Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

భారతదేశ 70వ స్వాతంత్య్ర దినం సందర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి దేశ ప్రజలను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ చేసిన ప్ర‌సంగం పూర్తి పాఠం

భారతదేశ 70వ స్వాతంత్య్ర దినం సందర్భంగా ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి   దేశ ప్రజలను ఉద్దేశించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర‌ మోదీ చేసిన ప్ర‌సంగం పూర్తి పాఠం


ప్రియ‌మైన నా దేశ‌ వాసులారా,

ఈ ప‌విత్ర స్వాతంత్య్ర దినోత్స‌వ శుభ‌ స‌మ‌యాన 125 కోట్ల మంది భార‌తీయులు మరియు ప్రపంచంలోని వివిధ దేశాలలో నివ‌సిస్తున్న భార‌తీయ సంత‌తి వారికి అందరికీ ఈ ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి నేను అనేకానేక శుభాకాంక్ష‌లు తెలియ‌చేస్తున్నాను. ఈ 70వ స్వాతంత్ర్య దినోత్స‌వ వేళ మ‌నంద‌రం దేశాన్ని మ‌రింత ఉన్న‌త శిఖ‌రాల‌కు తీసుకువెళ్ళ‌డానికి స‌రికొత్త తీర్మానం చేసుకుందాం. మ‌రింత కొత్త స్ఫూర్తితో, ఉత్తేజంతో ముందుకు సాగుదాం. మ‌న స్వాతంత్ర్యం మ‌న‌కు మ‌న స్వ‌తంత్ర‌తా సేనానుల మ‌హోన్న‌త త్యాగాల‌ను గుర్తు చేస్తుంది. దేశ‌ స్వాతంత్ర్య కాంక్ష‌తో ఉరికంబాల‌ను తమంత తాము కౌగ‌లించుకున్న యువ‌కుల‌ను మ‌నం స్మ‌రించుకుందాం. మ‌నం ఇలా స్వేచ్ఛా వాయువులు పీల్చుకోవ‌డానికి అహ‌ర్నిశ‌లు అవిశ్రాంతంగా అలుపు లేని పోరాటం చేసిన‌ మ‌హాత్మ గాంధీ, స‌ర్దార్ ప‌టేల్‌, పండిట్ నెహ్రూ వంటి నేత‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలియ‌చేసుకుందాం. భార‌తదేశం ఒక ప్రాచీన దేశం. వేలాది కోట్ల సంవ‌త్స‌రాల చారిత్ర‌క‌, సాంస్కృతిక వార‌స‌త్వ సంప‌ద మ‌న‌కుంది. వేదాల నుండి వివేకానంద వ‌ర‌కు, ఉప‌నిష‌త్తుల నుండి ఆధునిక ఉప‌గ్ర‌హాల వ‌ర‌కు, కృష్ణ ప‌ర‌మాత్మ నుండి మ‌హాత్మాగాంధీ వ‌ర‌కు, భీముని నుండి భీమ్ రావు వ‌ర‌కు ఈ వార‌స‌త్వంలో మ‌న‌ని స్ఫూర్తిమంతం చేయ‌గ‌ల ఎంద‌రో మ‌హానుభావులు మ‌న‌కున్నారు. ఈ భూమి ఎన్నో ఉత్థాన‌ ప‌త‌నాలను చూసింది. కొత్త త‌రాల పాటు పోరాడింది. మాన‌వ‌ జీవనాన్ని మ‌రింత మెరుగ్గా తీర్చిదిద్దేందుకు వారిలో ఎంద‌రో త‌మ జీవితాల‌ను అంకితం చేశారు. భార‌త‌దేశం కేవ‌లం 70 సంవ‌త్స‌రాల చ‌రిత్ర గ‌ల దేశం కాదు. వ‌ల‌స‌ పాల‌న‌కు తెర దిగిన త‌రువాత జ‌రిగిన ఏడు ద‌శాబ్దాల ప‌య‌నంగా మాత్ర‌మే దీన్ని మ‌నం చూడాలి. స్వాతంత్ర్య సిద్ధి తరువాత స‌రికొత్త వ్య‌వ‌స్థ‌లో ఈ దేశాన్ని ముందుకు న‌డిపించ‌డానికి మ‌నం ఎంతో కృషి చేశాం. స‌ర్దార్‌ ప‌టేల్ ఈ దేశాన్ని ఏకం చేశారు. ఇప్పుడు మ‌నం దీనిని అత్యుత్త‌మ జాతిగా తీర్చిదిద్దుదాం. ‘ఏక్ భార‌త్- శ్రేష్ఠ భార‌త్’ క‌లను నిజం చేసేందుకు మ‌నంద‌రం నిరంత‌రం కృషి చేయాల్సిన అవ‌స‌రం ఉంది.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, ఏ మాత్రం మూల్యం చెల్లించ‌కుండా ఈ స్వాతంత్ర్యం మ‌న‌కి అయాచితంగా సిద్ధించ‌లేదు. మ‌న‌పై అంతులేన‌న్ని దురాగ‌తాలు జ‌రిగాయి, కానీ మ‌న క‌ట్టుబాటు అత్యంత దృఢ‌మైన‌ది. స్వాతంత్ర్య ఉద్య‌మంలో ప్ర‌తి ఒక్క భార‌తీయుడు ఒక సేనానిగా నిలిచాడు. ప్ర‌తి ఒక్క‌రూ దేశ స్వాతంత్ర్యాన్ని కాంక్షించారు. ఎవ‌రో ఒక్క‌రు క‌ట‌కటాల వెన‌క్కి వెళ్ళ‌క‌పోయి ఉండ‌వ‌చ్చు, ఎవ‌రో ఒక‌రు త్యాగం చేసి ఉండ‌క‌పోవ‌చ్చు.. కానీ ప్ర‌తి ఒక్క భార‌తీయుడు స్వాతంత్ర్యాన్ని కాంక్షించాడు. మ‌హాత్మ గాంధీ నాయ‌కుడుగా ముందు నిలచారు. ఎంద‌రో సాయుధ తిరుగుబాటుదారుల త్యాగాలు స్వ‌రాజ్యానికి స్ఫూర్తిగా నిలచాయి. ఇప్పుడు స్వ‌యంపాల‌న‌ను స‌త్ప‌రిపాల‌న‌గా తీర్చి దిద్దుకోవ‌డం 125 కోట్ల మంది భార‌తీయుల సంక‌ల్పం. త్యాగాలే స్వ‌రాజ్య సాధ‌న‌కు బాట‌లు వేసిన‌ప్పుడు సురాజ్య సాధ‌నకు (స‌త్ప‌రిపాల‌న‌) కూడా ఎన్నో త్యాగాలు, ఎంతో సాహ‌సం, దీక్ష‌, క్ర‌మ‌శిక్ష‌ణలు అవ‌స‌రం. ఈ స‌త్ప‌రిపాల‌న కాంక్ష‌తో 125 కోట్ల మంది భార‌తీయుల వ్య‌క్తిగ‌త బాధ్య‌త‌లు, క‌ట్టుబాటు లతో ముందుకు సాగుదాం. పంచాయ‌తీరాజ్ నుండి పార్ల‌మెంటు వ‌ర‌కు, గ్రామ ప్ర‌ధాన్ నుండి ప్ర‌ధానమంత్రి వ‌ర‌కు ప్ర‌తి ఒక్క‌రూ స‌త్ప‌రిపాల‌నలో భాగంగా ప్ర‌తి ఒక్క ప్ర‌జాస్వామ్య సంస్థ‌ను ప‌టిష్ఠం చేసే క్ర‌మంలో వారి బాధ్య‌త‌లను నెర‌వేర్చాలి. అప్పుడే స‌త్ప‌రిపాల‌న ల‌క్ష్యాన్ని దేశం త్వ‌రితంగా చేరుకోగ‌లుగుతుంది. భార‌తదేశం ఎన్నో స‌మ‌స్య‌లు ఎదుర్కొంటున్న మాట వాస్త‌వం. కానీ, స‌మ‌స్య‌లు ముందుంటే వాటిని ప‌రిష్క‌రించుకోగ‌ల సామ‌ర్థ్యాలు కూడా మ‌న‌కు ఉన్నాయన్న విష‌యాన్ని మ‌రచిపోకూడ‌దు. ప్ర‌తి ఒక్క‌రూ వారి సామ‌ర్థ్యాల‌తో ముందుకు సాగితే, ప‌రిష్కార మార్గాలు తెరచుకుంటాయి. కాబట్టి ప్రియ‌మైన నా సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, భార‌తదేశానికి ల‌క్ష‌లాది స‌మ‌స్య‌లు ఉన్నప్పటికీ వాటిని ప‌రిష్క‌రించ‌గ‌ల సామ‌ర్థ్యాలు కూడా 125 కోట్ల మంది మ‌స్తిష్కాలలో ఉన్నాయి.

ప్రియమైన సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, ప్ర‌భుత్వాలు ఆరోప‌ణ‌ల ఊబిలో చిక్కుకుపోయిన సంద‌ర్భాలు మ‌న దేశంలో ఎన్నో ఉన్నాయి. కానీ కాలం మారిపోయింది. నేడు ప్ర‌భుత్వం ఆరోప‌ణ‌ల మ‌ధ్య‌ అల్లాడ‌డం లేదు. ఎన్నో ఆశ‌ల న‌డుమ పురోగ‌మిస్తోంది. ఆకాంక్ష‌, విశ్వాసం మ‌న‌సుల్లో నుండి వెలుప‌లికి వ‌స్తే సురాజ్యం దిశ‌గా ప‌య‌నం వేగ‌వంతం అవుతుంది. నిరంత‌రాయంగా ఆకాంక్ష‌లు తీర్చ‌డం సాధ్య‌మ‌వుతుంది. నేడు నేను ఈ ఎర్ర‌ కోట బురుజుల నుండి మాట్లాడేందుకు ముందుకు వ‌స్తున్నానంటే.. అస‌లు ఈ ప్ర‌భుత్వం ఏమి చేస్తోంది, దేశంలో ఏం జ‌రుగుతోంది, దేశం కోసం ఏం చేయాలి.. అన్న చ‌ర్చ కూడా జ‌రుగుతుంది. ప్ర‌భుత్వం ఏం చేసిందో మీకు స‌వివ‌రంగా తెలియ‌చేస్తాను.

గ‌త రెండేళ్ళ కాలంలో ప్ర‌భుత్వం ఎన్నో చ‌ర్య‌లు తీసుకుంది, ఎన్నో అంశాల‌పై కార్యాచ‌ర‌ణ చేప‌ట్టింది. వాట‌న్నింటికీ ఒక్కొక్క‌టిగా స‌వివ‌రంగా చెప్పాలంటే, ఈ ఎర్ర‌ కోట బురుజుల నుండి అవిశ్రాంతంగా వారం రోజుల పాటు మాట్లాడ‌వ‌ల‌సి ఉంటుంది. అందుకే ఈ రోజు మీకు ప్ర‌భుత్వం చేసిన‌ ప‌ని గురించి కాకుండా, ప‌ని సంస్కృతి దిశ‌గా మీ దృష్టిని ఆక‌ర్షిస్తాను. కొన్ని సంద‌ర్భాలలో ప‌ని చేయ‌డం తేలికే కావ‌చ్చు…కానీ ప‌ని సంస్కృతి లోతులలోకి పోతే త‌ప్ప, స‌గ‌టు జీవి దానిని ఆకళింపు చేసుకుని, అర్ధం చేసుకుని గుర్తించ‌డం సాధ్యం కాదు.

అందుకే సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, ఈ రోజు నేను కేవ‌లం విధానాల గురించి మాట్లాడ‌డం లేదు. విధానాల‌కు వెనుక గ‌ల ఉద్దేశాలేమిటో, నిర్ణ‌యాలేమిటో కూడా వ‌ర్ణిస్తాను. సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, ఇది దిశ‌కు సంబంధించిన అంశం కాదు. విస్తృత దృక్ప‌ధానికి సంబంధించిన అంశం.

ఇది కేవ‌లం వివ‌ర‌ణ కాదు, ప‌రివ‌ర్త‌న దిశ‌గా క‌ట్టుబాటు. ప్ర‌జ‌ల ఆకాంక్ష‌లు, ప్ర‌జాస్వామ్యం, ప్ర‌జ‌ల మ‌ద్ద‌తుల మేలిక‌ల‌యిక ఇది. అంద‌రిలోనూ కాంక్ష ఉంది, అంగీకారం ఉంది, ప్ర‌గ‌తి సాధించాల‌న్న ఆకాంక్ష ఉంది.

అందుకే సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, నేను ఈ రోజు స‌త్ప‌రిపాలన గురించి ప్ర‌స్తావించడంలోని అంత‌రార్ధం స‌గ‌టు జీవి జీవనంలో మార్పును తీసుకురావడానికే. స‌గ‌టు జీవి ఆశ‌లు ఏమిటన్నది తెలుసుకొని, ఆ బాధ్య‌తను చేప‌ట్టి దానిని సాధించేందుకు అంకితం కావ‌డ‌మే స‌త్ప‌రిపాల‌న‌ అనిపించుకొంటుంది. ప్ర‌తి ఒక్క‌రి పైన ఉన్న బాధ్య‌త‌లను అన్వేషించ‌డం అనేది స‌త్ప‌రిపాల‌న‌కు బాధ్య‌త‌ తీసుకొనే ధోరణికి మూలం. అందుకే ప‌రిపాల‌న యంత్రాంగం ఆ బాధ్య‌త‌లను గుర్తెరిగిన‌దై ఉండాలి.

ఏదైనా పెద్ద ఆస్ప‌త్రికి వైద్యం కోసం వెళ్తే రోజుల త‌ర‌బ‌డి వేచి ఉండాల్సిన ప‌రిస్థితి గురించి మీకు గుర్తు చేస్తున్నాను. ఉదాహ‌ర‌ణ‌కు అఖిల భార‌త వైద్య శాస్త్రాల సంస్థ‌ (ఎఐఐఎమ్ ఎస్.. ఎయిమ్స్)నే తీసుకుంటే, ఏయే టెస్ట్ లు చేయించుకోవాలో తెలుసుకొనేందుకే రెండు మూడు రోజులు ప‌ట్టేది. ఈ రోజు మేం ఆ వ్య‌వ‌స్థనంత‌టినీ మార్చేశాం. ఆన్ లైన్ రిజిస్ట్రేష‌న్ లు, డాక్ట‌ర్ల‌తో ఆన్ లైన్ అపాయింట్ మెంట్ల పద్ధతులను ప్ర‌వేశ‌పెట్టాం. ఇవాళ ఎవ‌రైనా రోగంతో అక్క‌డ‌కి వ‌చ్చిన క్ష‌ణం నుండే చికిత్స ప్రారంభం అవుతుంది. అంతే కాదు, వైద్య రికార్డులు కూడా ఆన్ లైన్ లోనే అందుబాటులో ఉంటాయి. వైద్య‌ రంగంలో ఈ సంస్కృతిని దేశ‌వ్యాప్తంగా విస్త‌రించాల‌న్న‌ది మా ధ్యేయం. 40 పెద్ద ఆస్ప‌త్రులలో ప్ర‌భుత్వం ఈ విధానాన్ని ప్ర‌వేశ‌పెట్టింది. కానీ పాల‌నాయంత్రాంగం ఆ ల‌క్ష్యాన్ని అవ‌గాహ‌న చేసుకోవాలి. సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, ప‌రిపాల‌న యంత్రాంగం బాధ్య‌తాయుత‌ంగా వ్య‌వ‌హ‌రించాలి. పాల‌నాయంత్రాంగం బాధ్య‌తాయుతంగా లేక‌పోతే స‌గ‌టు జీవి స‌మ‌స్య‌ల‌పై ప‌ట్టించుకునే దిక్కే ఉండ‌దు. ఈ మార్పు ఎలా వ‌స్తుంది ? మ‌న‌కు సాంకేతిక విజ్ఞానం అందుబాటులో ఉంది. రైలు టికెట్ల విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. గ‌తంలో నిమిషానికి 2,000 టికెట్లు మాత్ర‌మే ఆన్ లైన్ లో జారీ అయ్యేవి. వెబ్ సైట్ ను తెర‌వ‌డానికే ఎంతో స‌మ‌యం వేచి ఉండవలసివ‌చ్చేది. ఇప్పుడో కేవ‌లం ఒక నిమిషంలో 15,000 టికెట్లు జారీ అవుతున్నాయి.

