Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్రాంతీయ అనుసంధాన ప‌థ‌కంలో భాగంగా శిమ్ లా- ఢిల్లీ సెక్ట‌ర్ లో ఉడాన్ ఫ్లైట్‌ కు ప‌చ్చ జెండాను చూపిన అనంతరం ప్ర‌ధాన మంత్రి ఆంగ్ల ప్ర‌సంగం పాఠం

ప్రాంతీయ అనుసంధాన ప‌థ‌కంలో భాగంగా శిమ్ లా- ఢిల్లీ సెక్ట‌ర్ లో ఉడాన్ ఫ్లైట్‌ కు ప‌చ్చ జెండాను చూపిన అనంతరం ప్ర‌ధాన మంత్రి ఆంగ్ల ప్ర‌సంగం పాఠం

ప్రాంతీయ అనుసంధాన ప‌థ‌కంలో భాగంగా శిమ్ లా- ఢిల్లీ సెక్ట‌ర్ లో ఉడాన్ ఫ్లైట్‌ కు ప‌చ్చ జెండాను చూపిన అనంతరం ప్ర‌ధాన మంత్రి ఆంగ్ల ప్ర‌సంగం పాఠం

ప్రాంతీయ అనుసంధాన ప‌థ‌కంలో భాగంగా శిమ్ లా- ఢిల్లీ సెక్ట‌ర్ లో ఉడాన్ ఫ్లైట్‌ కు ప‌చ్చ జెండాను చూపిన అనంతరం ప్ర‌ధాన మంత్రి ఆంగ్ల ప్ర‌సంగం పాఠం


ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా, భార‌త‌దేశం లోని మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్రజల జీవ‌నంలో ఏదైనా సాధించాల‌నే ధైర్యం, కొత్త సంకల్పాలు, సరికొత్త స్వ‌ప్నాలు, నూత‌న భావనలు వ్య‌క్తం అవుతున్నాయి. ఈ వ‌ర్గానికి- ప్ర‌త్యేకించి అధిక న‌ష్ట భ‌యాన్ని స్వీక‌రించే సామ‌ర్ధ్యాన్ని కలిగివున్నటువంటి యువ‌త‌రానికి గాని, లేదా ఒక‌టో త‌రానికి గాని అవకాశం లభించిందంటే- దేశాన్ని అభివృద్ధి ప‌రంగా కొత్త శిఖ‌రాల‌కు చేర్చగలుగుతుంది.

ఈ యువ‌తీయువకులు అవ‌కాశాన్ని చేజిక్కించుకొన్నారా అంటే వారు దేశాల భ‌విష్య‌త్తునే మార్చ‌ివేయగ‌లరు. విమాన‌యాన రంగంలో భార‌త‌దేశానికి అత్యంత గొప్ప అవ‌కాశం ఉందని యావ‌త్ ప్ర‌పంచం న‌మ్ముతోంది. విమానంలో ప్ర‌యాణించ‌డమనేది కేవ‌లం రాజులు మ‌రియు సంప‌న్న వ‌ర్గాల వారి కోస‌మే అనే ఆలోచ‌న చాలా పాత కాలపు ఆలోచన. నిజానికి, ఏర్ లైన్స్ కు ఉప‌యోగించిన అధికార చిహ్నం కూడా ఒక రాజుదే. అట‌ల్ బిహారీ వాజ్ పేయి గారి పాల‌న‌లో విమాన‌యాన మంత్రిత్వ శాఖ బాధ్యుడిగా రాజీవ్ ప్ర‌తాప్ రూఢీ గారు వ్య‌వ‌హ‌రించారు. ఆ కాలంలో నేను పార్టీ వ్య‌వ‌హారాల‌లో నిమ‌గ్న‌మై ఉన్నాను. అప్ప‌ట్లో హిమాచ‌ల్ లో నా మ‌కాం. ఒక రోజు నేను ఆయ‌న‌ను ఈ అధికార చిహ్నాన్ని మార్చ‌లేమా అని అడిగాను. దానికి ఆయ‌న అలా ఎందుకు చేయాలి ? అంటూ ఎదురుప్ర‌శ్న వేశారు. విమాన సంస్థ మ‌రియు విమాన ప్ర‌యాణం ప్ర‌జ‌ల‌లో ఒక ఫ‌లానా వ‌ర్గం యొక్క ప్ర‌త్యేక అధికారం అనేట‌టువంటి అభిప్రాయం ఈ అధికార చిహ్నం వ‌ల్ల ఏర్పడుతోంద‌ని నేనన్నాను. వ్యంగ్య చిత్రకారుడు ఆర్‌.కె. ల‌క్ష్మ‌ణ్ గీసిన సామాన్య మాన‌వుడి బొమ్మ‌ను అధికార చిహ్నంలో మీరు వాడుకోవ‌చ్చు క‌దా అని నేను శ్రీ రూడీతో అన్నాను. అందుకోసం మీరు అనుమ‌తిని తీసుకోవ‌చ్చ‌ని కూడా చెప్పాను. అట‌ల్ గారి ప్ర‌భుత్వం సామాన్య మాన‌వుడిని అధికార చిహ్నంలో ఉప‌యోగించడం నాకు సంతోషాన్ని క‌లిగించింది.

