పిఎంఇండియా
బ్లూమ్ బర్గ్ న్యూ ఎకనామిక్ ఫోరమ్ లో పాల్గొంటున్న మిస్టర్ మైకేల్ బ్లూమ్ బర్గ్, మేథావులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖ భాగస్వాములందరికీ శుభాకాంక్షలు.
బ్లూమ్ బర్గ్ ఫిలాంత్రొఫీస్ లో మైకేల్, ఆయన బృందం చేస్తున్న అద్భుతమైన కృషిని ప్రశంసిస్తూ నేను ప్రసంగం ప్రారంభిస్తున్నాను. భారత స్మార్ట్ సిటీల కార్యక్రమం రూపకల్పనకు ఆ బృందం చక్కని మద్దతు అందించింది.
మిత్రులారా,
మనం చరిత్రలో అత్యంత కీలక ఘట్టంలో ఉన్నాం. ప్రపంచ పౌరుల్లో సగం మందికి పైగా ఇప్పటికే పట్టణ ప్రాంతాల్లో నివశిస్తున్నారు. రాబోయే రెండు దశాబ్దాల కాలంలో భారతదేశం, కొన్ని ఆఫ్రికా దేశాల్లో భారీ ఎత్తున పట్టణీకరణ జరుగనుంది. ఇటీవల చెలరేగిన కోవిడ్-19 ప్రపంచానికి పెను సవాలు విసిరింది. నగరాలే మన వృద్ధికి చోదకశక్తులు అనే అంశంతో పాటు అవే ఇలాంటి మహమ్మారులు చెలరేగేందుకు ఆలవాలం అయిన ప్రాంతాలనే నిజం బయటపడింది. ప్రపంచ మహామాంద్యం తర్వాత తొలిసారిగా ప్రపంచంలోని పలు నగరాలు అత్యంత దారుణమైన ఆర్థిక తిరోగమనంలో పడినట్టు ప్రకటించుకున్నాయి. నగర జీవనానికి ప్రాతినిథ్యం వహిస్తున్న అత్యంత కీలకమైన వ్యవస్థలన్నీ ప్రశ్నార్ధకంగా మారాయి. సామాజిక కార్యక్రమాలు, క్రీడా కార్యక్రమాలు, విద్య, రిక్రియేషన్ వసతులు ఇంతకు ముందున్నట్టుగా లేవు. కుదేలైన వ్యవస్థలన్నింటినీ తిరిగి ఎలా ప్రారంభించాలా అనేదే ప్రపంచం యావత్తు ఎదుర్కొంటున్న పెద్ద ప్రశ్న. మార్పు లేకుండా తిరిగి ప్రారంభించడం సాధ్యం కాదు. మనిషి ఆలోచనా ధోరణిలో మార్పు, విధానాల్లో మార్పు, ఆచరణల్లో మార్పు…అన్నీ కీలకమే.
మిత్రులారా,
రెండు ప్రపంచ యుద్ధాల తర్వాత జరిగిన పునర్నిర్మాణం మనకి ఎన్నో పాఠాలు నేర్పింది. ప్రపంచ యుద్ధాల అనంతరం యావత్ ప్రపంచం సరికొత్త ప్రపంచ వ్యవస్థ దిశగా కృషి చేసింది. కొత్త కొత్త విధానాలకు రూపకల్పన జరిగింది. ప్రపంచం మొత్తం మారిపోయింది. అదే తరహాలో ప్రతీ ఒక్క రంగంలోనూ సరికొత్త విధానాలు ఆవిష్కరించే అవకాశం కోవిడ్-19 మనకి అందించింది. భవిష్యత్తులో ఎలాంటి ఆటుపోట్లనైనా తట్టుకోగల స్థాయిలో వ్యవస్థలను అభివృద్ధి చేయాలంటే ప్రపంచం ఈ అవకాశాన్నిఅందుకోవాలి. కోవిడ్ అనంతర శకంలో ప్రపంచ అవసరాల గురించి మనం ఆలోచించాలి. ప్రధానంగా మన పట్టణ కేంద్రాలను పునరుజ్జీవింపచేయడం ఈ దిశగా మంచి ప్రారంభం అవుతుంది.
