పిఎంఇండియా
ఇండో–నార్డిక్ వాటర్ ఫోరమ్ ఫ్రేమ్వర్క్లో భారత్, ఫిన్నిష్, ఇతర నార్డిక్ భాగస్వాములను ఏకతాటిపైకి తీసుకురావడంలో ఫిన్లాండ్ పోషిస్తున్న క్రియాశీల పాత్రను ప్రధానమంత్రి ప్రశంసించారు. నీటి వనరుల నిర్వహణ సర్క్యులర్ ఎకానమీ పరిష్కారాల కోసం మురుగునీటి నిర్వహణలో కొత్త భాగస్వామ్యాలను, ఉత్తమ పద్ధతులను ప్రోత్సహిస్తున్నందుకు ఆయన అభినందించారు.
వాతావరణ సహకారానికి సంబంధించి, ఫిన్నిష్ మెట్రోలాజికల్ ఇన్స్టిట్యూట్ (ఎఫ్ఎంఐ), భారత వాతావరణ శాఖ (ఐఎండి) మధ్య గాలిలోని సూక్ష్మ కణాల పర్యవేక్షణ (ఏరోసోల్ మానిటరింగ్), గాలి నాణ్యత అంచనాలో కొనసాగుతున్న సహకారాన్ని ఇద్దరు నాయకులు గుర్తించారు. ఎఫ్ఎంఐ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ మద్రాస్ (ఐఐటీఎం) మధ్య వర్చువల్ రీసెర్చ్ సెంటర్ను స్థాపించే దిశగా జరుగుతున్న కృషిని వారు స్వాగతించారు. ఇప్పటికే ఎఫ్ఎంఐ–ఐఐటీఎం మధ్య కొనసాగుతున్న పరిశోధనల సహకారాన్ని కూడా వారు గుర్తించారు; ఈ బహుపాక్షిక ప్రాజెక్టుల మొత్తం విలువ 11 మిలియన్ యూరోల పైగా ఉంది.
భారత గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ, ఫిన్లాండ్కు చెందిన నేషనల్ ల్యాండ్ సర్వే, ఫిన్నిష్ ఎన్విరాన్మెంట్ ఇన్స్టిట్యూట్, వివిధ నగరాలు, కంపెనీల మధ్య జరిగిన అనుభవాల మార్పిడిని కూడా ఇరువురు నాయకులు గుర్తించారు. ముఖ్యంగా భూమి, ఆస్తి సమాచారానికి సంబంధించిన సమగ్ర జీఐఎస్ ఆధారిత డిజిటల్ ప్లాట్ఫారమ్ – ల్యాండ్ స్టాక్ గురించి వారు చర్చించారు.
అధికారిక గణాంకాల రంగంలో సహకారాన్ని పెంపొందించుకోవడానికి కుదుర్చుకున్న అవగాహన ఒప్పందాన్ని ఇరువురు నాయకులు స్వాగతించారు. ఈ ఒప్పందం ద్వారా ఉత్తమ పద్ధతులు, గణాంక పద్ధతులు, సాంకేతిక నైపుణ్యాన్ని పరస్పరం మార్పిడి చేసుకోవడానికి ఒక బలమైన వేదిక ఏర్పడుతుంది.
చలనశీలత, విద్య, ప్రజల మధ్య సంబంధాలు
అన్ని రంగాలలో, ముఖ్యంగా నైపుణ్యం కలిగిన కార్మికులు, నిపుణులు, యువ వృత్తి నిపుణులు, పరిశోధకులు, విద్యార్థులు, వ్యాపారవేత్తలు, విద్యావేత్తలు సహా ప్రజల మధ్య సంబంధాల ప్రాముఖ్యతను భారత ప్రధానమంత్రి, ఫిన్లాండ్ అధ్యక్షుడు గుర్తించారు. ఇవి ఆర్థికాభివృద్ధిని పెంపొందించడానికి, సామాజిక వ్యవస్థను బలోపేతం చేయడానికి, పరస్పర అవగాహనను మెరుగుపరచడానికి దోహదపడతాయని వారు పేర్కొన్నారు.
