పిఎంఇండియా
పన్ను వ్యవహారాలకు సంబంధించి భారత రెవెన్యూ పరిపాలన సంస్థలు, బ్రిక్స్ కూటమి దేశాలైన బ్రెజిల్, రష్యా సమాఖ్య, చైనా, దక్షిణ ఆఫ్రికాల మధ్య సహకార అవగాహన పత్రం (ఎమ్ఒసి) మీద సంతకాలకు ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన సమావేశమైన కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది.
లక్ష్యం:
పన్నుల సంబంధిత వ్యవహారాలు, ఉమ్మడి ప్రయోజనాల సంబంధిత అంశాలు, పరిజ్ఞాన భాగస్వామ్య ఆదానప్రదానం, సామర్థ్య నిర్మాణం తదితర రంగాలలో భారత రెవెన్యూ పాలన సంస్థలు, బ్రిక్స్ కూటమి దేశాల మధ్య సహకారాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లడానికి ఈ అవగాహన పత్రం (ఎమ్ఒసి) తోడ్పడుతుంది. బ్రిక్స్ దేశాల రెవెన్యూ పాలన విభాగాధిపతుల మధ్య నిరంతర సంప్రదింపులకు ఇది వీలు కల్పిస్తుంది. ఉమ్మడి ప్రయోజనాలకు వీలున్న రంగాలపై చర్చలకు, పన్ను వ్యవహారాలపై నిపుణుల అభిప్రాయాల కలబోత, సమావేశాలకు అవకాశం ఏర్పడుతుంది. అంతర్జాతీయ సమకాలీన పన్ను వ్యవహారాలకు సంబంధించి రంగాలపై చర్చలతో పాటు ఈ సహకార అవగాహన కింద ఇచ్చిపుచ్చుకున్న సమాచార గోప్యతకు తోడ్పడుతుంది.
ప్రభావం:
పన్నుల సంబంధిత వ్యవహారాలలో ప్రభావవంతమైన సహకారానికి ఊతం లభిస్తుంది. బ్రిక్స్ దేశాల ఉమ్మడి వైఖరి ఆయా దేశాలకే కాకుండా జి-20 సారథ్యం వహిస్తున్న దీర్ఘకాలిక పన్ను అంశాలకు సంబంధించి ఇతర అభివృద్ధి చెందుతున్న దేశాలకూ ప్రయోజనకరం కాగలదు.
నేపథ్యం:
పన్నుల వ్యవహారాలలో సంభావ్య సహకారంపై చర్చించేందుకు బ్రిక్స్ దేశాల రెవెన్యూ విభాగాల అధిపతులు తరచు సమావేశమవుతున్నారు. దీంతో పాటు 2016 అక్టోబరు 16 నాటి గోవా సమావేశ ప్రకటన మేరకు సౌహార్దం, సంఘీభావం, సమానత్వం, పరస్పర అవగాహన, సార్వజనీనత, పరస్పర ప్రయోజన సహకారం తదితరాలపై ప్రస్తుత కట్టుబాటు మేరకు అభిప్రాయాల మార్పిడి కొనసాగుతోంది. అవగాహన, సహకారం మరింత బలోపేతం చేసుకోగల పరస్పర ప్రయోజనకరమైన నాలుగు రంగాలను బ్రిక్స్ దేశాలు గుర్తించాయి. చైనా లోని బీజింగ్లో 2016 మే నెలలో పన్నుల పాలన వేదిక (FTA) సర్వ సభ్య సదస్సు సందర్భంగా బ్రిక్స్ దేశాల పన్ను విభాగాల అధిపతులు భేటీ అయినప్పుడు పై అంశాలు ప్రధానంగా ఎమ్ఒసి పై సంతకాలు చేయాలని నిర్ణయించుకొన్నారు.
****