Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

ప్ర‌పంచ పారిశ్రామిక‌వేత్త‌ల శిఖ‌రాగ్ర స‌ద‌స్సు, 2017 లో ప్ర‌ధాన మంత్రి ఉప‌న్యాసం


యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్ర‌భుత్వం భాగ‌స్వామ్యంతో 2017 ప్ర‌పంచ పారిశ్రామిక‌వేత్త‌ల శిఖ‌రాగ్ర స‌ద‌స్సు కు ఆతిథ్యమిస్తున్నందుకు మేం సంతోషిస్తున్నాం.

ఈ శిఖ‌రాగ్ర స‌ద‌స్సు ను మొట్ట‌మొద‌టి సారిగా ద‌క్షిణ ఆసియాలో నిర్వ‌హించ‌డం జ‌రుగుతోంది. ఈ స‌ద‌స్సు ప్ర‌పంచ పారిశ్రామిక వేత్త‌ల‌కు అనుకూల‌మైన వాతావ‌ర‌ణాన్ని క‌ల్పించ‌డం కోసం ప్ర‌ముఖ ఇన్వెస్ట‌ర్ల‌ను, ఆంట్ర‌ప్ర‌న్యోర్ ల‌ను, విద్యావేత్తల‌ను, ఆలోచ‌నాప‌రుల‌ను మ‌రియు ఇత‌ర సంబంధిత వ‌ర్గాల వారిని ఒక‌ చోటుకు తీసుకువ‌చ్చింది.

ఈ కార్య‌క్ర‌మం సిలికాన్ వేలి ని హైద‌రాబాద్ తో అనుసంధానించ‌డ‌ంతో పాటు భార‌త‌దేశానికి మ‌రియు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా కు మ‌ధ్య నెల‌కొన్న స‌న్నిహిత సంబంధాల‌ను కూడా కళ్లకు కడుతోంది. యువ పారిశ్రామిక‌వేత్త‌లను మ‌రియు నూత‌న ఆవిష్క‌ర‌ణ‌లను ప్రోత్స‌హించ‌డంలో మ‌న ఉమ్మ‌డి నిబ‌ద్ధ‌త‌ను ఈ స‌ద‌స్సు చాటిచెబుతోంది.

ఈ సంవ‌త్స‌ర‌పు శిఖ‌రాగ్ర స‌మావేశాలకు ఎంపిక చేసిన అంశాల‌లో ఆరోగ్య సంర‌క్ష‌ణ- లైఫ్ సైన్సెస్‌; డిజిట‌ల్ ఇకాన‌మీ- ఫైనాన్షియ‌ల్ టెక్నాల‌జీ; శ‌క్తి మ‌రియు మౌలిక స‌దుపాయాలతో పాటు, ప్ర‌సార మాధ్య‌మాలు మ‌రియు వినోద రంగం వంటివి భాగంగా ఉన్నాయి. ఇవి అన్నీ కూడా ముఖ్య‌మైన , మాన‌వాళి శ్రేయ‌స్సుతో మ‌రియు అభ్యుద‌యంతో ముడిప‌డి ఉన్న‌ విషయాలు.

‘‘విమెన్ ఫ‌స్ట్‌, ప్రాస్‌ పెరిటీ ఫ‌ర్ ఆల్‌’’ (మ‌హిళ‌ల‌కు అగ్ర తాంబూలం, అందరికీ అభ్యుద‌యం) అనే ఇతివృత్తం జిఇఎస్ తాజా సంచిక‌ను ప్ర‌త్యేకంగా నిల‌బెడుతోంది. భార‌తీయ పురాణాల‌లో మ‌హిళ‌ను శ‌క్తి యొక్క ఒక అవ‌తారంగా- శ‌క్తి కి అధిదేవ‌త గా- చెబుతారు. మా అభివృద్ధికి మ‌హిళా సాధికారిత కీల‌కమని మేం న‌మ్ముతాం.

