Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పార్లమెంట్ ఉభయ సభల్లో వక్ఫ్ బిల్లు ఆమోదం చరిత్రాత్మకం: ప్రధాని


వక్ఫ్ (సవరణ) బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లులను పార్లమెంట్ ఉభయ సభలు ఆమోదించడాన్ని చరిత్రాత్మక ఘట్టంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఈ రోజు అభివర్ణించారు. సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి దిశగా చేసిన సమష్టి కృషికి ఇది నిదర్శనమని ఆయన ప్రశంసించారు.

ఎక్స్‌‌‌లో ప్రధాని చేసిన పోస్టు:

‘‘పార్లమెంట్ ఉభయసభలు వక్ఫ్ (సవరణ) బిల్లు, ముసల్మాన్ వక్ఫ్ (రద్దు) బిల్లులను ఆమోదించడం చరిత్రాత్మకం. సామాజిక-ఆర్థిక న్యాయం, పారదర్శకత, సమ్మిళిత వృద్ధి దిశగా మనం చేస్తున్న సమష్టి కృషికి ఇది నిదర్శనం. ముఖ్యంగా సుదీర్ఘ కాలంగా అణచివేతకు గురైన, అవకాశాలు కోల్పోయిన వారికి సహాయం లభిస్తుంది.’’

‘‘పార్లమెంటరీ, కమిటీ చర్చల్లో పాల్గొని, తమ అభిప్రాయాలను వ్యక్తం చేసిన, చట్టాలను బలోపేతం చేసేందుకు సహకరించిన పార్లమెంటు సభ్యులందరికీ ధన్యవాదాలు. పార్లమెంటరీ కమిటీకి విలువైన సూచనలు పంపించిన వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు. విస్తృత చర్చలకున్న ప్రాధాన్యం మరోసారి నిరూపితమైంది’’.

‘‘దశాబ్దాలుగా వక్ఫ్ వ్యవస్థలో పారదర్శకత, జవాబుదారీతనం లోపించాయి. దీనివల్ల ముస్లిం మహిళలు, పేద ముస్లింలు, పష్మండ ముస్లింల ప్రయోజనాలు దెబ్బతిన్నాయి. పార్లమెంటు ఆమోదించిన చట్టాలు పారదర్శకతను పెంపొందించడంతో పాటు ప్రజల హక్కులను కాపాడతాయి.’’

‘‘ఆధునికమైన, సున్నితమైన చట్టాలతో సామాజిక న్యాయాన్ని అందించే నూతన యుగంలోకి ఇప్పుడు మనం ప్రవేశిస్తున్నాం. దేశంలోని ప్రతి పౌరుడి గౌరవానికి ప్రాధాన్యమిచ్చేందుకు మేం కట్టుబడి ఉన్నాం. ఇదే పద్ధతిలో దృఢమైన, సంఘటితమైన, మానవత్వంతో నిండిన భారత్‌ను నిర్మిస్తాం.’’