Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మనసులో మాట (47 వ సంచిక), ప్రసారణ తేదీ – 26-08-2018


నా ప్రియమైన దేశ ప్రజలారా, నమస్కారం! యావత్ భారతదేశం ఇవాళ పవిత్రమైన రక్షాబంధనం పండుగను జరుపుకుంటోంది. ఈ పవిత్రమైన పండుగ సందర్భంగా దేశ ప్రజలందరికీ అనేకానేక శుభాకంక్షలు. సోదర, సోదరీమణుల మధ్యన ఉన్న ప్రేమాభిమానాలకీ, ఒకరిపై ఒకరికి ఉన్న నమ్మకానికీ ప్రతీక ఈ రక్షాబంధనం పండుగ . ఈ పండుగ సామాజిక సహృదయతకి కూడా పెద్ద ఉదాహరణగా నిలుస్తుంది. రెండు వేరు వేరు రాజ్యాలకు లేదా మతాలకు చెందిన మనుషులను ఒక్క రక్షా బంధనం అనే నమ్మకపు దారంతో ముడిపెట్టి ఒకటిగా చేసిన ఎన్నో కథలు మన దేశ చరిత్రలో ఉన్నాయి. కొద్ది రోజుల్లో జన్మాష్టమి పండుగ కూడా రాబోతోంది. మొత్తం వాతావరణమంతా ఏనుగులు, గుర్రాలు, పల్లకీ.. శ్రీ కృషునికీ జై, గోవింద, గోవింద అనే జయజయధ్వానాలతో నిండిపోబోతోంది. శ్రీ కృష్ణుని రంగులో కలిసిపోయి ఆ భగవత్ ప్రేమలో జోగడమనేది ఒక సహజమైన ఆనందం. ఆ ఆనుభూతే వేరు. దేశంలోని అనేక ప్రాంతాల్లో , ప్రత్యేకంగా మహారాష్ట్ర రాష్ట్రంలో యువకులు ఉట్టికుండలు తయారు చేస్తూ ఉండి ఉంటారు. రక్షాబంధనం, ఇంకా కృష్ణాష్టమి సందర్భంగా దేశ ప్రజలందరికీ మరోసారి హృదయపూర్వక శుభాకాంక్షలు.

“ప్రధానమంత్రి మహోదయ్, నమస్కారః ! అహం చిన్మయి, బెంగుళూరు నగరే విజయభారతి విద్యాలయే దశమ కక్షాయాయాం పఠామి. మహోదయ్ అద్య సంస్కృత్ దినమస్తి. సంస్కృత్ భాష సరల్ ఇతి సర్వే వదంతి. సంస్కృత్ భాషా వయ్ మత్ర్ వహ: అత: సంభాషణమ్ అపి కుమ్ర: ! అత: సంస్కృతస్య మహత్వ: విషయే భవత: గహ: అభిప్రాయ: ఇతి రూపయావదతు !”

భగినీ చిన్మయీ,
భవతి సంస్కృత్ -ప్రశ్నం పృష్టవతి.
బహుత్తమమ్. బహుత్తమమ్.
అహం భవత్యా: అభినందనం కరోమి.
సంస్కృత్ -సప్తాహ్ -నిమిత్తం దేశవాసీనాం
సర్వోషామ్ కృతే మమ హార్దిక – శుభకామనా:

ఈ విషయాన్ని ప్రస్తావించినందుకు గానూ ఆడబిడ్డ చిన్మయి కి ఎంతో కృతజ్ఞతలు. మిత్రులారా, శ్రావణ పౌర్ణమి రోజున రక్షాబంధనం తో పాటుగా సంస్కృత భాషా దినోత్సవం కూడా మనం జరుపుకుంటున్నాం. ఈ గొప్ప వారసత్వాన్ని పరిరక్షించి, అలంకరించి, సామాన్య ప్రజలకు అందించడానికి పాటుపడుతున్న ప్రజలందరికీ కూడా అభినందనలు తెలుపుతున్నాను. ప్రతి భాషకీ తనదైన ఒక వైభవం ఉంటుంది. ప్రపంచంలోకెల్లా పురాతనమైన భాష తమిళ భాష. ఇది దేశప్రజలందరూ గర్వించదగ్గ విషయం. వేదకాలం నుండీ వర్తమాన కాలం వరకూ సంస్కృత భాష కూడా జ్ఞానాన్ని పంచడంలో ఎంతో పెద్ద పాత్రను వహించింది. మన భారతీయులందరం ఈ విషయాన్ని ఎంతో గర్వంగా చెప్పుకుంటాము.

జీవితంలోని ప్రతి అంశంతో ముడిపడి ఉన్న జ్ఞాన భాంఢారం సంస్కృత భాషలోనూ, సంస్కృత సాహిత్యంలోనూ ఉంది. అది విజ్ఞానం, తంత్రవిద్య, వ్యవసాయ విజ్ఞానం, ఆరోగ్య శాస్త్రం, శిల్పశాస్త్రం, జ్యోతిశ్శాస్త్రం, గణిత శాస్త్రం, మేనేజ్మెంట్ , ఆర్థికశాస్త్రం, పర్యావరణం.. ఇలా  ఏ శాస్త్రమైనా సరే. గ్లోబల్ వార్మింగ్ సమస్యని పరిష్కరించే సమాధానాలు మన వేదాల్లో విస్తారంగా రాసిపెట్టి ఉన్నాయని అంటారు. కర్ణాటక రాష్ట్రం లోని శివమోగ జిల్లాలోని మట్టూరు గ్రామంలో నివసించే ప్రజలు ఇవాళ్టికి కూడా సంస్కృత భాషలోనే మాట్లాడుకుంటారు. తెలుసా! ఇది ఎంతో ఆనందించదగ్గ విషయం.

