Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్ పాలక మండలి తొలి సమావేశం

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్ పాలక మండలి తొలి సమావేశం


జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్ పాలక మండలి (ఎన్ ఎస్‌ డి ఎమ్) తొలి సమావేశం గౌరవనీయులైన భారతదేశ ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన 2016 జూన్ 2న జరిగింది.

సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాన మంత్రి మాట్లాడుతూ భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ప్రతి రంగంలో నైపుణ్యాభివృద్ధి గొప్పదనాన్ని గుర్తించవలసి ఉందని స్పష్టంచేశారు. అలాగైతేనే బడికి వెళ్లే పిల్లలు, వారి తల్లితండ్రులు ఉద్యోగం సంపాదించడం కోసం భావి ఆవశ్యకతలు ఏమిటన్నది తెలుసుకోగలుగుతారని ఆయన అన్నారు. అంతే కాక ప్రపంచ స్థాయిలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవడానికి ఉన్న ఆవశ్యకతలు ఏమిటో తెలుసుకొనేందుకు ప్రయత్నాలు జరగాలని, తద్వారా భారతదేశం నిపుణత్వం కలిగిన శ్రామిక శక్తి కి సంబంధించి ప్రపంచపు అవసరాలను తీర్చగలుగుతుందని ఆయన చెప్పారు.

నైపుణ్యాల మెరుగుదలతో ముడిపడిన అన్ని సురక్ష ప్రమాణాలపై
దృష్టి పెట్టాలని సూచించారు. ఇది నైపుణ్యాలను మెరుగుపర్చుకొనే ప్రక్రియ నుండి విడదీయలేని అంశమని కూడా ఆయన అభిప్రాయపడ్డారు.

ఈ సమావేశంలో మహారాష్ట్ర, అరుణాచల్ ప్రదేశ్, జమ్మూ & కశ్మీర్‌ ల ముఖ్యమంత్రులు; నైపుణ్యాభివృద్ధి మరియు ఆంట్రప్రనర్ షిప్ శాఖ సహాయ మంత్రి (స్వతంత్ర బాధ్యత) శ్రీ రాజీవ్ ప్రతాప్ రూడీ, మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి శ్రీమతి స్మృతి జుబిన్ ఇరానీ, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా సంస్థల శాఖ మంత్రి శ్రీ కల్ రాజ్ మిశ్రా, కమ్యూనికేషన్ & సమాచార సాంకేతిక విజ్ఞాన‌ శాఖ మంత్రి శ్రీ రవిశంకర్ ప్రసాద్‌ తో పాటు సీనియర్ అధికారులు, కార్పొరేట్ ప్రముఖులు టాటా గ్రూప్ చైర్మన్ శ్రీ సైరస్ పి. మిస్త్రీ, ఫ్లిప్‌కార్ట్ వ్యవస్థాపకుడు- కార్యనిర్వహణాధికారి శ్రీ సచిన్ బన్ సల్, టీమ్ లీస్ సర్వీసెస్ వ్యవస్థాపకుడు – చైర్మన్ శ్రీ మనీష్ సభర్వాల్ కూడా ఈ పాలక మండలి సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశంలో తీసుకున్న కొన్ని కీలక నిర్ణయాలలో ఈ కిందివి ఉన్నాయి :

• 2016-17 లో ఏడాదికి కనీసం 1.5 కోట్ల మందికి నైపుణ్య శిక్షణ ఇవ్వాలనేది లక్ష్యం.

• భారతదేశపు నైపుణ్యాభివృద్ధి పర్యావరణ వ్యవస్థలో నాణ్యతను పెంచేందుకు 2016 సెప్టెంబర్ కల్లా ‘సెంట్రల్ బోర్డ్ ఫర్ స్కిల్స్ సర్టిఫికేషన్’ను ఏర్పాటు చేయాలి.

• ప్రస్తుతమున్న ఇంజనీరింగ్ కళాశాలల్లో నిరుపయోగంగా ఉన్న మౌలిక వసతులను నైపుణ్య శిక్షణ కోర్సులకు వినియోగించుకోవాలి.

• లాభాలను ఆర్జిస్తున్న ప్రభుత్వ రంగ సంస్థ (పి ఎస్ యు)లను మొత్తం శ్రామికులలో 10 శాతం మందికి ఏడాది కాలంలో అప్రెంటిస్‌షిప్ ఇచ్చే విధంగా ఆదేశాలు జారీ చేయడం. ప్రైవేటు కార్పొరేషన్ లు కూడా దీనిని పాటించే ఏర్పాటు చేయబడును.