స‌గ‌టు జీవి అవ‌స‌రాలు, ఆకాంక్ష‌ల‌కు దీటుగా ప్ర‌భుత్వం చ‌ర్య‌లు తీసుకోవ‌డం అవ‌స‌రం. పోలీసుల క‌న్నా ఎక్కువ‌గా ఆదాయ‌పు ప‌న్ను శాఖ అధికారుల నుండి వేధింపులు ఎదుర్కొన్న వ‌ర్గం మ‌ధ్య‌త‌ర‌గ‌తి, ఎగువ మ‌ధ్య‌త‌ర‌గ‌తులు. ఈ ప‌రిస్థితిని నేను మార్చాల్సివ‌చ్చింది. నిజాయ‌తీప‌రుడైన ఆదాయ‌పు ప‌న్నుచెల్లింపుదారు తాను చెల్లించవలసిన ప‌న్ను క‌న్నా రెండు రూపాయ‌లు ఎక్కువ‌గా చెల్లించినా దానిని తిరిగి పొంద‌డంలో ఎలాంటి ఇబ్బంది ఉండ‌కూడ‌దు. ఒక‌ప్ప‌డు ఒక‌సారి ప‌న్ను చెల్లిస్తే త‌న‌కు రావల‌సిన సొమ్ము తిరిగి పొంద‌డానికి ఎన్నో ఇబ్బందులు ప‌డిన సంద‌ర్భాలున్నాయి. త‌న‌కు రావ‌ల‌సిన రిఫండ్ కోసం పెద్ద ఎత్తున ప్ర‌చారం చేసుకుని, నిరంత‌రం నిరీక్షించాల్సిన ప‌రిస్థితి కూడా ఉండేది. ఈ రోజు మేం ఆన్ లైన్ రిఫండ్ విధానాన్ని అమ‌లులోకి తెచ్చాం. కేవ‌లం ఒక‌టి నుండి మూడు వారాల వ్య‌వ‌ధిలో అధికంగా చెల్లించిన మొత్తం రిఫండ్ జ‌రిగిపోతోంది. ఈ ప్ర‌త్య‌క్ష ప్ర‌సారాన్ని చూసిన వారు కూడా ఎలాంటి ద‌ర‌ఖాస్తుల‌తో ప‌ని లేకుండానే రిఫండ్ లు వ‌చ్చాయ‌న్న విష‌యాన్ని అంగీక‌రిస్తారు. ప్ర‌భుత్వంలో బాధ్య‌తాయుత వైఖ‌రిని పెంచ‌డం ద్వారా మాత్ర‌మే ఇది సాధ్యం అయింది. 

మంచి ప‌రిపాల‌న‌కు పార‌ద‌ర్శ‌క‌త ప్ర‌ధానం. మ‌న స‌మాజం ఇప్పుడు ప్ర‌పంచంతో మ‌రింత‌గా అనుసంధానం అవుతోంది. గ‌తంలో ఏడాదికి 40 లక్షల నుండి 50 ల‌క్ష‌ల మంది వరకు పాస్ పోర్ట్ కు ద‌ర‌ఖాస్తు చేసుకునే వారు. నేడు ఆ సంఖ్య‌ 2 కోట్ల‌ మందికి పెరిగింది. సిఫారసులు లేక‌పోతే పాస్ పోర్ట్ ను పొందేందుకు నాలుగు నుండి ఆరు వారాల స‌మ‌యం ప‌ట్టిన సంద‌ర్భాలు కూడా ఉన్నాయి. కానీ, ఈ రోజు ఎలాంటి సిఫారసు లేకుండానే- ఒక‌టి రెండు వారాల వ్య‌వ‌ధిలోనే ప్ర‌జ‌లు పాస్ పోర్ట్ ను పొంద‌గ‌లుగుతున్నార‌ని నేను గ‌ర్వంగా చెప్ప‌గ‌లుగుతున్నాను. అది ప్ర‌భుత్వంలో పార‌ద‌ర్శ‌క‌త‌కు సంబంధించిన అంశం. ఎలాంటి జాప్యాలు లేవు, ఎలాంటి రెక‌మండేష‌న్లు అవ‌స‌రం లేదు. 2015-16 సంవ‌త్స‌రంలో స్వ‌ల్ప వ్య‌వ‌ధిలోనే మేం 1.75 కోట్ల మందికి పాస్ పోర్ట్ లు జారీ చేశామ‌ని నేను చెప్ప‌గ‌లుగుతున్నాను.

స‌త్ప‌రిపాల‌న‌కు మ‌రో గీటురాయి స‌మ‌ర్థ‌త‌. గ‌తంలో దేశంలో ఎవ‌రైనా వ్యాపారం ప్రారంభించాల‌న్నా, ఏదైనా కంపెనీ ప్రారంభించాల‌న్నా దాని రిజిస్ట్రేష‌న్ కే క‌నీసం ఆరు మాసాలు తిర‌గాల్సివ‌చ్చేది. ఈ రోజు ఆ ప‌రిస్థితి మారింది. పాల‌నాయంత్రాంగంలో స‌మ‌ర్థ‌త కార‌ణంగా అప్ప‌టి ఉద్యోగులే, అప్ప‌టి నియ‌మ‌ నిబంధ‌న‌ల ప‌రిధిలోనే ద‌ర‌ఖాస్తు ప్ర‌క్రియ‌ను 24 గంట‌లలో పూర్తి చేయ‌గ‌లుగుతున్నారు. ఈ ఏడాది ఒక్క జూలైలోనే 900 రిజిస్ట్రేష‌న్ లు జ‌రిగాయి.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, మంచి నిబంధ‌న‌ల‌కు స‌త్ప‌రిపాల‌న చాలా అవ‌స‌రం. స‌త్ప‌రిపాల‌న దిశ‌గా మేం ఎన్నో చ‌ర్య‌లు తీసుకున్నాం. గ్రూప్ సి, గ్రూప్ డి పోస్టుల‌కు ఇక ఇంట‌ర్వ్యూలు ఉండ‌వ‌ని గ‌త ఏడాది నేను ప్ర‌క‌టించాను. కేవ‌లం ప్ర‌తిభ ఆధారంగా వాటికి పోటీ ప‌డే వారు ఉద్యోగం పొంద‌గ‌లుగుతున్నారు. అలాంటివి 9,000 పోస్టుల‌ను మేం గుర్తించాం. ఎలాంటి ఇంట‌ర్వ్యూల‌తో ప‌ని లేకుండానే ఆ 9,000 ఉద్యోగాలు భ‌ర్తీ చేయ‌నున్నాం. ఆ ఉద్యోగాల కోసం పోటీ ప‌డే వారు ఇంట‌ర్య్వూకు వెళ్ళేందుకు ఒక్క పైసా ఖ‌ర్చు చేయాల్సిన ప‌ని లేదు. ఎవ‌రి సిఫారసులకు పాకులాడాల్సిన అవ‌స‌రం లేదు. మ‌ధ్య‌ ద‌ళారుల‌కు, అవినీతికి మార్గం మూసేశాం.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, ప్ర‌భుత్వాలు పథకాలను ప్ర‌క‌టించి ఎప్ప‌టిక‌ప్పుడు ప్ర‌జ‌ల‌ను సంతృప్తిక‌రంగా ఉంచాల్సిన ప‌రిస్థితి గ‌తంలో ఉండేది. ప్ర‌జ‌లు ప్ర‌ణాళిక‌ల గురించి, బ‌డ్జెట్ గురించి కూడా అడిగే ప‌రిస్థితి ఉండేది. గ‌త‌ 70 సంవ‌త్స‌రాల కాలంలో ప్ర‌జ‌ల ఆలోచ‌నా దృక్ప‌థం ఎంత‌గానో మారింది. పథకా లు, ప్ర‌ణాళిక‌ల వివ‌రాలు, బ‌డ్జెట్ కేటాయింపుల‌తో ఈ రోజు ప్ర‌జ‌లు సంతృప్తి చెంద‌డం లేదు. క్షేత్ర‌ స్థాయిలో ఏదో ఒక కార్యాచ‌ర‌ణను వారు ఆశిస్తున్నారు. మంద‌గ‌మ‌నంతో ప‌నులు మ‌నం సాధించ‌లేము. వేగాన్ని పెంచాల్సిన అవ‌స‌రం ఉంది.

గ్రామీణ రహదారుల విష‌యానికి వ‌స్తే ప్ర‌తి ఒక్క గ్రామ‌స్థుడు ఈ రోజు శాశ్వ‌తంగా ఉండే కాంక్రీట్ రోడ్లు కోరుతున్నాడు. ఈ దిశ‌గా అట‌ల్ బిహారీ వాజ్ పేయి ఒక ప్ర‌త్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. తరువాత వ‌చ్చిన ప్ర‌భుత్వాలు దానిని కొన‌సాగించాయి. దానిని మ‌రింత వేగ‌వంతం చేయాల‌ని మేం ఆశిస్తున్నాం. గ‌తంలో రోజుకి 70 కిలోమీట‌ర్ల నుండి 75 కిలోమీట‌ర్ల గ్రామీణ ర‌హ‌దారుల నిర్మాణం జ‌రిగేది. ఈ రోజు 100 కిలోమీట‌ర్ల రహదారులను నిర్మించ‌గ‌లుగుతున్నాము. రానున్న రోజులలో ఈ వేగం మ‌రింత పుంజుకుంటుంది.

విద్యుత్ పైన.. మరీ ముఖ్యంగా పున‌రుత్పాద‌క ఇంధ‌నం పైన‌ మేం అధికంగా దృష్టిని కేంద్రీక‌రించాము. స్వాతంత్ర్యం సిద్ధించిన ఎన్నో సంవ‌త్స‌రాల తరువాత ప‌వ‌న విద్యుత్ పై కృషిని గ‌త ఏడాది ప్రారంభించాం. వ‌ప‌న విద్యుత్ ఉత్ప‌త్తిని 40 శాతం మేర‌కు పెంచాం. వేగానికి నిద‌ర్శ‌నమిది. ఈ రోజు ప్ర‌పంచం యావ‌త్తు సౌర విద్యుత్తుపైన దృష్టిని కేంద్రీక‌రించింది. సౌర విద్యుత్ సామ‌ర్థ్యాన్ని మేము 116 శాతం పెంచాము. ఇది పెంపు ఒక్క‌టే కాదు.. ఒక పెద్ద అడుగు వేయ‌డ‌మే. ఏదైనా ప‌రిమాణం క‌నిపించే స్థాయిలో పెంచ‌డ‌మే మా ల‌క్ష్యం. విద్యుత్ ఉత్ప‌త్తిని పెంచ‌డంతో చాల‌దు…అందుకు దీటుగా ట్రాన్స్ మిష‌న్ లైన్లు కావాలి. మా ప్ర‌భుత్వం అధికారాన్ని చేప‌ట్ట‌డానికి రెండేళ్ళ‌ ముందు ఏడాదికి 30 కిలోమీట‌ర్ల నుండి 35 కిలోమీట‌ర్ల వరకు ట్రాన్స్ మిష‌న్ లైన్ లను నిర్మించే వారు. ఈ రోజు 50,000 కిలోమీట‌ర్ల‌కు పెంచామ‌ని నేను గ‌ర్వంగా చెప్ప‌గ‌లుగుతున్నాను. వేగానికి మ‌రో నిద‌ర్శ‌నం ఇది. రైల్వే లైన్ ల ప్రారంభం అంటే, ట్రాక్ నిర్మాణం పూర్తి చేయ‌డంతో పాటు ప్ర‌యోగాత్మ‌కంగా రైళ్ళు కూడా న‌డిపి పూర్తి స్థాయిలో రైళ్ళు న‌డ‌వ‌గ‌ల విధంగా సిద్ధం చేయ‌డం. గ‌త ప‌దేళ్ళ‌ కాలంలో 1500 కిలోమీట‌ర్ల నిడివి గ‌ల రోడ్లు మాత్ర‌మే సిద్ధం అయ్యాయి. కేవ‌లం రెండేళ్ళ‌ కాలంలో ప‌నుల్లో వేగం పెంచ‌డం ద్వారా 3,500 కిలోమీట‌ర్ల రైల్వేలైన్ లను అందుబాటులోకి తెచ్చాము.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌న్నింటినీ ‘ఆధార్’తో అనుసంధానం చేయ‌డం ద్వారా ల‌బ్ధిదారుల ఖాతాల్లోనే ప్ర‌యోజ‌నాల‌ను జ‌మ చేస్తూ లీకేజిలను మేము నివారించాము. గ‌త ప్ర‌భుత్వ హ‌యాంలో కేవ‌లం నాలుగు కోట్ల మందినే ‘ఆధార్’ కార్డుతో అనుసంధానం చేయ‌గ‌లిగారు. ఈ రోజు 70 కోట్ల మంది పౌరుల‌ను ‘ఆధార్’తో అనుసంధానం చేసే ప్ర‌క్రియ పూర్తి చేయ‌గ‌లిగిన‌ట్టు నేను గ‌ర్వంగా ప్ర‌క‌టిస్తున్నాను. గ‌త ప్ర‌భుత్వం ఏయే ప‌నులు అసంపూర్తిగా వ‌దిలిందో, వాట‌న్నింటినీ పూర్తి చేస్తాము.

దేశంలో ప్ర‌తి మ‌ధ్య‌త‌ర‌గ‌తి పురుషుడికి, మ‌హిళ‌కు ఇంటిలో ఒక కారు ఉండాల‌నేది ఒక హోదాతో ముడిప‌డిన‌ ఆకాంక్ష‌. గ్యాస్ స్ట‌వ్ ను క‌లిగి ఉండ‌డం హోదాకు చిహ్నంగా ప‌రిగ‌ణించిన రోజులు ఒక‌ప్పుడు ఉండేవి. దేశానికి స్వాతంత్ర్యం సిద్ధించిన 60 సంవ‌త్స‌రాలు ముగిసే నాటికి కేవ‌లం 14 కోట్ల ఎల్ పిజి క‌నెక్ష‌న్ లు అందించ‌గ‌లిగారు. కేవ‌లం 60 వారాల వ్య‌వ‌ధిలో మేము 4 కోట్ల కొత్త క‌నెక్ష‌న్ లను అందించాం. స‌గ‌టు జీవి జీవ‌న ప్ర‌మాణాలలో మార్పు దిశ‌గా మేము తెచ్చిన ప‌రివ‌ర్త‌న ఇది.

సాలెగూడు వంటి చ‌ట్టాల‌ను ప్ర‌క్షాళ‌న చేసే ప‌ని మేము ప్రారంభించాము. చ‌ట్టాలు లెక్క‌కు మించిపోవ‌డం వ‌ల్ల ప్ర‌భుత్వానికి, న్యాయ‌ వ్య‌వ‌స్థ‌కు, పౌరుల‌కు కూడా ఎన్నో ఇబ్బందులు ఎదుర‌వుతున్నాయి. ఇలాంటి 1,700 చ‌ట్టాల‌ను మేము గుర్తించాము. వాటిలో 1,175 కోట్ల చ‌ట్టాల‌ను పార్ల‌మెంటు ఇప్ప‌టికే ర‌ద్దు చేసింది. మిగ‌తా చ‌ట్టాల‌ను కూడా ర‌ద్దు చేయాల‌ని మేము ఆకాంక్షిస్తున్నాము.

కొన్ని మాత్ర‌మే చేయ‌గ‌లం, మ‌రికొన్ని అసాధ్యం అనే స్వ‌భావం ఒక‌ప్పుడుండేది. కొన్ని ప‌నులైతే ఇప్పుడు చేయ‌డం అసాధ్య‌మే కాదు.. భ‌విష్య‌త్తులో కూడా చేయ‌లేమ‌న్న‌ది కొంద‌రి అభిప్రాయం. ఇలా నిరాశ ప‌డ‌డం మ‌న స‌హ‌జ ల‌క్ష‌ణం. ఈ ధోర‌ణిని పూర్తిగా మార్చి వేసి పాల‌నా యంత్రాంగంలో కొత్త ఉత్తేజం నింప‌డం అవ‌స‌రం.. ఏదైనా విజ‌యం ల‌భిస్తే మ‌న‌కు ఉత్సాహం క‌లుగుతుంది, శ‌క్తులు ఇనుమ‌డిస్తాయి, సంక‌ల్పం మ‌రింత ప‌దున‌వుతుంది, ఫ‌లితాలు చేరువ‌లో క‌నిపిస్తాయి.

‘ప్ర‌ధాన‌ మంత్రి జ‌న్ ధ‌న్ యోజ‌న’ను మేము ప్రారంభించిన‌ప్పుడు, అది అసాధ్య‌మైన ప‌నిగానే భావించారు. చాలా సంవ‌త్స‌రాలుగా బ్యాంకులున్నాయి. బ్యాంకుల జాతీయ‌క‌ర‌ణ కూడా జ‌రిగింది. అయినా స‌గ‌టు జీవులు భార‌తదేశ ప్ర‌ధాన ఆర్థిక స్ర‌వంతిలో భాగం కాలేక‌పోయారు. కానీ స్వ‌ల్ప‌కాలంలోనే 21 కోట్ల కుటుంబాలు, 21 కోట్ల మంది పౌరుల‌ను జ‌న్ ధ‌న్ యోజ‌న‌లో భాగం చేయ‌డం ద్వారా అసాధ్యం అనుకున్న దానిని సుసాధ్యం చేశాము. ఇది ప్ర‌భుత్వాన్ని మెచ్చుకోవ‌డం కాదు..125 కోట్ల మంది సంక‌ల్ప‌బ‌లం. దేశ‌వాసులంద‌రికీ నేను అభివాదం చేస్తున్నాను.