ప్ర‌శంసాయోగ్య‌మైన ప్ర‌తిభకు మ‌రియు దృఢ సంక‌ల్పానికి మారు పేరైన మ‌హిళ‌ల ప్ర‌స‌క్తులు మా చ‌రిత్ర‌లో చోటు చేసుకొన్నాయి. ర‌మార‌మి క్రీ.పూ. ఏడో శ‌తాబ్దం నాటి ప్రాచీన త‌త్వ‌వేత్త గార్గీ- త‌త్వ శాస్త్ర సంబంధ ప్ర‌వ‌చ‌నం విష‌యంలో- ఒక ముని ని స‌వాలు చేశారు; ఆ కాలం లోనే ఇది అపూర్వమైనటువంటి ఘ‌ట‌న‌. మా రాణులు అహిల్యాబాయి హోల్కర్, ల‌క్ష్మీ బాయి.. వారి వారి రాజ్యాల‌ను కాపాడుకోవ‌డానికి ధైర్యంగా పోరాడారు. మా స్వాతంత్య్ర సంగ్రామం సైతం ఈ త‌ర‌హా స్ఫూర్తిదాయ‌క‌ సంద‌ర్భాల‌తో నిండి ఉంది.

భార‌తీయ మ‌హిళ‌లు విభిన్నమైన జీవ‌న మార్గాల‌లో నాయ‌క‌త్వం వహించ‌డాన్ని కొన‌సాగిస్తూ వ‌స్తున్నారు. అంగార‌క గ్ర‌హాన్ని చుట్టి వ‌చ్చే యాత్ర‌తో స‌హా మా అంత‌రిక్ష కార్య‌క్ర‌మాలలో మా యొక్క మ‌హిళా శాస్త్రవేత్త‌ల యొక్క గొప్పదైన తోడ్పాటు ముడిపడింది. యుఎస్ రోద‌సి యాత్ర‌ల‌లోనూ భార‌తీయ మూలాలు క‌లిగిన‌ క‌ల్ప‌నా చావ్లా, ఇంకా సునీతా విలియ‌మ్స్ లు పాలుపంచుకొన్నారు.

భార‌త‌దేశం లోని అత్యంత ప్రాచీన‌మైన నాలుగు ఉన్న‌త న్యాయ స్థానాల‌లోకెల్లా మూడు ఉన్న‌త న్యాయ స్థానాల‌కు ప్ర‌స్తుతం సార‌థులుగా మ‌హిళా న్యాయ‌మూర్తులు ఉన్నారు. మా క్రీడాకారిణులు దేశం గ‌ర్వ‌ప‌డేట‌ట్లుగా చేశారు. ఈ హైద‌రాబాద్ న‌గ‌రాన్నే తీసుకొంటే, భార‌త‌దేశానికి కీర్తిని సంపాదించి పెట్టిన సానియా మీర్జా, సైనా నెహ్వాల్ మ‌రియు పి.వి. సింధు లకు పుట్టినిల్లు ఈ న‌గ‌రమే.

భార‌త‌దేశంలో గ్రామీణ మ‌రియు ప‌ట్ట‌ణ ప్రాంతాల స్థానిక సంస్థ‌ల‌లో మూడింట ఒక వంతుకు త‌క్కువ కాని స్థాయి లో మ‌హిళ‌ల‌కు ప్రాతినిధ్యాన్ని మేం క‌ల్పించాం. త‌ద్వారా, విధాన రూప‌క‌ల్ప‌న‌లో కూక‌టివేళ్ళ స్థాయిలో మ‌హిళ‌ల‌కు భాగ‌స్వామ్యాన్ని క‌ల్పించాం.

మా వ్య‌వ‌సాయ‌ రంగంలో మ‌రియు సంబంధిత రంగాల‌లో అర‌వై శాతానికి పైగా శ్రామికులు మ‌హిళ‌లే. గుజ‌రాత్ లోని మా పాల స‌హ‌కార సంఘాలు మ‌రియు స్త్రీ మ‌హిళా గృహ ఉద్యోగ్ లిజ్జ‌త్ పాప‌డ్ లు ఉన్న‌త స్థాయి విజ‌యాల‌కు ఉదాహ‌ర‌ణ‌లుగా నిల‌వ‌డమే కాకుండా మ‌హిళ‌ల నాయ‌క‌త్వంలో న‌డుస్తున్న స‌హ‌కార ఉద్య‌మాలుగా ప్ర‌పంచ స్థాయిలో గుర్తింపును తెచ్చుకొన్నాయి.

