పిఎంఇండియా
మార్కెట్ నిర్ధారించిన ధరలు అందుబాటులో లేని పరిస్థితులలో ప్రభుత్వం కేటాయింపులు జరిపిన స్పెక్ట్రమ్ సరళీకరణ కోసం విధాన పరంగా మార్పులు చేపట్టే ప్రతిపాదనకు కేంద్ర మంత్రి మండలి ఆమోదం తెలిపింది. కేంద్ర మంత్రివర్గ సమావేశానికి ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షత వహించారు. ఈ ఆమోదం కొత్త సాంకేతిక పరిజ్ఞానాలను ప్రవేశపెట్టడం, స్పెక్ట్రమ్ ను పంచుకోవడం, ఇంకా స్పెక్ట్రమ్ తో వ్యాపారం చేయడం ద్వారా స్పెక్ట్రమ్ ను వీలైనంత గరిష్ట స్థాయిలో వినియోగించుకోవడానికి తోడ్పడేది కానుంది.
మార్కెట్ నిర్ధారించిన ధరలు అందుబాటులో లేని పరిస్థితులలో ప్రభుత్వం కేటాయింపులు జరిపిన స్పెక్ట్రమ్ సరళీకరణ కోసం ఈ మధ్య తాజాగా సిఫార్సు చేసిన రిజర్వు ధరను తాత్కాలిక ధరగా తీసుకుంటారు. త్వరలో నిర్వహించే వేలం పాటలు ముగిసిన అనంతరం – వేలంలో నిర్ధారణ అయ్యే ధర ఎంత అనేది పరిశీలించి, ఇప్పటికే వసూలు చేసిన తాత్కాలిక ధరను వేలం నిర్ధారిత ధరతో సర్దుబాటు చేస్తారు. ఇది దామాషా ప్రాతిపదికన సరళీకరణ తేదీ నాటి నుంచి అమలులోకి వస్తుంది.
టెలికాం రంగ నియంత్రణదారు టి ఆర్ ఎ ఐ సిఫార్సుల ఆధారంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రక్రియ ద్వారా ఇంచుమించు రూ. 1300 కోట్లు సమకూరే అవకాశం ఉంది.