Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశం- తుర్కీ వ్యాపార శిఖరాగ్ర సభలో ప్రధాన మంత్రి ప్రసంగం (మే 01, 2017)

భారతదేశం- తుర్కీ వ్యాపార శిఖరాగ్ర సభలో ప్రధాన మంత్రి ప్రసంగం (మే 01, 2017)

భారతదేశం- తుర్కీ వ్యాపార శిఖరాగ్ర సభలో ప్రధాన మంత్రి ప్రసంగం (మే 01, 2017)


శ్రేష్ఠులైన రిపబ్లిక్ ఆఫ్ తుర్కీ ప్రెసిడెంట్ శ్రీ రెసెప్ తయ్యిప్ ఎర్దోగాన్,

మాననీయ మంత్రులు,

తుర్కీ ప్రతినిధి వర్గం సభ్యులు,

భారతీయ వ్యాపార సమాజానికి చెందిన మిత్రులు,

సోదర, సోదరీమణులారా,

ఈ రోజు ప్రముఖ వ్యాపారవేత్తలతో మాట్లాడే అవకాశం వచ్చినందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అధ్యక్షుల వారు శ్రీ ఎర్దోగాన్ కు మరియు ఇక్కడకు విచ్చేసిన మన తుర్కీ మిత్రులందరికీ నేను సాదర స్వాగతం పలుకుతున్నాను. ప్రెసిడెంట్ శ్రీ ఎర్దోగాన్ వెంట పెద్ద సంఖ్యలో వ్యాపార ప్రతినిధులు రావడం చాలా సంతోషకరమైన విషయం. వారితో పాటు భారతదేశానికి చెందిన వ్యాపారవేత్తలు పాల్గొనడం పట్ల కూడా నాకు చాలా ఆనందంగా ఉంది.

మిత్రులారా ,

భారతదేశం, తుర్కీ ఎంతో గొప్ప చారిత్రిక, సాంస్కృతిక సంబంధాలు కలిగివున్నాయి. ప్రస్తుత ప్రపంచ ఆర్ధిక పరిస్థితిపై కూడా ఇరు దేశాలూ ఒకే రకమైన అభిప్రాయంతో ఉన్నాయి.

ప్రస్తుత పరిస్థితుల్లో, ప్రతి ద్వైపాక్షిక సంబంధానికీ ఆర్ధిక సహకారమే ఒక ముఖ్యమైన అంశంగా ఉంది. భారతదేశం, తుర్కీ మంచి ఆర్ధిక సంబంధాలను కలిగివున్నాయి. గత అనేక సంవత్సరాలు గా మన ద్వైపాక్షిక వాణిజ్యంలో వృద్ధి చాలా ఆకట్టుకునే విధంగా ఉంది. ప్రెసిడెంట్ శ్రీ ఎర్దోగాన్ కిందటిసారి భారతదేశంలో జరిపిన పర్యటన అనంతరం ద్వైపాక్షిక వాణిజ్యం గణనీయంగా పెరిగిందని నేను అనుకుంటున్నాను. 2008 లో 2.8 బిలియన్ యుఎస్ డాలర్లు గా ఉండగా, 2016 లో ఇది 6.24 బిలియన్ కు పెరిగింది. ఇది ప్రోత్సాహకరంగా ఉన్నప్పటికీ, ప్రస్తుత ఆర్ధిక, వాణిజ్య సంబంధాల వాస్తవ సామర్ధ్య స్థాయికి సరిపడినంతగా లేదు.

మిత్రులారా,

ప్రపంచం లోని 20 అతి పెద్ద ఆర్ధిక వ్యవస్థల్లో భారతదేశం, తుర్కీ కూడా ఉన్నాయి. మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే, ప్రపంచ వ్యాప్తంగా అస్థిర ఆర్ధిక పరిస్థితులు నెలకొన్న సమయంలో కూడా రెండు ఆర్ధిక వ్యవస్థల్లో చెప్పుకోదగ్గ స్థిరత్వం కొనసాగింది. మన ఆర్ధిక వ్యవస్థలు బలమైన ప్రాథమిక సూత్రాలపై ఆధారపడి ఉన్నాయి. ఈ కారణంగానే, మన ఆర్ధిక అవకాశాలపై మనం ఆశాజనకంగా ఉన్నాం. ఇరు దేశాల ప్రజల మధ్య పరస్పరం అపారమైన సౌమనస్యం ఉంది. పటిష్టమైన రాజకీయ సంబంధాలు నిర్మించుకోవడం కోసం మనం కృషి చేస్తున్న సమయం లోనే మన ఆర్ధిక సంబంధాలను బలోపేతం చేసుకోడానికి మరింత కృషి జరపవలసిన సమయం కూడా ఆసన్నమైంది. ఎంతో కాలంగా పరస్పరం వ్యాపారం చేసుకుంటున్న చరిత్ర మనకు ఉంది. ఆ గొప్ప వారసత్వ పునాదులను మనం సుదృఢపరచుకోవలసి ఉంది.