ఒక సంగతి వింటే మీరు ఆశ్చర్యపోతారు – అనంతమైన ఎన్నో కొత్త పదాలని నిర్మించడానికి అనువైన భాష సంస్కృత భాష. 2000 ధాతువులు, 200 ప్రత్యయాలు అంటే సఫిక్స్ లు,  22  ఉపసర్గలు అంటే ప్రిఫిక్స్ లు, ఇంకా సమాజం నుండి లెఖ్ఖలేనన్ని పదాలని తయారుచేయడం ఈ భాషలో వీలుపడుతుంది. అందువల్లే ఎన్నో సూక్ష్మమైన చిన్న చిన్న విషయాలను కూడా ఈ భాషలో ఖచ్చితంగా వర్ణించగలము. ఇవాళ్టికి కూడా మనం ఏదైనా విషయాన్ని గట్టిగా చెప్పాలంటే దానికి ఒక ఆంగ్ల సామెతని కలిపి చెప్తూ ఉంటాము. ఒకోసారి కవితలు, కవిత్వాల సహాయం కూడా తీసుకుంటాము. కానీ సంస్కృత సుభాషితాలతో పరిచయం ఉన్నవారికి ఒక సంగతి తెలుసు. అదేమిటంటే, తాము చెప్పదలుచుకున్న విషయాన్ని చాలా నిశ్చితంగా అతి తక్కువ పదాలతో ఈ భాషలో ఉన్న సుభాషితాల ద్వారా తెలియచేయవచ్చు. ఇది సంస్కృత భాషకి ఉన్న మరో ప్రత్యేకత. ఈ సుభాషితాలు మన మాతృభూమితో, మన సంప్రదాయంతో ముడిపడి ఉన్నవి కావడం వల్ల దీనిని అర్థం చేసుకోవడం కూడా సులభం.
దీనికి ఒక ఉదాహరణ – జీవితంలో గురువు ప్రాముఖ్యత ఎటువంటిదో తెలియచేయడానికి సంస్కృతంలో ఏమన్నారంటే –
” ఏకమపి అక్షరమస్తూ, గురు: శిష్యాం ప్రభోదయేత్
పృథివ్యాం నాస్తి తద్ – ద్రవ్యం, యద్ – దత్వా హయనృణీ భవేత్”

ఈ వాక్యాలకి అర్ధం ఏమిటంటే, గురువు తన శిష్యులకి ఒక్క అక్షరం జ్ఞానాన్ని అందించినా సరే, ఆ ఋణాన్ని తీర్చుకోవడానికి సరిపడే వస్తువుగానీ, ధనం గానీ ప్రపంచం మొత్తంలో ఎక్కడా లేవు – అని. రాబోయే ఉపాధ్యాయ దీనోత్సవాన్ని మనందరమూ ఇదే భావంతో జరుపుకుందాం.  జ్ఞానము, గురువు రెండూ కూడా విలువకట్టలేవి, వెల కట్టలేనివి, అమూల్యమైనవి.  తల్లి తరువాత పిల్లల ఆలోచనలను సరైన మార్గంలో పెట్టగల బాధ్యతను తమపై పెట్టుకునేది గురువులే. ఆ బాధ్యత తాలూకూ ప్రభావం జీవితమంతా కనబడుతూనే ఉంటుంది. ఉపాధ్యాయ దీనోత్సవం సందర్భంగా మన దేశ మాజీ రాష్ట్రపతి, గొప్ప ఆలోచనాపరుడు , భారతరత్న  డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ గారిని మనం ఎప్పుడూ గుర్తుచేసుకుంటాము. వారి జయంతినే దేశమంతా ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటుంది. దేశంలోని ఉపాధ్యాయులందరికీ రాబోయే ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దానితో పాటూగా విజ్ఞానం, విద్య, విద్యార్థుల పట్ల మీకున్న సమర్పణాభావాన్ని అభినందిస్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, కష్టించి పనిచేసే మన రైతులకు ఎన్నో ఆశలను తీసుకువస్తుంది ఈ వర్షాకాలం . తీవ్రమైన ఎండతో ఎండిపోయిన చెట్లకు, మొక్కలకు, ఎండిపోయిన నదులకు సేద తీరుస్తుంది. కానీ అప్పుడప్పుడు ఈ వర్షాకాలం అతివృష్టిని, వినాశనాన్ని కలిగించే వరదలను కూడా తీసుకువస్తుంది. కొన్ని చోట్ల తక్కువ వర్షాన్నీ, మరి కొన్న చోట్ల అంతకన్నా ఎక్కువ వర్షాన్నీ కురిపిస్తోంది ప్రకృతి. ఈమధ్య కేరళలో వచ్చిన భయంకరమైన వరదలను మనందరమూ చూశాం. ఈ వరదలు ప్రజల జీవితాలను పూర్తిగా దెబ్బ తీశాయి. ఇటివంటి కఠిన పరిస్థితుల్లో దేశమంతా కలిసికట్టుగా కేరళ రాష్ట్రానికి సహాయంగా నిలిచింది.
