Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పుదుచ్చేరి లోని ఆరోవిలే లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

పుదుచ్చేరి లోని ఆరోవిలే లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం

పుదుచ్చేరి లోని ఆరోవిలే లో ప్ర‌ధాన మంత్రి ప్ర‌సంగ పాఠం


ఆరోవిలే స్వ‌ర్ణ జయంతి సప్తాహం సందర్భంగా నేను ఇక్కడకు వచ్చినందుకు ఎంతో సంతోషంగా ఉంది. భార‌త‌దేశం ఆధ్యాత్మిక నేతృత్వం వ‌హించే విషయమై శ్రీ అర‌విందుల వారి దార్శ‌నిక‌త ఈ నాటికీ మ‌న‌కు స్ఫూర్తిని ఇస్తూనే ఉంది.

నిజానికి, ఆరోవిలే ఆ దార్శ‌నిక‌త‌కు ప్ర‌తీకగానే ఉంది. గ‌డచిన ఐదు ద‌శాబ్దాలుగా, ఆరోవిలే సామాజిక‌ కేంద్రంగాను, సాంస్కృతిక‌ కేంద్రంగాను, విద్యాసంబంధ కేంద్రంగాను, ఆర్ధిక‌ కేంద్రంగాను మరియు ఆధ్యాత్మిక న‌వ్య‌త‌ కు ఒక నిలయంగాను రూపుదిద్దుకొంది.

మిత్రులారా,

శ్రీ అర‌విందుల వారి ఆలోచనలు మరియు వారి కార్యాల విస్తృతి ని ఈ రోజున స్మరించుకోవడం ముఖ్యం.

ఆయ‌న చేత‌ల మ‌నిషి, ఒక గొప్ప త‌త్వ్తవేత్త‌, క‌వి కూడాను. ఆయ‌న వ్య‌క్తిత్వంలో అనేకమైన పార్శ్వాలు ఉన్నాయి. వాటిలో ప్ర‌తి ఒక్కటి ఈ దేశం యొక్క మంచి కోసం, మానవాళి యొక్క మేలు కోసం అంకిత‌ం అయింది.

శ్రీ ర‌వీంద్ర నాధ్ టాగోర్ మాట‌లలో ప్పాలంటే..
ఓ అర‌బిందో..నీకు రవీంద్రనాథ్ నమస్కరిస్తున్నాడు!

ఓ మిత్రుడా, నా దేశ స్నేహితుడా, మాన‌వ జ‌న్మ‌ లో దైవ‌త్వాన్ని వినిపిస్తున్న‌ వాడా, స్వేచ్ఛా జీవీ, భార‌త‌దేశం యొక్క ఆత్మా!

మిత్రులారా,

అమ్మ చెప్పినట్లుగా ఆరోవిలే ఓ విశ్వ ప‌ట్ట‌ణంగా రూపొందాలి. ఆరోవిలే ఉద్దేశమల్లా మాన‌వులలో ఏక‌త్వాన్ని సాధించ‌డం.

ఇక్క‌డ‌కు తరలివ‌చ్చిన ఈ భారీ జ‌న స‌మూహం ఆ ఆలోచ‌న‌ యొక్క ప్ర‌తిబింబమే. శ‌తాబ్దాల త‌ర‌బ‌డి ప్ర‌పంచానికి ఆధ్యాత్మిక కేంద్రంగా నిలచింది భార‌త‌దేశం. ఈ దేశంలోని అత్యుత్త‌మ విశ్వ‌విద్యాల‌యాలైన నాలందా, త‌క్ష‌శిలా.. ప్ర‌పంచం న‌లు మూల‌ల‌ నుండి వ‌చ్చిన విద్యార్థుల‌కు విద్యాబుద్ధులను నేర్పాయి. ప్ర‌పంచంలో అనేక ఉన్న‌త మ‌తాలు ఇక్క‌డే పుట్టాయి. అవి స‌మాజం లోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల‌కు స్ఫూర్తిని ఇస్తున్నాయి. ప్ర‌జ‌లు వారి వారి జీవితాల్లో ఆధ్యాత్మిక మార్గాన్ని అనుస‌రించడానికి దోహ‌దం చేస్తున్నాయి.

