Search

పిఎంఇండియాపిఎంఇండియా

తాజా స‌మాచారం

వివరాలను పిఐబి నుంచి యథాతథంగా తీసుకోవడం జరిగింది.

మన్ కీ బాత్ – మనసులో మాట (25-02-2018)


నా ప్రియమైన దేశప్రజలారా, నమస్కారం!
ఈసారి ’మనసులో మాట ’ని ఒక ఫోన్ కాల్ తో ప్రారంభిద్దాం –
(లేడీ వాయిస్)
“గౌరవనీయులైన ప్రధానమంత్రి గారూ, నేను మీరట్ నుండి కోమల్ త్రిపాఠీ ని మాట్లాడుతున్నాను. 28వ తేదీ నేషనల్ సైన్స్ డే. భారతదేశపు ప్రగతి, అభివృధ్ధి రెండూ కూడా విజ్ఞానం తోనే ముడిపడి ఉన్నాయి. విజ్ఞానంలో మనం ఎంత ఎక్కువగా పరిశోధనలు, ఆవిష్కరణలు చేస్తామో అంత ఎక్కువగా మనం అభివృధ్ధి చెందుతాము. ఎదుగుతాము. మన దేశ యువతకు ప్రేరణను అందించే విధంగా ఏవైనా మాటలు చెప్పగలరా? మీరిచ్చే ప్రేరణ దేశ యువతకు తమ ఆలోచనలను వైజ్ఞానికపరంగా మార్చుకుని, దేశాన్ని అభివృధ్ధి దిశగా తీశుకువెళ్ళేందుకు సహాయపడగలదు..ధన్యవాదాలు.”

మీరు ఫోన్ కాల్ చేసినందుకు అనేకానేక ధన్యవాదాలు. విజ్ఞానానికి సంబంధించిన ఎన్నో ప్రశ్నలను నా యువ స్నేహితులు నన్ను అడిగుతూ ఏవేవో ప్రశ్నలు రాస్తూనే ఉంటారు. సముద్రపు నీరు నీలంగా కనిపిస్తుంది. కానీ మన దినచర్యలో అనుభవపూర్వకంగా మనకు అర్థమయ్యేది ఏమిటంటే, నీటికి ఏ రంగూ ఉండదని. నది అయినా, సముద్రమయినా, నీటి రంగు ఎందుకు మారుతుంది అని మనం ఎప్పుడైనా ఆలోచించామా? ఈ ప్రశ్న మన ఆధునిక భారతదేశానికి ఒక గొప్ప శాస్త్రవేత్తని ఇచ్చింది. విజ్ఞానం గురించి మనం మాట్లాడుకుంటున్నప్పుడు ముందుగా భారతరత్న సర్ సి.వి.రామన్ గారి పేరు గుర్తుకు వస్తుంది. ఆయనకు లైట్ స్కాటరింగ్ అంటే కాంతి యొక్క వికీర్ణంపై అద్భుతమైన పరిశోధన చేసినందుకు గానూ నోబుల్ బహుమతి లభించింది. ఆయన పరిశోధన “రామన్ ఎఫెక్ట్” పేరుతో ప్రసిధ్ధి చెందింది. మనం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28 నాడు నేషనల్ సైన్స్ డే జరుపుకుంటాము. ఎందుకంటే, ఇదే రోజున సి.వి. రామన్ గారు ” లైట్ స్కాటరింగ్” అనే అంశం కనుగొన్నారు. అందుకు గానూ వారికి నోబుల్ పురస్కారం లభించింది. మన దేశంలో విజ్ఞాన రంగంలో ఎందరో శాస్త్రవేత్తలు జన్మించారు. ఒకవైపున ప్రముఖ గణిత శాస్త్రవేత్త బోధాయనుడు, భాస్కరుడు, బ్రహ్మ గుప్తుడు, ఆర్యభట్టు మొదలైనవారి సంప్రదాయం ఉంది. మరోవైపు చికిత్సా రంగంలో సుష్రుతుడు, చరకుడు మనకు గౌరవనీయులు. సర్ జగదీశ్ చంద్ర బోస్, హర్ గోవింద్ ఖురానా నుండి సత్యేంద్రనాథ్ బోస్ వంటి శాస్త్రవేత్తలు భారతదేశానికి గర్వకారణM. సత్యేంద్రనాథ్ బోస్ పేరు మీద ప్రముఖ పార్టికల్ “BOSON” నామకరణం కూడా జరిగింది. ఈమధ్య నాకు ముంబయ్ లో ఒక కార్యక్రమంలో పాల్గొనే అవకాశం లభించింది. – Wadhwani Institute for Artificial Intelligence ప్రారంభోత్సవానికి అందిన ఆహ్వానం అది. విజ్ఞాన రంగంలో జరుగుతున్న అద్భుతాల గురించి తెలుసుకోవడం చాలా ఆసక్తికరంగా నిలిచింది. Artificial Intelligence మాధ్యమం ద్వారా Robots, Bots , ఇంకా మరెన్నో ప్రత్యేకమైన పనులను చేసే యంత్రాలను తయారుచేయడానికి సహాయం లభిస్తుంది. ఈమధ్య యంత్రాలు కూడా స్వయంగా వాటంతట అవే తమలోని Intelligenceని మరింతగా పెంచుకొంటున్నాయి. ఈ టెక్నాలజీ ఎందరో పేదలు, baadhiతులు, అవసరం ఉన్నవారి జీవితాలను మెరుగుపరచడానికి ఉపయోగపడుతుంది. ఆ కార్యక్రమంలో నేను దివ్యాంగ సోదరసోదరీమణుల జీవితాలు సౌఖ్యవంతంగా మారడానికి Artificial Intelligence ద్వారా ఏదైనా సహాయం లభించే వీలేమైనా ఉందా? Artificial Intelligence ఉపయోగించి ప్రకృతి వైపరీత్యాల గురించి మరింత ఎక్కువగా అంచనాలను వెయ్యగలమా? రైతుపోదరులకు పంటల ఉత్పత్తి గురించి ఏమైనా సహాయం చెయ్యగలమా? Artificial Intelligence ఆరోగ్య సేవల అందుబాటును సులభతరం చెయ్యడానికీ, ఆధునికపధ్ధతులలో రోగాలను నయం చెయ్యడంలో ఏదైనా సహాయాన్ని అందించగలదా? అని నేను ఆ శాస్త్రవేత్తల సమూహాన్ని కోరాను.