తమ కుటుంబసభ్యులను కోల్పోయిన వారికి మనందరి సానుభూతి ఉంది. జీవితాలను కోల్పోయినవారికి తిరిగి ప్రాణాలు పొయ్యలేము కానీ శోకతప్త కుటుంబాలకు ఒక్క సంగతి మాత్రం చెప్పగలను. ఏమిటంటే, ఇటువంటీ దు:ఖమయ వాతావరణంలో నూటపాతికకోట్ల దేశప్రజలందరూ కూడా మీకు తోడుగా నిలబడి ఉన్నారని నమ్మకంగా చెప్పాలనుకుంటున్నాను. ఈ వరదల్లో గాయపడిన ప్రజలు త్వరగా ఆరోగ్యవంతులు కావాలని ప్రార్థిస్తున్నాను. రాష్ట్రంలోని ప్రజల ఆత్మబలంతోనూ, అసాధారణ సాహసాల బలంతోనే కేరళ రాష్ట్రం తిరిగి నిలబడగలదని నేను నమ్ముతున్నాను.

ప్రమాదాలు తమ వెనుక వదిలిపెట్టి వెళ్ళే వినాశనాలు దుర్భాగ్యమైనవి. కానీ ప్రమాదాలు జరిగినప్పుడే మానవత్వం అంటే ఏమిటో మనకు అర్థం అవుతుంది. కచ్ నుండి కామ్ రూప్ వరకూ, కశ్మీరు నుండీ కన్యాకుమారీ వరకూ ప్రతిఒక్కరూ తమ తమ పరిధిలో ఏదో ఒక సహాయం చేస్తూనే ఉన్నారు. కేరళ లో అయినా దేశంలోని మరే ఇతర ప్రదేశం లో అయినా, ఏ జిల్లా అయినా, ఏ ప్రాంతం అయినా ప్రజల జీవితాలు తిరిగి మామూలుగా అవడానికి ప్రతి ఒక్కరూ తమ తమ పరిధిలో ఎంతో కొంత సహాయం చేస్తున్నారు. అన్ని వయస్కుల వారూ, ప్రతి రంగానికీ చెందిన వారూ తమ సహకారాన్ని అందిస్తున్నారు. ప్రతి ఒక్కరు కూడా కేరళ రాష్ట్రంలోని కష్టాలను తగ్గించాలని, వారి దు:ఖాన్ని పంచుకోవాలని ఖచ్చితంగా ప్రయతిస్తున్నారు. కేరళలో జరుగుతున్న రక్షణా కార్యక్రమాలకు సాయుధ బలగాల సైనికులే నాయకులని మనందరికీ తెలుసు. వరదల్లో చిక్కుకుపోయినవారిని రక్షించడంలో వారు ఏ అవకాశాన్నీ వదలలేదు. air force కాని, navy కాని, army కాని, BSF,CISF, RAF,  ప్రతి ఒక్కరూ కూడా సహాయక, రక్షణా ప్రయత్నాల్లో ఎంతో పెద్ద పాత్రను వహించారు. NDRF వీరుల కఠిన పరిశ్రమను గురించి నేను ప్రత్యేకంగా చెప్పలనుకుంటున్నాను. ఇటువంటి కష్టకాలంలో వారు ఎంతో ఉత్తమమైన సహాయం చేశారు. NDRF వీరుల సామర్థ్యం, వారి కమిట్మెంట్, చురుకైన నిర్ణయం తీసుకుని పరిస్థితులను  అదుపులో పెట్టేందుకు చేసిన ప్రయత్నం ప్రతి భారతీయుడూ దృష్టి పెట్టవలసిన విషయంగా నిలిచింది. నిన్న ఓణమ్ పండుగ. ఈ ప్రమాదం నుండి అతి త్వరగా బయటకు రావడానికి దేశానికీ, ముఖ్యంగా కేరళ రాష్ట్రానికీ ఈ ఓణమ్ పండుగ శక్తిని ఇవ్వాలని, తద్వారా కేరళ రాష్ట్ర పునరాభివృధ్ధి వేగవంతం అవ్వాలని మనం ప్రార్థన చేద్దాం. కేరళ ప్రజలకూ, దేశవ్యాప్తంగా విపత్తు సంభవించిన ఇతర ప్రాంతాలవారికీ, దేశమంతా వారికి తోడుగా ఉందని మరోసారి దేశవాసులందరి తరఫునా నేను నమ్మకంగా చెప్తున్నాను.