మిత్రులారా,

మ‌రి ఇక్క‌డ జిఇఎస్ కు విచ్చేసిన ప్ర‌తినిధుల‌లో, 50 శాతానికి పైగా మ‌హిళా ప్ర‌తినిధులే ఉన్నారు. రానున్న రెండు రోజుల‌ లోనూ మీరు వారి వారి జీవ‌న ప‌థాల‌లో విభిన్నంగా ఉండేందుకు సాహ‌సించిన ఎంతో మంది మ‌హిళ‌ల‌ను క‌లుసుకోబోతున్నారు. వారు ఒక కొత్త త‌రానికి చెందిన మ‌హిళా న‌వ పారిశ్రామికుల‌కు స్ఫూర్తిని అందించనున్నారు. న‌వ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఏ విధంగా మ‌రింత అండ‌దండ‌ల‌ను అందించవచ్చనే అంశంపై ఈ శిఖ‌రాగ్ర స‌మావేశాలలో జ‌రిగే చ‌ర్చోప చ‌ర్చ‌లు శ్ర‌ద్ధ వ‌హిస్తాయ‌ని నేను ఆశిస్తాను.

మ‌హిళ‌లు మ‌రియు స‌జ్జ‌నులారా,

భార‌త‌దేశం యుగాల త‌ర‌బ‌డి న‌వ పారిశ్రామికవేత్త‌ల‌కు మ‌రియు నూత‌న ఆవిష్కారాల‌కు ఒక ఇంకుబేట‌ర్ గా ఉంటూ వ‌చ్చింది. ప్రాచీన భార‌తీయ సిద్ధాంత గ్రంథం అయిన‌టువంటి చ‌ర‌క సంహిత ప్ర‌పంచానికి ఆయుర్వేద ను ప‌రిచయం చేసింది. అలాగే యోగా అనేది ప్రాచీన భార‌త‌దేశం లో చోటు చేసుకొన్న మ‌రొక నూత‌న ఆవిష్కారం. ప్ర‌తి సంవ‌త్స‌రం జూన్ 21వ తేదీని యోగా దినంగా జ‌రుపుకోవ‌డానికి యావ‌త్ ప్ర‌పంచం ప్ర‌స్తుతం ఒక తాటి మీద‌కు వ‌చ్చింది. యోగా ను, ఆధ్యాత్మిక‌త‌ ను మ‌రియు సాంప్ర‌దాయక ఆయుర్వేద ఉత్పాద‌న‌ ల‌ను వ్యాప్తి లోకి తీసుకురావ‌డం కోసం అనేక మంది న‌వ పారిశ్రామిక‌వేత్త‌లు కృషి చేస్తున్నారు.

ఈ రోజు మనం జీవిస్తున్నటువంటి డిజిట‌ల్ ప్ర‌పంచం ద్వి సంఖ్యామానానికి చెందిన వ్య‌వ‌స్థ మీద ఆధార‌ప‌డుతోంది. ఈ ద్విసంఖ్యామాన వ్య‌వ‌స్థ‌ కు మూలాధార‌మైన సున్నా ను క‌నుగొన‌డం భార‌త‌దేశంలో ఆర్యభ‌ట్ట కృషి యొక్క ప‌ర్య‌వ‌సాన‌మే. అదే విధంగా ప్ర‌స్తుత కాల‌పు ఆర్థిక విధానం లోని అనేక సూక్ష్మ భేదాల‌కు, ప‌న్నుల విధానానికి మ‌రియు ప్ర‌భుత్వ ఆర్థిక విధానాల‌కు మా ప్రాచీన ప్ర‌మాణ గ్రంథ‌మైన కౌటిల్యుని అర్థ శాస్త్రంలో రూపు రేఖ‌లు పొందుప‌ర‌చివున్నాయి.