కొద్దిరోజులక్రితం ఇజ్రాయిల్ ప్రధానమంత్రి తో పాటూ గుజరాత్ లోని అహ్మదాబాద్ లో ‘I Create’ ప్రారంభోత్సవానికి వెళ్ళే అవకాశం నాకు లభించింది. అక్కడ ఒక యువకుడు తయారుచేసిన ఒక డిజిటల్ పరికరాన్ని చూసాను. ఆ పరికరంలోని ప్రత్యేకత ఏమిటంటే, మాటలురానివారు తమ మాటలను ఆ పరికరం ద్వారా రాయగానే అవి స్వరరూపాన్ని సంతరించుకుంటాయి. దానివల్ల మనం మామూలుగా ఎదుటిమనిషితో మాట్లాడినట్లే, మాటలురానివారు కూడా ఎదుటివారితో సంభాషించవచ్చు. ఇలా ఎన్నో విధాలుగా Artificial Intelligence ను ఉపయోగించుకోవచ్చని నేను అనుకుంటున్నాను.

సైన్స్ అండ్ టెక్నాలజీల విలువ తటస్థంగా ఉంటుంది. వాటంతట వాటికి ఏ విలువా ఉండదు. ప్రతి యంత్రమూ మనం ఏ విధంగా కోరుకుంటామో, అలా మాత్రమే పని చేస్తుంది. కానీ యంత్రం ద్వారా మనం ఎలాంటి పని చేయించుకుంటాము అన్నది మనపై ఆధారపడి ఉంటుంది. ఇక్కడ మానవ లక్ష్యమే ముఖ్యమైనది. విజ్ఞానాన్ని కేవలం మానవుడి సంక్షేమం కోసం మాత్రమే కాకుండా, మానవ జీవితం ఉత్కృష్టమైన శిఖరాలను ఆధిరోహించడానికి కూడా ఉపయోగించాలి.

లైట్ బల్బ్ ను కనిపెట్టిన థామస్ ఆల్వా ఎడిసన్ తన పరిశోధనల్లో చాలాసార్లు విఫలమయ్యారు. ఒకసారి ఆయనను ఈ విషయం గురించి ప్రశ్నించినప్పుడు ఆయన ఏమన్నారంటే, “నేను లైట్ బల్బ్ ను తయారవ్వకుండా చెయ్యగలిగే లాంటి పదివేల ప్రయత్నాలు చేసాను” అన్నారు. అంటే ఎడిసన్ తన విఫలయత్నాలను కూడా తన శక్తిగా మార్చుకున్నారన్నమాట. యాదృఛ్ఛికమూ, అదృష్టకరమైన విషయం ఏమిటంటే నేను ఇవాళ మహర్షి అరవిందుల కర్మభూమి “Auroville ” లో ఉన్నాను. ఒక విప్లవకారుడిగా ఆయన బ్రిటిష్ పాలనకు సవాలుగా నిలిచారు. వారికి వ్యతిరేకంగా పోరాడారు. వారి పరిపాలనపై ప్రశ్నించారు. ఇదే విధంగా ఆయన ఒక మహర్షి రూపంలో జీవితంలోని ప్రతి అంశాన్నీ ప్రశ్నించారు. వాటికి జవాబుని కూడా వెలికితీసి, మానవత్వానికి దారి చూపెట్టారు. సత్యాన్ని తెలుసుకోవడానికి ప్రతిసారీ ప్రశ్నించుకుంటూ ఉండడం అనేది ఎంతో ముఖ్యమైన విషయం. శాస్త్రీయ ఆవిష్కరణల వెనుక ఉన్న అసలైన ప్రేరణ కూడా అదే. ఎందుకు, ఏమిటి, ఎలా? లాంటి ప్రశ్నలకు జవాబులు దొరికేవరకూ అవిశ్రాంతంగా శ్రమించాలి. నేషనల్ సైన్స్ డే సందర్భంగా నేను మన శాస్త్రవేత్తలను, విజ్ఞానంతో ముడిపడి ఉన్న వ్యక్తులందరికీ అభినందనలు తెలియచేస్తున్నాను. సత్యం కోసం, జ్ఞానం కోసం వెతకడానికి మన యువత ప్రేరణపొందాలని, విజ్ఞానం సహాయంతో సమాజానికి వారు సేవ చెయ్యాడానికి ప్రేరణ పొందాలని కోరుకుంటూ , నేను మన యువతరానికి అనేకానేక శుభాకాంక్షలు అందిస్తున్నాను.

