Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బోగీబీల్ వంతెన జాతికి అంకితం; వంతెన మీదుగా తొలి ప్రయాణికుల రైలుకు పచ్చ జెండా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బోగీబీల్ వంతెన జాతికి అంకితం;  వంతెన మీదుగా తొలి ప్రయాణికుల రైలుకు పచ్చ జెండా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బోగీబీల్ వంతెన జాతికి అంకితం;  వంతెన మీదుగా తొలి ప్రయాణికుల రైలుకు పచ్చ జెండా

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా బోగీబీల్ వంతెన జాతికి అంకితం;  వంతెన మీదుగా తొలి ప్రయాణికుల రైలుకు పచ్చ జెండా


ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇవాళ అసోంలో బోగీబీల్ వంతెనను జాతికి అంకితం చేశారు. రాష్ట్రంలోని దిబ్రూగఢ్-ధేమాజీ జిల్లాలను కలుపుతూ బ్రహ్మపుత్ర నదిపై నిర్మించిన ఈ వంతెనకు జాతీయ స్థాయిలోనూ ఆర్థికంగా, వ్యూహాత్మకంగా గణనీయ ప్రాధాన్యం ఉంది. బ్రహ్మపుత్ర నది ఉత్తరపు ఒడ్డునగల కరెంగ్ చపోరివద్ద అశేష ప్రజానీకం హాజరైన సభలో ప్రధానమంత్రి ఈ వంతెనను జాతికి అంకితం చేయడంతోపాటు దీనిమీదుగా వెళ్లే తొలి ప్రయాణికుల రైలును పచ్చ జెండా ఊపి సాగనంపారు.

అనంతరం ఆయన ప్రసంగిస్తూ- ముందుగా ఇటీవలే కన్నుమూసిన ప్రముఖ అసోమీ గాయకుడు దీపాలీబోర్ ఠాకూర్‌కు నివాళి అర్పించారు. అలాగే వివిధ రంగాలలో అసోం రాష్ట్రానికేగాక దేశానికే వన్నెతెచ్చిన అనేకమంది ప్రముఖులు, చారిత్రక వ్యక్తులకు శ్రద్ధాంజలి ఘటించారు. క్రిస్మస్ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. మరోవైపు ఇవాళ మాజీ ప్రధాని అటల్ బిహారీ వాజ్పేయి జయంతిని పురస్కరించుకుని దేశవ్యాప్తంగా ‘‘సుపరిపాలన దినోత్సవం’’ నిర్వహించుకుంటున్నట్లు ప్రధాని గుర్తుచేశారు.

కేంద్ర ప్రభుత్వం గడచిన నాలుగేళ్లుగా సుపరిపాలన లక్ష్యాలను సాధిస్తూ వస్తున్నదని ప్రధానమంత్రి ఈ సందర్భంగా పేర్కొన్నారు. చారిత్రక బోగీబీల్ రైలు-రోడ్డు వంతెనను నేడు జాతికి అంకితం చేయడం ఇందుకు నిదర్శనమని వివరించారు. ఇంజనీరింగ్, సాంకేతిక పరిజ్ఞానాలపరంగా ఒక అద్భుతంగా ఈ వంతెనను అభివర్ణిస్తూ, దీనికి వ్యూహాత్మకంగానూ ఎంతో ప్రాధాన్యం ఉందని తెలిపారు. అసోం-అరుణాచల్ ప్రదేశ్ రాష్ట్రాల మధ్య దూరాన్ని ఈ వంతెన గణనీయంగా తగ్గించడమేగాక ఈ ప్రాంత ప్రజల ‘‘జీవన సౌలభ్యాన్ని’’ ఎంతగానో మెరుగుపరచగలదని ఆయన చెప్పారు. తరతరాలుగా ఈశాన్య భారతవాసులు కలలుగంటున్న ఈ వంతెన నేటికి సాకారమైందని ప్రధాని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో ఆరోగ్య సంరక్షణ, విద్య, వాణిజ్యాలకు దిబ్రూగఢ్ ముఖ్యమైన కూడలి అని, ఈ వంతెన కల నెరవేరిన నేపథ్యంలో బ్రహ్మపుత్రకు ఉత్తరాన నివసించే ప్రజలు ఈ నగరానికి సులభంగా చేరుకోగల సౌకర్యం సమకూరిందని చెప్పారు. వంతెన నిర్మాణంలో పాలుపంచుకున్న వారందరికీ ప్రధానమంత్రి అభినందనలు తెలిపారు.