• ఈ ఏడాదిలో ఉత్సాహవంతులైన భారతదేశ యువతీయువకులకు ఉచితంగా నైపుణ్య శిక్షణనిచ్చే 500 ప్రధాన మంత్రి కౌశల్ కేంద్రాలను ప్రారంభించనున్నారు.

• భారతదేశం నుంచి వివిధ ప్రాంతాలకు వలస వెళ్లిన వారి కోసం విదేశాల్లోనూ 50 నైపుణ్య శిక్షణ కేంద్రాలను ఈ సంవత్సరం ప్రారంభించనున్నారు.

• నైపుణ్యం సంపాదించాలనే ఉత్సాహాన్ని యువతలో పెంపొందించేందుకు పారిశ్రామిక శిక్షణ సంస్థలు (ఐ టి ఐ లు), కేంద్రీయ శిక్షణ సంస్థలు, పి ఎమ్ కె వి వై శిక్షణ కేంద్రాలు, టూల్ రూమ్ లలో 500 ఉపాధి ఉత్సవాలు నిర్వహించనున్నారు.

• భారతదేశ యువతలోని నైపుణ్యాన్ని గుర్తించేందుకు 2016-17 నుండి ‘ఇండియా స్కిల్స్’ పేరుతో ఓ జాతీయ నైపుణ్య పోటీని నిర్వహించనున్నారు. ఈ పోటీ వార్షిక కార్యక్రమంగా ఉంటుంది.

• ఈ ఏడాది ఐటీఐ కోర్సులను విజయవంతంగా ముగించిన వారి కోసం జాతీయ స్థాయి స్నాతకోత్సవాన్ని నిర్వహిస్తారు. వారి విజయాన్ని గుర్తించడానికే ఈ కార్యక్రమం.

• వచ్చే ఏడాదిలో ఐ టి ఐ ల సామర్థ్యాన్ని 18.5 లక్షల నుండి 25 లక్షలకు పెంచాలనేది లక్ష్యం. దీనికి తోడు కొత్తగా 5,000 ఐ టి ఐ లను ఏర్పాటు చేస్తారు.

• సంప్రదాయ నైపుణ్యాలను గుర్తించి, వాటికి సానబెట్టి వివిధ కార్యక్రమాల ద్వారా భిన్నమైన పద్ధతులలో వాటిని ప్రోత్సహించాలి.

పూర్వ రంగం:

భారతదేశంలో 65 శాతం మంది 35 ఏళ్ల లోపు వయస్సు వారే. 2025 కల్లా, ప్రపంచంలోని పని చేస్తున్న వయస్సు వారిలో (18.3 %) ప్రతి ఐదుగురిలోను ఒకరు భారతీయులే అయి ఉంటారు. పెరుగుతున్న భారతదేశ జనాభా, నైపుణ్యాభివృద్ధి అవసరాల ఆధారంగా ఇందుకోసం ప్రత్యేకంగా తొలి సారిగా ఓ మంత్రిత్వ శాఖ.,. నైపుణ్య అభివృద్ధి మరియు ఆంట్రప్రనర్ షిప్ మంత్రిత్వ శాఖ.. (ఎమ్ ఎస్‌ డి ఇ)ను ఎన్ డి ఎ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత 2014లో నవంబర్ లో ఏర్పాటు చేసింది. ఈ కొత్త మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో స్కిల్ ఇండియా కార్యక్రమానికి విశేష ప్రాధాన్యం లభించింది.

ఎంమ్ ఎస్‌ డి ఇ వివిధ విభాగాలతో కూడిన వ్యవస్థ. 21 కేంద్ర ప్రభుత్వ మంత్రిత్వ శాఖలు, విభాగాలు 50కి పైగా నైపుణ్య శిక్షణ కార్యక్రమాలను అమలు చేస్తున్నాయి. ఇప్పటి వరకు వీటి మధ్య సమాచార మార్పిడి లేదు. పథకాలు, నిర్వహణ వ్యవస్థలో భిన్నాభిప్రాయాలు, వివిధ అంచనాలు, సర్టిఫికేషన్ వ్యవస్థలు, దీని నిర్వహణకు బలమైన వ్యవస్థ లేకపోవడంతో వీటి మధ్య సమన్వయం కొరవడింది. గతంలో వీటన్నింటినీ సమన్వయ పరిచేందుకు కొంత ప్రయత్నం జరిగింది. 2008లో ప్రధాన మంత్రి నైపుణ్యాభివృద్ధి జాతీయ మండలి, జాతీయ నైపుణ్యాభివృద్ధి సమన్వయ మండలి కోసం ప్రయత్నం జరిగింది. వివిధ సంస్థల కింద పనిచేస్తున్న వివిధ విభాగాల్లో నిర్వహణపై సరైన దృష్టి పెట్టకపోవటం వల్ల ఈ సంస్థలన్నీ నిష్ఫలంగా మిగిలాయి.