నా ప్రియమైన దేశప్రజలారా, ఈ సారి మన్ కీ బాత్ కోసం వచ్చిన సూచనలను నేను చూస్తూంటే నాకు ఎక్కువగా వచ్చిన సందేశాలు ఒకే విషయం గురించి. అవి శ్రీ అటల్ బిహారీ వాజ్పాయ్ గురించి. ఘాజియాబాద్ నుండి కీర్తి, సోనీ పత్ నుండి స్వాతి వత్స్, కేరళ నుండి సోదరుడు ప్రవీణ్, పశ్చిమ బెంగాల్ నుండి డాక్టర్ స్వపన్ బెనర్జీ, బిహార్ లోని కటిహార్ నుండి అఖిలేశ్ పాండే మొదలైన ఎందరో అసంఖ్యాకులు నరేంద్ర మోదీ యాప్ లో, మై గౌ లోనూ అటల్ గారి జీవితంలోని విభిన్న దృష్టికోణాలను గురించి నన్ను మాట్లాడమని తమ సందేశాలలో కోరారు. ఆగస్టు పదహారవ తేదీన అటల్ గారి మరణ వార్తను విన్న ప్రపంచము, దేశమూ శోకసంద్రంలో మునిగిపోయింది. పధ్నాలుగు ఏళ్ల క్రితమే ప్రధానమంత్రి  పదవిని వదిలిపెట్టేసిన ఒక గొప్ప దేశాధినేత ఆయన. ఒకరకంగా చెప్పాలంటే గత పదేళ్ళుగా క్రియాశీల రాజకీయాలకు దూరంగా వెళ్ళారు ఆయన. వార్తల్లో కూడా ఎక్కడా కనబడేవారు కాదు. బహిరంగంగా కూడా ఎక్కడా కనబడలేదు. పదేళ్ల కాలం అంటే చాలా ఎక్కువ కాలం కిందే లెఖ్ఖ. కానీ భారతదేశ సామాన్య ప్రజల మనసుల్లో ఈ పదేళ్ల కాలం ఒక్క క్షణం అంతరాయాన్ని కూడా కలిగించలేదని ఆగస్టు పదహారవ తేదీ తర్వాత తెలిసింది. అటల్ గారి మరణవార్త  వినగానే దేశప్రజలందరిలో ఎటువంటి స్నేహభావమూ, ఎటువంటి శ్రధ్ధ, దు:ఖ్ఖమూ కలిగాయో చూస్తేనే చాలు, ఆయనదెంత విశాలమైన వ్యక్తిత్వమో మనకు అర్థం అవుతుంది. గత కొద్ది రోజులలో అటల్ గారి వ్యక్తిత్వంలోని ఉత్తమమైన అంశాలు మనందరికీ బాగా తెలిసాయి. ప్రజలు ఆయనను ఉత్తమ పార్లమెంట్ సభ్యుడిగా, సున్నితమైన రచయితగా, గొప్ప వక్తగా, ప్రియమైన నాయకుడిగా తలుచుకున్నారు. ఇకపై తలుచుకుంటారు కూడా. సుపరిపాలనను జనజీవన స్రవంతిలోకి తీసుకువచ్చిన కారణంగా అటల్ గారికి దేశం ఋణపడి ఉంటుంది. కానీ ఇవాళ నేను అటల్ గారి వ్యక్తిత్వంలోని మరో కోణాన్ని కేవలం గుర్తుచేసుకోవాలని అనుకుంటున్నాను.  అటల్ గారు భారతదేశానికి ఒక గొప్ప రాజకీయ వ్యవస్థని అందించారు. రాజకీయ వ్యవస్థలో మర్పు తేవాలని ప్రయత్నించారు. ఆయన కోరుకున్న మార్పుని సమాజ నిర్మాణానికి ఉపయోగించాలని ప్రయత్నించారు. దానివల్ల సమాజానికి ఎంతో లాభం జరుగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా ఎంతో లాభం కలగబోతోంది. ఇది ఖాయం. 2003 లో జరిగిన 91వ రాజ్యాంగ సవరణ చట్టానికి  కారణమైన అటల్ గారికి మన కృతజ్ఞతలు ఎల్లప్పుడూ ఉంటాయి. ఈ సవరణ భారత రాజకీయాలలో రెండు ముఖ్యమైన మార్పులను తెచ్చింది.
మొదటి మార్పు ఏమిటంటే, రాష్ట్రాలలో మంత్రిమండలి సంఖ్య విధానసభ సీట్ల సంఖ్యలో పదిహేను శాతానికి పరిమితము. రెండవది ఏమిటంటే, పార్టీ ఫిరాయింపు వ్యతిరేక చట్టం ద్వారా పార్టీ ఫిరాయింపుల సంఖ్య మూడింట ఒక వంతు నుండీ ముడింట రెండువంతులు చెయ్యబడింది. దానితో పాటుగా పార్టీ ఫిరాయింపు చేసేవారిని అయోగ్యులుగా నిర్ధారించవచ్చని స్పష్టంగా మార్గనిర్దేశం చెయ్యబడింది.