ఇటీవల, జూన్ 21 వ తేదీని అంత‌ర్జాతీయ యోగా దినంగా ఐక్య‌ రాజ్య‌ స‌మితి గుర్తించింది. భార‌త‌దేశానికి చెందిన ఘ‌న‌మైన సంప్ర‌దాయానికి పెద్ద‌ పీట వేసింది. ప్ర‌పంచంలోని అన్ని వ‌ర్గాల ప్ర‌జ‌ల్ని ఆరోవిలే ఓ చోటుకు చేరుస్తోంది. స‌రిహ‌ద్దుల‌కు, అస్తిత్వాల‌కు అతీతంగా మ‌హిళలు, యువ‌త‌, వృద్ధులు ఇక్క‌డ‌కు వ‌స్తున్నారు.

దైవాంశ సంభూతురాలైన దివ్వ మాత స్వ‌యంగా త‌న చేతుల‌తో ఆరొవిలే విధి విధానాల‌ను ఫ్రెంచ్ భాష‌లో రాసిన‌ట్టు నాకు తెలిసింది. ఆ చార్ట‌ర్ ప్ర‌కారం ఆరొవిలే కోసం అమ్మ ఐదు అత్యున్న‌త నియ‌మాల‌ను రూపొందించారు.

ఆరోవిలే కు సంబంధించి మొద‌టి అత్యున్న‌త నియ‌మం ఇది మాన‌వ‌ జాతికి చెందిన‌ది. వ‌సుధైక కుటుంబకమ్.. అంటే ఈ ప్ర‌పంచం ఒకే పరివారం అనే భార‌త‌దేశ పురాత‌న భావ‌న‌ను ఇది ప్ర‌తిఫ‌లిస్తోంది.

ఆరోవిలే ప్రారంభోత్స‌వం 1968 లో జ‌రిగింది. ఆ రోజు 124 దేశాల‌కు చెందిన ప్ర‌తినిధులు హాజరైన‌ట్టు నాకు చెప్పారు. ప్ర‌స్తుతం ఇక్క‌డ 49 దేశాలకు చెందిన 2400 మంది పౌరులు నివ‌సిస్తున్న‌ట్టు తెలిసింది.

ఇక ఆరోవిలే లోని రెండో నియ‌మాన్ని తీసుకుంటే ఆధ్యాత్మిక దైవ‌త్వానికి స్వ‌చ్ఛందంగా సేవ‌లు అందించేవారు ఇక్క‌డ నివ‌సించ‌డానికి అర్హులు. మ‌హ‌ర్షి అర‌విందుల వారి ఎరుక‌కు సంబంధించిన త‌త్వాన్ని గొప్ప‌గా చెప్పారు. ఆయ‌న చెప్పిన ఈ త‌త్వం మాన‌వులు మాత్ర‌మే కాదు..ఈ మొత్తం విశ్వ ఐక‌మ‌త్యానికి సంబంధించింది. ఇది మ‌న పూర్వులు చెప్పిన ఈషావాస్య ఉప‌నిష‌త్ కు నిద‌ర్శ‌నంగా నిలుస్తోంది. దీనికి మ‌హాత్మ గాంధీ చేసిన అనువాదం ప్ర‌కారం ప‌ర‌మాణువంత సూక్ష్మ‌మైంది కూడా దివ్య‌మైందే.