ద్వైపాక్షిక సంబంధాలను మెరుగుపరచుకోడానికి అవసరమైన భారీ సామర్ధ్యం మనకు ఉంది. వాణిజ్యం, ప్రత్యక్ష విదేశీ పెట్టుబడులు, సాంకేతిక ఒప్పందాలు, వివిధ ప్రాజెక్టులలో సహకారం ద్వారా ఇది సాధ్యపడుతుంది. ఈ విషయంలో, భారత దేశంలో తుర్కీ కంపెనీల భాగస్వామ్యం లో కొంత పెరుగుదలను మనం గమనించాం. గత కొన్ని సంవత్సరాల్లో భారతీయ బ్లూ చిప్ కంపెనీలలో పెట్టుబడి ద్వారానూ, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల ద్వారానూ ఇది సాధ్యమైంది. అయితే, ఆ సహకారం చిన్న, మధ్య తరహా సంస్థలవరకు చేరాలి. ఈ రోజున విజ్ఞానం ఆధారంగానే ప్రపంచ ఆర్ధిక వ్యవస్థ నిరంతరాయంగా కొత్త ప్రాంతాలకు విస్తరిస్తోంది. మన ఆర్ధిక, వాణిజ్య సంప్రదింపుల్లో దీన్ని ఒక కారకంగా ఉపయోగించుకోవాలి.

వ్యాపారానికి అనువైన వాతావరణాన్ని కల్పించడానికి ఇరు వైపుల ప్రభుత్వాలు కట్టుబడి ఉన్న పరిస్థితి ని మీరు గమనించవచ్చు. అయితే, ఈ విషయంలో, మీ వంటి వ్యాపార వేత్తలే – రెండు దేశాల పరస్పర ప్రయోజనం కోసం జాతీయ లక్ష్యానికి వాస్తవ రూపం కల్పించాలి.

మిత్రులారా,

భారతీయ రాజకీయ విధానం ఉత్సాహపూరితమైన, సార్వత్రికమైన, భాగస్వామ్య ప్రజాస్వామ్య విధానంగా గుర్తింపు పొందింది. రాజకీయ, పరిపాలనా ప్రక్రియల్లో స్థిరత్వం, న్యాయబద్ధమైన పరిపాలన మా విధానం యొక్క ముఖ్య లక్షణం. ఏదైనా ముఖ్యమైన దీర్ఘకాలిక ఆర్ధిక ఒప్పందానికి ప్రధానంగా పరిగణన లోకి తీసుకునే అంశాలు ఇవే.

మూడేళ్ళ క్రితం ఇదే నెలలో నా ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. అప్పటి నుండి, ఆర్ధిక విధానాలను, పరిపాలనా పరమైన విధానాలను సంస్కరించడానికి మేం అనేక చర్యలు చేపట్టాం. ‘మేక్-ఇన్-ఇండియా’, ‘స్టార్ట్-అప్-ఇండియా’, ‘డిజిటల్ ఇండియా’ ల వంటి పలు ముఖ్యమైన కార్యక్రమాలను కూడా మేం ప్రారంభించాం. వీటి ఫలితాలు భారతదేశ ఆర్ధిక వ్యవస్థ పురోగతిలో ఇప్పటికే మనకు గోచరమవుతున్నాయి. భారత ఆర్ధిక వ్యవస్థ ఈ రోజు ప్రపంచంలో అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న భారీ ఆర్ధిక వ్యవస్థగా ఉంది. ఈ ప్రత్యేకతను కొనసాగిస్తూనే విధానం లో ఉన్న అసమర్ధతలను తొలగించడం పై కూడా మేం దృష్టి పెట్టాం. మేం నవీన భారతాన్ని నిర్మించే ప్రక్రియలో నిమగ్నమై ఉన్నాం. అందువల్ల, మా దృష్టి అంతా పనిని, ముఖ్యంగా వ్యాపారాన్ని సులభతరం చెయ్యడం పైనే ఉంది. ఇందులో విధానాలు, ప్రక్రియలు, పద్దతుల సంస్కరణ ఉంది. ఇందులో పరిస్థితులను కల్పించడం, స్వదేశీ, విదేశీ పెట్టుబడులను సమకూర్చడం కూడా ఉన్నాయి.