వలసలు, చలనశీలతలో భాగస్వామ్యంపై అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని ఈ సందర్భంగా ఇరువురు నాయకులు ప్రశంసించారు. రాబోయే సంవత్సరాల్లో సులభమైన, క్రమబద్ధమైన, పరస్పర ప్రయోజనకరమైన పర్యటనల కోసం ఇది ఒక బలమైన పునాదిని వేస్తుంది. భారత్, ఫిన్లాండ్ దేశాల ఆర్థికాభివృద్ధికి, అభివృద్ధికి తోడ్పడేలా ఈ ఒప్పందాన్ని సమగ్రంగా, సమన్వయంతో అమలు చేయడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని రెండు పక్షాలు అంగీకరించాయి. కాన్సులర్ వ్యవహారాలపై ద్వైపాక్షిక చర్చలను ప్రారంభించే అవకాశాలను పరిశీలిస్తూ, ఇరు దేశాల విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖల మధ్య జరుగుతున్న సంప్రదింపులను కూడా నాయకులు గుర్తించారు.
విద్యా రంగంలో సహకారంపై 31 జనవరి 2024న జరిగిన ఉన్నత స్థాయి చర్చలలో ఆమోదించిన సంయుక్త ప్రకటనను ఇరువురు నాయకులు గుర్తించారు. అంగీకరించిన అంశాలైన మాధ్యమిక విద్య, ఉన్నత విద్య, నైపుణ్యాభివృద్ధి, విద్యార్థుల చలనశీలతపై దృష్టి సారిస్తూ, ఉమ్మడి ఎజెండాను ముందుకు తీసుకెళ్లడానికి సంబంధిత పక్షాలు తమ ప్రయత్నాలను వేగవంతం చేయాలని వారు సూచించారు.
ఈ సందర్భంలో, ఫిన్నిష్ విద్యా విధానం పట్ల భారత్ లో పెరుగుతున్న ఆసక్తిని నాయకులు గుర్తించారు. ఉపాధ్యాయ శిక్షణలో పెరుగుతున్న సహకారం, అలాగే ఫిన్నిష్ నమూనా ప్రకారం ఏర్పాటవుతున్న బాల్యానికి ముందు దశ ప్రాథమిక విద్యా సంస్థలు పాఠశాలలు దీనికి నిదర్శనం. విద్యా రంగంలో సహకారాన్ని మరింత అభివృద్ధి చేయడానికి సంబంధిత భాగస్వాముల ఉమ్మడి సంకల్పం, నిబద్ధతకు ఇవి స్పష్టమైన రూపాలని వారు పేర్కొన్నారు.
అంతేకాకుండా, చలనచిత్ర, గేమింగ్ పరిశ్రమలలో భాగస్వామ్యాన్ని పెంపొందించడానికి ఒక బలమైన ప్రాతిపదికను అందించే ద్వైపాక్షిక ఆడియో విజువల్ కో–ప్రొడక్షన్ ఒప్పందంపై జరుగుతున్న చర్చలను ఇరువురు నాయకులు ప్రముఖంగా ప్రస్తావించారు.
భారత్ – ఈయూ సంబంధాలు
జనవరి 27, 2026న జరిగిన భారత్–ఈయూ శిఖరాగ్ర సదస్సులో ఆమోదించిన కొత్త సంయుక్త భారత్–ఈయూ సమగ్ర వ్యూహాత్మక ఎజెండాను నాయకులు స్వాగతించారు. ఈ ఎజెండా ఉమ్మడి విలువలు, సూత్రాలు, పరస్పర విశ్వాసం, ఒకే రకమైన రాజకీయ సంకల్పంపై ఆధారపడి ఉంది.
