిక ను మరింతగా ఉపయోగించుకోవడం వల్ల పారదర్శకత రావడం ఒక్కటే కాదు, ఎంఎస్ఎంఇ రంగానికి ఎంతో లాభం చేకూరుతుంది. మీరు మరిన్ని వస్తువులు చిన్నతరహా పారిశ్రామికుల నుండి కొనుగోలు చేసిన కొద్దీ మారుమూల ప్రాంతాల్లో కొత్త ఉపాధి అవకాశాలు పెరుగుతాయి.

అలాగే మీ సంస్థల నుండి ఎంఎస్ఎంఇ లకు మరింత ఫండింగ్, సాంకేతిక సహకారం అందించగలిగితే అవి మరింత శక్తివంతం అవుతాయి. ఎంఎస్ఎంఇ రంగంలో సామర్థ్యాల నిర్మాణం మీ లక్ష్యాల్లో ఒకటి. నేటి మీ తీర్మానాల్లో బహుశ మీరు దాన్ని ప్రస్తావించే ఉంటారు. చిన్న తరహా పరిశ్రమలను మీరు ఎంతగా ప్రోత్సహిస్తే స్వయం సమృద్ధి, స్వయం ఆధారనీయత దిశగా దేశం అంతగా పురోగమిస్తుంది.
ఎంఎస్ఎంఇ లకు చెల్లింపులు జాప్యం చేయవద్దని మీ అందరినీ నేను కోరుతున్నాను. చెల్లింపుల జాప్యం వల్ల చిన్న పరిశ్రమలు ఎన్ని సమస్యలు ఎదుర్కొంటాయో మీ అందరికీ బాగా తెలిసిన విషయమే.

కేంద్రప్రభుత్వ రంగ సంస్థలతోనే తయారీ రంగం మరింత ఉత్తేజితం అవుతుంది. గ్రామీణ గృహనిర్మాణం, పునరుత్పాదక ఇంధనం, సౌర శక్తి, జౌళి, ఔషధాలు, పర్యటన రంగాలను పునరుత్తేజితం చేయడంలో మీరు ప్రధాన పాత్రను పోషించగలుగుతారు.

ఆగ్రా వంటి సాంప్రదాయక ప్రదేశాలలో కాకుండా దేశంలోని కొత్త పర్యటక కేంద్రాలలో మీ వార్షిక సర్వ సభ్య సమావేశాలను నిర్వహించాలని మీ అందరినీకోరుతున్నాను. ప్రజలు ఆ పర్యటక కేంద్రాలను గురించి తెలుసుకుని అక్కడకు సందర్శనకు వస్తారు. ఆయా పర్యటక కేంద్రాలు సహజంగానే అభివృద్ధి చెందుతాయి. ఉదాహరణకు 300 కంపెనీలు ఉన్నాయనుకొందాం; వాటిలో ఒక్కొక్క కంపెనీ 25 వేర్వేరు ప్రదేశాలలో 25 సమావేశాలు ఏర్పాటు చేస్తే ఆయా ప్రాంతాలు ఆర్థికంగా అభివృద్ధి చెందుతాయా లేదా మీరే చెప్పండి. అక్కడ మౌలిక వసతులు పెరుగుతాయా పెరగవా ? మీరు సాధారణంగా ముంబయి, బెంగళూరు, చెన్నై వంటి నగరాలలో సమావేశాలను నిర్వహించి అక్కడి 5 స్టార్ హోటళ్లలో బస చేస్తారు. కొత్త ప్రదేశాలలో మీరు సమావేశాలను ఏర్పాటు చేయలేరా ? అప్పుడు దేశీయ పర్యటక రంగానికి మీరు ఉత్తేజాన్ని కల్పించిన వారవుతారా లేదా ? అంతకు మించి మీరేం అధికంగా చేయవలసిన పని లేదు. దేశ భవిష్యత్తు దార్శనికతతో మీ దార్శనికత కలిసినప్పుడే ఇది సాధ్యం అవుతుంది. జాతి నిర్మాణంలో ఈ చిన్న అడుగు వేయాలని మీ అందరినీ కోరాలనుకొంటున్నాను. పర్యటన రంగం ఉత్తేజితం అవుతుంది. పెట్టిన పెట్టుబడికి అత్యధికంగా ఉపాధి ని కల్పించగల సామర్థ్యం ఈ రంగానికి మాత్రమే ఉంది. ప్రపంచం అంతా కలిసి చేయలేనిది చేయగల సామర్థ్యం ఈ నేలకు ఉన్నది. ఆ సామర్థ్యాన్ని అందుకొనేందుకు మనం ఎప్పుడూ ప్రయత్నించలేదు. అది ఎలా సాధ్యం ?