భారతదేశంలో చాలా ఏళ్ల వరకూ ఎక్కువమంది మంత్రులతో మంత్రిమండలి తయారుచేసే రాజకీయ సంస్కృతి ఉండేది. ఈ కారణంగా పెద్ద పెద్ద జంబో మంత్రిమండలులు విధులను నిర్వహించడానికి కాకుండా రాజకీయ నాయకులను సంతోష పరచడానికి మాత్రమే ఏర్పడేవి. అటల్ గారు దీనిని మార్చేసారు. అందువల్ల డబ్బు ఆదా అయింది. వనరులు ఆదా అయ్యాయి. దీనివల్ల కార్యదక్షత పెరిగింది. అటల్ గారి వంటి దూరదృష్టిగలవారి వల్లే ఈ పరిస్థితులు మారాయి. మన రాజకీయ సంస్కృతిలో ఆరోగ్యకరమైన సంప్రదాయాలు పెరగడం మొదలుపెట్టాయి. అటల్ గారు ఒక నిజమైన దేశభక్తుడు. వారి పరిపాలనలోనే బజెట్ ప్రవేశపెట్టే సమయంలో మార్పు జరిగింది. మొదట్లో ఆంగ్లేయుల సంప్రదాయం ప్రకారం లండన్ లో పార్లమెంట్ జరిగే సమయం కాబట్టి , సాయంత్రం ఐదింటికి బజట్ ను ప్రవేశపెట్టేవారు. 2001 లో అటల్ గారు సాయంత్రం ఐదింటి సమయాన్ని , ఉదయం పదకొండింటికి గా మార్చారు. అటల్ గారి పాలనలోనే మరొక మార్పు కూడా జరిగింది. ఇండియన్ ఫ్లాగ్ కోడ్  తయారైంది. 2002లో దీనిని  అధికారికంగా గుర్తించారు. ఈ కోడ్ కారణంగానే ఎన్నో నియమాలు తయరైయ్యాయి. వాటివల్లే బహిరంగ ప్రదేశాలలో కూడా త్రివర్ణపతాకం ఎగురగలిగింది. దీనివల్లే ఎందరో భారతీయులకు తమ దేశ పతాకాన్ని ఎగురవేసే అవకాశం లభించింది. ఈ విధంగా మన ప్రాణప్రదమైన త్రివర్ణపతాకాన్ని సాధారణ పౌరుల మధ్యకు తీసుకువచ్చారు. ఈ విధంగా అటల్ గారు దేశంలో ఎన్నికల కార్యక్రమం అయినా, ప్రజా ప్రతినిధుల సంబంధించిన విషయమైనా. వాటికీ సాహసవంతమైన అడుగులు వేసి సమూలమైన మార్పులు తీసుకువచ్చారు. అదే విధంగా దేశంలో ఒకేసారి రాష్ట్రాలకి, కేంద్రానికీ ఎన్నికలు జరపాలనే చర్చలు జరుగుతుండటం మీరు చూస్తున్నారు.  ఈ విషయానికి అనుకూలంగానూ, వ్యతిరేకంగానూ ప్రజలు తమ తమ అభిప్రాయాలను తెపియచేస్తున్నారు. ఇది మంచి విషయం. ప్రజాస్వామ్యానికి ఇది ఒక మంచి శుభపరిణామం. ఆరోగ్యకరమైన ప్రజాస్వామ్యానికీ, ఉత్తమమైన ప్రజాస్వామ్యానికీ,  మంచి సంప్రదాయాలని అందించడం, ప్రజాస్వామ్యాన్ని  శక్తివంతం చెయ్యడానికి నిరంతరం శ్రమించడం, నిష్పక్షపాతంగా చర్చలను జరపడం, మొదలైనవన్నీ కూడా అటల్ గారికి మనం ఇచ్చే ఉత్తమ శ్రధ్ధాంజలిగా నిలుస్తాయి. అటల్ గారు కలలు కన్న సమృధ్ధి చెందిన, అభివృధ్ధి పొందిన భారతదేశం కలను నిజం చెయ్యాలనే సంకల్పాన్ని మరోసారి గుర్తుచేసుకుంటూ మనందరి తరఫునా అటల్ గారికి శ్రధ్ధాంజలిని అర్పిస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, పార్లమెంట్ గురించి ఎప్పుడు చర్చలు వచ్చినా,  ఎప్పుడూ పార్లమెంట్ సాగకపోవడం, గందరగోళం, వాయిదాలు గురించే మాట్లాడుకుంటారు. ఏదైనా మంచి జరిగినప్పుడు మాత్రం దాని గురించి ఎక్కువగా మాట్లాడరు. కొద్ది రోజుల క్రితమే పార్లమెంట్ లో వర్షాకాల సమావేశాలు పూర్తయ్యాయి. లోక్ సభలో కార్యనిర్వహణ నూట పధ్ధెనిమిది శాతం, రాజ్య సభలో కార్యనిర్వహణ డెభ్బై నాలుగు శాతం గా నిలిచింది. పార్టీ ప్రయోజనాలకు అతీతంగా పార్లమెంట్ సభ్యులందరూ ఈ వర్షాకాల సమావేశాలను వీలయినంత ఎక్కువగా ఉపయోగకరంగా మార్చాలని ప్రయత్నించారు. దీనికి పరిణామంగా లోక్ సభలో ఇరవై ఒకటి, రాజ్య సభలో పధ్నాలుగు బిల్స్ ఆమోదించబడ్డాయి. పార్లమెంట్ లోని ఈ వర్షాకాల సమావేశాలు సామాజిక న్యాయం, ఇంకా యువజనుల అభివృధ్ధి సమావేశాల రూపంలో ఎప్పటికీ గుర్తుండిపోతాయి. ఈ సమావేశాలలో యువతకూ, వెనుకబడిన వర్గాలకూ ఉపయోగపడే ఎన్నో ముఖ్యమైన బిల్లులు అమోదించబడ్డాయి. దశాబ్దాల నుండీ SC/ST కమీషన్ లాగ OBC కమీషన్ ని కూడా ఏర్పరచాలనే కోరిక ఉంది. వెనుకబడిన వర్గాలవారి అధికారాలను సునిశ్చితం చెయ్యడానికి దేశం ఈసారి OBC కమీషన్ ను నియమించాలనే సంకల్పాన్ని నెరవేర్చింది. దానికి ఒక రాజ్యాంగ అధికారాన్ని కూడా ఇచ్చింది. సామాజిక న్యాయం అనే లక్ష్యాన్ని ఇది ముందుకు తీసుకువెళుతుంది. షడ్యూల్డ్ తెగల , షడ్యూల్డ్ జాతుల అధికారాలను కాపాడడానికి రాజ్యాంగ సవరణ బిల్లు కూడా సమావేశాలలో ఆమోదించబడింది. ఈ చట్టం షడ్యూల్డ్ తెగల , షడ్యూల్డ్ జాతుల సంక్షేమాన్ని సురక్షితం చేస్తుంది. దానితో పాటు ఇది అపరాధులను అత్యాచారాలను చెయ్యకుండా ఆపుచేసి, దళిత వర్గాల్లో విశ్వాసాన్ని నింపుతుంది.