గ్రామీణ ప్రాంతాలలో నివ‌సిస్తున్న‌మ‌హిళ‌ల‌ను గౌర‌వించ‌డం కోసం భార‌తదేశం మ‌రో కార్యక్రమాన్ని చేప‌ట్టింది. బ‌హిరంగ మ‌ల‌ మూత్ర విస‌ర్జ‌న‌ను నిలిపివేయాల్సిన అవ‌స‌రాన్ని గుర్తించింది. ఇందుకు గ్రామాలలో మ‌రుగుదొడ్ల నిర్మాణం అత్య‌వ‌స‌రం. తొలిసారి ఎర్ర‌ కోట బురుజుల మీది నుండి మీతో మాట్లాడే భాగ్యం క‌లిగిన సందర్భంలో, ఈ ఆలోచ‌నను ఎలా కార్య‌రూపంలోకి తీసుకురావచ్చన్న భావనను మీతో పంచుకున్నాను. స్వ‌ల్ప‌కాలంలోనే 2 కోట్ల మ‌రుగుదొడ్ల నిర్మాణాన్ని పూర్తి చేయ‌గ‌లిగామ‌ని మీకు నేను గ‌ర్వంగా మనవి చేస్తున్నాను. 70,000కు పైగా గ్రామాలు బ‌హిరంగ మ‌ల‌ మూత్ర విస‌ర్జ‌న నుండి విముక్తిని పొందాయి. సామాన్య ప్ర‌జ‌ల జీవ‌నంలో ప‌రివ‌ర్త‌న‌కు మేం కృషి చేస్తున్నాము.

గ‌త ఏడాది ఎర్ర‌కోట బురుజుల నుండి నేను మాట్లాడిన‌ప్పుడు, 70 సంవ‌త్స‌రాల స్వ‌తంత్ర‌తా ప‌య‌నంలో కూడా విద్యుత్ వెలుగుల‌కు నోచుకోని గ్రామాల‌కు 1,000 రోజులలో విద్యుత్ స‌దుపాయాన్ని క‌ల్పిస్తామ‌ని మీకు హామీ ఇచ్చాను. ఆ ల‌క్ష్యం నిర్దేశించిన స‌గం రోజులైనా కాకుండానే, విద్యుత్ స‌దుపాయం లేని 18,000 గ్రామాలలో 10,000 గ్రామాల‌కు విద్యుత్ వెలుగులను అందించామ‌ని నేను గ‌ర్వంగా చెబుతున్నాను. నేడు ఆ గ్రామాలలోని ప్ర‌జ‌లంద‌రూ ఇళ్ళ‌లో టివిల ముందు కూచుని ఈ కార్య‌క్ర‌మం ప్ర‌త్య‌క్షంగా తిల‌కించ‌గ‌లుగుతున్నార‌ని నాకు తెలిసింది. వారంద‌రికీ నా శుభాభినంద‌న‌లు తెలియ‌చేస్తున్నాను. సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, దేశ‌ రాజ‌ధాని దిల్లీకి కేవ‌లం మూడు గంట‌ల ప్ర‌యాణ దూరంలో ఉన్న హ‌త్రాస్ లోని న‌గ్లా ఫ‌టెలా అనే గ్రామానికి విద్యుత్ వెలుగులు విస్త‌రించ‌డానికి 70 సంవ‌త్స‌రాలు ప‌ట్టిందంటే మీకు ఆశ్చ‌ర్యం క‌లుగుతుంది. మేం ఏం చేశాము, మేం అనుస‌రించిన ప‌ని సంస్కృతి ఎలాంటిది అని తెలియ‌చేయ‌డానికే ఇదంతా మీకు నేను వివరించాను.

సోద‌ర‌ సోద‌రీమ‌ణులారా, ప‌రిశోధ‌కులు స‌గ‌టు జీవి లాభం కోసం ఎల్ ఇడి బ‌ల్బులు క‌నుగొన్నారు. కానీ దాని ధ‌ర 350 రూపాయ‌లుండేది. ఇంత ఖ‌రీదైన బ‌ల్బులు ఎవ‌రు కొంటారు ? ప‌్ర‌భుత్వం దాని గురించి ఆలోచించింది. ఎల్ ఇడి బ‌ల్బు స‌గ‌టు జీవి జీవితంలో మార్పు తేగ‌లిగిన‌ప్పుడు, ప‌ర్యావ‌ర‌ణాన్ని మెరుగుప‌ర‌చ‌గ‌లిగిన‌ప్పుడు, ఆర్థిక రంగానికి పొదుపు చేయ‌గ‌లిగిన‌ప్పుడు దానిపై ఏదో ఒక‌టి చేయ‌డం అవ‌స‌రం. ప్ర‌భుత్వ వ్య‌వ‌స్థ ప‌నితీరులో ప్ర‌భుత్వం జోక్యం చేసుకోకూడ‌ని విభాగాలు కొన్ని ఉన్నాయి. కానీ, ప్ర‌భుత్వం జోక్యం చేసుకుంది. ప్ర‌భుత్వ జోక్యం కార‌ణంగా 350 రూపాయ‌ల ఎల్ ఇడి బ‌ల్బు ధ‌ర 50 రూపాయ‌ల‌కు దిగివ‌చ్చింది. మార్పు దృగ్గోచ‌రం అయింది. ఇప్ప‌టి వ‌ర‌కు మేం 13 కోట్ల ఎల్ ఇడి బ‌ల్బులను పంపిణీ చేశాము. మ‌రి ఈ డ‌బ్బంతా ఎవ‌రి జేబుల్లోకి పోతోంది ? మ‌న రాజ‌కీయాలు జ‌నాక‌ర్ష‌కంగా మారిపోయాయి. జ‌నాక‌ర్ష‌ణే ఆర్థిక విధానాల‌కు గీటురాయి అయిపోయింది. ఒక్కో బ‌ల్బుకు 300 రూపాయ‌లు నేను అందించిన‌ట్ట‌యితే, ప్ర‌జ‌ల జేబుల‌కు 300 రూపాయ‌లు అందించిన ప్ర‌ధాన మంత్రిగా నాకు కీర్తి వ‌స్తుంది. 50 రూపాయ‌ల ధ‌ర‌కే ఎల్ ఇడి బ‌ల్బు కొనుక్కునే అవకాశాన్ని క‌ల్పించ‌డం ద్వారా మేం దీర్ఘ‌కాలంలో వేల రూపాయ‌లు ఆదా చేసుకునే అవ‌కాశం క‌ల్పించాము. 13 కోట్ల ఎల్ ఇడి బ‌ల్బులు కాదు…70 కోట్ల ఎల్ ఇడి బ‌ల్బులను అందించాల‌న్న‌ది మా సంక‌ల్పం. కేవ‌లం ఎల్ ఇడి బ‌ల్బుల‌నే ఉప‌యోగించాల‌ని దేశ‌వాసుల‌కు నేను పిలుపు ఇస్తున్నాను. దీని వ‌ల్ల మీరు ఏటా పెద్ద మొత్తాన్ని ఆదా చేయ‌డ‌మే కాదు, ఇంధ‌నాన్ని ఆదా చేయ‌గ‌లుగుతారు, దేశంలో వాతావ‌ర‌ణాన్ని ప‌రిర‌క్షించ‌గ‌లుగుతారు. 77 కోట్ల ఎల్ ఇడి బ‌ల్బులు వినియోగంలోకి వ‌స్తే, 20,000 మెగావాట్ల విద్యుత్ ఆదా అవుతుంది. అంత విద్యుత్ ఆదా అయితే, మ‌నం 1.25 ల‌క్ష‌ల కోట్ల రూపాయ‌లు పొదుపు చేయ‌గ‌లుగుతాము. ఒక ఇంటిలో ఒక్క ఎల్ ఇడి బ‌ల్బు వాడితేనే ఇంత సొమ్ము ఆదా అవుతుంది. ఇంత మొత్తంలో విద్యుత్ ను ఆదా చేయ‌డం వ‌ల్ల భూతాపంపై కూడా మ‌నం పోరాటం చేయ‌గ‌లుగుతాము. స‌గ‌టు జీవి స‌హాయంతో ప‌ర్యావ‌ర‌ణ ప‌రిర‌క్ష‌ణ‌కు మ‌నం ఇంతగా కృషి చేయ‌గ‌లుగుతాము. అందుకే మేము ఈ చ‌ర్య తీసుకున్నాము.

అసాధ్యాన్ని సుసాధ్యం చేయడం ఎలాగో మీకు తెలుసు. విద్యుత్తూ, పెట్రోలియం ఉత్పత్తుల కోసం మనం ఇతర దేశాలపై ఆధారపడి ఉన్నాము. ఒక స్థిరమైన ధరకు సుదీర్ఘకాలం పాటు వస్తువులు పొందడం కోసం చాలా కాలం క్రితమే మనం ఒప్పందాలపై సంతకాలు చేశాము. 2024 దాకా కతర్ తో గ్యాస్ ఒప్పందం కుదుర్చుకున్నాము. అయితే మన భారతదేశ ఆర్ధిక వ్యవస్థకు గ్యాస్ ధరలు భారంగా ఉన్నాయి. కతర్ తో మనకు ఉన్న మంచి సంబంధాల వల్ల ఈ ఒప్పందంపై తిరిగి సంప్రదింపులు జరపడం సాధ్యమైంది. ఈ రోజు నేను తృప్తిగా చెప్పగలను. ఈ సంప్రదింపులు ఒక అసాధ్యాన్ని సుసాధ్యం చేశాయి. అంతే కాదు, భారతదేశ ఖజానాకు మనం 20,000 కోట్ల రూపాయలు ఆదా చేయగలిగాము. 20,000 కోట్ల రూపాయలు కతర్ పొందవలసిఉంది. అయితే మన మంచి సంబంధాల వల్ల, విదేశీ విధానం వల్ల ఇది సాధించగలిగాము.

భారతదేశం, మధ్య ఆసియాల మధ్య చాబహార్ రేవు ఒక ముఖ్యమైన బంధం. గత ప్రభుత్వాలు ఈ ప్రాజెక్టును అమలుచేయడం కోసం నిరంతరం చర్చలు జరిపారు. కృషి చేశారు. ఈ అసాధ్యమైన పని నా సంతృప్తి మేరకు సుసాధ్యమైంది. ఈ అసాధ్యమైన పనిని సుసాధ్యం చేసేందుకు ఇరాన్, అఫ్గానిస్తాన్, భారతదేశాలు చాబహార్ రేవును నిర్మించడానికి సంయుక్తంగా కృషి చేస్తున్నాయి.

నా సోదర సోదరీమణులారా, నేను మరొక్క విషయం వివరించదలచాను. ప్రస్తుతం పరిస్థితి సామాన్య ప్రజానీకంతో ముడిపడి ఉంది. అది ధరల పెరుగుదల. గత ప్రభుత్వ పాలనలో ద్రవ్యోల్బణం రేటు 10 శాతం హద్దు ను దాటిన విషయం వాస్తవం. మా నిరంతర కృషి తో ద్రవ్యోల్బణం రేటును 6 శాతం దాటకుండా చేశాము. ఇది ఒక్కటే కాదు. ద్రవ్యోల్బణం రేటు 4 శాతానికి పైన 2 శాతం అటు, ఇటుగా ఉండే విధంగా నియంత్రించడానికి తగిన చర్యలు తీసుకోవలసిందిగా రిజర్వు బ్యాంకు తో ఒక ఒప్పందం చేసుకున్నాము. ద్రవ్యోల్బణానికి, వృద్ధి రేటు కు మధ్య సమతుల్యం ఉండే విధంగా కూడా రిజర్వు బ్యాంకు మరింత ముందుకు పని చేయవలసి ఉంది. దేశంలో రెండు సంవత్సరాలు కరవు నెలకొంది. కూరగాయలకు కొరత ఏర్పడడం వల్ల వాటి ధరలు వెంటనే పెరిగాయి. దీనివల్ల కొన్ని సమస్యలు తలెత్తాయి. ఈ రెండేళ్ల కరవు వల్ల పప్పు ధాన్యాల ఉత్పత్తి తగ్గడం ఆందోళనకు కారణమయింది. అయితే – సోదర సోదరీమణులారా, ఇంతకూ ముందు మనం ఎదుర్కొన్న విధంగానే ధరలు పెరుగుదల కొనసాగి ఉంటే, నా దేశంలోని పేద ప్రజల పరిస్థితి ఎలా ఉండేదో నేను ఊహించలేను. దీనిని తగ్గించడానికి మనం ఎంతగానో ప్రయత్నించాము. అయితే ప్రభుత్వం ఇంకా చేయాలని ఎదురుచూస్తున్నారు. నా దేశ ప్రజల ఆకాంక్షలు సహజం. లక్ష్యాన్ని సాధించడానికి నేను చేయగలిగిన అన్ని ప్రయత్నాలు చేస్తాను. నాకు చేతనయినంత కృషి చేసి, పేద ప్రజలకు తక్కువ వ్యయంతో ఆహారం లభించే విధంగా చూస్తాను.

నా ప్రియమైన సోదర సోదరీమణులారా, గురు గోవింద్ సింగ్ జీ 350వ జయంతిని జరుపుకోడానికి సిద్ధంగా ఉన్నాము. సిక్కు గురువుల త్యాగాల పరంపరను, సంప్రదాయాన్నీ ఈ దేశం ఎలా విస్మరిస్తుంది. అది కూడా గురు గోవింద్ సింగ్ జీ 350వ జయంతి జరుపుకుంటున్న సందర్భంలో. గురు గోవింద్ సింగ్ జీ ఒక విషయాన్ని చాలా సముచితంగా చెప్పారు. ” ఒక చెయ్యి ఏ సేవా చేయకుండా, ఏ పనీ చేయకుండా, కష్టపడి పనిచేసి గట్టి పడకుండా, దానిపై ముడతలు పడకుండా ఉంటే – ఆ చెయ్యిని పవిత్రమైనదిగా నేను ఎలా భావించగలను” అని ఆయన చెబుతూ ఉండేవారు. ఇది గురు గోవింద్ సింగ్ జీ చెప్పిన మాట. ఈ రోజు మనం గురు గోవింద్ సింగ్ జీ 350వ జయంతి జరుపుకుంటున్న సమయంలో నేను నా రైతుని గుర్తు చేసుకుంటున్నాను. ఆ రైతు చేతుల కంటే ఇంకెవరి చేతులు అత్యంత ఆరాధనా భావంతో ఉంటాయి. అవే లేకపోతే – అంతకంటే ఆందోళనకరమైన విషయం ఇంక ఏమి ఉంటుంది. రెండేళ్లు కరవు ఉన్నప్పటికీ, దేశ ధాన్యాగారాన్ని నింపడానికి వారు చేసిన కృషి కి నా రైతు సోదరులకు నేను ప్రణామాలు అర్పిస్తున్నాను.

కరవు పరిస్థితి మారిపోయింది. ఈ సారి చాలా చోట్ల మంచి వర్షాలు కురిశాయి. అధిక వర్షాల వల్ల కొన్ని చోట్ల సమస్యలు కూడా ఉత్పన్నమయ్యాయి. ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రాలకు, పౌరులకు భారతదేశ ప్రభుత్వం అండగా నిలచింది. అయితే దేశం పప్పు ధాన్యాల కొరతను ఎదుర్కొంటున్న సమయంలో రైతులు ఒకటిన్నర రెట్లు వాటిని పండించినందుకు మన రైతును నేను ప్రత్యేకంగా సత్కరించదలిచాను. సామాన్య ప్రజల నుండి పప్పు ధాన్యాల డిమాండ్ పెరగడంతో ఇతర పంటలు పండించే రైతులు కూడా ఒక్కసారిగా పప్పు ధాన్యాల పంటల సాగుకు మళ్ళారు. పప్పు ధాన్యాలకు మేము గరిష్ఠ అమ్మకం ధరను నిర్ణయించాము. పప్పు ధాన్యాలకు మేము బోనస్ ను ప్రకటించాము. పప్పు ధాన్యాల సేకరణకు మేము ఒక ఉత్తమమైన విధానాన్ని ప్రవేశపెట్టాము. ఆ రకంగా పెద్ద లాభాలు పొందేందుకు పప్పు ధాన్యాలు పెంచే విధంగా రైతులను ప్రోత్సహిస్తున్నాము.

నేను ఎప్పుడైతే పని సంస్కృతిని గురించి మాట్లాడానో, అప్పుడు మనం ఆ పనులను అంచలంచెలుగా చూడము. మనం వాటిని ఏకీకృత, సమీకృత విధానంగా చూస్తాము. వ్యవసాయాన్నే ఉదాహరణగా తీసుకోండి. పెద్ద ఫలితాలు వచ్చే విధంగా అక్కడ పని సంస్కృతిని పెంపొందించాము.