మిత్రులారా,

భవిష్యత్తుకు సమాయత్తం కావడమే మనని ఐదో “పి”- అంటే “ప్రిపేర్” కి నడిపిస్తుంది. భారత పిఎస్ యులు కృత్రిమ మేథస్సు చోదక క్వాంటమ్ కంప్యూటింగ్, విద్యుత్తు వాహనాలు, రోబోటిక్స్ వంటి కొత్త సాంకేతిక అన్వేషణలకు దీటుగా తమను తాము సిద్ధం చేసుకోవాల్సిన అవసరం ఉంది. 2020 వ సంవత్సరం కల్లా అంతర్జాతీయ ఇంటర్ నెట్ చోదక కార్యకలాపాల (ఐఓటి) విపణి లో భారతదేశం వాటా 20 శాతానికి చేరుతుందని అంచనా. అది 20 లక్షల కోట్ల రూపాయల విస్తృతి గల మార్కెట్. పారిశ్రామిక ఉత్పత్తుల రంగంలో ఐఓటి మార్కెట్ వాటా 60 శాతానికి చేరుతుందని భావిస్తున్నారు. ఈ అంశాలను దృష్టిలో పెట్టుకొని భారత పిఎస్ యులు భావి వ్యూహాలను రచించుకొంటున్నాయా?, ఆ గణాంకాలను మీరు విశ్లేషిస్తున్నారా ?

మిత్రులారా,

డిజిటైజేషన్, అనలిటిక్స్, ఇ-మొబిలిటీ, బ్లాక్ చెయిన్ వంటి కొత్త సాంకేతిక విజ్ఞానాలు మీ ప్రయత్నాలలో సహాయకారిగా ఉంటాయి. ఈ టెక్నాలజీలు మీ వ్యాపారాలలో కొత్త అవకాశాలను సృష్టించగలుగుతాయి. ఫైనాన్షియల్ మార్కెట్ లలో కూడా కొత్త అన్వేషణల నుండి కూడా మీరు ప్రయోజనం పొందగలుగుతారు. పెట్టుబడులకు అందుబాటులో ఉన్న మూలధన వనరులను అందుకోగలుగుతారు.

మిత్రులారా,

దేశ ప్రాథ‌మ్యాల‌ను, అవ‌స‌రాల‌ను దృష్టిలో పెట్టుకొని మీరంతా సామూహికంగా ముందుకు క‌దలిన‌ప్పుడే ఫ‌లితాలు కచ్చితంగా క‌నిపిస్తాయి. న్యూ ఇండియా దిశ‌గా ప‌రివ‌ర్త‌న ప్ర‌తినిధులుగా కీల‌క‌ పాత్ర ను పోషించ‌గ‌ల సంపూర్ణ సామ‌ర్థ్యం దేశం లోని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లకు ఉంద‌న్న‌ది నా ప్ర‌గాఢ విశ్వాసం. ఈ నేప‌థ్యంలో ఇవాళ నేను మీ ముందు ఐదు ప్ర‌శ్న‌లను, ఐదు స‌వాళ్ల‌ను ఉంచాల‌ని భావిస్తున్నాను. అయితే, మీరు చెప్పిన‌దానికి భిన్నమైన‌ది ఏదీ నేను ఇప్పుడు చెప్ప‌బోవ‌డం లేదు. మీరు చెప్పిన అంశాల‌నే నాదైన శైలిలో మీకు వివ‌రించ‌ద‌లచాను. నేను చెప్ప‌బోయే వాట‌న్నింటినీ మీరు విజ‌య‌వంతంగా సాధించ‌గ‌ల‌ర‌న్న‌ది నా న‌మ్మ‌కం. న్యూ ఇండియా నిర్మాణంలో మీ పాత్ర‌ను ఈ ఐదు స‌వాళ్లు పున‌ర్ నిర్వ‌చిస్తాయి. ఆ మేర‌కు పూర్తి వివ‌రాల లోకి వెళ్ల‌డం గాక ఒక విస్తృత స్వ‌రూపాన్ని నేను మీ ముందు ఉంచుతాను.

మిత్రులారా,

నామొద‌టి ప్ర‌శ్న‌: మ‌న దేశం 2022 వ సంవత్సరం కల్లా 75వ స్వాతంత్ర్య దినోత్స‌వానికి చేరుకోనుంది. ఈ నేప‌థ్యంలో 2022 నాటికి భార‌త ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లు వాటి భౌగోళిక వ్యూహ విస్తృతి ని మెరుగుప‌ర‌చుకోగ‌ల‌వా ?

నా రెండో ప్ర‌శ్న: దేశం చెల్లిస్తున్న దిగుమ‌తి బిల్లు మొత్తాన్ని ప్ర‌భుత్వ రంగ సంస్థ‌లు ఎలా త‌గ్గించ‌బోతున్నాయి ?