ఇక ఆరోవిలే కు సంబంధించిన మూడో నియ‌మాన్ని చూద్దాం. దీని ప్ర‌కారం ఈ ప‌ట్ట‌ణం గ‌తానికి, భవిష్య‌త్ కు అనుసంధానంగా అవ‌త‌రిస్తుంది. 1968లో ఆరోవిలే ఏర్పడిన‌ప్పుడు భార‌త‌దేశం, ప్ర‌పంచం ఎలా ఉండేవో చూద్దాం. నాడు ప్ర‌పంచం ఎక్క‌డిక‌క్క‌డ చీలిపోయి, ప్ర‌చ్ఛ‌న్న యుద్ధం బారిన విల‌విల‌లాడుతుండేది. అలాంటి ప‌రిస్థితుల్లో ఆరోవిలే ఏర్ప‌డింది. వ్యాపార‌ం, ప్రయాణాలు, క‌మ్యూనికేష‌న్ ల కార‌ణంగా ఈ ప్ర‌పంచం తిరిగి సమ్మిళితం కావడాన్ని ఆరోవిల్లే ముందుగానే ఊహించింది.

మొత్తం మాన‌వాళిని ఒక చిన్న ప్రాంతానికి చేర్చాల‌నే దార్శ‌నిక‌త‌ నుండి ఈ ప‌ట్ట‌ణం జ‌న్మించింది. అనుసంధానించిన ప్ర‌పంచం మ‌న భ‌విష్య‌త్ అనే విష‌యాన్నిఇది చెబుతోంది. ఆరోవిలే స్థాప‌న వెనుక‌ గ‌ల నాలుగో నియ‌మాన్ని ఇప్పుడు చూద్దాం. వ‌ర్త‌మాన ప్ర‌పంచం లోని ఆధ్యాత్మిక‌, వ‌స్తుగ‌త అంశాల‌ను ఆరోవిలే అనుసంధానిస్తుంది. శాస్త్ర విజ్ఞ‌ానం, సాంకేతిక విజ్ఞ‌ాన రంగాల ఆధారంగా పురోగతిని సాధించ‌డానికి ప్ర‌పంచం కృషి చేస్తోంది. అయితే అదే స‌మ‌యంలో సామాజిక క్ర‌మ‌శిక్ష‌ణ‌ కోసం, స్థిర‌త్వం కోసం ఆధ్యాత్మిక అవ‌స‌రాన్ని ఈ ప్ర‌పంచం గుర్తించింది.
ఆరోవిలే ద‌గ్గ‌ర భౌతిక‌ ప్రపంచం, ఆధ్యాత్మిక ప్ర‌పంచం ప‌ర‌స్ప‌ర ఆశ్రితంగా అస్తిత్వంలో ఉన్నాయి. ఇక ఐదో ప్ర‌ధాన‌మైన నియ‌మాన్ని తీసుకుంటే.. ఆరోవిలే అనేది అనంత‌మైన జ్ఞాన స‌ముపార్జ‌నకు, స్థిర‌మైన ప్ర‌గ‌తికి కేంద్రం. కాబ‌ట్టి ఈ కేంద్రం ఎప్ప‌టికీ ఆగిపోదు.

నిరంత‌ర ఆలోచ‌న‌, పున‌ర్ ఆలోచ‌న ల ద్వారానే మాన‌వాళి ప్ర‌గ‌తి సాధ్య‌మ‌వుతుంది. త‌ద్వారా మ‌నిషి మ‌స్తిష్కం ఒకే ఆలోచ‌న‌కు ప‌రిమిత‌మై బిగుసుకు పోదు.
విస్తృతమైన భిన్న‌త్వం గ‌ల ప్ర‌జ‌ల‌ను, ఆలోచ‌న‌ల‌కు ఒక చోటుకు చేర్చింది ఆరోవిలే. ఈ కార‌ణంగానే సంభాష‌ణ‌లు గానీ, చ‌ర్చ‌లు గానీ చాలా స‌హ‌జంగా కొన‌సాగుతున్నాయి. ప్రాథమికంగా చూసిన‌ప్పుడు భార‌తీయ స‌మాజం భిన్న‌త్వం క‌లిగిన స‌మాజం. మ‌న స‌మాజం సంభాష‌ణ‌ను, తాత్విక‌ప‌ర‌మైన సంప్ర‌దాయాన్ని ప్రోత్స‌హించింది. ఇక్క‌డ‌కు అంత‌ర్జాతీయ భిన్న‌త్వాన్ని తీసుకువచ్చి ఒకే వేదిక‌లో భాగం క‌ల్పించ‌డం ద్వారా ఆరోవిలే ఈ సంప్ర‌దాయాన్ని చాటుతోంది.