ముందుగా మనం మాతృభూమి ఆరోగ్యం – భూసారంపై దృష్టి సారించాము. భూమి ఆరోగ్య కార్డు, స్థూల పోషణ, సూక్ష్మ పోషణ లను తీసుకువచ్చాము. వీటి వల్ల కలిగే లాభ నష్టాలను గురించి రైతులకు వివరించాము. తమ పొలాల్లో ఏ పంట పండించాలి ?, ఈపంట పండించకూడదు ? అనేవి వారికి తెలియజేయడం జరిగింది. క్రమంగా రైతులు తమ భూసారాన్ని బట్టి పంట ప్రణాళిక రూపొందించుకోవడం ప్రారంభించారు. తమ ఖర్చులు 25 శాతం తగ్గాయనీ, ఉత్పత్తి 30 శాతం మేర పెరిగిందని చాలా మంది రైతులు నాకు చెప్పారు. ఇది చాలా చిన్న మొత్తం. అయితే ఈ సమాచారం విస్తరించడంవల్ల పనులు ఇంకా కాస్త ముందుకు వెళ్తాయి. రైతులకు పొలం ఉంది. వారికి నీరు లభిస్తే, వారు అద్భుతాలు సృష్టించగలరు. ఇది ఈ దేశ రైతుల బలం. అందువల్ల నీటి యాజమాన్యం, సాగు నీరు, జల సంరక్షణలపైన దృష్టి పెట్టాము. ప్రతి ఒక్క నీటి బొట్టును ఎలా ఉపయోగించుకోవాలి ?, నీటి వినియోగాన్ని ఎలా పెంపొందించుకోవాలి ?, ప్రతి నీటి బొట్టు కు ఎక్కువ పంట, సూక్ష్మ సాగునీటి పారుదల మొదలైన విషయాలపై దృష్టి పెడుతున్నాము. ఈ ప్రాజెక్టులు పూర్తి కావాలని ముందుగా సంకల్పించాము. లక్షలాది ప్రజలు ప్రయోజనం పొందుతారు. రైతుల ఉత్పత్తి వ్యయం తగ్గించడం కోసం సౌర విద్యుత్తు పంపుల వైపు పెద్ద చర్య తీసుకున్నాము. రైతులకు విద్యుత్తు కావాలి. నీటి కోసం కూడా విద్యుత్తు కావాలి. అయితే విద్యుత్తు చాలా ఖరీదైనది. సౌర పంపుల వల్ల రైతుల ఉత్పత్తి వ్యయం తగ్గుతుంది. పునరావృత్త ఖర్చులు తగ్గుతాయి. ఇప్పుడు అతను స్వంత వ్యవసాయ భూమిని కలిగి ఉండడంతో పాటు సౌరశక్తి ద్వారా ఉచిత విద్యుత్తును కూడా పొందుతాడు. రైతు తనపై తాను ఆధారపడి ఉంటాడు. సంతోషంగా ఉంటాడు. ఇంతవరకు మేము 77,000 సోలార్ పంపులను విజయవంతంగా పంపిణీ చేశాము.

నేను శాస్త్రవేత్తలను కూడా అభినందించ దలచాను. వ్యవసాయ భూమి, నీరు, సోలార్ పంపులతో పాటు మనకు మంచి విత్తనాలు కూడా కావాలి. భారతీయ వాతావరణానికి అనుకూలమైన 131 కి పైగా కొత్త రకాలైన విత్తనాలను మన శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఎకరానికి వచ్చే ఉత్పత్తి పెరిగింది. నాణ్యత కూడా పెరుగుతోంది. ఈ శాస్త్రవేత్తలను నేను అభినందిస్తున్నాను.

రైతులకు యూరియా కావాలి. ఎరువులు కావాలి. ఒకానొకప్పుడు ఎరువులు నల్ల బజారులో మాత్రమే లభ్యమయ్యేవి. ఒకసారి ఎరువులు పొందడానికి పోలీసు లాఠీల దెబ్బలను కూడా ఎదుర్కోవలసి వచ్చింది. ఒక్కొక్కసారి ఎరువుల కొరత వల్ల, పెరిగిన పంటలు నాశనమైన సందర్భాలు కూడా ఉన్నాయి. అయితే ఇప్పుడు ఎరువుల కొరత అనేది గత చరిత్రగా మిగిలింది. ఎరువుల ఉత్పత్తి ని పెంచడంలో మనం కృతకృత్యులమయ్యాము. ఈ ఉత్పత్తి వల్ల రైతులకు సకాలంలో ఎరువులు పొందేందుకు అవకాశం ఏర్పడింది. అదే విధంగా రైతులు తమ స్వంత పొలాన్ని వ్యవసాయ ఉత్పత్తులు పొందే దాకా రక్షించుకోవడానికి మనం ‘ప్రధాన మంత్రి ఫసల్ బీమా యోజన’ను ప్రకటించాము. నా తోటి సోదర, సోదరీమణులారా, అతి తక్కువ ప్రీమియంతో రైతులకు అత్యంత భరోసాను మేము కల్పించాము. 15 లక్షల టన్నుల ఉత్పత్తిని రక్షించేందుకు మేము అదనపు గోదాములను నిర్మించాము.

ఈ విధంగా మేము విలువను పెంచే చర్యలు చేపట్టడంతో మన రైతులు ప్రయోజనం పొందుతున్నారు. ప్రభుత్వం ఫుడ్ ప్రోసెసింగ్ పై దృష్టి కేంద్రీకరించి నూరు శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను ప్రోత్సహిస్తోంది. వ్యవసాయ ఆధారిత పరిశ్రమకు ప్రయోజనం చేకూర్చడంతో పాటు, 2022 నాటికి రైతుల ఆదాయం రెట్టింపు చేయాలన్న నా కల సాకారం కావడానికి ఈ చర్య సహాయ పడుతుంది.

నా తోటి సోదర, సోదరీమణులారా, ఒకదాని తరువాత ఒకటిగా వచ్ఛే ప్రభుత్వాలు తమ ప్రతిష్టను మెరుగు పరుచుకోవడానికి తగిన జనరంజకమైన ప్రకటనలు, చర్యలు చేపట్టి రాష్ట్ర ఖజానాను ఖాళీ చేయడం మన దేశ సంప్రదాయంగా మారింది. ఈ పద్దతిని మార్చడానికి నేను ప్రయత్నించాను. పూర్తి పరివర్తన, పూర్తి పారదర్శకత తో కూడిన పరివర్తన పై దృష్టి పెట్టాను. సంస్కరణ, నిర్వహణ, పరివర్తన అనే మంత్రాన్ని అన్ని రంగాలలో, అన్ని స్థాయిలలో అమలు చేయడం జరిగింది.

నా తోటి సోదర, సోదరీమణులారా ! నా ప్రభుత్వం దెస ప్రతిష్టను ఇనుమడింపచేయడానికి కృషి చేస్తోంది. కానీ ఏ ఒక్క పార్టీ ప్రతిష్ట నో పెంపొందించడానికి కాదు. దేశ ప్రతిష్ట పెరిగితేనే భవిష్యత్ తరాలకు ప్రయోజనకరంగా ఉంటుంది. అందువల్లే ప్రభుత్వ ప్రతిష్ట కన్నా, దేశ ప్రతిష్ట పెంచడానికే మేము కృషి చేస్తున్నాము.

అన్ని రంగాలలో మేము చేసిన విస్తృతమైన పనిని మీరు కూడా గమనించే ఉంటారు. రైల్వేల విషయానికి వస్తే – ఒక స్థాయి లో రైళ్లలో ” బయో మరుగుదొడ్లు ” ఏర్పాటు గురించి మాట్లాడుతున్నాము. మరో వైపు దేశంలో బుల్లెట్ రైళ్లను ప్రవేశపెట్టాలని కూడా కలలు కంటున్నాము. ఒక వైపు భూమి ఆరోగ్య కార్డుల గురించి మాట్లాడుతున్నాము. మరో వైపు ఉపగ్రహ, అంతరిక్ష పరిజ్ఞానం గురించి అడుగులు వేస్తున్నాము. మేము కేవలం ” స్టాండప్ ఇండియా” గురించి మాట్లాడడమే కాదు. ” స్టార్టప్ ఇండియా ” అమలు కోసం చర్యలు తీసుకుంటున్నాము. ప్రతీకవాదంతో కూడిన పదార్థవాదంపై మేము దృష్టి కేంద్రీకరించాము. ఏదో ఒక మారుమూల అభివృద్ధి కంటే ఒక సమీకృత అభివృద్ధి పైనే మేము దృష్టి పెట్టాము. అర్హత కోసం కంటే సాధికారత కోసం మేము కృషి చేస్తున్నాము.

నా తోటి సోదర సోదరీమణులారా, ఈ దిశలో కొత్త విధానాలు ప్రకటించడం ద్వారా ప్రభుత్వం గుర్తింపు పొందింది. గత ప్రభుత్వం ప్రకటించిన ఏదైనా పథకంలో లోపాలు, ప్రతిబంధకాలు ఉంటే వాటిని కొత్త ప్రభుత్వం సరిదిద్ది కొనసాగించి ముందుకు తీసుకుని వెళ్ళడానికే కట్టుబడి ఉంది. ప్రజాస్వామ్యంలో ఎటువంటి అహంభావానికి గానీ, అహంకారానికి గానీ తావులేదు. ఈ విషయంలో మా ప్రభుత్వం అత్యంత వినయంతో గత ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను, విధానాలనూ – మా పని సంస్కృతిలో భాగంగా దేశ ఆర్థికాభివృద్ధి, దేశ సర్వతోముఖాభివృద్ధి కోసం ముందుకు తీసుకువెళుతోంది. “ప్రగతి” ద్వారా ఈ కార్యక్రమాలను నేను స్వయంగా పరిశీలించి, సమీక్షిస్తున్నాను. ఏడున్నర కోట్ల రూపాయల వ్యయంతో గత ప్రభుత్వాలు ప్రకటించిన 118 ప్రాజెక్టులు వివిధ పెండింగులో ఉన్నాయని తెలిస్తే మీరు ఆశ్చర్యపోతారు. అటువంటి ప్రాజెక్టులను నేను పునరుద్ధరించాను. వాటిని పూర్తి చేయాలని ఆదేశించాను. ప్రభుత్వం ఇప్పుడు ఆ పని మీదే ఉంది. ప్రాజెక్టుల పర్యవేక్షణ బృందాన్ని మేము చేశాము. గతంలో ప్రారంభమైన ప్రాజెక్టులను గుర్తించవలసిందిగా నేను ప్రత్యేకంగా ఆదేశించాను. వీటిలో కొన్ని 20 ఏళ్ల క్రితం, కొన్ని 25 ఏళ్ల క్రితం, మరి కొన్ని 30 ఏళ్ల క్రితం, కొన్ని 15 ఏళ్ల క్రితం ప్రారంభమైనవి ఉన్నాయి. ఆయా ప్రాంతాల్లో నివసించేవారికి వీటి గురించి తెలిసే ఉంటుంది. అటువంటి 270 ప్రాజెక్టులను మేము గుర్తించాము. వీటి కోసం దాదాపు 10 లక్షల కోట్ల రూపాయలు అంచనా వేశాము. వీటిలో కొన్ని గత ప్రభుత్వాలు కేవలం శంకుస్థాపనలు చేసి వదలివేసినవి కూడా ఉన్నాయి. వీటిలో కొన్నింటిపై 1,000 కోట్ల నుండి 2,000 కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టగా, అవి ఇప్పుడు నిరుపయోగం అయినవి కూడా ఉన్నాయి.

సోదర, సోదరీమణులారా ! ప్రణాళికలకు ప్రతిబంధకాలు కల్పించడం, ప్రాజెక్టులను జాప్యం చెయ్యడం, ధనాన్ని వ్యర్ధంగా ఖర్చు చేయడం ఒక నేరపూరితమైన నిర్లక్ష్యంగా పేర్కొనవచ్చు. ఈ ప్రాజెక్టులను పనికి వచ్చేవిగా, అనుకూలమైనవి గా తీర్చి దిద్దడానికి మేము తిరిగి ప్రయత్నించాము. సోదర, సోదరీమణులారా, రైల్వే ప్రాజెక్టులు క్లియరెన్స్ పొందడానికి రెండేళ్లు పడుతుంది. ఏదైనా రైల్వే లైను ముందుకు వెళ్లాలంటే పై వంతెనలు నిర్మించాలి. రెండు వైపులా మంచి రహదారులను నిర్మించాలి. అయితే క్లియరెన్స్ కు రెండు సంవత్సరాలకంటే ఎక్కువ సమయం పట్టేది. సోదర, సోదరీమణులారా! అటువంటిది మేము ఈ రోజు మూడు నెలల్లో పూర్తిచేస్తున్నాము. గరిష్ఠంగా ఆరు నెలల సమయం క్లియరెన్స్ కోసం తీసుకుంటున్నాము. అంత వేగాన్ని మేము చేరుకోగలిగాము.

సోదర, సోదరీమణులారా, మేము ఏ పని చేసినా, ఏ ప్రణాళిక చేసినా – సుపరిపాలనే మా ప్రభుత్వ ధ్యేయంగా ముందుకు వెడుతున్నాము. వరుసలో చివరన ఉన్న వ్యక్తి కూడా లబ్ది చూస్తున్నాము. సోదర, సోదరీమణులారా, ఎప్పుడైతే స్పష్టమైన విధానం, స్పష్టమైన అంగీకారం, స్వచ్ఛమైన అంగీకారం ఉంటాయో – అక్కడ మాత్రమే – నిర్ణయం తీసుకోడానికి తగిన స్ఫూర్తి ఉంటుంది. అక్కడ మాత్రమే ఎటువంటి ఆంక్షలు లేని నిర్ణయాలు తీసుకోడానికి అవకాశం ఉంటుంది.

అటువంటి స్పష్టమైన విధానాలు, స్పష్టమైన అంగీకారం, స్పష్టమైన నిర్ణయాల వల్లే – వరుస లోని చివరి వ్యక్తి కూడా ప్రయోజనం పొందే విధంగా కృషి చేస్తూ మా ప్రభుత్వం ముందుకు సాగుతోంది.

ఉత్తరప్రదేశ్ పత్రికలను మనం తిరగవేస్తే, ఏడాదీ చెరకు రైతుల బకాయిలు ప్రతిసారి ఒక చర్చనీయాంశంగా ఉంటుంది. ఈ విషయంలో చక్కర మిల్లులు ఏమీ చెయ్యవు. రాష్ట్ర ప్రభుత్వం కూడా పట్టించుకోదు. ఇది రైతుల సమస్య. ఈ బకాయిలు వేల కోట్ల రూపాయల మేర పేరుకుపోయాయి. దీని కోసం మేము ఒక ప్రణాళిక చేశాము. ఈ ప్రయోజనం ఆఖరు రైతు వరకూ చేర్చాలన్నదే మా లక్ష్యం. వేల కోట్ల రూపాయల మేర బకాయిలు ఎంత ఉన్నా సరే. సోదర సోదరీమణులారా, నేను చాలా సంతృప్తితో చెబుతున్నాను. పాత బకాయిల్లో 99.5 శాతం మేర చెల్లించడం జరిగింది. ఈ సారి మార్కెట్లో ఎంత మొత్తంలో చెరకును కొనుగోలు చేయడం జరిగిందో – నేను సంతృప్తితో చెబుతున్నాను. 95 శాతం రైతులకు వారి పంటకు తగిన మొత్తాన్ని చెల్లించడం జరిగింది. మిగిలిన 5 శాతం మంది రైతులకు కూడా రాబోయే రోజుల్లో చెల్లించడం జరుగుతుంది.

సోద‌ర సోద‌రీమ‌ణులారా, పేద కుటుంబాల‌కు ఎల్ పి జి క‌నెక్ష‌న్ లను అందించే కార్య‌క్ర‌మాన్ని మేం చేప‌ట్టాము. నా త‌ల్లులను వంట ఇంటి పొగ బారి నుండి త‌ప్పించ‌డానికి ‘ఉజ్జ్వల’ ప‌థ‌కం కింద ఎంతో శ‌క్తివంత‌మైన ప‌థ‌కాన్ని మొద‌లుపెట్టాము. ఈ ప్రాజెక్టు కింద‌ రాబోయే మూడు సంవ‌త్స‌రాల్లో 5 కోట్ల కుటుంబాలకు గ్యాస్ స్ట‌వ్ ల‌ను అందించ‌బోతున్నాము. దీనికి సంబంధించిన ప‌ని కొన‌సాగుతోంది. 50 ల‌క్ష‌ల కుటుంబాల‌కు ల‌బ్ధిని చేకూర్చ‌డం జ‌రిగింది. అది కూడా వంద‌ రోజుల్లోనే. ఈ లెక్క‌న ఈ కార్య‌క్ర‌మాన్ని మూడు సంవ‌త్స‌రాల్లోపే పూర్తి చేయ‌గ‌లుగుతాము. ల‌బ్ధి దారుల్లో చిట్ట‌చివ‌రి వ్య‌క్తికూడా గ్యాస్ స్ట‌వ్ ను అందించ‌డంకోసం మేం తీవ్రంగా శ్ర‌మిస్తున్నాము.