అయితే, ఈ బాధ్య‌త ఎవ‌రిద‌న్న ప్ర‌శ్న మీలో త‌లెత్తే ఉంటుంది. ఈ సంద‌ర్భంగా నేను ఓ ఉదాహ‌ర‌ణను చెప్ప‌ద‌ల‌చాను.. నేను ఓ 25-30 ఏళ్ల‌కు ముందు హ‌రియాణా లో ఒక రైతు వ్య‌వ‌సాయ భూమి వ‌ద్ద‌కు వెళ్లాను. అత‌డి భూ క‌మ‌తం చాలా చిన్న‌ది. అయితే, త‌న వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ను చూసేందుకు రావలసిందంటూ అత‌డు నాకు విజ్ఞ‌ప్తి చేశాడు. అత‌డి వ‌య‌స్సు 30- 35 ఏళ్ల మ‌ధ్య ఉంటుంది గానీ, చాలా ఉత్సాహ‌వంతుడుగా క‌నిపించాడు. ఢిల్లీ లోని ఫైవ్‌స్టార్ హోట‌ళ్లు అప్ప‌ట్లో చిన్న‌సైజు టొమాటోలు, బేబీకార్న్ ల వంటి ప్ర‌త్యేక కూర‌గాయ‌ల‌ను దిగుమ‌తి చేసుకుంటూ ఉండేవి. త‌న పొలంలో నియంత్రిత వాతావ‌ర‌ణం న‌డుమ ఈ ప్ర‌త్యేక కూర‌గాయ‌ల‌ను పండించి హోట‌ళ్ల‌కు స‌ర‌ఫ‌రా చేయ‌డం ద్వారా వాటి దిగుమ‌తి ని ఆపాల‌ని అత‌డు నిర్ణ‌యించుకున్నాడు. అంతే.. కేవ‌లం మూడంటే మూడేళ్ల‌లో స‌ద‌రు దిగుమ‌తుల‌ను నిలిపివేయాల‌న్న ల‌క్ష్యాన్ని అత‌డు సాధించాడు. ఓ రైతు బిడ్డ త‌ల‌చుకొంటే అద్భుతాలు చేయ‌గ‌ల‌డ‌న్న మాట. ఇక స్వావ‌లంబ‌న‌ గ‌ల ప్ర‌భుత్వరంగ సంస్థ‌లు దేశ స్వావ‌లంబ‌న‌లో ప్ర‌ధాన పాత్ర పోషించాయి. ఇప్పుడిక అంత‌ర్జాతీయ ఆర్థిక వ్య‌వ‌స్థ‌లో వాటి ఉనికిని ప్ర‌ద‌ర్శించాల్సిన స‌మ‌యం ఆస‌న్న‌ం అయింది. ఈ విష‌యాన్ని మీ విష‌య వివ‌ర‌ణ‌ లో మీరు వెల్ల‌డించిన‌ప్ప‌టికీ దీనిని మ‌రింత నొక్కి చెప్ప‌ద‌లచాను. దేశానికి దిగుమ‌తి బిల్లు భారాన్ని త‌గ్గించాలంటే మ‌నం వినియోగించవలసిన ప్ర‌త్యామ్నాయ సాంకేతిక ప‌రిజ్ఞానం, ప‌రిక‌రాలు ఏమిటి ?

నా మూడో ప్ర‌శ్న: భార‌త ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల మ‌ధ్య ప‌రిశోధ‌న‌, వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల ఆదానప్ర‌దానాలు ఎలా ఉండాలి ?

ఇవాళ మ‌న‌మంతా ఎవ‌రికి వారుగా ఉన్నాం. ఫ‌లితంగా మాన‌వ వ‌న‌రులు వృథా అవుతున్నాయి. ఒక‌రు ఒక ప‌నిని పూర్తిచేసేనాటికి మ‌రొక‌రు అదే ప‌నిని మొదలు పెడుతున్న ప‌రిస్థితి ఉంది. కానీ, మ‌న‌మంతా స‌మ‌న్వ‌యంతో కృషి చేస్తే ఈ రంగంలో ఎంత ముంద‌డుగు వేయ‌గ‌ల‌మో మీరే ఊహించుకోవ‌చ్చు. అందుకే నేను ఇప్పుడు అనుసంధానాన్ని గురించి మాట్లాడుతున్నాను.

నా నాలుగో ప్ర‌శ్న: న్యూ ఇండియా నిర్మాణ స్వ‌ప్న సాకారంతో పాటు వివిధ స‌మ‌స్య‌ల‌ నుండి దేశ విముక్తి కోసం కార్పొరేట్ సామాజిక బాధ్య‌త (సిఎస్ ఆర్) నిధిని మ‌నం వినియోగించ‌గ‌ల‌మా ? అందుకు అవ‌స‌ర‌మైన మార్గ ప్ర‌ణాళిక ఏమిటి ? దానిని మ‌నం సామూహికంగా సాధించ‌డం ఎలా ?

మీ ప్ర‌యోగాల‌ను గురించి మీరు వివ‌రించారు. మ‌రుగుదొడ్ల నిర్మాణంలో మీరు బ‌హుధా కృషి చేశారు. దాని ఫ‌లితంగా దేశంలో వ‌చ్చిన భారీ మార్పులను మ‌న‌మంతా చూశాం. అందుకే ఒక‌దాని వెంట మ‌రొక‌టిగా ప‌రిష్క‌రించ‌డం కోసం స‌వాళ్ల‌ పైన కూడా మ‌నం దృష్టి ని సారించవలసిన అవ‌స‌రం ఎంత‌యినా ఉంది.