భారత్, ఐరోపా సమాఖ్య (ఈయూ) పరస్పరం స్థిరమైన, ఊహించదగిన, నమ్మదగిన భాగస్వాములుగా ఉండగలవని ఇరువురు నాయకులు అంగీకరించారు. ఇరుపక్షాలకు అనేక సానుకూల ఫలితాలను అందించేలా లోతైన, బహుముఖ దీర్ఘకాలిక సంబంధాన్ని నిర్మించుకోవాలని వారు నిర్ణయించారు. భారత్–ఈయూ మధ్య స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం ఖరారు కావడం ఈ సంబంధాలను సరికొత్త స్థాయికి తీసుకెళ్తుందని ఇరువురు నాయకులు అంగీకరించారు. మార్కెట్ లభ్యత అవకాశాలను పెంచడం, వాణిజ్య అడ్డంకులను తొలగించడం ద్వారా లభించే స్పష్టమైన ఆర్థిక ప్రయోజనాలతో పాటు, ఈ ఒప్పందం కీలకమైన విలువ శ్రేణులను వైవిధ్యపరచడం, కొత్త మార్కెట్లను తెరవడం ద్వారా ఆర్థిక భద్రతను, సుస్థిరతను బలోపేతం చేస్తుందని వారు పేర్కొన్నారు.
కీలకమైన వాణిజ్యం, సాంకేతికత, ఆర్థిక భద్రతకు సంబంధించిన సమస్యలను పరిష్కరించే వేదికగా భారత–ఈయూ ట్రేడ్ అండ్ టెక్నాలజీ కౌన్సిల్ (టీటిసీ) పనితీరును మరింత మెరుగుపరచడానికి ఇరువురు నాయకులు తమ మద్దతును పునరుద్ఘాటించారు. భారత–ఈయూ సాంకేతిక భాగస్వామ్యానికి ఈ కౌన్సిల్ ఒక మూలస్తంభం అని వారు పేర్కొన్నారు.
భారత్–ఈయూ భద్రత, రక్షణ భాగస్వామ్యంపై సంతకం చేయడాన్ని ఒక మైలురాయిగా భారత ప్రధానమంత్రి, ఫిన్లాండ్ అధ్యక్షుడు అభివర్ణించారు. ఇది భారత్–ఈయూ వ్యూహాత్మక భాగస్వామ్యానికి మరో అర్థవంతమైన కోణాన్ని జోడించిందని వారు అంగీకరించారు. ఈ భాగస్వామ్యం ఉమ్మడి ప్రయోజనాలు ఉన్న అనేక రంగాలలో సహకారాన్ని మరింత బలోపేతం చేస్తుంది.
చలనశీలతకు సంబంధించి సమగ్ర సహకార ముసాయిదాపై అవగాహన ఒప్పందం కుదుర్చుకోవడాన్ని, భారతదేశంలో యూరోపియన్ యూనియన్ లీగల్ గేట్వే ఆఫీస్ పైలట్ ప్రాజెక్టు ప్రారంభాన్ని నాయకులు ప్రశంసించారు.
బహుపాక్షిక సహకారం
ఐక్యరాజ్యసమితి వ్యవస్థను సంస్కరించాల్సిన అవసరాన్ని నాయకులు గుర్తించారు. ఈ నేపథ్యంలో, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిని మరింత సమర్థవంతంగా, ప్రాతినిధ్యంతో కూడినదిగా, సమ్మిళితంగా, ప్రస్తుత భౌగోళిక రాజకీయ వాస్తవాలను ప్రతిబింబించేలా సమగ్రంగా సంస్కరించడం చాలా ముఖ్యమని వారు స్పష్టం చేశారు.
ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల తర్వాత, అందులో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం లభించడానికి ఫిన్లాండ్ తన మద్దతును మరోసారి స్పష్టం చేసింది.
బహుపాక్షిక వాదాన్ని రక్షించడానికి, నిబంధనల ఆధారిత అంతర్జాతీయ క్రమాన్ని కాపాడటానికి, ఐక్యరాజ్యసమితి, ఇతర అంతర్జాతీయ సంస్థలలో పరస్పర సహకారం కీలకమని ఇరువురు నాయకులు స్పష్టం చేశారు. ఇందులో భాగంగా అంతర్జాతీయ వేదికలపై ఒకరి అభ్యర్థిత్వాలకు, నామినేషన్లకు మరొకరు మద్దతు ఇచ్చుకోవాలని వారు నిర్ణయించారు.