మిత్రులారా, ఆపద సమయంలో సేఫ్టీ, డిజాస్టర్ మొదలైన విషయాలపై నాకు చాలా సార్లు ఎన్నో సందేశాలు వస్తూ ఉంటాయి. ప్రజలు నాకు ఏదో ఒకటి రాస్తూనే ఉంటారు. పూనా నుండి రవీంద్ర సింహ్ గారు నరేంద్రమోదీ యాప్ కు పంపిన సందేశంలో occupational safety గురించి ప్రస్తావించారు. మన దేశంలో ఫ్యాక్టరీలు, నిర్మాణం పనులు జరిగే చోట safety standards పెద్ద గొప్పగా లేవని వారు అన్నారు. రాబోయే మార్చి నాలుగవ తేదీ National Safety Day కాబట్టి, ప్రధానమంత్రిగారు తన మన్ కీ బాత్ కార్యక్రమంలో భద్రత గురించి కొన్ని జాగ్రత్తలు చెప్పాలనీ, ప్రజలలో భద్రత పట్ల అవగాహన పెంచాలని ఆయన రాసారు. మనం బహిరంగ ప్రదేశాల్లో భద్రత గురించి మాట్లాడేప్పుడు pro-activeness , preparedness అనే రెండు ముఖ్యమైన విషయాల గురించి చెప్పుకోవాలి. భద్రత రెండు రకాలు. ఆపద సమయంలోనూ, వైపరీత్యాల మధ్య పాటించాల్సినది ఒకటి . రెండవది దైనందిక జీవితంలో ఉపయోగపడేది. safety in everyday life .
దైనందిక జీవితంలో మనం భద్రత గురించి అప్రమత్తంగా లేకపోతే, జాగ్రత్తలు తీసుకోకపోతే, ఆపదల సమయంలో భద్రతను పొందడం కష్టమైపోతుంది. మనందరమూ చాలాసార్లు దారిలో రాసి ఉన్న బోర్డులను చదువుతూ ఉంటాము. వాటిలో
-” ఏకాగ్రత లోపిస్తే – ప్రమాదం జరుగుతుంది”
-“ఒక తప్పిదం నష్టాన్ని కలిగిస్తుంది – ఆనందాన్ని ,నవ్వులను చిదిమేస్తుంది”
– “ఇంత త్వరగా భవబంధాలను తెంచుకోకు – భద్రతతో బంధుత్వాన్ని పెంచుకో”
– “భద్రతతో ఆడుకోవద్దు – జీవితాన్ని కోల్పోవద్దు”

ఇలాంటివి చదువుతూ ఉంటాము. ఆ దారిని దాటాక ఆ వాక్యాల వల్ల మన జీవితంలో అన్నిసార్లూ ఉపయోగం ఉండకపోవచ్చు. కానీ ప్రకృతివైపరీత్యాలను వదిలేస్తే, ఎక్కువ శాతం ప్రమాదాలు మన పొరపాట్ల వల్లే జరుగుతాయి. మనం అప్రమత్తంగా ఉండి, అవసరమైన జాగ్రత్తలు పాటిస్తే, మన జీవితాలను కాపాడుకోవడమే కాకుండా, పెద్ద పెద్ద ప్రమాదాల నుండి కూడా సమాజాన్ని రక్షించగలం. ఒకోసారి పని చేసే చోట భద్రతను గురించి ఎన్నో సూచనలు రాసి ఉంటాయి. కానీ వాటిని ఎవ్వరూ కూడా సరిగ్గా పాటించరు.