వాట్సాప్‌, సెల్ ఫోన్ సందేశాలు, ఆన్ లైన్‌, ఇ- మెయిల్ మొద‌లైన స‌మాచార సాంకేతిక‌త కార‌ణంగా క్ర‌మ‌క్ర‌మంగా తపాలా కార్యాలాయాలు నిరుప‌యోగంగా మారుతున్నాయి. పోస్టాఫీసులు మ‌న అస్తిత్వానికి ఒక ఉదాహ‌ర‌ణ‌గా నిలచాయి. అందుకోసం వాటిని మేము పున‌రుద్ధ‌రించి, వాటిలో త‌గిన శ‌క్తిని నింపుతున్నాము. ఇప్పుడ‌వి పేద‌, సామాన్య వ్య‌క్తుల‌తో బంధాన్ని కలిగి వుండేలా చేయ‌గ‌లిగాము. భార‌త‌దేశంలో సామాన్య ప్ర‌జ‌ల ప్రేమ ఆప్యాయ‌త‌లు పొందిన‌ ప్ర‌భుత్వ ప్ర‌తినిధి ఎవ‌రైనా ఉన్నారంటే అది పోస్ట్ మన్ అని చెప్ప‌గ‌ల‌ను. ప్ర‌తి ఒక‌రు పోస్ట్ మన్ ను ప్రేమిస్తారు. అంతే కాదు పోస్ట్ మన్ అంద‌రినీ ప్రేమిస్తాడు. అయితే మ‌నం ఎప్పుడూ వారి గురించి ప‌ట్టించుకోలేదు. మేం ఒక అడుగు ముందుకేసి, మ‌న పోస్టాఫీసుల‌ను చెల్లింపుల బ్యాంకులుగా మార్చేశాము. ఈ చెల్లింపుల బ్యాంకుల ప్రారంభం కార‌ణంగా దేశ‌వ్యాప్తంగా గ‌ల అన్నిగ్రామాల‌లో బ్యాంకుల శాఖ‌లు విస్త‌రిస్తాయి. జ‌న్ ధ‌న్ అకౌంట్ ల‌బ్ధి కూడా అందుబాటులోకి వ‌స్తుంది. ఇప్పుడు ఎమ్ ఎన్ ఆర్ ఇ జి ఎ డ‌బ్బు చెల్లింపు కూడా ఆధార్ కార్డు ద్వారా సాధార‌ణ ప్ర‌జ‌ల అకౌంటులో జ‌మ‌వుతుంది. దీని కార‌ణంగా అవినీతి త‌గ్గుముఖం ప‌డుతుంది.

సోద‌ర సోద‌రీమ‌ణులారా, మ‌న దేశంలో ప‌బ్లిక్ సెక్ట‌ర్ యూనిట్లు ప‌త‌నం కావ‌డానికే ఏర్ప‌డ్డాయి. అప‌జ‌యం పొంద‌డానికి, మూత ప‌డ‌డానికి లేదా అమ్ముడుపోవ‌డానికి ఏర్ప‌డ్డాయి. అయితే ఇదంతా చ‌రిత్ర‌. మేం స‌రికొత్త సంస్కృతిని తేవ‌డానికి ప్ర‌య‌త్నించాము. ఇప్పుడు మొద‌టిసారిగా సంతృప్తిగా నేను ఒక విష‌యం చెప్ప‌గ‌ల‌ను. చెడ్డ‌పేరు మూట‌గ‌ట్టుకున్న‌ ఆకాశ‌వాణి గ‌త సంవ‌త్స‌రం నిర్వ‌హ‌ణాప‌ర‌మైన లాభాన్ని న‌మోదు చేసింది. ప్ర‌పంచ‌వ్యాప్తంగా గ‌ల టెలిక‌మ్యూనికేష‌న్ కంపెనీలు లాభాల‌ను ఆర్జిస్తుంటే బి ఎస్ ఎన్ ఎల్ ప‌త‌న‌మ‌వుతూ వ‌చ్చింది. అయితే మొద‌టిసారిగా నిర్వ‌హ‌ణా ప‌ర‌మైన లాభాన్ని పొంద‌డంలో బి ఎస్ ఎన్ ఎల్ విజ‌యం సాధించ‌గ‌లిగింది. షిప్పింగ్ కార్పొరేష‌న్ లాభాల్లోకి రాగ‌ల‌ద‌ని ఎవ‌రూ అనుకునే వారు కాదు. ఈ రోజున భార‌తీయ షిప్పింగ్ కార్పొరేష‌న్ లాభాల‌ను ఆర్జిస్తోంది. విద్యుత్ త‌యారీ కేంద్రాలు వ‌చ్చే వారం ప‌ని చేస్తాయో లేదో, వాటికి కావల‌సిన బొగ్గు చేరుతుందో లేదో అనే విష‌యం ఎవ‌రికీ తెలిసేది కాదు. బొగ్గు కొర‌త‌తో అనేక విద్యుత్ త‌యారీ కేంద్రాలు మూత‌ప‌డుతున్నాయ‌నే వార్త‌లు వెలువ‌డుతుండేవి. ఈ రోజున విద్యుత్ త‌యారీ కేంద్రాల ద‌గ్గ‌ర బొగ్గు పుష్క‌లంగా వుంది. ఆ కేంద్రాలకు ఎన్ని నెల‌లు కావాలంటే అన్ని నెల‌ల‌ పాటు బొగ్గు ల‌భ్య‌మ‌వుతోంది.

సోద‌ర సోద‌రీమ‌ణులారా, మ‌నం ఈ ప‌నుల‌ను చేయ‌గ‌లిగాము. మీరు ఆ ప‌నుల‌ను క‌ళ్లారా చూశారు. భారీ స్థాయి అవినీతి గురించి దేశంలో అప్పుడ‌ప్పుడు చ‌ర్చ‌లు న‌డుస్తున్నాయి. కింది స్థాయిలోని సామాన్యులు ఈ అవినీతి కార‌ణంగా చాలా ఇబ్బంది ప‌డుతున్నారు. దాంతో డ‌బ్బు వృథా అవుతోంది. మేం ఆధార్ కార్డును, ఆధార్ నంబ‌రును ప్ర‌భుత్వ ప‌థ‌కాల‌తో అనుసంధానించాము. సోద‌ర సోద‌రీమ‌ణులారా, ఒక‌ప్పుడు వితంతువుల ఫించ‌న్ కావొచ్చు, ఉపకార వేతనాలు కావొచ్చు, దివ్యాంగుల పథకాలు కావొచ్చు, లేదా అల్పసంఖ్యాక వర్గాల వారి స్కీములు కావొచ్చు.. ప్ర‌భుత్వ ఖ‌జానా నుండి డ‌బ్బును చెల్లించేవాళ్లం. ల‌బ్ధి దారుల జాబితా త‌యారుగా ఉండేది. అయితే మేము లోతుగా విచారించిన‌ప్పుడు ఈ జాబితాలో జ‌న్మించ‌ని వారి పేర్లు కూడా ఉండేవి. పుట్ట‌ని వారు కూడా ల‌బ్ధి పొందుతుండే వారు. ఆ విధంగా ద‌ళారులు కోట్లాది రూపాయ‌ల‌ను మింగేస్తుండే వారు. ఈ విష‌యాన్ని ఎవ‌రూ గ‌మ‌నించ‌లేదు. మేము అలాంటి వారిని వ్య‌వ‌స్థ‌ నుండి త‌రిమేశాము. ల‌బ్ధిదారుల‌కు చెల్లించాల్సిన డ‌బ్బును మేము నేరుగా వారి ఖాతాల‌కే చెల్లిస్తున్నాము. ల‌బ్ధిదారులైన‌ప్ప‌టికీ ఒక పైసా అయినా అంద‌ని వారు ల‌క్ష‌లాది మంది ఉన్నార‌ని మేము గ‌మ‌నించాము. అయినా కోట్లాది రూపాయ‌లు గ‌తంలో బ‌దిలీ అయ్యేది. ఇప్పుడ‌దంతా గ‌తం. చాలా డ‌బ్బును ఆదా చేయ‌డం జ‌రిగింది. ల‌బ్ధిదారులైన‌ప్ప‌టికీ, ఇంత‌వ‌ర‌కూ ఏ విధంగానూ సాయం పొంద‌నివారున్నారు. వారిని గుర్తించి, ఆదా చేసిన డ‌బ్బును వారి ఖాతాల‌కే అందిస్తాము. త‌మ హ‌క్కుల‌ కోసం పోరాడేవారికి ల‌బ్ధిని చేకూరుస్తాము. చివ‌రి మ‌నిషికి కూడా ల‌బ్ధి చేకూర్చాల‌నే దిశ‌గా మేం ప‌ని చేస్తున్నాము. మేము దానిని సాధించాము.

పార‌ద‌ర్శ‌క‌త శ‌క్తి ఎలాంటిదో అంద‌రికీ తెలుసు. బొగ్గు గ‌నుల రంగంలో విస్త‌రించిన అవినీతి గురించి అంద‌రికీ తెలుసు. ఇప్పుడు బొగ్గు వేలంలో ఎలాంటి ఆరోప‌ణ‌లు లేవు. రాబోయే రోజులలో ఆయా రాష్ట్రాలు మ‌రింత బొగ్గు ఉత్ప‌త్తిని సాధిస్తాయి. వాటికి మ‌రింత అధికంగా ఆదాయం వ‌స్తుంది. స్పెక్ట్ర‌మ్ వేలానికి సంబంధించి అనేక ఆరోప‌ణ‌లు వెల్లువెత్తేవి. మేము దాని వేలాన్ని ఆన్ లైన్ ద్వారా నిర్వ‌హించాము. దేశ ఖ‌జానాకు మంచి ఆదాయం చేకూరింది. దీనివ‌ల్ల ఆరోగ్య‌గ‌ర‌మైన వాతావ‌ర‌ణం నెల‌కొంది. దేశానికి ల‌బ్ధి చేకూరింది.

సోద‌ర సోద‌రీమ‌ణులారా, ప్ర‌పంచ‌మంతా ఇప్పుడు అంత‌ర్జాతీయ ఆర్ధిక శ‌కంలో ప‌య‌నిస్తోంది. ప్ర‌తి దేశం ఒక‌దానితో మ‌రొక‌టి సంబంధం క‌లిగి ఉంది.. ఒక‌దాని మీద మ‌రొక‌టి ఆధార‌ప‌డి వుంది. మొత్తం ప్ర‌పంచం ఏదో విధంగా ఆర్ధిక అంశాల ద్వారా అనుసంధానమై ఉంది. ఏది ఏమైన‌ప్ప‌టికీ, మ‌నము ప్ర‌గ‌తిని సాధిస్తున్న‌కొద్దీ మ‌నము అంత‌ర్జాతీయ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను, అంత‌ర్జాతీయ గోదాను మ‌రచిపోకుండా ముందుకు సాగాలి. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌ను విజ‌య‌వంతంగా అందుకోవ‌డ‌మే కాకుండా మ‌న ప్ర‌మాణాలు కూడా వాటికి స‌మానంగా ఉండాలి. అప్పుడే మ‌న‌కు గుర్తింపు వ‌స్తుంది. అప్పుడే మ‌నము ప్ర‌పంచానికి అందించ‌గ‌లము. అలాగ‌యితేనే ఒక రోజంటూ మ‌న‌కూ వ‌స్తుంది.. అప్పుడు ప్ర‌పంచ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌కు సార‌థ్యం వ‌హించ‌గ‌లుగుతాము. కాబ‌ట్టి అన్ని స‌మ‌యాల్లోను మ‌నం సిద్ధంగా ఉండాలి. అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల‌కు అనుగుణంగా మ‌న‌ల్ని తీర్చిదిద్దుకోవాలి. మీకు తెలుసు, ఈ మ‌ధ్య‌కాలంలో ప్ర‌పంచ‌ బ్యాంకు, ఐ ఎమ్ ఎఫ్‌, వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్, క్రెడిట్ రేటింగు ఏజెన్సీలు, ఇంకా అలాంటి ప‌లు అంత‌ర్జాతీయ ఏజెన్సీలు భార‌త‌దేశ ప్ర‌గ‌తిని ప్ర‌శంసించాయి. న్యాయ సంస్క‌ర‌ణ‌ల విష‌యంలోను, వ్య‌వ‌స్థా ప‌ర‌మైన సంస్క‌ర‌ణ‌ల్లోను, వ్య‌వహార‌శైలిలోను వ‌రుస‌గా తీసుకుంటున్న నిర్ణ‌యాల‌ను ప్ర‌పంచం గ‌మ‌నిస్తోంది. సులువుగా వ్యాపారం చేసుకోవ‌డానికి వీలుగా మ‌న దేశ ర్యాంకును చాలా వేగంగా మెరుగుప‌రుచుకున్నాము. విదేశీ ప్ర‌త్య‌క్ష పెట్టుబ‌డుల్లో అనుకూల‌మైన దేశంగా భారతదేశానికి పేరు వ‌చ్చింది. వృద్ధి రేటులోను, జి డి పిలోను భారీ ఆర్ధిక వ్య‌వ‌స్థ‌లను క‌లిగిన దేశాల‌ను దాటి వ‌చ్చాం.

నా సోద‌ర సోద‌రీమ‌ణులారా, రాబోయే రెండు సంవ‌త్స‌రాలలో భార‌త‌దేశం ఎలా ఉంటుందో తెలియ‌జేస్తూ ఐక్య‌ రాజ్య‌ స‌మితి ఒక అంచ‌నాను వెలువ‌రించింది. ఈ అంచ‌నా ప్ర‌కారం ప్ర‌పంచ ఆర్ధిక‌ రంగంలో ఇప్పుడు ప‌దో స్థానంలో వున్న భార‌త‌దేశం రాబోయే రెండు సంవ‌త్స‌రాల్లో మూడో స్థానానికి చేరుకుంటుంది. నా సోద‌ర సోద‌రీమ‌ణులారా, ఏ దేశానికైనా రేటింగు ఇవ్వాల‌న‌కుంటే అంత‌ర్జాతీయ ప్ర‌మాణాల ప్ర‌కారం లాజిస్టిక్స్ ప‌రంగా ఎలాంటి మ‌ద్ద‌తు ఉంది, మౌలిక సౌక‌ర్యాలు ఎలా ఉన్నాయ‌నే విష‌యాల‌ను ప‌రిగ‌ణ‌నలోకి తీసుకుంటారు. అంతే కాదు.. వారు అభివృద్ధి చెందిన, సంప‌ద క‌లిగిన‌ దేశాల సామ‌ర్థ్యంతో మ‌న దేశ సామ‌ర్థ్యాన్ని పోల్చి చూస్తారు. భార‌త‌దేశంలో లాజిస్టిక్స్ మ‌ద్ద‌తు, మౌలిక సౌక‌ర్యాల ప‌రంగా ప‌రిస్థితి ఎలా ఉన్నదీ తెలియ‌జేయ‌డానికిగాను వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ విశ్లేష‌ణ చేసింది. రేటింగు సూచిక‌ల్లో భార‌త‌దేశం వేగంగా ప్ర‌గ‌తి సూచిస్తోంద‌ని 19 స్థానాల‌ పైకి ఎగ‌బాకింద‌ని తేల్చింది.

నా సోద‌ర సోద‌రీమ‌ణులారా, అంత‌ర్జాతీయంగా చూసిన‌ప్పుడు భార‌త‌దేశ ఆర్ధిక‌ రంగం ఎంతో ఉజ్జ్వలంగా ఉంది. ఆశించిన స్థాయిలో ప్ర‌గ‌తిని సాధిస్తోంది. జి ఎస్ టి కి పార్ల‌మెంట్ ఆమోదం తెల‌ప‌డ‌మ‌నేది మ‌న ఆర్ధిక వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేసింది. దీనిని సాధ్యం చేసినందుకు అన్ని రాజ‌కీయ పార్టీలు ప్ర‌శంసార్హ‌మైన‌వే.