ఈ విషయంలో మేం ఎంతో విజయాన్నీ, గుర్తింపు ను సాధించాం. అంతర్జాతీయ ర్యాంకింగ్ లో మేము చాలా సోపానాలను అధిరోహించాం. అయితే, ఇదంతా రోజూ జరిగేదే. అందువల్ల ఇది కొనసాగవలసిందే. ప్రాథమికంగా ఇది వైఖరిలోను, విధానంలోను ఒక మార్పు. ప్రజలు వారి సామర్ధ్యాన్ని తెలుసుకునేందుకు భారతదేశాన్ని ఒక స్థావరంగా తీర్చిదిద్దడం దీని లక్ష్యం. ఇది, ముఖ్యంగా మన యువతకు ఉపాధి, స్వయం ఉపాధి అవకాశాలను కల్పించడానికి అవసరం. ఇటీవలి వస్తువులు, సేవల చట్టం (జిఎస్ టి) నా ప్రభుత్వం తీసుకున్న అటువంటి మరొక చర్య. ఇది, దేశంలో ఒకే రకమైన, సమర్ధమైన వ్యాపార వాతావరణం ఏర్పాటు చేయాలన్న ఒక పాత డిమాండు.

తుర్కీకి చెందిన నిర్మాణ కంపెనీలు ఇతర దేశాల్లో చాలా నిర్మాణాలను, మౌలిక సదుపాయాల ప్రాజెక్టులను విజయవంతంగా చేపట్టారని నాకు తెలుసు. కీలక రంగాలతో పాటు సామాజిక, పారిశ్రామిక సదుపాయాలతో సహా మా మౌలిక సదుపాయాల అవసరాలు చాలా ఉన్నాయి మేం వాటిని సత్వరమే, పటిష్టంగా నిర్మించాలన్న ఆత్రుతతో ఉన్నాం. తుర్కీకి చెందిన సంస్థలు ఈ పనిలో సులువుగా పాల్గొనవచ్చు. ఈ విషయమై మీకు కొన్ని ఉదాహరణలు చెబుతాను :

2022 నాటికి 50 మిలియన్ గృహాలు నిర్మించాలని మేం ప్రణాళిక తయారుచేశాం. ఇందుకోసం, నిర్మాణ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల విధానాన్ని తరచుగా సవరించాం.

50 నగరాల్లో మెట్రో రైలు ప్రాజెక్టులు, వివిధ జాతీయ మార్గాల్లో హై స్పీడ్ రైళ్లు ప్రారంభించాలని సంకల్పించాం.

వచ్చే కొన్ని సంవత్సరాలలో 175 గీగా వాట్ల నవీకరణయోగ్య విద్యుత్తు ఉత్పత్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నాం.

విద్యుత్తు ఉత్పత్తి తో పాటు, సరఫరా, నిల్వ, పంపిణీ లు కూడా మాకు చాలా ముఖ్యమైనవి.

మా రైల్వేలను ఆధునీకరిస్తున్నాం. రహదారులను అభివృద్ధి చేస్తున్నాం. గడచిన మూడేళ్ళలో మేం ఈ రెండు రంగాలకు అత్యధికంగా నిధులు కేటాయించాం.

‘సాగరమాల’ పేరుతో ఒక ప్రతిష్టాత్మక ప్రణాళిక ద్వారా కొత్త ఓడ రేవులను నిర్మిస్తున్నాము. పాత వాటిని ఆధునీకరిస్తున్నాం.

ఆర్ధిక, పర్యాటక ప్రాముఖ్యం ఉన్న ప్రదేశాలకు మార్గాలను విస్తృత పరిచేందుకు వీలుగా ప్రస్తుతం ఉన్న విమానాశ్రయాల అభివృద్ధి, ప్రాంతీయ విమానాశ్రయాల ఏర్పాటు పై కూడా ఇదే విధమైన దృష్టి సారిస్తున్నాము.