మహానగరాల్లోనూ, పట్టణాల్లోని ఉన్న పురపాలక సంఘాలవారు అగ్నిమాపకదళాలతో వారంలో ఒకసారైనా, నెలలో ఒకసారైనా వివిధపాఠశాలల్లోని పిల్లల ఎదుట మాక్ డ్రిల్ చేయించవలసిందని నేను కోరుతున్నాను. దానివల్ల రెండు ఉపయోగాలు ఉన్నయి. అగ్నిమాపకదళానికి కూడా అప్రమత్తంగా ఉండే అవకాశం లభిస్తుంది. యువతరానికి కూడా వీటికి సంబంధించిన శిక్షణ లభిస్తుంది. దీనికి విడిగా ఏ అదనపు ఖర్చూ ఉండదు. ఇది విద్యలో ఒక భాగమైపోతుంది. నేను ఎప్పుడూ ఇదే విషయాన్ని చెప్తూ ఉంటాను. ప్రమాదాల గురించి, వైపరీత్యాల గురించి చెప్పుకోవాలంటే, భారతదేశం వాతావరణ పరంగానూ ,భౌగోళికంగానూ ఎన్నో వైవిధ్యాలున్న దేశం. ఈ దేశం ఎన్నో ప్రకృతిక, మానవ నిర్మితమైన ప్రమాదాలను ante ఎన్నో రసాయనిక, పారిశ్రామిక దుర్ఘటనలను ఎదుర్కొంది. ఇవాళ National Disaster Management Authority అనగా NDMA వారు దేశంలో ప్రధాన విపత్తు నిర్వహణ చేస్తున్నారు. భూకంపాలు, వరదలు, తుఫానులు మొదలైన వివిధరకాలైన ప్రమాదాలు వచ్చినప్పుడు ,rescue operation ఉన్నప్పుడు NDMA వారు వెంtaనే అక్కడికి చేరుకుంటారు. కొన్ని మార్గదర్శక సూత్రాలను కూడా వారు విడుదల చేసారు. అంతేకాక దానితో పాటుగా capacity building కోసం కూడా వారు శిక్షణా కార్యక్రమాలు చేపడుతూ ఉంటారు. వరదలు, తుఫానులు వచ్చే జిల్లాల్లో వాలంటీrla శిక్షణ కోసం “ఆపదా మిత్ర” పేరుతో ఒక కార్యక్రమాన్ని చేపట్టారు. శిక్షణ, అప్రమత్తత లది ఎంతో ముఖ్యమైన పాత్ర. రెండు మూడేళ్ల క్రితం ’లూ – అంటే వేడి గాడ్పుల వల్ల ప్రతి ఏtaa veలమంది మరణించేవారు.అందువల్ల వేడి గాడ్పులను నియంత్రించడానికి NDMA వారు వర్క్ షాప్ లను నిర్వహించారు. ప్రజల్లో అప్రమత్తత పెంచడానికి ప్రచారాన్ని నడిపారు. వాతావరణ శాఖ వారు ఖచ్చితమైన అంచనాలను వేసారు. అందరి సహకారంతో ఒక చక్కని పరిణామం ముందుకొచ్చింది. 2017లో వేడి గాడ్పుల వల్ల జరిగే మరణాల సంఖ్య ఊహించని విధంగా తగ్గి దగ్గర దగ్గర 220కి పరిమితమైంది. దీనివల్ల తెలిసినదేమిటంటే, మనం భద్రతకు ప్రాముఖ్యతను ఇస్తే, మనం సురక్షితంగా ఉంdaగలం. సమాజంలో ఈ విధంగా ఎక్కడ ఆపద ఉంటే అక్కడకు వచ్చి నిమిషాల్లో సహాయం కార్యక్రమాల్లో నిమగ్నమయిపోయే అసంఖ్యాక ప్రజలను, సామాజిక సంఘాలను, అప్రమత్త పౌరులను నేను అభినంdisస్తున్నాను. Fire and Rescue Services, National Disaster Response Forces, Paramilitary Forces, మన సైనిక బలగాలు కూడా ఆపద సమయంలో, ఎంతో ధైర్యసాహసాలతో చేరుకుని తమ ప్రాణాలను సైతం లెఖ్ఖ చేయకూండా ప్రజలకు సహాయం చేస్తారు. NCC, Scouts మొదలైనవి కూడా ఇలాంటి పనులు చేపడుతున్నాయి. శిక్షణను కూడా ఇస్తున్నారు. కొద్ది రోజుల క్రితం నుండి మరో ప్రయత్నం కూడా మొదలైంది. దేశాలలో జాయింట్ మిలిటరీ ఎక్స్సర్సైజ్ ఉన్నట్లే, ప్రపంచదేశాలన్నీ కలిసి Disaster Management కోసం కూడా joint exercise ఎందుకు చెయ్యకూడదు అని ఆలోచించాయి. భారతదేశం నేతృత్వంలో BIMSTEC పేరుతో, బాంగ్లాదేశ్, భారతదేశం, మయన్మార్, శ్రీలంక, థాయిలాండ్, భూటాన్, నేపాల్ మొదలైన దేశాలన్నీ కలిసి ఒక joint disasters management exercise చేసాయి. ఇది ఒక మొట్టమొదటి, గొప్ప మానవతా ప్రయోగం. మనం ఒక pramaada chaitanya samaajamగా తయారవ్వాలి. మన సంస్కృతిలో మన విలువలను పరిరక్షించుకోవడం, అంటే safety of values గురించి ఎప్పుడూ చెప్పుకుంటూ ఉంటాము. కానీ మనం values of safety అంటే భద్రత యొక్క విలువలను కూడా తెలుసుకుంటూ ఉండాలి. వాటిని మన జీవితంలో భాగం చేసుకోవాలి. సామాన్యంగా మనం ఎన్నోసార్లు విమానంలో ప్రయాణిస్తూ ఉంటాము. విమానప్రయాణ ప్రారంభంలో air hostess భద్రత గురించి సూచనలు ఇస్తూ ఉంటారు. ఈ సూచనలన్నీ కూడా మనందరమూ ఎన్నోసార్లు వినే ఉంటాము. కానీ ఎవరైనా మనల్ని విమానంలోకి తీసుకువెళ్ళి నిలబెట్టి, లైఫ్ జాకెట్ ఎక్కడ ఉంది, దానిని ఎలా ఉపయోగించాలి అని అడిగితే, మనలో ఎవ్వరమూ కూడా సరిగ్గా సమాధానం చెప్పలేమని నేను ఖచ్చితంగా చెప్పగలను. అంటే సమాచారం అందించే సదుపాయం ఉందా? అంటే ఉంది. వాటిని ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందా? అంటే ఉంది. కానీ మనం దృష్టి పెట్టము. ఎందుకు అంటే మనం స్వభావపరంగా అప్రమత్తంగా ఉండము. అందువల్ల విమానంలో కూర్చున్నాకా, మన చెవులకి జాగ్రత్తలు వినబడతాయి కానీ ’అవి మన కోసమే చెప్తున్నారు’ అని మనలో ఎవరమూ అనుకోము. జీవితంలోని ప్రతి రంగంలోనూ మనం అలాగే అనుకుంటాం. ఈ భద్రత మన కోసం కాదు అని మనం అనుకోకూడదు. మనందరమూ మన భద్రత కోసం అప్రమత్తంగా ఉంటే సమాజ భద్రత కూడా అందులో అంతర్గతంగా ఉంటుంది.

