పిఎంఇండియా
ప్రభుత్వ పాలన మరియు పరిపాలన సంస్కరణల రంగంలో సహకారంపై భారతదేశం, పోర్చుగల్ లకు చెందిన వివిధ మంత్రిత్వ శాఖల మధ్య కుదిరిన అవగాహన ఒప్పందానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. భారతదేశం పక్షాన పరిపాలన సంస్కరణలు- ప్రజా ఫిర్యాదుల విభాగం (డిఎఆర్ పిజి), సిబ్బంది వ్యవహారాలు-ప్రజా ఫిర్యాదులు-పెన్షన్ ల మంత్రిత్వ శాఖ ఈ ఒప్పందంపై సంతకాలు చేయగా, పోర్చుగల్ పక్షాన పోర్చుగల్ రిపబ్లిక్కు చెందిన మినిస్ట్రీ ఆఫ్ ప్రెసిడెన్సీ, పాలన ఆధునికీకరణ విభాగం సంతకాలు చేశాయి.
పోర్చుగల్ ప్రజా సేవల నిర్వహణ రంగంలో వేగంగా మారుతున్న పర్యావరణాల పరిశీలన ద్వారా అక్కడి వినియోదారు కేంద్రక ప్రజా సేవా ప్రదాన వ్యవస్థ నిర్వహణపై అవగాహనకు ఈ ఒప్పందం దోహదపడుతుంది. అలాగే అందులోని ఉత్తమ ఆచరణాత్మక పద్ధతులు, ప్రక్రియల అనుసరణ, ప్రతి రూపకల్పన ద్వారా భారత ప్రజా సేవా ప్రదాన వ్యవస్థను మెరుగుపరచడానికీ ఉపకరిస్తుంది.
ఈ ఎమ్ఒయు లో భాగంగా సహకారం పొందే రంగాలు:
(ఎ) ప్రభుత్వస్థాయిలో డిజిటల్ పరివర్తన
(బి) పాలన సరళీకరణ – ప్రక్రియల పునర్నిర్మాణం
(సి) ప్రజా సేవా ప్రదానం
(డి) సిబ్బంది సామర్థ్య నిర్మాణం, అభివృద్ధి.
(ఇ) ప్రజా పాలనలో ఉత్తమ పాలన పద్ధతులను పంచుకోవడం,
(ఎఫ్) ప్రజా సమస్యల పరిష్కార యంత్రాంగం
ఈ ఒప్పందం కింద సహకారానికి సంబంధించిన అంశాలు కిందివిధంగా ఉంటాయి:
(ఎ) సహకారం, సహ భాగస్వామ్యంపై ప్రస్తుతం సాగుతున్న చర్చలకు సంబంధించి సీనియర్ సంప్రదింపుల వ్యవస్థ ఏర్పాటు, కార్యాచరణ సదస్సుల నిర్వహణ;
(బి) పైన పేర్కొన్న రంగాల్లో ఇప్పడున్న తరహాలోనే గాక ఆన్లైన్ ద్వారా కూడా నైపుణ్యం, అనుభవాల ఆదాన ప్రదానం;
(సి) ప్రజా పాలన, పరిపాలన సంస్కరణ సంబంధిత కార్యక్రమాలకు పరస్పర ఆహ్వానాలతో పాటు ఈ రంగంలో నిపుణుల ఆదాన ప్రదానం;
(డి) ప్రజా పాలన, పరిపాలన సంస్కరణ సంబంధిత అంశాలపై రెండు పక్షాలూ ప్రచురించే వివిధ పుస్తకాలు, నివేదికల ఆదాన ప్రదానం;
(ఇ) అధ్యయన సందర్శనలకు సదుపాయాల కల్పనతోపాటు కార్యశాలలు, సదస్సులు, సమావేశాలద్వారా సమాచారం, అనుభవాలను పంచుకోవడం;
(ఎఫ్) ఒప్పందంపై సంతకాలు చేసిన ఇరు పక్షాల సంయుక్త నిర్ణయం మేరకు ప్రజా పాలన, పరిపాలన సంస్కరణలకు సంబంధించి పరస్పర ప్రయోజనాలకు అనుగుణంగా ఇతరత్రా రూపాల్లోనూ సహకారం, సహ భాగస్వామ్యం.
ప్రజా పాలన, పరిపాలన సంస్కరణలపై సంయుక్త కార్యాచరణ బృందం ఈ అవగాహన ఒప్పందం అమలు బాధ్యతను చూసుకొంటుంది.
పూర్వరంగం:
పౌర కేంద్రక ఆన్లైన్ సేవలను అందించడమే సమర్థ ప్రజా పాలన వ్యవస్థకు పునాది. అది పరిపాలనలో పారదర్శకతకు, జవాబుదారీతనానికి బాట వేయడం ద్వారా సమతుల వృద్ధిని ప్రోత్సహిస్తుంది. దేశవ్యాప్తంగా ప్రభుత్వ సేవల ఆన్లైన్ ప్రదానం దిశగా పరిమాణాత్మక పరివర్తనను లక్ష్యంగా నిర్దేశించుకొని భారత ప్రభుత్వం ముందుకు సాగుతోంది. ప్రజా పాలన వ్యవస్థను నవీకరించడంలో ప్రభుత్వ కృషిని ముమ్మరం చేయడం దీని ఉద్దేశం. ఎలక్ట్రానిక్ పాలన, డిజిటల్ ఇండియా తదితర కార్యక్రమాలలో ప్రజా సమస్యల పరిష్కార యంత్రాంగం ఆవిష్కృతమవుతోంది. అలాగే ఎలక్ట్రానిక్ పాలన ఆధారిత పౌర కేంద్రక ప్రత్యక్ష సేవలద్వారా ‘కనిష్ఠ ప్రభుత్వం- గరిష్ఠ పాలన’ లక్ష్యం దిశగా సాగుతోంది.
సుపరిపాలన, పరిపాలన సంస్కరణల వైపు చొరవ దిశగా అంతర్జాతీయ సహకారం పొందే కృషిలో భాగంగా ఇప్పటి దాకా చైనా, మలేశియా, సింగపూర్, ఫ్రాన్స్, బ్రిటన్లతో డిఎఆర్ పిజి ద్వైపాక్షిక అవగాహన ఒప్పందాలు సహా బ్రెజిల్తోను, దక్షిణాఫ్రికా తోను త్రైపాక్షిక ఒప్పందాలను కుదుర్చుకొంది. ఇక చైనాతో, సింగపూర్ తో అవగాహన ఒప్పందాల నవీకరణ/అంగీకారం విదేశాంగ శాఖతో సంప్రదింపులపై న ఆధారపడి ఉంటుంది. పోర్చుగల్తో అవగాహనపూర్వక ఒప్పందం ద్వారా ఈ దిశగా మరో అడుగు పడింది.
***