నా సోద‌ర సోదరీమ‌ణులారా, ఎర్ర‌ కోట వేదిక మీద‌ నుండే నేను ‘బేటీ బ‌చావో- బేటీ ప‌ఢావో’ ను గురించి ప్ర‌సంగించాను. మ‌నం ముక్కలు ముక్క‌లుగా చేసి, దాని ప్ర‌కారం ప‌ని చేయం. మ‌న విధానాల అమలు కోసం మ‌న ద‌గ్గ‌ర అంద‌రినీ క‌లుపుకొనివెళ్లే విధానం ఉంది. ‘బేటీ బ‌చావో- బేటీ ప‌ఢావో’ ఉద్య‌మాన్ని విజ‌య‌వంతం చేయ‌డానికి నాకు మీ అంద‌రి ద‌గ్గ‌ర‌ నుండి స‌హ‌కారం కావాలి. ఈ విష‌యంలో త‌ల్లితండ్రులంద‌రూ మేలుకోవాలి. మ‌నం మ‌న కుమార్తెలకు గౌర‌వం ఇవ్వాలి. వారికి భ‌ద్ర‌తను ఇవ్వాలి. వారు ప్ర‌భుత్వ విధానాల‌ నుండి ల‌బ్ధిని పొందేటట్లు చూడాలి. ‘సుక‌న్య స‌మృద్ధి యోజ‌న’ ద్వారా మ‌నం కోట్లాది కుటుంబాల‌ను ద‌గ్గ‌ర‌కు తేగ‌లిగాం. మ‌న ఆడ‌బిడ్డ‌లు పెద్ద‌వారు కాగానే వారి అవ‌స‌రాల‌కోసం ఈ స్కీము ఉప‌యోగ‌ప‌డుతుంది. మ‌న బీమా విధానాలు మ‌న మ‌హిళ‌ల‌కు అత్య‌ధికంగా ల‌బ్ధి చేకూర్చ‌గ‌లిగేలా రూపొందించ‌గ‌లిగాం. ఆర్ధికంగాను, ఆరోగ్య‌ప‌రంగానూ మ‌న మ‌హిళ‌లు సాధికారితను సాధించడానికి వీలుగా ఇంద్ర‌ధ‌నుష్ వాక్సినేష‌న్ ప్రోగ్రామును ప్రారంభించాము. ఈ రెండు విష‌యాల్లోను మ‌నం మ‌న మ‌హిళ‌లు సాధికారితను సాధించేలా చూడ‌గ‌లిగితే వారికి విద్య‌ను అందించ‌గ‌లిగితే అప్పుడే మ‌హిళ‌లకు సంబంధించిన అస‌లు సిస‌లు సాధికారిత సాధ్య‌మ‌వుతుంది. ఒక మ‌హిళ విద్యావంతురాలైతే, ఆరోగ్యంగా ఉండి ఆర్ధికంగా త‌న కాళ్ల మీద తాను నిల‌బ‌డ‌గ‌లిగితే అప్పుడు ఆమె పేద‌రికాన్ని జ‌యించ‌గ‌లిగే సామ‌ర్థ్యాన్ని పొంద‌గ‌లుగుతుంది. అందుకే మేము ఆరోగ్య‌, ఆర్ధిక రంగాలలో మ‌హిళ‌లు సాధికారితను సాధించేందుకు కృషి చేస్తున్నాము. మేము ముద్ర యోజ‌నను ప్ర‌వేశ‌పెట్టాం. ఈ స్కీము ద్వారా 3.5 కోట్ల కుటుంబాలు ల‌బ్ధి పొందాయ‌ని తెలిసి చాలా సంతోషిస్తున్నాను. వీరిలో చాలా మంది బ్యాంకుల‌ను మొద‌టిసారి సంద‌ర్శించారు. వీరిలో 80 శాతం మంది ఎస్ సి, ఎస్ టి, ఒ బి సి ల‌కు చెందిన వారు. ముద్ర యోజ‌న కింద 80 శాతం మంది మ‌హిళ‌లు రుణాలు తీసుకున్నారు. వీరు దేశ ఆర్ధిక అభివృద్ధికి ఎలా కృషి చేస్తార‌నేది తెలుసుకోవ‌డం మ‌నంద‌రికీ ముఖ్యం.

సోద‌ర సోద‌రీమ‌ణులారా, దేశ అభివృద్ధి ప్ర‌యాణంలో భాగ‌స్వాములైన మ‌న మ‌హిళ‌లు ప్ర‌స‌వించిన త‌రువాత సెల‌వు తీసుకోవ‌డానికి వీలుగా గ‌త వారం మ‌నము నిర్ణ‌యం తీసుకున్నాము. గ‌తంలో వారికి ప్రసూతి సెల‌వు చాలా త‌క్కువ రోజులు మాత్ర‌మే వ‌చ్చేది. ఇప్పుడు ఈ సెల‌వును 26 వారాల‌కు పొడిగించాము. దానితో త‌ల్లులు త‌మ పిల్ల‌ల పెంప‌కంలో మ‌రిన్ని జాగ్ర‌త్త‌లు తీసుకోగ‌లుగుతారు.

ఇక నేత‌న్న‌ల విష‌యానికి వ‌స్తే, జౌళి రంగంలో ప‌నిచేసే వారు గ‌తంలో వంద రూపాయ‌లు పొందే వారు. ఈ మొత్తాన్ని మ‌నం 190 రూపాయ‌లు చేశాము. దాంతో నేత‌ ప‌ని రంగంలో ఉన్న మ‌హిళ‌లు అభివృద్ధి సాధిస్తారు. సిల్కు ప‌నిలో వున్న మ‌హిళ‌లు, నేత ప‌నివారి కోసం వారి ఉత్ప‌త్తి ధ‌ర విష‌యంలో మీట‌రుకు యాబై రూపాయ‌ల వంతున పెంచాము. ఈ మొత్తం వ్యాపారుల‌, బ్రోక‌ర్ల బారిన ప‌డ‌కుండా జాగ్ర‌త్త‌లు తీసుకున్నాము. నేత ప‌ని చేసిన నేత‌న్న బ్యాంకు అకౌంటులో ఆ మొత్తం ప‌డుతుంది. మీట‌రు సిల్కుకు ఇచ్చే యాభై రూపాయలు నేత మ‌హిళ అకౌంటులోకి ఆధార్ కార్డు ఆధారంగా వెళ్తుంది. దానితో నేత‌న్న‌లు ఆర్ధికంగా బ‌లోపేత‌మ‌వుతారు. ఈ దిశ‌గా ఆలోచించే మేము ఈ పథకాన్ని ప్రారంభించాము. దాని ఫ‌లితం స్ప‌ష్టంగా క‌నిపిస్తోంది.

నా దేశ ప్ర‌జ‌లారా, రైలును చూసినా, తపాలా కార్యాలయాన్ని చూసినా మ‌న‌ క‌ళ్ల ముందు భార‌త‌దేశ ఐక‌మ‌త్యం క‌నిపిస్తుంది. భార‌త‌దేశ ఐక్య‌త‌ కోసం మ‌నం చేసే కృషి, వ్య‌వ‌స్థ‌లో మార్పు కోసం చేసే ప్ర‌య‌త్నాలు దేశ ఐక‌మ‌త్యాన్ని మ‌రింత బలోపేతం చేస్తాయి. ఇందుకోసం రైతుల‌కు ఉప‌యోప‌గ‌ప‌డేలా మండీ ఇ-ఎన్ ఎ ఎమ్ ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్టాము. ఈ రోజున రైతు త‌న పంట‌ల‌ను దేశంలోని ఏ మార్కెట్ నుండి అయినా ఆన్ లైన్ ద్వారా అమ్ముకోవ‌చ్చు. త‌న పొలాల‌ నుండి ప‌ది కిలోమీట‌ర్ల‌ దూరంలో ఉన్న మార్కెట్ కు తీసుకుపోయి అక్క‌డ త‌క్కువ ధ‌ర‌ల‌కు, త‌న క‌ష్టానికి త‌గిన ఆదాయం లేకుండా, త‌న పంట‌ల‌ను అమ్ముకునే దుస్థితి మ‌న రైతుల‌కు ఇక ముందుండ‌దు. ఇ-ఎన్ ఎ ఎమ్ అనేది ఒక ప్ర‌త్యేక‌మైన నెట్ వ‌ర్క్‌. దీని ద్వారా మండీ నెట్ వ‌ర్క్ ను ఏర్పాటు చేయ‌డం జ‌రిగింది.

జి ఎస్ టి ద్వారా ఏర్పాటు చేసిన ప‌న్నుల వ్య‌వ‌స్థ ఈ రంగంలో స‌మాన‌త్వాన్ని తెస్తుంది. ఉమ్మ‌డి వ్య‌వ‌స్థ దేశాన్ని ఐక్యంగా ఉంచుతుంది. గ‌తంలో దేశంలో కావ‌ల‌సినంత విద్యుత్ ఉన్న‌ప్ప‌టికీ అది నిరుప‌యోగంగా ఉండేదని తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు. మ‌రో ప‌క్క విద్యుత్ కొర‌త‌తో ప్ర‌జ‌లు చీక‌ట్లోనే నివ‌సించేవారు. ఫ్యాక్ట‌రీలు మూత‌ప‌డుతుండేవి. విద్యుత్ స‌ర‌ఫ‌రాలో మార్పులు తేవ‌డానికి మేము ఒకే దేశం-ఒకే గ్రిడ్‌-ఒకే ధ‌ర‌ల వ్య‌వ‌స్థ ప‌ద్ధ‌తిని విజ‌య‌వంతంగా ప్రారంభించాము. దీనిని కూడా చాలా త‌క్కువ స‌మ‌యంలో ప్రారంభించాము. గ‌తంలో వేస‌వికాలంలో ఒక యూనిట్ విద్యుత్ కోసం ప‌ది రూపాయ‌లు వెచ్చించేవారు. ఇప్ప‌టి ప‌రిస్థితిని తీసుకుంటే నేను తెలంగాణలో ప‌ర్య‌టించిన‌ప్పుడు నా ప‌ర్య‌ట‌న రోజు ఒక యూనిట్ విద్యుత్ ధ‌ర ఒక రూపాయి ప‌ది పైసలు. ఇది గ‌తంలో ప‌ది రూపాయ‌లుండేది. ఒకే ధ‌ర విధానం వ‌ల్ల దేశం ఐక‌మ‌త్యంగా ఉంటోంది.

మ‌న దేశంలో కార్మికుడు ఒక‌టి రెండు సంవ‌త్స‌రాలు ఒక చోట ప‌ని చేసి ఆ త‌రువాత మ‌రొక చోటుకు మారుతుంటాడు. ఆయనకు సంబంధించిన సొమ్ము కొంత ఇ పి ఎఫ్ లో జ‌మ‌వుతుంది. అయితే అది బ‌దిలీ కావ‌డానికి వీలుండేది కాదు. ఈ విష‌యం తెలిస్తే మీరు ఆశ్చ‌ర్య‌పోతారు, నేను ఈ ప్ర‌భుత్వ ప‌గ్గాలు తీసుకున్న త‌రువాత దేశంలోని కార్మికుల‌కు చెందిన 27 కోట్ల రూపాయ‌లు ఇ పి ఎఫ్ లో మూలుగుతూ ఉంది. ఆ డ‌బ్బును తీసుకునే వ్య‌వ‌స్థ లేక‌పోవ‌డంతో ఆ డ‌బ్బును ఏ కార్మికుడూ అందుకోలేక‌పోయాడు. మ‌న కార్మికుల‌కు వ‌చ్చిన ఈ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించ‌డానికి యూనివ‌ర్స‌ల్ అకౌంట్ నంబ‌రును ఇచ్చాం. ఇప్పుడు ఆ కార్మికుడు ఎక్క‌డ‌కు పోయినా వారి ఇ పి ఎఫ్ డ‌బ్బు బ‌దిలీ అవ‌తుంది. ఎప్పుడైతే కార్మికుడు రిటైర్ అవుతాడో, ఆయన డబ్బు ఆయనకు వ‌స్తుంది. అంతే త‌ప్ప, ప్ర‌భుత్వ ఖ‌జానాలో చిక్కుకుపోదు. ఈ కార్య‌క్ర‌మాన్ని మేము చేయ‌గ‌లిగాము.

భార‌త్ మాలా కావొచ్చు, సేతు భార‌తం కావొచ్చు లేదా భార‌త్ నెట్ అనండి..అలాంటి కార్య‌క్ర‌మాల‌ను మేము బ‌లోపేతం చేశాము. అలాంటి కార్య‌క్ర‌మాలు దేశ ఐక‌మ‌త్య దిశ‌గా రూపొందాలి. దేశ ఆర్ధికాభివృద్ధిని సాధించాలి. మేము ఆ దిశ‌గా ప‌ని చేస్తున్నాము.

సోద‌ర సోద‌రీమ‌ణులారా, ఈ సంవ‌త్స‌రం అనేక విధాలుగా చాలా ప్రాధాన్యాన్ని సంత‌రించుకున్న‌ది. ద‌క్షిణ భార‌త‌దేశానికి చెందిన శ్రీమాన్ రామానుజాచార్యుల వారి 1000వ జ‌యంతిని జ‌రుపుకొంటున్నాం. మ‌హాత్మ గాంధీ గురువు శ్రీమ‌ద్ రాజ్ చంద్రజీ 150వ జ‌యంతిని ఈ సంవ‌త్స‌ర‌మే జ‌రుపుకుంటున్నాం. శ్రీ గురు గోవింద సింగ్ జీ 350వ జ‌యంతి ఉత్స‌వాల‌ను ఈ సంవ‌త్స‌ర‌మే మ‌నం నిర్వ‌హించుకుంటున్నాం. అంతే కాదు పండిట్ దీన్ ద‌యాళ్ ఉపాధ్యాయ శ‌త‌ జ‌యంతి సంవ‌త్స‌రం కూడా ఈ ఏడాదే జ‌రుపుకుంటున్నాం. ఈ రోజున నేను శ్రీ రామానుజాచార్యుల‌ను స్మ‌రించుకుంటూ ఒక విష‌యాన్ని చెప్పాల‌నుకుంటున్నాను. ఇప్పుడు దేశంలో ఉన్న సామాజిక ఆందోళ‌న‌లు చూసిన‌ప్పుడు వంద‌లాది సంవ‌త్స‌రాల క్రిత‌మే రామానుజాచార్యులు స‌మాజానికి ఇచ్చిన సందేశం గుర్తుకొస్తోంది. ఉన్న‌త‌, అధ‌మ కులాల‌నే భావ‌న లేకుండా దైవ‌భ‌క్తులంద‌రూ సేవ చేయాల‌ని ఎలాంటి విచ‌క్ష‌ణ‌కు తావు లేకుండా మెల‌గాల‌ని ఆనాడు ఆయ‌న సందేశ‌మిచ్చారు. అంద‌రికీ గౌర‌వం ఇవ్వండి. కులాన్నిబ‌ట్టి, వ‌య‌స్సును బ‌ట్టి ఎవ‌రినీ అవ‌మానించ‌వ‌ద్ద‌ని ఆయ‌న సందేశ‌మిచ్చారు. గాంధీ జీ, అంబేద్క‌ర్ జీ, రామానుజాచార్య జీ, భ‌గ‌వాన్ బుద్ధ‌, మ‌న పురాణాలు, ఆచార్యుల‌, ఉపాధ్యాయులు, సాధు పుంగ‌వులు.. ఎవ‌రైనా చెప్పింది సామాజిక ఐక్య‌తను సాధించాల‌నే. స‌మాజం విడిపోతే, దేశం ముక్క‌ల‌యితే ఉత్త‌మ‌, అధ‌మ కులాలంటూ విభ‌జ‌నయితే, అంట‌రానిత‌నం కార‌ణంగా విడిపోతే.. నా సోద‌ర సోద‌రీమ‌ణులారా.. అలాంటి స‌మాజం మ‌నుగ‌డ సాగించ‌లేదు. అవి ప్ర‌మాద‌క‌ర‌మైన పోక‌డ‌లు. శ‌తాబ్దాల త‌ర‌బ‌డి పాతుకుపోయిన దుష్ట సంప్ర‌దాయాలు. మ‌నం మ‌రింత సున్నిత‌త్వంతో మెలిగి అలాంటి చెడు సంప్ర‌దాయ‌ల‌కు మేలైన చికిత్స చేయాలి. మూఢ‌న‌మ్మ‌కాలుంటాయి.. అవి కొన‌సాగుతూనే ఉంటాయని అనుకుంటూ పోతే, ఈ స‌మ‌స్య ప‌రిష్కార‌మవ్వ‌దు. త‌ర‌త‌రాల చెడు సంప్ర‌ద‌యాల‌ను అరిక‌ట్ట‌డమ‌నేది 125 కోట్ల భార‌తీయులతో పాటు ప్ర‌భుత్వ బాధ్య‌త‌. స‌మాజం బాధ్య‌త‌. సంఘ‌ర్ష‌ణ‌ వాతావ‌ర‌ణం నుండి బయటప‌డ‌డానికి అంద‌ర‌మూ చేతులు క‌ల‌పాలి.