నా ప్రియమైన దేశప్రజలారా, ఈసారి బడ్జెట్ లో స్వఛ్ఛభారత్ ప్రచారంలో భాగంగా గ్రామాల కోసం బయోగ్యాస్ మాధ్యమం ద్వారా
waste to wealth, waste to energy – అంటే వ్యర్థాల నుండి సంపద, వ్యర్థాల నుండి శక్తినీ తయారుచేసుకోవడం అనే విషయంపై దృష్టి పెట్టి ఒక కార్యక్రమాన్ని ప్రారంభించాం. దీనికి గోబర్ -ధన్ అని పేరు పేటాము. ’GOBAR-Dhan’ అంటే – Galvanizing Organic Bio-Agro Resources. గ్రామాలను శుభ్రపరచడం, పశువుల పేడను, ఇంకా సేంద్రీయ వ్యర్థాలను COMPOST , BIO-GAS లుగా మార్చడమే కాక వాటి ద్వారా ధనాన్ని, శక్తినీ ఉత్పత్తి చెయ్యడమే ఈ గోబర్-ధన్ ఉద్దేశ్యం. భారతదేశంలో పశువుల సంఖ్య దాదాపు ముఫ్ఫై కోట్లు. వాటి పేడ ఉత్పత్తి ముఫ్ఫై లక్షల టన్నులు. కొన్ని యూరోపియన్ దేశాలూ, చైనా లోనూ పశువుల పేడనూ, మిగితా సేంద్రీయ వ్యర్థాలనూ శక్తిని ఉత్పత్తి చెయ్యడానికి వాడతాయి. కానీ భారతదేశంలో వీటిని పూర్తిస్థాయిలో ఉపయోగం లేదు. “స్వచ్ఛ భారత మిషన్ గ్రామీణ్” లో భాగంగా ఇప్పుడు ఈ దిశలో ముందుకు నడుస్తున్నారు. పశువుల పేడ, సేంద్రీయ వ్యర్థాలను , వంటిళ్ళలో నుండి లభ్యమయ్యే వ్యర్థాల నుండి బయో గ్యాస్ ఆధారిత శక్తిని ఉత్పత్తి చెయ్యడానికి ఒక లక్ష్యాన్ని నిర్దేశించబడింది. గోబర్ ధన్ యోజనా లో భాగంగా గ్రామీణ భారతదేశంలో రైతు సోదరసోదరీమణులను పేడ, వ్యర్థాలనూ కేవలం పనికిమాలినవిగా చూడకూండా, ధనాన్ని ఆర్జించే మాధ్యమాలుగా చూడాలవలసిందిగా ప్రోత్సహించడం జరుగుతుంది. గోబర్ ధన్ పథకం ద్వారా గ్రామీణరంగాలకు ఎన్నో లాభాలు కలుగుతాయి. గ్రామాలను శుభ్రంగా ఉంచడానికి సహాయపడుతుంది. పశువుల ఆరోగ్యం మెరుగుపడుతుంది. వాటి ఉత్పాదన పెరుగుతుంది. బయో గ్యాస్ వల్ల వంటకూ, లైటింగ్ కోసమూ అవసరమయ్యే శక్తి విషయంలో స్వయం సమృధ్ధి పెరుగుతుంది. రైతులకూ, పశువుల కాపరులకూ ఆదాయం పెరగడానికి ఈ పథకం సహాయపడుతుంది. వేస్ట్ కలక్షన్, రవాణా, బయోగ్యాస్ అమ్మకం, మొదలైనవాటి కోసం కొత్త ఉద్యోగావకాశాలు పెరుగుతాయి. గోబర్ ధన్ పథకం సవ్యంగా సాగడానికి ఒక ఆన్లైన ట్రేడింగ్ ప్లాట్ఫార్మ్ కూడా తయారుచెయ్యడదుతుంది. ఇది రైతులను, కొనుగోలుదారులతో జతపరుస్తుంది. దీనివల్ల రైతులకు పేడ, సేంద్రీయ వ్యర్థాలకు గానూ సరైన ధర లభిస్తుంది. నేను వ్యాపారస్తులనూ, ప్రత్యేకంగా గ్రామీణ ప్రాంతాల్లో నివసిస్తున్న సోదరీమణులను ముందుకు రావలసిందిగా అబ్యర్థిస్తున్నాను. స్వయం సహాయక బృందాన్ని , సహకార సమితులను ఏర్పాటు చేసుకుని ఈ అవకాశాన్ని సద్వినియోగపరుచుకోవలసినదిగా నేను కోరుతున్నాను. clean energy and green jobs అనే ఉద్యమంలో పాల్గొనవలసిందిగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. తద్వారా గ్రామాలలో వ్యర్థాన్ని ధనంగా మార్చడానికీ, గోబర్ – ధన్ తయారుచేసే దిశగా అడుగెయ్యాలి.