తుర్కీ పర్యాటక రంగం అంతర్జాతీయంగా ప్రసిద్ధి చెందింది. గత కొన్ని సంవత్సరాలలో తుర్కీని సందర్శించే భారతీయ పర్యాటకుల సంఖ్య పెరిగింది. భారతీయ చలనచిత్రాలు, టెలివిజన్ కార్యక్రమాల చిత్రీకరణకు తుర్కీ ఒక ఆకర్షణీయమైన గమ్యంగా కూడా మారింది. మనం రెండు వైపుల పర్యాటకాన్ని ఖచ్చితంగా ప్రోత్సహిస్తే, ఈ ప్రాంతంలో ఈ రంగానికి గల అపార అవకాశాలను వెలికి తీయవచ్చు. ఈ విషయంలో ఎంతో ఉత్సాహభరితమైన మన ప్రాంతీయ చలనచిత్ర పరిశ్రమను ఒక ఉదాహరణగా తీసుకోవచ్చు.

భారతదేశం, తుర్కీ లు రెండూ శక్తి లోటు గల దేశాలని మనకు తెలుసు. అలాగే, మన శక్తి సంబంధ అవసరాలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి. అదే విధంగా హైడ్రోకార్బన్ రంగం కూడా రెండు దేశాలకూ ఉమ్మడి ప్రయోజనాన్ని చేకూర్చే అంశం. ఈ విషయం కూడా సౌర శక్తి, పవన విద్యుత్తు లకు సంబంధించిందే.

అందువల్ల, శక్తి రంగం మన ద్వైపాక్షిక సంబంధాలకు ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తోంది. అదే విధంగా, గనుల తవ్వకం, ఫూడ్ ప్రాసెసింగ్ రంగాలు గొప్ప ప్రాముఖ్యం కలిగిన ఇతర రంగాలుగా ఉన్నాయి. మనం మన సామర్ధ్యాలను వస్త్రాలు, ఆటో రంగాలలో కూడా పరస్పరం సమీకరించుకోవచ్చు. తుర్కీ పటిష్టమైన తయారీ రంగాన్ని కలిగి ఉంది. భారతదేశం తక్కువ ఖర్చుతో తయారీ కి పేరు తెచ్చుకున్న దేశంగా ఉంది. ఖర్చు విషయంతో పాటు, మా దగ్గర పెద్ద సంఖ్య లో నైపుణ్యం కలిగిన, అర్థ నైపుణ్యం కలిగిన కార్మికులు కూడా ఉన్నారు. పటిష్టమైన పరిశోధన, అభివృద్ధి సామర్ధ్యాలు ఉన్నాయి.

ఆర్ధిక, సాంకేతిక సహకారం పై ఏర్పాటైన భారతదేశం-తుర్కీ సంయుక్త సంఘం యంత్రాంగం బాగా పనిచేస్తోందని తెలుసుకుని నేను సంతోషించాను. రెండు వైపులా వాణిజ్యం, పెట్టుబడుల అభివృద్ధికి తీసుకోవలసిన చర్యలపై ఈ సంఘం తదుపరి సమావేశంలో సమీక్షించవచ్చును.

అదే విధంగా, రెండు దేశాల్లో ఉన్న వాణిజ్య, పరిశ్రమ రంగ సమాఖ్యలను పరస్పరం చురుకుగా పనిలో నిమగ్నం కావలసిందని నేను కోరుతున్నాను. ప్రభుత్వ స్థాయి లోనూ, బి-2-బి స్థాయి లోనూ మన ప్రక్రియలన్నీ సన్నిహితంగా పనిచేయాలి.

ఈ రోజు సదస్సుకు హాజరైన ప్రెసిడెంట్ ఎర్దోగాన్ గారికీ, ప్రతినిధివర్గ సభ్యులకు, భారతదేశం, తుర్కీ వ్యాపార మండళ్ల సభ్యులకు నా ధన్యవాదాలు తెలియజేయాలనుకుంటున్నాను. భారతదేశానికి, తుర్కీ కి చెందిన వ్యాపార వర్గాలను ఒక చోటులో కలుసుకొనేటట్లు చేసిన ఈ అవకాశం నిజంగా ఒక శ్రేష్ఠమైన అవకాశం.

మిత్రులారా,

మన ప్రజల సంక్షేమం కోసం మన ఆర్ధిక కార్యకలాపాల స్థాయిని పెంచే దిశగా మనం కలిసి పనిచేద్దాం

భారతదేశం గతంలో ఎన్నడూ లేనంత ఎక్కువ వాగ్దానభరిత గమ్యస్థానంగా అలరారుతోందన్న సంగతిని నేను ధీమాగా చెప్పగలను.

దీనిని మరింత మెరుగుపరచేందుకు నేను వ్యక్తిగతంగా శ్రద్ధను, సహకారాన్ని అందిస్తానని మీకు హామీ ఇస్తున్నాను.

మీ అందరికీ ధన్యవాదాలు.