పిఎంఇండియా
కర్ణాటక ముఖ్యమంత్రి శ్రీ సిద్ధరామయ్య నేతృత్వంలో అఖిలపక్షం నేతలు సోమవారం ఢిల్లీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీని కలిశారు. కర్ణాటక, గోవా, మహారాష్ట్ర మధ్య నెలకొన్న మహాదయి నదీ జలాల విషయంలో ట్రిబ్యునల్ ప్రమేయం లేకుండా పరిష్కరించుకునే విషయంలో జోక్యం చేసుకోవాలని వారు ప్రధాన మంత్రిని కోరారు. ప్రస్తుతం ఈ అంశం ట్రిబ్యునల్ పరిధిలో ఉందని ప్రధానికి తెలిపారు. తొలుత మూడు రాష్ట్రాల్లోని వివిధ రాజకీయ పక్షాల మధ్య ఏకాభిప్రాయం రావాల్సిన అవసరం ఉందని ప్రధాని సూచించారు. అప్పుడు మాత్రమేట్రిబ్యునల్ ప్రమేయం లేకుండా పరస్పర సంప్రదింపులతో ఈ సమస్యను పరిష్కరించుకునే అవకాశం ఉంటుందన్నారు.
కర్ణాటకలోని ఉత్తర ప్రాంతంలో తీవ్ర మైన కరవు పరిస్థితులు నెలకొన్నాయని అఖిలపక్షం నేతలు ప్రధాని దృష్టికి తీసుకెళ్లారు. వీలైనంత త్వరగా కేంద్ర బృందాన్ని రాష్ట్రానికి పంపించి పరిస్థితిని అంచనా వేస్తామని ప్రధాని హామీ ఇచ్చారు.
చక్కెర ధరలు పడిపోవడంతో చెరకు రైతుల పరిస్థితి దయనీయంగా మారిందని అఖిలపక్షం నేతలు ప్రధానితో అన్నారు. దేశంలోని అందరు చెరకు రైతులదీ ఇదే పరిస్థితి ఉందని, వారి సమస్యలను పరిష్కరించేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోందని ప్రధాని వివరించారు.
మల్బరీ రైతుల ప్రయోజనాలను కాపాడేందుకు సిల్క్ పై ఎగుమతి సుంకాన్ని 30 శాతం పెంచాలని అఖిలపక్షం నేతలు విజ్ఞప్తి చేశారు. ఈ విజ్ఞప్తిని పరిశీలిస్తామని ప్రధాని హామీ ఇచ్చారు. కేంద్ర మంత్రుల శ్రీ వెంకయ్యనాయుడు, శ్రీ అనంత కుమార్, శ్రీ సదానంద గౌడ, లోక్ సభలో విపక్ష నేత శ్రీ మల్లికార్జున ఖర్గే ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Met an All Party Delegation from Karnataka. http://t.co/V68b265Y7E pic.twitter.com/Y7bQ20AQIc
— Narendra Modi (@narendramodi) August 24, 2015