లోహ శోధ‌న శాస్త్రం లో ప్రాచీన భార‌త‌దేశ ప్రావీణ్యం సైతం చిర ప‌రిచిత‌మైందే. మా దేశం లోని అనేక నౌకాశ్ర‌యాలు మరియు ఓడరేవులతో పాటు, ప్ర‌పంచంలోకెల్లా అత్యంత పురాత‌న‌మైన రేవు అయినటువంటి లోథ‌ల్.. మా చైత‌న్య‌శీల‌ వ్యాపార సంబంధాల‌కు సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. విదేశీ భూభాగాల‌కు త‌ర‌లివెళ్ళిన భార‌తీయ స‌ముద్ర యాత్రికుల గాథ‌లు మా పూర్వుల యొక్క న‌వ పారిశ్రామిక వేత్త‌ల స్వ‌భావాన్ని, స్ఫూర్తిని ప్ర‌తిబింబిస్తున్నాయి.

ఒక నవ పారిశ్రామికవేత్త‌ ను గుర్తించాలంటే ఉండవలసిన ముఖ్య ల‌క్ష‌ణాలు ఏమేమిటి ?

లక్ష్యాన్ని చేరుకోవడానికి పారిశ్రామికవేత్త త‌న విజ్ఞానాన్ని, నైపుణ్యాల‌ను ఉప‌యోగిస్తాడు. పారిశ్రామికవేత్త‌లు అన‌నుకూల ప‌రిస్థితులలో కూడా అవ‌కాశాల‌ను చూస్తారు. చిట్ట‌చివ‌రి వినియోగ‌దారులకు వీలుగా, సౌక‌ర్య‌వంతంగా ఉండే విధానాలకు రూప‌క‌ల్ప‌న చేసి ప్ర‌జ‌ల అవ‌స‌రాల‌ను తీరుస్తారు. వారు ఓపికగా వ్య‌వ‌హ‌రిస్తారు. అంతే కాదు, ప‌ట్టుద‌ల‌తో ప‌ని చేస్తారు. ప్ర‌తి ప‌ని మూడు ద‌శ‌లలో కొన‌సాగుతుంద‌ని స్వామి వివేకానంద అంటారు. మొద‌ట ఆ ప‌ని ఎగ‌తాళి కి గురి అవుతుంది. ఆ త‌రువాత దాని ప‌ట్ల వ్య‌తిరేక‌త క‌నిపిస్తుంది. ఆ త‌రువాతి ద‌శ‌లో దానికి ఆమోదం ల‌భిస్తుంది. త‌మ కాలాని కన్నా ముందుండి ఆలోచించే వారు అపార్థానికి లోనవుతున్నారు. చాలా మంది పారిశ్రామిక‌వేత్త‌ల‌కు ఈ విష‌యం తెలుసు.

వైవిధ్యంగా ఆలోచించే శ‌క్తి తోను, మాన‌వాళి మంచి కోసం భ‌విష్య‌త్తు లోకి తొంగి చూసి ఆలోచించ‌డం ద్వారాను పారిశ్రామికవేత్త‌లు ఇత‌రుల‌ కన్నా భిన్నంగా క‌నిపిస్తారు. నేటి భార‌త‌దేశం లోని యువ‌శ‌క్తికి ఆ శ‌క్తి ఉంది. మెరుగైన ప్ర‌పంచం కోసం 800 మిలియ‌న్ మంది స‌మ‌ర్థ‌వంతులైన పారిశ్రామిక వేత్త‌లు ప‌ని చేస్తున్నారు.. 2018 నాటికి భార‌త‌దేశంలో స్మార్ట్ ఫోన్ వాడ‌కందారుల సంఖ్య 500 మిలియ‌న్ కన్నా మించిపోతుంద‌నే అంచనాలు వెలువ‌డ్డాయి. దీని కార‌ణంగా ఏ వ్యాపారం చేప‌ట్టినా అది అత్య‌ధికులకు చేరుకొనే వీలు కల్పిస్తుంది. అలాగే, ఉద్యోగాల క‌ల్పన‌కు కూడా దారి తీస్తుంది.