కానీ, ఎమ్ ఎస్ డి ఇ తక్కువ సమయంలోనే చాలా మార్పు తీసుకువచ్చింది. కేవలం ఆర్నెల్లలో నైపుణ్య శిక్షణ, ఆంట్రప్రనర్ షిప్ లతో సంబంధమున్న కీలకమైన సంస్థలన్నింటినీ ఒక మంత్రిత్వ శాఖ కిందకు తీసుకొచ్చింది. ఎనిమిది నెలల్లోనే నైపుణ్యాభివృద్ధి, ఆంట్రప్రనర్ షిప్ కోసం ఓ జాతీయ విధానాన్ని రూపొందించింది. దీని ద్వారా నైపుణ్య శిక్షణ ప్రయత్నాలను అంచనా వేయటం, సమన్వయ పరిచేందుకు తొలి జాతీయ నైపుణ్యాభివృద్ధి మిషన్‌కు రూపకల్పన జరిగింది. ఈ విధాన పరమైన నిర్ణయాలను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015 జూలై 15న ప్రారంభించారు.

నైపుణ్య కార్యక్రమాలను ఒకచోట కలపడం, సమన్వయం చేయడం, అమలు చేయడం, పర్యవేక్షించడం ఈ మిషన్‌ ఉద్దేశాలు. ఇందులోని మూడంచెల విధానం (విధాన నిర్ణయాలకు పాలక మండలి, సమన్వయం కోసం సారథ్య సంఘం, అమలుకు మిషన్ డైరెక్టరేట్) ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కీలక భాగస్వాములను ఒకే గొడుకు కిందకు తీసుకురావడం దీని పని. ఈ మిషన్ పాలక మండలికి ప్రధాన మంత్రి నేతృత్వం వహిస్తారు. ఈ మండలే ‘నైపుణ్య భారత్’కు మార్గదర్శనం చేస్తుంది.
భారత వృత్తిసంబంధిత శిక్షణ వ్యవస్థలో మార్పు తీసుకురావటమే నైపుణ్య భారత్ పని. గతేడాది కాలంలో 1.04 కోట్ల మంది ఈ మిషన్ కింద సుశిక్షితులయ్యారు. గతంలో సేకరించిన వివరాలతో పోలిస్తే ఇది 36.8 శాతం అదనం. ప్రస్తుతం 60 శాతం శిక్షణ నేరుగా ఎంఎస్‌డీఈ కింద జరుగుతుండగా.. 40 శాతం వివిధ మంత్రిత్వ శాఖల ద్వారా జరుగుతోంది. ఎంఎస్‌డీఈ ప్రధాన కార్యక్రమం ప్రధాన మంత్రి కౌశల్ వికాస్ యోజన (పి ఎమ్ కె వి వై)ను ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2015, జూలై 15న ప్రారంభించారు. దీని ద్వారా 20 లక్షల మంది సుశిక్షితులయ్యారు. ఇందులో 40 శాతం మంది మహిళలున్నారు. వారంతా వారికి నచ్చిన అంశాలలో శిక్షణ పొందారు.

వేగం, కొలమానం, ప్రమాణం, నిర్వహణ.. ఈ నాలుగు ఎన్‌ ఎస్‌ డి ఎమ్ కున్న నాలుగు మూల సిద్ధాంతాలు. తొలి పాలక మండలి సమావేశాన్ని ఈ మూల సిద్ధాంతాలలో ఒక్కొక్క సిద్ధాంతంపైనా ప్రత్యేక సమీక్ష జరపడానికి ఉద్దేశించారు. ఉన్నత ప్రమాణాలను నిలబెడుతూనే, నైపుణ్యాల మెరుగుదల శిక్షణ ప్రయత్నాలకు జోరును అందించడానికి స్పష్టమైన అజెండా మీద చర్చ జరగాలని జ్ఞ‌ప్తి చేయ‌డ‌మైంది.