నా ప్రియమైన దేశప్రజలారా, ఇప్పటివరకు మనం music festival, food festival, film festival మొదలైన ఎన్నో రకాలైన ఫెస్టివల్స్ గురించి వింటూవచ్చాం. కానీ చత్తీస్ గడ్ లోని రాయ్ పూర్ లో ఒక ప్రత్యేకమైన ప్రయత్నం ద్వారా మొట్టమొదటి వ్యర్థాల మహోత్సవం ఏర్పాటైంది. రాయపూర్ నగర పాలక సంస్థ ద్వారా ప్రారంభించబడిన ఈ మహోత్సవం వెనుక ఉద్దేశ్యం ఏమిటంటే, పరిశుభ్రత పట్ల అవగాహన. నగరంలోని వ్యర్థాలను సృజనాత్మకంగా ఉపయోగించడానికీ, వ్యర్థాలను తిరిగి ఉపయోగించడానికీ విభిన్నమైన పధ్ధతుల గురించి అవగాహన కల్పించడం. ఈ మహోత్సవం లో భాగంగా జరిగిన రకరకాల కార్యక్రమాల్లో విద్యార్థుల నుండీ పెద్దల వరకు అందరూ పాల్గొన్నారు. వ్యర్థాలను ఉపయోగించి చేసిన రకరకాల కళాకృతులు తయారయ్యాయి. వేస్ట్ మేనేజ్మెంట్ తాలూకూ అన్ని దృష్టికోణాలపై ప్రజలను సుశిక్షితులను చెయ్యడానికి వర్క్ షాప్ లను కూడా ఏర్పాటుచేసారు. పరిశుభ్రత ప్రధానాంశం పై సంగీట కార్యక్రమం కూడా జరిగింది. ఆర్ట్ వర్క్ కూడా చేసారు. రాయ్ పూర్ నుండి ప్రేరణ పొంది కొన్ని మిగతా జిల్లాల్లో కూడా రకరకాల పధ్ధతుల్లో వ్యర్థ మహోత్సవాలు జరిగాయి. ప్రతి ఒక్కరూ తమ వంతుగా పరిశుభ్రత గురించిన సృజనాత్మక ఆలోచనలను పంచుకున్నారు. చర్చించుకున్నారు. కవితాగానాలు చేసారు. పరిశుభ్రత గురించిన ఒక ఉత్సవ వాతావరణం ఏర్పడింది. ముఖ్యంగా పాఠశాల విద్యార్థులు ఇందులో ఎంతో ఉత్సాహంగా పాల్గొన్నారు. వేస్ట్ మేనేజ్మెంట్ , పరిశుభ్రతల తాలూకూ ప్రాముఖ్యాన్ని విభిన్న రీతిలో ఈ మహోత్సవంలో ప్రదర్శించినందుకు గానూ రాయపూర్ నగరపాలక సంస్థనూ, మొత్తం చత్తిస్ గడ్ ప్రజలనూ, అక్కడి ప్రభుత్వాన్నీ, పాలనా యంత్రాంగానికి నేను అనేకానేక ఆభినందనలు తెలుపుతున్నాను.