ఏ సభ్య సమాజమైనా దేశంలో స్త్రీ శక్తి కి వ్యతిరేకంగా జరిగే ఏలాంటి అన్యాయాన్నైనా సహించదు. బలాత్కార  దోషులను సహించడానికి దేశం సిధ్ధంగా లేదు. అందువల్ల పార్లమెంట్ అపరాధ చట్ట సవరణ బిల్లు ని ప్రవేశపెట్టి కఠిన శిక్షని ప్రవేశపెట్టింది. దీని ప్రకారం దుశ్చర్యలను చేసే దోషులకు కనీసం పదేళ్ల తక్కువకాకుండా శిక్ష, పన్నెండేళ్ల లోపూ బాలికపలై అత్యాచారం చేసినవారికి ఉరిశిక్షను విధిస్తారు.
కొద్ది రోజుల క్రితం మీరు వార్తాపత్రికలలో చదివే ఉంటారు, మధ్య ప్రదేశ్ లోని మందశౌర్ లో ఒక న్యాయస్థానం కేవలం రెండు నెలల విచారణ తరువాత మైనరు బాలికపై అత్యాచారం కేసులో ఇద్దరు దోషులకు ఉరిశిక్షను విధించింది. అంతకు ముందు మధ్యప్రదేశ్ లో కఠనీ లో ఒక న్యాయాస్థానంలో కేవలం ఐదు రోజుల విచారణ తరువాత దోషులకు ఉరిశిక్ష పడింది. రాజస్థాన్ లో కూడా అక్కడి న్యాయస్థానాలు కొన్ని ఇలాంటి వేగవంతమైన నిర్ణయాలు తీసుకున్నాయి. ఈ చట్టం మహిళలపై, బాలికలపై జరిగే అన్యాయాలను ఆపడంలో ప్రముఖ పాత్రను పోషిస్తుంది. సమాజంలో మార్పు లేని ఆర్థిక అభివృధ్ధి అసంపూర్ణంగానే ఉంటుంది. లోక్ సభలో త్రిపుల్ తలాఖ్ బిల్లు అమోదించబడింది. కానీ  రాజ్య సభలో ఈసారి సమావేశాలలో ఇది జరగలేదు. ముస్లిం మహిళలకు న్యాయాన్ని అందించడానికి యావత్ దేశం సర్వశక్తులతో వారికి తోడుగా నిలబడి ఉందని నేను నమ్మకంగా చెప్తున్నాను. దేశహితం కోసం మనం ముందుకు నడిచినప్పుడు పేదవారు, వెనుకబడినవారు, పీడితుల,వంచితుల జీవితాలలో మార్పుని తీసుకురాగలము. వర్షాకల సమావేశాలలో ఈసారి అందరూ కలిసి ఒక ఆదర్శాన్ని నిలబెట్టారు. దేశంలోని పార్లమెంట్ సభ్యులందరికీ బహిరంగంగా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.
నా ప్రియమైన దేశప్రజలారా, ఈ రోజుల్లో కోట్లాది ప్రజల దృష్టి జకార్తా లో జరుగుతున్న ఆసియాక్రీడలపై ఉంది. ప్రతిరోజూ ఉదయం ప్రజలు వార్తాపత్రికలలో, టెలివిజన్ లో, సమాచారాలలో, సోషల్ మీడియాలపై దృష్టిని సారిస్తున్నారు. ఈరోజు ఏ భారతీయ క్రీడాకారుడు మెడల్ సాధించాడా అని చూస్తున్నారు. ఆసియాక్రీడలు ఇంకా జరుగుతున్నాయి. నేను దేశం కోసం పతకాలు సాధించిన క్రీడాకారులందరికీ అభినందనలు తెలుపుతున్నాను. ఇంకా పోటీలలో ఆడాల్సి ఉన్న క్రీడాకారులకు అనేకానేక శుభాకాంక్షలు.