ఆ కాలంలో నేను ఏ రాజ‌కీయ ప‌ద‌విని నిర్వ‌హించ‌క‌పోయినప్పటికీ ఒక సంస్థ‌లో ప‌నిచేస్తూ ఉన్నాను. విమాన ప్ర‌యాణాన్ని మ‌హారాజులతో ముడిపెట్టి చూసినటువంటి ఆలోచ‌నా స‌ర‌ళి మారాల్సివుందని నేను గ్ర‌హించాను. మ‌న దేశంలో ఎటువంటి విమాన‌యాన విధానం లేక‌పోవ‌డంతో నేను నా విభాగాన్ని ఈ విష‌య‌మై అభ్య‌ర్థించాను. అనేక అవ‌కాశాలు ఉన్న‌టువంటి ఒక పెద్ద దేశ‌ం ఈ దేశం. మ‌రి ప్ర‌పంచ దృష్టి అంతా కూడా మ‌న‌ మీద కేంద్రీకృత‌మై ఉంది. సంబంధిత వ‌ర్గాలన్నింటి ఆలోచ‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌ లోకి తీసుకొని ఒక విమానయాన విధానాన్ని రూపొందించ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండింది. ఆ విధానం ఆధారంగా విమాన‌యాన రంగం విస్త‌ర‌ణ‌కు ఒక ఆకృతిని కూడా ఖాయం చేయ‌వ‌ల‌సిన అవ‌స‌రం ఉండింది. స్వాతంత్య్రం వ‌చ్చిన త‌రువాత విమాన‌యాన విధానాన్ని రూపొందించే అవ‌కాశం మా ప్ర‌భుత్వానికి ద‌క్కినందుకు నేను సంతోషించాను. ఒక స‌మావేశంలో నేను విమాన‌యానం తాలూకు నా విజ‌న్‌ను వెల్ల‌డించాను. మ‌న దేశంలో ఒక పేద‌వాడిని- సాధార‌ణంగా హ‌వాయీ చెప్పులు ధ‌రించే వ్య‌క్తి గా- గుర్తిస్తారు. హ‌వాయీ చెప్పులు ధ‌రించే వ్య‌క్తుల‌ను విమానంలో చూడాలన్నది నా కోరిక అని ఆ స‌మావేశంలో నేనన్నాను. ఈ రోజున ఇది వాస్త‌వ రూపం దాల్చింది. ఇవాళ శిమ్ లా మ‌రియు ఢిల్లీ తో పాటు, నాందేడ్, ఇంకా హైద‌రాబాద్ లు ఏర్ లైన్స్‌తో సంధానం కాబోతున్నాయి. ఇక్క‌డకు వచ్చిన న‌డ్డా గారు హిమాచ‌ల్ కు చెందిన‌ వారు. ఢిల్లీ తో శిమ్ లా ముడిపడినందుకు ఆయ‌న ఎంతో సంతోషిస్తారు. నేను కూడా ఢిల్లీ నుండి వ‌చ్చాను కాబ‌ట్టి, నాకూ అమితమైన ఆనందాన్ని క‌లిగించే విష‌య‌మే ఇది.