ప‌ర‌స్ప‌ర గౌర‌వాన్ని, ప‌లు మ‌తాలు, సంస్కృతులు ఒకే చోట మ‌నుగ‌డ సాగించ‌డానికి వీలుగా భార‌త‌దేశం నిత్యం కృషి చేసింది. శ‌తాబ్దాల త‌ర‌బ‌డి భార‌త‌దేశంలో గురుకుల సంప్ర‌దాయం కొనసాగింది. ఈ గురుకులాల్లో జ్ఞాన‌ బోధ‌న అనేది త‌ర‌గ‌తి గ‌దుల‌కు ప‌రిమిత‌ంది కాదు. ఇక్క‌డ జీవిత‌మే ప్ర‌యోగ‌ శాల‌. ఆరోవిలే లో కూడా అంతం లేని, జీవితాంతం కొన‌సాగే బోధ‌నకు పెద్ద పీట వేయ‌డం జ‌రిగింది.

ఏమైనా గొప్ప కార్య‌క్ర‌మాలు మొద‌లుపెట్టాలంటే మ‌న మునులు, సాధువులు య‌జ్ఞాలు చేసే వారు. సంద‌ర్భానుసారం అలాంటి య‌జ్ఞాలు మ‌న దేశ చ‌రిత్ర‌ను రూపొందించాయి.

ఐక‌మ‌త్యాన్ని కోరుతూ అలాంటి ఒక య‌జ్ఞాన్ని 50 సంవ‌త్స‌రాల క్రితం ఇక్క‌డ నిర్వ‌హించ‌డం జ‌రిగింది. ప్ర‌పంచం నలుమూల‌ల‌ నుండి ఇక్క‌డకు వ‌చ్చిన పురుషులు, మ‌హిళ‌లు వారితో పాటు వారి వారి ప్రాంతాల మ‌ట్టిని తీసుకువచ్చారు. వారి మ‌ట్టిని క‌ల‌ప‌డం ద్వారా ఏక‌త్వ‌ం అనే ప్ర‌యాణం ప్రారంభ‌మైంది.

కాల‌ క్ర‌మంలో ప‌లు రూపాలలో ఆరోవిలే ఆవిష్క‌రించిన సకారాత్మ‌క ఆలోచ‌న‌లను ప్ర‌పంచం అందుకొంది. అంతం లేని విద్యా బోధ‌న‌, ప‌ర్యావ‌ర‌ణ పున‌ర్ సృష్టి, పున‌ర్ వినియోగ ఇంధ‌నం, సేంద్రియ వ్య‌వ‌సాయం, ప‌ర్యావ‌ర‌ణ అనుకూల భ‌వ‌న సాంకేతిక‌త‌లు, నీటి నిర్వ‌హ‌ణ‌, వ్య‌ర్ధాల నిర్వ‌హ‌ణ‌.. ఇలా ఏ రంగాన్ని తీసుకొన్నా అందులో ఆరోవిలే మార్గ‌ద‌ర్శ‌క‌త్వం వ‌హించింది.