మిత్రులారా,
భారతీయ నగరాల గురించిన సానుకూలమైన కోణాన్ని కూడా ఈ సందర్భంగా మీతో పంచుకోవాలనుకుంటున్నాను. అత్యంత క్లిష్టమైన ప్రస్తుత వాతావరణంలో భారతీయ నగరాలు అసాధారణమైన ఉదాహరణ మన ముందుంచాయి. ఈ కల్లోలం సందర్భంగా విధించిన లాక్ డౌన్ చర్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా పలు నగరాలు ప్రతిఘటన కనబరిచాయి. కాని భారతీయ నగరాలు కట్టుదిట్టంగా నిషేధ ఆజ్ఞలను పాటించాయి. మా నగరాలు కాంక్రీట్ తో నిర్మించినవి మాత్రమే కాదు, చక్కని సమాజంతో నిర్మాణమైనవి కావడమే ఇందుకు కారణం. సమాజానికే కాదు, వ్యాపారాలకు కూడా అతి పెద్ద వనరు ప్రజలే అన్న విషయాన్ని ఈ మహమ్మారి మనందరికీ చాటి చెప్పింది. ఈ కీలకమైన, మౌలిక వనరును ఆలంబన చేసుకుని నిర్మాణం చేపట్టడం కోవిడ్ అనంతర ప్రపంచంలో అత్యంత కీలకం. నగరాలు వృద్ధికి చోదకశక్తులు, సమాజానికి అవసరమైన మార్పునకు దారి చూపగల శక్తికేంద్రాలు.
నగరాలు ఉపాధిని అందిస్తాయి గనుకనే ప్రజలు తరచు నగరాలకు వలస వస్తారు. అలాంటి నగరాలు ప్రజల కోసం పని చేసేలా చేయాల్సిన బాధ్యత మనపై ఉన్నది కదా? నగరాలు ప్రజల నివాసానికి మరింత అనువైనవిగా తీర్చి దిద్దడానికి వీలుగా విధానాల్లో వేగం పెంచే అవకాశం కోవిడ్-19 మనకి ఇచ్చింది. మంచి గృహ వసతి, మంచి పని వాతావరణం, తక్కువ దూరం ప్రయాణం వంటి మార్పులు చాలా అవసరం. లాక్ డౌన్ సమయంలో పలు నగరాల్లో సరస్సులు, నదులు, చివరికి గాలి కూడా స్వచ్ఛంగా మారాయి. గతంలో లేని విధంగా పక్షుల కిలకిలారావాలు కూడా మనలో చాలా మంది చూశాం. ఏదో గాలివాటంగా లభించే అవకాశంగా కాకుండా ఈ లక్షణాలన్నీ శాశ్వతంగా కనిపించే స్థిరమైన నగరాలు మనం నిర్మించలేమా? నగరాల్లో ఉండే సౌకర్యాలతో పాటు గ్రామాల్లో ఉండే స్ఫూర్తికి ఆలవాలం అయిన పట్టణ కేంద్రాలు నిర్మించడం మా లక్ష్యం.
మిత్రులారా,
ఈ మహమ్మారి కాలంలో మన పనుల్లో మనం నిమగ్నం కావడానికి టెక్నాలజీ ఎంతో సహాయకారిగా నిలిచింది. వీడియో కాన్ఫరెన్సింగ్ వంటి అద్భుతమైన పరికరం సహాయంతో నేను పలు సమావేశాల్లో పాల్గొన్నాను. దూరాన్ని తగ్గించుకుని మీ అందరితో మాట్లాడే అవకాశం అది నాకు కల్పించింది. కాని ఇది కోవిడ్ అనంతర ప్రపంచానికి సంబంధించి ఒక ప్రశ్నను కూడా మన ముందుంచింది. కోవిడ్ అనంతర ప్రపంచంలో కూడా మనం ఇదే తరహా వీడియో కాన్ఫరెన్సింగ్ విధానాన్ని కొనసాగించవచ్చునా లేక సమావేశాల్లో పాల్గొనేందుకు సదూర ప్రాంతాలకు ప్రయాణాలు చేయాలా? పట్టణ వ్యవస్థలపై ఒత్తిడి తగ్గించే అవకాశం మన ఎంపిక పైనే ఉంటుంది.