ఇవాళ మ‌నం ర‌హ‌దారి మార్గం గుండా వెళితే టాక్సీ చార్జి ఒక కిలో మీట‌రుకు ర‌మార‌మి 8 నుండి 10 రూపాయ‌లు అవుతుంది. ఢిల్లీ నుండి శిమ్ లా కు విమానంలో ప్ర‌యాణిస్తే, ఆ ప్ర‌యాణాన్ని మహా అంటే ఒక గంట‌లో పూర్తి చేయ‌వ‌చ్చు. అదే నేను రోడ్డు మార్గం ద్వారా ప్ర‌యాణించవలసి వస్తే, తక్కువలో తక్కువగా 9 గంట‌లైనా ప‌డుతుంది. రోడ్డు మార్గం గుండా వెళ్ళేందుకు అయ్యే చార్జిని నేను అంచ‌నా క‌డితే, అది ప‌ర్వ‌త‌మ‌య ప్రాంతాల‌లో 10 రూపాయ‌ల క‌న్నా ఎక్కువే ఉంటుంది. కాబ‌ట్టి ఈ ప్ర‌యాణం స‌మ‌యాన్ని ఆదా చేయ‌డ‌మే కాకుండా, డ‌బ్బును కూడా ఆదా చేస్తుంది. కొత్త విమాన‌యాన ప‌థ‌కంలో భాగంగా- ప్ర‌తి కిలో మీటరుకు సుమారు 6 లేదా 7 రూపాయ‌లు చొప్పున- అవుతుంది. నాందేడ్- హైద‌రాబాద్ ల మ‌ధ్య మార్గం ఈ రోజు తెరుచుకోనుంది. త‌దుప‌రి మార్గం నాందేడ్ – ముంబ‌యి ల మ‌ధ్య ఉంటుంది. నేను విమాన‌యాన కంపెనీల‌కు ఒక స‌ల‌హాను ఇవ్వ‌ద‌లిచాను. ఈ స‌ల‌హా కోసం నేను ఎటువంటి యాజ‌మాన్య హ‌క్కును కోర‌బోను. నేను ఈ స‌ల‌హాను ఉచితంగానే ఇస్తున్నాను. వ్యాపారం దృష్టి కోణంలో నుండి చూస్తే, విమాన‌యాన కంపెనీలు నాందేడ్ సాహిబ్, అమృత్‌స‌ర్ సాహిబ్ మ‌రియు పాట్నా సాహిబ్ ల‌తో కూడిన ఒక వ‌ల‌యాకార మార్గాన్ని రూపొందించ‌డాన్ని గురించి ఆలోచించిన‌ట్ల‌యితే గనక, అలాంట‌ప్పుడు సిక్కు ప్ర‌యాణికులు ఈ వ‌ల‌యాకార మార్గం నుండి ఎక్కువ ప్ర‌యోజ‌నాన్ని పొంద‌గ‌లుగుతారు.

రెండో ప్ర‌పంచ యుద్ధ కాలంలో తూర్పు ప్రాంతంలోనూ మ‌రియు స‌రిహ‌ద్దు ప్రాంతాల‌లోనూ అనేక ఏర్ స్ట్రిప్ ల‌ను నిర్మించ‌డం జ‌రిగింద‌న్న విషయం చాలా కొద్ది మందికే తెలుసును. వాటిని ఇప్పుడు ఉప‌యోగించ‌డం లేదు. కొన్ని ఏర్ స్ట్రిప్ లు ధ్వంసమై ఉండ‌వ‌చ్చు. ఈ రోజు మ‌నం స్వాతంత్య్రం అనంత‌రం 70వ సంవ‌త్స‌రంలో ఉన్నాం. అయితే, ఇవాళ 70 లేదా 75 విమానాశ్ర‌యాలు వాణిజ్య స‌ర‌ళిలో ఉప‌యోగంలో ఉన్నాయి. కేవ‌లం 70 లేదా 75, అంతే! అయితే కొత్త విధానంలో భాగంగా ఒక సంవ‌త్స‌ర కాలం లోప‌ల 75 కు పైగా విమానాశ్ర‌యాల‌ను వాణిజ్య కార్య‌క‌లాపాల కోసం జ‌త‌ప‌ర‌చ‌డం జ‌రుగుతుంది. భార‌త‌దేశంలోని 2వ అంచె న‌గ‌రాలు ప్ర‌స్తుతం వృద్ధికి చోద‌క శ‌క్తులుగా త‌యార‌వుతున్నాయి. 2వ అంచె నగరాలు మ‌రియు 3వ అంచె న‌గ‌రాలు దేశాభివృద్ధికి జోరును సంత‌రించే సామ‌ర్ధ్యాన్ని క‌లిగివున్నాయి. ఈ న‌గ‌రాల‌కు గ‌గ‌నత‌ల అనుసంధానాన్ని జోడించిన‌ప్పుడు మూల‌ధ‌న పెట్టుబ‌డి దేశంలోకి ప్రవహించడం, మేనేజ్ మెంట్ రంగ నిపుణుల రాక, మరియు నాణ్య‌మైన విద్య‌ను అందించేందుకు మాన‌వ వ‌న‌రులు అధికంగా సమకూరి అభివృద్ధికి అవ‌కాశాలు పెరుగుతాయి. ప్ర‌పంచంలో ప‌ర్యాట‌క రంగం అమిత వేగంగా విస్త‌రిస్తోంది. యాత్రా స్థ‌లాల‌కు చేరుకోవ‌డానికి ప‌ర్యాట‌కులు శ్ర‌మ‌ తీసుకోవడానికి వెనుకాడడం లేదు. వారు ఈ సాహ‌సానికి పూనుకోవ‌డ‌మంటే మ‌క్కువను క‌న‌బ‌రుస్తున్నారు. అయితే, వారి ప్ర‌యాణంలో గ‌గ‌న‌త‌ల అనుసంధానం, ఇంట‌ర్ నెట్ స‌దుపాయం, వైఫై సౌక‌ర్యాల వంటి ఉత్త‌మమైన హంగుల‌ను స‌మ‌కూర్చిన‌ప్పుడు వారు తాము చేరుకోవ‌ల‌సిన గ‌మ్య‌స్థానాన్ని మ‌రింత‌గా ఆద‌రించ‌డం వైపు మొగ్గు చూపుతారు.