సోద‌ర, సోద‌రీమ‌ణులారా, మ‌నం సామాజిక దురాచారాల‌కు వ్య‌తిరేకంగా పోరాడాము. సామాజిక దురాచారాల‌ను అధిగ‌మించాము. ప్ర‌తి పౌరుడూ ఎదిగితేనే బ‌ల‌మైన భార‌త‌దేశాన్ని నిర్మించ‌గ‌లం. బ‌ల‌మైన స‌మాజం లేనిదే బ‌ల‌మైన భార‌తాన్ని నిర్మించ‌లేం. కేవ‌లం ఆర్థికాభివృద్ధి మాత్ర‌మే శ‌క్తిమంత‌మైన భార‌త‌దేశానికి భ‌రోసా ఇవ్వ‌లేదు. బ‌ల‌మైన స‌మాజ‌మే బ‌ల‌మైన భార‌తదేశానికి హామీ. సామాజిక న్యాయానికి భ‌రోసాతోనే బ‌ల‌మైన స‌మాజ నిర్మాణం సాధ్యం. సామాజిక న్యాయ పునాదుల‌పైనే బ‌ల‌మైన స‌మాజం నిర్మించ‌గ‌లము. కాబ‌ట్టి సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇవ్వ‌డం మ‌న బాధ్య‌త‌. ద‌ళితులు, బాధితులు, దోపిడీకి గురైన‌ వారు, నిరుపేద‌లు, గ్రామీణులు, ప‌ట్ట‌ణ‌వాసులు, విద్యావంతులు, నిర‌క్ష‌రాస్యులు, చిన్నాపెద్దా- ఎవ‌రైనా కావ‌చ్చు.. మొత్తం 125 కోట్ల‌ మంది దేశ‌వాసులూ మ‌న కుటుంబ‌మే. అంద‌ర‌మూ ఏక‌మై, మ‌న దేశాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు స‌మ‌ష్టిగా కృషి చేయ‌డం త‌ప్ప‌నిస‌రి.

సోద‌ర, సోద‌రీమ‌ణులారా. భారత్ యువ‌ దేశ‌మ‌న్న వాస్త‌వం ఇప్పుడు ప్ర‌పంచం దృష్టిని ఆక‌ర్షిస్తోంది. మ‌రి 35 ఏళ్ల‌ లోపు యువ‌త‌రం 80 కోట్ల‌ మంది జ‌నాభాలో 65 శాతంగా ఉన్న‌పుడు ఈ యువశ‌క్తితో దేశం సాధించ‌లేనిది ఏముంది ? కాబ‌ట్టి సోద‌రీ సోద‌రులారా, యువ‌త‌కు అవ‌కాశాలు ద‌క్కాలి. యువ‌త‌కు ఉపాధి ల‌భించాలి. ఇదే నేటి త‌రం డిమాండ్‌. నేడు మ‌నం పండిట్ దీన్‌ద‌యాళ్ ఉపాధ్యాయ్ శ‌త‌ జ‌యంతి దిశ‌గా సాగుతున్న నేప‌థ్యంలో స‌మాజంలో చిట్ట చివ‌రి వ్య‌క్తి సంక్షేమాన్ని గురించి ఆయ‌న ఆలోచ‌న‌ను గుర్తు తెచ్చుకుందాం. మ‌హాత్మ గాంధీ కూడా చెప్పింది ఇదే. పండిట్ దీన్‌ద‌యాళ్ ‘అంత్యోద‌య’ భావ‌న‌ను స్వీక‌రించారు. పండిట్ దీన్ ద‌యాళ్ రాజ‌కీయ సిద్ధాంతానికి కేంద్ర బిందువు స‌మాజంలోని చిట్టచివ‌రి వ్య‌క్తికీ సంక్షేమం. ఈ సిద్ధాంతం ప్ర‌కారం యువ‌త‌రంలో ప్ర‌తి ఒక్క‌రూ విద్యావంతులు కావాలి. ప్ర‌తి ఒక్క‌రూ నైపుణ్యం సాధించాలి. ప్ర‌తి ఒక్కరికీ తాము క‌న్న క‌ల‌లకు రూప‌మివ్వ‌గ‌ల అవ‌కాశం ల‌భించాలి. పండిట్ దీన్‌ద‌యాళ్ స్వ‌ప్నాన్ని సాకారం చేసే దిశ‌గా దేశంలోని 80 కోట్ల‌ మంది యువ‌త ఆకాంక్ష‌లు నెర‌వేర్చేందుకు అనేక చ‌ర్య‌లు తీసుకున్నాము. ఆ మేర‌కు కొత్త రోడ్ల‌ను నిర్మిస్తున్నాము. దేశం మ‌రిన్ని వాహ‌నాల‌ను త‌యారుచేస్తోంది. మ‌రిన్ని సాఫ్ట్‌వేర్ ఎగుమ‌తులు చేస్తున్నాము. 50కిపైగా మొబైల్ త‌యారీ క‌ర్మాగారాలు ఏర్పాట‌య్యాయి. ఇవ‌న్నీ యువ‌త‌కు అవ‌కాశాలు క‌ల్పిస్తున్నాయి. 2 కోట్ల మ‌రుగుదొడ్లు నిర్మిస్తే ఎంద‌రో కొంద‌రికి ఉపాధి ల‌భించిన‌ట్టే. సిమెంటు, ఇనుము ఏదో ఒక‌ చోటు నుండి రావాలి. కొయ్య‌ ప‌ని మ‌రెక్క‌డో చేసి ఉండాలి. ప‌ని ప‌రిమాణం పెరిగే కొద్దీ, ఉపాధి అవకాశాలూ పెరుగుతాయి. ఆ దిశ‌గానే మేం ప‌నిచేస్తున్నాము.

ఈ దేశంలోని యువ‌త‌కు నైపుణ్యం క‌ల్పించేందుకు నైపుణ్యాభివృద్ధి కార్యక్ర‌మాన్ని ఉద్య‌మ స్థాయిలో తీసుకెళ్తున్నాము. ఇక చిన్న దుకాణ‌దారుల ల‌బ్ధికోసం మేం చ‌ట్టాన్ని స‌వ‌రించాము. చూడ‌డానికి ఇదో చిన్న అడుగుగానే క‌నిపించినా వ్యాపార సంస్థ‌ల న‌మూనా చ‌ట్టాన్ని ఆమోదించాము. రాష్ట్రాల‌న్నిటికీ స‌ల‌హా జారీ చేశాము. పెద్ద షాపింగ్ మాళ్ల త‌ర‌హాలో చిన్న దుకాణ‌దారులు కూడా ఏడాదిలో 365 రోజులూ అర్ధ‌రాత్రిదాకా దుకాణాలు తెరచి ఉంచుకొనేందుకు అనుమ‌తించాల‌ని సూచించాము. సాయంత్రం కాగానే చిన్న దుకాణ‌దారు ఎందుకు మూసివేయాలి ? ఆ చిన్న‌, పేద దుకాణ‌దారులు కూడా 365 రోజులూ అర్ధ‌రాత్రి దాకా దుకాణాన్ని తెరచి ఉంచుకొనే వీలు క‌ల్పించాలి. ఇక మ‌న సోద‌రీమణులు రాత్రివేళ ప‌నిచేసుకొనే అవ‌కాశాన్ని మ‌నం ఎందుకు క‌ల్పించ‌కూడ‌దు ? అందుకే రాత్రి వేళ కూడా మ‌న సోద‌రీమ‌ణులు ప‌నిచేసుకునేలా చ‌ట్ట నిబంధ‌న‌లను రూపొందించాము. మ‌నం వారి ర‌క్ష‌ణ‌, భ‌ద్ర‌త‌కు భ‌రోసా ఇస్తూనే వారు ప‌నిచేసుకునే అవ‌కాశం కూడా కల్పించాలి. ఉపాధి సృష్టికి తీసుకోవాల్సిన చ‌ర్య‌లివే. ఆ దిశ‌గానే మేము కృషి చేస్తున్నాము.

నా స‌హోద‌రీ, స‌హోద‌రులారా, స‌మ‌స్య‌ల‌ను దాట‌వేయ‌డంపై మాకు, మా ప్ర‌భుత్వానికి న‌మ్మ‌కం లేదు. స‌వాళ్ల‌పై మేము ఆల‌స్యం చేయం.. ఎదుర్కొంటాము. ఏదైనా చేయాలంటే స‌మ‌స్య‌ను ఢీకొనాలి. మ‌నం స్వాతంత్ర్య దినోత్స‌వం జరుపుకొంటూ ఉంటే, మ‌న సైనికులు స‌రిహ‌ద్దుల‌లో తూటాల‌ను ఎదుర్కొంటున్నారు. కొంద‌రు బంక‌ర్ల‌లో కూర్చుని శ‌త్రువును ఎదుర్కొన‌డానికి సిద్ధంగా ఉన్నారు. ర‌క్షా బంధ‌న్ రోజున కూడా వారిలో కొంద‌రు త‌మ అక్క‌చెల్లెళ్ల‌ను క‌లుసుకోలేరు. ఎందుకంటే, వారు స‌రిహ‌ద్దుల‌లో ఉన్నారు. అనేక‌మంది సైనికులు ర‌క్ష‌ణ బ‌ల‌గాల్లో ప‌నిచేస్తున్నారు. స్వాతంత్ర్యం వ‌చ్చాక మ‌న పోలీసులు 33,000 మంది వారి జీవితాల‌ను త్యాగం చేశారు. వారిని మ‌నం మ‌రచిపోగ‌ల‌మా ? మ‌న‌ం వారినెలా మ‌రువ‌గ‌లం.. మ‌నము శాంతియుత జీవితాలు గ‌డుపుతున్నామంటే, అది వారి త్యాగాల‌ వల్ల‌నే క‌దా. అందుకే ఈ సంద‌ర్భంలో వారికి మ‌నం వంద‌నం చేయాలి. ఒకే ర్యాంకు- ఒకే పెన్ష‌న్ విధానం చాలాకాలం పాటు మూల‌ప‌డింది. దానిని మేమొక స‌వాలుగా స్వీక‌రించి, ప‌రిష్క‌రించాము. ఒకే ర్యాంకు-ఒకే పెన్ష‌న్ స‌మ‌స్య‌ను ప‌రిష్క‌రించామ‌ని ప్ర‌క‌టించాక ప్ర‌తి భార‌తీయ సైనికుడూ సంతోష‌ప‌డ్డాడు.

నేతాజీ సుభాష్‌చంద్ర బోస్‌కు సంబంధించిన ప‌త్రాలను బ‌హిర్గ‌తం చేయాల‌ని మ‌న ప్ర‌జ‌లు కోరుకున్నారు. వారి ఆకాంక్షకు అనుగుణంగా ఎప్ప‌టి నుండో మ‌రుగున‌ప‌డిన‌, ప్ర‌జ‌ల దృష్టి నుండి త‌ప్పిస్తూ వ‌స్తున్న ఈ అంశాన్ని నా ప్ర‌భుత్వం ప‌రిష్క‌రించ త‌ల‌పెట్టింద‌ని నేను స‌విన‌యంగా చెప్ప‌ద‌ల‌చుకున్నాను. ఆ ప‌త్రాల్లోని అంశాల‌ను మేము వెల్ల‌డి చేశాము. నేతాజీ కుటుంబాన్ని ఆహ్వానించి, ఆ ప‌త్రాల‌ను బ‌హిర్గ‌తం చేశాము. ఈ ప్ర‌క్రియ ఇంకా కొన‌సాగుతూనే ఉంది. నేతాజీకి సంబంధించిన ప‌త్రాలు క‌లిగి ఉన్న ఇత‌ర దేశాల‌ను కూడా వాటిని బ‌హిర్గ‌తం చేయాల్సిందిగా నేను విజ్ఞ‌ప్తి చేశాను. సుభాష్ బాబుతో పాటు ఈ దేశానికి చెందిన చ‌రిత్ర‌ను తెలుసుకునే హ‌క్కు భార‌తదేశానికి ఉంది. కాబ‌ట్టే ఆ దిశ‌గా మేము ప‌నిచేశాము.

దేశ విభ‌జన నాటి నుండే బంగ్లాదేశ్‌తో మ‌న‌కు స‌రిహ‌ద్దు వివాదాలున్నాయి. అనేక ద‌శాబ్దాలుగా ఈ వివాదాలు అప‌రిష్కృతంగానే ఉండిపోయాయి. ఇప్పుడు అన్ని పార్టీల స‌హ‌కారం, స‌హాయంతో బంగ్లాదేశ్‌తో స‌రిహ‌ద్దు వివాదాన్ని ప‌రిష్క‌రించాము. రాజ్యాంగం మాకు ఆ బ‌ల‌మిచ్చింది.

నా స‌హ సోద‌రీ సోద‌రులారా, ఓ ఇల్లు క‌ట్టుకోవాల‌నో, ఓ ఫ్లాట్ కొనుక్కోవాల‌నో మ‌ధ్య‌త‌ర‌గ‌తి జ‌నం ఎన్నో క‌ల‌లు కంటారు. స్థిరాస్తి వ్యాపారులు అందంగా ముద్రించిన ఓ చిరుపొత్తాన్ని చూపి కొనుగోలుదారుల‌ను ఊరిస్తారు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జానీకానికి పెద్ద‌గా సాంకేతిక ప‌రిజ్ఞానం ఉండ‌దు. కానీ, భవనశిల్పులకు డ‌బ్బు చెల్లిస్తూ పోతారు. అయినా వారు స‌కాలంలో ఇళ్లు నిర్మించ‌రు. మ‌ధ్య‌త‌ర‌గ‌తి ప్ర‌జ‌లు జీవిత‌కాలమంతా శ్ర‌మించి పొదుపు చేసిన మొత్తాన్ని ఇలా ఏక‌మొత్త‌పు పెట్టుబ‌డిగా పెడ‌తారు. వారి ప్ర‌యోజ‌నాల ర‌క్ష‌ణ దిశ‌గా భవనశిల్పులను నియంత్రించేందుకు మేము రియ‌ల్ ఎస్టేట్ బిల్లును తెచ్చాము. ఇళ్లు కొనుగోలు చేసే మ‌ధ్య‌త‌ర‌గ‌తి వారికి ఈ చ‌ర్య ఎంతో స‌హాయ‌కారి అవుతుంది.

నా స‌హ సోద‌రీ సోద‌రులారా, నేను ఇంత‌కుముందు పేర్కొన్నట్లు శ్రీ‌మ‌ద్ రాజ్‌చంద్ర‌ గారి 150 జ‌యంతి ఇప్పుడు జ‌రుగుతోంది. శ్రీ‌మ‌ద్ రాజ్‌చంద్ర‌ గారిని మ‌హాత్మాగాంధీ త‌న గురువుగా భావించేవారు. గాంధీజీ ద‌క్షిణాఫ్రికాలో ఉన్న‌పుడు ఉత్త‌ర‌ ప్ర‌త్యుత్త‌రాల‌ ద్వారా రాజ్‌చంద్ర‌ గారితో సంబంధాలు నెర‌పే వారు. అలాంటి ఒక లేఖ‌లో రాజ్‌చంద్ర‌ గారు హింస‌, అహింస‌ల గురించి గాంధీ జీతో చ‌ర్చించారు. హింస అన్న‌ది ఉండ‌టం వ‌ల్ల‌నే అహింస అనేది ఉనికిలోకి వ‌చ్చింద‌ని రాజ్‌చంద్ర‌ గారు చెప్పేవారు. ఇక్క‌డ మ‌నం అర్థం చేసుకోవాల్సిన ముఖ్య‌మైన విష‌యం ఏమిటంటే, నీకు ఏ సిద్ధాంతం ముఖ్యం.. దేనిని మాన‌వ‌ జాతి సంక్షేమానికి ఉప‌యోగించ‌వ‌చ్చున‌న్న‌దే.

ప్రియ‌మైన సోద‌ర సోద‌రీమ‌ణులారా, మ‌న దేశంలో హింస‌, అహింస‌ల మ‌ధ్య చ‌ర్చ అత్యంత స‌హ‌జం. మాన‌వ‌తావాదం మ‌న న‌ర‌న‌రాన జీర్ణించుకుపోయింది. మ‌నం గొప్ప సంస్కృతి, వార‌స‌త్వం గ‌ల పౌరులం. ఈ దేశం పూర్తి వైవిధ్య‌భ‌రిత‌మైన‌ది. ఈ భ‌ర‌త‌మాత పుష్ప‌గుచ్ఛంలో భిన్నప‌రిమళాలు, భిన్న వర్ణాలు, భిన్నస్వ‌ప్నాలు. సోద‌రీ సోద‌రులారా, భిన్న‌త్వంలో ఏక‌త్వం మ‌న గొప్ప బ‌లం. ఐక్య‌తా మంత్రం మ‌న మూలాల‌తో ముడిప‌డి ఉంది. సోద‌రీ సోద‌రులారా, ఒక్క దేశంలో వంద‌కు పైగా భాష‌లు, వంద‌లాది యాస‌లు, లెక్క‌లేన‌న్ని వ‌స్త్రధార‌ణ రీతులు, లెక్క‌లేన‌న్ని జీవ‌న‌ శైలులు.. అయిన‌ప్ప‌టికీ ఈ దేశం శ‌తాబ్దాల‌ పాటు ఒక్క‌టిగా నిలచి ఉందంటే ప్ర‌ధాన కార‌ణం మ‌న సాంస్కృతిక వార‌స‌త్వ‌మే. ఇత‌రుల‌ను ఎలా గౌర‌వించాలో మ‌న‌కు తెలుసు. గొప్ప అతిథేయి కావ‌డం ఎలాగో మ‌న‌కు తెలుసు. అంద‌రినీ ప్ర‌గ‌తిప‌థంలో న‌డిపించ‌డం ఎలాగో తెలుసు. ఈ గొప్ప సంప్ర‌దాయాన్ని మ‌నం స‌దా అనుస‌రిస్తున్నాము. కాబ‌ట్టే హింస‌, అణ‌చివేత‌ల‌కు ఈ దేశంలో తావులేదు. మ‌నం భార‌త ప్ర‌జాస్వామ్యాన్ని బ‌లోపేతం చేయాల‌న్నా, దేశం క‌ల‌ల‌ను సాకారం చేయాలన్నా హింసా మార్గం ఎన్న‌డూ విజ‌య‌వంతం కాదు.