మనకి లభించిన ఈ అవకాశం పని-వ్యక్తిగత జీవిత సమతూకానికి కూడా ఉపయోగపడుతుంది. నేటి నవతరంలో ప్రజలు ఎక్కడ నుంచైనా పని చేసే, ఎక్కడైనా జీవించే, ఎక్కడ నుంచైనా ప్రపంచ సరఫరా వ్యవస్థలను ఉపయోగించుకునే అవకాశంలో ప్రజలకు సాధికారత అందించడం అత్యంత కీలకం. ఈ అంశాన్ని దృష్టిలో ఉంచుకునే మేం టెక్నాలజీ, మేథో సంపత్తి ఆధారిత సేవల రంగానికి సరళీకృత మార్గదర్శకాలు ప్రకటించాం, ఇది “ఇంటి నుంచే పని“, “ఎక్కడ నుంచైనా పని“కి అవకాశం కల్పిస్తుంది.
మిత్రులారా,
అఫర్డబుల్ నివాస గృహాలు లేకుండా మన నగరాలు సుసంపన్నం కాలేవు. ఈ అంశాన్ని గుర్తించి 2015 సంవత్సరంలో మేం అందరికీ గృహవసతి పథకం ప్రారంభించాం. ఆ కార్యక్రమం లక్ష్యాన్ని చేరే దిశగా మేం పురోగమిస్తున్నాం అని చెప్పడానికి నేను సంతోషిస్తున్నాను. నిర్దేశిత 2022 లక్ష్యం లోగానే సొంత ఇళ్లను ఆశిస్తున్న 10 మిలియన్ కుటుంబాలకు మేం ఇళ్లు అందించబోతున్నాం. కరోనా మహమ్మారి సృష్టించిన పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని అందుబాటు ధరల్లో అద్దె ఇళ్ల నిర్మాణం కూడా మేం చేపట్టాం. రియల్ ఎస్టేట్ నియంత్రణ చట్టం తీసుకువచ్చాం. రియల్ ఎస్టేట్ రంగం ముఖచిత్రాన్ని ఇది మార్చేసింది. కస్టమర్ ప్రాధాన్య, పారదర్శక రంగంగా అది మారింది.
మిత్రులారా,
ఎలాంటి విపత్తులనైనా తట్టుకుని నిలబడగల నగరాల నిర్మాణానికి ఆధారనీయమైన రవాణా వ్యవస్థ కీలకం. ఇందులో భాగంగా 27 నగరాల్లో మెట్రో రైల్వే వ్యవస్థ నిర్మాణం పనులు పురోగతిలో ఉన్నాయి. 2022 నాటికి 1000 కిలోమీటర్ల మెట్రో రైలు వ్యవస్థ మైలురాయిని చేరేందుకు మేం సిద్ధంగా ఉన్నాం. మా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమానికి ఇచ్చిన ప్రాధాన్యం రవాణా వ్యవస్థల దేశీయ సామర్థ్యాల అభివృద్ధికి దారి తీసింది. ఇది ఆధారనీయ రవాణా వ్యవస్థల లక్ష్యాన్ని చేరడానికి మాకు ఎంతో సహాయకారిగా నిలిచే అంశం.
మిత్రులారా,
ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకునే సుసంపన్నమైన ఆకర్షణీయ నగరాలకు టెక్నాలజీ కీలక పునాది. నగరాన్ని సమర్థవంతంగా నిర్వహించేందుకు, అనుసంధానిత సమాజాల నిర్మాణానికి టెక్నాలజీ ఎంతగానో ఉపయోగపడుతుంది. విద్య, ఆరోగ్య సంరక్షణ, షాపింగ్, ఆహార రంగాలన్నింటిలోనూ అధిక శాతం ఆన్ లైన్ కార్యకలాపాలకే ప్రాధాన్యం ఉండే భవిష్యత్ నిర్మాణం కోసం మేం ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం. మా నగరాలు ఇటు భౌతిక, అటు డిజిటల్ ప్రపంచాల సమ్మిళిత స్థితికి సమాయత్తం కావలసిన అవసరం ఉంది. మా డిజిటల్ ఇండియా, స్టార్టప్ ఇండియా కార్యక్రమాలు ఈ రంగాల్లో సామర్థ్యాల నిర్మాణానికి దోహదపడుతున్నాయి. రెండంచెల విధానం ద్వారా మేం 100 స్మార్ట్ నగరాలను ఎంపిక చేశాం. సహకార, పోటీతత్వంతో కూడిన ఫెడరలిజం సిద్ధాంతంతో జాతీయ స్థాయిలో పోటీని ప్రోత్సహించే చర్య ఇది.