ప్రతి ఏడూ మార్చి ఎనిమిదవ తేదీన అంతర్జాతీయ మహిళా దినోత్సవం జరుగుతుంది. మన దేశంలోనూ, ప్రపంచంలోనూ ఎన్నో కార్యక్రమాలు జరుగుతాయి. ఆ రోజున మన దేశంలో ’నారీశక్తి పురస్కారం ’ పేరుతో వివిధరంగాల్లో అనుసరించదగ్గ కార్యక్రమాలు చేపట్టిన మహిళలందరినీ సత్కరిస్తారు. ఇవాళ దేశం woman development – నుండి woman-lead development అంటే దిశగా ముందుకు సాగుతోంది. అంటే ఇవాళ మనం మహిళా అధివృధ్ధి నుండి ముందుకు నడిచి మహిళా -నేతృత్వ అభివృధ్ధి గురించి మాట్లాడుకుంటున్నాం. ఈ సందర్భంగా నాకు స్వామీ వివేకానంద గారి మాటలు గుర్తువస్తున్నాయి – ఆయన ఏమన్నారంటే “the idea of perfect womanhood is perfect independence’-

నూటపాతిక సంవత్సరాల క్రితం స్వామీ వివేకానంద గారి అభిప్రాయం భారతీయ సంస్కృతిలో నారీశక్తి తలంపుని వ్యక్తపరుస్తుంది. ఇవాళ సామాజిక, ఆర్థిక జీవితంలోని అన్ని రంగాల్లో మహిళలకు సమాన హక్కులను కల్పించడం మనందరి కర్తవ్యం. ఇది మనందరి బాధ్యత. పురుషుల గుర్తింపు స్త్రీల వల్ల ఏర్పడిన సంప్రదాయంలో మనం భాగస్తులం. యశోదానందనుడు, కౌసల్యా నందనుడు, గాంథారీ పుత్రులు, ఇదే ప్రతి కుమారుడికీ గుర్తింపుగా ఉండేది. ఇవాళ మన మహిళలు అత్మబలాన్నీ, ఆత్మ విశ్వాసాన్నీ తమ పనుల ద్వారా మనకు పరిచయం చేస్తున్నారు. స్వయం సమృధ్ధులుగా తయారయ్యారు. తమని తాము ముందుకు నడిపించుకుంటూ, దేశాన్నీ, సమాజాన్నీ కూడా ముందుకు నడిపించడానికీ, ఒక కొత్త మైలురాయిని చేరుకుని పనులు చేసారు. ఎక్కడ మహిళ శక్తివంతంగా ఉంటుందో, సబలగా ఉంటుందో, దేశ సమగ్ర అభివృధ్ధి లో సమాన భాగస్వామిగా ఉంటుందో అదే మన న్యూ ఇండియా స్వప్నం కూడా కదా.

కొద్ది రోజుల క్రితం ఒకాయన నాకొక గొప్ప సలహాను ఇచ్చాడు. మార్చి ఎనిమిదిన మహిళా దినోత్సవం సందర్భంగా ఎన్నో కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. అందులో భాగంగా ప్రతి గ్రామంలోనూ, నగరంలోనూ వంద సంవత్సరాలు జీవితాన్ని పూర్తి చేసుకున్న తల్లులకూ, సోదరీమణులకూ సన్మాన కార్యక్రమం ఏర్పాటవ్వగలదా? అని ప్రశ్నించారాయన. ఆ సన్మాన కార్యక్రమంలో వారి వారి సుదీర్ఘపు జీవితపు విషయాలను తెలుసుకునే అవకాశం కలగగలదా? అని ప్రశ్నించారు. నాకా ఆలోచన బాగా నచ్చింది. అది మీకు అందిస్తున్నాను. మహిళా శక్తి ఏమేమి పనులు చెయ్యగలదో తెలుసుకోవడానికి మీకెన్నో ఉదాహరణలు దొరుకుతాయి. మీ చుట్టుపక్కల చూస్తే గనుక మీ జీవితానికి ప్రేరణను అందించే ఏదో ఒక కథ మీకు కనబడుతుంది. ఇప్పుడే నాకు ఝార్ఖండ్ నుండి నాకొక సమాచారం అందింది. ప్రరిశుభ్రత ప్రచారంలో భాగంగా ఝార్ఖండ్ లో దాదాపు పదిహేను లక్షల మంది మహిళలు – ఇదేమీ చిన్న సంఖ్య కాదు- పదిహేను లక్షల మంది మహిళలు కలిసి ఒక నెలపాటు ప్రరిశుభ్రత ప్రచారం నడిపారు. 2018,జనవరి 26 నుండి ప్రారంభమైన ఈ ప్రచారంలో భాగంగా, కేవలం ఇరవై రోజుల్లోనే ఈ మహిళలు ఒక లక్ష డెభ్భై వేల మరుగుదొడ్లను నిర్మించి ఒక కొత్త ఉదాహరణను నిలిపారు. ఇందులో దాదాపు ఒక లక్ష సఖీ సమితులు కలిసాయి. పధ్నాలుగు లక్షలమంది మహిళలు, రెండువేలమంది పంచాయితీ ప్రతినిధులు, ఇరవై తొమ్మిదివేల నీటి సహాయకులు, పదివేల మహిళా స్వచ్ఛాగ్రహులు, ఏభై వేలమంది చేతివృత్తులతో జీవనం సాగించే మహిళలు పాల్గొన్నారు. ఇది ఎంత పెద్ద సంఘటనో మీరు ఊహించగలరు. సాధారణ జీవితంలో పరిశుభ్రతా ప్రచారాన్ని, పరిశుభ్రతా సంస్కారాన్ని సామాన్య ప్రజల స్వాభావిక ప్రవర్తనగా మార్చేందుకు స్త్రీశక్తి ప్రభావవంతంగా ప్రయత్నించగలదు అని ఝార్ఖండ్ మహిళలు నిరూపించారు.

