Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

పెంపుదలతో కూడిన మార్పునకు కాలం చెల్లింది: ప్రధాన మంత్రి

పెంపుదలతో కూడిన మార్పునకు కాలం చెల్లింది: ప్రధాన మంత్రి

పెంపుదలతో కూడిన మార్పునకు కాలం చెల్లింది: ప్రధాన మంత్రి


పరివర్తనతో కూడిన మార్పు కోసం ఒక విజన్ ను సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ కు సూచించిన ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ

ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ రానున్న పదిహేను సంవత్సరాలలో భారతదేశ అభివృద్ధి కి అనుసరింవలసిన మార్గసూచీ తో కూడిన ఒక విజన్ డాక్యుమెంట్ ను రూపొందించవలసిందని నీతి ఆయోగ్ కు పిలుపునిచ్చారు. అంతే కాకుండా, 21వ శతాబ్దంలో మిగిలివున్న దశాబ్దాలలో దేశ పురోగతి కోసం పునాది వేయాలని కూడా ఆయన సూచించారు.

నీతి ఆయోగ్ సభ్యులతో సంభాషించిన ప్రధాన మంత్రి- ప్రపంచవ్యాప్తంగా కొన్నేళ్లుగా ఒక ప్రమాణంగా ఉన్న (ఆర్థిక వృద్ధి రేటు) పెంపుదలతో కూడిన మార్పునకు ఇక కాలం చెల్లిందన్నారు. ఇది పరివర్తనతో కూడిన మార్పు చోటు చేసుకోవలసిన తరుణం అని ఆయన చెప్పారు. గత మూడు దశాబ్దాల నుండి మార్పునకు ఒక చోదక శక్తిగా ఉంటూ సాంకేతిక విజ్ఞానం ప్రముఖ పాత్రను పోషిస్తోంది అని ఆయన వివరించారు. ఈ మార్పు యొక్క వేగం మందగించకూడదని స్పష్టం చేశారు. ప్రజల జీవనాన్ని మెరుగుపరచడం కోసం పరివర్తనతో కూడిన మార్పును ఆవిష్కరించేందుకు కావలసిన ధైర్యం, సామర్థ్యం కేంద్ర ప్రభుత్వానికి ఉన్నాయని ప్రధాన మంత్రి తేటతెల్లం చేశారు.

చరిత్రను పట్టి చూస్తే, భారతీయ విధాన రూపకర్తలు దేశానికి ఉన్న నిర్బంధాల విషయంలో దు:ఖించారే తప్ప దేశానికి ఉన్న బలాలను వారు వినియోగించుకోలేదని ప్రధాన మంత్రి ప్రస్తావించారు. భారతదేశ అభివృద్ధి ఎటువంటి రూపురేఖలను కలిగివుండాలో ప్రధాన మంత్రి స్థూలంగా చెప్పుకొచ్చారు. భారతదేశానికి ప్రకృతిపరంగా ఒనగూడిన వనరులతో పాటు మానవ వనరులను కూడా తగిన విధంగా వివేకంతో ఉపయోగించుకోవాలి.. ఉద్దేశిస్తున్న మార్పునకు ఇదే ప్రధాన ప్రాతిపదిక కావాలి అనే అభిప్రాయాన్ని ప్రధాన మంత్రి వ్యక్తం చేశారు. ఈ సందర్భంలో ఆయన పలు ఉదాహరణలను గురించి ఏకరువు పెట్టారు; అందుబాటులో ఉన్న భూమిని, దేశ ఖనిజ సంపదను, వినియోగంలోకి తీసుకురాని అపారమైన సౌర శక్తి సామర్ధ్యాన్ని గురించి ఆయన చాటిచెప్పారు. ఇదే విధంగా భారతదేశానికి అమరిన విస్తృత‌మైన‌ కోస్తాతీరాన్ని ఆదర్శప్రాయమైన స్థాయి కన్నా తక్కువగా మాత్రమే ఇంతదాకా వినియోగించుకోవడం జరిగింది అని కూడా ప్రధాన మంత్రి అన్నారు.