దేశంలో నాణ్య‌మైన విద్య‌ను ప్రోత్స‌హించ‌డానికి ఆరోవిలే కృషి చేసింది. ఆరోవిలే కు యాభై సంవ‌త్స‌రాలు పూర్తి అయిన సంద‌ర్భంగా మీరు ఈ కృషిని రెట్టింపు చేస్తార‌ని నేను ఆకాంక్షిస్తున్నాను. విద్య‌ బోధ‌న ద్వారా యువ‌త‌కు సేవలు అంద‌జేయ‌డ‌మ‌నేది మీరు శ్రీ అర‌విందుల‌ వారికి, మాతృశ్రీ కి ఇస్తున్న ఘ‌న‌ నివాళిగా నేను భావిస్తున్నాను.

మీలో చాలా మందికి తెలియ‌క‌పోవ‌చ్చు.. విద్యారంగంలో మీరు చేస్తున్న కృషిని నేను అనుస‌రిస్తున్నాను. శ్రీ అర‌విందుల‌ వారిని, మాతృమూర్తిని ఎంతో భ‌క్తిప్ర‌ప‌త్తుల‌తో పూజించే శ్రీ కిరీట్ భాయ్ జోషి దేశంలో పేరొందిన విద్యావేత్త‌.

నేను గుజ‌రాత్ ముఖ్య‌మంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఆయ‌న నా విద్యారంగ స‌ల‌హాదారుగా సేవ‌లను అందించారు. ప్ర‌స్తుతం ఆయ‌న మ‌న మ‌ధ్య‌లో లేరు. అయితే మ‌న దేశంలో విద్యారంగ ప్ర‌గ‌తికి ఆయ‌న అందించిన సేవ‌లు స్మ‌ర‌ణీయ‌మైన‌వి.

మిత్రులారా,

‘‘ఆనో భ‌ద్ర: క‌్ర‌త్వో యంతు విస్వ‌త‌:’’

అని రుగ్వేదం చెబుతోంది. ఈ మాటలకు భావం.. అన్ని వైపుల‌ నుండి వ‌చ్చే ఉత్త‌మ‌మైన ఆలోచ‌న‌ల్ని స్వీక‌రించు అని.

ఈ దేశం లోని సామాన్యుల‌ను సాధికారుల‌ను చేసే ఆలోచ‌న‌ల్ని ఆరోవిలే కొన‌సాగించాల‌ని కోరుకొంటున్నాను. ప్ర‌పంచం న‌లుమూల‌ల‌ నుండి ఇక్క‌డ‌కు వ‌చ్చే వారు వారితో పాటు నూత‌న ఆలోచ‌న‌లను తీసుకువస్తారు. ఈ ఆలోచ‌న‌లన్నీ సంగ‌మించే కేంద్రంగా ఆరోవిలే వెలుగొందాల‌ని ఆకాంక్షిస్తున్నాను. ఆరోవిలే ఈ ప్ర‌పంచానికి వెలుగును చూపే కాంతిపుంజం కావాలని అభిలషిస్తున్నాను. మెద‌ళ్ల‌లో ఏర్ప‌డే సంకుచితమైన గోడ‌ల‌ను బ‌ద్ద‌లు చేసే సంర‌క్ష‌కురాలిగా రూపొందాలి. మాన‌వ ఐక్య‌త‌ను కోరుకునే సంబ‌రాల్లోకి, అంద‌రినీ ఆహ్వానించ‌డాన్ని కొన‌సాగించాలి.
ఆరోవిలే ఏర్ప‌డ‌డానికి కార‌ణ‌మైన‌ ఘ‌న‌మైన దార్శనిక‌త‌ను సాధించ‌డానికి వీలుగా ఆరోవిలే త‌న మార్గ‌ద‌ర్శ‌క‌త్వాన్ని కొసాగిస్తుంద‌ని, మ‌హ‌ర్శి అర‌విందుల వారి, మాతృమూర్తి గారి స్ఫూర్తిని కొన‌సాగిస్తుంద‌ని భావిస్తున్నాను.

మీ అంద‌రికీ ధన్యావాదాలు.

***