మా ‘స్టార్ట్- అప్ ఇండియా’ కార్య‌క్ర‌మం స‌మ‌గ్ర‌మైంది. దేశంలో పారిశ్రామిక త‌త్వాన్ని అభివృద్ధి చేయ‌డానికి నూత‌న ఆవిష్క‌ర‌ణ‌ల‌కు దోహ‌దం చేస్తుంది. నిబంధ‌న‌ల భారాన్ని ఈ కార్య‌క్ర‌మం పూర్తిగా త‌గ్గించివేస్తుంది. స్టార్ట్- అప్ కంపెనీల‌కు అవ‌స‌ర‌మ‌య్యే మ‌ద్ద‌తును ఇస్తుంది. దేశంలో గ‌ల ప‌నికిరాని 1200 వ‌ర‌కూ చ‌ట్టాల‌ను మేం తొల‌గించాం. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల‌కు సంబంధించి సులువుగా ప‌ని కావ‌డానికి వీలుగా 21 రంగాలలో 87 నియ‌మాల‌ను స‌ర‌ళీక‌రించ‌డం జ‌రిగింది. ప‌లు ప్ర‌భుత్వ విధానాలు, ప‌ద్ధ‌తుల‌ను ఆన్ లైన్‌లో ఉంచ‌డమైంది.

దేశంలో వ్యాపార వాతావ‌రణాన్ని మెరుగుపర‌చ‌డానికి మా ప్ర‌భుత్వం అనేక చ‌ర్య‌లను చేపట్టింది. ఈ చ‌ర్య‌ల కార‌ణంగా ప్ర‌పంచ‌ బ్యాంకు వారి ‘ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ రిపోర్ట్’ లో భార‌త‌దేశం స్థానం 142 నుండి 100కు ఎగ‌బాకింది.

నిర్మాణ సంబంధ అనుమ‌తులు, రుణాల క‌ల్ప‌న‌, అల్పసంఖ్యాక ఇన్వెస్టర్ల ప్రయోజనాలకు ర‌క్ష‌ణ‌, ప‌న్నుల చెల్లింపు, ఒప్పందాల‌ అమ‌లు, దివాలా స‌మ‌స్య‌ల ప‌రిష్కారం మొద‌లైన వాటికి సంబంధించిన‌ సూచిక‌లలో మేం మెరుగుదలను సాధించాం.

ఈ ప్రక్రియ ఇంకా పూర్తి కానే లేదు. వంద‌వ స్థానంతో మేం సంతృప్తి చెంద‌డం లేదు. 50వ ర్యాంకు సాధ‌న‌ కోసం మేం క‌ష్ట‌ప‌డి ప‌ని చేస్తాం.

వ్యాపార‌వేత్త‌ల‌కు ప‌ది లక్ష‌ల రూపాయ‌ల వ‌ర‌కు సులువైన ఆర్ధిక సాయాన్ని అందించ‌డానికిగాను మేం ‘ముద్ర ప‌థ‌కాన్ని’ ప్రారంభించాం. 2015 లో దాన్ని ప్రారంభించిన‌ప్ప‌టి నుండి 4.28 ట్రిలియ‌న్ రూపాయ‌ల విలువైన 90 మిలియ‌న్ కు పైగా రుణాల‌ను మంజూరు చేయడమైంది. వీటిలో 70 మిలియ‌న్ రుణాలను మ‌హిళా నవ పారిశ్రామిక‌వేత్త‌ల‌కు అందించడం జ‌రిగింది.

నా ప్ర‌భుత్వం ‘‘అట‌ల్ ఇన్నోవేశన్ మిష‌న్’’ ను ప్రారంభించింది. దీని ద్వారా పిల్ల‌ల్లో ప‌రిశోధన శ‌క్తిని, పారిశ్రామిక సామ‌ర్థ్యాన్ని పెంపొందించ‌డానికిగాను 900 పాఠ‌శాల‌లో టింక‌రింగ్ ల్యాబ్స్ ను ప్రారంభిస్తున్నాం. మేం ప్రారంభించిన ‘‘మెంటర్ ఇండియా’’ కార్య‌క్ర‌మం ద్వారా నిపుణులను ఎంపిక చేసి వారి ద్వారా టింక‌రింగ్ ల్యాబ్స్ లోని చిన్నారుల‌కు మార్గ‌ద‌ర్శ‌నం చేయిస్తాం. దీనికి తోడుగా వివిధ విశ్వ‌విద్యాల‌యాలలోను, ప‌రిశోధ‌నా సంస్థ‌లలోను 19 ఇంకుబేష‌న్ సెంటర్ లను స్థాపించడం జ‌రిగింది. ఈ కేంద్రాలు వైవిధ్య‌మైన స్టార్ట్- అప్ వ్యాపారాల‌కు త‌గిన సాయం చేస్తాయి. త‌ద్వారా స్టార్ట్- అప్ వ్యాపారాలు గ‌ణ‌నీయ‌మైన స్థాయికి, సుస్థిర‌మైన స్థాయికి చేరుకొంటాయి.