యాత్రికుల‌కు శ్ర‌మ తీసుకోవ‌డం, న‌ష్ట భ‌యాన్ని భ‌రించ‌డం అంటే ఇష్ట‌మే. కానీ, వారు హాయి అయిన ప్ర‌యాణాన్ని ఎంచుకొంటారు. చిర‌కాలంగా రూపుదాల్చ‌కుండా ఉన్న‌టువంటి ఈ ఏర్పాటు ఇప్పుడు శిమ్ లా లో ఒన‌గూరింది. దీని నుండి హిమాచ‌ల్ ప‌ర్యాట‌క శాఖ ఉత్తేజం పొందగలదన్న న‌మ్మ‌కం నాకు ఉంది. 2,500 రూపాయల గరిష్ఠ ప‌రిమితిని విధించ‌డ‌మైంది. దీనిని ఇంకా త‌గ్గించాలి.

ఈశాన్య ప్రాంత రాష్ట్రాలు భార‌త‌దేశంలో త‌ప్ప‌క ద‌ర్శించ‌వ‌ల‌సిన ప్రాంతాలు. ఒక‌సారి సంద‌ర్శిస్తే మ‌ళ్ళీ మ‌ళ్ళీ చూడాల‌ని ఎవ‌రికైనా అనిపిస్తుంది. అక్క‌డ నెల‌కొన్న ప్రాకృతిక శోభ‌ను మ‌రెక్క‌డా చూడ‌లేరు. అయితే, దుర‌దృష్టవ‌శాత్తూ త‌గిన ర‌వాణా సౌక‌ర్యాలు మ‌రియు అనుసంధానం లోపించిన కార‌ణంగా సామాన్య మాన‌వుడు ఈ ప్రాంతానికి దూరంగానే ఉండిపోతున్నాడు. మ‌రి ఈ కార్య‌క్ర‌మం దేశ స‌మైక్య‌త‌లో ఒక గొప్ప మాధ్య‌మంగా మార‌నుంది. ఇది రాక‌పోక‌ల‌కు మార్గాన్ని సుగ‌మం చేయ‌డంతో పాటు, రెండు భూభాగాల‌ను, రెండు విభిన్న సంస్కృతి సంప్ర‌దాయాల‌ను జ‌త ప‌ర‌చ‌డంలో కూడా తోడ్ప‌డ‌గ‌ల‌దు. ఇది సామాన్య మానవుడికి మేలు చేస్తుంద‌ని నేను దీని ప‌ట్ల హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నాను. ఉడాన్ (UDAN)కు పూర్తి పేరు ‘ఉడే దేశ్ కా ఆమ్ నాగ‌రిక్‌’ లేదా సామాన్యుడు రెక్క‌లు తొడుక్కొని ఎగ‌ర‌డం. నేను ఇదివ‌ర‌కు చెప్పినట్టు- చెప్పులు తొడుక్కొన్న ప్రజలు విమానాల‌లో కూర్చోవాల‌ని- కోరుకొంటున్నాను. అంద‌రూ విమానాల‌లో తిర‌గాలి; అన్ని ప్ర‌దేశాల‌కూ చేరుకోవాలి.