నేడు మావోయిజం పేరిట అడ‌వుల్లో, తీవ్ర‌వాదం పేరిట స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో, ఉగ్ర‌వాదం పేరిట ప‌ర్వ‌తాల్లో అమాయ‌క ప్ర‌జ‌లు బ‌లైపోతున్నారు. భ‌ర‌త‌ మాత దేహం నిరంత‌రాయంగా ర‌క్త‌సిక్త‌మ‌వుతోంది. కానీ, ఉగ్ర‌వాదం బాట‌ను అనుస‌రిస్తున్న వారు సాధించింది శూన్యం. ఈ యువ‌త‌రానికి నేను చెప్ప‌ద‌ల‌చుకున్నా.. అది ఏమిటంటే, ఉగ్ర‌వాదాన్ని ఈ దేశం స‌హించ‌దు; ఉగ్ర‌వాదానికో, మావోయిజానికో ఎన్న‌డూ త‌ల‌వంచ‌దు అని. ఈ యువ‌త‌రానికి విజ్ఞ‌ప్తి చేయ‌ద‌ల‌చుకున్నా- స‌మయం ఇంకా మించిపోలేదు.. హింసామార్గాన్ని వీడండి. మీ త‌ల్లిదండ్రుల క‌ల‌ల‌ను సాకారం చేయండి. హింసామార్గం ఎన్న‌డూ, ఏ ఒక్క‌రికీ మేలు చేయ‌లేదు. కాబ‌ట్టి ప్ర‌ధాన జీవ‌నస్ర‌వంతిలో క‌ల‌వండి. సుఖ‌ సంతోషాల‌తో జీవించండి.

సోద‌రీ సోద‌రులారా, మ‌నం విదేశాంగ విధానం గురించి చెప్పుకోవాలంటే- మీ ముందు స‌క‌ల వివ‌రాల‌నూ నేను ఏక‌రువు పెట్ట‌ద‌ల‌చుకోలేదు. ఈ ప్ర‌భుత్వం ఎప్పుడైతే ప్ర‌మాణ స్వీకారం చేసిన‌నాడే ఎస్ ఎ ఎ ఆర్ సి (సార్క్) నాయ‌కులంద‌ర్నీ మేము ఆహ్వానించాము. అన్ని ఇరుగు పొరుగు దేశాల‌కూ ఉన్న ఉమ్మ‌డి స‌మ‌స్య‌, స‌వాలు పేద‌రిక‌మేన‌న్న మ‌న సందేశం చాలా స్పష్టం. కాబ‌ట్టి పేద‌రికంపై పోరాటానికి మ‌నమంతా ఏకం కావాలి. ఒక‌రితో మ‌రొక‌రం పోట్లాడుకోవ‌డం వ‌ల్ల మ‌న‌మంతా బాధ‌లుప‌డ్డాం. కానీ, మ‌న‌మంతా పేద‌రికంపై పోరాటానికి దృఢ నిర్ణ‌యం తీసుకుంటే ఆ బాధ‌ల నుంచి బ‌య‌ట‌ప‌డి అభ్యుద‌యం ప‌థంలో న‌డ‌వ‌గ‌లం. అందువ‌ల్ల పేద‌రికంపై పోరాటానికి మ‌న కృషిని ఏకం చేద్దామ‌ని నేను మ‌న పొరుగు దేశాల‌న్నింటికీ ఆహ్వానం ప‌లుకుతున్నాను. భార‌తదేశ పౌరుల‌ను, అన్ని దేశాల ప్ర‌జ‌ల‌ను పేద‌రికం నుండి విముక్తం చేయ‌డంక‌న్నా గొప్ప స్వాతంత్ర్యం మ‌రొక‌టి ఉండ‌దు. ఇరుగు పొరుగు దేశాల ప్ర‌జ‌లు కూడా పేద‌రికం నుండి విముక్తిని పొందితే భార‌త‌దేశం కూడా సంతోష‌ప‌డుతుంది.

ప్రియ సోద‌రీసోద‌రులారా! ప్ర‌పంచం ముందు నేను రెండు ఉదాహ‌ర‌ణ‌లు ఉంచ‌ద‌ల‌చుకున్నాను. మాన‌వ‌తావాదం ప్ర‌భావం నీడ‌న ఎదిగిన‌ ప్ర‌జ‌లు, ఉగ్ర‌వాదాన్ని స‌మ‌ర్థించే వారి మ‌ధ్య వ్య‌త్యాసాన్ని అవి క‌ళ్ల‌కు క‌డ‌తాయి. ప్ర‌పంచానికి, మాన‌వ‌తావాదంపై విశ్వాసం గ‌ల దేశాల‌కు నేను రెండు సంఘ‌ట‌న‌ల‌ను వివ‌రిస్తున్నాను. పెషావ‌ర్‌లో చోటుచేసుకున్న సంఘ‌ట‌న‌ను దీనిని బ‌ట్టి అంచ‌నా వేయండి.. ఉగ్ర‌వాదులు అమాయ‌క పాఠ‌శాల చిన్నారుల‌ను అమానుషంగా కాల్చివేసిన సంఘ‌ట‌న పెషావ‌ర్‌లో చోటు చేసుకుంది. అది ఉగ్ర‌వాద దాడి. అమాయ‌క బాలురు, బాలిక‌లు హ‌త్య‌కు గురి కాగా, వారి ర‌క్త‌ ధార‌ల‌తో విద్యాల‌యం త‌డిసిపోయింది. ఇక భార‌త పార్ల‌మెంటు సభ్యులు కంట‌త‌డి పెట్టారు. భార‌త పాఠ‌శాల‌ల విద్యార్థులు విల‌పించారు. భార‌తదేశంలో ప్ర‌తి చిన్నారి పెషావ‌ర్‌లో పిల్ల‌ల మ‌ర‌ణంతో దిగ్భ్రాంతికి గురయ్యారు. వారు త‌మ దు:ఖాన్ని దిగ‌మింగుకోలేక‌పోయారు. పెషావ‌ర్‌లో ఉగ్ర‌వాదుల చేతిలో చిన్నారులు బ‌లి కావ‌డం వారికి అంతులేని బాధ‌ను, వేద‌న‌ను క‌లిగించింది. ఇదీ మాన‌వ‌తావాదం నుండి ఉద్భ‌వించిన మ‌న సంస్కృతి. మ‌రొక వైపు ఉగ్ర‌వాదాన్ని కీర్తిస్తున్నారు. ఉగ్ర‌వాదుల దాడిలో అమాయ‌కులు బ‌లైపోయిన‌ప్పుడు అక్క‌డ వేడుక చేసుకుంటున్నారు. ఉగ్ర‌వాదంలో స్ఫూర్తి పొందే ఇదే ర‌క‌మైన‌ జీవితం ? ఉగ్ర‌వాద స్ఫూర్తితో ప్ర‌భుత్వాలు ఎలా ఏర్ప‌డ‌తాయి ? ఈ తేడాను ప్ర‌పంచం త‌ప్ప‌క స్ప‌ష్టంగా అర్థం చేసుకుంటుంది. నాక‌ది చాలు!

నేడు ఎర్ర‌ కోట బురుజుల‌ మీది నుండి నేను కొంద‌రికి శుభాకాంక్ష‌లు తెలిపి, కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేయ‌ద‌ల‌చుకున్నాను. గ‌డ‌చిన కొద్దిరోజులుగా బ‌లూచిస్థాన్‌, గిల్గిత్‌, పాకిస్థాన్ ఆక్ర‌మిత క‌శ్మీర్ ప్ర‌జ‌లు నాకు ధ‌న్య‌వాదాలు చెబుతున్నారు; కృత‌జ్ఞ‌త‌లు తెలియ‌జేస్తున్నారు; వారి ఆశీస్సులు అందిస్తున్నారు. ఎక్క‌డో మ‌న‌కు దూరాన నివ‌సిస్తున్న‌ప్ర‌జ‌లు, నేనెన్న‌డూ చూడ‌ని వారు, క‌ల‌వ‌ని వారు- అటువంటి వారు భార‌తదేశ ప్ర‌ధాన‌ మంత్రిని, 125 కోట్ల‌ మంది దేశ‌వాసుల‌ను అభినందిస్తున్నారు. ఇది దేశ పౌరులంద‌రికీ ఓ గౌర‌వం.

సోద‌రీ సోద‌రులారా, ఇవాళ మ‌నం 70 ఏళ్ల స్వాతంత్ర్య వేడుక చేసుకుంటున్న త‌రుణాన‌ అందులో మ‌న స్వ‌తంత్ర స‌మ‌ర‌ యోధుల పాత్ర‌ను గుర్తు చేసుకుందాం. ఇవాళ గౌర‌వ‌నీయులైన ఆ స‌మ‌ర‌ యోధుల కుటుంబాల‌కు ఇస్తున్న పెన్ష‌న్‌ను 20 శాతం పెంచాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించింది. దీనివ‌ల్ల ఇప్ప‌టిదాకా 25,000 రూపాయ‌లు అందుకుంటున్న స‌మ‌ర‌ యోధులు, వారి కుటుంబాలు ఇక‌పై 30,000 రూపాయ‌లు అందుకుంటాయి. ఆ స‌మ‌రయోధుల త్యాగాల‌కు నావైపు నుండి ఇదొక చిన్న కానుక‌.

సోద‌రీ సోద‌రులారా,

మ‌న స్వ‌తంత్ర స‌మ‌రాన్ని గురించి మాట్లాడుకుంటున్న‌ప్పుడు కొంద‌రిని గురించి మాత్ర‌మే ప్ర‌స్తావిస్తాం. వాస్త‌వానికి కొన్ని సంద‌ర్భాల్లో ఇది అవ‌స‌రానిక‌న్నా ఎక్కువ‌నే చెప్ప‌వ‌చ్చు. కానీ, మ‌న స్వాతంత్ర్య స‌మ‌రంలో అడ‌వుల‌లో మ‌న గిరిజ‌న వీరులు పోషించిన‌ పాత్ర అనుప‌మానం. వారు నివ‌సించింది అడ‌వుల‌లో… మ‌నం బిర్సా ముండా గురించి విని ఉండొచ్చు. కానీ, 1857 నుంచి మ‌న‌కు స్వాతంత్ర్యం సిద్ధించే దాకా త్యాగం చెయ్య‌ని గిరిజ‌న జిల్లా ఒక్క‌టంటే ఒక్క‌టి కూడా లేదు. స్వ‌తంత్రమంటే ఏమిటి ? బానిస‌త్వానికి వ్య‌తిరేకంగా పోరాట‌మంటే ఏమిటి ? తమ త్యాగాల‌ ద్వారా వారు అవేమిటో మ‌న‌కు నేర్పారు. కానీ, మ‌న రాబోయే త‌రాల‌కు ఈ చ‌రిత్ర పూర్తిగా తెలిసే అవ‌కాశం లేదు. అందుకే ఈ గిరిజ‌నులు ఎక్క‌డ నివ‌సించారో, ఏయే రాష్ట్రాలలో బ్రిటిష్ పాల‌కుల‌తో సంఘ‌ర్షించారో, త‌ల‌వంచ‌డానికి నిర్ద్వంద్వంగా నిరాక‌రించారో.. ఆయా రాష్ట్రాల్లో శాశ్వ‌త ప్ర‌ద‌ర్శ‌నశాల‌ల నిర్మాణానికి ప్ర‌భుత్వం త‌ల‌పెట్టింది. ఆ దిశ‌గా ప్ర‌ణాళికలు సిద్ధం చేస్తోంది. వివిధ రాష్ట్రాలలో ఈ ప్ర‌ద‌ర్శ‌నశాల‌ల నిర్మాణానికి ప్ర‌భుత్వం కృషి చేస్తుంది. దీని వ‌ల్ల త్యాగాలు చేయ‌డంలో మ‌న గిరిజ‌నులు అంద‌రిక‌న్నా ఎంత ముందున్నారో భ‌విష్య‌త్త‌రాలు తెలుసుకుంటాయి.

సోద‌రీ సోద‌రులారా, ధ‌ర‌ల పెరుగుద‌ల‌కు సంబంధించిన అంశాల‌పై చాలా చ‌ర్చ జ‌రుగుతూంటుంది. కానీ, ఓ పేద కుటుంబంలో ఒక్క‌ వ్య‌క్తి అనారోగ్యం బారినప‌డినా ఆ ఇంటి ఆర్థిక ప‌రిస్థితే కుదేల‌వుతుంద‌న్న‌ది మ‌నంద‌రికీ అనుభ‌వ‌మే. చివ‌ర‌కు కుమార్తె పెళ్లి ఆగిపోతుంది. పిల్ల‌ల చ‌దువు దెబ్బ‌తింటుంది. కొన్ని సంద‌ర్భాల్లో క‌నీసం ఇంత తిండి అయినా దొర‌క‌ని ప‌రిస్థితి. ఆరోగ్య సంరక్ష‌ణ సేవ‌లు నానాటికీ ఖ‌రీదైపోతున్నాయి. అందుకే దారిద్ర్య రేఖ‌కు దిగువ‌న ఉన్న అటువంటి కుటుంబాల ఆరోగ్య సంర‌క్ష‌ణ కోసం మా ప్ర‌భుత్వం ఒక ముఖ్య‌మైన చ‌ర్య‌ను ఎర్ర‌ కోట బురుజుల‌ మీది నుండి ప్ర‌క‌టిస్తోంది. ఈ మేర‌కు మేము ఒక ప‌థ‌కాన్ని ప్ర‌వేశ‌పెట్ట‌బోతున్నాము. భ‌విష్య‌త్తులో అటువంటి కుటుంబాల వైద్య ఖ‌ర్చుల కింద‌ భార‌త ప్ర‌భుత్వం ఏటా ల‌క్ష రూపాయ‌ల‌ దాకా వెచ్చిస్తుంది. తద్వారా నా పేద సోద‌రుల‌కు ఆరోగ్యసేవ‌లు దూరం కాకుండా, వారి క‌ల‌లు చెదిరిపోకుండా ఉంటాయి.

కాబ‌ట్టి నా ప్రియ సోద‌రీసోరులారా, ఈ ప‌విత్ర స్వాతంత్ర్య దినోత్స‌వం సంద‌ర్భంగా ఓ కొత్త సంక‌ల్పం, కొత్త శ‌క్తి, కొత్త ఉత్తేజం, కొత్త ఆశతో ముంద‌డుగేద్దాం రండి. మ‌న దేశం కోసం త‌మ జీవితాలు త్యాగం చేసి, దేశం కోస‌మే జీవిస్తున్న, దేశం కోస‌మే కృషి చేస్తున్న వ్య‌క్తుల నుండి స్ఫూర్తిని పొందుదాం… మ‌న బాధ్య‌త‌ల‌ను నెర‌వేర్చ‌డం ద్వారా ఇత‌రులు కూడా త‌మ క‌ర్త‌వ్యాన్ని నెర‌వేర్చేలా స్ఫూర్తినిద్దాం.

మ‌న లక్ష్యాల సాధ‌న దిశ‌గా ఒకే స‌మాజం, ఒకే స్వ‌ప్నం, ఒకే నిశ్చ‌యం, ఒకే దిశ‌గా మ‌న‌మంతా ముందుకు క‌ద‌లాలి. ఈ ఉదాత్త భావ‌న‌తో మ‌న ర‌క్ష‌ణ కోసం త‌మ జీవితాల‌ను ప్ర‌మాదంలో ప‌డేసుకున్న మ‌హ‌నీయుల‌కు, సైనికుల‌కు మ‌రోసారి శ్ర‌ద్ధాంజ‌లి ఘ‌టిస్తున్నాను. అలాంటి 33,000 మంది వ్య‌క్తుల త్యాగాన్ని స్మ‌రిస్తున్నాను. దేశ స్వ‌ప్న సాకారం కోసం న‌న్ను నేను ఇవాళ అంకితం చేసుకుంటున్నాను. ఎర్ర‌ కోట బురుజుల‌ మీది నుండి భార‌త్ మాతా కీ జయ్ అని ఎలుగెత్తి నిన‌దించాల్సిందిగా మీకంద‌రికీ నేను పిలుపునిస్తున్నాను. ఈ నినాదం ప్ర‌పంచంలో మూల‌మూల‌నా ప్ర‌తిధ్వ‌నించాలి.

భార‌త్ మాతాకీ జయ్.. భార‌త్ మాతాకీ జయ్..

వందేమాత‌రం.. వందేమాత‌రం.. వందేమాత‌రం..

జయ్ హింద్‌.. జయ్ హింద్‌.. జయ్ హింద్‌!

అనేకానేక ధ‌న్య‌వాదాలు.