Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌గ‌తి కార్య‌క్ర‌మం ద్వారా ప్ర‌ధాన‌ మంత్రి స‌మీక్ష‌

ప్ర‌గ‌తి  కార్య‌క్ర‌మం ద్వారా  ప్ర‌ధాన‌ మంత్రి స‌మీక్ష‌


ప్ర‌ధాన‌ మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ ఐసిటి ఆధారిత మ‌ల్టి- మోడ‌ల్ ప్లాట్ ఫామ్ ఫ‌ర్ ప్రొ- యాక్టివ్ గ‌వ‌ర్నెన్స్ అండ్ టైమ్‌లీ ఇంప్లిమెంటేష‌న్‌- పిఆర్ఎజిఎటిఐ (ప్ర‌గ‌తి) ద్వారా ఈరోజు జరిగిన14 వ స‌మీక్ష స‌మావేశానికి అధ్య‌క్ష‌త వ‌హించారు. సామాన్యుల నుండి వ‌చ్చే ఫిర్యాదుల‌ ప‌రిష్కారంతో పాటు ముఖ్య‌మైన ప్ర‌భుత్వ ప‌థ‌కాల, కార్యక్ర‌మాల అమ‌లును స‌మీక్షించడమన్నది ప్రగతి మాధ్యమం ద్వారా జరిపే పరస్పర సంభాషణల కార్యక్రమ ధ్యేయంగా ఉంది.

పాఠ‌శాల విద్య‌కు, అక్ష‌రాస్య‌త‌ పురోగ‌తికి సంబంధించిన స‌మ‌స్య‌ల ప‌రిష్కారంపై ప్ర‌ధాన‌ మంత్రి స‌మీక్షను నిర్వ‌హించారు. త‌మ ఫిర్యాదులను ప‌రిష్క‌రించే స్థితిలో ప్రభుత్వం ఉంద‌న్న అంచనా ఇప్పుడు ప్ర‌జ‌ల‌లో నెలకొంద‌ని ఆయ‌న అన్నారు. విద్యార్థుల స‌మ‌స్య‌ల ప‌రిష్కారానికి సంబంధిత అధికారులు వారు తీసుకుంటున్న చ‌ర్య‌లకు త‌గిన ప‌ద్ధ‌తులను రూపొందించుకోవాలని ప్ర‌ధాన మంత్రి ఆ అధికారులకు ప్ర‌త్యేకంగా సూచించారు. పాఠ‌శాల విద్యార్థులు ఎటువంటి స‌మ‌స్య‌లను ఎదుర్కోకుండా ఉండటానికి అందుబాటులో ఉన్న అన్ని సాంకేతిక ఉప‌క‌ర‌ణాల‌ను వాడుకోవ‌ల‌సిందని అధికారులను ఆయ‌న ఆదేశించారు. అంత‌రిక్ష సాంకేతిక ప‌రిజ్ఞ‌ానాన్ని విస్తృతంగా వాడుకోవాలంటూ గ‌తంలో తాను అన్ని మంత్రిత్వ శాఖలకు ఇచ్చిన ఆదేశాలను ప్ర‌ధాన మంత్రి ఈ సంద‌ర్భంగా ఒక ఉదాహరణగా గుర్తు చేశారు. ఇది ప‌రీక్షా కేంద్రాల‌ సరైన స్థానాన్ని స‌క్రమంగా గుర్తించ‌డంలో, విద్యార్థుల ఇబ్బందుల‌ను క‌నీస స్థాయికి త‌గ్గించడంలో ఇది ఉపయోగపడుతుందని ఆయ‌న చెప్పారు.

సమావేశంలో సుగ‌మ్య‌ భార‌త్ అభియాన్ పురోగతిపై స‌మీక్షను చేపట్టిన సంద‌ర్భంలో, పాఠ‌శాల‌లు, ప్ర‌భుత్వ భ‌వ‌నాలు, రైల్వే స్టేష‌న్ లు మున్నగువాటిలో వ‌స‌తులను మెరుగుప‌ర‌చ‌డంలో చోటుచేసుకొన్న పురోగతిని ప్రధాన మంత్రి దృష్టికి అధికారులు తీసుకువ‌చ్చారు. ఈ విష‌యంలో కేంద్ర , రాష్ట్ర‌ ప్ర‌భుత్వాలకు చెందిన వివిధ విభాగాలు తీసుకున్న చొర‌వ‌ను ప్ర‌ధాన మంత్రి అభినందించారు.

ఆధార్ న‌మోదు ప్ర‌గ‌తిని వివరించిన సందర్భంలో, ఆధార్ న‌మోదులు ప్ర‌స్తుతం సుమారు 105 కోట్ల‌కు చేరువ అయినట్లు , ఈ అంశంలో కాస్త వెనుక‌పట్టు పట్టిన ఈశాన్య రాష్ట్రాల‌ పైన ప్ర‌త్యేకంగా శ్రద్ధను తీసుకొంటున్నట్లు గమనించారు. 5-18 ఏళ్ల వ‌య‌సు లోప‌ల ఉన్న‌ వారి ఆధార్ న‌మోదులను వేగ‌వంతం చేయవలసిందిగా ప్ర‌ధాన‌ మంత్రి రాష్ట్రాల‌ను కోరారు. దీనివ‌ల్ల వారికి ఉప‌కార వేత‌నాలు, విద్యాసంబంధ ప్ర‌యోజ‌నాలు మ‌రింత అందుబాటులోకి వ‌స్తాయ‌న్నారు.

ప్ర‌ధాన‌ మంత్రి మ‌హారాష్ట్ర‌, సిక్కిమ్, ఆంధ్ర‌ ప్ర‌దేశ్‌, ఉత్త‌ర‌ ప్ర‌దేశ్‌, జ‌మ్ము- క‌శ్మీర్‌, ప‌శ్చిమ‌ బెంగాల్‌, క‌ర్ణాట‌క‌, హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ సహా పలు రాష్ట్రాల‌లో రహదారి, రైల్వే, విద్యుత్ రంగాల‌కు సంబంధించిన వివిధ కీల‌క మౌలిక స‌దుపాయాల ప్రాజెక్టుల పురోగ‌తిపై కూడా స‌మీక్షను నిర్వ‌హించారు. స‌మీక్షించిన ప్రాజెక్టుల‌లో నంగ‌ల్ డామ్- త‌ల్వారా రైల్వే లైన్ కూడా ఉంది. దీనిని తొలుత 1981-82 లో మంజూరు చేశారు. అయితే అప్ప‌టి నుండి అది పెండింగ్‌లో ఉంది. ఈ ప్రాజెక్టు అమ‌లులో మరెంతమాత్రం జాప్యం జరగకుండా చూసేందుకు క్షేత్ర‌ స్థాయిలో త‌గిన చ‌ర్య‌లను తీసుకోవాలని ప్ర‌ధాన‌ మంత్రి హిమాచ‌ల్ ప్ర‌దేశ్‌, పంజాబ్ రాష్ట్రాల ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శుల‌ను కోరారు.