అంతర్జాతీయ వేదికలపై తమ నిర్మాణాత్మక సహకారాన్ని కొనసాగించాలని భారత్, ఫిన్లాండ్ దేశాలు నిర్ణయించాయి. ముఖ్యంగా శాంతి, భద్రత, మానవ హక్కులు, సుస్థిర అభివృద్ధి, వాతావరణ మార్పులు, జీవవైవిధ్యం వంటి ప్రపంచవ్యాప్త సవాళ్లపై కలిసి పనిచేయాలని ఇరు దేశాలు అంగీకరించాయి.
అంతర్జాతీయ చట్టాలకు, ముఖ్యంగా సముద్ర చట్టానికి సంబంధించిన ఆ ఐక్యరాజ్య సమితి ఒప్పందానికి (అన్క్లాస్) లోబడి, స్వేచ్ఛాయుతమైన, బహిరంగమైన, శాంతియుతమైన, సంపన్నమైన ఇండో–పసిఫిక్ ప్రాంతాన్ని ప్రోత్సహించడం పట్ల వారు తమ ఉమ్మడి నిబద్ధతను పునరుద్ఘాటించారు. ఇండో–పసిఫిక్ ఓషన్స్ ఇనిషియేటివ్ లో ఫిన్లాండ్ చేరడాన్ని భారత్ సాదరంగా స్వాగతించింది.
ఆర్కిటిక్ అంశాలపై సహకారాన్ని, చర్చలను మరింత బలోపేతం చేయాలనే తమ ఉమ్మడి నిబద్ధతను రెండు దేశాల నాయకులు పునరుద్ఘాటించారు. ఉమ్మడి పరిశోధనలు, విద్యాపరమైన మార్పిడి కార్యక్రమాలు, సామర్థ్య పెంపుదల ద్వారా ఈ సహకారాన్ని కొనసాగించాలని వారు నిర్ణయించారు.
జనవరి 2026లో ఫిన్లాండ్లోని రోవానిమి నగరంలో జరిగిన మొట్టమొదటి భారత–ఫిన్లాండ్ ఆర్కిటిక్ చర్చలను ఇరువురు నాయకులు గుర్తించారు. హిమాలయ, ఆర్కిటిక్ పర్యావరణ వ్యవస్థలు: సుస్థిర భవిష్యత్తు కోసం భారత్–ఫిన్లాండ్ భాగస్వామ్యం” అనే ఇతివృత్తంతో జరిగిన ఈ సదస్సులో పార్లమెంటేరియన్లు, ప్రభుత్వ అధికారులు, విద్యావేత్తలు,నిపుణులు పాల్గొన్నారు. ఆర్కిటిక్ అంశాలపై సహకారాన్ని మరింత లోతుగా పెంచడానికి అవసరమైన వ్యూహాలు, మార్గాలపై ఈ సదస్సులో విస్తృతంగా చర్చించారు. ఆర్కిటిక్ కౌన్సిల్ వేదికగా విస్తృతమైన భారత్–నార్డిక్ శిఖరాగ్ర సదస్సు పరిధిలో సహకారాన్ని మరింత ముందుకు తీసుకెళ్లడం చాలా ముఖ్యమని ఇద్దరు నేతలు స్పష్టం చేశారు.