చివ‌ర‌గా… నా ఐదో ప్ర‌శ్న: భార‌త ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లు ఎలాంటి ప్ర‌గ‌తి న‌మూనా ను 2022 కల్లా దేశం ముందు ఉంచ‌గ‌ల‌వు ? ఇదే పాత వ్య‌వ‌స్థ‌లో మ‌గ్గిపోదామా లేక దాని స్థానంలో కొత్త వ్య‌వ‌స్థ‌ను తీసుకొద్దామా ?

ఇవ‌న్నీ స‌వాళ్లే.. వీటిని ప్ర‌శ్న‌ల రూపంలో మీ ముందుకు తెస్తున్నాను. ఎందుకంటే నిర్ణ‌యాలు తీసుకోవ‌డం, వ్యూహాల, విధానాల రూప‌క‌ల్ప‌నే కాకుండా వాటి అమ‌లు బాధ్య‌త కూడా మీదే కాబ‌ట్టి. జాతి నిర్మాణ ల‌క్ష్యాన్ని మ‌న‌సులో ఉంచుకొని ఈ ప్ర‌శ్న‌ల‌పై మీరు మీ బోర్డు స‌మావేశాలలో చ‌ర్చిస్తే కొత్త మార్గాలు తెరుచుకొంటాయి.. మీకో వినూత్న దిశ ఆవిష్కృత‌ం అవుతుంద‌న‌డంలో సందేహం లేదు.

మిత్రులారా,

నేడు ప్ర‌పంచ‌వ్యాప్తంగా అనేక‌ మందిని క‌లుసుకొనే అవ‌కాశం మీకు ఉంది కాబ‌ట్టి స‌రికొత్త ప్ర‌పంచ గ‌మ‌నంలో భార‌త భౌగోళిక‌-వ్యూహ విస్తృతి మెరుగుదలకు మీ భాగ‌స్వామ్యం అత్యంత అవ‌శ్యం. ఇంత‌కు ముందు ఇలాంటి అవ‌కాశాలు అంతంత‌ మాత్ర‌మే అని చెప్ప‌వ‌చ్చును. ఈ అవ‌కాశాల‌ను మ‌నం ఎలాంటి ప‌రిస్థితి లోనూ జార‌విడుచుకోకూడదు. ఇత‌ర దేశాల‌పై త‌మ‌ ప్ర‌భావాన్ని మెరుగుప‌ర‌చుకోవ‌డంలో వివిధ దేశాలు త‌మ ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లను వినియోగించుకోవ‌డం గురించి మీకు తెలిసే ఉంటుంది. ప్ర‌పంచం లోని దాదాపు 500 అతి పెద్ద సంస్థ‌ల‌లో నాలుగో వంతు ఏదో ఒక దేశం లోని ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లే అన్న‌ది వాస్త‌వం. త‌మ‌ త‌మ దేశాలలో గ‌ణ‌నీయ స్థాయిలో పెట్టుబడుల‌ను ఆక‌ర్షించ‌డంలో ఈ కంపెనీలే మాధ్య‌మాలుగా ప‌నిచేశాయి. కాబ‌ట్టి అదే త‌ర‌హాలో మీరంతా మీ సంస్థ‌ల పునాదులను వీలైనంత మేర విస్త‌రించుకోవ‌డంపై ఆలోచ‌న చేయాలి. నేడు ప్ర‌భుత్వాల మ‌ధ్య ప‌ర‌స్ప‌ర సంబంధాలు పెరుగుతున్నాయి. అందువ‌ల్ల ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌ల మ‌ధ్య సంబంధాలను మెరుగుప‌ర‌చుకోవ‌డానికీ మీకు ఇదో అవ‌కాశం కాగ‌ల‌దు.