ఈ నగరాలన్నీ కలిసి సుమారు రూ.2 లక్షల కోట్లు లేదా 30 బిలియన్ డాలర్ల విలువ గల ప్రాజెక్టులు సిద్ధం చేసుకున్నాయి. వాటిలో ఒక లక్ష కోట్ల రూపాయలు లేదా 20 బిలియన్ డాలర్ల విలువ గల ప్రాజెక్టులు పూర్తవడం లేదా పూర్తయ్యే దశలో ఉన్నాయి. టెక్నాలజీ శక్తిని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు పలు నగరాల్లో ఇంటిగ్రేటెడ్ కమాండ్, కంట్రోల్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది. పలు నగరాల్లో కోవిడ్ పరిస్థితిని పర్యవేక్షించేందుకు ఈ కేంద్రాలే ఇప్పుడు వార్ రూమ్ లుగా కూడా ఉపయోగపడుతున్నాయి.
చివరిగా మీకు నేను ఒక విషయం గుర్తు చేస్తున్నాను. పట్టణీకరణలో పెట్టుబడులకు మీరు ఎదురు చూస్తున్నట్టయితే భారతదేశం ఆకర్షణీయమైన అవకాశాలు అందిస్తోంది. రవాణా వ్యవస్థలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్ లో అపార అవకాశాలున్నాయి. ఇన్నోవేషన్ లో ఇన్వెస్ట్ చేయాలని భావిస్తుంటే భారతదేశం అపార అవకాశాల గనిగా ఉంది. మీరు స్థిరమైన సొల్యూషన్లలో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే భారత్ ఎంతో ఆకర్షణీయ గమ్యం. చలనశీలమైన ప్రజాస్వామ్యం, వ్యాపారానుకూల వాతావరణం, అతి పెద్ద మార్కెట్ తో కలిసి ఈ అవకాశాలు మీ ముంగిట ఉన్నాయి. అలాగే భారత ప్రభుత్వం దేశాన్ని ఆకర్షణీయమైన ప్రపంచ పెట్టుబడుల కేంద్రంగా మార్చేందుకు అందుబాటులో ఉన్న ఏ అవకాశాన్ని వదలాలనుకోవడంలేదు.
మిత్రులారా,
పట్టణ పరివర్తన బాటలో ఇప్పటికే ఇండియా పురోగమిస్తోంది. ఇందులో కీలక పాత్ర పోషించగల రంగాలు, పౌర సమాజం, విద్యా సంస్థలు, పరిశ్రమ, అన్నింటి కన్నా ముఖ్యంగా పౌరులు, సమాజాల భాగస్వామ్యంతో ఎలాంటి ప్రతికూలతలనైనా తట్టుకోగల, సుసంపన్నమైన ప్రపంచ నగరాల నిర్మాణం కలను మేం సాకారం చేసుకోగలమనడంలో ఎలాంటి సందేహం లేదు.
ధన్యవాదాలు.
***
Addressing 3rd Annual Bloomberg New Economy Forum. https://t.co/QnSW1pzpNf
— Narendra Modi (@narendramodi) November 17, 2020
One of the areas that requires global attention in the post-COVID era is ensuring urban rejuvenation. pic.twitter.com/rvuM17BN6a
— Narendra Modi (@narendramodi) November 18, 2020
The need of the hour:
— Narendra Modi (@narendramodi) November 18, 2020
Affordable housing.
Sustainable mobility. pic.twitter.com/K8jQicm0j0
India offers investors exactly what they need...
— Narendra Modi (@narendramodi) November 18, 2020
Come, invest in India. pic.twitter.com/r7Cb455sid