అసోంలోని సాదియాలో దేశంలో అత్యంత పొడవైన భూపేన్ హజారికా వంతెనను 2017 మే నెలలో తాను జాతికి అంకితం చేయడాన్ని ఈ సందర్భంగా ప్రధాన మంత్రి గుర్తు చేశారు. గడచిన 60-70 ఏళ్లలో బ్రహ్మపుత్ర నదిపై కేవలం మూడు వంతెనలు మాత్రమే నిర్మించినట్లు ప్రధాని ప్రస్తావించారు. అయితే, కేవలం గడచిన నాలుగున్నరేళ్లలోనే మరో మూడు వంతెనల నిర్మాణం పూర్తయిందని, మరో 5 వంతెనల పనులు కొనసాగుతున్నాయని వివరించారు. ఈ వంతెనల నిర్మాణంతో బ్రహ్మపుత్ర ఉత్తర-దక్షిణ తీరాల్లో నివసించే ప్రజలకు అనుసంధానం మెరుగుపడిందని, సుపరిపాలనలో ఇదొక కీలకాంశమని ప్రధాని చెప్పారు. ఈ ప్రగతి వేగం వల్ల ఈశాన్య భారతం రూపాంతరం చెందగలదన్నారు. ‘రవాణా ద్వారా రూపాంతరీకరణ’ అన్న కేంద్ర ప్రభుత్వ దార్శనికత గురించి ప్రధాని ఈ సందర్భంగా వివరించారు. ఇందులో భాగంగా దేశమంతటా మౌలిక సదుపాయాల విస్తరణ అత్యంత వేగంగా సాగుతున్నదని చెప్పారు.

అసంపూర్తి ప్రాజెక్టులను పూర్తిచేయడంలో అసోం రాష్ట్ర ప్రభుత్వం అవిరళ కృషి చేస్తున్నదని ప్రధానమంత్రి ప్రశంసించారు. కేవలం నాలుగున్నరేళ్లలోనే దాదాపు 700 కిలోమీటర్ల జాతీయ రహదారుల నిర్మాణం పూర్తయిందని ఆయన చెప్పారు. ఈశాన్య భారత ప్రాంతంలో అనుసంధానానికి సంబంధించిన అనేక ఇతర ప్రాజెక్టుల గురించి కూడా ఆయన ప్రస్తావించారు. బలమైన, ప్రగతిశీల ఈశాన్య భారతమే… బలమైన, ప్రగతిశీల భారతావనికి కీలకమని పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల విస్తరణతోపాటు ప్రభుత్వం అమలు చేస్తున్న ‘ఉజ్వల, స్వచ్ఛభారత్ అభియాన్’ వంటి పథకాల గురించి ప్రధాని ప్రస్తావిస్తూ- అసోంలో ఇవి సమర్థంగా అమలవుతున్నాయని కొనియాడారు. భారతదేశ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం మౌలిక సదుపాయాలను విస్తరిస్తున్నట్లు ప్రధాని వివరించారు. ఇక దేశం నలుమూలల నివసించే యువత భారతదేశానికి విశ్వవ్యాప్త కీర్తిప్రతిష్ఠలను ఆర్జించి పెడుతున్నదని ప్రధానమంత్రి ప్రశంసించారు. అసోం రాష్ట్ర ప్రముఖ క్రీడాకారిణి హిమాదాస్ గురించి ప్రస్తావిస్తూ- ఇలాంటి యువతరమే ఆత్మవిశ్వాస పూరిత నవ భారతానికి ప్రతీకలని పేర్కొన్నారు.