భార‌త ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లు నేడు బ్రెజిల్ నుండి మొజాంబిక్‌ దాకా, ర‌ష్యా నుండి ఆస్ట్రేలియా దాకా త‌మ జెండా ల‌ను ఎగురవేస్తున్నాయి. అదే స‌మ‌యంలో, విదేశీ పెట్టుబ‌డులపై ప్ర‌భుత్వ‌రంగ సంస్థ‌లు ఓ స‌మ‌గ్ర వ్యూహాన్ని రూపొందించడం త‌క్ష‌ణావ‌స‌రం. అయితే, స‌ద‌రు పెట్టుబ‌డుల‌పై మీ రాబ‌డులు మ‌న భౌగోళిక విస్తృతికి తగు నిష్ప‌త్తిలో ఉండాల‌న్న వాస్త‌వాన్ని మీరు గ‌మ‌నంలో ఉంచుకోవాలి. ఇత‌ర దేశాల లోని అనేక‌ ప్ర‌ముఖ న‌గ‌రాల‌తో ప్ర‌స్తుత ప్ర‌భుత్వం చాలా అవ‌గాహ‌న ఒప్పందాలను కుదుర్చుకుంది. వాటి అనుబంధ న‌గ‌రాల అభివృద్ధి ప‌నులు ఇప్ప‌టికే సాగుతున్నాయి. ఈ నేప‌థ్యంలో పారిశ్రామిక సంస్థ‌లు, స‌మాఖ్య‌ల‌తో సంయుక్తంగా స‌ద‌రు న‌గ‌రాల‌లో మేక్ ఇన్ ఇండియా ను వ్య‌వ‌స్థీకృత‌మైన రీతిలో, ప్ర‌ణాళిక‌బ‌ద్ధమైన రీతిలో ముందుకు తీసుకుపోలేవా ? వాస్త‌వానికి ఒక రాష్ట్రం మ‌రో రాష్ట్రానికి సోద‌ర రాష్ట్ర‌ం అవుతోంది. అదేవిధంగా ఒక న‌గ‌రం మ‌రో న‌గ‌రానికి సోద‌ర న‌గ‌రం అవుతుంది. అయితే, ఈ న‌గ‌రేత‌ర ప్రాంతాలు వెనుక‌బ‌డుతున్నాయి. అందువ‌ల్ల ఓ అవ‌గాహ‌న ఒప్పందంపై సంత‌కాలు చేయ‌డం ఒక్క‌టే స‌రిపోదు.. దీనిని గ‌రిష్ఠ‌ స్థాయికి తీసుకుపోవాలి. ఈ న‌గ‌రాల‌ను అనుసంధానించ‌గ‌ల అంశాలు 50 నుండి 100 వరకు ఉండవచ్చు. కాబ‌ట్టి కొత్త వ్యూహాత్మ‌క దృక్ప‌థం అవ‌స‌ర‌మ‌ని నేను విజ్ఞ‌ప్తి చేస్తున్నాను.

ఇక దిగుమ‌తి బిల్లు రూపంలో ఇదే విధ‌మైన స‌వాలు ఇప్పుడు మ‌నంద‌రి ముందూ ఉంది. అనేక ఉత్ప‌త్తులు దిగుమ‌తి అవుతున్న‌ప్ప‌టికీ, ఈ దిగుమ‌తుల‌ను మ‌నం త‌గ్గించే వీలు ఉంది. కొన్ని రంగాలలో ఇప్ప‌టికే ప్ర‌భుత్వం దిగుమ‌తుల‌ను త‌గ్గించిన‌ప్ప‌టికీ, చేయవలసింది ఇంకా ఎంతో ఉంది. ఇటువంటి ప‌రిస్థితుల న‌డుమ ఈ విష‌యంలో మీ అంద‌రి ముందూ ఓ గొప్ప అవ‌కాశం ఉంది. ఇదేమీ భారీ స‌వాలు కాదు.. మీరు ఒక ప్ర‌య‌త్నాన్ని చేస్తే చాలు.. ప‌రివ‌ర్త‌న ఎలా ఉంటుందో స్ప‌ష్ట‌మైపోతుంది. మీరు 2 సంవత్సరాల లేదా 3 సంవత్సరాల వ్య‌వ‌ధిని నిర్దేశించుకొని ఏదైనా ఉత్ప‌త్తి యొక్క దిగుమ‌తిని మీరు నిర్ణ‌యించుకున్న మేర‌కు 10 శాతం,లేదా 15 శాతం లేదా 20 శాతం వ‌ర‌కూ త‌గ్గించ‌వ‌చ్చు. ధ‌ర‌, నాణ్య‌త‌ల రీత్యా మ‌నం పోటీప‌డటంతో పాటు దిగుమ‌తి చేసుకొంటున్న ఉత్ప‌త్తుల‌పైన దృష్టి సారించి వాటి స్థానాన్ని వినూత్న ఆవిష్క‌ర‌ణ‌ల‌ ద్వారా భ‌ర్తీ చేయ‌గ‌లిగితే దిగుమ‌తి బిల్లు గ‌ణ‌నీయంగా త‌గ్గుతుంద‌ని నిస్సంశ‌యంగా చెప్ప‌వ‌చ్చు.