మేం ‘ఆధార్’ ను ప్రారంభించాం. ఇది ప్ర‌పంచంలోనే అతి పెద్ద‌దైన బ‌యో మెట్రిక్ ఆధారిత డిజిట‌ల్ డాటాబేస్. ప్ర‌స్తుతం 1.15 బిలియ‌న్ మంది ప్ర‌జ‌లు ‘ఆధార్’ పరిధి లోకి వచ్చారు. దీని సహాయంతో ప్ర‌తి రోజూ 40 మిలియ‌న్ లావాదేవీలు డిజిట‌ల్ గా జ‌రుగుతున్నాయి. ‘ఆధార్’ సాయంతో దేశంలోని ప్ర‌భుత్వ ప‌థ‌కాల ల‌బ్ధిదారుల‌కు నేరుగా ల‌బ్ధి చేకూరేటట్టు న‌గ‌దును వారి ఖాతాలలోకి బదలాయించడం జ‌రుగుతోంది.

‘జ‌న్ ధ‌న్ యోజ‌న’లో భాగంగా 685 బిలియ‌న్ రూపాయల‌కు పైగా డిపాజిట్లు గ‌ల 300 మిలియ‌న్ బ్యాంక్ అకౌంట్ లు ప్రారంభ‌మ‌య్యాయి. గ‌తంలో బ్యాంకింగ్ రంగానికి దూరంగా ఉన్న‌ వారు ప్ర‌స్తుతం దేశం లోని ఆర్ధిక వ్య‌వ‌స్థ ప‌రిధి లోకి వ‌చ్చారు. ఈ అకౌంట్ లలో 53 శాతం అకౌంట్ లు మ‌హిళ‌ల‌వే.

భార‌త‌దేశం ప్ర‌స్తుతం క్ర‌మ‌క్ర‌మంగా తక్కువ న‌గ‌దు ఆర్ధిక వ్య‌వ‌స్థ‌గా రూపొందుతోంది. ఇందుకోసం ‘భీమ్’ పేరుతో ఓ యూనిఫైడ్ పేమెంట్ ఇంట‌ర్‌ఫేస్ యాప్ ను ప్రారంభించ‌డం జ‌రిగింది. ఒక సంవత్సరం లోపే ఈ ప్లాట్ ఫార్మ్ ప్ర‌తి రోజూ 280 వేల లావాదేవీలను జ‌రిపే స్థాయికి చేరుకొంది.

‘సౌభాగ్య’ ప‌థ‌కాన్ని ప్రారంభించి, దీని ద్వారా దేశంలో విద్యుత్తు లేని వారికి విద్యుత్తు సౌక‌ర్యాన్ని క‌ల్పిస్తున్నాం. ఈ ప‌థ‌కం ద్వారా 2018 డిసెంబ‌ర్ కల్లా దేశం లోని అన్ని కుటుంబాల‌కు విద్యుత్తు సౌక‌ర్యాన్ని సమకూర్చడం జ‌రుగుతుంది.

2019 మార్చి నెల కల్లా దేశం లోని అన్ని గ్రామీణ ప్రాంతాల‌కు అత్య‌ధిక వేగం గ‌ల బ్రాడ్ బ్యాండ్ ఇంట‌ర్ నెట్ సౌక‌ర్యాన్ని క‌ల్పించ‌బోతున్నాం.