భారత దేశ క్రీడాకారులు ముఖ్యంగా షూటింగ్ , రెస్లింగ్ లలో ఉత్తమమైన ప్రతిభను చూపెడుతున్నారు. ఇంతకు ముందు సరైన ప్రతిభను చూపెట్టని విభాగాలలో కూడా మన క్రీడాకారులు ప్రతిభను కనబరుస్తున్నారు. వూషు, రోయింగ్ మొదలైన ఆటలలో భారతీయులు సాధించినవి పతకాలు మాత్రమే కాదు. భారతీయ క్రీడాకారుల ఆకాశాన్నంటే ఆశయాలకు, ఆకాంక్షలకూ ఇవి ప్రమాణాలు. దేశానికి పతకాలు సాధించినవారిలో ఎక్కువమంది ఆడపడుచులు ఉన్నారు. ఇది చాలా శుభ సంకేతం. పతకాలు సాధించే యువ క్రీడాకారుల్లో పదిహేను, పదహారు సంవత్సరాల యువత కూడా ఉన్నారు. ఇది కూడా చాలామంచి సంకేతమే. వీరిలో చాలామంది చిన్న చిన్న ప్రాంతాలకూ, గ్రామాలకు చెందినవారు. ఈ యువకులందరూ కఠిన పరిశ్రమతో ఈ విజయాలను సాధించారు. ఆగష్టు 29 న మనం జాతీయ క్రీడా దినోత్సవం జరుపుకుంటాము. ఈ సందర్భంగా క్రీడాప్రేమికులందరికీ నేను శుభాకాంక్షలు తెలుపుతున్నాను. దానితో పాటుగా హాకీ మాంత్రికుడు, గొప్ప క్రీడాకారుడు శ్రీ ధ్యాన్ చంద్ గారికి నా శ్రధ్ధాంజలి అర్పిస్తున్నాను. దేశంలోని ప్రజలందరూ తప్పనిసరిగా ఆటలు ఆడాలనీ, తమ ఫిట్ నెస్ పై దృష్టిని పెట్టాలని నేను కోరుకుంటున్నాను.  ఎందుకంటే ఆరోగ్య భారతదేశమే, సంపన్న , సమృధ్ధ భారతదేశాన్ని నిర్మించగలదు. భారతదేశం ఫిట్ గా ఉంటేనే భారతదేశ ఉజ్వలమైన భవిష్యత్తు నిర్మితమౌతుంది.  ఆసియాక్రిడల్లో పతకాలు సాధించిన విజేతలకు మరోసారి అభినందనలు తెలుపుతున్నాను. దానితో పాటుగా ఇతర క్రీడాకారులు కూడా అత్యుత్తమ ప్రదర్శనను చూపెట్టాలను కోరుకుంటున్నాను. అందరికీ జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా శుభాకాంక్షలు.

ప్రధానమంత్రి గారూ, నమస్కారం! నేను కాన్పూర్ నుండి భావనా త్రిపాఠి ని మాట్లాడుతున్నాను. నేను ఒక ఇంజినీరింగ్ విద్యార్థినిని.
గతసారి మన్ కీ బాత్ లో మీరు కాలేజ్ లో  చేరబోతున్న విద్యార్థినీ విద్యార్థులతో మాట్లాడారు. అంతకు ముందు కూడా మీరు డాక్టర్లతో, చార్టర్డ్ అకౌంటెంట్స్ తో మాటాడారు. నా నుంచి మీకు ఒక విన్నపం. సెప్టెంబర్ పదిహేను న మనం జరుపుకునే ఇంజనీర్స్ డే సందర్భంగా మీరు మా ఇంజనీరింగ్ విద్యార్థినీ విద్యార్థులతో కొన్ని కబుర్లు చెప్తే, మా అందరికీ మనస్థైర్యం పెరుగుతుంది. ఆనందం కలుగుతుంది. భవిష్యత్తులో మాకు దేశం కోసం ఏదైనా చెయ్యడానికి ప్రోత్సాహం లభిస్తుంది.”
నమస్తే భావన గారూ! మీ ఆలోచనను నేను గౌరవిస్తున్నాను. మనందరమూ కూడా ఇటుకలు, రాళ్ళతో ఇళ్ళూ, భవనాలు తయారవడం చూశాము. దాదాపు పన్నెండు వందల ఏళ్ల క్రితం ఒక విశాలమైన కొండను, అది కూడా ఏక శిల కొండ. ఆ కొండను ఒక విశాలమైన, గొప్ప ఆలయంగా రూపొందించారు. మీరు ఊహించగలరా? కానీ అలా జరిగింది. మహారాష్ట్ర లో ఎల్లోరాలో ఉన్న కైలాశ్ నాథ్ ఆలయం అది. దాదాపు వెయ్యి ఏళ్లకు పూర్వం అరవై మీటర్ల కన్నా ఎక్కువ పొడువు ఉన్న ఒక్క స్థంభాన్ని గ్రానైట్ తో నిర్మించారని, ఆ స్థంభం పై దాదాపు ఎనభై టన్నుల గ్రెనైట్ శిలను నిలబెట్టారని మీకు ఎవరైనా చెప్తే మీరు నమ్ముతారా? తమిళ్నాడులోని తంజావూర్ లోని బృహదీశ్వర ఆలయంలో శిల్ప కళ, ఇంకా ఇంజనీరింగ్ తాలూకూ నమ్మశక్యం గాని కలయికని చూడవచ్చు. గుజరాత్ లోని పాఠన్ లో పదకొండవ శతాబ్దపు ’రాణి కీ వావ్ ’ ని చూసి ప్రతిఒక్కరూ ఆశ్చర్యచకితులౌతారు. భారత భూమి ఇంజనీరింగ్ తాలూకూ ప్రయోగశాలగా ఉండేది. భారతదేశంలో ఎంతో మంది ఇంజనీర్లు నమ్మశక్యం గాని కల్పనలకి రూపాన్ని ఇచ్చారు. ఇంజనీరింగ్ ప్రపంచంలో అద్భుతాలుగా చెప్పుకునేలాంటి ఉదాహరణలు రూపొందించారు. గొప్ప గొప్ప ఇంజనీర్లు ఉన్న మన సంప్రదాయంలో, తన పనులతో ఇవాళ్టికీ ప్రజలను ఆశ్చర్యచకితులను చేస్తున్నటువంటి మనకి లభించిన ఒక రత్నం ఎవరంటే – భారతరత్న డాక్టర్ ఎం.