మిత్రులారా,

రక్షణ రంగానికి సంబంధించి నేనో ఉదాహరణ ఇవ్వాలనుకొంటున్నాను. గడచిన 60-70 సంవత్సరాలుగా ప్రపంచంలో అత్యధికంగా ఆయుధాలను దిగుమతి చేసుకొటున్న దేశాలలో ఒకటిగా భారతదేశం పరిగణనలో ఉంది. ఈ సందర్భంగా మునుపటి విధానాల లోకి వెళ్లాలని నేను భావించడం లేదు. కానీ, ఈ రంగం లోనూ ప్రభుత్వం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులకు ఆహ్వానం పలికే రోజు ఒకటి వస్తుందని అప్పట్లో ఎవరూ కలలోనైనా ఊహించి ఉండరు. ఇదో మంచి అవకాశంగా రక్షణ రంగం లోని మన ప్రభుత్వ రంగ సంస్థలు పరిగణిస్తాయని నేను నమ్ముతున్నాను. సాంకేతిక విజ్ఞాన బదిలీ, భాగస్వామ్య సంస్థల ఏర్పాటుపై ప్రభుత్వరంగ సంస్థలు ఎంత ఎక్కువగా దృష్టిపెడితే అంత ఎక్కువగా ‘మేక్ ఇన్ ఇండియా’ పథకం బలం పుంజుకోగలదు. అంతేకాకుండా రక్షణ రంగం మరింత స్వావలంబన ను కూడా సాధిస్తుంది. ఇవాళ ‘తేజస్’ వంటి యుద్ధ విమానాన్ని భారతదేశం సొంతంగా తయారుచేస్తోంది. అలాగే అంతర్జాతీయ ప్రమాణాలకు దీటుగా యుద్ధ నౌకలను, జలాంతర్గాములను రూపొందిస్తోంది. మన సాంకేతిక సామర్థ్యం ఎవరికీ తీసిపోనటువంటిది. ఇటువంటి పరిస్థితులు ఉన్నందున మనం జాతీయ విపణిపైనే గాక అంతర్జాతీయ విపణిపైనా ఓ కన్ను వేయాల్సిన అవసరం ఉంది.

పరిశోధనలతో ఆవిష్కరణల అనుసంధానం మరొక ముఖ్యాంశం. ‘శాస్త్ర-పారిశ్రామిక పరిశోధన మండలి, భారత వైద్య పరిశోధన మండలి, భారత వ్యవసాయ పరిశోధన మండలి’ వంటి శాస్త్ర విజ్ఞాన సంస్థలలో పరిశోధన- అభివృద్ధికి సంబంధించి అత్యుత్తమ మౌలిక సదుపాయాలు ఉన్నాయి. కేంద్ర ప్రభుత్వరంగ సంస్థల లోనూ ఆయా రంగాలకు చెందిన ఆధునిక పరిశోధన మౌలిక వసతులు అన్నీ అందుబాటు లోనే ఉన్నాయి. అందుకు తగినట్లుగానే మీరు కూడా అనేక వినూత్న ఉత్పత్తులను, పరిజ్ఞానాలను అభివృద్ధి చేశారు. అయితే, విభిన్న సంస్థల ప్రయోగశాలలకు మాత్రమే సదరు ఆవిష్కరణలు పరిమితం అయ్యాయన్నది కాదనలేని సత్యం. అందువల్ల 2022 కల్లా ఆవిష్కరణలు, పరిశోధనలకు సంబంధించిన మౌలిక వసతుల అనుసంధానం నేటి తక్షణావసరమని నేను విశ్వసిస్తున్నాను. ప్రభుత్వరంగ సంస్థలు, ప్రభుత్వ విభాగాల మధ్య సమాచార ఆదాన ప్రదానం పెరిగితే పరిశోధన వ్యయం తగ్గడమే గాక వ్యవస్థకు మరింత సామర్థ్యం సమకూరుతుంది. మౌలిక సదుపాయాల నుండి నైపుణ్య సమీకరణ దాకా, అత్యాధునిక పరికరాలు- సాంకేతికతల వినియోగం దాకా భిన్న స్థాయులలో ఈ భాగస్వామ్య వికాసానికి అవకాశాలు ఉన్నాయి.