ఉగ్రవాదాన్ని, హింసాత్మక తీవ్రవాదాన్ని అవి ఏ రూపంలో ఉన్నా తీవ్రంగా, నిర్ద్వంద్వంగా ఖండిస్తున్నట్లు ఇద్దరు నాయకులు ప్రకటించారు. ముఖ్యంగా సీమాంతర ఉగ్రవాదాన్ని వారు ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఉగ్రవాదాన్ని సమగ్రంగా, నిరంతరాయంగా, అంతర్జాతీయ చట్టాలకు లోబడి ఎదుర్కోవడానికి ప్రపంచ దేశాలు నిర్ణయాత్మకమైన ఉమ్మడి ప్రయత్నాలు చేయాలని వారు పిలుపునిచ్చారు. తీవ్రవాద భావజాలం వ్యాప్తిని, తీవ్రవాదాన్ని అరికట్టడానికి, ఉగ్రవాదానికి అందుతున్న నిధులను నిలిపివేయడానికి తమ సహకారాన్ని మరింత పెంపొందించుకోవాలని భారత్, ఫిన్లాండ్ నాయకులు నిర్ణయించారు. అంతర్జాతీయంగా అంగీకరించిన మనీ లాండరింగ్ నిరోధక ప్రమాణాలను ప్రోత్సహించాలని, ఉగ్రవాద ప్రయోజనాల కోసం కొత్త, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతల దుర్వినియోగాన్ని నివారించాలని, అలాగే ఉగ్రవాద నియామకాన్ని అరికట్టాలని వారు అంగీకరించారు. ఉగ్రవాదానికి అందుతున్న నిధులను అడ్డుకోవడానికి ఐక్యరాజ్యసమితి ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ (ఎఫ్ఏటీఎఫ్) వంటి అంతర్జాతీయ వేదికలపై కఠినమైన చర్యలు తీసుకోవాలనే తమ నిబద్ధతను పునరుద్ఘాటించారు. 2025లో భారత్ లో జరిగిన రెండు భారీ ఉగ్రవాద దాడులను వారు అత్యంత కఠినమైన పదజాలంతో ఖండించారు:
ఐక్యరాజ్యసమితి చార్టర్, అంతర్జాతీయ చట్ట సూత్రాల ఆధారంగా స్వాతంత్ర్యం, సార్వభౌమాధికారం, ప్రాదేశిక సమగ్రతను గౌరవిస్తూ చర్చలు, దౌత్యం ద్వారా ఉక్రెయిన్లో సమగ్రమైన, న్యాయబద్ధమైన, శాశ్వతమైన శాంతిని సాధించే ప్రయత్నాలకు తమ మద్దతును కొనసాగించాలని ఇరువురు నాయకులు అంగీకరించారు.
ముగింపు
డిజిటలైజేషన్, సుస్థిరత రంగాలలో భారత–ఫిన్లాండ్ వ్యూహాత్మక భాగస్వామ్యం కింద సహకారాన్ని ముందుకు తీసుకెళ్లడానికి, ఇరువురు నాయకులు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు. డిజిటల్ టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణలో ఏయే రంగాలకు ఎక్కువ ప్రాముఖ్యత ఇవ్వాలో స్పష్టంగా నిర్వచించడం, గుర్తించిన రంగాలలో అమలు చేయాల్సిన నిర్దిష్ట పనులు, ప్రాజెక్టులను ఖరారు చేయడం, ఈ ప్రణాళికలో సాధించిన పురోగతిని క్రమం తప్పకుండా ఫిన్లాండ్ విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు, భారత విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖకు సమర్పించడం సహా భవిష్యత్తు అవసరాలకు అనుగుణంగా ఒక నిర్దిష్ట కార్యాచరణ ప్రణాళికను రూపొందించాలని సంబంధిత అధ్యయన బృందాలను వారు ఆదేశించారు.
తన పర్యటన సందర్భంగా భారత్ చేసిన అద్భుతమైన ఏర్పాట్లకు గానూ ఫిన్లాండ్ అధ్యక్షుడు భారత ప్రధానమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా ఇరువురు నాయకులు తమ మధ్య స్వేచ్చగా జరిగిన నిర్మాణాత్మక చర్చల పట్ల సంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే, భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఇరు దేశాల మధ్య విస్తరిస్తున్న ప్రగతిశీల సహకారాన్ని వారు హర్షించారు. పరస్పర గౌరవం, సహకారంతో కూడిన బలమైన పునాదితో తమ సంబంధాలను కొనసాగించాలని వారు అంగీకరించారు. ఈ సందర్భంగా, తమ దేశాన్ని సందర్శించాల్సిందిగా ఫిన్లాండ్ అధ్యక్షుడు అలెగ్జాండర్ స్టబ్…ప్రధాని శ్రీ మోదీని ఆహ్వానించారు. ఫిన్లాండును సందర్శించేందుకు ప్రధాని శ్రీ నరేంద్రమోదీ అంగీకరించారు.
***
The Strategic Partnership in Digitalisation and Sustainability between India and Finland will create innumerable opportunities for the people of our nations! https://t.co/Lr0Yqa8Shl
— Narendra Modi (@narendramodi) March 5, 2026