నవీకరణ యోగ్య శ‌క్తి సామ‌ర్థ్యాన్ని 30 వేల మెగావాట్ ల నుండి 60 వేల మెగావాట్ లకు తీసుకుపోవ‌డం జ‌రిగింది. స్వ‌చ్ఛ శక్తి కార్య‌క్ర‌మం లో భాగంగా మూడు సంవత్సరాల లోనే ఈ ప‌నిని చేశాం. కిందటి ఏడాది సౌర శ‌క్తి ఉత్ప‌త్తి 80 శాతం పెరిగింది. జాతీయ గ్యాస్ గ్రిడ్ ను ఏర్పాటు చేసుకోవ‌డానికి క‌స‌ర‌త్తు చేస్తున్నాం. స‌మ‌గ్ర‌మైన జాతీయ ఇంధ‌న విధానాన్ని రూపొందించ‌డానికి కృషి చేస్తున్నాం. దేశంలో పారిశుధ్యాన్ని, శుభ్ర‌త‌ను మెరుగుప‌ర‌చ‌డానికిగాను ‘స్వ‌చ్ఛ భార‌త్ కార్య‌క్ర‌మాన్ని’ ప్రారంభించాం. గ్రామీణ‌, ప‌ట్ట‌ణ గృహ నిర్మాణ కార్య‌క్ర‌మాలు, ప్ర‌జ‌ల జీవ‌న ప్ర‌మాణాలు మెరుగుప‌రచ‌డంలో ప్ర‌భుత్వానికి ఉన్న నిబ‌ద్ధ‌త‌ను చాటుతున్నాయి.

వ్యాపార‌వేత్త‌లు పెట్టుబ‌డులు పెట్ట‌డానికి మేం చేప‌ట్టిన ‘సాగ‌ర్ మాల‌’, ‘భార‌త్ మాల’ కార్య‌క్ర‌మాలు అనేక అవ‌కాశాల‌ను క‌ల్పిస్తున్నాయి. ఇవి మౌలిక స‌దుపాయాల ఏర్పాటు, అనుసంధానానికి సంబంధించిన కార్య‌క్ర‌మాలు.

ఈ మ‌ధ్య‌నే ప్రారంభించిన ‘వ‌ర‌ల్డ్ ఫూడ్ ఇండియా కార్య‌క్ర‌మం’ కార‌ణంగా ఫూడ్ ప్రాసెసింగ్ ఇండ‌స్ట్రీ, వ్య‌వ‌సాయ వ్య‌ర్థాల రంగాలలో ప‌లువురు వ్యాపార‌వేత్త‌ల‌తో క‌లిసి ప‌ని చేయడం జ‌రుగుతోంది.

దేశంలో పారిశ్రామిక రంగం అభివృద్ధి చెందాలంటే, పార‌ద‌ర్శ‌క విధానాల‌తో కూడిన వాతావ‌ర‌ణం, అంద‌రికీ న్యాయం చేసే న్యాయ‌, చ‌ట్ట వ్య‌వ‌స్థ లు త‌ప్ప‌కుండా ఉండాలి.

ఈ మ‌ధ్య‌ ప‌న్నుల రంగంలో చరిత్రాత్మ‌క మార్పుల‌ను చేప‌ట్టాం. దేశ వ్యాప్తంగా వ‌స్తువులు మరియు సేవ‌ల ప‌న్ను (జిఎస్ టి)ని అమ‌లు చేస్తున్నాం. 2016లో ఇన్ సాల్వెన్సీ అండ్ బాంక్ ర‌ప్ట‌సి కోడ్ ను ప్ర‌వేశ‌పెట్టాం. దీని ద్వారా ఇబ్బందిక‌ర సంస్థ‌లకు సంబంధించిన స‌మ‌స్య‌ల‌ను స‌మ‌యానికి ప‌రిష్క‌రిస్తున్నాం. దీనిని ఇటీవలే మెరుగుప‌రచాం. దీని ద్వారా ఇబ్బందిక‌ర సంస్థ‌ల ఆస్తుల‌ను ఆధీనం చేసుకోవ‌డానికి ప్ర‌య‌త్నించే మోస‌పూరిత ఎగ‌వేత‌దారుల‌ను నిరోధించ‌గ‌లుగుతున్నాం.

స‌మాంత‌ర ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను నిరోదించ‌డానికిగాను క‌ఠిన‌మైన చ‌ర్య‌ల‌ను చేప‌ట్టాం. త‌ద్వారా ప‌న్నుల ఎగ‌వేత‌ను ప‌సిగ‌ట్టి, న‌ల్ల‌ధనాన్ని నియంత్రించ‌గ‌లుగుతున్నాం.