సోదరసోదరీమణూలారా, ఎలిఫెంటా ద్వీపంలోని మూడు గ్రామాలకి స్వతంత్రం వచ్చిన డెభ్భై ఏళ్ల తరువాత విద్యుత్తు వచ్చిందని రెండు రోజుల క్రితమే నేను వార్తల్లో చూశాను. దీని వల్ల అక్కడి ప్రజల్లో ఎంతో ఆనందోత్సాహాలు కలిగాయి. మీ అందరికీ బాగా తెలుసు, ఎలిఫెంటా ద్వీపం ముంబయ్ నుండి సముద్రంలో పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇది ఒక పెద్ద పర్యటనా కేంద్రం. ఎలిఫెంటా గుహలు యునెస్కో వారి ప్రపంచవారసత్వ సంపద లో భాగం. అక్కడ ప్రతిరోజూ దేశవిదేశాల నుండి చాలాపెద్ద సంఖ్యలో పర్యాటకులు వస్తారు. ఒక ముఖ్యమైన యాత్రా స్థలం. ముంబయ్ కి చాలా దగ్గరగా ఉండీ, స్వతంత్రం వచ్చి ఇన్ని ఏళ్ళు అయినా ఆ ప్రాంతానికి విద్యుత్తు రాలేదని తెలిసి నాకు ఆశ్చర్యం వేసింది. డెభ్భై ఏళ్ల వరకు ఎలిఫెంటా ద్వీపంలోని మూడు గ్రామాలు – రాజ్ బందర్, మోర్ బందర్, సేంత్ బందర్ లలో ప్రజల జీవితాల్లో అలుముకున్న చీకటి ఇప్పటికి తొలగింది. వారి జీవితాలు కాంతివంతమయ్యాయి. నేను అక్కడి ప్రభుత్వానికీ, ప్రజలకూ అభినందనలు తెలుపుతున్నాను. ఎలిఫెంటా గుహలు, ఎలిఫెంటా గ్రామాలు విద్యుత్తుతో కాంతివంతమయ్యాయని నాకు సంతోషం వేసింది. ఇది కేవలం విద్యుత్తు కాదు. అభివృధ్ధి పథానికి ఒక కొత్త ఉదయం. దేశవాసుల జీవితాలు కాంతివంతమవ్వడం, వారి జీవితాలలో ఆనందాలు వెల్లివిరియడం కన్నా గొప్ప ఆనందకరమైన సమయం, సంతోషకర క్షణాలు ఇంకేమి ఉంటాయి? నా ప్రియమైన సోదర సోదరీమణులారా, ఇటీవలే మనం శివరాత్రి మహోత్సవాన్ని జరుపుకున్నాం. ఇప్పుడు మార్చ్ నెల కళకళలాడుతున్న పంటలతో , తలలాడిస్తున్న బంగారు రంగుల గోధుమకంకులు, మనసుని పులకరింపజేసే మామిడిపూత అందాలు, ఇవన్నీ కూడా ఈ నెలలోని విశేషాలు. ఈ నెల వచ్చే హోలీ పండుగ కూడా ఈ నెలలో మనందరికీ ఎంతో ప్రియమైనది. మార్చ్ రెండవ తేదీన దేశవ్యాప్తంగా హోలీ పండుగను ఆనందోత్సాహాలతో జరుపుకుంటాము. హోలీ పండుగలో రంగుల ప్రాముఖ్యత ఎంత ఉందో, అంతే ప్రాముఖ్యత హోళికా దహనానిది కూడా. చెడుని అగ్నిలో దహనం చేసి నాశనం చేసే రోజు ఇవాళ . మనసులోని భిన్నాభిప్రాయాలన్నీ మర్చిపోయి, అందరూ కలిసి కూర్చుని, ఒకరి ఆనందాన్ని మరొకరు పంచుకునే శుభసందర్భం హోలీ అంటే. ఈ పండుగ ప్రేమ, ఐకమత్యం, సోదర భావాల తాలూకూ సందేశాలను ఇస్తుంది. దేశవాసులందరికీ హోలీ పండుగ సందర్భంగా హోలీ రంగుల ఉత్సవపు శుభాకాంక్షలు. రంగులతో నిండిన శుభాకాంక్షలు. ఈ పండుగ మన దేశవాసులందరి జీవితాలలో రంగురంగుల ఆనందాలను నింపాలని కోరుకుంటున్నాను. నా ప్రియమైన దేశవాసులారా అనేకానేక ధన్యవాదాలు. నమస్కారం.