మిత్రులారా,

ప్రభుత్వరంగ సమతౌల్య పట్టిక ప్రకారం కొన్నేళ్లుగా ఈ రంగం చాలా ముందడుగు వేసింది. నిరుడు ప్రభుత్వరంగ సంస్థల నికర లాభం 1,25,000 కోట్ల రూపాయలుగా నమోదు కావడం ఇందుకు నిదర్శనమని చెప్పవచ్చు. ఇందులో రెండు శాతం.. సుమారు 2,500 కోట్ల రూపాయలను కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధిగా వాడుకోవచ్చు. దేశ ప్రాథమ్యాలకు అనుగుణంగా ఈ సొమ్మును తగు రీతిలో వినియోగించడంపై మనం యోచించవలసివుంది. మీరు ప్రకటించిన వివరాల ప్రకారం 2014-15లో కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధుల నుండి పాఠశాలల్లో మరుగుదొడ్ల నిర్మాణానికి విరాళాలు ఇచ్చారు. ఈ వితరణ ఫలితాలు ఏమిటో మన అందరికీ సుస్పష్టమే. ఏటా ఇలాంటి ఇతివృత్తం ప్రాతిపదికగా కార్పొరేట్ సామాజిక బాధ్యత నిధులలో అధిక భాగాన్ని ఒకే లక్ష్యం కోసం విరాళంగా కేటాయించాలని ఈ సందర్భంగా నేను సూచిస్తున్నాను. దేశం లోని ఇతర జిల్లాల స్థాయిని అందుకోలేని 115 జిల్లాలను నీతి ఆయోగ్ ఎంపిక చేసిన సంగతి మీక అందరికీ తెలిసే ఉంటుంది. వాటికి నేను ఆకాంక్షపూరిత జిల్లాలుగా నామకరణం చేశాను. ఈ ఆకాంక్షపూరిత జిల్లాల ప్రగతి ని ప్రస్తుత ఏడాది లక్ష్యంగా నిర్దేశించుకోలేమా ? అలాగే కార్పొరేట్ సామాజిక బాధ్యతలో భాగంగా నైపుణ్యాభివృద్ధి బాధ్యతను కూడా మీ సంస్థలు చేపట్టవచ్చు. ఆ మేరకు అనేక విశ్వవిద్యాలయాలు, కళాశాలలు, ఐటీఐ లతో మీ సంస్థ సహ భాగస్వామ్యం ద్వారా నైపుణ్యాభివృద్ధిని ఒక భారీ ఉద్యమంలా స్వీకరించవచ్చు. అంతేగాక జాతీయ శిక్షణార్థి కార్యక్రమానికి మీరెంత ఎక్కువగా మద్దతునందిస్తే దాని ద్వారా అంత అధికంగా యువతరం లబ్ధి పొందగలుగుతుంది. భారత ప్రభుత్వ ప్రణాళికలు, పథకాల గురించి వీలైనంత త్వరగా అధ్యయనం చేయవలసిందిగా మీకందరికీ నేను సూచిస్తున్నాను. అటుపైన వాటిని అమలు చేసేందుకు ఒక బృందాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నాను. మీ సంస్థల నుండి అందే వనరుల తోడ్పాటుతో మరింత ఉత్సుకతతో నైపుణ్యాభ్యాసానికి యువత ముందుకువస్తుంది. దాంతోపాటు మీకు ఒక నైపుణ్య నిధి గానూ వారు ఉపయోగపడుతారు. కాబట్టి మీరు మరిన్ని శిక్షణ-సంధాన కేంద్రాలను ఏర్పాటు చేయవలసివుంది. తద్వారా మనం తరుణ వయస్సు లోనే విద్యార్థులలో వినూత్న ఆలోచనలకు బీజం వేయవచ్చు. యువ శక్తి ని సద్వినియోగం చేసుకోవలసిన అవసరం చాలా ఉంది. ప్రస్తుత వ్యవస్థ పరిష్కరించజాలని అనేక సమస్యలకు యువకులు తరచుగా వినూత్న పరిష్కారాలు చూపగలుగుతారు.

మిత్రులారా,

మీ ఆధ్వర్యం లోని అనుభవపూర్వక, సమృద్ధ వనరులు గల సంస్థలు దేశాభివృద్ధికి తగిన సరికొత్త నమూనాలను అందించగలవు. మారుమూల ప్రాంతాలలో అన్ని వైపులా శక్తి కేంద్రాలుగా మీ సంస్థలు రూపొందగలవు. మీరంతా దృఢ నిశ్చయానికి వస్తే కేవలం సంవత్సరం లేదా సంవత్సరంన్నర వ్యవధి లోనే దేశవ్యాప్తంగా వందలాది సరికొత్త నమూనా నగరాలు ఆవిర్భవిస్తాయి. కాగితరహిత పని సంస్కృతి, నగదురహిత లావాదేవీలు, వ్యర్థాల నిర్వహణ వంటి అనేక అంశాలలో మీ సంస్థలు ఆదర్శప్రాయం కాగలుగుతాయి. మీ సంస్థలకు వనరులు ఉండటమే గాక అన్ని వైపులకూ విస్తరించగల అవకాశమూ ఉంది. పరిశోధన- అభివృద్ధి రంగంలో మీరు గొప్ప ఫలితాలను సాధించగలరు. దేశానికి, సమాజానికి ఇదొక గొప్ప సేవ. ఇందులో భాగంగా గరిష్ఠ సామర్థ్యం, కార్పొరేట్ పాలన, వనరుల సముచిత వినియోగం తదితరాలపై దృష్టి సారించాలని మీకు అందరికీ స్పష్టం చేస్తున్నా. తమ శక్తియుక్తులు, వనరులపై విశ్వాసం లేని దేశం, సంస్థ, వ్యక్తి.. సౌభాగ్యాన్ని సాధించడం అసాధ్యం. భారతదేశంలో వనరులకు గానీ,శక్తియుక్తులకు గానీ ఎంత మాత్రం కొరత లేదు. మనపై మనకు నమ్మకంతో పాటు మనోశక్తి కూడా అపారం. గడచిన నాలుగేళ్ల కాలంలో సమస్యలు, కష్టాలకు సంబంధించి ప్రభుత్వం నుంచి మీకు ఒక్కసారి కూడా ప్రతికూల గళం వినిపించి ఉండదు. ఏదిఏమైనా, మన దేశాన్ని మనం సమున్నత శిఖరాలకు తీసుకుపోగలమన్నవిశ్వాసం నాలో ఉంది. మన దేశంలో వనరులకు కొదవ లేదు గనుక రండి… సామూహికంగా ముందడుగు వేద్దాం. మీరు చూపిన చొరవ ఇదే విధంగా కొనసాగుతుందన్న విశ్వాసం కూడా నాలో ఉంది. ప్రస్తుత చర్చల నుండి ఉద్భవించిన, ఉద్భవిస్తున్న ఆలోచనలను అమలు చేయడమేగాక వాటిపై నిరంతర పర్యవేక్షణ కూడా అవసరం. శక్తి, అనుభవం, ఉత్సాహం, కఠోర శ్రమల సమ్మేళనం అనూహ్య ఆశావహఫలితాలనిస్తుందన్నది నా ప్రగాఢ విశ్వాసం. నా దృష్టిలో PSU అంటే.. ప్రగతి (P), సేవ(S), శక్తి(U). అంతేకాదు… ‘S’ అంటే కేంద్రీకృత సేవ అని కూడా. కొత్త శక్తితో, సేవాభావంతో న్యూ ఇండియా స్వప్న సాకారం దిశగా సాగితే దేశం కచ్చితంగా ప్రగతి పథంలో దూసుకుపోవడం ఖాయమన్నది నా తిరుగులేని విశ్వాసం.