ఇది దేశంలోని ఒక ప్రాంతాన్ని మ‌రొక ప్రాంతంతో జోడించేందుకు త‌ల‌పెట్టిన ఒక ఘ‌న‌మైన కార్య‌క్ర‌మం. ఇక్క‌డ మ‌రొక కార్య‌క్ర‌మాన్ని కూడా ప్రారంభిస్తున్నామ‌ని ప్ర‌క‌టించ‌డం నాకు ఆనందాన్నిస్తోంది. ఆ కార్య‌క్ర‌మానికి పునాదిని వేయ‌డం జ‌రుగుతోంది. మాన‌వ వ‌న‌రుల అభివృద్ధి ఇప్ప‌టిక‌న్నా ఎక్కువ‌గా ఫ‌లానా ప్రాంతానికి సంబంధించిన‌దీ మ‌రియు శ్ర‌ద్ధ చూపేదీ అయిన‌ప్పుడు దేశం యొక్క సామ‌ర్ధ్యం పెరుగుతుంది. భార‌త‌దేశం జ‌ల విద్యుత్తు రంగంలో గొప్ప సామ‌ర్ధ్యం క‌లిగిన దేశం. జ‌ల విద్యుత్ శ‌క్తిని ఉప‌యోగించుకొని 1.5 ల‌క్షల మెగావాట్ల‌కు పైగా విద్యుత్ శ‌క్తిని ఉత్ప‌త్తి చేయ‌వ‌చ్చ‌న్న అంచ‌నా ఉంది. అయితే, అందుకు త‌గిన మాన‌వ వ‌న‌రులు, ఇంకా అంకిత భావంతో ప‌ని చేసే సంస్థ‌లు అవ‌స‌రం.

హిమాచ‌ల్ ప్ర‌దేశ్ కు మ‌రియు యావ‌త్ హిమాల‌య ప్రాంతానికి జ‌ల విద్యుత్ ను ఉత్ప‌త్తి చేసే ఒక గొప్ప శ‌క్తి ఉంది. ఈ ప్రాంతం యువ‌త‌కు మెకానిక‌ల్ ఇంజీనియరింగ్ విద్యతో సహా ఇంజీనియరింగ్ ను నేర్పించిన‌ట్ల‌యితే అది ఒక గొప్ప సేవ కాగ‌ల‌ద‌ని నేను భావిస్తున్నాను. అయితే జ‌ల విద్యుత్తు కు సంబంధించిన విద్య మీద ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకోవాలి. ఈ త‌ర‌హా విద్యా సంస్థ మీద ఒక ప్ర‌త్యేక శ్ర‌ద్ధ‌ను చూపించాలి. ఇటువంటి విద్యా సంస్థ‌కు బిలాస్ పుర్ లో శంకు స్థాప‌న చేయ‌నున్నాం. దీనిని హిమాచ‌ల్ ప్ర‌దేశ్ ప్ర‌జ‌ల‌కు మ‌రియు దేశ యువ‌త‌కు కానుకగా ఇస్తున్నందుకు నేను గ‌ర్వ‌ప‌డుతున్నాను. ఒక ర‌కంగా చూస్తే హిమాచ‌ల్ ప్ర‌దేశ్ గ‌డ్డ మీద వాయు శ‌క్తితో పాటు జ‌ల శ‌క్తి సామ‌ర్ధ్యాలు ఈ దేశానికి ల‌భిస్తున్నాయ‌ని చెప్పుకోవ‌చ్చు.

వాయు శ‌క్తి మ‌రియు జ‌ల శ‌క్తి ఈ రోజున అభివృద్ధికి అమిత శ‌క్తివంత‌మైన సాధ‌నాలుగా నిరూపితం కావ‌చ్చు. ‘‘న్యూ ఇండియా’’ ను ఆవిష్క‌రించాల‌న్న మ‌న స్వ‌ప్నంలో జ‌న సంప‌ద మ‌రియు వ‌న సంప‌ద‌ల మాదిరిగానే జ‌ల సంప‌ద‌కు కూడా ఎంతో ప్రాధాన్యం ఉంది. మ‌రొక్కమారు నేను విమాన‌యాన విభాగానికి, ఈ విభాగం అధికారులకు, అంద‌రు మంత్రులకు మ‌రియు వారి నాయ‌క‌త్వానికి నా గుండె లోతులలో నుండి అభినంద‌న‌లు తెలియ‌జేసుకొంటున్నాను. ఈ ప్ర‌తిష్టాత్మ‌క ప‌థ‌కాన్ని వీలైనంత త‌క్కువ వ్య‌వ‌ధిలో మ‌నం ప్రారంభించాల్సివుంది. భార‌త‌దేశంలోని నూత‌న వృద్ధి కేంద్రం త‌న శ‌క్తిని విమాన‌యానం నుండి పొంద‌బోతోంది. మ‌రొక్క‌సారి నా వైపు నుండి శుభాకాంక్ష‌లు.

మీకు ధ‌న్య‌వాదాలు.

 

***