విశ్వేశ్వరయ్య. కావేరీ నదిపై ఆయన నిర్మించిన కృష్ణరాజ సాగర్ ఆనకట్ట వల్ల ఇవాళ్టికి కూడా లక్షల సంఖ్యలో  రైతులు, సామాన్య ప్రజలు లాభాన్ని పొందుతున్నారు. వారి ప్రాంతంలో ఆయన పూజనీయులే. అంతేకాక దేశం యావత్తూ కూడా ఆయనను చాలా గౌరవంతోనూ, ఆత్మీయత తోనూ గుర్తుచేసుకుంటుంది. వారి గుర్తుగానే సెప్టెంబర్ పదిహేనవ తేదీని ఇంజనీర్స్ డే గా జరుపుకుంటాము. వారి అడుగుజాడల్లో నడుస్తున్న మన దేశ ఇంజినీర్లు యావత్ ప్రపంచంలో తమ ఉనికిని చాటుకున్నారు. ఇంజనీరింగ్ ప్రపంచంలోని అద్భుతాలను గురించి నేను మాట్లాడినప్పుడు, 2001 లో గుజరాత్ లోని కచ్ లో భూకంపం వచ్చినప్పుడు జరిగిన సంఘటన గుర్తుకు వస్తుంది. అప్పుడు నేను ఒక వాలంటీరుగా అక్కడ పనిచేసాను. అప్పుడు ఒక గ్రామానికి నేను వెళ్ళినప్పుడు, వందేళ్ళు దాటిన ఒక తల్లిని కలిసే అవకాశం నాకు లభించింది. ఆమె మావైపు చూసి మమ్మల్ని హేళన చేస్తూ ఇలా చెప్పింది.. “చూడండి ఇది నా ఇల్లు. కచ్ లో దానిని ’భూంగా” అంటారు. ఈ ఇల్లు మూడు భూకంపాలను చూసింది. నేను స్వయంగా మూడు భూకంపాలను చూశాను. ఈ ఇంట్లోనే చూశాను. కానీ మీకెక్కడైనా ఏదైనా నష్టం జరిగినట్లు కనబడుతోందా? ఈ ఇంటిని మా పూర్వీకులు ఇక్కడి వాతావరణానికి అనుకూలంగా, ప్రకృతికి అనుకూలంగా నిర్మించారు.” అని గర్వంగా చెప్పింది.
అది విని నాకు ఏమనిపించిందంటే, శతాబ్దాలకు పూర్వమే ఆ కాలపు ఇంజనీర్లు స్థానీయ పరిస్థితులకు అనుగుణంగా, సామాన్య ప్రజలు సురక్షితంగా నివసించేలా ఇటువంటి నిర్మాణాలు చేసారు. ఇప్పుడు మనం ఇంజనీర్స్ డే ని జరుపుకుంటున్నప్పుడు మన భవిష్యత్తుని గురించి కూడా మనం ఆలోచించాలి. ప్రతి చోటా వర్క్ షాప్స్ పెట్టాలి. మారుతున్న కాలంలో మనం ఏ ఏ కొత్త విషయాలను నేర్చుకోవాలో? ఏ ఏ విషయాలను తెలుసుకోవాలో? ఏ ఏ విషయాలను కలుపుకోవాలో? మనకి తెలియాలి.
డిజాస్టర్ మేనేజ్మెంట్ ఇవాళ ఒక పెద్ద సవాలుగా మరింది. ప్రకృతి వైపరీత్యాలతో ప్రపంచం పోరాడుతోంది. ఇటువంటి సమయంలో స్ట్రక్చరల్ ఇంజనీరింగ్ ఎలా రూపాంతరం చెందాలి? దానికి ఎటువంటి కోర్సులు ఉండాలి? విద్యార్థులకు ఏమి నేర్పించాలి? కట్టడాలు, నిర్మాణాలూ పర్యావరణానుకూలంగా ఎలా ఉండాలి? స్థానిక పదార్థాల వాల్యూ ఎడిషన్ చేసి, నిర్మాణాలను ఎలా ముందుకు తీశుకువెళ్ళాలి? జీరో వేస్ట్ అనేది మన మొదటి ప్రాధాన్యతగా ఎలా మారాలి? మొదలైన అనేక విషయాలను ఇంజనీర్స్ డే జరుపుకుంటున్నప్పుడు మనం తప్పక ఆలోచించాల్సిన విషయాలు.

నా ప్రియమైన దేశప్రజలారా,  ఇది పండుగల వాతావరణం. ఇప్పుడే దీపావళికి కూడా ప్రయత్నాలు మొదలైపోతాయి. మన్ కీ బాత్ లో కలుస్తూ ఉందాం. మనసులో మాటలు చెప్పుకుందాం. మనసుతో దేశాన్ని ముందుకు నడిపించడానికి కలిసికట్టుగా ఉందాం. ఇదే ఆలోచనతో మీ అందరికీ అనేకానేక శుభాకాంక్షలు. ధన్యవాదాలు. మళ్ళీ కలుద్దాం.