దేశ భవిష్యత్తుకు సంబంధించి మీ విధానాలు విజయవంతం కావాలని, న్యూ ఇండియా నిర్మాణ స్వప్న సంకల్ప సాధనలో మీ భాగస్వామ్యం గరిష్ఠంగా ఉండాలని నేను ఆకాంక్షిస్తున్నాను. నా ప్రసంగాన్ని ముగించే ముందు మీకు అందరికీ నేను ఒక విజ్ఞప్తిని చేయదలచాను. ఒక వంద రోజుల తరువాత ప్రభుత్వ రంగ నాయకత్వ స్థానం లోని వారందరినీ నేను కలుసుకోవడం వీలవుతుందా ? ఇవాళ చర్చించిన అంశాల అమలుకు రూపొందించిన ఫ్రేమ్ వర్క్ ను గురించి అప్పుడు మీరు నాకు వివరిస్తే నేను ఎంతో కృతజ్ఞుడినై ఉంటాను. అంతే కాదు.. మీ నుండి చాలా నేర్చుకోవాలని అభిలషిస్తున్నాను. మరింత ఎక్కువ కాలాన్ని మీతో వెచ్చించి, మరింత అధికంగా నేర్చుకొనే అవకాశం లభిస్తే ప్రభుత్వంలో మనం కోరుకొంటున్న మార్పులను నేను తీసుకురాగలను. కాబట్టి వంద రోజుల అనంతరం మనం మళ్లీ కలుసుకొనే రోజుకల్లా ఇవాళ చర్చించిన అంశాలపై ఓ మార్గ ప్రణాళిక రూపకల్పన, బాధ్యతల కేటాయింపు లను గురించి వివరించగలరని మిమ్మల్ని కోరుతున్నాను. అంటే అన్నీ సవ్యంగానే ఉన్నాయని కాదు గానీ.. భవిష్యత్తు ఉజ్జ్వలంగా ఉంది, లేదా ప్రజలు ఉత్సాహంగా ఉన్నారు, లేదా ఫలితాలు సాధించదగినవే అని అర్థం. అయితే, కనీసం వంద అడుగులైనా పర్వాలేదు.. మనం మాత్రం ఆ దిశగా ముందడుగు వేయాలి. మనం స్వల్ప లక్ష్యాలతో పాటు మన వనరులను, గడువులను, బృందాలను నిర్దేశించుకోవచ్చును. మీరంతా కార్పొరేట్ ప్రపంచానికి చెందిన వారు.. మీకు ఇవన్నీ విడమరచి చెప్పనక్కర లేదు. భారీ ఫీజులను చెల్లించి మీరు మేనేజ్ మెంట్ కోర్సులను అభ్యసించి ఉండవచ్చు.. అయితే, అక్కడ నేర్చుకున్నది ఏమిటి… అమలు చేసిందేమిటన్న వివరాల జోలికి నేను వెళ్లదల్చుకోలేదు. ఏదేమైనా ఇవాళ్టి చర్చలను గురించి మీరు ఆలోచిస్తారని ఆశిస్తున్నాను. ఈ అంశాలను సానుకూలం చేసుకోగలరని ఆకాంక్షిస్తున్నాను. ఇప్పుడిక అంచనా వేయదగిన లక్ష్యాలతో సముచిత మార్గ ప్రణాళికను మీ వద్ద నుండి కోరుకొంటున్నాను. కానీ, అది అల్లాటప్పాగా ఉండకూడదు. త్వరలోనే మీరంతా ఆశావహమైనటువంటి పరివర్తన ను చూస్తారు. ఈ నేపథ్యంలో మీకు అందరికీ శుభాభినందనలు. అనేకానేక ధన్యవాదాలు.

***