మా కృషిని రేటింగు సంస్థ మూడీజ్ ఈ మ‌ధ్య‌నే గుర్తించింది. ప్ర‌భుత్వ రేటింగుల‌ను పెంచింది. దాదాపు 14 ఏళ్ల వ్యవధి అనంతరం ఈ పెరుగుద‌ల సంభవించింది.

ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌క‌టించిన లాజిస్టిక్ ప‌ర్ ఫార్మెన్స్ ఇండెక్స్ ప్ర‌కారం 2014 లో భార‌త‌దేశం ర్యాంకు 54. ఇది 2016 నాటికి 35కు చేరుకొంది. దేశం లోని ఉత్ప‌త్తులు బయట‌కు వెళ్ల‌డానికి, బయటి ఉత్ప‌త్తులు దేశంలోకి రావ‌డానికిగాను సులువైన వాతావ‌ర‌ణం ఏర్ప‌డిందనే విష‌యాన్ని ఇది చాటుతోంది.

స్థూల ఆర్ధిక రంగం దృష్ట్యా చూసిన‌ప్పుడు దేశంలో పెట్టుబ‌డులకు అనుకూలమైన వాతావ‌ర‌ణం స్థిరంగా ఉండాలి. ఆర్ధిక‌ లోటును, క‌రెంట్ అకౌంట్ లోటును అదుపులో పెట్ట‌డంలో మేం విజ‌యం సాధించాం. ద్ర‌వ్యోల్బ‌ణాన్ని అదుపులో ఉంచాం. దేశంలో విదేశీ మార‌క ద్ర‌వ్య నిల్వలు 400 బిలియ‌న్ డాల‌ర్ల‌ను మించాయి. భారీ స్థాయిలో విదేశీ పెట్టుబ‌డుల‌ను ఆక‌ర్షించ‌డం కొన‌సాగుతూనే ఉంది.

భార‌త‌దేశ యువ పారిశ్రామిక స్నేహితులారా, 2022 నాటికి నూత‌న భార‌త‌దేశాన్ని నిర్మించ‌డానికిగాను మీలో ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక విలువైన ప‌నిని చేయాలి. దేశంలో మార్పునకు మీరే ప్ర‌ధాన కార‌కులు. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల పారిశ్రామిక స్నేహితులారా, మీకు ఒక విష‌యాన్ని చెప్పాల‌నుకుంటున్నాను. రండి.. దేశంలోనే త‌యారు చేయండి. ఇక్కడ పెట్టుబ‌డులు పెట్టండి. ఇండియా కోసం పెట్టుబ‌డులు పెట్టండి. అంతే కాదు ప్ర‌పంచం కోసం పెట్టుబ‌డి పెట్టండి. భార‌త‌దేశం అభివృద్ధి గాథ లో ప్ర‌తి ఒక్క‌రూ భాగ‌స్వాములు కావాల‌ంటూ ఆహ్వానిస్తున్నాను. మ‌రోసారి మీకు నా హృద‌యపూర్వ‌క మ‌ద్ద‌తు తెలుపుతున్నాను.

అమెరికా అధ్య‌క్షులు శ్రీ ట్రంప్ 2017 నవంబ‌ర్‌ ను జాతీయ నవ పారిశ్రామికవేత్తల మాసంగా ప్ర‌క‌టించిన‌ట్టుగా నాకు తెలిసింది. అంతే కాదు అమెరికా లో ఈ నెల 21వ తేదీని జాతీయ నవ పారిశ్రామికుల దినంగా జ‌రుపుకొన్నారు. ఈ శిఖ‌రాగ్ర స‌మావేశం కూడా ఆ లక్ష్యాల‌ను త‌ప్ప‌క ప్ర‌తిబింబిస్తుంది. ఈ స‌మావేశంలో మీరు ఫలప్రదమయ్యే నిర్ణ‌యాలను తీసుకొంటార‌ని ఆకాంక్షిస్తూ నా ప్రసంగాన్ని ముగిస్తాను.

మీ అంద‌రికీ ధన్యవాదాలు.

***