మానవ వనరుల వికాసం గురించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ, నైపుణ్యాలకు మెరుగులు దిద్దుకోవడం ఎంతో కీలకమైన అంశమని

చెప్పారు. భవిష్యత్తులో ప్రపంచవ్యాప్తంగా సమర్థమైన మానవ వనరుల అవసరం ఎంతైనా ఉంటుందని, దానిని తీర్చగల సత్తా భారతదేశానికున్నదని ప్రధాన మంత్రి ఈ సందర్భంలో గుర్తు చేశారు. భారతదేశ పర్యటక రంగానికి సరికొత్త శక్తిని

సంతరించవలసిన అవసరం ఉన్నదని ప్రధాన మంత్రి చెప్పారు. అభివృద్ధికి, ఎగుమతులకు ఊతం ఇవ్వడం కోసం రాష్ట్రాలతో భాగస్వామ్యాన్ని కుదుర్చుకోవడం సహకారాత్మకమైన సమాఖ్య తత్వానికి ఒక మౌలిక అంశం మాత్రమే కాక అది తప్పనిసరి కూడా అని ఆయన తెలిపారు.

వ్యవసాయాన్ని గురించి ప్రధాన మంత్రి చెబుతూ, శ్రద్ధ తీసుకోవలసింది వ్యవసాయ దిగుబడి అంశమొక్కటే కాదని.. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ సమగ్ర అభివృద్ధి కోసం కంకణం కట్టుకోవాలన్నారు. ఈ రంగంలో ఫూడ్ ప్రాసెసింగ్ విభాగానికి ఉన్న ప్రాముఖ్యాన్ని గురించి, గిడ్డంగి వసతిని పెంచుకోవలసిన అవసరం గురించి, సాంకేతిక ఉత్పాదకాలను గురించి ఆయన నొక్కిచెప్పారు.

విధానాల కన్నా విధాన రూపకర్తల ఉద్దేశాలు మరింత ముఖ్యమైనవి అని ప్రధాన మంత్రి అన్నారు. సుపరిపాలనకు తగిన సామర్థ్యాలను పెంచిపోషించుకోవలసిన అవసరం ఉన్నదని ఆయన స్పష్టం చేస్తూ, రియల్-టైమ్ డాటా ను అందుబాటులో ఉండేటట్లు చూడడం ముఖ్యమని వెల్లడించారు.

(ఎల్ పి జి ని) వదులుకోండి అంటూ సాగిన ప్రచార ఉద్యమం విజయవంతం కావడం వంటి సంఘటనల నుండి, ఇంకా.. స్వచ్ఛతా అభియాన్ పట్ల ప్రజలలో సర్వత్రా వ్యక్తమైన సానుకూల ప్రతిస్పందన నుండి ప్రేరణను పొందవలసిందిగా నీతి ఆయోగ్ కు ప్రధాన మంత్రి విజ్ఞ‌ప్తి చేశారు. ఈ అనుభవం ప్రజలు వారికి అందే స్వీయ ప్రయోజనాలను గురించి మాత్రమే పట్టించుకొంటారు అంటూ నిపుణులు పరిపాటిగా చేసే కల్పనలను త్రోసిపుచ్చుతోందని, ప్రజలు విశాల జన హితం విషయంలో స్ఫూర్తిని పొందుతారని నిరూపిస్తోందని ఆయన చెప్పారు.

ఈ సమావేశానికి ప్రణాళిక శాఖ సహాయ మంత్రి శ్రీ రావు ఇందర్ జీత్ సింగ్, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ శ్రీ అరవింద్ పాన్ గడియా, నీతి ఆయోగ్ సభ్యులు, నీతి ఆయోగ్, పి ఎమ్ ఒ మరియు కేబినెట్ సెక్రటేరియట్ లకు చెందిన సీనియర్ అధికారులు హాజరయ్యారు.

***