Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పాలస్తీనా ప్రెసిడెంట్ భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంలో ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన

పాలస్తీనా ప్రెసిడెంట్ భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంలో ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన

పాలస్తీనా ప్రెసిడెంట్ భారతదేశానికి ఆధికారిక పర్యటనకు వచ్చిన సందర్భంలో ప్రధాన మంత్రి విడుదల చేసిన పత్రికా ప్రకటన


శ్రేష్ఠుడైన పాలస్తీనా ప్రెసిడెంట్ శ్రీ మహమూద్ అబ్బాస్,

పాలస్తీనా మరియు భారతదేశ ప్రతినిధి వర్గాల సభ్యులు,

ప్రసార సాధనాల సభ్యులు,

సోదర సోదరీమణులారా,

భారతదేశానికి పాత స్నేహితులలో ఒకరైన ప్రెసిడెంట్ శ్రీ మహమూద్ అబ్బాస్ భారతదేశానికి ఆధికారిక పర్యటన నిమిత్తం విచ్చేసిన వేళ ఆయనకు మరో సారి స్వాగతం పలకడం నాకు ఆనందాన్నిస్తోంది. భారతదేశం మరియు పాలస్తీనాల మధ్య ఏర్పడిన సంబంధం మన సొంత స్వాతంత్య్ర సమరం రోజుల నాటి నుండి వేసుకున్న దీర్ఘకాలిక సంఘీభావం మరియు మిత్రత్వాల పునాదిపైన నిర్మితమైంది. పాలస్తీనా మనోరథం నెరవేరడం కోసం భారతదేశం నిలకడగా తన మద్దతును అందిస్తూ వచ్చింది. ఒక సర్వసత్తాక, స్వతంత్ర, ఐక్య, ఆచరణీయ పాలస్తీనా ఆవిర్భవించి, ఇజ్రాయిల్ తో శాంతియుతంగా మనుగడ సాగించాలని మేం ఆశిస్తున్నాం. ఈ రోజు ప్రెసిండెంట్ శ్రీ అబ్బాస్ తో మేం సంభాషణ జరిపినప్పుడు ఈ విషయంలో మా వైఖరిని నేను పునరుద్ఘాటించాను.

మిత్రులారా,

మా భాగస్వామ్యానికి మరింత బలాన్ని జోడించే విధంగా ప్రెసిడెంట్ శ్రీ అబ్బాస్, నేను సమగ్రమైన, ప్రయోజనాత్మకమైన చర్చలను కొద్దిసేపటి క్రితమే ముగించాం. పశ్చిమ ఆసియా మరియు మధ్య ఆసియా శాంతి ప్రక్రియకు సంబంధించిన స్థితిగతులపైన మేం ఇరువురం మా అభిప్రాయాలను పరస్పరం తెలియజేసుకున్నాం. నిలకడ ధోరణితో కూడిన రాజకీయ సంప్రతింపులను శాంతియుతంగా జరపడం ద్వారా పశ్చిమ ఆసియా లోని సవాళ్ళను పరిష్కరించాలని మేం అంగీకారానికి వచ్చాం. పాలస్తీనా మరియు ఇజ్రాయిల్ ల మధ్య చర్చలు వీలైనంత త్వరగా మళ్ళీ మొదలవ్వాలని, అవి ఒక సమగ్రమైన పరిష్కారాన్ని అన్వేషించే దిశగా సాగాలని భారతదేశం కోరుకుంటోంది. ద్వైపాక్షిక స్థాయిలో పాలస్తీనాకు ఉపయోగపడే విధంగా అభివృద్ధి సంబంధ భాగస్వామి పాత్రను పోషించడం కోసం భారతదేశం కట్టుబడి ఉంది. పాలస్తీనా ఆర్థిక వ్యవస్థ నిర్మాణం లోను, పాలస్తీనా ప్రజల జీవనాన్ని మెరుగుపరచడం లోను చేతల ద్వారా సహకరించుకోవాలని ప్రెసిడెంట్ శ్రీ అబ్బాస్, నేను ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేశాం. పాలస్తీనా అభివృద్ధి ప్రయత్నాలకు మేం మా అండదండలను అందించడాన్ని కొనసాగిస్తాం. ఈ రోజు తుది రూపం దాల్చిన ఒప్పందాలు ఈ దిశగా మా సహకారాన్ని బలోపేతం చేసుకోవాలన్న మా ఉద్దేశాన్ని ప్రస్పుటం చేస్తున్నాయి. భారతదేశం అందిస్తున్న సహాయ సహకారాలతో సమాచార సాంకేతిక విజ్ఞానం, యువత నైపుణ్యాలకు పదును పెట్టడం.. వీటి పైన కూడా మేం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నాం. రమల్లాలో టెక్నో-పార్క్ ప్రాజెక్టు కోసం భారతదేశం సహాయాన్ని అందిస్తోంది. ఈ ప్రాజెక్టు ఒకసారి పూర్తి అయిందంటే, ఇది పాలస్తీనాలో ఒక ఐటి కేంద్ర బిందువుగా సేవలను అందిస్తుంది; ఐటి కి సంబంధించిన శిక్షణ మరియు సేవలు అన్నీ ఒక చోటే లభించే విధంగా ఈ ప్రాజెక్టు రూపుదాలుస్తుంది. అంతేకాకుండా మేం మన సాంస్కృతిక సంబంధమైన ఆదాన ప్రదానాలను పెంపు చేసుకొనేందుకు కొత్త కొత్త అంశాలను జత చేయాలని కూడా భావిస్తున్నాం. ఇటువంటి అంశాలలో యోగా కూడా ఒకటి కానుంది. జూన్ లో అంతర్జాతీయ యోగా దినోత్సవం నాడు పాలస్తీనా వాసులు పెద్ద సంఖ్యలో పాలు పంచుకొంటారని మేం ఆశిస్తున్నాం. చివరగా, ప్రెసిడెంట్ శ్రీ మహమూద్ అబ్బాస్, ఆయన ప్రతినిధివర్గం భారతదేశంలో ఆహ్లాదకరమైన మరియు ఫలప్రదమైన పర్యటనను చేపట్టాలని నేను అభిలషిస్తున్నాను. ద్వైపాక్షిక సంబంధాలను మరింత పటిష్టపరచుకోవడానికి ప్రెసిడెంట్ శ్రీ అబ్బాస్ తో కలిసి పని చేసేందుకు నేను ఆసక్తిగా ఎదురుచూస్తున్నాను.

మీకు ఇవే నా ధన్యవాదాలు.

అనేకానేక ధన్యవాదాలు.